తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Showing posts with label కవులు. Show all posts
Showing posts with label కవులు. Show all posts

Monday, May 11, 2009

కందుకూరి జనార్దనా!


అననగనగా ఒక రాజు. ఆ రాజుగారు ఉదయాన్నే వాహ్యాళికి వెళ్ళేప్పుడు అతనికెవరూ ఎదురురాకూడదని శాసనం చేసారు, ఎవరెదురొస్తే ఏం అశుభం జరుగుతుందో అని. ఇది తెలియని ఒక పరాయి దేశపు పండితుడు ఒకాయన యీ రాజ్యం వచ్చి, ఓ రోజు పొద్దునే రాజుగారికి ఎదురయ్యాడు. అంతే! రాజుగారు ఆగ్రహించి "ఈ రోజు పొద్దునే నువ్వు నాకు ఎదురయ్యావు. నాకూ, ఈ రాజ్యానికి ఏమరిష్టం రాబోతోందో! నీకు మరణ శిక్ష విధిస్తున్నాను" అన్నాట్ట. అది విన్న పండితుడు నవ్వాడట. మరణ శిక్ష విధిస్తే వీడు నవ్వుతాడేమని రాజుకి ఆశ్చర్యం వేసింది. "నీకేమైనా పిచ్చా, మరణ శిక్ష వేస్తే ఎందుకలా నవ్వుతున్నావ్?" అని అడిగాడట. దానికా పండితుడు, "మహారాజా! నేనెదురైతే మీకేం అశుభం కలుగుతుందో నాకు తెలీదు కాని, ఈ రోజు పొద్దున్నే నేను మిమ్మల్ని చూసాను. దాని ఫలితంగా నాకు ఏకంగా మరణమే ప్రాప్తిస్తోంది! ఇంతకన్నా అశుభం ఏముంటుంది. అలాంటిది నావల్ల అశుభమేదో అవుతుందని మీరు భయపడ్డం చూస్తే నాకు నవ్వొచ్చింది" అన్నాట్ట. దానితో రాజుగారు పెద్ద ఆలోచనలో పడిపోయారు. అప్పుడతనకి తన మూర్ఖత్వం తెలిసొచ్చింది. వెంటనే ఆ పండితుణ్ణి సగౌరవంగా ఆస్థానానికి పిలిపించి మంచి సత్కారం చేసారు.
ఈ కథని చాలామంది వినే ఉంటారు. వేరు వేరు విధాలుగా విని ఉంటారు, వేర్వేరు రాజుల పేర్లతో, పండితుల పేర్లతో. తెలుగు సాహిత్యంలో చాటు పద్యాల్లాగ ఇలాంటి చాటు కథలు కూడా చాలా ఉన్నాయి. నేనీ మధ్య దీన్ని విన్నది కందుకూరి రుద్రకవి విషయంలో. ఆ పండితుడు కందుకూరి రుద్రకవి అని, ఆ రాజు శ్రీకృష్ణదేవరాయలని. చారిత్రకమైన ఆధారాలు స్పష్టంగా లేకపోయినా, ఇలాటి కథలలో ఎంతో కొంత నిజం ఉండకుండా ఉండదు. అది రుద్రకవి కాక మరొక పందితుడు కావచ్చు. ఆ రాజు రాయలు కాక వేరే ఎవరైనా కావచ్చు. అయినా ఆ పండితుని ధైర్యానికీ, సమయస్ఫూర్తికీ, తన తప్పుని గ్రహించి ఆ పండితుని సత్కరించిన ఆ రాజు ఇంగితానికీ అబ్బురపడకుండా ఉండలేం!

కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులుండేవారన్న కథ ప్రసిద్ధమే. అది కూడా చాటు కథే కాని దానికి చారిత్రకమైన ఆధారాలు సరైనవేమీ లేవు. ఈ కందుకూరి రుద్రకవి కూడా అష్ట దిగ్గజాలలో ఒకడనీ, అతను ఈశాన్యపు దిక్కునున్న పీఠాన్ని అధిష్టించాడనీ ఒక కథ. ఈ రుద్రకవి గురించి చాలా చాటు పద్యాలూ, వాటికితోడుగా కథలూ ప్రచారంలో ఉన్నాయి. ఇతనికి తాతాచార్యులతోనూ అలాగే భద్రకవితోనూ (ఇతను రాయల కొలువులో మరొక కవి అయ్యలరాజు రామభద్ర కవే అని కొందరంటారు) వాదోపవాదాలు జరిగాయని పద్యాలున్నాయి. సభకి వచ్చినప్పుడు ఇతనికి కూర్చోడానికి ఆసనమివ్వకుండా అవమానించినప్పుడు యీ పద్యం చెప్పాడట రుద్రకవి:

పండితులైనవారు దిగువం దగనుండగ నల్పుడొక్కడు
ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబులకేమి యెగ్గగున్
గొండొక కోతి చెట్టుకొన కొమ్మకు నెక్కిన గ్రింద గండ భే
రుండ మదేభ సింహములు రూఢిగ నంతట నిండియుండవే!

చాటువుల్లో తిట్టుకవిత్వం కూడా చమత్కారమైన పోలికలతో చతురంగా ఉంటుందన్నదానికి ఇదొక ఉదాహరణ. కవి రాజుగారి కొలువులో ఇంత నిబ్బరంగా మాట్లాడగలిగాడంటే ఆశ్చర్యం కలుగుతుంది! ఇలా పద్యం చెప్పేసరికి తాతాచార్యులవారు "ముందైతే నీ పండిత్యమూ కవిత్వ పటుత్వమూ నిరూపించుకో" అని కొన్ని దుష్కర ప్రాసలతో సమస్యలిచ్చి పూరించమన్నారట. వాటినన్నిటినీ రుద్రకవి ఆశువుగా అవలీలగా పూరించాడట. అందులో ఒక సమస్యాపూరణ:

సమస్య: దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములురేగె నదేమి చిత్రమో!
పాల సముద్రం మధ్యలో దుమ్ములు రేగాయని అర్థం. ఇక్కడ "గ్ధ" ప్రాస కష్టమైనది.
దీని పూరణ:

స్నిగ్ధపువర్ణు డీశ్వరుడు చిచ్చఱ కంటను బంచబాణునిన్
దగ్ధము చేసెనంచు విని తామరసేక్షణు మ్రోలనున్న యా
ముగ్ధపు లచ్చి మోదుకొన మోహన గంధము పిండి పిండియై
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములురేగె నదేమి చిత్రమో!

శివుడు మన్మథుణ్ణి భస్మంచేసాడన్న వార్త విన్న లక్ష్మీ దేవి పుత్రశోకంతో గుండెలు బాదుకుంటే, ఆమె శరీరమ్మీద ఉన్న గంధము పిండిపిండైపోయి, ఆ ధూళి పాలసముద్రం మధ్య దుమ్ములా రేగిందని తాత్పర్యం. ఇలా తన పాండిత్యాన్నీ, కవిత్వ శక్తినీ నిరూపించుకొని రాయల అష్టదిగ్గజాలలో ఒకడయ్యాడని కథ.
అయితే యీ రుద్రకవి ఆశ్రయించినది శ్రీకృషదేవరాయలని కాదనీ మరొక చిన్న రాజుననీ మరికొందరంటారు.
మల్కిభరాముని (ఇబ్రహీం కులీ కుతుభ్షా) ఆశ్రయించిన రుద్రకవి ఒకడున్నాడు. ఇతడూ అతడూ ఒకరో కాదో స్పష్టంగా తెలీదు. ఈ రుద్రకవి పేరు మీద చాలానే గ్రంధాలున్నాయి. నిరంకుశోపాఖ్యానము, సరసజన మనోరంజనము అనే కావ్యాలు, సుగ్రీవవిజయము అనే యక్షగానం (ఇదే మనకి లభిస్తున్న యక్షగానాలలో అతి ప్రాచీనమైనది) మొదలైనవి.
అన్నిటికన్నా ప్రసిద్ధి పొందిన రచన జనార్దనాష్టకము. "కందుకూరి జనార్దనా" అనే మకుటంతో ఉన్న ఎనిమిది పద్యాలు. అందమైన మధురమైన శృంగార రసవంతమైన పద్యాలివి. ఇవన్నీ మాత్రా ఛందస్సులో సొగసైన నడకతో సాగే పద్యాలు. యతి ప్రాసలు వీటికి అదనపు నిగనిగలు. మత్తకోకిల నడకలా సాగే ఈ పద్యాలు పాడుకోడానికి కూడా బావుంటాయి. ఈ జనార్దనాష్టకంలోని పద్యాలకు రాగం కట్టి పూర్వం దేవదాసీలు నృత్యం చేసేవారట. ఇవి కొన్నాళ్ళ క్రితం అందమైన బాపూ బొమ్మలతో ఒక పత్రికలో ప్రచురింపబడ్డాయి. తర్వాత పుస్తకంగా కూడా వచ్చినట్టుంది.
జనార్దనాష్టకంలోని ఒక పద్యం:

సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జాఱఁగాఁ
జరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతులు దేరఁగా
మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీఱఁగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

మిగతా పద్యాలు పద్యం.నెట్లో చదువుకొని ఆస్వాదించండి.


పూర్తిగా చదవండి...

Thursday, September 11, 2008

ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోతుందా?


నా మార్గమ్మును కాదు, శిష్యుడయినన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; వీని దెదియో! ఈ మార్గ మట్లౌటచే,
సామాన్యుండనరాదు వీని కవితాసమ్రాడ్వ్త మా హేతువై,
యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్

ఇతని కవిత్వాన్ని గురించి బహుశా ఇంతకన్న సరైన అంచనా మరెవరూ వెయ్యలేరు. తన శిష్యుని గురించి స్వయంగా అతని గురువే చెప్పిన మాటలుకావడం వీటికి మరింత విశిష్టతనిస్తుంది. ఆ శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ, ఆ గురువు చెళ్ళపిళ్ళ.
ఈ రోజు అతని జయంతి. అది గుర్తుచేసిన తెలుగురథం శర్మగారికి ముందుగా కృతజ్ఞతలు.

విశ్వనాథ నాకెప్పుడు పరిచయమయ్యారో సరిగా గుర్తులేదు కాని, అతన్ని చదువుతూంటే కలిగే అనుభూతులు అనేకం! ఒకోసారి అతని మీద జాలి పుడుతుంది. మరోసారి చిరాకు, ఇంకోసారి భక్తి, కొన్ని సార్లు భయం, మరికొన్ని సార్లు గౌరవం పుడుతూ ఉంటాయి. అయితే చాలాసార్లు పుట్టే అనుభూతి మాత్రం ఆశ్చర్యంతో కూడుకొన్న తీవ్రమైన విస్మయం! విశ్వనాథ కవిత్వం చదువుతునప్పుడు, అది పూర్తిగా నాకర్థమవుతుందో లేదో నాకు తెలీదు. కానీ అర్థమయ్యిందీ అని అనిపించినంతలో, దాన్ని అనుభవించినంతలో, అందులో దర్శనమిచ్చే అతని "ప్రతిభ" ("పాండిత్యం" కాదని గుర్తించండి) - ఇంతటి గాఢ ప్రతిభ యితనికెలా అబ్బిందబ్బా అన్న విస్మయంలో ముంచెత్తేస్తుంది.
విశ్వనాథ మౌలికంగా కవి. కథకుడూ, నవలాకారుడూ, విమర్శకుడూ కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల అయ్యారు అని నాకనిపిస్తుంది.
విశ్వనాథకి భక్తులూ ఎక్కువే, బద్ధ శత్రువులూ ఎక్కువే. అయినా, వీళ్ళుకాని వాళ్ళుకాని అతన్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువే.

బహుశా నేను మొట్టమొదట విన్న (అప్పటికి అతని పద్యాలేవీ నేను చదవలేదు కూడా) మొట్టమొదటి పద్యం ఇదనుకుంటాను:

నా ప్రాణములకు నీ పొగమబ్బుల
కేమి సంబంధమో! యేను గూడ
పొగమబ్బునై కొండచిగురు కోసలపైన
బురుజులపైని గొమ్ములకు బైని
వ్రాలిపోనో మధ్య వ్రీలిపోనో నేల
రాలిపోనో గాలి తేలిపోనో
నా యూహ చక్రసుందర పరిభ్రమణమై
యీ పొగమబ్బులనే వరించె

యెన్ని పొగమబ్బు లెఱిగి లేనేను మున్ను?
తూర్పు కనుమలు విడుచు నిట్టూర్పు లట్టి
విచటి యీ పొగమబ్బులే యెడదలోన
లలితము మదీయ గీతి నేలా వెలార్చు?

ఇది ఆంధ్రప్రశస్తిలోని పద్యం. ఎవరిదో ఉపన్యాసంలో విన్నాను. ఆ ఉపన్యాసకుడు ఈ పద్యాన్ని చదివిన తీరుకీ, దాన్ని వివరించిన విధానానికీ మంత్ర ముగ్ధుణ్ణయిపోయాను! అలా ఆనాడా మబ్బుతునక చిందించిన చిన్న చినుకు, ఆ తర్వాత చిలికి చిలికి గాలివానై మొత్తం నన్ను ముంచెత్తేసింది!

విశ్వనాథ గురించి చెప్పడం మొదలుపెడితే ఇంక అతన్నీ పట్టలేం, నన్నూ పట్టలేం :-) అంచేత, అతని పద్యాలు కొన్ని తలచుకొని "సం" తృప్తిని పొందుతాను, ప్రస్తుతానికి.

శ్రీకృష్ణ సంగీతంలో ఒక గోపిక కృష్ణునితో చేస్తున్న నిందా స్తుతి ఇది:

యాదవా నీది గానంబు కాదురయ్య!
గాన మెచ్చటనైనను కర్ణ రంధ్రములను జొచ్చు,
యెడదకు సౌఖ్యము సమకూర్చు.
ఇంక నీ పాట చెవులలో నెపుడు జొచ్చు? చొచ్చుచును జొచ్చుచును గుండె జొచ్చుగాని!
ఎపుడు నీ పాట అది సుఖమిచ్చు నెదకు? ఇచ్చుచును ఇచ్చుచును దుఃఖ మిచ్చుగాని!
నేను నీ పాటకును రానె రాను పొమ్ము...

పైది నిజానికి వచనమే, కాని తేటగీతి ఛందస్సులో ఉంది.

ఆంధ్రప్రశస్తిని మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితమిస్తూ అన్న మాటలలో విశ్వనాథ ఆంధ్ర దేశాభిమానం ఉరకలు వేస్తుంది:

ఇది నీకై యిడినట్టి నా యుపద, మున్నేనాడొ ఘాసాగ్రముల్
పదునై యాంధ్ర విరోధి కంఠ దళన ప్రారంభ సంరంభ మే
చు దినాలనే మఱి తోడి సైనికులమై చూఱాడు ప్రేమంబులో
నిది లేశంబనియైన జెప్పుటకు లేవే నాటి స్వాతంత్ర్యముల్!

రామాయణకల్పవృక్షంలో శబరి తలమీద పువ్వులూ పండ్లూ పెట్టిన తట్టతో నడిచి వస్తూ ఉంటే, ఆమే ఇలా ఉందిట:

తుట్టతుద దాక ఎండిన చెట్టుకొమ్మ
శేఖరంబున యందు పుష్పించినట్లు

శబరి శరీరం ఎండిపోయిన చెట్టుకొమ్మలా ఉంది. ఆ చెట్టుకొమ్మ చివరమాత్రం పుష్పించినట్లుందట!

రాముడు ఖరుడిని చంపేటప్పుడు చూపించిన వీర రసం:

ఆకంఠంబుగ మెక్కినట్టి మునిరాజానేక మాంసంబులన్
నీ కంఠంబును గత్తిరించి యిదిగో నీచేత గ్రక్కించెదన్
భూకాంతుండయినట్టి యా భరతు డబ్బో! తీక్ష్ణు డీ కార్యమున్
నాకుం బెట్టెను దైత్య రాడ్గళ గళన్నాళంబులం గోయగన్

కల్పవృక్షంలోంచి ఎన్నని ఉదాహరణలివ్వగలం! రాముడు ధనుర్విద్యా పారంగతుడయ్యాక అతని పరిస్థితి ఎలా ఉందో వివరించే పద్యం ఇది:

సుడియన్ బ్రత్యణువున్ బ్రవేగధుర మౌచుం బంచకల్యాణి సా
వడిలో నూఱక కట్టివేసిన నసృగ్బాధోల్బణంబైన కై
వడి నిల్పోపక రామభద్రుడు ధనుర్వైధగ్ధ్య సాఫల్య మే
ర్పడు మార్గంబుల కోసమై వెదకు సౌత్రశ్రీ లహోలిప్తలన్

మంచి పదునుమీదున్న పంచకల్యాణీ గుఱ్ఱాన్ని ఊరికే సావడిలో కట్టేస్తే ఉఱకలు వేసే నెత్తుటితో అది ఎలా బాధపడుతుందో అలా తన ధనుర్విద్య సాఫల్యం చెందే అవకాశం రాక రామభద్రుడు విలవిలలాడిపోయాడుట!

అన్నిటికన్నా విశ్వనాథని దగ్గరగా మనం చూడగలిగేది అతని శతకాల్లో. అందులోనూ విశ్వేశ్వర శతకంలో. అందులోంచి రెండు పద్యాలు:

అతను కటిక దారిద్ర్యం అనుభవించిన రోజుల్లో ఒళ్ళుమండి రాసిన పద్యం కాబోలు ఇది!

మీ దాతృత్వమొ తండ్రి దాతృతయొ మీమీ మధ్య నున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!

అయినా అతనికా స్వామి మీదున్న భక్తి అపారమైనది.

నీవే రాజువు నేను సత్కవిని తండ్రీ! నిన్ను వర్ణించెదన్
నీవే దైవము నేను భక్తుడను తండ్రీ! నిన్ను ధ్యానించెదన్
నీవే భూమివి నేను గర్షకుడ తండ్రీ! నిన్ను బండించెదన్
నా వైదగ్ధ్యము నీవ చూతు, కృప సంధానించు విశ్వేశ్వరా!

తెలుగు పద్యకవిత్వం మొత్తాన్ని చదవే భాగ్యం నాకీ జన్మకు ఎలాగూ లేదు. విశ్వనాథ కవిత్వాన్ని చదివితే తప్పకుండా ఆ లోటు తీరుతుంది. కాని అది కూడా సాధ్యమవుతుందన్న నమ్మకం లేకుండా ఉంది :-(


పూర్తిగా చదవండి...

Thursday, July 24, 2008

సుకవి జీవించు ప్రజల నాలుకలమీద!


ఆధునిక పద్యకవులలో నిస్సందేహంగా ఒక మహోన్నతస్థానాన్ని సొంతంచేసుకొన్న కవి జాషువా. అతని కవిత్వంలోని విస్తృతి, గాఢత, పద్య రచనలోని వాడీ వేడీ అతన్ని గొప్పకవిని చేసాయి. కవికోకిలని చేసాయి. నవయుగ కవిచక్రవర్తిని చేసాయి!

నా కవితావధూటి వదనమ్ము నెగాదిగ జూచి రూపరే
ఖా కమనీయ వైఖరుల గాంచి భళీభళి యన్నవారె నీ
దేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్!

అన్న జాషువా ఆవేదన విన్నప్పుడు కరగని హృదయం ఉంటుందా? అలా అని జాషువా భీరువు కాదు. అతని కవిత్వంలో ఆవేదన ఎంత ఉందో, ఆవేశం తెగింపూ తిరుగుబాటూ కూడా అంతే ఉన్నాయి.

గవ్వకుసాటిరాని పలుగాకుల మూక లసూయచేత న
న్నెవ్విధి దూరినన్, నను వరించిన శారద లేచిపోవునే!
ఇవ్వసుధాస్థలిన్ బొడమరే రసలుబ్ధులు, ఘంటమూనెదన్
రవ్వలురాల్చెదన్, గరగరల్ సవరించెద నాంధ్రవాణికిన్.

అని ప్రతిజ్ఞ పూని, దాన్ని సాధించిన కవి జాషువా. తెలుగుకవిత్వం ఉన్నంతకాలం జాషువా తెలుగువాళ్ళ గుండెల్లో మార్మ్రోగుతునే ఉంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఒకవైపు అచ్చమైన అందమైన అమాయకమైన పసిపాప, మరో వైపు తెలుగుజాతిపై తెలుగుభాషపై ఉప్పొంగే అభిమానం, ఇంకొకవైపు దళితజాతి చైతన్యాన్ని లోకానికి చాటే గబ్బిలం - జాషువా కలానికి అనంత ముఖాలు. అతను రాసిన శ్మశానవాటిక పద్యాలు, ఒక కాలంలో, నోటికి రాని తెలుగువారు అరుదంటే అతిశయోక్తికాదు. పద్యాలలో అభ్యుదయకవిత్వాన్ని రాసినవాళ్ళు మరికొందరున్నా, జాషువా పద్యాలు నా హృదయాన్ని తాకినంతగా మరెవ్వరివీ తాకలేదు.
ఈ రోజు అతని వర్ధంతి సందర్భంగా అతన్ని గుర్తుచేసుకోవడం, మనం మరచిపోతున్న తెలుగుదనాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తుచేసుకోవడమే! మనలోని మానవత్వాన్ని ఒక్కసారి తట్టిలేపడమే!
అతని "తెలుగు వెలుగు" ఖండికలోంచి కొన్ని పద్యాలు.

ఒకనాడాంధ్రుని కత్తి శాత్రవ బలవ్యూహాలపై రక్తనా
టకమున్ సల్పుట విస్మరింపకుము, గాఢంబైన పాశ్చాత్య శో
భకు నీ విప్పుడు లోభివైతివి, ప్రదీప్తంబైన నీ ప్రజ్ఞ నూ
రక పోనీక సముద్దరింపుకొను మాంధ్రా! వీర యోధాగ్రణీ!


బోళావాడవుగాన నీదు విభవంబున్ సత్కళామర్మముల్
జాలా భాగము కొల్ల బెట్టితివి నీ శాస్త్రప్రపంచంబులో
మేనెల్లన్ గబళించినారు పరభూమిశాగ్రణుల్, నేటికిన్
బోలేదేమియు దిద్దుకొమ్ము బలగంబున్ స్వీయ విజ్ఞానమున్.


తలికోట యుద్ధాన నళియ రాయుని వల్ల
ప్రిదిలిపోయినది నీ వీరదట్టి
మాయనాయకురాలి మారాముడుల చేత
శమియించె నీ బాలచంద్రరేఖ
బుద్ధిమాలిన చిన్ని పొరపాటుకతమున
వితమయ్యె నీ కొండవీటి పటిమ
ఉత్సాహయుతమైన యుడుకునెత్తురు లేక
ప్రాప్తింపలేదు రాష్ట్ర ధ్వజంబు.


పరువు దూలిన నీ యనాదరణ కతన
మేటి నీ భాష పొలిమేర దాటలేదు
పరుల విజ్ఞానమునకు సంబరము పడక
కడగి యొత్తుము నీ వీర కాహళంబు


చీనా పెగోడాల సిగమీది పుష్పమై
పొడమె నీ రాతిచెక్కడపు చెణుకు
అరవ పాటకుల తంబురకు ప్రాణమువోసి
కులికె నీ చిన్నారి తెలుగుబాణి
హిమవద్గిరులదాక జృంభించి పగవాని
తరిమి వెన్నాడె నీ కఱకుటలుగు
మొగలు రాజుల సభా భూములనూరేగె
నీ జగన్నాథపండితుని పలుకు


ఎందు జూచిన నీ యశస్స్యందనములు
నడచిపోయిన జాడ లప్పుడును గలవు
దిక్తటంబుల యలర నెత్తింపవోయి
తెలుగు మన్నీల పరువు నిగ్గుల పతాక!


పూర్తిగా చదవండి...