Thursday, November 12, 2009

ఛందస్సుతో నడక - 2

క్రిందటిసారి నేనిచ్చిన మూడు ప్రహేళికలను పూర్తిచేసిన వాళ్ళకీ, ఆసక్తితో ప్రయత్నించిన వాళ్ళకీ అభినందనలు. మొదటి టపాలో రంగాన్ని మాత్రం సిద్ధపరుచుకున్నాము. అక్కడ వేసుకున్న ప్రశ్నలకి సమాధానాలు వెతకడం ఇంక మొదలుపెడదామా. దీనికి కాస్త థియరీ అవసరం అవుతుంది మరి. మరీ బోరు కొట్టకుండా వివరించే ప్రయత్నం చేస్తాను.

ఆ థియరీలోకి వెళ్ళే ముందు మళ్ళీ మీ మెదడుకి మేత. క్రితం సారి పద్యాలయ్యాయి కదా, ఈ మారు సరదాగా సినిమా పాటలు తీసుకుందాం. ఒక రెండు సినిమా పాటల పల్లవులని క్రింద ఇస్తున్నాను, "తనన" భాషలో. ఆ పాటలేమిటో గుర్తుపట్టండి చూద్దాం!

మొదటిది:

తనన తనన తనన తనన తానానా
తనన తనన తనన తనన తానానా
తననన తననన తానన తానానా
తననన తననన తానన తానానా
తనన తనన తనన తాన

రెండోది:

తానా తననననన తానా
తానాన తానాన తాన తనానా
తానా తానా తానా
తానా తానా తానానా (అమెరికావాళ్ళ "తానా"కీ దీనికీ ఏ సంబంధం లేదని మనవి :-)

సరే, ఇంక అసలు విషయంలోకి వద్దాము. ఒక వాక్యమో లేదా వాక్య సముదాయమో పలికేటప్పుడు, అందులో ప్రతి అక్షరం పలకడానికి కొంత సమయం తీసుకుంటాము కదా. అలా తీసుకునే కాలం ఒక ప్రత్యేక క్రమంలో ఉంటే అది పద్యం అవుతుంది అని ముందటి టపాలో చెప్పాను. ఒకో అక్షరాన్ని పలకడానికి తీసుకునే సమయం, ఆ అక్షరాన్నిబట్టి మారుతుంది కదా. ఉదాహరణకి దీర్ఘాలు ఉన్న అక్షరాలు, మామూలు అక్షరాల (హ్రస్వాలు) కన్నా కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఉదాహరణకి "ఆకాశము" అన్నప్పుడు "శ", "ము" అనే అక్షరాలు పలకడానికి తీసుకునే సమయం కన్నా, "ఆ", "కా" అనే అక్షరాలు పలకడానికి ఎక్కువ సమయం తీసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే "సంగతి" అన్నప్పుడు "సం" అనే అక్షరం ఎక్కువ సమయం తీసుకుంటుంది పలికేటప్పుడు. ఇలా పలకడానికి మామూలు కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకునే అక్షరాలని "గురువులు" అని ఒక పేరుపెట్టారు. ఎక్కువ సమయం తీసుకోని మిగతా అక్షరాలని "లఘువులు" అని అంటారు. ఈ గురులఘువుల గురించి ఇంతకు ముందు "పెద్దోడు చిన్నోడు" అనే టపాలో వివరంగా వ్రాసాను. ఒక లఘువు పలకడానికి కావలసిన సమయాన్ని ఒక మాత్ర అని అంటారు. గురువుకయితే రెండు మాత్రల సమయం పడుతుందని సుమారుగా సంస్కృత ఛందస్సు వ్రాసినవాళ్ళు నిర్ణయించారు. తమిళ ఛందస్సులలో అయితే మరో కేటగిరీ కూడా ఉంది. తెలుగు ప్రధానంగా సంస్కృత ఛందస్సునే అనుసరిస్తుంది కాబట్టి మనకి ఉన్నవి గురువు, లగువు అని రెండే కేటగిరీలు.

అంచేత ఒక వాక్యంలో ఉన్న గురు లఘువుల క్రమం, లేదా మాత్రల క్రమం, ఆ వాక్యపు నడకని పట్టి ఇస్తుందన్న మాట. ఈ గురు లఘు క్రమంలో ఒక నియమాన్ని పెడితే, అది దాని నడకలో ఒక ప్రత్యేకతని తెస్తుంది. అలాంటి వాక్య సముదాయాలు పద్యం అవుతాయి. అయితే పద్యాన్ని నిర్వచించేటప్పుడు వాక్యాల ప్రసక్తి కాకుండా, పాదాలను నిర్వచిస్తాం. ఒక ప్రత్యేకమైన నడక కలిగిన అక్షర సముదాయాన్ని ఒక పాదం అంటాం. అలాంటి రెండు లేక అంత కన్నా ఎక్కువ పాదాల కలయిక ఒక పద్యం అవుతుంది. దీని గురించి నా మొదటి టపాలోను, "ఛందస్సు - కథా కమామీషు" టపాలోనూ మరి కొంచెం వివరించాను.

మనకి స్కూల్లో పరిచయమయ్యే మొదటి వృత్తం ఉత్పలమాల. "భరనభభరవ" అని కంఠస్థం చేస్తాం కదా. అంతకన్నా ముందే "యమాతారాజభానసలగం" అన్నది కూడా కంఠస్థం చేస్తాము. ఏమిటీ ఛందస్సు? ప్రతి పాదంలోనూ ఉండే గురు లఘువుల క్రమాన్ని నిర్దేశించే ఒక ఛందస్సు ఇది.
UIIUIUIIIUIIUIIUIUIU - ఇదీ ఆ గురు లఘువుల వరస. ఉత్పలమాల పద్యంలో నాలుగు పాదాలు. ప్రతి పాదంలోనూ అక్షరాలు సరిగ్గా ఇదే గురులఘువుల క్రమంలో ఉండాలన్నమాట. చిన్నప్పుడు మీ తెలుగు టీచరు ఇలాగే ఇదంతా చెప్పేటప్పుడు మీకు బోరుగా అనిపించలేదూ? అనిపించే ఉంటుంది! ఇప్పుడూ అలాగే ఉందా? సరే మనం మరికాస్త సరదా కోసం, కాస్త గ్రాఫిక్కుల జిమ్మిక్కులు చేద్దాం. ఈ గురులఘువుల క్రమాన్ని ఒక గ్రాఫులా గీస్తే ఎలా ఉంటుందో చూద్దాం:


ఇదిగో ఇలా ఉంటుంది! లఘువుకి విలువ 2, గురువుకి విలువ 4 ఇచ్చానిక్కడ. ఎందుకో మరికొంత సేపట్లో తెలుస్తుంది. మొదలు చివరలని స్పష్టంగా చూపించడం కోసం ముందొకటి వెనకొకటి సున్నాలు తగిలించాను. బావుందా! ఉత్పలమాలలో ఉన్న ఏ పద్యాన్ని తీసుకుని ఈ గ్రాఫు గీసినా కచ్చితంగా ఇలాగే ఉంటుంది.

సరే ఇప్పుడిలాగే చంపకమాలని కూడా చూద్దాం:


ఉత్పల చంపకమాలలోని పోలిక ఇట్టే గుర్తుపట్టారు కదా!

సరే ఇంతకీ ముందు టపాలో మనం Pattern Recoginition వగైరా వగైరా మాట్లాడుకున్నాం కదా. ప్రతి ఛందస్సుకీ ఇలాంటి గ్రాఫొకటి తయారుచేసుకుని, ఇచ్చిన పద్యానికి ఒక గ్రాఫు వేసి పోలిస్తే ఇట్టే తెలిసిపోతుంది, అవునా? మరి ఇందులో ఇంతగా ఆలోచించడానికీ ఏముంది? ఏమీ లేదంటే లేదు, ఉందంటే ఉంది. వృత్త పద్యాలని తీసుకుని చిన్నప్పుడు బడిలో చేసినట్టు గురువు లఘువు గుర్తుపట్టి, దాన్ని వృత్త నిర్వచనలాతో పోల్చి ఏ వృత్తమో సులువుగానే చెప్పవచ్చు. గురు లఘువులని గుర్తుపట్టడమే కొంచెం క్లిష్టమైన పని కాని, అది చేసిన తర్వాత కంప్యూటరు కూడా ఇట్టే గుర్తుపట్టేస్తుంది. ఇందులో చెప్పుకోదగ్గ Pattern Recognition ఏమీ లేదు. గుర్తుపట్టాల్సిన సమాచారమంతా అచ్చు గుద్దినట్టు ఒకే మూసలో ఉంటే చాలా తేలికగా గుర్తుపట్టెయ్య వచ్చు. సమాచారంలో వైవిధ్యం ఉండి, కొంత శాతం గోల గజిబిజి ఉన్నప్పుడు, అందులోంచి నమూనాని వెలికి తియ్యడం అసలైన ఛాలెంజి. మరి ఇలాంటి వృత్త పద్యాలలో ఆ వైవిధ్యం ఎక్కడనుంచి వస్తుంది?

ఎక్కడ నుంచి వస్తుందంటే, పద్యాన్ని చదివేటప్పుడు వస్తుంది. మనం పద్యాన్ని చదవగానే, లేదా వినగానే ఆ ఛందస్సుని గుర్తుపట్టాలంటే ఎలా? పలికినప్పుడు ప్రతి ఉత్పలమాల పద్యం మనకి ఒకేలా వినిపించదు. ఒకో పద్యం ఒకోలా వినిపిస్తుంది. ఈ వైవిధ్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అందులో ఒక ప్రధానమైన కారణాన్ని తెలుసుకుందాము. మనము పద్యం చదివేటప్పుడు, సాధారణంగా ఒకే గుక్కలో చదువుకుంటూ పోము కదా. మధ్య మధ్యలో కొంత విరామం తీసుకుంటాము. ఎక్కడ? ప్రతి పదం తర్వాత ఒక అతి చిన్న విరామం తీసుకుంటాము. అలాగే వాక్యం పూర్తయినప్పుడు కూడా కొంత విరామం తీసుకుంటాము. మధ్య మధ్యలో తీసుకునే ఈ విరామాలు పద్యపు నడకలో చాలా తేడాలని కలిగిస్తాయి. ఉదాహరణకి ఉత్పలమాల పద్యాలలోవే, ఈ రెండు పాదాలు చదివి చూడండి:

సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బోంకుచే

నీ కనుదోయి వెన్నెలలు నిండిన నా హృదయాంగణమ్ములో

చదువుకున్నారా. ఇంక వీటినే గ్రాఫుల రూపంలో చూద్దాము. విరామాలని ఒక అక్షరంగా భావించి, దాని విలువ 1 ఇచ్చి గ్రాఫుని గీస్తే, అవి ఇలా ఉంటాయి:



ఇప్పుడు చెప్పండి, ఈ రెండూ ఒకటే నమూనాకి (ఛందస్సుకి) చెందిన పద్య పాదాలని గుర్తించడం అంత సులువంటారా? కాదు కదా. పద్యాలని విని, వాటి నడకబట్టి ఛందస్సుని కనుక్కోవడంలో ఉన్న కష్టం చాలావరకూ దీని వల్లనే వస్తుంది. ఇలా పదాల మధ్య వచ్చే విరామాలలో తేడాల వల్ల, ఒకే ఛందస్సులోని పద్య పాదాలకి అనేక వేల రకాల నడకలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటిలోనూ ఉన్న విరామాల గోలని తొలగించి, అసలు నమూనాని గుర్తుపట్టడం ఒక పెద్ద సవాలు. ఆ పనిని మన మెదడు చక్కగా చెయ్యగలదు, తగిన సాధన చేస్తే!
కొంతమంది ఏం చేస్తారంటే, చదివినప్పుడు పదాలతో సంబంధం లేకుండా మూడేసి అక్షరాలని కలిపి చదువుకుని, నడకేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఉదాహరణకి, "నీ కనుదోయి..." పాదాన్ని, "నీకను దోయివె న్నెలలు నిండిన నాహృద యాంగణ మ్ములో". అలా చదువుకుంటే, ఉత్పలమాల పాదాలన్నీ సుమారుగా ఒకే నడకతో వినిపిస్తాయి. గుర్తుపట్టడం కాస్త సులువవుతుంది. దీని కన్నా కూడా మేలైన పద్ధతి మన మెదడనే కంప్యూటరుకి సాధ్యమైనంత ఎక్కువ "డాటా"ని అందివ్వడమే. అంటే ఒకే వృత్తంలో ఉన్న బోలెడు పద్యాలని మనం కంఠస్థం చేస్తే, ఆ వృత్త నడకని వినగానే గుర్తుపట్ట గలిగే ప్రజ్ఞని మన మెదడు సంపాదిస్తుంది. చక్కని నడకతో పద్యాలని వ్రాయడానికీ, ఆశువుగా పద్యాలని అల్లడానికీ ఈ ప్రజ్ఞ చాలా అవసరం.

వృత్తాలలో నడకని గ్రాఫులలో చూసే ప్రయత్నం చేసాము. వృత్తాల నిర్వచనంలో ఉన్న నిర్దిష్టత, వాటిని పద్యంగా నిర్మించేటప్పుడు (తద్వారా చదివేటప్పుడు) ఎలా లోపిస్తుందో తెలుసుకున్నాము. ఆ గోల ఎక్కడనుంచి వస్తుందో కూడా చూసాము. చేరాగారు వీటిని మూడు స్థాయిలగా వివరించారు ఒకచోట - నిర్వచనము, నిర్మాణము (రచించడం), నిర్వహణ (చదవడము). మనం నిర్మాణము, నిర్వహణ ఒకేలా ఉంటుందని అనుకున్నామిక్కడ. ఈసారికి ఇక్కడతో ఆపుదాం.

తర్వాత టపాలో మన తెలుగు ఛందస్సులని ఇలాగే పరిశీలిద్దాం. ఆటవెలది, తేటగీతి, కందం లాంటి ఛందస్సులని ఇలా గ్రాఫులలో ఎలా చూపించాలో ఆసక్తి ఉన్నవాళ్ళు ఆలోచించండి. మీకేమైనా మంచి ఆలోచన వస్తే, నాతో పంచుకోండి. ఎందుకంటే ఎలా చూపించాలో ఇంకా నేను నిర్ణయించుకోలేదు.


పూర్తిగా చదవండి...

Wednesday, November 4, 2009

ఛందస్సుతో నడక - 1

ఒకోసారి ఏదైనా పాట వింటున్నప్పుడు హఠాత్తుగా మరో పాత పాట గుర్తుకొస్తుంది. "అరే! ఇది దానిలాగానే ఉందే" అనిపిస్తూ ఉంటుంది. కొందరికిలా సర్వధారాణంగా జరిగితే చాలామందికి ఎప్పుడో కాని ఇలా జరగదు. ఇది ఒక రకమైన రాగ జ్ఞానం. ఒకే రాగంలో ఉన్న రెండు పాటల మధ్యనున్న పోలికని గుర్తుపట్టే సామర్థ్యం ఇది. సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఆ రాగమేమిటో కూడా గుర్తుపడతారు. ఇలాంటి సామర్థ్యాన్నే సాంకేతికంగా Pattern recognition అంటాం. అచ్చ తెలుగులో చెప్పాలంటే నమూనాలని ఆనవాలు పట్టడమన్నమాట. ఒకటే నమూనానుంచి ఏర్పడిన రకరకాల మూర్తులని ఒకే నమూనాకి చెందినవిగా గుర్తుపట్టడం. మనిషి మెదడుకి ఈ శక్తి అమోఘంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకుంటే, ఆ తర్వాత ఆ అక్షరాలని ఎన్ని రకాలుగా (రంగులు, ఫాంట్లు, టైప్ సెట్లు) ముద్రించినా, మరీ డాక్టరు దస్తూరీలా కాకుండా కాస్తో కూస్తో అర్థమయ్యేట్టు ఎంతమంది చేత్తో వ్రాసినా మనం గుర్తుపట్టగలం! ఇది నమూనాల ఆనవాలే కదా. ఇదే ఒక కంప్యూటరుతో చేయించాలంటే తల ప్రాణం తోక్కి వస్తుంది!

పాటలలో రాగాలని గుర్తుపట్టినట్టుగానే పద్యాలలో ఛందస్సుని గుర్తుపట్టవచ్చు. అంటే ఒక పద్యాన్ని చదవగానే లేదా వినగానే అదే ఛందస్సులో మనకి బాగా తెలిసిన ఇతర పద్యాలు గుర్తుకు రావడమన్నమాట. ఉదాహరణకి:

కాకికేమి తెలుసు సైకో ఎనాలసిస్
ఆటవెలది ద్విపద కత్తగారు
ఐదు, మూడు, రెండు ఆముక్త మాల్యద

అని మూడు పాదాలు చెప్పగానే, వేమన పద్యాలు చదువుకున్న ఎవరైనా నాల్గవ పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అని పూరిస్తారు. ఈ పద్యాన్ని చదవగానే మనకి వేమన పద్యాలు గుర్తుకొస్తాయి. ఈ పద్యం అలాగే ఉందన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అది ఆటవెలది ఛందస్సు అని కాని, ఆ ఛందస్సు స్వరూపం కాని తెలియాల్సిన అవసరం లేదు. అలాగే మరో ఉదాహరణ:

పిల్లులు పిల్లలు బెట్టును
నల్లను త్రావెడి కతాన నల్లి యనబడెన్
అల్లురు దశమోగ్రహములు
వెల్లుల్లికి తీపి లేదు ...

అని ఆపగానే, వినరా సుమతీ అని పూర్తి చెయ్యడానికి కంద ఛందస్సు తెలియాల్సిన పనిలేదు. ఇదెలా సాధ్యం?! వేమన, సుమతీ శతకాలు కంఠస్థం చేసిన వాళ్ళకి ఆయా ఛందస్సుల నమూనాలు మెదడులో ముద్రపడి ఉంటాయి. ఈ పద్యాలని చూడగానే మెదడు గుర్తుపట్టేస్తుంది!

ఇప్పుడు మరో పద్యం చూద్దాం:

సిరి గల నాడు మైమరచి చిక్కిన నాడు తలంచి పుణ్యముల్
పొరి పొరి చేయనైతి నని పొక్కిన గల్గునె? గాలి చిచ్చు పై
కెరలిన వేళ, డప్పి గొని కీడ్పడు వేళ, జలంబు గోరి త
త్తరమున ద్రవ్వినం గలదె? ...

దీన్ని పూరించాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తుంది, యీ శతకాన్ని ఇంతకుముందు చదివిన వాళ్ళకి కూడా. అంటే ముందు ఉదాహరణలతో పోలిస్తే, ఇక్కడున్న నమూనని గుర్తుపట్టడానికి కొంత పరిశ్రమ అవసరమవుతోంది. ఎందుకు? ఒక కారణం - ఈ శతకం వేమన, సుమతీ శతకాలంత ప్రాచుర్యం పొందకపోవడం అనుకోవచ్చు. కాని అదొక్కటే కారణం కాదు. వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటో ముందుముందు చూద్దాం.

ఇప్పుడు ఇంకొక పద్యం:

నీ మనసు తెలుసుకొని నడచుకొనెద నేను, చెలి! నిజము నే మునుపటి నీ ప్రియుడను గాను, నమ్ముమో ప్రేయసీ! కలిసిమెలిసి గడిపెదము జీవితమును

ఇది నేను పద్యంలాగా నాలుగు పాదాలు విడగొట్టి ఇవ్వలేదు (ఇచ్చినా కస్ఠమే అనుకోండి!). ఇందులో ఛందస్సుని కనుక్కోండి చూద్దాం! మీ జుట్టు కాస్త మీ చేతిలోకి వస్తే నా పూచీ కాదు సుమా :-) పై పద్యాలలో ఛందస్సు అంత సులువుగా తెలిసిందే మరి ఇదెందుకు ఇంత కష్టం?

ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం ఇప్పుడు మొదలుపెడదాం. కొత్తగా ఏదో నేను కనిపెట్టి చెప్పబోవటం లేదు. మనందరికీ తెలుసున్న విషయాలే, కాని అంతగా గుర్తించని విషయాలు.

ఛందస్సు వేద పురుషుడి పాదాలని చెప్పబడింది. అంటే ఛందస్సు పద్యాలకి నడకనిస్తాయన్న మాట. నాకు సంగీతం పెద్దగా తెలీదుకాని, పాటకి తాళం ఏమి చేస్తుందో, కాస్త అటు ఇటుగా పద్యానికి ఛందస్సు అదే చేస్తుందనుకుంటాను. ఒక వాక్యాన్ని లేదా వాక్య సముదాయాన్ని పలికేటప్పుడు, అందులోని ప్రతి అక్షరం పకలడానికి కొంత సమయం తీసుకుంటాము కదా. అలా తీసుకునే కాలం ఒక ప్రత్యేక క్రమంలో ఉంటే అది పద్యం అవుతుంది. ఆ ప్రత్యేక క్రమమే ఛందస్సు. అందుకే ఛందస్సు పద్యం నడిచే తీరుని నిర్దేశిస్తుంది.

అర్థమయ్యీ అవ్వనట్టు ఉందా? ఇప్పుడే కదా నడక మొదలుపెట్టాం. మెల్లిగా అన్నీ అవే అర్థమవుతాయి. వచ్చే టపాలో దీని గురించి మరింత వివరిస్తాను. ప్రస్తుతానికి ఒక చిన్న క్విజ్:

ఈ మధ్యనే మొదలుపెట్టిన ఒక పుస్తకంలో ఈ కిందనిచ్చిన శ్లోకాలు చదువుతూ ఉన్నాను. ఇలాంటి శ్లోకాలు ఎక్కడో విన్నానే అని అనిపించింది. ఒక అయిదు నిమిషాల తర్వాత తట్టింది. వీటిలాగే ఉండే ఆ మరో శ్లోకాలు బాగా తెలుసున్నవే! తెలుగువాళ్ళందరూ ఎప్పుడో అప్పుడు తప్పక వినే ఉంటారు. నేను చదివిన శ్లోకాలలో ఒక రెండు:

సత్యం న మే విభవనాశకృతాస్తి చింతా
భాగ్యక్రమేణ హి ధనాని భవంతి యాంతి
ఏతత్తు మాం దహతి నష్ట ధనాశ్రయస్య
యత్ సౌహృదాదపి జనాః శిథిలీ భవంతి

కిం త్వం భయేన పరివర్తిత సౌకుమార్యా
నృత్యప్రయోగ విశదౌ చరణౌ క్షిపంతీ
ఉద్విగ్న చంచల కటాక్ష విసృష్ట దృష్టిః
వ్యాధానుసార చకితా హరిణీవ యాసి

ఈ శ్లోకాల నమూనాతో ఉన్న మరో ప్రసిద్ధ శ్లోకాలేమిటో గుర్తుపట్టండి చూద్దాం!


పూర్తిగా చదవండి...

Sunday, October 25, 2009

ఛందస్సుకి పురస్కారం

భాషా సంబంధమైన విషయాలలో విశేషమైన కృషి చేసినవారికి ప్రతి ఏడు సి.పి.బ్రౌన్ పేరు మీద శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ గారు పురస్కారాన్ని ఇస్తున్నారు, 2007 సంవత్సరం నుంచీ అనుకుంటాను. ఈ ఏడాదికి ఈ అవార్డు శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు గారికి, ఛందస్సులో వారు చేసిన, చేస్తున్న కృషికి గాను ఇస్తున్నారని మొన్ననే తెలిసింది.

ఈ వార్త నాకు చాలా సంతోషం కలిగించింది. మూడు రకాలుగా సంతోషం (త్రిగుణీకృతం అన్నమాట!). నాకిష్టమైన అంశం ఛందస్సు గురించి చేసిన కృషికి గుర్తింపుగా ఇవ్వడం ఒకటి. నేనెంతో గౌరవించే సహృదయులు మోహనగారికి రావడం రెండు. భాషాశాస్త్రంలో ప్రత్యేకమైన డిగ్రీలు లేని ఔత్సాహికునికి గుర్తింపు రావడం మూడు. ఇది ఔత్సాహికులందరికీ ఎంతో ప్రోత్సాహకరం.

ఈమాట పాఠకులకి, రచ్చబండ ఛందస్సు గ్రూపులలో ఉన్నవాళ్ళకి మోహన రావుగారు పరిచితులే అయ్యుంటారు. నాకు తెలిసి, సుమారు పదేళ్ళుగా మోహన రావుగారు ఛందస్సు గురించి అనేక విశేషాలని ఈ గ్రూపులలో పంచుకుంటున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవలసినవాటిలో కొన్ని:

1. ఎన్నో కొత్త కొత్త వృత్తాలని పరిచయం చెయ్యడం. ఒక వృత్తానికి ప్రతి పాదంలోనూ నియతమైన అక్షర సంఖ్య, గురులఘు క్రమం ఉంటాయి. గురు లఘు క్రమంలో చూపగలిగే వైవిధ్యం వల్ల, కొన్ని వేల వృత్తాలు ఏర్పడతాయి. అలాంటి వృత్తాలలో చాలా కొన్ని వాటిని మన పూర్వకవులు విరివిగా వాడారు. అంత విరివిగా వాడని వృత్తాలు కొన్నైతే, అసలు వాడనివి చాలా ఉన్నాయి. అలా విరివిగా వాడని వృత్తాలని, అసలు వాడని వృత్తాలని (కొత్తగా పేర్లు పెట్టి) ఎన్నిటినో వారు సోదాహరణంగా పరిచయం చేసారు. వృత్తాలే కాక, అనేక ఉపజాతి పద్యాలు, రగడలు పరిచయం చేసారు.

2. గర్భ బంధ కవిత్వాలలో విశేషమైన కృషి చేసారు. ఏ ఛందస్సులో ఎలాంటి గర్భ కవిత్వం సాధ్యమవుతుందో గణిత శాస్త్రాధారంగా నిరూపించారు. దీనికోసం వీరు చందన అనే సాఫ్ట్వేరుని కూడా తయారు చేసారు.

3. ఛందోమృతబిందువులు అనే శీర్షికతో ఛందస్సులోని విశేషాలని ఎన్నిటినో చిన్న చిన్న పాయింట్లుగా అందించారు.

4. మోహన రావుగారి మాతృభాష కన్నడం! అది చాలా ఏళ్ళు నాకు తెలియదు. వారికి కన్నడ తెలుగు భాషలలో ఉన్న గొప్ప ప్రావీణ్యం వలన, కన్నడ తెలుగు భాషల్లోని ఛందస్సులని తులనాత్మకంగా పరిశీలిస్తూ చక్కని పరిశోధన చేసారు.

5. అన్నిటికన్నా ప్రత్యేకించి చెప్పుకోవలసినది నన్నెచోడుడు కుమారసంభవంలో ఉపయోగించిన ఛందస్సు ఆధారంగా నన్నెచోడుని కాల నిర్ణయం గురించి చేసిన ప్రతిపాదనలు. ఇది ఈమాటలో చదవవచ్చు.

ఛందస్సు మాత్రమే కాక, వీరికి ప్రాచీన శాసనాలు, కావ్యాల గురించి మంచి పరిజ్ఞానం, తెలుగు కన్నడ తమిళ భాషలలో చక్కని ప్రావీణ్యం ఉన్నాయి. వీరి రచనలు ఈ-గ్రూపులలోనూ ఈమాటలోనూ (బహుశా మరికొన్ని అమెరికా పత్రికలలోనూ) తప్ప ఇంతవరకూ పుస్తక రూపంలో రాలేదు. పుస్తకంగా తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అది ఛందస్సు మీద ఆసక్తి ఉన్నవాళ్ళందరికీ చాలా విలువైనది అవుతుందనడంలో సందేహం లేదు.

మోహనగారికి నాకూ కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలున్నా (వ్యావహారిక భాషలో పద్యాలు వగైరా విషయాలలో) అవి మా ఆత్మీయతకి ఎప్పుడూ అడ్డు రాలేదు. ఎవ్వరినీ ఎప్పుడూ నొప్పించ కూడదనుకునే స్వభావం వారిది. వృత్తి రీత్యా Biologist అయినా, మాతృభాష కన్నడమైనా, తెలుగు భాషా సాహిత్యాలపై వారికున్న విశేష అధికారం, అభిమానం అమోఘమైనవి. సి.పి.బ్రౌన్ పురస్కారం వీరి కృషికి తగిన గుర్తింపు. ఈ సందర్భంగా వారికి నా బ్లాగు ముఖంగా శుభాకాంక్షలు!


పూర్తిగా చదవండి...

Tuesday, September 29, 2009

విజయదశమి శుభాకాంక్షలు (కించిత్తు లేటుగా:-)

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు (కించిత్తు లేటుగా:-).
ఈ లేటుకి ఒక (మంచి)కారణం ఇవాళ సాయంత్రం మా అమ్మాయి సంగీతపాఠశాలవాళ్ళ కార్యక్రమానికి వెళ్ళడం. ఇక్కడ తమిళనాట విజయదశమి రోజు విద్యాదేవి పూజ చాలా నమ్మకంతో చేస్తారు. అందుకే ఇవ్వాళ చాలా స్కూళ్ళకి సెలవు కూడా లేదు. కొత్త పాఠాలు ప్రారంభిస్తారు! అలాగే సంగీతం, నాట్యం మొదలైనవి నేర్పించే "కళా"శాలలు (ఒక ఏరియాలో కనీసం ఒక మూడైనా ఉంటాయి!) యీ రోజొక వేడుకగా కార్యక్రమాలను నిర్వహించి పిల్లల చేత స్టేజిమీద ప్రదర్శనలిప్పిస్తారు. అలాంటి ఒకానొక కార్యక్రమంలో కాస్త హడావిడిగా ఉండి, ఇదిగో ఇప్పుడు తీరిక దొరికింది! మా అమ్మాయి స్కూలువాళ్ళు ఏర్పాటుచేసిన వేదిక కొంచెం చిన్నదే కాని, అది జనంతో కిక్కిరిసిపోవడం నన్ను చాలా ఆశ్చర్యంలో ముంచెత్తింది! ఆ గురువుల ఉత్సాహం (ఈ స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు ఒక డైబ్భయ్యేళ్ళ ముత్తైదువ), తల్లిదండ్రులలో ఉన్న అభిరుచి చూస్తే చాలా ఆనందం అనిపించింది.

సరే, నా గోల పక్కన పెడదాం. నవరాత్రులలో కొలిచే ముగురమ్మలు, ఆ ముగురమ్మల మూలపుటమ్మ గురించిన పద్యమాలిక ఇదిగో. ఇందులో కొన్ని పద్యాలు సుప్రసిద్ధాలే. మిగిలవి ఎవరివో పోల్చుకొనే ప్రయత్నం చెయ్యండి! వీటి అర్థ తాత్పర్యాలు మరోమారు తీరిగ్గా ముచ్చటించుకుందాం.

అంబనవాంబుజోజ్జ్వల కరాంబుజ శారదచంద్రచంద్రికా
డంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్తవివిక్త నిజప్రభావ భా
వాంబర వీథి విశ్రుత విహారి ననున్ గృపజూడు భారతీ!

వాణికి జరణానత గీ
ర్వాణికి నేణాంకశకల రత్నశలాకా
వేణికి బుస్తక వీణా
పాణికి సద్భక్తితో నుపాస్తి యొనర్తున్

క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి చంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామశుకవారిజపుస్తక రమ్యపాణికిన్

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మకడు పాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

సామజయుగ్మ మింపలర జల్లని నీరు పసిండికుండలన్
వేమఱు వంచివంచి కడు వేడుకతో నభిషిక్త జేయగా
దామరపువ్వు గద్దియ ముదంబున నుండెడి లోకమాత మా
కామునితల్లి సంపద లఖండముగా నిడు మాకు నెప్పుడున్

హిమధరాధరమండలేశ్వరు కులపాలి
కా మణితనువల్లికా ప్రసూన
యసితకంధర సింధురాజనాంబర ఘోర
గంధబంధనకర గంధలహరి
సంతత శివభక్తి సామరస్యజ్ఞాన
సారమరంద నిష్యంద ధార
పరమహంసోత్తంస భావభృంగవ్రాత
తన్మయావస్థ ప్రదానకేళి

నిఖిలవిద్యా రహస్య వాణీపరాగ
పాలికాపూరితాఖండ పద్మజాండ
పేటియై యొప్పు చంద్రార్థ జూటకోటి
జోటి గొల్చెద జ్ఞానప్రసూన కలిక

కాసరాసురరాజ కంఠ నిర్గతరక్త
పంకంబు శ్రీపాదపద్మలాక్ష
చండముండాహవ సంభ్రమస్తనజాత
ఘర్మవాఃకణరాజి కంఠమాల
రక్తబీజాది మర్దన సమయాట్టహా
సము మోమునకు లోధ్ర సుమరజంబు
శుంభనిశుంభ రక్షోవీర సంహార
వేళ గప్పిన ధూళి మేలుముసుగు

గాగ నేదేవి వీరశృంగారమూర్తి
యగుచు శోభిల్లు నట్టి దుర్గాంబ గొలుతు
గనకముఖరీ సమాఖ్య గంగాప్రతీర
హాటకాచలతుంగ శృంగాగ్రగేహ

చేర్చుక్కగా నిడ్డ చిన్నిజాబిల్లిచే
సిందూర తిలకమ్ము చెమ్మగిల్ల
నవతంస కుసుమంబు నందున్న యెలదేటి
రుతి కించి దంచిత శ్రుతుల నీన
ఘనమైన రారాపు చనుదోయి రాయిడి
దుందీఫలంబు దుందుడుకు జెంద
తరుణాంగుళిచ్ఛాయ దంతపుసరకట్టు
లింగిలీకపు వింతరంగు లీన

నుపనిషత్తులు బోటులై యోలగింప
బుండరీకాసనమున గూర్చుండి మదికి
నించు వేడుక వీణవాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుగాత!

కనకస్తనోపరి గ్రైవేయ మణికాంతి
కర్ణతాటంకంబు గాడిపఱుప
కమ్రనితంబాగ్ర కాంచికింకిణులతో
గరకంకణధ్వనుల్ కలతబూన
మౌళిక్లప్త శశాంక మాలాతపములపై
ఫాలస్థలీజ్యోతి పాఱువెట్ట
తత్కాల విచలితాధర హాస మాధుర్య
మాత్మప్రసన్నత నగడుపరుప

పాలితాన్యోన్య లంఘన స్పర్థములును
చాలితాన్యోన్య సౌందర్య సరసములును
నైన పలుకులగూడిక ననగ నొప్పు
శారదామూర్తి నా యెద జాలుగాక

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వర త్రాస త్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్ ,
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురిణాః ఫణితయః


పూర్తిగా చదవండి...

Saturday, September 19, 2009

శారద రాత్రులు

ఇవాళనుంచి శరన్నవరాత్రులు మొదలువుతున్నాయి. శరదృతువు మొదలయ్యిందన్నమాట. వెన్నెల నెలలు.
శరత్తుకీ శారదకీ ఎంత దగ్గర సంబంధమో, వెన్నెలకీ కవిత్వానికీ అంతటి స్నేహం. చంద్రునికి మనస్సుని మైమరపించే మహత్తేదో ఉంది. పున్నమి జాబిలిని, పిండారబోసినట్టు నింగి అంతా పరుచుకొనే చల్లని వెన్నెలని తనివితీరా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందా మహత్తు.

శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులం
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై

ఇది నన్నయ్యగారి మొదటి పద్యం. ఇదేంటి ఇదతని ఆఖరి పద్యం కదా అని అప్పుడే ఆశ్చర్యపడ్డారా! మొదటి పద్యమంటే, నా బ్లాగులో నన్నయ్యగారి గురించి నేను వ్రాస్తున్న మొదటి పద్యం యిది అని. అతని చివరి పద్యంతో యిలా మొదలు పెట్టడం, యిదియొక చమత్కారము :-)

ఈ పద్యాన్ని మీరు రాగయుక్తంగా చదువుకోవలసిన అవసరం లేదు, మామూలుగా చదువుకున్నా చాలు. ఒక రెండు మూడు మార్లు మళ్ళీ మళ్ళీ చదువుకొని ఆ పదాలపొహళింపు, ఆ ధార, ఆ అక్షర మాధుర్యంలో మునకలు వెయ్యండి.
నన్నయ్యగారు తన కవిత్వానికున్న లక్షణాలు అని చెప్పుకున్నవాటిలో అక్షర రమ్యత ఒకటి. రమింప జేసే అక్షరాల సంఘటన అని అర్థం. ఆ రమ్యత్వమంతా యీ పద్యంలో కనిపించడం లేదూ! ఇది ఎలా సాధించారు అంటే, అది ఒక ఆల్కెమీ. ఏదో - "ర" అన్న అక్షరం పదేపదే వచ్చినందువల్లనో, మొదటి రెండు పాదాలలో ప్రాస స్థానంలో "స" అక్షరానికి ఇచ్చిన ఊనిక వల్లనో - ఇలా రకరకాలుగా అనుకోవడం వొట్ఠి మన పరిమితమైన బుద్ధికి తట్టే పైపై అంశాలే తప్ప అసలు రహస్యం అంతుపట్టదు. ఇందులో గమనిస్తే మరో విశేషం - అనునాసికాక్షర శబ్దాలన్నీ యిందులో వినిపిస్తాయి, జాగ్రత్తగా వింటే (పంక్తులంజారు అన్న పదాలలో ఙ్, ఞ్, ఇలా...). ఇవన్నీ కూడా ఇందులోని మధుర నాదానికి కారణమయ్యుండవచ్చు.

అవి శారద రాత్రులు. ఉజ్వలంగా ప్రకాశించే తారహారాలతో అందగించిన రాత్రులు. అప్పుడే వికసిస్తున్న తెల్లకలువల పుప్పొడి దట్టంగా అలుముకున్న తెమ్మెర కమ్మదనం నిండిన రాత్రులు. కప్పురపు తావిలా తెల్లగా అంతటా పరచుకున్న అమృతాంశుని (చంద్రుని) వెన్నెలతో పరిపూర్ణమవుతున్న రాత్రులు. వెన్నెల తెల్లగా చల్లగా ఉంటుంది కర్పూరంలాగా. మరి కర్పూరపు సువాసన వెన్నెల కెక్కడిది? కలువపూల పుప్పొడి నిండిన వెన్నెల కాబట్టి దానికా సుగంధం కూడా అబ్బింది!

ప్రకృతికి దగ్గరగా ఉన్న వాళ్ళకే యిలాంటి రాత్రులలోని మధురిమ అనుభవానికి వస్తుంది.

ఈ "శారద రాత్రులు..." అన్న పద్యానికి ముందు యింకొక పద్యం ఉంది. అది శరదాగమనాన్ని వర్ణించే పద్యం. అదొక పరమాద్భుతమైన పద్యం:

భూసతికిన్ దివంబునకు బొల్పెసగంగ శరత్సమాగమం
బా సకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షి మండలో
పాసిత రాజహంసగతి భాసి(తి) ప్రసన్న సరస్వతీక మ
బ్జాసన శోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై

దీనికి అర్థం చెప్పడం చిన్నపని కాదు.

భూదేవికి స్వర్గానికీ శరత్కాలంలో అందమైన కలయిక జరిగింది (లేదా భూమ్యాకాశాల రెంటితోనూ శరత్తు కలిసింది). ఆ కలయిక సర్వానందకారియై (ప్రమోదము అంటే సుగంధము అనికూడా అర్థం వస్తుంది) విలసిల్లినది. అది ఎలా ఉంది? మహర్షి సమూహం చేత ఉపాసింపబడే రాజహంసలా వెలుగుతోంది. లేదా, మహర్షి సమూహం చేత ఉపాసింపబడే రాజహంస నడకలా ఉంది. ప్రసన్న సరస్వతితోను, అబ్జాసనుడైన బ్రహ్మతోను శోభిస్తున్న బ్రహ్మ వాహనమైన హంసలాగా ఉంది. లేదా, మహర్షి మండలము చేత ఉపాసింపబడే రాజహంసలా వెలుగుతున్న ప్రసన్న సరస్వతితోను, బ్రహ్మతోను శోభిస్తున్న హంసలాగా ఉంది.

దీని గురించి వి.వి.ఎల్. నరసింహారావు గారు తన "నన్నయ్య కవిత్వము - అక్షరరమ్యత" అనే పుస్తకంలో యిలా వివరించారు:
---

శరత్సమాగమ విలాసము షడ్విధముగా భావింపబడినది.
1. భూసతికిని దివంబునకును పొలుపు గూర్చుట. ఇది నేలకు నింగికి అందమగు సంబంధము గూర్చుట.
2. ప్రసన్న సరస్వతీకమై ఉండుట. వానకాలపు వరదల ఉరవడివలని బురద అడగిపోగా కలతదేరి సరస్వతి (నది) సుప్రసన్నముగా నుండుట.
3. సరస్వతి మహర్షిమండలోపాసిత యగుట. తీర్థ సంసేవన వ్యాజమున మహర్షులు సరస్వతిని శరత్తులో నుపాసించుట.
4. సరస్వతి రాజహంసగతి భాసిని యగుట. సరస్వతీ నది యందు రాయంచ లందముగా నడచుట యని భావము. ప్రసన్నమగు కవితా సరస్వతి రాజహంస గమనము కలది యనియు భావము.
5. అబ్జాసన శోభితంబగుట. అబ్జాసనుడనగా బ్రహ్మ. ప్రసన్న సరస్వతీకమగు శరత్తు బ్రహ్మమయముగా నుండె ననుట.
6. శరదాగమము అబ్జజుయానముతో సమానముగా నుండెను. యానమనగా గజాది వాహనమనియు నర్థము. అబ్జజు యాన మనగా బ్రహ్మవాహనమగు దివ్య హంస మనియు నర్థము. బ్రహ్మ సంచారము గలది యగుటయే కాక శరదాగమము దివ్య హంసముతో సమానముగ ఉన్నదనియు భావము.

తత్త్వమరసి చూడ బ్రహ్మాధీన గతియైన సరస్వతీ తత్త్వము యిందు లక్షింపబడినట్లు దోచును. ఇది మహర్షి మండలోపాసితమైన తత్త్వము. ఈ తత్త్వము సుదూర మన్వేషింప దగినది.

---

పైనిచ్చిన రెండు పద్యాల గురించీ, దానికి ముందరి పద్యాల గురించీ మోహన రావుగారు ఈమాటలో వ్రాసిన ఒక అద్భుతమైన వ్యాసం ఇక్కడ చదవవచ్చు.

ప్రకృతి పరంగా చూస్తే, శరత్కాలంలో మేఘాలు తొలగి, ఆకాశం నిర్మలంగా మారుతుంది. దానితో నక్షత్రాలూ చంద్రుడూ చక్కగా ఆకాశంలో ప్రకాశిస్తాయి (రాజహంస - రాజు అనే హంస = చంద్రుడనే హంస అనికూడా అర్థం స్ఫురిస్తుంది). నదులు వరద ఒత్తిడి తగ్గి, తేటబారి ప్రసన్నంగా ఉంటాయి. అందులో కలువపూలు (అబ్జము అంటే కలువపూవని కూడా అర్థం వస్తుంది) బాగా వికసిస్తూ కనిపిస్తాయి. హంసలు మానస సరోవరాన్ని చేరుకొనేది కూడా యీ శరత్తులోనే (పక్షుల వలస). మొత్తమంతా తెల్లని వెన్నెలతో నిండిపోయి ఉంటుంది.

ఈ చిత్రమంతా మనకి యీ పద్యంలో కనిపిస్తుంది. ప్రకృతి వర్ణన చేస్తూనే అంతర్గతంగా ఆధ్యాత్మిక చింతన చెయ్యడం మహర్షులైన మన కవులకి సొంతం. మన సనాతన ధర్మంలో కనిపించేది ప్రకృతి ఆరాధనే. ప్రకృతిని తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని దాని విధ్వంసానికి ఒడిగట్టే వాళ్ళని రాక్షసులన్నారు. మన కాలమానం ప్రకృతికిని అనుసరించి వెళ్ళేది. మన పండగలు మనలని ప్రకృతితో కలిపే సాధనాలు!

ఈ శరదృతువులో, అంటే వచ్చే రెండు నెలలూ వీలైనంత వెన్నెల నా బ్లాగునిండా నింపాలని ఒక ఆలోచన. వీలు చిక్కినప్పుడల్లా, మన కావ్యాలలో శరత్కాలానికి, చంద్రునికి, వెన్నెలకీ సంబంధించిన అందమైన వర్ణనలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
మీరు కూడా మీ మీ బ్లాగుల్లో ఆ పని చెయ్యవచ్చు. అంత కన్నా ముఖ్యంగా, ఈ రెండు నెలల్లో వచ్చే రెండు పున్నములలో కనీసం ఒక్క రోజు, ఆ పున్నమి జాబిలి వెండి వెలుగులని మనసారా ఆస్వాదించడం మాత్రం మరవద్దు.


పూర్తిగా చదవండి...