తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, December 31, 2008

కూర్మి గూర్చుగాత కొత్త ఏడు!


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఎప్పుడు తలచుకున్నా తలుచుకోకపోయినా కాలం గురించి కాల గమనం గురించి, ఇలా సంవత్సరాలు మారే సమయంలో తప్పక తలుచుకుంటాం. కొత్తపాళీగారి టపా చూడగానే నాకు దువ్వూరివారి పానశాలలోని ఈ పద్యాలు గుర్తుకొచ్చాయి:

కాల మహర్నిశం బనెడి కత్తెరతో భవ దాయురంబర
శ్రీల హరించు; మోముపయి జిల్కును దుమ్ముదుమార మేలొకో
జాలిపడంగ? నీ క్షణము సంతసమందుము; నీవు వోదు, నీ
రేలు బవళ్ళు మున్నటు చరించు నిరంతర మండలాకృతిన్

కాలం - రాత్రి పగలు రెండు భాగాలుగా కలిగిన కత్తెరలాంటిదిట. మన ఆయువనే బట్టనది కత్తిరిస్తూ పోతుంది! ఉమ్రఖయాముదో, దువ్వూరివారిదో కాని ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉంది!

గతము గతంబె యెన్నటికి కన్నుల గట్టదు; సంశయాంధ సం
వృతము భవిష్యదర్థము; వివేకవతీ! యొక వర్తమానమే
సతత మవశ్యభోగ్యమగు సంపద; రమ్య విషాదపాత్ర కీ
మతమున దావులేదు; క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్

ఇదీ ఉమ్రఖయాము మతం!

కానలేము కాలపు మర్మ మేను నీవు;
ఆ జిలుగు వ్రాత చదువ సాధ్యంబె మనకు!
తెరవెనుక నేను నీవను పొరపు గలదు
ఆ విభేదము తెరయెత్త నంతరించు!

సతము దత్త్వవిచారంబు సలిపిసలిపి
మూలసూత్రంబు నెవరైన ముట్టినారె?
నేడు నిన్నట్లు, రేపును నేటియట్లు
అందని ఫలంబు చేచాప నందుటెట్లు?


కాలాన్ని గురించి ఎంతమందో కవులు కవిత్వం రాసారు. ఎందరో తాత్వికులు చింతన చేసారు. అయినా అవన్నీ అసంపూర్ణాలే! ఎప్పటికప్పుడు కాలం తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. కాలమెప్పుడూ నిత్య నూతనమైనదే!

యాదృఛ్చికంగా, ఈ మధ్యనే ఓ టపాకి రాసిన వ్యాఖ్యలో యోగిగారు Eliot కవిత తాలూకు ప్రస్తావన తీసుకువచ్చారు. యాదృఛ్చికమని ఎందుకన్నానంటే, అది Eliot రాసిన నాలుగు సుదీర్ఘ కవితల్లో ఒకటి. ఆ నాలుగు కవితలూ కూడా కాల తత్త్వాన్ని గురించినవే!
కొత్తపాళీగారు అన్నట్టు మన ఋషులు కాలాన్ని వర్తులంగా ఊహించారు. ఒక పరిధిలో ఆలోచిస్తే అది వర్తులమే. పగలు తర్వాత రాత్రి తర్వాత పగలు! కాని నిన్న పగలూ, నేటి పగలూ, రేపటి పగలూ వేరువేరు! Eliot కూడా కాలాన్ని వర్తులంగానే ఊహించాడు. కాలాన్ని గురించి ఇతను రాసిన ఆ నాలుగు కవితలూ చాలా అద్భుతంగా అనిపిస్తాయి నాకు. చాలా చోట్ల అర్థమవ్వకపోయినా, ఆంతరంగికంగా ఉన్న ఒకానొక ప్రవాహ వేగంలో, కాలంలో లాగానే కొట్టుకుపోతాం. ఆసక్తి (దానితో పాటు కాసింత ఓపిక, కూసింత ధైర్యం :-) ఉంటే చదివే ప్రయత్నం చెయ్యొచ్చు!
ఇప్పుడు అసలు విషయానికి వస్తే, Eliot కవితలో తనకిష్టమైన పంక్తులని యోగిగారు నన్ననువదించమని కోరారు. వారికి నామీద అంత నమ్మకం ఎందుకేర్పడిందో మరి! సరే నా ప్రయత్నం నేను చేసాను (ఛందోబద్ధమైన పద్యమే), దాన్నొక టపాలో పెడదామనుకున్నాను. ఇంతలో మరో అవిడియా వచ్చింది! అంతర్జాలంలో ఇంకా చాలామంది పద్య ప్రియులున్నారు కదా వాళ్ళకీ పద్య రచనలో ఒక అభ్యాసంగా ఇదిస్తే ఎలా ఉంటుంది అని. కొత్త సంవత్సరం పూటా ఒక పద్యాన్ని రాయడంలో మరింత తృప్తి ఉంటుంది కదా! మరింక ఆలస్యం దేనికి? పద్య రచనాసక్తులైన వాళ్ళందరూ ప్రయత్నించి, అనువదించి మీ మీ బ్లాగుల్లో టపా వెయ్యండిక. బ్లాగులేని వాళ్ళు ఈ మిషతోనైనా బ్లాగులు తెరిస్తే మరీ మంచిది:-)


We shall not cease from exploration
And the end of all our exploring
Will be to arrive where we started
And know the place for the first time


పూర్తిగా చదవండి...

Monday, December 29, 2008

కొండ-గోదారి, నేను

నదికి కొండకి స్నేహ మేనాటిదో కదా!
ఉరకలెత్తు నది నిరంతరము చెప్పు ఊసులెన్నొ.
వాటికి తలయూచలేదు కొండ,
కాని ఆగదు నది.
గొప్ప చెలిమి!

కొండపైనున్న ఓ చెట్టుకొమ్మ మీంచి
ఎగురుకొని వచ్చి,
నదికి ఊసేదొ చెప్పి
ఎగిరిపోయింది ఒక పిట్ట.
ఏమి కబురు
చెప్పి పంపించెనో?
ఎంత చిత్ర మైత్రి!

ఆ నిరంతర స్నేహాని కడ్డు తగిలి
వాటి ఏకాంత స్వేఛ్చని భంగపరిచి
ఇంగితము లేక అట విహరించుచున్న
వెఱ్ఱి స్వార్థము రూపైన వింత పశువు
నేను!
పూర్తిగా చదవండి...

Monday, December 8, 2008

రెండు పద్యాలూ, బోలెడన్ని జ్ఞాపకాలూ


అష్టావక్రగారి బ్లాగులో ఈ పద్యాన్ని గురించిన ప్రస్తావన చూసేసరికి నేనెక్కడికో వెళ్ళిపోయాను. జ్ఞాపకాల గుడుసుళ్ళు గుండ్రాలు గుండ్రాలుగా తిరిగి నన్నో పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాయి! అప్పట్లో ఇంటర్నెట్టంటే ఒక అద్భుతం! ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో తెలియని వ్యక్తులతో సంభాషణలు. వయసు, చదువు, పరపతీ - ఇలాటి భేదాలేవీ లేని, తెలీని ఒక కొత్త లోకం! ఉద్యోగంలో చేరిన కొత్త. ఇంటర్నెట్టు మరీ కొత్త. అప్పటికింకా యాహూ, గూగులు గుంపులేవీ లేవు. Mailing Lists అని ఉండేవి. వాటి గురించి తెలిసి ఇంక మనసూరుకుంటుందా! మనకిష్టమైన వాటికోసం అన్వేషణ. ఎలా తగిలిందో ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు కాని, వెదకబోయిన తీగ "తెలుసా" ("తెలుగు సాహిత్యా"నికి సంక్షిప్త రూపం) రూపంలో నా కాలికి తగిలింది. అప్పటికే ఆ గుంపుకి మూడేళ్ళ వయసు. ఎందరో హేమాహేమీలు (అప్పటికి వాళ్ళు హేమాహేమీలని నాకు తెలీదు!) జరిపే ఆసక్తికరమైన చర్చలూ, అంతుతెగని వాదనలూ, కొత్త సాహిత్యాన్ని గురించిన పరిచయాలూ - ఒకటా రెండా, అబ్బో అదొక మహత్తర సాహిత్య శాల. అదే నాకు పెద్ద పాఠశాలయ్యింది. దింగంబర కవిత్వం రుచిచూసినా, స్త్రీవాద కవిత్వాన్ని గురించి తెలుసుకున్నా, భాషాశాస్త్రంలో ఓనమాలు దిద్దుకున్నా అవన్నీ ఆ పాఠశాలలోనే! అన్నిటికీ మించి, పద్యసుమాల పరిమళం ఆ ఆవరణ అంతటా పరచుకునేది. మన పద్యసాహిత్యంలోని అందాలగూర్చి వివరించడమూ చర్చించడమూ అయితేనేమి, చమత్కార సమస్యాలూ పూరణలూ అయితేనేమి, స్వీయ కవిత్వాలయితేనేమి, ఛందో బందోబస్తులగురించిన వాడి వేడి చర్చలయితేనేమి ఆ గుంపులో ఎప్పుడూ పద్యాస్వాదన జరుగుతూనే ఉండేది. అదిగో అలాటి సందర్భంలోనే ఒకరు పంపిన యీ పద్యం నా కంటబడింది:


కాలము మారె; మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తే; జం
బాలమునందు రక్తదళ పద్మిని మోసిడి పూలు పూచె; నం
ధాలయమందు స్వర్ణ కిరణాంకురముల్ జనియించి భావ భూ
తాలను బారదోలి చిర దాస్యతమస్సు నడంచె నాంధ్రుడా!


ఇది దువ్వూరి రామిరెడ్డి పద్యం. ఈ పద్యాన్ని చదవగానే, ఎందుకో ఠక్కున మరో పద్యం గుర్తుకువచ్చింది. అది దాశరథి మహాంధ్రోదయంలోని పద్యం:

వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం
డెలు జిలుజిల్లనన్ రుధిర నిర్ఝరిపారె, దిగంగనా ముఖ
మ్ముల నవకుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు, త
ల్పులు తెరువుండు రండు పిలువుండు శయించినవారినెల్లరన్!

వెంటనే టకటకా టైపుచేసి పంపించేసాను. అదే అంతర్జాలంలో నా మొట్టమొదటి టపా! దీనితోనే నా అంతర్జాల ప్రయాణానికి శ్రీకారం చుట్టాను. అప్పటి టపాలు ఇప్పటికీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి. తెలుగు సాహిత్యమంటే ఆసక్తి ఉన్నవాళ్ళు యీ archives మధ్యలో పడితే, రత్నాకరంలో పడ్డట్టే :-)
ఎందుకీ పద్యం గుర్తుకువచ్చింది అనే ప్రశ్నకి అప్పుడు నేనిచ్చిన వివరణ:

దువ్వూరి, దాశరథి వారి యీ రెండు పద్యాలలో నాకు చాలా సామ్యము కనిపిస్తోంది.
రెండు పద్యాలూ ఆంధ్రుల దాస్యవిముక్తి గూర్చినవి. రెంటిలోనూ దానిని ఒక నవోదయంతో పోల్చడమే కాక, ఆ ఉదయ వర్ణన కూడా చాలా దగ్గరగా ఉంది. ఇద్దరూ సూర్య కిరణాలనీ, తామర మొగ్గలనీ కొత్త ఆశలకు, ఆలోచనలకు ప్రతీకగా చేసుకున్నారు. "రుధిర నిర్ఝరిపారె" అని దాశరథి అంటే, "రక్త దళ పద్మిని మోసిడి పూలు పూచె" అని కవికోకిల అంటారు. ఇద్దరి లోనూ విప్లవ ఛాయ గోచరిస్తుంది.

ఇది యథాతథంగా అప్పటి వివరణే అయినా, అప్పుడది ఉన్నది ఇంగ్లీషు(లిపి)లో. అప్పటికింకా తెలుగు ఫాంట్ల వినియోగం ఎక్కువగా లేదు. Rice Universityలోని కొంతమంది తెలుగువాళ్ళు తయారుచేసిన transliteration scheme, RTS అన్న పేరుతో చాలామంది వాడేవారు. ఇప్పటికీ చాలామంది వాడుతున్నారు. నా మొట్టమొదటి ఆ టపా రాసినప్పటికి నాకు దీనిగురించి కూడా తెలీదు! అప్పటికి చూసిన టపాల ఆధారంగా నాకు తోచిన transliteration schemeలో రాసేవాడిని. ఆ తర్వాత RTSగురించి తెలిసింది. RTS రాయడం చదవడం అలవాటై, కొన్నాళ్ళకి అనర్గళంగా ఇంగ్లీషులిపిలో(RTSలో) తెలుగు టైపు చెయ్యడం చదవడం వచ్చేసింది :-) తెలుగు మిత్రుల దగ్గర ఈ విద్యని ప్రదర్శించి వాళ్ళని ఆశ్చర్యపరచడం సరదాగా ఉండేది. ఆ తర్వాత సిరిగిన దంపతల ధర్మమా అని Telugu Lipi Editor వచ్చింది. నేను ఇంగ్లీషులిపిలో ఏ తెలుగు కవితో రాస్తే, అది వేరే వాళ్ళకి చదవడానికి వీలుగా తెలుగు ఫాంటులోకి తర్జుమా చేసి HTMLగానో imageగానో భద్రపరచే వీలు కల్పించింది తెలుగు లిపి. ఆ తర్వాత చాలా పరికరాలు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రభారతివారి rts2pdf వాడేవాణ్ణి. ఇప్పటికీ pdfలో ఏదైనా భద్రపరచడానికి అది వాడుతూ ఉంటాను.

ఈ పదేళ్ళ ప్రయాణంలో, ఎన్నో పరిచయాలు. వాటిల్లో ప్రత్యక్ష పరిచయాలుగా మరినవి చాలా తక్కువే. ముఖాముఖీ కలుసుకోకుండా సంభాషించుకోవడం అదో ప్రత్యేకత! తెలుసా తర్వాత రచ్చబండ, ఛందస్సు గుంపులూ, ఈమాట పత్రికా, తెలుగు పీపుల్ డాట్ కాం, ఈ మధ్యనే పొద్దు, ఇతర అంతర్జాల పత్రికలూ - ఇలా సాగిన ప్రయాణం ప్రస్తుతానికి ఇదిగో యీ బ్లాగులవరకూ వచ్చింది. ఇంకా ముందుముందు ఎలాటి మలుపులు తిరగనుందో!
ఏదేమైనా, ఈ ప్రయాణంలో నేనెన్నో నేర్చుకోగలిగాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. సాహిత్యంతో ఇప్పుడు నాకున్న అతి కొద్ది పరిచయం ఏర్పడడంలో అంతర్జాలం ముఖ్య పాత్ర నిర్వహించిందనడంలో ఏ మాత్రం సందేహమూ లేదు. దానికిగానూ అంతర్జాలానికీ, అందులో పాల్గొన్న (పాల్గొంటున్న) వ్యక్తులందరికీ యీ టపా ద్వారా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

చూసేరా, నా జ్ఞాపకాలలో కొట్టుకుపోయి పద్యం గురించి మరిచే పోయాను! ఇది నాకు చాలా ఇష్టమైన పద్యం. ఉదయాన్ని మన కవులెంతమంది వర్ణించ లేదు! ఒక అభ్యుదయ కవి, విప్లవ స్ఫూర్తితో దర్శించిన ఉదయమిది. వెలుతురనే బాకుతో చిక్కని చీకటి రాత్రి గుండెలని చీల్చితే, అందులోంచి పారిన రక్తపుటేరు లాగా ఉందిట ఉదయాకాశం. ఆకాశంలో దిక్కులనే కాంతల ముఖాలమీద కుంకుమ కాంతులు విరిసాయట. కింద నేలపై అదే సమయానికి తామర మొగ్గలుకూడా విచ్చుకుంటాయి కదా. పైన ఆ కుంకుమ ప్రభలు కూడా, కిందనున్న తామర మొగ్గల్లానే ఉన్నాయిట! ఇంకేముంది తెల్లవారింది, తలుపులు తెరవండి, రండి, ఇంకా పడుకొని ఉన్నవాళ్ళందరినీ నిద్రలేపండి అని కవి పిలుపు. ఇక్కడ ఉదయమంటే అభ్యుదయం, స్వేఛ్చ. చిక్కని కాళరాత్రి - అజ్ఞానంతో నిండిన దాస్యం. దిగంగనల ముఖాలపై కుంకుమ కాంతులు, లోకానికి శుభం జరుగుతోందని సూచన. కవి ఇచ్చిన పిలుపు స్వేఛ్చా వాయువులని పీల్చి, అభ్యుదయం వైపుకి అడుగులు వెయ్యమని. ప్రకృతి వర్ణనలో, చెప్పదలచుకున్న విషయాన్ని ధ్వనింపచెయ్యడం మంచి కవిత్వం.
కవి తన కవితలో చిత్రించిన ఆ ఉదయం ఊహగానే మిగిలిపోయిందా? నిజంగానే నిజమయ్యిందా? నిజమౌతుందా? ఇవి మనందరం ఆలోచించుకోవాలసిన ప్రశ్నలు...


పూర్తిగా చదవండి...

Monday, November 17, 2008

చదువది యెంతగల్గిన...


నా మిత్రుడొకడు ఈనాడులోని ఈ సంపాదకీయాన్ని నా దృష్టికి తెచ్చాడు. కొత్తవి కాకపోయినా, మరోసారి గుర్తుచేసుకోవాల్సిన విషయాలున్నాయందులో. ముఖ్యంగా ఎప్పుడో చదువుకున్న పద్యాన్ని మళ్ళీ గుర్తుచేసి నా మనసుని ఆ పద్యమ్మీదకి పరుగులు తీయించింది. నన్ను నేను మరోసారి సమీక్షించుకొనేలా చేసింది. ఎప్పుడో పదహారవ శతాబ్దంలో రాయబడ్డ పద్యం, నేనెప్పుడో చిన్ననాడు చదువుకున్న పద్యం ఇన్నాళ్ళకి మళ్ళీ నన్ను ఆలోచింపజేసిందంటే అది సామాన్యమా!

చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!


ఇది చాలామందికి తెలిసిన పద్యమే. అందరికీ అర్థమయ్యే పద్యమే. ఇందులో విశేషమంతా, "ఇంచుక" అన్న పదంలోనూ, ఈ రసజ్ఞతని ఉప్పుతో పోల్చడంలోనూ ఉంది. అంటే రసజ్ఞత కూడా తగిన పాళ్ళల్లోనే ఉండాలి. ఇది ఉండడం ఎంత అవసరమో, ఎక్కువ కాకపోవడమూ అంతే అవసరమన్న మాట. అదేవిటి, రసజ్ఞత మంచి గుణమే కదా, అది ఎక్కువైతే ఏవిటి సమస్య అన్న అనుమానం రావచ్చు. ఉప్పెక్కువైతే ఏవిటవుతుందో, రసజ్ఞత ఎక్కువైనా అదే అవుతుంది. ఉప్పెక్కువైతే అది మిగతా రుచులని ఆక్రమించేసి అదొకటే రుచి తెలుస్తుంది కదా. అలానే రసజ్ఞత ఎక్కువైతే, మనం చదివే దాంట్లో లేదా చెప్పాల్సిన దాంట్లో ఉన్న అసలు విషయాన్ని మన సొంత పైత్యం ఆక్రమించేస్తుంది. ఎలా అయితే తగినంత ఉప్పు, మిగతా రుచులకి ప్రోద్బలం కలిగిస్తుందో, అలానే రసజ్ఞత కూడా రచనలోని విశేషాలని గ్రహించేందుకు ప్రేరకం మాత్రమే కావాలి.

శతకాల్లో భాస్కర శతకానికి తనదైన ఒక ప్రత్యేకత ఉంది. ఇది భక్తి శతకం కాదు, నీతి శతకం. మనకి బాగా తెలిసిన నీతి శతకాలు వేమన, సుమతి శతకాలు. సంస్కృతం నుంచి అనువదించబడిన భర్తృహరి నీతి శతకాన్ని పక్కనపెడితే, తెలుగులో వృత్తాలలో నడిచే నీతి శతకం భాస్కర శతకం. ఇలాటి వృత్తాలకి చిక్కని చక్కని ధార అవసరం. అది పుష్కలంగా ఉన్న పద్యాలున్న శతకం భాస్కర శతకం. అలాటి నడకకి తోడు చక్కని దృష్టాంతాలు ఈ శతకంలోని పద్యాలని పాఠకుల మనసులో ముద్రపడేట్టు చేస్తాయి. ఈ శతకం రాసిన కవి పేరు మారవి వెంకయ్య.

ఇంతకీ ఈ పద్యం నన్నెందుకింతలా ఆలోచింపజేసిందిప్పుడూ అంటే, అందులో చెప్పిన రసజ్ఞత నాలో లోపించడం లేదు కదా అన్న అనుమానమే! చాలా కాలం క్రితం నా పద్యాలనీ, వ్యాసాలనీ చదివిన మా ముత్తాతగారు నాకో హెచ్చరిక చేసారు. నీలోని విమర్శకుడు నీలో ఉన్న కవిని మింగెయ్యకుండా జాగ్రత్త పడరా నాయనా అని! అతనన్నట్టుగానే విమర్శకుడు కవిని ఇంచుమించుగా మింగేసాడనే చెప్పాలి. అంతవరకూ సరే, ఏదో నా స్వభావమే అంత అని సరిపెట్టుకోవచ్చు. విమర్శకుడికైనా రసజ్ఞత అవసరమే. కవితలోనో కథలోనో ఉండే రసాన్ని (మన ప్రస్తుత భాషలో అనుభూతి అనుకుందాం) గ్రహించ గలిగే శక్తే రసజ్ఞత. విమర్శకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అదే కదా! కవి రాసిన దాంట్లో తప్పులు పట్టుకోవడమే ప్రథానమై పోతే రసజ్ఞత గంగలో కలిసినట్టే. వాదోపవాదాల మీదున్న ఆసక్తి మంచి రచనని ఆస్వాదించడంలో చూపించకపోతే వాడు రసికుడు కాదు రక్కసుడిగా తయారవుతాడు. ఈ రసజ్ఞత చాలకపోబట్టే కదా ఇంతకుముందు చెప్పుకున్న నత్కీరుడు అవస్థల పాలయ్యింది.

ఈ పద్యం మన సాహిత్యకారులూ, విద్యావంతులూ ఈ రసజ్ఞతకి ఎంత విలువనిచ్చారో స్పష్టం చేస్తోంది. తర్క మీమాంస వ్యాకరణాది శాస్త్రాలెన్ని చదువుకున్నా, కాస్తంత రసజ్ఞత లేనివాడు ఎక్కడా రాణించలేడని చెపుతోంది. ఎలాటి శాస్త్ర గ్రంథం రాసినా, సంభాషణ చేసినా అందులో కాస్తంత హృదయానికి హత్తుకొనే చతురత, చమత్కారం లోపిస్తే అవి ఎదుటివాళ్ళని ఆకట్టుకోవన్న మాట. అన్న మాట కాదది ఉన్న మాటే! తాంబూలాన్ని అడిగిన భవభూతీ కాళిదాసుల కథలో, ఆ వారకాంత భవభూతిలో చూసింది శుష్క పాండిత్యమైతే, కాళిదాసులో చూసింది రసజ్ఞత కదా!
కాస్త ఘాటైన వివాదాలు జరిగినా, పూర్వకాలంలో కవి పండితుల మధ్య చర్చలుగానీ వాదనలుగానీ చమత్కారంగా, సరసంగా సాగేవని మనకున్న చాటు పద్యాలూ కథలూ సాక్ష్యం చెబుతాయి. తెనాలి రామకృష్ణుడిలాంటి కుఱ్ఱకవి "ఎమి తిని సెపితివి కపితము" అని తనని ఎద్దేవా చేస్తే సహృదయంతో తన తప్పుని అంగీకరించిన పెద్దనని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అదే రామకృష్ణుడు తన పద్యాన్ని దిద్దిన రాయలవారికి సంతోషంతో ఇచ్చిన చిరుకానుక మహదానందంగా స్వీకరించిన రాయలని ఒకసారి తలుచుకోండి.
ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్ళలో జరిగిన సాహిత్య వివాదాలలో మిరియాల ఘాటు ఎంత కనిపించినా, అంతర్లీనంగా దాగిన రసజ్ఞత బెల్లప్పాకంలా అక్కడక్కడ దర్శనమిస్తుంది. తిట్లుకూడా చాలవరకూ సరసంగా, చమత్కారంగా కనిపిస్తాయి.
భావకవిత్వంపై తిరుగుబాటుగా వచ్చిన అభ్యుదయకవిత్వాన్ని కృష్ణశాస్త్రి మనస్పూర్తిగా ఆహ్వానించినా, కృష్ణశాస్త్రి కవిత్వంలోని గాఢతని అభ్యుదయకవులు ఒప్పుకున్నా, ఉత్తర దక్షిణ ధృవాలవంటి విశ్వనాథ, శ్రీశ్రీలు పరస్పర కవిత్వ పటుత్వాన్ని గుర్తించినా, మొదట్లో ఎందరో తక్కువగా చూసిన జాషువాకి స్వయంగా వేంకటశాస్త్రిగారు కంకణం తొడిగినా - ఇదంతా ఆ కాలంలో యింకా యింకిపోని రసజ్ఞత వల్లనే.

కారణాలేవిటో తెలీదు కానీ, ఈ మధ్య వస్తున్న విమర్శలూ, చర్చలూ, వాదోపవాదాలలో ఇలాటి సరస సంభాషణలుగాని, రసజ్ఞత కానీ చాలా అరుదైపోయాయి. ఏవంటే ఏవర్థం తీసుకుంటారో అనే బెంగతో ఇలాటివి తక్కువయ్యాయో. తార్కిక సిద్ధాంతాల ఎండవేడికి సరస సరోవరాలు ఆవిరైపోయాయో మరి తెలీదు. సర్వత్రా పెచ్చుపెరిగిపోతున్న అసహన భావం కూడా దీనికి కారణం కావచ్చు.
సృజనాత్మక సాహిత్యం గణితమూ కాదూ, సాంఘిక శాస్త్రమూ కాదనే స్పృహ కలగాలి. సిద్ధాంతాల చట్రాలనుంచి బయటపడాలి. ఆలోచనతో పాటు అనుభూతికీ, మెదడుతో పాటు హృదయానికి సముచిత స్థానాన్ని ఇచ్చినప్పుడే జీవితంలో రుచిపుడుతుంది. లేదంటే చప్పిడి బతుకే మిగులుతుంది!


పూర్తిగా చదవండి...

Sunday, November 9, 2008

జననీ గర్భములోన...


కర్తవ్య నిర్వహణలో ఆ రాముడికే కాదు, నాక్కూడా అప్పుడప్పుడూ అరణ్యవాసం చెయ్యాల్సివస్తుందని ఈ మధ్యనే తెలిసొచ్చింది! కంగారుపడకండి, నేను చేసింది బ్లాగ్రాజ్యానికి (ఆమాటకొస్తే అంతర్జాల సామ్రాజ్యానికి) దూరంగా జనారణ్యవాసం.
ఇన్నాళ్ళ తర్వాత వచ్చి చూస్తే నాకు నా బ్లాగూ, నా బ్లాగుకి నేనూ కాస్త కొత్తగా కనిపించాం! ఇంతలోనే అంత మరుపా అనిపించింది. దీనికంతగా సంబంధం లేకపోయినా, ఎందుకో చట్టుక్కున ఓ పద్యం గుర్తుకొచ్చింది.

ఒక తండ్రి, తన బిడ్డకి ఊహ తెలియని రోజుల్లో, పనిమీద పరదేశానికి వెళ్ళి, కొన్నాళ్ళ తర్వాత ఆ బిడ్డకి ఊహ తెలిసే వయసుకి తిరిగి వచ్చాడనుకోండి. "అతనే నాన్న" అని తల్లి చెప్పి, ఆ తండ్రి ఆప్యాయంగా ఆ బిడ్డని చేరబోతే, ఆ బిడ్డ మనస్థితి ఎలా ఉంటుంది? ఇలాటి అనుభవం ఈ కాలంలో మరీ అరుదేమీ కాదు. ఉద్యోగ రీత్యా భార్యా పిల్లలని వదలి పరదేశాలకి వెళ్ళే వాళ్ళు చాలామందే కనిపిస్తారు కదా.
అలాటి పరిస్థితిని పద్యంలో వర్ణించడమే కాదు, మరో మహత్తరమైన విషయాన్ని చెప్పడానికి, దీన్నొక పోలికగా ఉపయోగించిన ఒక మంచి పద్యం ఇది.

జననీ గర్భములోన నుండగ విదేశంబేగి, బెక్కేండ్లకున్
జనుదే దండ్రిని గాంచు బిడ్డవలె నీ సంబంధమున్ ముందు నే
గన కీ వేళ నెఱింగి స్నేహభయశంకాముత్త్రపాశ్చర్య భా
జనమై నిల్చితి జేరదీసికొనవే సద్భక్తచింతామణీ!

ఈ పద్యాన్ని రాసిన కవి శ్రీ వడ్డాది సుబ్బారాయుడు. ఇతను 1854-1938 మధ్య కాలంలో జీవించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయిన ఇతను తన ఇంట్లోనే, బంధువుల సాయంతో సొంతంగా చదువుకొని సంస్కృతాంధ్రాలలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. వేణీసంహారం, విక్రమోర్వశీయం వంటి సంస్కృత నాటకాలని తెలిగించారు. నందనందన, భక్తచింతామణీ వంటి శతకాలని రాసారు. తన భార్యా పిల్లలనందరినీ కోల్పోయి ఒంటరైపోయిన ఇతను వాళ్ళగురించిన స్మృతికావ్యాలలో తన బాధని పొందుపరచారు. ఇతని ఇతర రచనలు నేను చదవలేదు కాని, భక్తచింతామణీ శతకంలో (నిజానికి ఇందులో రెండువందలకి పైగానే పద్యాలున్నాయి, ఈ మకుటంతో) చాలా ఆర్ద్రమైన పద్యాలెన్నో ఉన్నాయి. అలాటివాటిలో ఇదొకటి!

తానిన్నాళ్ళూ భగవంతుణ్ణి తెలుసుకోలేదు. ఇప్పుడొక్కసారిగా అతని గురించి తెలుసుకొనే సరికి అతను పొందిన అనుభూతిని ఎంత గొప్ప పోలికతో రూపుకట్టించారో చూడండి! అందులో స్నేహం(ఆప్యాయత)ఉంది, భయముంది, అనుమానముంది, సిగ్గుంది, ఆశ్చర్యముంది! అలాటి అనేక భావ పరంపరలతో ఒక వింత అనుభూతికి లోనై, అలా చూస్తూనే నిలుచుండి పోయాడట. అలాంటి సందర్భంలో బిడ్డ తండ్రి వద్దకు చొరవగా రాలేడు. తండ్రే అతన్ని చేరదీసుకొని బుజ్జగించాలి. అదే వేడుకుంటున్నాడు కవి.

భగవంతుణ్ణి నిత్యం ఆరాధించే భక్తులెవరైనా, ఆ భగంతుడు తమకి నిజంగా ప్రత్యక్షమైతే ఇలాటి అనుభూతికే లోనవుతారనడంలో సందేహమేమీ లేదు!


పూర్తిగా చదవండి...

Monday, September 29, 2008

మరల నిదేల "అగ్నిప్రవేశం"బన్న... :-)


సీత అగ్నిప్రవేశం ప్రస్తుతం బ్లోగ్లోకంలో కొన్ని బుఱ్ఱలని చాలా వేడెక్కించింది. అజ్ఞాతంలోకి వెళ్ళిన బ్లాగ్రాజులని బ్లాగ్జీవన స్రవంతిలోకి తిరిగి తీసుకు వచ్చింది కూడా :-) సరే ఈ అగ్నిలో నావంతు ఆజ్యం నేనూ పోయవద్దా!
నాకు రామాయణమంటే ముందు గుర్తుకొచ్చేది రామాయణ కల్పవృక్షం. అది నా వీక్నెస్సు! మరి అందులో అగ్నిప్రవేశాన్ని విశ్వనాథ తీర్చిన విధానం చూద్దామా మరి. ఇందులో విశ్వనాథ ఎలా చక్కని కావ్య శిల్పాన్ని ప్రయోగించాడని చూపించడమే నా ముఖ్యోద్దేశం. అంతే తప్ప దీనిగురించి సామాజిక, తాత్విక విశ్లేషణ/విమర్శ/చర్చ చెయ్యడం నా ఉద్దేశం కాదు. కాబట్టి దీని గురించి బుఱ్ఱలుపయోగించకుండా, ఉన్నది ఉన్నట్టు ఆస్వాదించడానికి ప్రయత్నించమని మనవి :-) ఇందులో చాలా లోతులున్నాయి కాని, నేను కేవలం పైపైనే చూపించ బోతున్నానని కూడా గ్రహించగలరు.

కల్పవృక్షంలో అగ్నిప్రవేశానికి ప్రవేశిక సుందరకాండలో జరుగిందని చెప్పవచ్చు! హనుమంతుని తోకకి నిప్పంటించినప్పుడు, అది కాలకుండా, అగ్నికున్న ఉష్ణాన్ని సీత తనలో దాచుకుంటుందిట! ఇది సీతని అగ్ని ఏవీ చెయ్యలేదన్న నిబ్బరం పాఠకునిలో కలిగించడానికేమో అనిపిస్తుంది.
అంతకన్నా మరో చిత్రమైన కల్పన చేసారు విశ్వనాథ. ఇంద్రజిత్తు వేసిన ఒక అస్త్రానికి రామలక్ష్మణులు మూర్ఛపోతారు. అప్పుడు రావణుడు వాళ్ళు చనిపోయారనే భావించి సీతదగ్గరకి వచ్చి, వాళ్ళు చనిపోయారన్న వార్త చెప్తాడు. సీత నమ్మదు. త్రిజట స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి చూసివచ్చి చెప్తుంది, వాళ్ళు పడిపోయే ఉన్నారు కాని వాళ్ళ ముఖాలు కాంతివంతంగానే ఉన్నాయని. అప్పుడు సీత ఒక విచిత్రమైన మొక్కు మొక్కుకుంటుంది. ఈ ఆపదనుంచి రామలక్ష్మణులు బయట పడిన తర్వాత, ఏ అగ్నిసాక్షిగా అయితే తను రాముని పెళ్ళాడిందో, ఆ అగ్నిలో తాను దూకుతానని ఆ మొక్కు. రావణుడాంటాడు, రామునిలాంటి భర్తని నమ్ముకుంటే నీకు అగ్నిప్రవేశమే గతి అని! రాముడెలాగూ యుధ్ధంలో చనిపోతాడు, అతనితో సీత సహగమనం చెయ్యడానికి నిప్పులో దూకాల్సి వస్తుంది అని అక్కడ రావణుని ఉద్దేశం. మరి తర్వాత సీత చేసిన అగ్నిప్రవేశం తన మొక్కు తీర్చుకోడానికా? తన భర్త ఉన్నా తనకి లేనట్టే అన్న పరిస్థిని సూచించడానికా? ఇన్ని ఆలోచనలని రేపే కల్పన ఇది!

ఇక అసలు ఘట్టానికి వద్దాం. సీత రాముడున్న ప్రదేశానికి ఇలా వచ్చింది:
"మత్త గజ మంథరగమనంబున భీతవోలె, విరాగిణివలె, దిరస్కారభావయుతవలె, భర్త్రనురక్తవలె నడచుచు బ్రవేశించి శ్రీరామచంద్రుని కెదురుగా నిలుచుండిన."
అలా నిలుచున్న సీతని చూస్తే రామునికెలా అనిపించింది?

ఏడాది యన్నమ్ము నెఱుగదు లలితాంగి
నిద్దుర యెఱుగదు నీరజాక్షి
ముడుచుకు కూర్చున్న యొడలుగా నంసభా
గమున వంగినయట్లు కానిపించు
మొగి నిరంతం బెడతెగని యేదో భయం
బక్షుల వెనుభాగ మానరింప
నఖిలలోకాతీత మైన సర్వాంగ వి
న్యాస సౌభాగ్య సౌందర్య మొప్ప

తన్ను హరిణంబు గొని తెమ్మటన్న కాంత
సగము సగమైన మై రామచంద్రునకును
తన సమస్త కామమున కాస్థాన భూమి
కనుల యెదుటను వచ్చి సాక్షాత్కరించె.

అప్పుడు రాముని మనసులో ఏమనుకుంటున్నాడు?

ఈ యమ హేతువై వనుల నెల్ల జరించెను దా బికారిగా
నీ యమ హేతువై జలధి కెంతొ శ్రమంపడి కట్టగట్టె దా
నీ యమ హేతువై గెలుచు టెంత శ్రమంబయిపోయె లంకలో
నా యమ జూచినంత హృదయంబున బట్టగరాని కోపమై

అతడు రాక్షసుం డటంచు సౌమిత్రి వ
చించె సుంత వినదు చెలువ తాను
ననుభవించె దాను ననుభవించితి మేము
నాడదింత సేయుననుచు గలదె?

ఇదంతా వాల్మీకంలోని "హృదయాంతర్గత క్రోధమే". ఆ తర్వాత విశ్వనాథలోని కవి ప్రవేశిస్తాడు. అక్కడున్న వచనం ఇది:

"ఇట్లూహించుచు" రాముండు మనసులో "నూరక" కోపంబు పెంచుకొంచుండగా"

కవి భాషాశక్తిని ఎలా ఉపయోగించుకున్నాడో చూసారా! ఊహించుకోవడం రెండర్థాలనిస్తుంది, అలానే "ఊరక" అన్న పదం కూడా.
ఆ సీత చూసేవాళ్ళకి ఎలా ఉందిట?
"తెలియన్ రాకయ చూచు నేత్రములకున్ స్త్రీమూర్తి తానింతలో
పల నాగ్నేయ శిఖాకృతిం బొలుచు"
అగ్నిశిఖలా ఉందిట ఆవిడ!

అంతలో ఏమయింది?
"అంత బడబాగ్ని చేత సళపెళ క్రాగి కళపెళలాడు సముద్రోపరి సముద్భూత బుద్బుదధ్వనులవోని కంఠరావ మొప్ప శ్రీరామచంద్రుడిట్లనియె"
లోపల బడబాగ్ని చేత, పైన కళపెళలాడే అలలపై బుడగల చప్పుడులా ఉందిట రాముని కంఠం. ఏవిటా బడబాగ్ని అన్నది పాఠకులే ఊహించుకోవాలి.
రాముడు వాల్మీకంలోలాగానే మాట్లాడతాడు. దాంతోపాటు ఇంకా దారుణంగా అనిపించే మరోమాట కూడా అంటాడు:

మఱియున్ నీకొక మాట చెప్పవలయున్ మారీచునిం జంపితిన్
హరిణం బయ్యది కాదు లక్ష్మణుడు యాథార్థ్యంబు వాచించె ని
ష్ఠురు లాయిద్దఱు గూడబల్కికొని దక్షుల్వచ్చి రచ్చోటి క
బ్బుర మా బంగరులేడి గోరెదని నీవున్ వార లెట్లెంచిరో?

"అప్పుడు నువ్వుకోరిన బంగారు లేడి లక్ష్మణుడు అనుమానించినట్టే రాక్షసుడు, మారీచుడు. ఆ రావణాసురుడూ మారీచుడూ ఇద్దరూ కలిపి కూడబలుక్కొని ఈ పన్నాగం పన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏవిటంటే, నువ్వు అలా బంగారులేడిని కోరుకుంటావని వాళ్ళెలా ఊహించారో కదా!" అని దీనర్థం. ఎంత మహా ఘోరమైన నింద ధ్వనిస్తోంది ఇందులో!

అప్పుడు సీత ఏం చేసింది?
"అంత బెద్దసేపు జానకీదేవి రామచంద్రుని వంక జూచుచు నట్లే నిలుచుండి చివరకు లక్ష్మణుని గాంచి యిట్లనియె"

"నాకుం బిడ్డలు లేరు, బిడ్డవలె నున్నా వీవు నిన్నాళ్ళు, నా
కై కొంచెమ్మయినట్టి సాయమును జేయంజూడవే నీవు ల
చ్చీ! కాష్ఠంబులు తెచ్చి నాకయి చితిం జేర్పించు, నేనీ దరి
ద్రాకారంబున జచ్చియుం బ్రదికి యౌరా! యొక్కరీతిం దగున్"

లక్ష్మణుని కావాలంటే పెళ్ళిచేసుకో అన్న రాముడికి ఈ మాటలు కొరడాతో కొట్టినట్టు అనిపించక మానతాయా!
సీత అగ్నిప్రవేశానికి ముందు రాముణ్ణి పూర్తిగా కుంకుడుకాయ రసంపోసి మరీ తలంటేస్తుంది! ఆవిడ పెట్టే చీవాట్లు వింటే, సీతేదో అమాయకురాలు, నోరులేనిదీ, భర్త దగ్గర నోరెత్తనిదీ, దీనురాలు అనుకొనే వాళ్ళ ఆలోచనల్లో తుప్పొదిలిపోతుంది.

నే నొక్కించుకసేపు లోనన మహాగ్నిం జొచ్చుచున్నాను స్వా
మీ! నీ యాజ్ఞన్ వచియింతు గొంచెము సమున్మీలద్యశోధామ! దై
వానన్ వచ్చిన దోసమంతయును నా వంకన్ నిరూపింతు, నీ
వైనన్ దైవమ వండ్రు, నీకు కృపలే దందున్ మఱట్లైనచో

దైవం వల్ల వచ్చిన దోషాన్ని నాపై పెట్టడానికి ప్రయత్నించావు. నిన్నందరూ దేవుడిలా చూస్తారు కాని, నీకు ఏమాత్రం దయా గుణం లేదు.

మచ్చిక జెట్ట యర్థముల మాటలనంటివి నన్ను నీవనన్
వచ్చును నేనునైన బడవచ్చును, బంగరులేడి జూడగా
విచ్చిన కంటితో నెడద విచ్చెను విచ్చిన గుండెలోపలన్
జొచ్చిన వయ్య రామ! రిపుసూదన! సర్వ ఋషీంద్ర వాంఛలున్!

ఏ ఋషి భావనా మహిమ ఏర్పడ నాయెదలోన జొచ్చి నన్
గోరగ జేసె లేడి, నది కోమలనీలపయోదదేహ! నా
కోరిక యిట్టులుండు ననుకొంటకు దానవులోన స్ఫూర్తిగా
నేరను వచ్చు, నీ విదియు నేరవె? సర్వఋషీంద్ర హృత్స్థితా!

ఒకపని మంచిచెడ్డలు సముద్భవమౌ ఫలదృష్టి నిర్ణయం
బు కలుగనటం జూతురు తమోహరణా! దయజూచితేని కో
రికయును నాది నీకు సురరీకృత కీర్తిరమా ఫలప్రదం
బకలుష గుప్తశౌర్య బహిరాగతి దివ్యఫలంబు రాఘవా!

నువ్వు ఊరికే అనవసరమైన చెడ్డమాటలన్నీ అన్నావు. అయినా నువ్వు నన్ననవచ్చు నేను పడవచ్చునూ. కాని అసలు విషయం చెప్తాను. బంగారులేడిని జూడగానే నా కళ్ళు చెదిరాయి నిజమే. కాని దాంతోపాటు నా గుండెకూడా చెదిరిపోయింది. చెదిరిన ఆ మనసులో సమస్త ఋషుల కోరికలు కూడా దూరాయి. నన్ను బంగారులేడిని కోరినట్లుగా చేసినది ఆ ఋషిభావనా మహిమ (దానవ సంహారమే ఆ ఋషుల కోరిక కదా). దానికి నువ్వు రాక్షస భావం అంటగడుతున్నావు. నీకామాత్రం నిజానిజాలు తెలియవా? సరే, ఒక పనివల్ల కలిగే మంచిచెడ్డలని చూసి ఆ పని సరైనదా కాదా అని నిర్ణయిస్తారు కదా. అలా చూసినా నేను కోరిన ఆ కోరిక నీకు మేలే చేసింది. నీలో దాగిన శౌర్యాన్ని అందరికీ తెలిసేలా చేసి నీకు కీర్తిని సంపాదించి పెట్టింది కదా!

ఆడది యింత సేతు ననుటన్నది యున్నదె యంచు నన్ను నూ
టాడితి, కైక కోరక మహాప్రభు నీ వని రాకలేదు, నీ
యాడది సీత కోరక మహాసుర సంహరణంబు లేద, యా
యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్

ఆడది ఎంతకైనా చేస్తుందన్నావే, నిజమే నయ్యా! నిన్నొక ఆడది కైక కోరిక కోరికపోతే అడవికి వచ్చేవాడివా, నేను (బంగారులేడిని)కోరకపోతే ఈ రాక్షసులనందరినీ సంహరించేవాడివా!

ఇలా రాముడన్న ప్రతిమాటకీ సమాధానమిస్తుంది సీత.

ఇనవంశేందు! మనస్సు లోపల మనస్సే లేదు నీకందు! నీ
కొనరన్ నిక్కముగా మనస్సున మనస్సున్నన్ ధరాజాత నే
మనినా వెవ్వరినో వరింపుమనియా? యయ్యయ్యొ! యా వేరి పే
ర్లనినా వెవ్వరుగాని నవ్వరటవే, రామా! జగన్మోహనా!

మనసున నింత యుంచుకొని మారుతితోడన యుంగరంబు పం
చినయది గుర్తు చిత్రము, రచించిన నీయెదలోని చా టెఱుం
గనియది, యిర్వదేండ్లు నిను గాంతుని గాగను నమ్మి సంసృతిం
బొనరిచి నిన్ను నే నెఱుగబోవని నా తెలివిన్ హసించెదన్

"నీకు మనసంటూ లేదు రామా! ఇన్నాళ్ళూ నిన్ను తెలుసుకోలేని నా తెలివికి నేనే నవ్వుకుంటున్నాను" అని ఎంత సూటిగా చెప్పింది! పైగా ఎంటంటోందో చూడండి (ఇక ప్రతిపద్యానికీ వివరణ ఇవ్వడం నా వల్ల కాదు!):

నీ పొనరించుదాన నొక నీతియు నున్నది నేనెఱింగినన్
నీ పొనరింపబోవు పనినే మరణించియ యుందు దేనికై
యా పది శీర్షముల్ కలిగినట్టి మహాసురు నీవు చంపునౌ
నీ పదిదిక్కులన్ యశమదెట్టుల దక్కును నీకు మత్పతీ!

ఆమిక్షాకృతి విచ్చిపోదు రనసూయారుంధతుల్ గాని లో
పాముద్రాసతిగాని నీ విటుల భూపాలా! మదిన్ నమ్మవే
నీ, మోహాంధ వటంచు ధూర్జటి హిమానీశైలకన్యామణిం
దా మాటాడునె? నీవు పల్కెదవుపో ధాత్రీ సతీకన్యకన్

అప్పుడరుంధతీ సతియు నంతిపురంబును నింక ద్రొక్కనం
చొప్పమి లేచిపోయె విపినోర్వికి నేనును వచ్చు టెంచుచున్
జెప్పకు మింటి కేగి యిది, సీతయు నగ్నిని జొచ్చె నేను బో
నప్పుడె యంచు జెప్పిన మహాప్రభు! దోసము మాసిపోయెడున్

ఆయా మౌనుల యిండ్లకుం జనకుమయ్యా! నీ వయోధ్యం జనన్
ధ్యేయాకారలు వారి గేహినులు భక్తింబొల్చు న న్నీ గతిం
జేయన్ నీవును గోప మూనెదరుసూ! సేమంబు కాదద్ది నీ
వా యా మౌనులయిండ్లకుం జనకుమయ్యా! నీ వయోధ్యం జనన్

ఆ వేళన్ వని జేరునప్పుడు ప్రసంగానీతమై చెప్పగా
సావిత్రీకథ నేను నీ మరణవాంఛాబుద్ధి నైనట్లుగా
నీ వాడన్ బ్రభు నేన చత్తునని యంటిన్ నిక్కమట్లయ్యె నీ
నీవే కారణమౌట దానికిని బండెన్ మత్తపంబంతయున్

రాముడిని అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఋషుల ఇంటికి వెళ్ళడం క్షేమం కాదని హెచ్చరిస్తోంది! ఎందుకు? తననిలా తూలనాడినందుకు మునిపత్నులందరూ రామునిపై తీవ్రంగా కోపగించుకుంటారు కాబట్టి!

నాపయి రామచంద్ర! రఘునాయక! మత్పతి! నీకు నెందుకో
కోపము వచ్చె నద్ది యిదిగో పది యల్లితి వంశగౌరవ
క్షేమముగాగ మచ్చ యని చెప్పితి వచ్చట నింత కంటె దీ
వ్రాపద యున్నదయ్య రఘువంశము నందున గోప మేటికిన్

నీకు నామీద ఎందుకో కోపం వచ్చింది. అంచేత ఎవో పది రకాలుగా నన్నన్నావు. నువ్వేదో మీ వంశగౌరవం అంటున్నావే, దానికి నువ్వనుకుంటున్నదానికంటే పెద్ద నష్టం ఇప్పుడు వాటిల్లబోతోంది! ఏవిటది?

నన్నున్ వీడి మఱీవు వేఱయిన కాంతం బొంద వప్డున్ గులో
త్సన్నంబై చను గైకకంటెను భవత్సంపాదితంబైన సమా
సన్నంబై చను పెద్దయెగ్గు రఘువంశంబందు లోకాగ్నికిన్
స్నాన్నాయంబగు నూహ లెత్తదు భవిష్యత్కాల సంసూచిగా

భరతుడొసగిన ధర ధర్మపత్ని ప్రక్క
లేక యేలెడు నర్హత లేదు నీకు
నరపతివి కాక నన్ను గొనంగవచ్చు
నుభయతోభ్రష్టతం బొందుచుంటి రామ!

ఆహా! ఎంత తిరుగులేని మాట చెప్పింది సీత యిక్కడ! రాముడు తన్ను వీడి మరొక కాంతను ఎలానూ చేపట్టడు. దానివల్ల కైక రఘువంశానికి చేసిందనుకొంటున్న కీడు కన్నా కూడా మహాపద కలుగుతుంది. భరతుడు తనకి ఒప్పచెప్పిన రాజ్యాన్ని ధర్మపత్ని లేకుండా రాముడు ఏల లేడు. అప్పుడు మరి రఘువంశ భవిష్యత్తు ఏమి కావాలి? పైగా, రాముడు తన వంశాన్ని రాజ్యాన్ని వదులుకొని ఇప్పుడు సీతని గ్రహించవచ్చు. కాని సీతని పరిత్యజించి ఆ వంశగౌరవాన్నీ, రాజ్యాన్నీ ఎటూ పొందలేడు. అప్పుడతను రెంటికీ చెడ్డ రేవడే అవుతాడు!
ఇది చెప్పిన తర్వాత, సీత మరో రహస్యం చెప్పి, అగ్నిప్రవేశానికి ఉపక్రమిస్తుంది.

అగ్నిమండుచు నున్నది యారిపోక
ముందు నే దానిలోనికి బోవవలయు
జివరి కొకమాట నీకును జెప్పవలయు
దెలియజాలరు దీనిని దేవతలును

ఇరువురము నొక్క వెలుగున
జెఱుసగమును దీని నెఱుగు శివుడొకరుండే
పురుషుడ వీ వైతివి నే
గరితనుగా నైతి బ్రాణకాంతా! మఱియున్

అచట చూచుచు నున్నట్టి యందఱకును
జెలువ యేమని చెప్పెనో తెలియలేద
చాది చూచిరి నట నుర్విజాత నచటి
యుర్విజాత యన్నట్లుగా నున్నదాని

మారుతి లక్ష్మణుండును క్షమాసుత బూర్వము చూచినట్టి వా
రా రుచిరాంగి చెప్పినది యంతయు నర్థము చేసికొన్న వా
రీ రచనంబు సర్వమును మహీయ మతీతమనస్కమై జనం
బేరును రామునందున వహింపరు తొల్త దలంచు దోసమున్

"నిర్భీకవలె, స్వాధీనపతికవలె, బురస్కారభావయుతవలె, మత్తగజ మంథర సుందర గమనంబున నగ్నికడకు నడచి యగ్ని బ్రవేశించిన"

ఈ చివరి సీత నడకని, ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు వర్ణించిన నడకతో (ఈ టపా మొదట్లో ఉంది) పోల్చి చూడండి. అందులో ఎంతటి వైవిధ్యాన్ని విశ్వనాథ ప్రదర్శించారో, ఎందుకు ప్రదర్శించారో!

ఈ అగ్నిప్రవేశ ఘట్టం మనల్నీ (రాముణ్ణీ) రామాయణం చివరికంటూ వెంటాడుతునే ఉంటుంది! ఆ తర్వాత సీతని ప్రసన్నురాలిని చేసుకోడానికి నా నా తిప్పలూ పడతాడు రాముడు. ఆఖరికి రాముడు జానకిని ప్రసన్నురాలిని జేసుకొనవలసిన స్థితినుండి, సీతచేత తాను అనుగ్రహింపబడవలసిన స్థితికి వస్తాడుట!
తిరిగి అయోధ్యకి సీతారాములు ప్రయాణమైనప్పుడు ఋష్యమూక పర్వతం కనిపిస్తుంది. అప్పుడు రాముడు సీతతో, అక్కడ ఎంతగా విరహాగ్ని తనని కాల్చివేసిందో చెప్తాడు రాముడు. అప్పుడు సీత, "నిన్నేమో అగ్ని కానిది అగ్నిలా దహించింది, నన్నేమో అగ్నే అగ్నిలా దహించకుండా పోయింది" అని ఓ పోటు పొడుస్తుంది!
ఆ తర్వాత వాళ్ళు అత్రి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, సీత అనసూయకి జరిగిన వృత్తాంతం చెప్తూ, తనని రాముడు చేసిన అవమానం కూడ చెప్పి, రాముడన్న మాటలకి "జుగుప్సావార్ధులాడెం జుమీ!" అంటుంది. దాంతో అనసూయ, రాముని వద్దకు వచ్చి చాలా కోపంగా చూసి, తర్వాత తనని తమాయించుకొని మళ్ళీ లోపలకి వెళ్ళిపోతుందిట!
భరతుడికి తను తిరిగివస్తున్నానన్న వార్త చెప్పమని హనుమంతుని పంపిస్తాడు రాముడు. హనుమంతుడు వెళ్ళేసరికి, రాముడు గడువు పూర్తయినా రాలేదని అప్పుడే అగ్నిప్రవేశానికి సిద్ధపడతాడు భరతుడు. అప్పుడు హనుమంతుని కంటికి భరతుడు ఇలా కనిపించాడట:

ధరణిదేవికన్య దశరథసూనుండు
రామమూర్తి యనలరాశి ద్రోచె
దానికిన్ ఫలంబు తానే మహాగ్నిలో
నుఱుకుచుండె నన్న యూహ తోచి

భరతుడు రామునిలాగే ఉంటాడు కదా ఆకారంలో మరి! దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అగ్నిప్రవేశాన్ని మనకి గుర్తుచేసారు విశ్వనాథ.
అయోధ్యకి తిరిగివచ్చిన తర్వాత, అరుంధతి తమని చూడటానికి వస్తున్నప్పుడు రాముడు తెగ భయపడిపోతాడు! అనసూయ అయితే కోపంగా చూసి ఊరుకుంది, అరుంధతికి కోపం వస్తే అలా ఊరుకుంటుందన్న నమ్మకం లేదు. అంచేత ఆమెకి ఏమీ చెప్పవద్దని సీతని ప్రాధేయపడతాడు రాముడు. సీత అతనికి అభయం ఇస్తుంది!

ఇలా అగ్నిప్రవేశం గురించి కల్పవృక్షంలో చదివితే స్త్రీశక్తి, అందులోనూ సీతాదేవి మహోన్నత వ్యక్తిత్వం, మనకి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. రామాయణం "సీతాయాశ్చరితం" అన్నది మరింత బలపడుతుంది.
వడలి మందేశ్వరరావుగారు "ఇది కల్పవృక్షం" అన్న పుస్తకంలో, అగ్నిప్రవేశాన్ని గురించి చెప్తూ, ఇది సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. దీనివల్ల ఇప్పటికీ రాముని వ్యక్తిత్వాన్ని సరిగా అంచనా వెయ్యడానికి కష్టంగానే ఉంది అన్నారు. అది అక్షర సత్యం!


పూర్తిగా చదవండి...

Saturday, September 20, 2008

పద్య రచనలో టెక్కునిక్కులు


గిరిగారు తన బ్లాగులో రాసిన "ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్" అనువాదం చూసి, కొన్ని "ఉచిత" సలహాలక్కడ పడేసాను. ఆ తర్వాత దాని గురించి మరింత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో అనిపించింది. అందుకే యీ టపా.
"పద్యం రాయడం ఎలా?" అన్న ప్రశ్న కాస్త విచిత్రంగా అనిపించొచ్చు. ఛందస్సు (గురులఘువులు, గణాలూ, వృత్తాలూ మొదలైన విషయాలు) నేర్చుకొని, రాయాల్సిన పద్య ఛందస్సుని ఎన్నుకొని, అందులోని నియమాలని అనుసరించి మనం చెప్పాలనుకున్న విషయానికి తగ్గ పదాలని పేరుస్తూ పోతే పద్యం వస్తుంది - ఇంతే కదా! ఇంతే కదా అంటే స్థూలంగా ఇంతే, కానీ సూక్ష్మంగా ఇంకా చాలా ఉంది. అలాటి కొన్ని సూక్ష్మ విషయాలని కాస్త పరిశీలిద్దాం. దీనికోసం ముందు వేసుకొన్న ప్రశ్నని "మంచి పద్యం రాయడం ఎలా?" అని మారిస్తే మరికొంత అర్థవంతంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఉదాహరణతో వివరిస్తే బావుంటుందనిపించింది. దీనికోసం "ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్" రైమునే తీసుకుంటాను, గిరిగారు తప్పుగా అనుకోరనే ధైర్యంతో.

పద్యం రాయడం ఓ కళ అని అందరూ ఒప్పుకొనేదే. కాని అందులో కొన్ని టెక్కునిక్కులు కూడా ఉన్నాయి. పద్యం అనగానే మొట్టమొదటి ప్రశ్న, "ఏ ఛందస్సులో రాయాలి?" అని. మనకి బాగా నచ్చిన ఛందస్సులో రాసుకోవచ్చు. లేదా బాగా వచ్చిన ఛందస్సులో రాసుకోవచ్చు. మొదట్లో ఈ పని చెయ్యొచ్చు కాని, "ఫరవాలేదు, మనం పద్యాలు రాయగలం" అని అనుకున్న తర్వాత ఈ టెక్నిక్కుని అవతల పడేయాలి. పడేసి, రాయదల్చుకున్న విషయం మీద దృష్టి సారించాలి.

రాయాలనుకున్న వస్తువుని బట్టి ఛందస్సుని ఎంచుకోవడం మంచి టెక్నిక్కు. అలా అని "విషయం బై ఛందస్సు" లాంటి పట్టిక ఏదీ లేదు, ఠపీమని విషయాన్ని బట్టి ఛందస్సుని ఎంచేసుకోవడానికి. ఇక్కడ ఛందస్సు స్వరూపం గురించి కాస్త జెనరల్ నాలెడ్జి అవసరం అవుతుంది.
కాస్త గంభీరమైన విషయాలకు శార్దూలం మత్తేభం లాంటి వృత్తాలూ, సుకుమారమైన విషయాలకి ఉత్పల చంపకమాలలూ, ఒకే వస్తువు గురించి రక రకాలగా వర్ణించడానికి సీసం, లలితమైన క్లుఫ్తమైన భావాలకి తేటగీతీ, ప్రత్యేకమైన నడకతో తేలికగా గుర్తుండిపోవాల్సిన చిన్న చిన్న విషయాలకి ఆటవెలదీ... ఇలా కొన్ని సూచికలు ఉన్నాయి. అవి కేవలం సూచికలే, సూత్రాలు కావన్న సంగతి మాత్రం మరిచిపోకూడదు.

సరే మన ఉదాహరణకి వద్దాం. "ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్"ని అనువదించాలంటే ఏ ఛందస్సు సరైనది? ఇదొక పిల్లల గీతం. ఇందులో గంభీరమైన, సుకుమారమైన విషయాలేవీ లేవు. కాబట్టి ఖచ్చితంగా వృత్తాల జోలికి పోకూడదు. చెప్పే విషయం చాలా చిన్నదైనా, ఇది పిల్లలకి గుర్తుండిపోవాలి. అలాంటి విశేషం ఇందులో ఏవుంది అంటే, అందులోని కొట్టొచ్చినట్టు కనబడేది - "తానా నానా తానా నా..." అంటూ సాగిపోయే దాని నడక. అంచేత దీన్ని అనువదించేటప్పుడు అలాంటి కొట్టొచ్చినట్టుండే నడక అత్యవసరం. అలాటి ఛందస్సు పైన చెప్పుకున్న వాటిలో ఆటవెలది ఒక్కటే. మరొకటి ముత్యాలసరం. ఇది మాత్రా ఛందస్సు. మాత్రా ఛందస్సులకి నడకే ప్రాణం. అసలీ ఇంగ్లీషు గీతం కూడా మాత్రా ఛందస్సులో ఉన్నదే. చూడండి:

ట్వింకిల్ (4) ట్వింకిల్ (4) లిట్టిల్ (4) స్టార్ (2) (మాత్రలు)
హౌ ఐ (4) వండర్ (4) వాట్యూ (4) ఆర్ (2)
అప్పే (4) బోవ్ దా (4) వార్ల్డ్ సో (4) హై (2)
లైకే (4) డైమండ్ (4) ఇందా (4) స్కై (2)

ఇప్పుడు మనదగ్గర మూడు రకాల ఛందస్సులున్నాయి ఎన్నుకోడానికి. ఒకటి ఆటవెలది, మరొకొటి ముత్యాలసరం, మూడోది ఇంగ్లీషు రైములోనే ఉన్న మాత్రా ఛందస్సు, దీన్ని ఆ రైము పేరుమీద ట్వింకిల్ ఛందస్సు అందాం. ఇప్పుడీ ఛందస్సులనీ, మూలాన్నీ మరి కాస్త పరిశీలించాలి. ట్వింకిల్ ఛందస్సులో మనం గమనించాల్సిన అంశం - నాలుగు పాదాలూ ఒకే రకమైన మాత్రలు. అలానే రైములో ప్రతి వాక్యమూ ఒక పాదం. అంటే ఒక వాక్యం ఒక పాదంతో పూర్తయిపోతోంది. మొదటి రెండు పాదాలకీ అంత్య ప్రాస ఉంది, అలానే మూడు నాలుగు పాదాలకీను. ఈ అంశాలన్నీ ఆ రైము చక్కదనానికి దోహదం చేసినవే. కాబట్టి సాధ్యమైనంతవరకూ తెలుగులో కూడా ఇవి ఉంటే బావుంటుంది. అయితే తెలుగుకి అంత్యప్రాస అంత అందాన్ని ఇవ్వదు కాబట్టి దాన్ని వదిలేయొచ్చు.
ఇప్పుడు మనమనుకున్న ఛందస్సులని పరిశీలిస్తే, ఆటవెలది అసమ పాదాలు కలిగినది. అంటే నాలుగు పాదాలూ ఒకే మాత్రలూ లేదా గణాలూ కాదు. చెప్పే విషయంలో అలాటి అసమత ఉంటే దానికి ఆటవెలది వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మన ఇంగ్లీషు గీతంలో అలాటిదేం లేదు. కాబట్టి ఆటవెలది ఈ సందర్భంలో ఎంత అందాన్నిస్తుందో కొంచెం అనుమానమే. పోతే ముత్యాలసరం. ఇది సమ ఛందస్సనే అనుకోవచ్చు. అంటే నాలుగు పాదాలూ ఒకే నడక ఉండే అవకాశం ఉంది. చివరి పాదంలో కావాలంటే కొంత తేడా చూపించవచ్చు.
అంచేత ప్రస్తుతానికి ఛందస్సు ముత్యాలసరమో, ట్వింకిలో అని నిర్నయించవచ్చు.

హమ్మయ్యా! ఛందస్సు నిర్ణయించే పెద్ద పని అయిపోయింది. వాట్ నెక్స్టూ?

ఛందస్సుతో పాటు దాని నిర్మాణం గురించి కూడా ఆలోచించి నిర్ణయించుకోవడం మంచిది. ఇంగ్లీషు రైముకున్న లక్షణం, అంటే ఒకో పాదానికీ ఒకో వాక్యం అన్న నియమం మన అనువాదంలో కూడా ఉండాలి. నిర్మాణ పరంగా ప్రస్తుతానికి ఇది చాలు.

తరవాత గమనించాల్సిన ముఖ్యమైన విషయం భాష. ఇది పిల్లల గీతం. కాబట్టి భాష చాలా సరళంగా, పిల్ల భాషకి దగ్గరగా ఉండాలి. అంటే పదాలు తేలికగా (సంస్కృతపాండిత్యం లేకుండా) వాక్యాలు సరళంగా (సంధులూ సమాసాలూ లాంటివి లేకుండా) ఉండాలన్న మాట.

భావం విషయంలో పూర్తిగా ఇంగ్లీషు రైముని అనుసరిస్తే సరిపోతుంది.

ఇంక అనువాదం మొదలుపెడదావా మరి! ముందుగా ముత్యాలసరంలో ప్రయత్నిద్దాం.

ట్వింకిల్ కి మంచి తెలుగు పదం ఉండనే ఉంది - మినుకు
"మినుకు మినుకని మెఱయు తారా" ఎలా ఉంది? ఊ.ఊ.ఊ... "మెఱయు" పదం కొంచెం గ్రాంధిక వాసన కొట్టటం లేదూ? పైగా అలాటి పదమేవీ ఇంగ్లీషు రైములో లేదాయె. అంచేత ఇక్కడా పదం అనవసరం. సరే తీసేద్దాం. మరి దాని బదులు ఏ పదం వెయ్యాలి? అరే, "లిట్టిల్" మన అనువాదంలో రాలేదు. అది పెడితే సరి.
"మినుకు మినుకూ చిన్ని తారా". బాగానే ఉంది కాని "చిన్న" తెలుగుపదం, "తార" సంస్కృతపదం అయిపోయి రెండూ పక్కపక్కనే బావున్నట్టు లేదు. "తార"కి చక్కని తెలుగు పదం ఉందిగా, దాన్నే ఉపయోగిద్దాం.
"మినుకు మినుకూ చిన్ని చుక్కా". బావుంది. ఒక పాదం అయిపోయింది.

ఇక రెండో పాదం, "How I wonder what you are!"- ఇది చాలా సులువు. "నిన్ను చూస్తే ఎంత వింతా!".

మూడో పాదం, "Up above the world so high". ఇది కొంచెం ఇబ్బంది పెట్టే వాక్యమే. ఎందుకంటే "world so high" అన్నది ఇంగ్లీషు భాషకే పరిమితమైన పదబంధం. ఇది మక్కీకి మక్కీ అనువాదం చెయ్యలేం. తర్వాత పాదం "Like a diamond in the sky" కూడా అలాటిదే. ఇక్కడొక విశేషం గమనించాలి. ఈ రెండు పాదాల్లోనూ "క్రియ" ఎక్కడుంది? లేదు! కాని దాని లోటు మనకి తెలీటం లేదు. అదే తెలుగులో అయితే అలా కుదరదు. ఉదాహరణకి, ఈ రెండు వాక్యాలనీ ఉన్నదున్నట్టుగా తెలుగులో చెప్తే, "లోకానికంతటికీ అంత ఎత్తులో, ఆకాశంలో ఒక వజ్రంలా". వజ్రంలా ఉందనో మెరుస్తోందనో అనకపోతే ఆ వాక్యం పూర్తికాదు తెలుగులో. కాబట్టి తెలుగులో అలాటి క్రియా పదం చేర్చుకోవాలి. సరే, అలాటి పదాన్ని చేర్చుకొని ఆ రెండు పాదాలనీ పూర్తి చేద్దాం:

అంత ఎత్తున ఆకసమ్మున
వజ్రమల్లే మెరసినావే

ఊ..హూ.. మళ్ళీ "ఆకసమ్మున", "వజ్రం" కాస్త గ్రాంధిక వాసన కొడుతున్నాయి. ఆకసము బదులు నింగి వాడొచ్చు. చక్కని తెలుగు పదం. మరి వజ్రానికి తెలుగు పదం ఏమైనా ఉందా? ఉంది - "రవ్వ". "రవ్వల గాజులు", "రవ్వల నెక్లెసు" అనే వాడుక ఉండేది, ఇప్పటికీ కొన్ని చోట్ల పల్లెటూళ్ళలో వినొచ్చు. వాటితో పద్యాన్ని పూర్తి చెయ్యొచ్చు. పూర్తి పద్యం:

మినుకు మినుకూ చిన్ని చుక్కా
నిన్ను చూస్తే ఎంత వింతా!
అంత ఎత్తున నింగిలోనా
మెరిసిపోతావ్ రవ్వలా!

ఇది ముత్యాలసరంలో అనువాదం. ఇలాగే, ట్వింకిల్ ఛందస్సులో రాస్తే:

మినుకూ మినుకూ చుక్కమ్మా
నినుచూస్తేనే వింతమ్మా!
అంతెత్తులోన మెరిసావే
ఆకాశంలో రవ్వల్లే!

ఇక్కడ నిర్మాణ సంబంధమైన మరో విశేషాన్ని గమనించాలి. ఇంగ్లీషు రైములో, మూడో పాదంలో "Up above the world so high" అని ఉంది కదా. మాత్రల సంఖ్య మిగతా పాదాల్లోలాగే ఉన్నా, దీని నడకలో చిన్న తేడాని గమనించండి. "Up above the" అన్నప్పుడు నడుస్తూ నడుస్తూ ఒక్కసారి ఎగిరినట్టు లేదూ? మాత్రలు పదాలలో ఎలా విరిగాయో గమనిస్తే, ఇది ఎలా సాధ్యమయిందో తెలుస్తుంది. మరి దీన్ని అనువాదంలో ఎందుకు వదులుకోవాలి?
"అంతెత్తులోన" అనడంలో అది కొంతవరకూ వచ్చిందని అనుకుంటున్నాను. మూడో పాదం నడకని తక్కిన పాదాల నడకతో పోల్చి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

అలాగే మనకి తెలియకుండానే చేసిన మరో పని - అంత్యప్రాసని కొంతలో కొంత తీసుకురావడం. "హల్లులు" కలవకపోయినా, "అచ్చులు" కలిసాయి కదా! ముత్యాలసరంలో అన్ని పాదాల చివరా "ఆ" వస్తే, ట్వింకిల్ ఛందస్సులో చేసిన అనువాదంలో మొదటి రెండు పాదాల చివరా "ఆ", మూడు నాలుగు పాదాల చివరా "ఏ" వచ్చాయి. నిజానికి గమనిస్తే, ఇంగ్లీషు రైములో కూడా చివరి రెండు పాదాల్లోనూ ఉన్న అంత్యప్రాస "అచ్చు"లకి మాత్రమే!

ఇవీ పద్యం రాయడంలో "కొన్ని" టెక్కునిక్కులు! ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు రెండున్నాయి:
1. ఈ అనువాదం చాలావరకూ మూలాన్ని మక్కీకి మక్కీ అనుసరించింది. ప్రతి అనువాదం ఇలాగే ఉండాలని లేదు.
2. ఇక్కడ చేసిన అనువాదాల కన్నా మంచి అనువాదాలు ఈ రైముకి ఉండవచ్చు. నేను చేసినవే ఉత్తమమైనవి అని నేను చెప్పటంలేదు. కానీ అనువాద విధానంలో ఈ సూత్రాలు చాలావరకూ వర్తిస్తాయని మాత్రం చెప్పగలను.

మరోసారి మరో రకమైన ఇంగ్లీషు కవితని తీసుకొని దాన్ని అనువదించే ప్రయత్నం చేద్దాం.

ప్రస్తుతానికి మీకో సమస్య. ట్వింకిల్ లాంటిదే మరో పిల్లల గీతం. దీన్ని అనువదించడానికి ప్రయత్నిస్తారా?

"Johny Johny" "Yes Papa!"
"Eating Sugar" "No Papa!"
"Telling lies" "No Papa!"
"Open your mouth" "Ha! Ha! Ha!"


పూర్తిగా చదవండి...

Thursday, September 11, 2008

ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోతుందా?


నా మార్గమ్మును కాదు, శిష్యుడయినన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; వీని దెదియో! ఈ మార్గ మట్లౌటచే,
సామాన్యుండనరాదు వీని కవితాసమ్రాడ్వ్త మా హేతువై,
యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్

ఇతని కవిత్వాన్ని గురించి బహుశా ఇంతకన్న సరైన అంచనా మరెవరూ వెయ్యలేరు. తన శిష్యుని గురించి స్వయంగా అతని గురువే చెప్పిన మాటలుకావడం వీటికి మరింత విశిష్టతనిస్తుంది. ఆ శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ, ఆ గురువు చెళ్ళపిళ్ళ.
ఈ రోజు అతని జయంతి. అది గుర్తుచేసిన తెలుగురథం శర్మగారికి ముందుగా కృతజ్ఞతలు.

విశ్వనాథ నాకెప్పుడు పరిచయమయ్యారో సరిగా గుర్తులేదు కాని, అతన్ని చదువుతూంటే కలిగే అనుభూతులు అనేకం! ఒకోసారి అతని మీద జాలి పుడుతుంది. మరోసారి చిరాకు, ఇంకోసారి భక్తి, కొన్ని సార్లు భయం, మరికొన్ని సార్లు గౌరవం పుడుతూ ఉంటాయి. అయితే చాలాసార్లు పుట్టే అనుభూతి మాత్రం ఆశ్చర్యంతో కూడుకొన్న తీవ్రమైన విస్మయం! విశ్వనాథ కవిత్వం చదువుతునప్పుడు, అది పూర్తిగా నాకర్థమవుతుందో లేదో నాకు తెలీదు. కానీ అర్థమయ్యిందీ అని అనిపించినంతలో, దాన్ని అనుభవించినంతలో, అందులో దర్శనమిచ్చే అతని "ప్రతిభ" ("పాండిత్యం" కాదని గుర్తించండి) - ఇంతటి గాఢ ప్రతిభ యితనికెలా అబ్బిందబ్బా అన్న విస్మయంలో ముంచెత్తేస్తుంది.
విశ్వనాథ మౌలికంగా కవి. కథకుడూ, నవలాకారుడూ, విమర్శకుడూ కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల అయ్యారు అని నాకనిపిస్తుంది.
విశ్వనాథకి భక్తులూ ఎక్కువే, బద్ధ శత్రువులూ ఎక్కువే. అయినా, వీళ్ళుకాని వాళ్ళుకాని అతన్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువే.

బహుశా నేను మొట్టమొదట విన్న (అప్పటికి అతని పద్యాలేవీ నేను చదవలేదు కూడా) మొట్టమొదటి పద్యం ఇదనుకుంటాను:

నా ప్రాణములకు నీ పొగమబ్బుల
కేమి సంబంధమో! యేను గూడ
పొగమబ్బునై కొండచిగురు కోసలపైన
బురుజులపైని గొమ్ములకు బైని
వ్రాలిపోనో మధ్య వ్రీలిపోనో నేల
రాలిపోనో గాలి తేలిపోనో
నా యూహ చక్రసుందర పరిభ్రమణమై
యీ పొగమబ్బులనే వరించె

యెన్ని పొగమబ్బు లెఱిగి లేనేను మున్ను?
తూర్పు కనుమలు విడుచు నిట్టూర్పు లట్టి
విచటి యీ పొగమబ్బులే యెడదలోన
లలితము మదీయ గీతి నేలా వెలార్చు?

ఇది ఆంధ్రప్రశస్తిలోని పద్యం. ఎవరిదో ఉపన్యాసంలో విన్నాను. ఆ ఉపన్యాసకుడు ఈ పద్యాన్ని చదివిన తీరుకీ, దాన్ని వివరించిన విధానానికీ మంత్ర ముగ్ధుణ్ణయిపోయాను! అలా ఆనాడా మబ్బుతునక చిందించిన చిన్న చినుకు, ఆ తర్వాత చిలికి చిలికి గాలివానై మొత్తం నన్ను ముంచెత్తేసింది!

విశ్వనాథ గురించి చెప్పడం మొదలుపెడితే ఇంక అతన్నీ పట్టలేం, నన్నూ పట్టలేం :-) అంచేత, అతని పద్యాలు కొన్ని తలచుకొని "సం" తృప్తిని పొందుతాను, ప్రస్తుతానికి.

శ్రీకృష్ణ సంగీతంలో ఒక గోపిక కృష్ణునితో చేస్తున్న నిందా స్తుతి ఇది:

యాదవా నీది గానంబు కాదురయ్య!
గాన మెచ్చటనైనను కర్ణ రంధ్రములను జొచ్చు,
యెడదకు సౌఖ్యము సమకూర్చు.
ఇంక నీ పాట చెవులలో నెపుడు జొచ్చు? చొచ్చుచును జొచ్చుచును గుండె జొచ్చుగాని!
ఎపుడు నీ పాట అది సుఖమిచ్చు నెదకు? ఇచ్చుచును ఇచ్చుచును దుఃఖ మిచ్చుగాని!
నేను నీ పాటకును రానె రాను పొమ్ము...

పైది నిజానికి వచనమే, కాని తేటగీతి ఛందస్సులో ఉంది.

ఆంధ్రప్రశస్తిని మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితమిస్తూ అన్న మాటలలో విశ్వనాథ ఆంధ్ర దేశాభిమానం ఉరకలు వేస్తుంది:

ఇది నీకై యిడినట్టి నా యుపద, మున్నేనాడొ ఘాసాగ్రముల్
పదునై యాంధ్ర విరోధి కంఠ దళన ప్రారంభ సంరంభ మే
చు దినాలనే మఱి తోడి సైనికులమై చూఱాడు ప్రేమంబులో
నిది లేశంబనియైన జెప్పుటకు లేవే నాటి స్వాతంత్ర్యముల్!

రామాయణకల్పవృక్షంలో శబరి తలమీద పువ్వులూ పండ్లూ పెట్టిన తట్టతో నడిచి వస్తూ ఉంటే, ఆమే ఇలా ఉందిట:

తుట్టతుద దాక ఎండిన చెట్టుకొమ్మ
శేఖరంబున యందు పుష్పించినట్లు

శబరి శరీరం ఎండిపోయిన చెట్టుకొమ్మలా ఉంది. ఆ చెట్టుకొమ్మ చివరమాత్రం పుష్పించినట్లుందట!

రాముడు ఖరుడిని చంపేటప్పుడు చూపించిన వీర రసం:

ఆకంఠంబుగ మెక్కినట్టి మునిరాజానేక మాంసంబులన్
నీ కంఠంబును గత్తిరించి యిదిగో నీచేత గ్రక్కించెదన్
భూకాంతుండయినట్టి యా భరతు డబ్బో! తీక్ష్ణు డీ కార్యమున్
నాకుం బెట్టెను దైత్య రాడ్గళ గళన్నాళంబులం గోయగన్

కల్పవృక్షంలోంచి ఎన్నని ఉదాహరణలివ్వగలం! రాముడు ధనుర్విద్యా పారంగతుడయ్యాక అతని పరిస్థితి ఎలా ఉందో వివరించే పద్యం ఇది:

సుడియన్ బ్రత్యణువున్ బ్రవేగధుర మౌచుం బంచకల్యాణి సా
వడిలో నూఱక కట్టివేసిన నసృగ్బాధోల్బణంబైన కై
వడి నిల్పోపక రామభద్రుడు ధనుర్వైధగ్ధ్య సాఫల్య మే
ర్పడు మార్గంబుల కోసమై వెదకు సౌత్రశ్రీ లహోలిప్తలన్

మంచి పదునుమీదున్న పంచకల్యాణీ గుఱ్ఱాన్ని ఊరికే సావడిలో కట్టేస్తే ఉఱకలు వేసే నెత్తుటితో అది ఎలా బాధపడుతుందో అలా తన ధనుర్విద్య సాఫల్యం చెందే అవకాశం రాక రామభద్రుడు విలవిలలాడిపోయాడుట!

అన్నిటికన్నా విశ్వనాథని దగ్గరగా మనం చూడగలిగేది అతని శతకాల్లో. అందులోనూ విశ్వేశ్వర శతకంలో. అందులోంచి రెండు పద్యాలు:

అతను కటిక దారిద్ర్యం అనుభవించిన రోజుల్లో ఒళ్ళుమండి రాసిన పద్యం కాబోలు ఇది!

మీ దాతృత్వమొ తండ్రి దాతృతయొ మీమీ మధ్య నున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!

అయినా అతనికా స్వామి మీదున్న భక్తి అపారమైనది.

నీవే రాజువు నేను సత్కవిని తండ్రీ! నిన్ను వర్ణించెదన్
నీవే దైవము నేను భక్తుడను తండ్రీ! నిన్ను ధ్యానించెదన్
నీవే భూమివి నేను గర్షకుడ తండ్రీ! నిన్ను బండించెదన్
నా వైదగ్ధ్యము నీవ చూతు, కృప సంధానించు విశ్వేశ్వరా!

తెలుగు పద్యకవిత్వం మొత్తాన్ని చదవే భాగ్యం నాకీ జన్మకు ఎలాగూ లేదు. విశ్వనాథ కవిత్వాన్ని చదివితే తప్పకుండా ఆ లోటు తీరుతుంది. కాని అది కూడా సాధ్యమవుతుందన్న నమ్మకం లేకుండా ఉంది :-(


పూర్తిగా చదవండి...

Wednesday, September 3, 2008

వినాయకునికి పద్యాల నైవేద్యం


అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!
వినాయకచవితి తెలుగువాళ్ళకి ఆహ్లాదకరమైన పండగ. వినాయకుడంటే తెలుగువాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి! అతని రూపమే చిత్రం! అతని వాహనం మరీ విచిత్రం! ఇష్టమైన పిండివంటలు సరే సరి! మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా! అతనితో ఎన్ని సరదాలు, మరెన్ని సరాగాలు! ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలక గుఱ్ఱాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటీ మొదలుపెట్టాడా స్వామి!

వినాయకుడు: రేపు వినాయకచవితి గుర్తుందా!

నేను: అయ్యో ఎంత మాట! నాకు గుర్తులేకపోవడమేమిటి, మాకు సెలవు కూడానూ!

వినాయకుడు: అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావ్?

నేను: అదీ...మరీ...స్వామీ... మా ఆవిడ ఉండ్రాళ్ళో ఏవో చేస్తానంది. ఆవిడ దయా మీ ప్రాప్తం!

వినాయకుడు: అది కాదోయ్! నువ్వు పెట్టే నైవేద్యమేవిటీ అని అడుగుతున్నా...

నేను: నేనా? ఏంటంటున్నారు స్వామీ?

వినాయకుడు: అదేనయ్యా, నీ బ్లాగులో పండగలకీ పబ్బాలకీ పద్యాలు వేస్తున్నావు కదా! ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేనడుగుతున్నది.

నేను: ఓ, అదా! అయినా మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా అని...

వినాయకుడు: అదేంటయ్యా అలా అంటావ్! అసలు నాకు సంస్కృతశ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా!

నేను: అవునా స్వామీ! అదేం?

వినాయకుడు: నన్ను తల్చుకోగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు.

నేను: శుక్లాంబరధరం విష్ణుం...

వినాయకుడు: అవునా! మరి నన్ను తల్చుకోగానే గుర్తుకొచ్చే మీ తెలుగు పద్యం ఏవిటి?

నేను: తోండము నేకదంతమును...

వినాయకుడు: ఊ...పూర్తిగా చదువు.

నేను:
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!

వినాయకుడు: చూసావా! నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేనుకూడా చాలా కాలంనుంచీ నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలందులో నాగురించి ఏవిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాక్కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు. స్పష్టంగా, వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తోందో! అందికే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం!

నేను: బావుంది స్వామీ! మీకు తెలుగు పద్యాలిష్టమని విని చాలా ఆనందంగా ఉంది!

వినాయకుడు: మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు! అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో!

నేను: అలాగా!

వినాయకుడు: అవునయ్యా! అతనెవరూ... జిగిబిగి కవిత్వం రాసాడు. ఆ... అల్లసాని పెద్దన. అతను బలే గడుసువాడు సుమా! నా గురించి బలే పద్యాన్ని రాసాడు. ఏదీ ఆ పద్యం ఒక్కసారి చదివి వినిపించూ.

నేను:
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!

వినాయకుడు: తస్సాదియ్యా! కవంటే ఇతనేనయ్యా. నాక్కూడా ఎప్పుడూ రాలేదిలాంటి అల్లరి ఆలోచన! దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలిది నా గురించే కాదనీ ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకవేవీ పట్టవు. నా గురించి అలాటి చమత్కారమైన ఆలోచన చేసాడు చూడూ! అది నాకు బలే బలే అద్భుతంగా అనిపించింది.

నేను: అవును స్వామీ! పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె అని అందుకేగా మేం అనుకునేది! అయితే ఇంతకన్నా ముందే కేతన కవి ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీచేత ఆడించాడు స్వామీ!

వినాయకుడు: అవునా! ఎందులో? ఏదీ ఆ పద్యం కూడా వినిపించు మరి.

నేను: ఈ పద్యం దశకుమారచరిత్రములోది. వినండి.
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!

వినాయకుడు: ఓరి మీ అసాధ్యంగూలా! మీ తెలుగుకవులు భలే వాళ్ళయ్యా! నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారూ! నా రెండు చేతులతోనూ మా నాన్న రెండు కళ్ళూ మూసేసి, మా నాన్న మూడో కంటిని నా మూడో చేత్తో, "హస్తంతో", అంటే తొండంతో మూసేసానా! ఆ నిప్పుకంటి జోలికి వెళితే నా తొండమేం గానూ!

నేను: పొండి స్వామీ మీరు మరీను! పరమేశ్వరుని చిత్తం చిగురిస్తే, ఆ కన్ను మంటలు కురిపిస్తుందా ముద్దులు కురిపిస్తుంది కానీ.

వినాయకుడు: ఆలా అంటావా! అయితే ఓకే. ఇంతకీ, నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు?

నేను: నన్నెచోడుడు అనుకుంటాను స్వామీ!

వినాయకుడు: ఓహో! అతనే కదూ మా తమ్ముడు పుట్టుకగురించి కుమారసంభవం తెలుగులో రాసిన కవి. ఏదీ అతను రాసిన పద్యం వినిపించు.

నేను: చిత్తం.
తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ
ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా
జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!

వినాయకుడు: బావుందయ్యా! నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే యీ కవి! మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా! ఇంకా ఎవరెవరు ఏం చమత్కారాలు చేసారో త్వరగా వినిపించు.

నేను: కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామీ. అతను రామరాజభూషణుడు, ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు. మీరే వివరించాలి!

వినాయకుడు: ఏవిటి నేనా! ఇప్పుడంత సమయం లేదే. సరే చదువు చూద్దాం.

నేను:
దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!

వినాయకుడు: అబ్బో, యీ భట్టుమూర్తి చాలా ఘటికుడయ్యా! వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసిపారేసాడు! మధ్యలో శ్లేష ఒకటి!
నా తొండంతో ముందు గంగ నీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట! తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే, ఆ ఊపుకి, మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకొందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించేనట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని (కుమారస్వామికి అన్ననే కదా!) సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి!

నేను: బాగా వివిరించారు స్వామీ! స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది!

వినాయకుడు: అది సరేగానీ, ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా, వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకొనే పద్యాలు ఎవరూ రాయలేదా?

నేను: ఎందుకు రాయలేదు స్వామీ! అలాటివాటికి పెట్టింది పేరు పోతన, ఆ తర్వాత కొంతవరకూ మొల్ల.

వినాయకుడు: అయితే తొందరగా వినిపించు మరి!

నేను: పోతన తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో:
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!

వినాయకుడు: ఆహా! పోతన పద్యంలో తీయని మకరంద ధార జాలువారుతునే ఉంటుంది. మరి మొల్ల పద్యమో?

నేను: చిత్తం సిద్ధం!

చంద్రఖండ కలాపు జారు వామనరూపు
గలిత చంచలకర్ణు గమల వర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహు
భద్రేభవదను సద్భక్తసదను
సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
ననుదినామోదు విద్యాప్రసాదు
బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు
నురుతరఖ్యాతు నాగోపవీతు

లోకవందిత గుణవంతు నేకదంతు
నతుల హేరంబు సత్కరుణావలంబు
విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు
బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!

వినాయకుడు: చాలా బావుంది! సీసంలోని తూగు మరే పద్యానికొస్తుంది! అన్నట్టు సీసమనగానే గుర్తుకొచ్చింది. అసలుసిసలు తెలుగుకవి, మీ శ్రీనాథ కవిసార్వభౌముడు నా గురించేమీ రాయలేదా?

నేను: అయ్యో పొరపాటైపోయింది స్వామీ! మరచిపోయాను. ఇదిగో మీ గురించి అతను రాసిన సీసం!

కలితశుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజలధరములు
వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్నమేఖలములు
పక్వ జంబూఫల ప్రకటసంభావనా
చుంబిత భూభృత్కదంబకములు
వికట కండూల గండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు

శాంభవీశంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి గావించు గాత!

వినాయకుడు: అబ్బబ్బా! ఏవి ధారా, ఏవి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ ధారాధుని అని పిలిచేది. సెభాష్!
అవునూ, నువ్వందరూ పాతకవులనే చెప్తున్నావ్, ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి?

నేను: అయ్యో లేకేం స్వామీ! పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే, ఏకంగా ఒక పద్య ఖండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే, కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు "నమస్తే" చెప్పారు.

వినాయకుడు: అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీవాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారుచేసారో, ఎన్నెన్ని పిండివంటలు చేసారో చూడ్డానికి వాహ్యాళికి వెళ్ళాలి. నువ్వు కూడా తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలి కదా! మచ్చుకి ఒక్క పద్యం వినిపించు చాలు. ఆనక మిగతావి వింటాను.

నేను: సరే అలాగే స్వామీ! చిత్తగించండి.

ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరుగెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా!" యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట

అమరులందగ్ర తాంబూలమందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!

వినాయకుడు: నేను విష్ణుమూర్తిని "నల్ల మామా" అని ఆటపట్టిస్తానా! ఆహా బలే అయిడియా ఇచ్చాడే ఇతను! ఎంతైనా మీ తెలుగుకవులకి సరసం ఎక్కువే సుమీ!
మొత్తానికివాళ పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం చేసినట్టుంది! బావుంది నీ పద్య నైవేద్యం!
కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తోంది.

నేను: లోటా! ఏవిటి స్వామీ?

వినాయకుడు: మీ తెలుగు కవులు ఇందరిగురించి కావ్యాలు రాసి, నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తోంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి కూడా వెయ్యేళ్ళ కిందటే ఎవరో రాసారని చెప్పావే, మరి ఇన్నాళ్ళై నా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు?

నేను: అవును స్వామీ! మీరు చెప్పే దాకా నాక్కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది.

వినాయకుడు: పోనీలే. ఇంతమంది రాసిన పద్యాలు చెప్పేవు కదా. సొంతంగా నువ్వొక్క పద్యం నా గురించి యిప్పుడు చెప్పకూడదూ. విని దానితోనే సంతృప్తి పడతాను.

నేను: అయ్యో అంత కన్నా మరో భాగ్యం ఉంటుందా! అవధరించండి!

శ్రీకంఠుని సతి ప్రేమకి
ఆకారమ్మైన సామి! హరుని దయన్ నూ
త్నాకృతి దాల్చిన గజముఖ!
చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగ మాకున్!

నేనిలా పద్యం చదివానో లేదో, అలా అదృశ్యమైపోయాడా గణనాథుడు! నా పద్య ప్రభావమేనో ఏమో! సరే పొద్దున్న యథావిథిగా పూజా కార్యక్రమాలు సాగించి, మా ఆవిడ చేసిన పిండివంటలు స్వామికి నైవేద్యం పెట్టి నేను తిని, ఇదిగో నా నైవేద్యాన్ని మీ ముందు పెట్టాను. ఆరగించండి మరి!


పూర్తిగా చదవండి...

Sunday, August 31, 2008

కళలనెలవుకో నూలుపోగు




ఈ కందాన్ని చూడగానే తెలిసిపోతుంది దీని విశిష్టత ఏంటో. ఇది బహుభాషా కందం. ఉత్సాహవంతులు కొందరు ఇంగ్లీషులో పద్యాలు రాయడం మన బ్లాగర్లకి పరిచయమైన విషయమే! ఇది ఒక భాషలో కాదు, నాలుగు భాషల్లో ఉన్న కందం. మూడు నాలుగు పాదాలందరికీ తెలిసిన భాషలే, ఇంగ్లీషు, తెలుగు. రెండో పాదం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది సంస్కృతం. ఇకపోతే మొదటి పాదం, ఇది పారసీ భాష. ఈ పద్యాన్ని రాసింది శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు. ఇది చిత్రకవిత్వమో, కేవలం సరదాకి రాసినదో కాదు. దీంత్లో ఎంతో ఔచిత్యం ఉంది. అది తెలియాలంటే ఈ పద్యం ఎందులోదో తెలుసుకోవాలి.

ఉమర్ ఖయాము రుబాయెతుల గురించి చాలామంది వినే ఉంటారు. ఆ రుబాయెతులని ఎందరో తమ తమ భాషల్లోకి అనువదించారు. తెలుగులో కూడా చాలామంది అనువదించారు. దాసుగారు కూడా వాటిని అనువదించారు. అందులోని ప్రార్థనా పద్యం ఇది. చాలామంది అనువాదాలకి ఇంగ్లీషులో Fitzgerald అనువాదమే ఆధారం. నారాయణదాసుగారు మాత్రం పారసీ భాష నేర్చుకొని నేరుగా పారసీ భాషలోని రుబాయతులని అనువదించారు. ఇంగ్లీషులోని Fitzgerald అనువాదాన్ని సంస్కృతంలోకి అనుష్టుప్ ఛందస్సులోనీ, తెలుగులోకి కంద పద్యాల్లోనీ అనువదించారు. పారసీలో ఉన్న మూలాన్ని మళ్ళీ తెలుగులో గీతి, భుజంగీ ఛందస్సులలో అనువదించారు! ఈ గ్రంధంలో మూల పారసీ రుబాయతూ, ఇంగ్లీషులో Fitzgerald అనువాదమూ, తన సంస్కృత తెలుగు అనువాదాలూ అన్నీ వరసగా ఇచ్చారు. మరి అలాటి గ్రంధానికి మొదట్లో ఇలాటి పద్యం ఎంత శొభని చేకూరుస్తుందో వేరే చెప్పాలా!

ఆధిబట్ల నారాయణ దాసు గారిని హరికథా పితామహునిగా చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరో తమిళ అయ్యరు వినిపించిన హరికథని విని, దాన్ని తెలుగుకి అనుగుణంగా మరిన్ని అందచందాలు చేకూర్చి, సంగీత సాహిత్య నాట్య కళా సమాహారంగా హరికథని తెలుగులో దిద్దితీర్చి దానికి ప్రాచుర్యాన్ని కల్పించిన వారు దాసుగారు. దాసుగారి సంగీత ప్రావీణ్యం అపారం. ఇతని గానం విని ఠాగూరు ముగ్ధులయ్యారట. ఠాగూరు విజయనగరం వచ్చి ఉపన్యాసమిచ్చినప్పుడు, దాసుగారు వెనకనెక్కడో కూర్చుంటే, స్వయంగా వెళ్ళి పలకరించి అతని గానం ఇంకా తన చెవులలో రింగుమంటోందని చెప్పినప్పుడు దాసుగారు పరమానందం చెందారు.

ఆదిభట్లవారు సంస్కృతాంధ్ర సాహిత్యాలలో కూడా విశేషమైన కృషి చేసారు. ఎన్నో రచనలు చేసారు. రెండు సంస్కృత శతకాలూ, అయిదు తెలుగు శతకాలూ రచించారు. అందులో ఒకటి సీసాలలో రాసిన అచ్చ తెలుగు శతకం. మరొకటి ఆనందగజపతి రాజుగారిచ్చిన "సతము సంతసమెసంగు సత్యవ్రతికిన్" అన్న సమస్యకి పూరణగా ఆశువుగా చెప్పిన శతకం.
ఆదిభట్లవారు అనేక కావ్యాలు రాసారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది బాటసారి పద్య కావ్యం. ఇదొక Allegory, ధ్వని కావ్యం అనవచ్చు. అంటే బయటకి ఒక కథా, పాత్రలూ కనిపించినా అంతర్గతంగా మరొక విషయాన్ని సూచిస్తూ సాగే రచన. నారాయణదాసుగారి అనువాద రచనల్లో గొప్పది రుబాయెతుల అనువాదం. నేరుగా మూలం నుంచి అనువదించడం, క్లుప్తతకి ప్రాధాన్యమివ్వడం ఈ అనువాదాన్ని గొప్ప అనువాదం చేసాయని అనిపిస్తుంది. ఒక్క ఉదాహరణ:

The Worldly Hope men set their Hearts upon
Turn Ashes - or it prospers; and anon,
Like Snow upon the Desert's dusty Face,
Lighting a little hour or two - was gone.

దీనికి తెలుగు అనువాదాలు:

మెయితాల్పు బ్రదుకు కోరిక
నయముగ దొలుదొలుత దోచినన్ బిమ్మట నె
మ్మెయి నయిన జెడున్! రగిలిన
పొయిమీదన్ రాలు మంచుబుగ్గ తెఱగునన్!

తలచు మిదెల్ల డెందమ, కల్లయనుచు
నవియివి నీకులోనై యున్నవనుచు
మంచు చిన్కిసుకపై మాయమౌనట్లు
పోవు నీ మూనాళ్ళ ముచ్చట బ్రతుకు!

నారాయణదాసుగారు ఉమర్ ఖయాముని అనువదించడంలో మరో విశేషముంది. నారాయదాసుగారి అసలు పేరు సూర్యనారాయణ. వారి తండ్రిగారిలాగానే ఆదిభట్లవారు కూడా సూర్యుని ఉపాసించేవారు. ఖయాము కూడా సూర్యోపాసకుడని ఆదిభట్లవారి నమ్మకం! ఖయాము రుబాయత్లలో మొదటిది "ఖుర్షీద్"అన్న పదంతో మొదలవుతుంది. దాని అర్థం సూర్యుడు. సూర్యోదయంతో మొదలయిందా కావ్యం.

ఇలా రాసుకుంటూ పోతే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. ఆదిభట్లవారి సర్వతోముఖ కళా వైదుష్యం అనంతమైనది. అతని సారస్వతాన్ని మొత్తం సమీక్షించిన పుస్తకం జోగారావుగారి సంపాదకత్వంలో వచ్చిన "సారస్వత నీరాజనము". Digital Libraryలో దొరుకుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు. అలానే ఆదిభట్లవారి ఇతర కృతులు బాటసారి, రుబాయెతులు మొదలైనవి కూడా Digital Libraryలో ఉన్నాయి.
జోగారావుగారు నారాయణ దాసుగారి అనంతమైన సారస్వత ప్రతిభకి పట్టిన నీరాజనం యీ పద్యం:

"నాయవి నాల్గుమోము లవునా! యెటు ముద్దిడె" దంచు నల్వ ఆ
ప్యాయముగా హసింపగ, "ననంత ముఖన్ నను నెట్లు ముద్దిడం
బోయెదొ!" యంచు జెల్వ నగ, "ముద్దిడెదం గను"మంచు నల్వ నా
రాయణదాసు కాగ ద్రపనందు సరస్వతికిన్ నమస్కృతుల్!"

ఈ రోజు ఆదిభట్ల నారాయణదాసుగారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ కళలనెలవుకి నేనిచ్చే నూలుపోగే ఈ చిన్న టపా!


పూర్తిగా చదవండి...

Saturday, August 23, 2008

శ్రీకృష్ణ లీలామృతం


ఈ రోజు కిట్టయ్య పుట్టినరోజు. తెలుగువాళ్ళెవరికైనా కృష్ణుణ్ణి తలచుకోగానే,

శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోల విలసత్ దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకున్

అంటూ, గోర్వెచ్చని పాలమీగడలకన్నా తియ్యనైన భాగవతాన్ని మనకందించిన పోతన తలపులోకి రాకమానడు కదా! ఆ పోతన తన భాగవతంలో, ముచ్చటగా వర్ణించిన శ్రీకృష్ణలీలలని తలచుకొని ఆనందిద్దామా మరి!

అదుగో దేవదేవుడు, దేవకిపంటగా శ్రీకృష్ణనిగా అవతరిస్తున్నాడు. ప్రకృతి ఆనందముతో ఉప్పొంగుతోంది:

స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును
గల ఘోషణములు మేఘంబు లుఱిమె
గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె
దిక్కులు మిక్కిలి తెలివి దాల్చె
గమ్మని చల్లని గాలి మెల్లన వీచె
హోమానలంబు సెన్నొంది వెలిగె
గొలకుల కమలాళికులముపై సరినొప్పె
బ్రవిమల తోయలై పాఱె నదులు

వర పుర గ్రామ ఘోషయై వసుధ యొప్పె
విహగ రవ పుష్ప ఫలముల వెలసె వనము
లలరుసోనలు గురిసి రయ్యమరవరులు
దేవదేవుని దేవకీదేవి గనగ!

అరే, అంతలోనే అదుగో వసుదేవుడా బాలుణ్ణి పొత్తిళ్ళలో ఎత్తుకొని ప్రయాణమవుతున్నాడే!

బిడ్డని గరముల ఱొమ్మున
నడ్డంబుగబట్టి పదము లల్లన యిడుచున్
జడ్డన గావలివారల
యొడ్డు గడచి పురిటిసాల యొయ్యన వెడలెన్

ఆ హరికి స్వయంగా యమునా నది దారిస్తోంది చూసారా! అలనాడు శ్రీరామచంద్రునికి సముద్రుడు త్రోవిచ్చినట్టే లేదూ!

ఆ శౌరికి దెరువొసగె బ్ర
కాశొద్ధత తుంగభంగ కలిత ధరాశా
కాశ యగు యమున మును సీ
తేశునకు బయోధి త్రోవ యిచ్చిన భంగిన్

ఇంకేముంది, నందుని యింట వెలసా డానంద గోపాలుడు. రేపల్లే ఇక అతని యిల్లు! ఈ వార్త రేపల్లె మగువలకి తెలిసిపోయింది. ఇంకేం, చూడ్డానికి ఇరుగమ్మని పొరుగమ్మనీ వెంటపెట్టుకొని బయలుదేరారు.

ఏమి నోము ఫలమొ యింత ప్రొద్దొక వార్త
వింటి మబలలార వీను లలర
మన యశోద చిన్ని మగవాని గనెనట
చూచివత్తుమమ్మ సుదతులార

ఆ పసి బాలునికి అన్ని సపర్యలూ జరుగుతున్నాయి. ఉయ్యాలలూగిస్తూ జోలపాటలెలా పాడుతున్నారో వినండి:

జోజో కమలదళేక్షణ
జోజో మృగరాజమధ్య జోజో కృష్ణా
జోజో పల్లవకరపద
జోజో పూర్ణేందువదన జోజో యనుచున్

లోకాలని జోకొట్టి నిద్రపుచ్చే ఆ దేవదేవునికి నిద్రేమిటి! అయినా వాళ్ళకోసం కళ్ళుమూసుకొని నిద్ర నటిస్తున్నాడు.

లోకములు నిదురవోవగ
జో కొట్టుచు నిదురవోని సుభగుడు రమణుల్
జోకొట్టి పాడ నిదురం
గైకొను క్రియ నూరకుండె గనుదెఱవాయున్

అంతలో రాకాసి పూతన రానే వచ్చింది. చన్నిచ్చే నెపంతో ఆ పసివాని ప్రాణం తియ్యాలని. అక్కడున్నది పసిబాలుడా? పాలని త్రాగుతూ త్రాగుతూ పూతన ప్రాణాల్ని కూడా గుటగుటా తాగేశాడా బాలకృష్ణుడు! చచ్చిపడింది పూతన.

మేల్కొన్న తెఱగున మెల్లన కనువిచ్చి
క్రేగంట జూచుచు గిదికి నీల్గి
యావులించుచు జేతులాదరంబున జూచి
యొదికిలి యాకొన్న యోజనూది
బిగిచన్నుగవ గేల బీడించి కబళించి
గ్రుక్క గ్రుక్కడు గుటు గుబుకు మనుచు
నొకరెండు గ్రుక్కల నువిద ప్రాణంబులు
సైతము మేనిలో సత్త్వమెల్ల

ద్రావె నదియును గుండెలు దల్లడిల్ల
దిమ్మ దిరుగును నిలివక శిరము వ్రాల
నితర బాలుర క్రియవాడ వీవు గావు
చన్ను విడువుము విడువుము చాలు ననుచు

నిబ్బరపు దప్పి మంటలు
ప్రబ్బిన ధృతి లేక నేత్ర పదహస్తంబుల్
గొబ్బున వివృతములుగ నా
గుబ్బాగుబ్బయిన కూత గూలెన్ నేలన్!

విషధరరిపు గమనునికిని
విషగళ సఖునికి విమల విషశయనునికిన్
విషభవభవ జనకునికిని
విషకుచ చనువిషము గొనుట విషమే తలపన్!

విషాన్ని ధరించే పాముల శత్రువైన గరుత్మంతుడిపై తిరిగేవాడూ, విషాన్ని ధరించిన శివుని చెలికాడూ, విషధరమైన శేషునిపై పరుండేవాడూ, విషము(నీరు)నుంచి పుట్టిన పద్మంలోంచి పుట్టిన బ్రహ్మకి తండ్రీ - ఆ జగన్నాథుడు! అతన్ని విషపు చనుబాలు ఏం చేస్తాయి!

చూసారా మన చిన్నికృష్ణుడింతలోనే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు!
రెండడుగులతో నింగీ నేలా ఆక్రమించుకొన్న అతను అడుగులు వెయ్యడం మొదలుపెట్టగానే, అతని శత్రువుల అడుగులు తడబడి కూలబడిపోయారట!

అడుగులు వే గలిగియు రెం
డడుగులనే మన్ను మిన్ను నలమిన బాలుం
డడుగిడ దొరకొనె శాత్రవు
లడుగులు సడుగులును వదలి యడుగవని బడన్

ఆహా ఆ బలరామ కృష్ణుల బాల్యక్రీడలు వర్ణించడం ఎవరి తరం!

తనయీడు గోప బాలురు
దను గొలువగ రాము గూడి తనువు గలుగుచుం
దనుగమనంబున గృష్ణుడు
తను మధ్యలు మెచ్చ నీలతనురుచి దనరెన్

బాల కృష్ణుడప్పుడే నవనీత చోరుడైపోయాడు! గోపాలుర ఇండ్లలో వెన్నంతా దొంగిలించి తిని ఏవీ ఎరగనట్లు వచ్చి తల్లిని బువ్వపెట్టమని అడుగుతున్నాడు చూడండి!

వల్లవ గృహ నవనీతము
లెల్లను భక్షించి వచ్చి యెఱగని భంగిం
దల్లి గదిసి చిట్టాడుచు
నల్లన చను బువ్వ బెట్టు మమ్మా యనుచున్

ఇలా అల్లరి చేస్తే ఆ గోపకాంతలు ఊరుకుంటారా ఏమిటి? వెళ్ళి యశోదకు చెప్పే మిషతో ఆ గోపాలబాలుని కొంటెపనులని ఎంత సొగసుగా వర్ణిస్తున్నారో వినండి మరి!

బాలురకుబాలు లేవని
బాలెంతలు మొఱలువెట్ట బకబక నగి యీ
బాలుండాలము సేయుచు
నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

పడతీ నీ బిడ్డడు మా
కడవలలో నున్న మంచి కాగిన పాలా
పడుచులకు బోసి చిక్కిన
కడవల బో నడచె నాజ్ఞ గలదో లేదో!

చిన్నపిల్లలికి పాలులేవని ఓ మూల బాలెంతలేడుస్తూ ఉంటే, నవ్వుతూ ఆవులవద్దకి పెయ్యలని వదిలిపెట్టాడు! వచ్చి, మేము కడవలలో దాచుకున్న కాగిన పాలన్నీ తీసుకెళ్ళి ఆ బాలెంతలకి పోసాడు. కడవలనేమో పగలుకొట్టేసాడు!
చిన్ని కృష్ణుడి ఆగడాలకి అంతూ పొంతూ ఉందా!

పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చి తా
నుట్టి యందక ఱోళ్ళు బీటలునొల్ల ప్రోవిడి యెక్కి చే
వెట్టజాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ
పట్టి మీగడపాలు జేరల బట్టి ద్రావె తలోదరీ!

ఉట్టిమీద అందకుండా పాలని దాచుకుంటే, ఇంట్లో ఉన్న చిన్న ఱోళ్ళూ పీటాలూ అన్నిటినీ ఎత్తుపెట్టి, ఎక్కి, అయినా కుండలోపలకి చెయ్యిపెట్టడం వీలుకాక ఏం చేసాడో తెలుసా? ఆ కుండకి పెద్దకన్నం పెట్టి ఆ మీగడపాలు చేత్తో జుఱ్ఱుకుంటూ తాగేసాడు!

వారిల్లుసొచ్చి కడవల
దోరంబగు నెయ్యిద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుండిడ
వారికి వీరికిని దొడ్డ వాదయ్యె సతీ!

పాలూ పెరుగూ దొంగతనంగా తిని ఊరుకున్నాడా మీ చిలిపి కన్నయ్య. వాళ్ళింట్లో కడవలు తీసుకొచ్చి వీళ్ళింట్లో పెట్టి వాళ్ళకీ వీళ్ళకీ మధ్య తగువులు పెట్టాడు!

ఓ యమ్మ నీ కుమారుడు
మా యిండ్లను బాలు బెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభు లాన! మంజుల వాణీ!

అమ్మా యశోదమ్మా! నీ కొడుకు మా యిళ్ళల్లో పాలూపెరుగూ యింక ఉండనివ్వడని తేలిపోయింది. మా అన్నల గోవులని నమ్ముకొని ఇంకెక్కడికైనా పోతాం మేము!
ఇలా ఆ రెపల్లె మగువలు గోలపెడితే, అంతా విని యశోద ఏమంది?

చన్ను విడిచి యిట్టటు చన
డెన్నడు బొరుగిండ్ల త్రోవ లెఱుగడు నేడుం
గన్నులు దెఱవని మా యీ
చిన్ని కుమారకుని ఱవ్వ సేయం దగునే!

నా యెదనే వదలిపోని నా చిన్నికృష్ణుడి మీద ఇలా చాడీలు చెప్తారా అంటోంది! అహా ఏమి చోద్యం! ఆ యశోదకు తన నందకిశోరుని మీద ఎంత ప్రేమ!
ఇక కృష్ణుని అల్లరికి అదుపేముంటుంది?
అదిగో మన్ను తినే ఆ కన్నయ్యను చూడండి. అమ్మా తమ్ముడు మన్ను తినేనే అని చెప్తున్న ఆ రామన్నను చూడండి. ఎంత ప్రేమైతే మాత్రం మన్ను తిన్నాడంటే ఊరుకుంటుందా ఆ తల్లి, అన్నా అని చెవినులిమి యశోద, "ఏదన్నా నీ నోరుచూపూ" అంది. ఆ దొంగ కృష్ణుడు ఎంత అమాయకంగా మొహం పెట్టాడో చూడండి. పైగా మన్ను తినడానికి తనేం వెఱ్ఱివాడినా అంటున్నాడు:

అమ్మా మన్నుదినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్రినో
నమ్మంజూడకు వీరిమాటలు మదిన్ నన్నీవు గొట్టంగ దా
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ దప్పైన దండింపవే!

నా నోటివాసన చూడు కావలిస్తే అని నోరు తెరిచాడు. ఇంకేముంది! అందులో సమస్త భువనాలూ కనిపించాయి! ఆ రూపాన్ని చూసిన యశోద ఏమనుకుంది?

కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్ నేరక యున్నదాననొ యశోదాదేవినే గానో పర
స్థలమో బాలకుడెంత యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమిహేతువొ మహాశ్చర్యంబు జింతింపగన్!

కలా వైష్ణవమాయా అనుకుంది! తనసలు యశోదాదేవినేనా అన్న సందేహం కలిగింది! యశోద తాపము నశియించి జన్మ ధన్యత గాంచింది!
కానీ తర్వాత మళ్ళీ మామూలే. ఆ స్పృహని మాయ కమ్మేసింది. లేకపోతే చిన్నారి శ్రీకృష్ణుడి చిలిపి ముచ్చట్లని తల్లిగా ఎలా అనుభవించగలదు?
కృష్ణుని ఆగడాలు మళ్ళీ మామూలే. ఇక లాభంలేదు, ఇతన్ని పట్టుకొని రోటికి కట్టేస్తే కాని ఈ ఊరిమీద పెత్తనాలు ఆగవని నిశ్చయించుకుంది యశోద. కాని అంత సులువుగా పట్టుబడతాడా కృష్ణుడు! ఘల్లు ఘల్లుమనే గజ్జలతో ఇటూ అటూ పెరిగెట్టాడు బాల గోపాలుడు.

గజ్జెలు గల్లని మ్రోయగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షిజ్జనములు నగ దల్లియు
బజ్జం జనుదేర నతడు పరువిడె నధిపా!

మొత్తానికి అతన్ని పట్టుకుంది యశోద! పట్టుకొని ఏమంటోంది? "ఓహో! మీరేనా శ్రీ కృష్ణులంటే! మీకు వెన్నంటే అసలు తెలీదటకదా! దొంగతనమే చెయ్యరట కదా! అహా, ఈ భూలోకమంతటా మీ అంతటి బుద్ధిమంతులసలు ఉన్నారా?" అంటోంది!

వీరెవ్వరు శ్రీకృష్ణులు
గారా యెన్నడును వెన్నగానరట కదా!
చోరత్వంబించుకయును
నేరరట ధరిత్రి నిట్టి నియతులు గలరే!

"నువ్వెవరికీ పట్టుబడవని అందరూ అంటారే. నేను తలచుకొంటే నిన్ను పట్టుకోవడం ఒక పెద్ద పనా! నాకు కాక నువ్వెవరికి పట్టుబడతావు?" అని కూడా అంటోంది. నిజంగానే ఎవరికీ చిక్కని ఆ పరమాత్ముడు యశోదకి చిక్కాడు.

పట్టిన బట్టువడని నిను
బట్టెద నని చలముగొనిన బట్టుట బెట్టే
పట్టువడవండ్రు పట్టీ
పట్టుగొనన్ నాకుగాక పరులకు వశమే!

అలా పట్టుకొన్న కృష్ణుణ్ణి యశోద అదుగో ఆ రోటికి కట్టేసింది.

ఆ లలన గట్టె ఱోలన్
లీలన్ నవనీత చౌర్యలీలున్ బ్రియ వా
గ్జాలున్ బరివిస్మిత గో
పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్!

చిక్కడు సిరికౌగిటిలో
జిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్
జిక్కడు శ్రుతిలతికావలి
జిక్కె నతడు లీల దల్లి చేతన్ ఱోలన్!

అపళంగా ఆ కృష్ణుడేం చేసాడు? ఊపున పోయి పెరట్లో ఉన్న మద్ది చెట్లు రెండిటినీ కూల్చేసాడు!

ముద్దుల తక్కరి బిడ్డడు
మద్దుల గూల్పంగ దలచి మసలక తా నా
మద్దికవ యున్న చోటికి
గ్రద్దన ఱోలీడ్చుకొనుచు గడకం జనియెన్

బాలుడు ఱోలడ్డము దివ
మూలంబులు వెకలి విటపములు విఱిగి మహా
భీల ధ్వని గూలెను శా
పాలస్య వివర్జనములు యమళార్జునముల్

ఆ మద్దిచెట్లు కూకటి వేళ్ళతో సహా పెకలించబడి విరిగి పడిపోయాయి. శాపగ్రస్తులైన నలకూబర మణిగ్రీవులకి శాపవిమోచనమయ్యింది!

ఇంతలో అందరూ రేపల్లెని విడిచి బృందావనం చేరుకున్నారు. ఇది శ్రీకృష్ణుని రక్షణ కోసమట. సర్వ జగద్రక్షణుడైన ఆ హరికి రక్షణా! అతడే అందరినీ కాపాడేవాడు. అక్కడ కాళింది మడుగులో కాళీయుడున్నాడు. అతన్నుంచి ఈ గోపాలురందరినీ రక్షించాలని నిశ్చయించుకున్నాడు మన గోపాలపాలుడు! ఇంకేముంది. అన్నుకున్నదే తడవు, చెట్టెక్కి ఆ నదిలోకి దూకబోతున్నాడు. ఆహా ఆ సుందర దృశ్యాన్ని ఎంత సొగసుగా వర్ణించాడు పోతన! స్వయంగా కళ్ళతో చూసినట్టు, కళ్ళకు కట్టేట్టు ఉంది చూడండి.

కటి చేలంబు బిగించి పింఛమున జక్కం గొప్పు బంధించి దో
స్తట సంస్ఫాలన మాచరించి చరణ ద్వంద్వంబు గీలించి త
త్కుట శాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాల సింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానంబనూనంబుగన్

నడుం చుట్టూ తన చేలాన్ని బిగించాడు. పింఛంలో కొప్పుని సరిచేసుకున్నాడు. రెండు జబ్బలూ చరిచాడు. రెండు కాళ్ళనీ అదిమిపట్టి ఒక్కసారిగా ఆ చెట్టుకొమ్మపైనుంచి గభీలుమని ఆ నదిలోకి దూకాడా గోప కిశోరుడు! గుభగుభ మంటూ పెద్ద శబ్దం నలుదిక్కులా కమ్ముకుంది.
అంతే. ఆ కాళీయునితో యుద్ధం చెయ్యడం అతని పీచమడచడం అయిపోయాయి. అహా! కాళీయఫణి ఫణజాలాన ఝణ ఝణ మంటూ కేళి ఘంటించిన ఆ గోప కిశోరమూర్తి ఎంత మనోహరంగా ఉన్నాడు!

ఘన యమునానదీ కల్లోల ఘోషంబు
సరస మృదంగ ఘోషంబుగాగ
సాధు బృందావనచర చంచరీక గా
నంబు గాయక సుగానంబుగాగ
గలహంస సారస కమనీయ మంజు శ
బ్దంబులు దాళ శబ్దములుగాగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది
జనులు సభాసీన జనులుగాగ

బద్మరాగాది రత్న ప్రభాభాసమాన
మహిత కాళియ ఫణిఫణా మండపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్యనైపుణ్యమున బేర్చి నృత్యమాడె!

యమునానది అభంగ తరంగాలు మృదంగనాదం చేస్తున్నాయి. బృందావనంలో తిరుగాడే తుమ్మెదలు ఝుమ్మని గానం చేస్తున్నాయి. కలహంస, సారసములు సొంపైన నడకతో తాళాన్ని వేస్తున్నాయి. పైనున్న దేవతలందరూ ప్రేక్షకులయ్యారు. మణులు పొదిగున్న ఆ కాళీయుని పడగ రత్నవేదికగా మారింది. ఆ పద్మాక్షుడు తన సహజ ప్రతిభతో అక్కడ నృత్యం చేసాడు!

బృందావనమంతా ఒక ప్రశాంత వాతావరణం నెలకొంది. గోపాలుడు మురళీ లోలుడయ్యాడు. ఆ మోహన రూపాన్ని, ఆ మనోహర గానాన్ని చూసి గోపబాలలంతా పులకిస్తున్నారు.

శ్రవణోదంచిత కర్ణికారకముతో స్వర్ణాభ చేలంబుతో
నవతంసాయిత కేకిపింఛకముతో నంభోజ దామంబుతో
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబు బూరించుచు
న్నువిదా మాధవు డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే!

చెవులకి ఆనందమైన చెవికమ్మ, బంగారు చేలము, శిఖగా చేయబడిన పింఛము, మెడలో తామరపూల దండ. తరగని సౌందర్యంతో, తనలో తాను లీనమై తన పెదాల అమృతంతో ఆ వేణువుకి జీవం పోస్తున్న ఆ మాధవుని చూడండని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు.

గిరులెల్ల జలము లయ్యెం
దరులెల్లను బల్లవించె, ధరణి గగన భూ
చరు లెల్లను జొక్కిరి హరి
మురళిరవామృతము సోక ముద్దియ కంటే!

ఆ గానానికి కొండలు కరిగాయి. చెట్లు పుష్పించాయి. ముల్లోకాలలోని జీవజాలమంతా ఆ మురళీ గానామృతంలో తన్మయమయ్యింది!

అంతలోనే మళ్ళీ ఓ ప్రమాదం ముంచుకొచ్చింది. తనకి పూజలు చెయ్యొద్దన్నాడని కృష్ణుడిమీద ఇంద్రునికి కోపం వచ్చింది. ఆ బృందావనంలో ప్రజలందరినీ శిక్షించాలనుకున్నాడు. రాళ్ళ వర్షం కురిపించాడు. అయినా ఆ పరమాత్ముని పాలనలో ఆ గోపాల బృందానికి ఆపదలు వస్తాయా?

బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతో గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్ వలకేల దాల్చి విపులచ్ఛత్త్రంబుగా బట్టె నా
భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోప గోపంక్తికిన్!

ఆడుతూ ఆడుతూ వెళ్ళి - అదేదో గొడుగనుకున్నాడు కాబోలు, పూలగుత్తి నెత్తినంత సులువుగా గోవర్ధన గిరిని తన కుడిచేత్తో ఎత్తేసాడు. చిరునవ్వుకూడా చెరగలేదు! చిటికిన వేలిపై ఆ కొండని నిలబెట్టి, నింగినుండి కురుస్తున్న రాళ్ళ వర్షానికి చకితులైన ఆబాలగోపాలాన్నీ పిలుస్తున్నాడు. ఏమని?

బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా
జాలండో యని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా
కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం బ్రమోదంబునన్!

నేనేదో చిన్న కుఱ్ఱాణ్ణీ, ఈ పెద్ద కొండని మొయ్యగలనా అని సందేహించకండి అంటున్నాడు! బలే కృష్ణా! అంత పెద్ద కొండని ఎత్తిపట్టుకోడం చూసిన ఆ జనులకి నువ్వొక చిన్న పిల్లాడిలా అసలు కనిపిస్తావా? అయినా కొందరు మందబుద్ధుల సందేహాలని పూర్తిగా పోగొట్టాలనుకుంటున్నావు, అంతే కదా! ఈ కొండలూ, సముద్రాలూ, జంతుజాలము సమస్తమూ నిండిన భూవలయమే పైబడినా నా చేయి అల్లాడదు, హాయిగా నిశ్చింతగా ఇక్కడకి రండని పిలిచాడు.
అహా! ఆ గోకులానిది ఎంత అదృష్టం! లోక సంరక్షకుడైన ఆ కృష్ణుని రక్షణ దొరకింది.

అసలే కృష్ణుడు మోహనాకారుడు. మనోహరుడు. నవనీత చోరుడే కాదు, నవలామానస చోరుడు కూడా అయ్యాడు! బృందావనంలోని గోపికలందరి హృదయాల్లోనూ అతనే నిండిపోయాడు. అద్దమ రేయి బయలుదేరి, ఇల్లూవాకిలీ వదిలేసి, అతని వద్దకు పరుగుపరుగున వచ్చేసారు! ఏవీ ఎరగనట్టు కృష్ణుడు, ఇదేమిటని అడిగితే, తమ గోడుని విన్నవించుకుంటున్నారు.

నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱగాని
తరలి పోవంగ బాదములు రావు
నీ కరాబ్జంబులు నెఱి నంటితివగాని
తక్కిన పనికి హస్తములు సొరవు
నీ వాగమృతధార నిండ గ్రోలగగాని
చెవులన్య భాషలు సేరి వినవు
నీ సుందరాకృతి నియతి జూడగ గాని
చూడ వన్యంబుల జూడ్కి కవలు

నిన్న కాని పలుకనేరవు మా జిహ్వ
లొక్క ననుచు బలుక నోడ వీవు
మా మనంబు లెల్ల మరగించి దొంగిలి
తేమి సేయువార మింక కృష్ణ!

ఎంతటి భక్తి పారవశ్యమది! మా మనసులని మరిగించి దొంగిలించుకు పోయావు, ఇంక మేమేమి చెయ్యగలమని వేడుకొన్నారు. కానీ కృష్ణుడు వాళ్ళనింకా పరీక్షించాలనుకున్నాడు. కనపడకుండా మాయమయ్యాడు. అతని కోసమా బృందావనమంతా వెతుకుతున్నారు పాపం గోపికలు.

నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచె నో
మల్లియలార మీ పొదలమాటున లేడుగదమ్మ చెప్పరే!

మల్లెపొదలమాటున దాక్కున్నాడేమోనని ఆ మల్లెపూలని అడిగారు. ఊహూ జవాబు లేదు! అలా చెట్టూ పుట్టా వెతికినా కృష్ణుడు దొరకలేదు.

గోవుల వెంట ద్రిమ్మరుచు గొల్చినవారల పాపసంఘముల్
ద్రోవగ జాలి శ్రీ దనరి దుష్టభుజంగ ఫణాలతాగ్ర సం
భావితమైన నీ చరణపద్మము చన్నుల మీద మోపి త
ద్భావజపుష్పభల్లభవ బాధ హరింపు వరింపు మాధవా!

అంటూ, గోపికా గీతికలాలపించారు. కృష్ణుని నవనీత హృదయం కరిగింది. వాళ్ళను చేరుకున్నాడు.

పాయని గేహశృంఖలల బాసి నిరంతర మత్పరత్వముం
జేయుచునున్న మీకు బ్రతిసేయ యుగంబులనైన నేర నన్
బాయక గొల్చుమానసము ప్రత్యుపకారముగా దలంచి నా
పాయుట దప్పుగా గొనక భామినులార కృపన్ శమింపరే!

నామీద నిరంతరమూ మీకున్న ఈ భక్తి తత్పరతకి నేను యుగయుగాలైనా బదులు తీర్చుకోలేనన్నాడు. వాళ్ళనలా విడిచి వెళ్ళిపోవడం తప్పుగా భావించక దయతో శాంతించమన్నాడు. కృష్ణుడు తమని చేరుకోవడం కన్నా శాంతి మరేముంది ఆ గోపికలకు.

ఆ సమయంబునన్ విభుడనంతుడు కృష్ణుడు చిత్రమూర్తియై
చేసెను మండలభ్రమణశీల పరస్పర బద్ధ బాహు కాం
తా సువిలాసమున్ బహువిధ స్ఫురితానన హస్త పాద వి
న్యాసము రాసముం గృత వియచ్చర నేత్ర మనోవికాసమున్!

లీలామానుష స్వరూపుడైన ఆ స్వామి, అనంత మూర్తులని ధరించి, ప్రతి గోపిక మధ్యా ఒక కృష్ణుడై, వాళ్ళతో చేయీ చేయీ కలిపాడు. అందరూ చక్రాకారంలో నిలుచుని నాట్యం చేసారు. అదే రాసకేళి. ఆ విరళీకృత నవ రాసకేళిలో అందరూ పరమానందంగా ఓలలాడారు!

అప్పుడా దివ్యమోహన సుందరమూర్తి ఇలా ఉన్నాడు:

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేచ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ!


పూర్తిగా చదవండి...

Friday, August 22, 2008

ప్రారంభించిన వేదపాఠమునకున్...


ఓ తెలుగింటి ఆడపడుచు పుట్టింటికి వచ్చింది. చాన్నాళ్ళై చూడని తమ్ముడు ఇంట్లో లేడు. కొంతసేపటికి వచ్చాడు. రాగానే ఆప్యాయమైన ఆ పలకరింపు ఎలా ఉంటుంది?
"ఏరా తమ్ముడూ బొత్తిగా నల్లపూసవైపోయావు? సెలవలే దొరకటం లేదా! నిన్నుచూడాలని కళ్ళుకాయలుకాచిపోయాయి మాకు! నువ్వెటూ రాలేదు, ఆఖరికి మేమే వచ్చాం..." ఇలానే కదా సాగుతుంది. ఇది పద్యంలో పెడితే ఎలా ఉంటుంది?

ప్రారంభించిన వేదపాఠమునకున్ బ్రత్యూహమౌనంచునో
ఏరా తమ్ముడ! నన్ను జూడ జనుదే వెన్నాళ్ళనో యుండి, చ
క్షూ రాజీవయుగంబు వాచె నిను గన్‌గోకున్‌కి, మీ బావయున్
నీ రాకల్ మదిగోరు జంద్రుపొడుపున్ నీరాకరంబుంబలెన్

అసలు సందర్భం తెలిస్తే ఇక్కడ పైకి కనిపించే ఆప్యాయత వెనకాల ఎంత వెటకారముందో అర్థమవుతుంది. ఆ తమ్ములుంగారు నిగమశర్మ. అతని అక్క అతని అక్కే, నిగమశర్మ అక్క. నిగమశర్మ చక్కని సదాచారుడైన వేదపండితుని యింట పుట్టీ, కాస్తైనా చదువుకొని కూడా వ్యసనాలకి బానిసైపోయి భ్రష్టుపట్టి పోతాడు. కన్న తల్లిదండ్రులనీ కట్టుకున్న భార్యనీ పట్టించుకోకుండా, ఉన్న సంపదనంతా తగలేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇతని అక్కగారు చక్కగా వేరే ఊళ్ళో భర్తా పిల్లతో సంసారం చేస్తూ ఉంటుంది. ఆవిడకి తన తమ్ముడి సంగతి తెలుస్తుంది. పాపం ఆపేక్షతో తన తమ్ముణ్ణి చక్కదిద్దాలని పుట్టింటికి సపరివారంగా వస్తుంది. చూస్తే తమ్ముడు కనపడడు. ఇల్లేమో పాడుపడినట్టుంటుంది. ఇంటిని కాస్త చక్కదిద్ది తమ్ముడికోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకతడు పొద్దున్నే ఊడిపడతాడు, ఇంత చద్దన్నం తిని మళ్ళీ పోవడానికి. అక్కని చూసి ఆశ్చర్యపోతాడు. తనకి క్లాసుపీకడానికే వచ్చిందని అర్థమయ్యే ఉంటుంది నిగమశర్మకి. అయితే ఆ అక్కగారు చాలా తెలివైనది. వచ్చీ రాగానే మొదలుపెడితే ఎదోలా మళ్ళీ ఉడాయిస్తాడని ఆవిడకి తెలుసు. తెలివిగా తమ్ముడిపై ఆప్యాయత చూపి చక్కగా స్నానం అదీ చేయించి, కమ్మని భోజనం పెట్టి, మరదలిచేత తాంబూలం ఇప్పించి అప్పుడు తీరిగ్గా పరామర్శించడం మొదలుపెడుతుంది. అదుగో సరిగ్గా అప్పుడు వచ్చే పద్యం ఇది!

ఈ కథ తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మాహాత్మ్యంలోనిది. తెనాలికవి పేరు తెలియని తెలుగువాడుండం చాలా అరుదు. ఇతని పేరుమీదున్న కథలూ, చాటువులూ అబ్బో ఎన్నో ఎన్నెన్నో! ఇతనికున్న "వికటకవి" బిరుదు కూడా బ్లాగుజనాలకి కొత్తకాదు :-) అయితే ఇతను రాసిన ఈ "పాండురంగ మాహాత్మ్యం" కావ్యం గురించి తెలుసున్నవాళ్ళు తక్కువేనేమో. ఇదో విచిత్రమైన కావ్యం. రామకృష్ణుడంటే మనికి తెలిసున్న కొంటెతనమంతా ఈ కావ్యంలోనూ కనిపిస్తుంది. బాహాటంగా కాదు, నర్మగర్భంగా! అవ్వడానికి ఇదీ కాళహస్తి మాహాత్మ్యం, శివరాత్రి మాహాత్మ్యం మొదలైనవాటిలాగ భక్తి ప్రబంధమే. కానీ తెనాలి రామకృష్ణుడు ధూర్జటిలా భక్తుడు కాదు. పోనీ రాయల మాదిరి మతప్రచారం చెయ్యడమైనా ఇతని ఉద్దేశంగా కనిపించదు. పెద్దనలాగా రసహృదయుడా అంటే అదీ కాదు! ఇతని మనసు అతిచంచలమైనది, రసాస్వాదన చేసే నిలకడ ఎక్కడిది! మరేవిటీ కావ్యం, ఎందుకు రాసాడూ అని ఆలోచిస్తే, ఇదో పెద్ద వ్యంగ్య(వెటకార) కావ్యంగా, పెద్ద parodyలా అనిపిస్తుంది. ఇందులోని కథలు కాని (చాలావాటికి ఎక్కడా ఆధారం కనిపించదు, ఇతని స్వకపోలకల్పితాలేనేమో), కథనం కాని, మాటల కూర్పుకాని, పద్య నిర్మాణం కాని అన్నిట్లోనూ గర్భితమైన ఒక వ్యంగ్యాన్ని చూడవచ్చు. ఆనాటి సమాజంపై, మనుషులపై ఒక వ్యంగ్యాస్త్రమేమో అనిపిస్తుంది. అయితే ఇదంతా ఖచ్చితంగా, ప్రస్పుటంగా కనిపించదు. అదే తమాషా! సన్నాయి నొక్కులు నొక్కడంలో, పోలీసు దెబ్బలు కొట్టడంలో ఇతను సిద్ధహస్తుడు. సరే విచిత్రమైన మాటల కూర్పుతో చాలాచోట్ల హాస్యాన్నీ విస్మయాన్నీ కూడా పండిస్తాడు.

ప్రస్తుత పద్యానికి తిరిగి వస్తే, ఈ నేపథ్యంలో మళ్ళీ పద్యాన్ని చదవండి. నిగమశర్మ చదువూ సంధ్యా లేకుండా తిరుగుతున్నాడు. ఆ విషయం అక్కగారికి తెలీదనుకొనేంత మూర్ఖుడు కాడతను. మరి మొదలుపెట్టడమే, "నీ వేద పాఠానికి ఆటంకమని చెప్పా చాన్నాళ్ళై మమ్మల్ని చూడ్డానికి రాలేదు" అని అక్కగారడిగితే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి! చీవూ నెత్తురూ ఉన్నవాడికి తగలాల్సిన చోట తగలదూ! పైగా నిన్నుచూడక "చక్షూరాజీవ యుగంబు" వాచిపోయిందంటోంది. కళ్ళనే మాటకి అంత బరువైన సంస్కృత సమాసం (అలంకార సహితంగా) వెయ్యడమెందుకు? ప్రాసకోసమా? మరింత వెటకారం కోసం. ఇప్పటికీ మనం వెటకారానికి అప్పుడప్పుడు కాస్త ఘనమైన పదాలు వాడుతూ ఉంటాం కదా. పైగా "మీ బావ కూడా నువ్వొస్తావని, చంద్రోదయం కోసం ఎదురుచూసే సముద్రంలా ఎదురుచూస్తున్నా"రంటోంది. ఇది మరీ విడ్డూరం! నిజానికి మామూలు తెలుగిళ్ళల్లో అయితే ఇదంత విడ్డూరమైన విషయం కాదు. అక్క భర్తతో బావమరిదికి ఒక ప్రత్యేకమైన చనువు ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక పార్టీ అయిపోయి ఆవిడగారిని ఆటపట్టిస్తూ ఉంటారు. తన తమ్ముడిపై భర్త చూపించే ఆప్యాయతకి ఆ యిల్లాలు మురిసిపోతూ ఉంటుంది. ఆ బంధుత్వంలో సారస్యమే వేరు, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది!
కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. ఈ నిగమశర్మకి బావమాట దేవుడెరుగు తన ఇంట్లోవాళ్ళే పట్టరు కదా! అంచేత ఇలా అనడం మరింత విడ్డూరం. తమ్ముడికి వేస్తున్న మరో చురక. పైగా యిక్కడ యీవిడ కవిత్వం కూడా వెలగపెడుతోంది. చంద్రోదయం కోసం ఎదురు చూసే సముద్రంలా అతని బావ అతని కోసం ప్రతీక్షించాడట. "నీ రాకల్" మదిగోరు అనడంలో మళ్ళీ శ్లేష కూడానూ. పున్నమినాటి చంద్రుడి కళకి "రాక" అని పేరు. భేష్ రామకృష్ణా! బయటకి కనిపించని వెటకారాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్ళడానికి అలంకారాలని ఎంత చక్కగా ఉపయోగించుకున్నావ్!
నిజానికిది రామకృష్ణుని గొప్పతన మనలేం, ఇది తెలుగుభాషలో ఉన్న గుణం. తెలుగు భాషకి అతి సహజంగా ఆ సొంపును తెచ్చిపెట్టే తెలుగింటి ఆడపడుచుల సంభాషణా చాతుర్యం! ఆ సంభాషణా చాతుర్యాన్ని సందర్భోచితంగా పద్యంలో బంధించడం తెనాలి కవి ప్రతిభ.

ఈ పద్యం "ఏరా తమ్ముడ!" అన్న సంబోధనతో మొదలుపెట్టవచ్చు. ఇంచుమించు యథాతథంగా రెండవ పాదాన్ని మొదటి పాదంగానూ, మొదటిపాదాన్ని రెండవ పాదంగానూ మార్చవచ్చు. కానీ మన కవిగారెందుకలా పద్యాన్ని నిర్మించలేదు? పద్యం మధ్యలో సంబోధన రావడంలో ఒక సొగసుంది. "ఏరా తమ్ముడ" అని మొదలుపెడితే మామూలు మాటల్లా (casual talk) కాకుండా ఏదో ఉపన్యాసం మొదలుపెట్టినట్టుంటుంది. ఇక్కడది రక్తి కట్టదు. అది గ్రహించి దానికి తగ్గట్టు పద్యాన్ని నడిపించడం కవి చూపించిన పద్య రచనా శిల్పం.

నిగమశర్మ అక్కని ఇంత గొప్పగా చిత్రించి కూడా ఆవిడకో పేరు ప్రసాదించలేదు! అదే మరి రామకృష్ణుని కొంటెతనం :-) ఇంతకన్నా కొంటెతనం మరొకటి ఉంది. ఈవిడగారు ఎంత నచ్చచెప్పినా మారినట్టు నటిస్తాడే కానీ నిజంగా మారడు నిగమశర్మ. ఓ రోజు డబ్బు దస్కం మూటగట్టుకొని చక్కా ఉడాయిస్తాడు. పొద్దున్న విషయం తెలిసిన ఇంటిల్లపాదీ ఏడవడం మొదలుపెడతారు. నిగమశర్మ పారిపోయినందుకు కాదు, పోతూ పోతూ తమ తమకిష్టమైన వస్తువులు తీసుకుపోయాడనిట! ఆఖరికి ఇంత తెలివీ వ్యక్తిత్వమూ ప్రదర్శించిన ఆ నిగమశర్మ అక్కగారు కూడా తను కొత్తగా చేయించుకున్న ముక్కెర పోయిందని లబోదిబోమంటుందిట! మనుషులలో ఉండే సంకుచిత స్వభావాన్ని వెటకారం చెయ్యడమే రామకృష్ణుని పరమోద్దేశం. అతనికి పాత్రల ఔచిత్యంతో పనేలేదు.

తెలుగు అక్కలందరికీ ఒక ప్రతినిధిలా నిలిచిపోవాలనేమో, ఈ పాత్రకి పేరుపెట్టకుండా "నిగమశర్మ అక్క" అని ఊరుకున్నాడు తెనాలి రామకృష్ణుడు!


పూర్తిగా చదవండి...

Friday, August 15, 2008

స్వతంత్ర భారతి


అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ స్వాతంత్ర్య సమరాన్నీ, దానిలో పోరాడిన దేశభక్తులనీ, త్యాగధనులనీ ఈ రోజు తలచుకోవడం భారతీయులుగా మన కనీస కర్తవ్యం. ఈ సందర్భంగా కరుణశ్రీ "స్వతంత్ర భారతి" పద్యాలు మనసారా ఎలిగెత్తి పాడుకుందాం.
కరుణశ్రీ పద్యాలలో పదలాలిత్యమే కాదు, ఒక ఉత్సాహవంతమైన ధార కూడా ఉంటుంది. గొంతెత్తి పాడుకుంటే నవనవోన్మేషమైన ఒక నూతనోత్తేజం కలిగి మనసు పరవళ్ళు తొక్కుతుంది.
మరింక ఆలస్యం దేనికి...

స్వతంత్ర భారతి
-----------------
గణగణ మ్రోగెరా విజయఘంటలు భారతమాత మందిరాం
గణమున - ద్వారబంధముల గట్టిరి చిత్రవిచిత్ర రత్న తో
రణతతి - వీధివీధుల విరాజిలుచున్న వవే త్రివర్ణ కే
తనములు మేలుకాంచె పరతంత్ర పరాఙ్ముఖ సుప్త కంఠముల్

కంటికి కజ్జలమ్మునిడి, ఖద్దరు చీర ధరించి, నేడు పే
రంటము పిల్చుచున్నది స్వరాజ్యవధూమణి ప్రక్క యింటి వా
ల్గంటులు - కర్ణపేయములుగా ప్రవహించె "స్వతంత్ర భారతీ"
మంటపమందు శాంత సుకుమార మనోహర గాన వాహినుల్!

పాటాగొట్టి పరప్రభుత్వమునకున్, బ్రహ్మాండమౌ శాంతి పో
రాటంబున్ నడిపించినాడు మన వార్థాయోగి ఆంగ్లప్రభుల్
మూటల్ ముల్లెలు నెత్తికెత్తుకొని నిర్మోహాత్ములై సంద్రముల్
దాటంజొచ్చిరి నవ్వుకొన్నవి స్వతంత్ర స్వర్ణ సోపానముల్

నేతాజీ ప్రతిభాప్రతాములు, గాంధీతాత సత్యాగ్రహ
జ్యోతిర్దీప్తులు దేశభక్తుల అఖండోత్సాహముల్ విశ్వ వి
ఖ్యాతంబైన ఆగష్టువిప్లవ మహా గాధల్, సమైక్యమ్ములై
స్వాతంత్ర్యధ్వజ మెత్తె భారత మహాసౌధాగ్రభాగమ్ములన్

లాఠీపోటులు పూలచెండ్లు, చెరసాలల్ పెండ్లివారిండ్లు, ఏ
కాఠిన్యం బయినన్ సుఖానుభవమే, గాంధీ కళాశాలలో
పాఠంబుల్ పఠియించు శిష్యులకు తద్ బ్రహ్మాస్త్ర సంధానమే
పీఠంబుల్ గదలించి సీమలకు బంపెన్ శ్వేతసమ్రాట్టులన్

ప్రస్థానించిరి త్యాగమూర్తులు పవిత్రంబైన శ్రీకృష్ణ జ
న్మ స్థానంబున కేందరో నిహతులైనా రెందరో శౌర్య ధై
ర్య స్థైర్యంబులు చూపి విప్లవ సమిద్రంగమ్ములన్ వారి సు
ప్తాస్థి శ్రేణికలే పునాదులట మా స్వారాజ్య సౌధాలకున్

నీదేనోయి సమస్త భారతము తండ్రీ! ఇంక నీ గడ్డపై
లేదోయీ యధికార మెవ్వరికి పాలింపంగదోయీ! ప్రపం
చాదర్శంబుగ సర్వమానవ సమాహ్లాదంబు సంధిల్ల నీ
వైదుష్య ప్రతిభా విశేషములు విశ్వమ్మెల్ల కీర్తింపగన్!


పూర్తిగా చదవండి...

Thursday, August 7, 2008

పాపాయి పద్యాలు


ఉయ్యాలలో ఊగే పసిపాపాయిని చూస్తే, కాస్తో కూస్తో భావుకత ఉన్న ఎవరికైనా కవిత్వం వస్తుంది. కానీ ఇంత అందమైన కవిత్వం రాదేమో! జాషువా రాసిన యీ పద్యాలు చిన్నప్పుడు తెలుగు పాఠంగా చదువుకున్నాను. కానీ అప్పట్లో కన్నా, పెద్దయ్యాక, ఒక పాపకి తండ్రినయ్యాక, ఆ పాపాయి పసితనపు విలాసాలని స్వయంగా అనుభవించాక, ఇవి మరింత అందంగా కనిపించాయి.
ఆ అనుభూతిని రుచి చూడబోయేవాళ్ళు ఈ పద్యాలు చదివి కొంత ఊహించుకోవచ్చు. రుచి చూసినవాళ్ళు మళ్ళీ ఆ తీపిసంగతులు గుర్తు తెచ్చుకొని మురిసిపోవచ్చు.

బొటవ్రేల ముల్లోకముల జూచి లోలోన
ఆనందపడు నోరు లేని యోగి
తల్లిదండ్రుల తనూవల్లరి ద్వయికి వ
న్నియబెట్టు తొమ్మిదినెలల పంట
అమృతమ్ము విషమను వ్యత్యాస మెరుగ కా
స్వాదించ చను వెఱ్ఱిబాగులాడు
అనుభవించు కొలంది యినుమడించుచు మరం
దము జాలువారు చైతన్యఫలము

భాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు,
నిద్రపోవు, లేచి నిలువలేడు,
ఎవ్వరెరుగ రితని దే దేశమో గాని
మొన్న మొన్న నిలకు మొలచినాడు

నవమాసములు భోజనము నీర మెఱుగక
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి జిమ్ము జానెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిధి
నును జెక్కిలుల బోసినోటి నవ్వులలోన
ముద్దుల జిత్రించు మోహనుండు

బట్ట గట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలలో జేరె గాని
వారమాయెనొ లేదొ మా ప్రకృతి కాంత
తెలిపి యున్నది వీని కాకలియు నిద్ర!

గానమాలింపక కన్నుమూయని రాజు
అమ్మ కౌగిటి పంజరంపు చిలుక
నునుపు(?) కండలు పేరుకొను పిల్ల వస్తాదు
ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఊఊలు నేర్చిన ఒక వింత చదువరి,
సతిని ముట్టనినాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి
తన యింటి కొత్త పెత్తనపు ధారి

ఏమి పని మీద భూమికి నేగినాడొ
నుడువ నేర్చిన పిమ్మట నడగవలయు
ఏండ్లు గడచిన ముందుముందేమొ గాని
యిప్పటికి మాత్ర మే పాప మెఱుగడితడు
(ప్రసవాబ్ధి తరియించి - ప్రసవమనే సముద్రాన్ని దాటి)

ఊయేల తొట్టి యే ముపదేశమిచ్చునో
కొసరి యొంటరిగ నూ కొట్టు కొనును
అమ్మతో తనకేమి సంబంధమున్నదో
యేడ్చి యూడిగము జేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా గేకిసల్ కొట్టుకొనును
మూన్నాళ్ళలోనె ఎప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనును

ముక్కుపచ్చ లారిపోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నపుడు
నాదు పసిడికొండ నారత్నమని తల్లి
పలుకు, పలుకులితడు నిలుపుగాక!


పూర్తిగా చదవండి...

Wednesday, July 30, 2008

రెండు కన్నీటి చుక్కలు


మొన్న మళ్ళీ పేట్రేగిన బాంబుల భీభత్సం మనిషిగా మళ్ళీ సిగ్గుతో చచ్చిపోయేలా...
ఏదో ఆవేశం ఏదో ఆవేదన ఎవీ చెయ్యలేని నిస్సహాయత... రెండు కన్నీటి బిందువులై రాలిపడింది.

మరల చెలరేగె విద్రోహ మారణాగ్ని
మరల కన్నీరు పెట్టెను భరతభూమి
మరల నరజాతి చరిత నెత్తురుల దడిసె
మానవత్వము మరణించె మరల మరల

ఎన్నడైన నరుడు, ఈ మృగత్వము వీడి
పూర్ణుడైన మనిషివోలె యెదిగి
శాంతి లోకమందు స్థాపించునో? చీడ
పురుగు లెక్క పుడమి చెరచి చెడునొ!

రెండు కన్నీటి చుక్కలు, రెండు పద్య
వేదనా పుష్పములు, రాల్చి, వేగ మరచి
తిరిగి యెప్పటి రీతి నే మెరుగనట్లు
బ్రతుకు సాగింతు జీవచ్ఛవమ్ము రీతి...


పూర్తిగా చదవండి...

Thursday, July 24, 2008

సుకవి జీవించు ప్రజల నాలుకలమీద!


ఆధునిక పద్యకవులలో నిస్సందేహంగా ఒక మహోన్నతస్థానాన్ని సొంతంచేసుకొన్న కవి జాషువా. అతని కవిత్వంలోని విస్తృతి, గాఢత, పద్య రచనలోని వాడీ వేడీ అతన్ని గొప్పకవిని చేసాయి. కవికోకిలని చేసాయి. నవయుగ కవిచక్రవర్తిని చేసాయి!

నా కవితావధూటి వదనమ్ము నెగాదిగ జూచి రూపరే
ఖా కమనీయ వైఖరుల గాంచి భళీభళి యన్నవారె నీ
దేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్!

అన్న జాషువా ఆవేదన విన్నప్పుడు కరగని హృదయం ఉంటుందా? అలా అని జాషువా భీరువు కాదు. అతని కవిత్వంలో ఆవేదన ఎంత ఉందో, ఆవేశం తెగింపూ తిరుగుబాటూ కూడా అంతే ఉన్నాయి.

గవ్వకుసాటిరాని పలుగాకుల మూక లసూయచేత న
న్నెవ్విధి దూరినన్, నను వరించిన శారద లేచిపోవునే!
ఇవ్వసుధాస్థలిన్ బొడమరే రసలుబ్ధులు, ఘంటమూనెదన్
రవ్వలురాల్చెదన్, గరగరల్ సవరించెద నాంధ్రవాణికిన్.

అని ప్రతిజ్ఞ పూని, దాన్ని సాధించిన కవి జాషువా. తెలుగుకవిత్వం ఉన్నంతకాలం జాషువా తెలుగువాళ్ళ గుండెల్లో మార్మ్రోగుతునే ఉంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఒకవైపు అచ్చమైన అందమైన అమాయకమైన పసిపాప, మరో వైపు తెలుగుజాతిపై తెలుగుభాషపై ఉప్పొంగే అభిమానం, ఇంకొకవైపు దళితజాతి చైతన్యాన్ని లోకానికి చాటే గబ్బిలం - జాషువా కలానికి అనంత ముఖాలు. అతను రాసిన శ్మశానవాటిక పద్యాలు, ఒక కాలంలో, నోటికి రాని తెలుగువారు అరుదంటే అతిశయోక్తికాదు. పద్యాలలో అభ్యుదయకవిత్వాన్ని రాసినవాళ్ళు మరికొందరున్నా, జాషువా పద్యాలు నా హృదయాన్ని తాకినంతగా మరెవ్వరివీ తాకలేదు.
ఈ రోజు అతని వర్ధంతి సందర్భంగా అతన్ని గుర్తుచేసుకోవడం, మనం మరచిపోతున్న తెలుగుదనాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తుచేసుకోవడమే! మనలోని మానవత్వాన్ని ఒక్కసారి తట్టిలేపడమే!
అతని "తెలుగు వెలుగు" ఖండికలోంచి కొన్ని పద్యాలు.

ఒకనాడాంధ్రుని కత్తి శాత్రవ బలవ్యూహాలపై రక్తనా
టకమున్ సల్పుట విస్మరింపకుము, గాఢంబైన పాశ్చాత్య శో
భకు నీ విప్పుడు లోభివైతివి, ప్రదీప్తంబైన నీ ప్రజ్ఞ నూ
రక పోనీక సముద్దరింపుకొను మాంధ్రా! వీర యోధాగ్రణీ!


బోళావాడవుగాన నీదు విభవంబున్ సత్కళామర్మముల్
జాలా భాగము కొల్ల బెట్టితివి నీ శాస్త్రప్రపంచంబులో
మేనెల్లన్ గబళించినారు పరభూమిశాగ్రణుల్, నేటికిన్
బోలేదేమియు దిద్దుకొమ్ము బలగంబున్ స్వీయ విజ్ఞానమున్.


తలికోట యుద్ధాన నళియ రాయుని వల్ల
ప్రిదిలిపోయినది నీ వీరదట్టి
మాయనాయకురాలి మారాముడుల చేత
శమియించె నీ బాలచంద్రరేఖ
బుద్ధిమాలిన చిన్ని పొరపాటుకతమున
వితమయ్యె నీ కొండవీటి పటిమ
ఉత్సాహయుతమైన యుడుకునెత్తురు లేక
ప్రాప్తింపలేదు రాష్ట్ర ధ్వజంబు.


పరువు దూలిన నీ యనాదరణ కతన
మేటి నీ భాష పొలిమేర దాటలేదు
పరుల విజ్ఞానమునకు సంబరము పడక
కడగి యొత్తుము నీ వీర కాహళంబు


చీనా పెగోడాల సిగమీది పుష్పమై
పొడమె నీ రాతిచెక్కడపు చెణుకు
అరవ పాటకుల తంబురకు ప్రాణమువోసి
కులికె నీ చిన్నారి తెలుగుబాణి
హిమవద్గిరులదాక జృంభించి పగవాని
తరిమి వెన్నాడె నీ కఱకుటలుగు
మొగలు రాజుల సభా భూములనూరేగె
నీ జగన్నాథపండితుని పలుకు


ఎందు జూచిన నీ యశస్స్యందనములు
నడచిపోయిన జాడ లప్పుడును గలవు
దిక్తటంబుల యలర నెత్తింపవోయి
తెలుగు మన్నీల పరువు నిగ్గుల పతాక!


పూర్తిగా చదవండి...

Saturday, July 19, 2008

తామసి


పూర్ణిమగారడిగిన "తామసి" పద్యాలివిగో.
ఇవి రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథిగా అందరికీ తెలుసు. సినిమా పాటల రచయితగా చాలామందికి తెలుసు. "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అని ఎలుగెత్తి చాటిన తెలంగాణా పోరాట కవిగా మరి కొందరికి తెలిసుంటుంది. ఇతని కవితల్లో అంగారం శృంగారం రెండూ కనిపిస్తాయని ప్రసిద్ధి. దాశరథి చాలా వివాదాలలో కూడా చిక్కుకున్నారు. శ్రీశ్రీకి దాశరథికీ పడేదికాదు.
ఏదేమైనా, ఆధునిక కాలంలో తెలుగుపద్యానికి అభ్యుదయమనే కొత్త శక్తినిచ్చిన కవులలో ఇతను ప్రసిద్ధుడు.

ఇతని గురించి మరికొన్ని వివరాలు వికీపీడియాలో చూడవచ్చు. దాశరథి కవితలు కొన్ని ఆంధ్రభారతి సైటులో చదువుకోవచ్చు.
ఈ తామసి పద్యాలు, దాశరథి రాసిన "అమృతాభిషేకం" అన్న కవితా సంపుటిలోనివి. ఇందులో మనం దాశరథిలోని భావకవిని చూస్తాం. చీకటిని వర్ణిస్తున్నాడు. చీకటంటే భావకవులకి చెప్పలేని ఇష్టం కదా!


తామసి
------

ఇరులు నిశాసతీ భుజములెక్కి, శిరమ్మున నిక్కి తారకా
తరుణి కపోలపాళికలు తాకి, విహాయస వీధి ప్రాకి, చం
దురు పయి సోకి, భూమిధర దుర్గమ వీధుల దూకి, మెల్లగా
ధరపయి కాలు మోపిన వుదారములై హరినీలకాంతులన్!
(నిశాసతి - రాత్రి అనే స్త్రీ, విహాయస వీధి - ఆకాశం)

ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందుబింబాననా
ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి
ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా
భ్రుకుటికా ధనువు నంబకము కూర్చి
ఇటు సాగి అటు సాగి ఇందీవరేక్షణా
పక్ష్మ భాగములపై వచ్చి వ్రాలి
ఇటు వీగి అటు వీగి మృగనేత్ర బంగారు
చెక్కిలిపై అగర్ చుక్క నునిచి

వెండికొండపయిన్ మబ్బు విధము దోచి
చంద్ర కేదారమున లేడి చాయ దిరిగి
ఆదిశేషునిపై విష్ణువై శయించి
చీకటులుగూర్చె నందమ్ము లోకమునకు
(భ్రుకుటికా ధనువు - బొమముడి అనే విల్లు, అంబకము - బాణము, పక్ష్మ భాగము - కనుఱెప్పల వెండ్రుకలు, అగర్ చుక్క - నల్ల చందనంతో పెట్టే బుగ్గ చుక్క)

ఇరులు కోకిలములై ఎచ్చోట కూయునో
అచ్చోట మధుమాస మవతరించు
ఇరులె తుమ్మెదలుగా ఏవేళ పాడునో
ఆ వేళల వసంత మందగించు
ఇరులె మయూరులై ఎట నాట్యమాడునో
అటనే నవాషాఢ మావహించు
ఇరులె ఉత్పలములై ఏనాడు పూచునో
ఆ రోజు కార్తిక మ్మాగమించు

ఇరుల కన్న అంద మెచట కానగ రాదు
ఇరులె సౌఖ్యములకు దరులు సుమ్ము
ఇరులు లేని నాడు నరులు కానగరారు
నరులు లేని నాడు ధరణి లేదు

కబరీభరమ్ములై కనుపించు చీకట్లు
కలకాల మందాలు చిలుకు గాత
నల్లకల్వలవోలె ఉల్లసిల్లెడు నిరుల్
కాసారములలోన గ్రాలు గాత
నీలిమేఘమ్ములై నింగి బ్రాకెడు తమం
బాకాశమున నడయాడు గాత
జవరాలి కనుపాప చాయ దోచెడు సాంధ్య
మెడదలో వలపు వర్షింతు గాత

ఇరులె కురులయి, ఝరులయి పరుగులెత్తి
ఇరులె కరులయి హరులయి ఇంపు నింపి
ఇరులె విరులయి సరులయి ధరణి నిండి
ఇరులె నరులకు మరులు కల్పించు గాత

వెచ్చదనము లేని వెఱ్ఱి దీపమ్ముల
పెట్టదలచెదేల పిచ్చిదాన
వర్షధార వోలె వచ్చు చీకట్లలో
మట్టిదివ్వె నిలుచు మాట కల్ల

గౌళి నాల్క మీది కంటకమ్ములలోన
చిక్కుకొన్న యట్టి చిన్న పురుగు
అంధకారమందు ఆటాడు దీపంబు
మరు నిముసమునందు మడియ గలదు
(గౌళి - బల్లి)

ఆకాశమ్మది చీకటిల్లు, శశి తారార్కావళుల్ మిణ్గురుల్
లోకంబియ్యిది చీకటింటి పరదాలో డాగు మృత్పిండ మిం
దాకల్పింపగ జూచెదేల పరిహాసార్థమ్మొ దీపావళీ
ప్రాకారమ్ములు తామసీధరణి కంపంబల్లదే వచ్చెడిన్

కానుగ చెట్లనీడల నొకానొక స్వప్నపు సెజ్జమీద ని
ద్రాణత హాయిగొల్పగ సదా శయినింపగ నీ మహాంధకా
రాన మనస్సు శాంతిగొనె, రాను భవత్ కమనీయ కాంతి సౌ
ధానకు, నన్ను పిల్వకుము తన్వి! విభా విభవాభిరామవై!
(విభా విభవ అభిరామ - వేకువ కాంతి కలిగిన అందమైన స్త్రీ)

-----------------------

మన కావ్యాలలో చీకటి వర్ణనలకి కొదవలేదు! అందులోనూ ఒకొక్కరి ధోరణి ఒకొక్కరిది. మన మనుచరిత్రలోది మచ్చుకొకటి. మరిన్ని పద్యాలు మరోసారి.

మృగనాభి పంకంబు మెయినిండ నలదిన
మాయ కిరాతు మైచాయ దెగడి
నవ పింఛమయభూష లవధరించి నటించు
పంకజాక్షుని చెల్వు సుంకమడిగి
కాదంబ నికురంబ కలితయై ప్రవహించు
కాళింది గర్వంబు కాకువేసి
తాపింఛ విటపి కాంతార సంవృతమైన
అంజనాచలరేఖ నవఘళించి

కవిసె మఱియును గాకోల కాలకంఠ
కంఠ కలకంఠ కరిఘటా ఖంజరీట
ఘన ఘనాఘన సంకాశ గాఢ కాంతి
గటికి చీకటి రోదసీ గహ్వరమున


పూర్తిగా చదవండి...

Thursday, July 10, 2008

ఈశ్వరుడే స్వయంగా రాసిన కవిత, మీరు చదివారా!?


అనుచు, జింతా పరంపర లనెడు వర్ష
ముడిగి, నత్కీరుడను మేఘు డుత్తరంబు
నడచె, సంతోషమున దక్షిణమున నున్న
కవుల ముఖపంకజములు వికాసమొంద

శివుడు రాసిన కవిత్వం ఇది కాదండోయ్! అది తెలియాలంటే చివరకంటా చదవాల్సిందే :-) దానికి సంబంధించిన నత్కీరుని కథలోని పద్యం ఇది. శ్రీ కాళహస్తిమాహాత్మ్యంలో మన తెలుగుకవి ధూర్జటి రాసింది.

ఆధునిక కాలంలో, అలంకారాలంటే కొంత విముఖత ఏర్పడింది. అవి కవిత్వానికి బరువులన్న అభిప్రాయం చాలామందిలో కలిగింది. అది నిర్హేతుకమేమీ కాదు. సన్నగా పీలగా ఉన్న ఒక వ్యక్తి, తన చేతికి లావుపాటి చేకట్టు (bracelet) వేసుకుంటే అది ఎబ్బెట్టుగా అనిపించదూ! అదే కాస్త ఒళ్ళుకనిపించేవాడు వేసుకుంటే కనువిందుగానే ఉంటుంది. అంటే, ఒక ఆభరణం, ఉచితమైన చోట ఉన్నప్పుడే అలంకారంగా ఒప్పుతుందన్నమాట. కవిత్వ విషయంలోనూ అంతే! ఔచిత్యం చెడిన అలంకార ప్రయోగం ఎప్పుడైతే కావ్యాలలో ఎక్కువయిందో, అప్పుడు వాటిమీద ఏహ్యభావం మొదలయ్యింది.అయితే, తగిన విధంగా అలంకారాలని ప్రయోగిస్తే, అవి కవిత్వానికి ఎంత పటుత్వాన్ని కలిగిస్తాయో, ఈ పద్యం చూస్తే తెలుస్తుంది!
అలంకారాలని కవులు సాధారణంగా వర్ణనల కోసం ఉపయోగిస్తారు. అది ఒక వస్తువు వర్ణన కావచ్చు, వాతావరణ చిత్రణకావచ్చు, పాత్ర రూపురేఖల వర్ణన కావచ్చు, మహా అయితే పాత్ర మనస్స్థితిని వర్ణించడానికీ కావచ్చు. పాత్రల స్వభావాన్ని చిత్రించేందుకు అలంకారాలని వాడడం అరుదుగా కనిపించే విషయం! ఈ పద్యంలో ధూర్జటి చేసిన పని అదే!

నత్కీరుడనే ఒక దక్షిణ దేశపు కవి ఉత్తరదిశగా వెళ్ళిపోయాడు. అప్పుడు దక్షిణ దేశంలో కవులందరూ సంతోషించేరట. ఎందుకూ అన్న కవి ఊహకి రూపమే ఈ పద్యం! "ఊహ ఉత్ప్రేక్షయగును" అని మనం చదువుకున్న "అలంకారశాస్త్రాన్ని" ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇక్కడున్న అలంకారం ఉత్ప్రేక్ష అని స్ఫురిస్తుంది. ఎవిటీ ధూర్జటి చేసిన ఊహ అంటే, నత్కీరుడనే మేఘం తన చింతలనే వర్షాన్ని విడివిపెట్టి ఉత్తరదిశగా వెళ్ళిపోయినప్పుడు, దక్షిణాది కవుల ముఖాలనే పద్మాలు వికసించేయి అని. నత్కీరుడు ఉత్తరానికి వెళ్ళిపోయాక దక్షిణాది కవులందరూ సంతోషించేరని మామూలుగా చెప్పేస్తే, ఎందుకు సంతోషించేరూ అన్న సందేహం వస్తుంది. "అంతకాలం నత్కీరుడు పెట్టే బాధలనుంచి విముక్తిపొందేరనా, లేక నత్కీరుడంటే ఈర్ష్యాద్వేషాలతో ఉన్నందువల్లా?" అని. ఔచిత్యశోభితమైన ఈ అలంకారం అలాంటి అనుమానాన్ని నివృత్తిచేస్తుంది!
ఎలా అంటారా - పద్మాలు ఎప్పుడు వికసిస్తాయి? సూర్యుడి వెలుగు సోకినప్పుడు. మరి నత్కీరుడనే మేఘం ఏం చేస్తోంది? ఆ సూర్యుడి వెలుగు పద్మాలపై పడకుండా చేస్తోంది. ఇక్కడ పద్మాలు దక్షిణాది కవులు. మరి సూర్యుడెవరు? ఆ కవులని పోషించే రాజన్న మాట. నత్కీరుడు తన అహంకారంతో అధికారంతో, రాజు ఇతర కవులని గౌరవించకుండా అడ్డుపడేవాడన్న విషయం స్ఫురించటం లేదూ! అంచేత ఇతర కవులు "హమ్మాయ్యా! వీడి పీడా విరగడయ్యిందిరా" అని ఊపిరిపీల్చుకోడంలో తప్పేమీ లేదని మనకి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా, నత్కీరుడి పాత్రలోని లోపం మరింతగా బయలుపడుతుంది. ఎందుకీ నత్కీరుడి లోపం మనకి బాగా తెలియాలీ అంటే, మొత్తం కథ చెప్పుకురావాలి. ఆ పని కొత్తపాళీ గారిక్కడ ఎప్పుడో చేసేసారు: http://telpoettrans.blogspot.com/2006/11/srikalahasti-mahatmyam-1-this-is-month.html
క్లుప్తంగా చెప్పుకోవాలంటే, నత్కీరుడు ఒక రాజు ఆస్థానంలో ప్రముఖ కవి. ఆ రాజు తన కొలువులోని కవులు మెచ్చేట్టుగా ఎవరు కవిత్వం చెప్పినా వాళ్ళకి బోలెడంత డబ్బిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ఓ సారి తీరని కఱవు వస్తుంది. ఒక శివాలయంలో పూజారి, శివభక్తుడు, ఆ కఱవుకి తట్టుకోలేక ఊరొదిలి పెట్టాలనుకుంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నేనో పద్యం రాసిస్తాను, నువ్వు పోయి రాజసభలో చదువు, నీకు రాజు కావలసినంత ధనమిస్తాడు, దాంతో నువ్వు హాయిగా బతకొచ్చు అంటాడు. సరే అని శివుడిచ్చిన పద్యం తీసుకెళ్ళి రాజసభలో చదువుతాడు. అందులో "ఆడవాళ్ళ కేశాలకి సహజమైన గుబాళింపు ఉంటుంది" అన్న అర్థం వచ్చే వాక్యాలుంటాయి. దానికి నత్కీరుడు నవ్వి, ఇలాటిది మనమెక్కడా లోకంలో చూడం, కవి సమయం కూడా కాదు అని హేళన చేస్తాడు. పాపమా పూజారి శివుడి దగ్గరికి తిరిగివచ్చి జరిగింది చెప్తాడు. దాంతో శివుడు "ఠాట్! నా పద్యంలోనే తప్పుపడతాడా, నేనే స్వయంగా వచ్చి తేల్చుకుంటా"నని రాజసభకి వెళ్ళి, ఎవడు తన పద్యంలో తప్పుపట్టిందని అడుగుతాడు. నత్కీరుడు లేచి తనెందుకు తప్పుబట్టేడో మళ్ళీ చెప్తాడు. దానికి శివుడు, పార్వతీ దేవి కేశాలు సహజంగానే సుగంధాన్ని కలిగుంటాయని నచ్చ చెప్తాడు. "అయితే ఏంటి, ఈ లోకంలో ఎవరికీ ఉండదు కాబట్టి, ఇక్కడ కవిత్వానికి వర్తించదు పొ"మ్మంటాడు. పైగా "లూలామాలపు" మాటలు మాట్లాడకని ఎద్దేవా కూడా చేస్తాడు! దాంతో శివుడికి కోపంవచ్చి, తన మూడో కన్ను చూపిస్తాడు. పోనీ అప్పటికైనా ఊరుకోవచ్చు కదా, నత్కీరుడు మరింత రెచ్చిపోయి, "నీ తలచుట్టూరా కన్నులున్నా సరే, పద్యం తప్పే! కాదని నా చేత ఒప్పించడం నీ తరం కాదు" అంటాడు. శివుడప్పుడు, వీడికిలా బుద్ధిరాదని అనుకొని కుష్టువ్యాధితో బాధపడమని శపిస్తాడు. దెబ్బకి దెయ్యం దిగుతుంది నత్కీరుడికి! లబోదిబోమంటాడు. శివుడు కాస్త కరుణించి, కైలాస శిఖరం చూస్తే నీకు శాపవిమోచనం కలుగుతుందని చెప్తాడు. ఈ కుష్టువ్యాధితో బాధపడుతూ అంత దూరం ఎలావెళ్ళడం అని విచారించి, చివరికి, తప్పదుకదా అని ఉత్తరదిశగా బయలుదేరుతాడు. అదీ ఈ పద్యం ముందు దాకా జరిగిన కథ.
ఇదో విచిత్రమైన కథ. కవికీ దేవుడికీ మధ్య, కవిత్వం గురించి గొడవరావడం మరెక్కడా చదివిన గుర్తులేదు, ఇక్కడ తప్ప. మామూలుగా ఈ కథ వింటే, నత్కీరుడు చేసినదాంట్లో తప్పేముంది అని అనిపిస్తుంది. శివుడు అన్యాయంగా అతన్ని శపించాడనికూడా అనిపిస్తుంది. కానీ కాళహస్తి మాహాత్మ్యం చదివితే ఆ పాత్ర స్వభావం అర్థమవుతుంది. దానికి పైన చెప్పిన పద్యం చాలా ఉపయోగపడుతోంది. ఇతరులని కించపరిచే గుణం నత్కీరుడిలో ఉంది. పండితులకి ధిషణాహంకారం సహజంగా ఉండవచ్చు. కానీ అది మితిమీరితేనే ప్రమాదం. ఇవతలవాళ్ళు చెప్పింది గ్రహించే స్థితిలో లేకుండా, తను చెప్పిందే వేదమని ఇతరులని కించరిచే స్థాయిలో అహంకరించే వాళ్ళు దుర్గతిపాలు కాక తప్పదని ఈ కథ మనకి నేర్పే నీతి.
నత్కీరుడు చాలా గొప్ప కవీ పండితుడూ, అందులో ఏ సందేహమూ లేదు. చివరన శివుడుకూడా అతన్ని "సాహిత్యశ్రీ!" అని సంబోధిస్తాడు. పూజారి వచ్చి పద్యం చెప్పినప్పుడు దాన్ని ఆక్షేపించడంలో తప్పులేదు. కానీ అది శివుడు చెప్పిన పద్యమని పూజారి చెప్పినప్పుడు, దానిగురించి మళ్ళీ ఆలోచించాలని నత్కీరుడికి తట్టలేదు. స్వయంగా శివుడే వచ్చి, పార్వతి కురులకి సహజగంధం ఉంటుందయ్యా అని చెప్పినప్పుడయినా, "అయితే ఓకే" అని నత్కీరుడు ఒప్పుకోవాల్సింది. అది చెయ్యకుండా, అహంకరించి, శివుడినే వేళాకోళం చేస్తాడు! "కవిత్వముల్ నిలచునే సత్యంబు వర్ణించుచో!" అన్న గ్రహింపు అతడికి రాలేదు. అందుకే అవస్థల పాలవుతాడు. చివరికి జ్ఞానోదయమై, దక్షిణకాశి అనబడే శ్రీకాళహస్తిని దర్శించి శాపవిమోచనమయ్యాక, ఆ శివుని మీద నూరు పద్యాలు (శతకమే అయ్యుంటుంది) రాస్తాడు.
"ఏ లీలన్ నుతియింపవచ్చు..." అన్న పద్యం ఈ కథ స్ఫూర్తితోనే ధూర్జటి రాసుంటాడని నేననుకోడానికి ఇదీ కారణం!

ధూర్జటి రాసిన శ్రీకాళహస్తి మాహాత్మ్యం, రస రమ్యమైన కావ్యం. చక్కని తెలుగునుడికారం కావ్యమంతటా పరిమళిస్తుంది. చదివి అర్థం చేసుకోడం మరీ కష్టం కూడా కాదు. తెలుగు కవిత్వాన్ని అభిమానించే వాళ్ళందరూ తప్పకుండా చదవాల్సిన కావ్యమిది. IISc Digital Libraryలో ఇది లభిస్తుంది.
"నవ్య భాష"లో, "మాధురీ మహిమతో" రాస్తానని ధూర్జటే చెప్పుకున్న ఈ కావ్యాన్ని చదివి ఆనందించండి!

ఇంతకీ ఈశ్వరుడు చెప్పిన ఆ పద్యం ఎవిటో చెప్పనే లేదు కదూ!
ఆ పద్యాన్ని ధూర్జటి తన కావ్యంలో చెప్పలేదు. అందులో వివాదం రేపిన అంశాన్ని మాత్రం ప్రస్తావించి ఊరుకున్నాడు.
ఆ పద్యం స్కాందపురాణంలో (సంస్కృతంలో) ఇలా ఉంది (కొద్దిగా తేడాగా):
జానాసి పుష్పగంధాన్ భ్రమర! త్వం బ్రూహి
తత్వతో నేద్య దేవ్యాః కేశ శకలాసి
తుల్యో గంధేన కిం గంధః?
(దేవి కేశశకలమునకు గల పరిమళముతో తుల్యమైన పరిమళమెందైన కలదేమొ చెప్పుము)

తమిళంలో "తిరువిడియాల్" అన్న గ్రంధంలో ఇదే పద్యం ఇలా ఉంది:
కొంగుతేర్ వాళికె అంశిరైత్ తుంబి
కామం శెప్పాదు కందదు మొళిమో
సయిరియదు కైళి యనర్పిన్
మయిలిల్ శెరియె యిట్ట్రు అరికై కూందలిన్
నఱియువుం ఉళవో నీ అఱియుం పూవే?
(పూల తేనె చక్కగా తెలిసి ఆస్వాదించే జీవితమూ, లోనికడగి ఉన్న ఱెక్కలూ గల తుమ్మెదా! నా ఉద్యానవనంలో ఉన్న కారణంగా నాపై మొహమాటంతో కాక, నువ్వు స్వయంగా తెలుసుకున్న నిజం చెప్పు. నీకు తెలిసిన పుష్పాలలో జననాంతర సౌహృదమూ, నెమలి సౌకుమార్యమూ, మల్లెమొగ్గలలాంటి పలువరుసా గల ఈ కాంతయొక్క కురులవలె పరిమళమున్న పువ్వు ఎక్కడైనా ఉందా?)


పూర్తిగా చదవండి...