Monday, July 6, 2009

నీ వలమూపులావు...

కిందటిసారి ద్రౌపది ధర్మరాజుగురించి చెప్పిన పద్యాన్ని వివరించాను కదా. ఇప్పుడు భీముడి గురించి చెప్పిన పద్యం చూద్దాం. ఇది భీముడి గురించి అతనితోనే చెపుతున్న పద్యం అన్నమాట. అంచేత ఇది మరికాస్త సొగసుగా ఉంటుంది!

నీ వలమూపులావు మును నేల వహించిన నాగకూర్మ గో
త్రావనిభృద్దిశాకరుల కారయ నూఱటపట్టు గాదె సం
భావన భూజనంబులకు బండువు గాదె మహోగ్ర కోప రే
ఖా విభవంబు వైరులకు గాలము చేరువ కాదె పావనీ!

దీనికి ఆడియో నాకెక్కడా దొరకలేదు. కొత్తపాళీగారిలా నా గొంతు అందరికీ వినిపించే సాహసం నేను చెయ్యలేను :-) అంచేత ఎవరికి వారు పాడుకుని ఆనందించండి! పాడుకునేటప్పుడు "నాగకూర్మ గోత్రావనిభృద్దిశాకరుల కారయ" అన్న సమాసాన్ని ఒక్క గుక్కలోనే అనడం మర్చిపోకండి. "మహోగ్ర కోప రేఖా విభవంబు" అనేటప్పుడు "ఖా" మరో పాదంలోకి వెళుతోంది కాబట్టి దానికి కాస్తంత ఊనిక (అదే force/stress) ఇవ్వండి. ఇంక చివరనున్న "పావనీ" అన్న సంబోధనని ఎంత మనోహరంగా సాగదియ్యగలిస్తే అంతగా తియ్యండి. మొత్తంగా భావయుక్తంగా పాడుకోండి. ఇంతకీ ఏవిటా భావం?

వలమూపు - కుడి భుజం, లావు - బలం

ఎత్తుకోడంతోనే "నీ వలమూపులావు" అనే అందమైన అచ్చతెలుగు సమాసంతో పద్యాన్ని ఎత్తుకుంది ద్రౌపది. ఎందుకు? ఇక్కడొక భార్య తన భర్తతో మురిపెంగా మాట్లాడుతోంది. ఆప్యాయంగా మాట్లాడుతోంది, ఆంతరంగికంగా మాట్లాడుతోంది. ఆ మురిపెం అంతా ఆ చక్కని తెలుగు సమాసంలో ఉంది. పైగా "నీ" అని ముద్దుగా ఏకవచన ప్రయోగం కూడానూ!
ఈ ఎత్తుగడని "ఎవ్వాని వాకిట..." పద్యపు టెత్తుగడతో పోల్చి చూడండి, ఎంత తేడానో. అక్కడ చెపుతున్నది ధర్మరాజు గురించి భీమునితో. అందుకా ఠీవి, ఆ గాంభీర్యం అవసరమయ్యింది. ఇక్కడ నేరుగా భీమునితో అతని గురించే చెపుతోంది. అందుకే యీ చనవు.

మును నేల వహించిన - ఇంతకుముందు భూమిని మోసిన (అంటే ఇప్పుడు మొయ్యటం లేదన్న మాట!). ఎవరు?

నాగ కూర్మ గోత్రావనిభృత్ దిశాకరులకు ఆరయ ఊరటపట్టు కాదె :

నాగ - ఆదిశేషువు, కూర్మ - తాబేలు, గోత్ర అవనిభృత్ - అవనిభృత్ అంటే భూమిని ధరించేవి అంటే పర్వతాలు. కుల పర్వతాలు, దిశాకరులు - ఎనిమిది దిక్కులా ఉండి భూమిని మోసే దిగ్గజాలు.
చూద్దునుకదా, వీటన్నిటికీ నీ ఒక్క కుడి భుజ బలమే ఊరటపట్టు అయింది కదా! అంటే ఇప్పుడు భూభారాన్నంతా నువ్వే నీ కుడి భుజం మీద మోస్తున్నావు అని భావం. రాజు తన భుజ బలంతో భూభారాన్ని వహిస్తాడు అని కవిసమయం. అది ఆ రాజు పరాక్రమానికి చిహ్నం.
"వలమూపులావు" అన్న చిన్న తెలుగు సమాసం తర్వాత "నాగకూర్మ..." అన్న పెద్ద సంస్కృత సమాసం. ఎందుకు? అంత పెద్ద, భారమైన పనిని ఇంత చిన్న చేత్తో (భుజంతో) నువ్వు చేస్తున్నావని ధ్వనించడానికి. అది భీముని పరాక్రమాన్ని మరింతగా ధ్వనిస్తోంది కదా!
శబ్దశక్తి తెలుసున్న కవిత్వం ఇది. వాక్శక్తి తెలిసినవాడు కాబట్టే తిక్కన కవిబ్రహ్మ అయ్యాడు. ఎక్కడ తెలుగు పదాలు వెయ్యాలో, ఎక్కడ తద్భవాలు వాడాలో, ఆ రెంటినీ పద్యాలలో ఎంత సొగసుగా అతకాలో తిక్కనకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. దానికి యీ పద్యం ఒక మచ్చుతునక. మన ప్రాచీన సాహిత్యమంతా వట్టి సంస్కృతభూయిష్టమే అనుకోడం శుద్ధ భ్రమ. అది ఉత్త అనువాదమనో లేదా అర్థంకాని భాష అనో నిరసించి చదవనివాళ్ళనీ, చదవక్కరలేదనేవాళ్ళనీ చూసి జాలిపడ్డం తప్ప వేరే చెయ్యగలిగింది ఏమీ లేదు.

అన్నట్టు అష్టదిగ్గజాలకి (రాయలకొలువులో అష్టదిగ్గజాలు కాదు, ఎనిమిది దిక్కలా ఉన్న ఏనుగులు) పేర్లున్నాయి తెలుసా? ఐరావణ(త), పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీక. వీటి పేర్లూ, అవి ఏ ఏ దిక్కులని మోస్తాయి అన్న విషయమ్మీద ఏకాభిప్రాయం లేదు. ఈ ఏనుగుల భార్యల పేర్లు కూడా పురాణాల్లో ఉన్నాయి. అభ్ర, కపిల, పింగళ, అనుపమ, తామ్రపర్ణి, శుభ్రదంతి, అంగన, అంజనావతి.

సరే మళ్ళీ పద్యం దగ్గరికి వస్తే, ఇంకా ద్రౌపది ఇలా అంటోంది.

సంభావన - దానధర్మాలు, భూజనంబులకు పండువు కాదె - ప్రజలందరికీ పెద్ద పండగే
అతను ప్రజలకి చేసే దానధర్మాలతో వాళ్ళు నిత్యం పండగజరుపుకుంటారట.

మహోగ్ర కోప రేఖా విభవంబు - భీకరమైన కోపం అతను రేఖామాత్రంగా చూపించినా, దాని ఆధిక్యానికి
వైరులకు కాలము చేరువ కాదె - శత్రువులకి కాలం దగ్గరపడినట్టే!
భీముడు తన కోపం రేఖామాత్రంగా చూపించినా అది అతని శత్రువులకి కాలం దగ్గరపడ్డట్టే అని. ఈ కాలం దగ్గరపడ్డం ఇప్పటికీ మనం వాడే పలుకుబడి (కొంచెం ఆధునికంగా చెప్పాలంటే టైం దగ్గరపడిందిరోయ్ అన్నది).

ఇక్కడితో చెప్పవలసిందంతా అయిపోయింది. భీముని భుజబలం, అతని దాతృత్వం, అతని శౌర్యం అన్నీ పొగిడింది. కాని పద్యం పూర్తవ్వలేదు. ఆ చివర్న ఏ మాట వెయ్యాలి? ఇక్కడ మళ్ళీ తిక్కనగారికి శబ్దం మీద ఉన్న పట్టు కనిపిస్తుంది. చివర్న యీ "పావనీ" అన్న సంబోధన ఎంత ఆత్మీయంగా వినిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. "నీ"తో మొదలుపెట్టిన పద్యాన్ని మళ్ళీ "నీ"తోనే ముగించాడు. పావని అంటే పవన కుమారుడు, వాయుపుత్త్రుడు. ఇది సాధారణంగా హనుమంతునికి వాడతారు. కాని భీముడుకూడా వాయువు కుమారుడే కదా. అక్కడ ధర్మరాజు గురించి చెప్పిన పద్యంలో "ధర్మసుతుడు" అని పూర్తయ్యింది. ఇక్కడ పావనీ అని. భీముని దైవాంశని ద్రౌపది సూచిస్తోందన్న మాట! ఈ పదంలో ఇంత ప్రత్యేకత ఉంది.

తిక్కనలాంటి కవి మన తెలుగుసాహిత్యానికి దొరకడం మనం చేసుకున్న అదృష్టం. ఆ కవిత్వాన్ని మనం నిలుపుకుంటామా లేదా అన్నది మన చేతుల్లో ఉంది.


పూర్తిగా చదవండి...

Monday, June 29, 2009

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు...

మొన్న రవిగారు తన కామెంటుతో ఒక మంచి పద్యాన్ని గుర్తుచేసారు. తీగలాగారు - డొంకంతా కదిలింది!

తిక్కన భారతంలోని పద్యమిది. విరాట పర్వంలోది. తెలుగు కవిత్వమ్మీద ఆసక్తీ అభిమానం ఉన్నవారెవరైనా తప్పకుండా చదివి తీరాల్సిన కావ్యం విరాటపర్వం. అవును తిక్కన తీర్చిదిద్దిన విరాటపర్వం అచ్చంగా ఒక కావ్యమే!

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు

నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు

ముందు యీ పద్యాన్ని ఇక్కడ ఘంటసాల శ్రావ్యమైన గొంతులో వినండి. తర్వాత మీదైన గొంతుతో ఎలుగెత్తి కొన్ని సార్లు చదువుకోండి/పాడుకోండి. మన పద్య కవిత్వం మనలో మనం మౌనంగా చదువుకోడానికి కాదు. వినడానికీ, పాడుకోడానికీను. ఇలా గొంతెత్తి పాడితే అది మీ నోటికీ, గొంతుకీ, శ్వాసకీ మంచి ఎక్సర్సైజు కూడాను! నా మాట నమ్మండి.

అయ్యిందా? సరే, ఇప్పుడింక దీని అర్థ తాత్పర్యాలలోకి వెళదాం.

ఎవ్వాని వాకిట - ఎవని వాకిట్లో, ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన, పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, రజోరాజిన్ - రజము అంటే ధూళి రాజి అంటే గుట్ట రజోరాజి అంటే గుట్టగా పడుతున్న ధూళి చేత, అడగు - అణగు (అణిగిపోతుందో)
అతని వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది. ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.

ఎవ్వాని చారిత్రము - ఎవని చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో)
ఎవని చరిత్ర గురువై వినయముయొక్క పద్ధతినీ గొప్పతనాన్నీ లోకమంతటికీ నేర్పుతుందో

ఎవ్వని కడకంట - ఎవని కనుతుదల, నివ్వటిల్లెడు - వ్యాపించే లేదా అతిశయించే, చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో)
ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలు ప్రసాదిస్తుందో

ఎవ్వాని గుణలతలు - ఎవని గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో
ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి. అంటే ఎవని గుణములు లోకమంతా అంతగా ప్రసిద్ధి పొందాయో అని.

అతడు, భూరి ప్రతాప - అధికమైన ప్రతాపం అనే, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే చీకటి గల, వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు

అతనెవరు? తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారం దూరమైపోయింది. అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. దానితో వాళ్ళ కిరీటాలలో ఉండే మణుల కాంతి ఎల్లెప్పుడూ అతని పాదాలని చుట్టుకొని ఉంది.
ఈ చాంతాడు సమాసం ఎందుకో ఈపాటికి అందరూ గ్రహించే ఉంటారు. ఇందులో అందమంతా పొహళింపులోనూ, ఆ కుదింపులోనూ ఉంది. మామూలు వాక్యాలలో చెప్పాలంటే అవసరమయ్యే విభక్తి ప్రత్యయాలు సమాసాల్లో అదృశ్యమైపొతాయి. క్రియలు విశేషణాలుగా మారిపోతాయి. "మహా ప్రదీప దూర విఘటిత గర్వాంధకారము" - మామూలు భాషలో చెప్పాలంటే "మహాజ్యోతి చేత గర్వమనే చీకటి దూరంగా కొట్టబడింది" అని చెప్పాలి. సమాసంలో అన్ని పదాల అవసరం ఉండదు. పటిష్ఠమైన సమాస గ్రధనం వల్ల సాధించే క్లుప్తత యిది. కవిత్వం తెలిసినవాళ్ళకి దీని అవసరం తెలుస్తుంది.

ఇంతకీ ఎవరితను? కేవల మర్త్యుడే - సాధారణమైన మనిషా ఇతను? ధర్మ సుతుడు - యమ ధర్మరాకు కొడుకైన యుధిష్టిరుడు. పాండవుల్లో పెద్దతను. ఇక్కడ ధర్మరాజు సామాన్య మనిషా? కాదు. అని ఒక అర్థం. ఇతను సాధారణ మనిషా? కాదు, స్వయానా యమధర్మ రాజు కొడుకు అని మరో అర్థం.

ధర్మరాజు గొప్పతనాన్ని వర్ణించే భేషైన పద్యం యిది. సాధారణంగా ఎవరికీ ధర్మరాజంటే మంచి అభిప్రాయం ఉండదు. అది చాలా సహజం. కానీ యీ పద్యాన్ని చదివాక "ఆఁ! ధర్మరాజు నిజంగా యింత గొప్పవాడా!" అనుకోక మానరెవరూ. ఈ పద్యం ఎత్తుగడలోనే మనసులని కట్టిపడేసే అద్భుతమైన అలంకారాన్ని ప్రయోగించాడు తిక్కన. దానికి దీటైన నడక. ధర్మరాజు వైభవాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించాడు. రెండవపాదంలో అతని స్వభావాన్నీ, ప్రసిద్ధినీ వర్ణించాడు. మళ్ళి మూడవపాదం అతని సంపద, వైభవం. నాల్గవపాదం మళ్ళీ అతని కీర్తి ప్రసిద్ధి. ఇన్నీ అయ్యాక అసలైన గుణాన్ని ఎత్తుగీతిలో మూడు పాదాలు ఆక్రమించే ఒక సుదీర్ఘ సమాసంలో దట్టించి చెప్పాడు. అది అతని ప్రతాపం. క్షత్రియులకి అతి ముఖ్యమైన గుణం. చివరాఖరికి అతను సాధారణ మానువుడే కాదు అని తేల్చేసాడు. అవును ఇన్నీ ఉంటే అతను మామూలు మనిషి అవుతాడా? పైగా దైవాంశ సంభూతుడు!

ఇదీ తిక్కన పద్యశిల్ప నైపుణ్యం. తీసుకున్నది సీస పద్యం. దానిలో ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తించాలి. పద్యం ఎలా ఎత్తుకుని ఎలా నడిపించి ఎలా ముగిస్తే అది వినేవాళ్ళ గుండెల్లో ముద్రపడిపోతుందో అలా నడిపించాడు. అందుకే యీ పద్యం అంత ప్రసిద్ది పొందింది.

సరే ఇంతకీ యీ పద్యాన్ని ఎవరు చెప్పారు? దీని కథా కమామీషు ఏమిటి? నర్తనశాల చూసినవాళ్ళు యిది బృహన్నల భీమ ద్రౌపదులకి చెపుతున్న పద్యమని అనుకుంటారు. ఆ సినిమాలో అక్కడ సన్నివేశానికి తగ్గట్టు అలా చూపించారు. కాని భారతంలో యీ పద్యం చెప్పింది బృహన్నల కాదు.

ద్రౌపది!

ఇది చదివుతున్న చాలామంది ఒక్కసారి కుర్చీల్లోంచి లేచే ఉంటారు! మరి ద్రౌపది ధర్మరాజు గురించి ఇంత గొప్పగా చెపుతుందని ఊహించడం కష్టమే కదా. అక్కడే ఉంది చమత్కారం. ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట?
సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు. నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు. ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ? అనిపిస్తుంది. ద్రౌపదికి కూడా అనిపించింది. కానీ అలా చెయ్యలేదు కదా! సభా మర్యాద, పాతివ్రత్యమూ మాట దేవుడెరుగు. ముందు తమ నాటకం బయటపడి మళ్ళీ వనవాసం చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి మాటలతో ధర్మరాజు గుండెలో ఒక్క పోటుపొడిచి వెళిపోతుంది. ఆమె అంటుందీ:

"నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు
పెద్దవారి యట్ల పిన్నవారు
గాన, బతుల విధమ కాక యే శైలూషి
గాననంగ రాదు కంక భట్ట

అట్లగుటం జేసి నాకు నాట్యంబును బరిచితంబ. మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున జూదరియాలికి గఱువతనంబెక్కడియది"

"ఓ కంకభట్టూ! నా భర్తే ఒక పెద్ద నటుడు. పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ వెళతారు. అంచేత నా భర్తల తీరే నాదీను. నన్ను నాట్యకత్తె అని తూలనాడ్డం ఎందుకు? అంతే కాదండోయ్! నా భర్తగారు నటుడే (శైలూషుడు అంటే నటుడు) కాదు పెద్ద జూదరి (కితవుడు అంటే జూదరి) కూడాను. జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి?" అంటుంది. ఇక ధర్మరాజు తలెక్కడ పెట్టుకోవాలి?!

సరే ఇదంతా అయిపోయాక, తనలో రగులుతున్న బాధ తీరే మార్గమేదీ అని ఆలోచించి, భీమసేనుడికి చెప్పుకోడానికి వస్తుంది. కీచకుడు తనని చేసిన అవమానాన్ని వివరంగా చెపుతుంది. తన దుఃఖాన్ని వెళ్ళగక్కుతుంది. "మీ యన్న పెద్దతనము జూచితి నేమందు ననిల తనయ" అంటుంది. "ఇంతా జరిగాక మీ అన్నగారు చూపించిన పెద్దతనం చూసావుగదా, ఇంక నేనేమనాలి?" అని నిలదీస్తుంది. నన్నా కీచకుడలా తనిన్నప్పుడు ధర్మరాజు ఎలా చూస్తూ ఊరుకున్నాడని ప్రశ్నిస్తుంది. అప్పుడు భీముడు ద్రౌపదికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ధర్మరాజే కనక ఆపకపోయి ఉంటే నేనా కీచకుణ్ణీ విరటుణ్ణి కూడా అక్కడికక్కడే చంపేసేవాడినని, అదే జరిగితే మళ్ళీ మనం వనవాసానికి వెళ్ళాల్సి వచ్చేదనీ, అప్పుడందరూ ద్రౌపదినీ తననే తప్పుబట్టే వారనీ చెపుతాడు. అంచేత ధర్మరాజుని మెచ్చుకోవాలి కాని తిట్టకూడదని అంటాడు. అప్పుడు మళ్ళి ద్రౌపది అందుకుంటుంది. నేను పొందిన బాధలోనీ కోపంలోనీ అలా అన్నానే కాని నాకు ధర్మం తెలియక కాదు, ధర్మరాజు గొప్పదనం తెలియకా కాదు అంటుంది. ధర్మరాజు గుణగణాలని పొగడ్డం మొదలుపెడుతుంది. అప్పుడా వరసలో చెప్పిన పద్యమే యీ పైన చెప్పిన పద్యం.
ధర్మరాజుని పొగిడి ఊరుకోదు. అంతటివానికి యిన్ని కష్టాలు వచ్చాయే అని వాపోతుంది. ఆ తర్వాత వరుసగా భీమసేనణ్ణి, అర్జునుణ్ణీ, నకుల సహదేవులనీ పేరుపేరునా పొగుడుతుంది. వారికొచ్చిన కష్టాలకి బాధపడుతుంది. చివరికి తనంత దానికి వచ్చిన కష్టాలని చెప్పుకుంటుంది. అన్నీ అయ్యాక మళ్ళీ చివరాఖరికి ఏమిటంటుంది?

ఇందఱకు నిన్నిభంగుల నిడుమ గుడువ
వలసె ధర్మతనూభవు వలన జేసి
దాయ లొడ్డిన మాయజూదంపుటురుల
బడి కులంబున కతడిప్పాటు దెచ్చె

ఇదీ ద్రౌపది వాక్పటిమ. ఇదీ ద్రౌపది దృఢమైన సంపూర్ణమైన వ్యక్తిత్వ చిత్రణ!

ఇంచుమించు ఇదంతా సంస్కృత భారతంలో కూడా ఉన్నదే. కాని తిక్కన దాన్ని మరింత నాటకీయంగా తీర్చిదిద్దాడు. సంస్కృతంలో ద్రౌపది వచ్చీ రాగానే తన గోడంతా వినిపించేసి, పాండవులందరి గొప్పతనాన్నీ వర్ణించేసి వాళ్ళిన్ని కష్టాలు పడుతున్నారే, దీనంతటికీ కారణం ధర్మరాజే అని ముగిస్తుంది. భీముడు ఆ తర్వాత మాట్లాడతాడు. కాని తెలుగు భారతంలో ద్రౌపది భీముల మధ్య మాటలు నాటకంలో సంభాషణల్లా సాగుతాయి. అది తిక్కన రచనలోని నేర్పు.

విరాటపర్వంలోని మరిన్ని ఆణిముత్యాలని ముందుముందు రుచిచూద్దాం!

మళ్ళీ చెపుతున్నాను. తెలుగు కవిత్వం అంటే ఆసక్తి అభిరుచి ఉన్నవాళ్ళు తప్పకుండా చదివి తీరవలసిన కావ్యం తిక్కన విరాట పర్వం (ఆ మాటకొస్తే భారతమంతానూ!).


పూర్తిగా చదవండి...

Monday, June 22, 2009

తెలివి యొకింత లేనియెడ...

భర్తృహరి సుభాషితాల్లో నా మనసుకి చాలా హత్తుకున్న శ్లోకం ఇది:

యదా కించిజ్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞోస్మీత్య భవ దవలిప్తం మమ మనః
యదా కించిత్కించిద్బుధజనసకాశా దవగతం
తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం:

తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంత గర్వముల్

బహుశా యిది నాకు చాలాసార్లు అనుభవమయ్యింది కాబట్టి బాగా హత్తుకొని ఉంటుంది. చాలాసార్లు అనుభవం అయ్యిందంటే, ఎన్నిసార్లు అనుభవమైనా ఆ రోగం కుదరలేదని అర్థం! ఎప్పటికైనా కుదురుతుందనే ఆశ. నాలాగే యీ రోగం చాలామందికి ఉందన్న సంగతి తెలుసుకొని ఊరటపొందాలో మరింత బాధపడాలో మాత్రం తెలియటం లేదు. అందుకే సిసలైన తెలివిగలవాళ్ళు తక్కువైపోతున్నారు. నా అదృష్టం కొద్దీ యీ రోగంలేని ఆరోగ్యవంతులైన విజ్ఞుల సాంగత్యం నాకు కలిగింది.
ఇప్పటి Personality Development నిపుణులకి యీ శ్లోకాన్ని కాని వినిపిస్తే, "This is sheer inferiority complex of this poet" అని కొట్టిపారేస్తారేమో! "ఇలాటివి నువ్వు చదివి వంటపట్టించుకుంటే యిక నీ జన్మలో బాగుపడవు, జీవితంలో ముందుకి వెళ్ళలేవు" అని బెదరగొట్టే అవకాశమూ లేకపోలేదు. "ఇది పాచ్చింతకాయ పచ్చడి, యీ కాలంలో యిది పనికిరాదు. మనకి తెలిసింది గోరంతైనా తెలుసున్నది కొండంత అని చూపించుకోవాలి. చూపించుకోడమే కాదు అదే నిజమని నమ్మాలి కూడా. అవతలవాడసలు నీకన్నా తెలివైనవాడు ఎలా అవుతాడు?" ఇలా లెక్చరు మొదలుపెడతారు కూడా!
బహుశా ఇప్పుడున్న సమాజంలో "విజయం"(success) సాధించడానికి ఈ ధోరణి అవసరమే కావచ్చు. కాని ఎప్పుడైతే మనం మనకి సర్వం తెలుసు, లేదా మనకి తెలిసినది మనం విశ్వసించేదీ నూటికి నూరుపాళ్ళూ నిజం, మరొకళ్ళ దగ్గర మనమేదీ నేర్చుకోలేం అనే స్థితికి వస్తామో అప్పుడు బుద్ధిజీవిగా మనం చచ్చిపోయినట్టే అని నేననుకుంటాను. ఎందుకంటే మనిషి మెదడుకున్న అతి ముఖ్యమైన శక్తి నేరుచుకోవడం తెలుసుకోవడం (దీన్నే గ్రహణ శక్తి అంటారు). ఇది పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండి వయసు మీదపడే కొద్దీ తగ్గుతుందంటారు. నా మనసెప్పుడూ ఆ పసితనాన్ని కోల్పోకూడదని నా కోరిక.

ఎప్పటి శ్లోకం ఇది! భర్తృహరి కాలం సరిగ్గా తెలియదు కాని ఉజ్జాయింపుగా రెండువేల సంవత్సరాల కిందటివాడనుకోవచ్చు. అప్పుడతను చెప్పిన సుభాషితాలు ఇన్నేళ్ళుగా ఎలా నిలిచాయి?! కాగితాలులేవే. పుస్తకాల ప్రచురణ లేదే. కంప్యూటర్లు లేవే. సీడీలు లేవే. వీటన్నిటికన్నా కూడా సమర్థవంతమైన టెక్నాలజీ ఒకటుంది. అది మనిషి మనసు. "సుకవి జీవించు ప్రజల నాలుకల మీద" అన్నారు కదా జాషువా. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి! ఇదే పద్ధతిలో మనకి చాలా సారస్వతం కొన్ని వేల యేళ్ళుగా ప్రసారమవుతూ వచ్చింది. ఈ పద్ధతివల్ల కలిగిన సిసలైన లాభం - ఈ చెప్పిన విషయాలని ప్రజలు తమ హృద్గతం చేసుకోడం. అంటే వీటిని మనసారా నమ్మి ఆచరించడం.
ఏ దేశానికైన సంస్కృతికైనా అయా దేశానికి లేదా సంస్కృతికి చెందిన పౌరులు ఆచరించవలసిన కొన్ని నీతి సూత్రాలు, నైతిక విలువలు (Moral values) ఉంటాయి. ఇవి కాలానుగుణంగా మార్పు చెందుతూ ఊండవచ్చు. కాని ఏ కాలంలోనైనా ఇవి ఉండకుండా పోవు. వీటిని ఆ ప్రజలందరి చేత ఎలా ఆచరింపజెయ్యాలి? ఇది చాలా కష్టమైన విషయం! మన సంస్కృతి కొన్నేళ్ళ క్రితం వరకూ దీనికోసం ఎంచుకున్న మార్గం సాంస్కృతిక ప్రచారం - ఇది ప్రధానంగా కళల ద్వారా, సంప్రదాయాల ద్వారా జరిగేది. ఈ నైతిక విలువలు ప్రజల జీవితంలో భాగమై పోయేవి. దీని వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ నీత్రి సూత్రాలని పాటించని వాళ్ళు అరుదుగానే ఉండేవారని ఊహించవచ్చు.
సరే, ఇప్పుడు మనకా నీతి సూత్రాలు పనిచెయ్యవు. నిజమే! వీటన్నిటినీ కట్టకట్టి ఏ అరేబియా సముద్రంలోనో పడేద్దాం. మంచిది. ఇప్పుడు మన సమాజంలో మనం పాటించాల్సిన నీతి సూత్రాలేంటి? మనది సర్వ తంత్ర స్వతంత్ర దేశం. ఈ దేశ పౌరులుగా మన రాజ్యాంగానికి మనం బద్ధులమై ఉండాలి. మన రాజ్యాంగంలో Fundamental Duties అని ఉన్నాయని ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో చదువుకున్నాం. అంతకు మించి ఎందరికి వాటి గురించి తెలుసు? తెలిసినవాళ్ళు ఎంతమంది వాటిని పాటిస్తున్నారు? మనకి కావలసిందల్లా మనం చేసే పనులు చట్టబద్ధమా కాదా అని. అది తేల్చడానికి కోర్టులు! చట్టం నుంచి తప్పించుకోగలిగినంత వరకూ అందరూ దొరలే! ఇప్పుడు మనం ఏర్పరుచుకున్న వ్యవస్థలో ప్రజలు తప్పులు చెయ్యకుండా ఉండేట్టు చెయ్యడానికి ఎలాంటి ప్రయత్నమూ లేదు. తప్పు చేస్తే విచారించి శిక్షించడానికి తప్ప! తప్పు చేస్తే విచారించి శిక్షించాల్సిన వ్యవస్థ ఉండాలి, కాదనడం లేదు నేను. అది మనకి ఎప్పుడూ ఉంది. But that should be for exceptions. ఇప్పుడు నీతిగా బతక గలగడం ఒక exception అయి కూర్చుందే!
మనం నమ్మిన నీతిని ప్రజల మనసుల్లోకి వెళ్ళేలా చేసి, అది వారి జీవితంలో భాగం కాగలిగినప్పుడే దాన్ని సమర్థవంతంగా అమలు చెయ్యడం సాధ్యం. లేని నాడు కోట్లకి కోట్లు రక్షణ న్యాయ వ్యవస్థల మీద ఖర్చు పెడుతూనే ఉంటాం. వాటికి అందనంత ఎత్తులో అవినీతి ఎప్పుడూ తాండవం చేస్తూనే ఉంటుంది! దీనికి ప్రత్యామ్నాయం వెతకాలంటే మనం కళలనీ సాహిత్యాన్ని ఆశ్రయించాలి. వాటికున్న శక్తిని తక్కువ అంచనా వెయ్యడం సబబు కాదు. మొన్న మొన్న జాతీయోద్యమ కాలంలో ప్రజలలో దేశభక్తిని రగల్చడానికి ఇవి ఎంతగా సాయపడ్డాయో మనకి తెలుసు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు వయోజనవిద్య కుటుంబనియంత్రణ మొదలైన విషయాల ప్రచారానికి ప్రభుత్వం కళలని వాడుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది మధ్యలో ఎప్పుడో తెగిపోయింది. నీతిశతకాలకీ, వీథి భాగవతాలకీ, హరికథలకీ, నాటకాలకీ కాలం చెల్లిపోయింది సరే. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన "కళ" సినిమా. దీనిద్వారానైనా ఎందుకు మన ప్రభుత్వం ప్రచారం చెయ్యకూడదు? ఓ సినిమాలో ఓ పెద్ద హీరో తన మేనకోడలి హత్యకి ప్రతీకారంగా విలన్ని చంపాలనుకుంటాడు. ఒక హీరోయిన్ ఇది తప్పుకాదా అంటుంది. "అలనాడు రాముడు వాలిని చెట్టుచాటునుండి చంపాడు. అవసరమైనప్పుడు అలా చెయ్యడం న్యాయమే!", అని మన హీరోగారి జవాబు. దానికి జనాలు ఈలలూ చప్పట్లూనూ! చట్టవిరుద్ధమైన పనిని అంత బహిరంగంగా ప్రోత్సహిస్తున్న ఆ సినిమా అసలెలా సెన్సారవ్వకుండా విడుదలయ్యింది? అని నిలదీసేవాడు ఒక్కడూ లేడు. ఇది ఏదో ఒకటో రెండో సినిమాల్లో కనిపించే ధోరణి కాదే! మరి దీని గురించి ఒక్కడూ గొంతు పెగల్చడేం? రామాయణమ్మీద విరుచుకుపడమంటే మాత్రం మనకి అమితోత్సాహం!
ఇప్పటికీ మన దేశంలో ఒక సగటు పౌరునికి రక్షణకోసం ప్రభుత్వం ఖర్చుపెట్టే నిధులు అమెరికాలాంటి ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ అనీ, అయినా మన దేశ పౌరుడికున్న భద్రత, ఆ ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువనీ అమర్త్య సేన్ చాలా స్పష్టంగా చెప్పారు. సాంస్కృతికంగా మనకున్న నైతిక విలువలే దీనికి కారణమై ఉండాలని కూడా అన్నారు. ఇప్పటికైనా ఈ విషయమై అందరూ కళ్ళు తెరిచి ఏదైనా చేస్తే బాగుంటుంది.

అబ్బో! పద్యాన్ని వదిలిపెట్టి చాలా దూరం వచ్చేసాను. మనసు కోతి కాబట్టి అదెప్పుడూ శాఖాచంక్రమణం చేస్తూనే ఉంటుంది. సరే మళ్ళీ పద్యం దగ్గరికి వస్తే, లక్ష్మణ కవి యీ శ్లోకానికి చేసిన అనువాదం నాకంతగా నచ్చలేదు. ఎందుకంటే మూల శ్లోకంలో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలని అనువదించకుండా వదిలేశాడు.
ఒకటి: "గజ ఇవ మదాంధః". ఏనుగువలె మదాంధుడినయ్యాను అని. మదము అంటే రెండర్థాలున్నాయి. గర్వం అన్న అర్థం ఒకటైతే, ఏనుగు చెక్కిళ్ళనుంచి కారే ద్రవం అని మరో అర్థం. ఇక్కడ ఏనుగు పరంగా మదం అంటే రెండవ అర్థం వస్తుంది. తన పరంగా గర్వం అన్న అర్థం వస్తుంది. అందుకక్కడ ఏనుగుతో పోలిక సమంజసం. కాని అనువాదంలో ఆ పదం లేదు. అంచేత ఆ ఔచిత్యం లేదు.
రెండు: గర్వమనే జ్వరం పోయింది అని సంస్కృతంలో ఉంది. ఇది చాలా హృద్యమైన పోలిక. ఇది కూడా అనువాదంలో లోపించింది.
అయినా తెలుగు పద్యం చదువుకోడానికి హాయిగా ఉంది!


పూర్తిగా చదవండి...

Sunday, June 14, 2009

పద్యంతో లెక్కల మేజిక్!


నాకు పద్యాలంటే ఎలా ఇష్టమో లెక్కలంటేనూ అలాగే ఇష్టం. మనవాళ్ళు పద్యాలలో కవిత్వం సృష్టించినట్టే లెక్కలుకూడా చేసారు. లెక్కలతో మేజిక్కులు చేసారు. అలాటి ఒక లాజిక్ మేజిక్ ఇప్పుడు మీ కోసం.
ఈ కింద ఇచ్చిన పద్యం ఒకసారి చూడండి:

1. అరి భయంకర చక్ర కరి రక్ష సాగర చాయ శ్రీ కర్బురసాటి యుగళ
2. నాళీక సన్నిభ నయన యండజవాహ వాణీశజనక వైభవ బిడౌజ
4. రాజీవ మందిరా రమణ బుధద్రక్ష వర జటి స్తుత శౌరి వాసుదేవ
8. భూరి కృపాకర బొబ్బిలి పురపాల పాప భుజంగమ పరమ గరుడ
16. దోష శైలేశ శచిదక్ష ద్రుహిణి హేళి

ఇది సీస పద్యం. కాకపోతే ఎత్తుగీతి తేటగీతిలో ఒక పాదమే ఉంది. ఇది విష్ణుమూర్తి స్తోత్రం. ప్రస్తుతం మనం లెక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని అర్థ తాత్పర్యాలు పక్కన పెడదాం (కావలసిన వాళ్ళు ప్రయత్నించవచ్చు).
ఇంతకీ వీటి ముందున్న నెంబర్లేమిటి అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా.

ఇప్పుడు మీరు తెలుగులో ఏదో ఒక అక్షరాన్ని తలుచుకోండి. కాకపోతే చిన్న చిన్న కండిషన్లు. అచ్చుల్లో "అ" ఒకటే తలుచుకోవాలి. హల్లుల్లో "ఙ్", "ఞ్" తలుచుకోకూడదు. అల్ప ప్రాణాలకీ మహా ప్రాణాలకీ తేడా లేదు ("ప", "ఫ" ఒకే అక్షరం. "చ", "ఛ" ఒకటే అక్షరం. ఇలా అన్నమాట). అలాగే "ర", "ఱ" కి తేడా లేదు. గుణింతాలకీ తేడా లేదు ("ప", "పా", "పి"... అన్నీ ఒకటే).

సరే ఒక అక్షరం తలుచుకున్నారా? ఇప్పుడు మీరేం చెయ్యాలంటే, మీరు తలుచుకున్న అక్షరం ఏయే పాదాల్లో ఉన్నాదో గుర్తించండి. సంయుక్తాక్షరం ఉన్నప్పుడు అసలు అక్షరమే లెక్క, వత్తులు కాదు. అంటే "ప్ర" అన్నది "ప" తలుచుకున్నప్పుడే లెక్కలోకి వస్తుంది, "ర" తలుచుకున్నప్పుడు కాదు. ఒక అక్షరం ఒకే పాదంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు వచ్చినా అది ఒకసారే లెక్క. ఆయా పాదాలకి సంబంధించిన సంఖ్యలని కలపండి. ఆ వచ్చిన సంఖ్యని నాకు చెప్పండి. ఉదాహరణకి "డ" తలుచుకున్నారనుకోండి. అది రెండు నాలుగు పాదాల్లో ఉంది. వాటికి సంబంధించిన సంఖ్యలు 2, 8. 2+8 = 10. మీరు నాకు 10 అని చెప్పండి. అప్పుడు మీరు తలుచుకున్న అక్షరం "డ" అని నేను చెప్పేస్తాను. మీరు తలుచుకున్న అక్షరం సరిగ్గా నేను చెప్పేస్తానన్న మాట.

దీనికి నా దగ్గర కంప్యూటరు ప్రొగ్రాములాంటిది ఏదీ లేదు. ఒక్క రెండు వాక్యాలు గుర్తుంచుకుంటే చాలు. అవేవిటో తర్వాత చెప్తాను. ముందు ఆట మొదలుపెడదామా?

అక్షరం తలుచుకొని నెంబరు చెప్పండి. కాయ్ రాజా కాయ్!


పూర్తిగా చదవండి...

Wednesday, June 3, 2009

బాల రసాల...

బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

ఏవిటి, ఇది పోతన పద్యంలా అనిపిస్తోంది కాని కాదు అని ఆలోచిస్తున్నారా? అవును ఇది పోతన పద్యం కాదు. ఇది మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం. ఈ మంచన కవి క్రీ.శ. 1300 ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. పోతనకన్నా ముందరివాడు. ఇక్కడ "కూళలు" అంటే క్రూరుడు, మూఢుడు అనే అర్థం. అటువంటి వారికి సుకుమారమైన కావ్య కన్యకని ఇచ్చి ఆ పడుపుకూడు తినడం కన్నా పొట్టపోసుకోడానికి కవులు హాలికులగా మారి పొలం దున్నుకోడం మంచిది. అదికూడా లేదూ అంటే "కౌద్దాలికులు" అయినా పరవాలేదు అని దీని భావం. "కుద్దాలము" అంటే ఒక రకమైన గడ్డపార. కౌద్దాలికులంటే గడ్డపార పట్టుకొని కందమూలాలు తవ్వి తీసుకొని తినేవాళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి మంచన తన కేయూరబాహు చరిత్రని నండూరి గుండనమంత్రికి అంకితం ఇచ్చాడు. అంచేత ఇక్కడ అతని ఉద్దేశం కావ్యాన్ని కూళలకి అంకితమివ్వకూడనే కాని నరులెవ్వరికీ అంకితమివ్వకూడదని కాదు.

మనకి చాటుపద్యాల సంప్రదాయం ఉండేది. సామాన్య ప్రజల నాలుకల మీదగా చాటువులు ప్రచారం పొందేవి. చాలాసార్లు అసలు వీటిని రాసినదెవరో కూడా తెలియదు. కొన్ని చాటువులు కొందరు కవుల పేర్ల మీద చెలామణీ అవుతూ ఉండేవి. కొన్ని కావ్యాలలోని పద్యాలు కూడా ఇలా చాటువులుగా మారిన సందర్భాలున్నాయి. అదిగో అలా మారిన ఒక చాటువు యీ పద్యం. ఈ చాటువులు మార్పులు చెందుతూ ఉండడం కూడా సాధారణంగా జరిగేదే. అలా కొన్ని మార్పులు చెంది తర్వాత కాలంలో ప్రసిద్ధి పొందిన పద్యం ఇది:

బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

ఈ మార్పులు పద్యానికి మరింత అందాన్నిచ్చాయి. "బాలరసాలపుష్ప" అనడం కన్నా "బాలరసాలసాల" అనడం సొగసుగా లేదూ! "సాలము" అంటే చెట్టు. లేతమావిడి చెట్టుకి పూసిన కొత్తచిగురంత కోమలమైన కావ్య కన్యక అని అర్థం. అలాగే "గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులు" అనడంలో పద్యానికి బిగువు వచ్చింది. "గహనము" అంటే అడవి అని అర్థం. అడవిలోపల కందమూలాలు తవ్వుకుంటూ బతుకు సాగించినా మంచిదే అని అర్థం.

చాటు సంప్రదాయంలో ఇక్కడ జరిగిన మరో గమ్మత్తు, ఈ పద్యం పోతనగారిదని ప్రచారంలోకి రావడం. పోతనగారు నరునికి తన కావ్యాన్ని అంకితమివ్వనన్న విషయం ప్రసిద్ధమే. పోతన రైతు జీవితం గడిపాడన్న విషయం కూడా ప్రచారంలో ఉన్నదే. అంచేత ఊహశాలులెవరో, ఇందులో కూళలు అంటే మూఢులైన మనుషులు అని అర్థం చెప్పి దీన్ని పోతనగారికి అంటగట్టారు. పైగా "హాలికులైననేమి" అని ప్రతిజ్ఞ చేసి రైతుగా జీవితాన్ని కొనసాగించాడని అన్నారు. భలేగా ముడిపెట్టారు కదా! అన్నీ చక్కగా అమరిపోయాయి! అంచేత అది బహుళ ప్రచారంలోకి వచ్చింది.

ఇదీ ఈ పద్యం కథ. ఏది ఏమైనా ఈ పద్యం పోతన నోటినుండి వచ్చిందని ఊహించుకోడమే తెలుగువాళ్ళకి ఇష్టం. ఈ పద్యం చదివినప్పుడల్లా మనకి పోతనే గుర్తుకువస్తాడు. అంచేత ఇది పోతన పద్యమే!


పూర్తిగా చదవండి...

Friday, May 29, 2009

జుగల్‌బందీ

నిన్న రాత్రి నేను గంధర్వలోకానికి వెళ్ళివచ్చాను. మీరు నమ్మరు కాని, ఇది నిజంగా నిజం!

టీవీ రొద కంప్యూటరు సొద కట్టిపెట్టి, స్టీరియో ఆన్ చేసాను. చేతిలో పుస్తకం తీసుకుని పక్కమీదకి ఒరిగాను.

आपको देख कर देखता रह गया!
क्या कहूँ और कहने को क्या रह गया!


మెల్లగా జగ్జీత్ సింగ్ పాట శ్రావ్యంగా మొదలయ్యింది.

మలయ పవను కౌగిలిలోనె పులకరించి
హాయిగా కంఠమెత్తు ప్రాయంపు వంశి
విశ్వమోహను జిలిబిలి పెదవులంటి
అవశమైపోయి ఏమి చేయంగ లేదు


కృష్ణశాస్త్రి గీతం మెత్త మెత్తగా మనసుకి హత్తుకోడం మొదలు పెట్టింది.

ఒకపక్క జగ్జీత్ సింగ్ మరోపక్క కృష్ణశాస్త్రి. ఇద్దరి సంగీతం ఒకేసారి - చుక్కా చుక్కా హృదయంలోకి ఇంకుతూ ఉంటే, చిక్కని మధువేదో గొంతులో బొట్టుబొట్టూ దిగుతున్న అనుభూతి. ఒక తీయని మైకం కమ్ముకుంటోంది.

ओ मेरे सामनेही गया... और मै...
रासतेकी तरहा देखता रह गया...


జగ్జీత్ సింగ్ గొంతులో భావం ఎంత బాగా పలుకుతుంది!

నాటి తుది సందె చీకటి కాటుకల విలీనమైపోవు రాజమార్గాన,
నీవు కదలిపోతివి విషాదసుఖమ్ము గూర్చి
సగము నిద్దురలో క్రమ్ము స్వప్న మటుల
ఆపుకోలేని మమత, ఘంటాపథమ్ము నడుమ పరువిడి,
నిలబడినాడ నట్టె


విషాదసుఖం! ఆ అనుభూతి కృష్ణశాస్త్రికి మాత్రమే తెలుసు.

కృష్ణశాస్త్రి నాకు సరిగ్గా సరైన వయస్సులోనే పరిచయమయ్యారు. మాకు ఇంటరులో అతని "అన్వేషణము" పాఠంగా ఉండేది. కృష్ణశాస్త్రి నాకు పరిచయమయ్యింది అప్పుడే! అప్పుడప్పుడే యవ్వనపు రెక్కలు వస్తూ వస్తూ ఉన్నాయి. ప్రపంచాన్ని నా కళ్ళతో చూడాలని కొత్తగా తెలుస్తోంది. ఎవో తెలియని కొత్త కొత్త భావాలు మనసుని గిలిగింతలు పెట్టే రోజులవి. సరిగ్గా అప్పుడు పరిచయమైన కవి కృష్ణశాస్త్రి. ఆ మాటలు కొత్త. ఆ భావాలు కొత్త. అప్పుడప్పుడే విచ్చుకుంటూన్న మొగ్గ రేకులపై, మెల్లిగా తుమ్మెద వాలినట్లు - ఆ కవిత్వం నా హృదయాన్ని తాకేది.

इश्ख की दास्तान है प्यारी
अपनि अपनि ज़बान है प्यारी


సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను?


పాత రోజులు గుర్తుకు తెచ్చుకోడానికి కొంతమంది పాత ఫొటోలు చూస్తారు. కొందరు డైరీలో పాతపేజీలు తిరగేస్తారు. చదివిన పుస్తకాలని, విన్న పాటలని మళ్ళీ ఒకసారి స్పృశిస్తాను నేను. జ్ఞాపకాల జల్లుని కురిపిస్తున్నాయి జగ్జీత్ సింగ్ పాటలు. జ్ఞాపకాల పరిమళాలని విరజిమ్ముతునాయి కృష్ణశాస్త్రి కవితలు. ఒకేసారి, వాన జల్లులో తడుస్తూ తడి మట్టివాసన పీల్చిన అనుభూతి.

कल चौदवी की रात थी, शब् भर रहा चरचा तेरा
कुछ ने कहा ये चाँद है, कुछ ने कहा चहरा तेरा


నిన్న రాతిరి చికురంపు నీలికొనల
జారిపడిన స్వప్నమ్ము నిజమ్మొ ఏమొ
కోమ లామోద కౌముదీ కోరకమ్మొ
సుర విలాసవతీ ప్రేమ చుంబనమ్మొ


కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి - ఇంటర్ తర్వాత తెలుగు నేలకి దూరంగా కలకత్తాలో ప్రవాసం చెయ్యాల్సి వచ్చినప్పుడు నాకు తోడున్న మిత్రులలో వీళ్ళూ ఉన్నారు. ఈ పాత స్నేహితుల్ని పలకరించేసరికి ఆ పాతరోజులు గుర్తుకొచ్చాయి. కేంపస్ లో మా హాస్టల్ ముందు ఒక చిన్న సరస్సు. చుట్టూ కొబ్బరిచెట్లు. కొబ్బరీనెల సందుల్లోంచి జాలువారే వెన్నెల కిరణాల్లో తడుస్తూ, ఆ సరసు చుట్టూ చక్కర్లు కొట్టడం ఎంత మజాగా ఉండేదో! ఆలా నడుస్తూ నడుస్తూ "తలిరాకు జొంపముల సందుల త్రోవల నేలవాలు తుహినకిరణ కోమల రేఖవొ!" అని కృష్ణశాస్త్రి కవితలని స్మరించుకుంటూ ఉంటే అది మరెంత మజా! హాస్టల్ డాబా మీద, పున్నమి ఏకాంతంలో, కృష్ణపక్షం చదువుకోడం - అదో వింత అనుభూతి!

పాట మధ్యలో దీపక్ పాండె వాయులీన స్వరప్రస్తారం సమ్మోహనంగా వినిపిస్తోంది. అహా! ఆ కృష్ణుని వేణుగానం రాధికకి ఇలాగే వినిపించిందా?

ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల
పడిపోవు విరికన్నె వలపువోలె
తీయని మల్లెపూదేనె సోనలపైని
తూగాడు తలిరాకు దోనెవోలె
తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై
పరువెత్తు కోయిల పాటవోలె
వెల్లువలై పారు వెలది వెన్నెలలోన
మునిగిపోయిన మబ్బుతునుకవోలె

చిరుత తొలకరివానగా, చిన్ని సొనగ,
పొంగిపొరలెడు కాల్వగా, నింగి కెగయు
కడలిగా, పిల్లగ్రోవిని వెడలు వింత
తీయదనముల లీనమైపోయె నెడద


వాయులీన ప్రస్తారం తారస్థాయిని అందుకుంది.

పరువు పరువున పోవు నెదతో
పరువులెత్తితి మరచి మేనే
మరచి సర్వము నన్ను నేనే
మరచి నడిరేయిన్


మరో కొత్త గజల్ మొదలయ్యింది.

तेरे कदमोंपे सर होगा... कज़ा सरपे खड़ी होगी...
फिर उस सजदे का क्या कहना... एक अनोखी बंदगी होगी...


ఏ మాటని ఎలా ఎంతవరకూ ఉచ్చరిస్తే అందులో భావం పలుకుతుందో - ఆ కళ సంపూర్ణంగా తెలిసిన గాయకుడు జగ్జీత్ సింగ్. జాగ్జీత్ సింగ్ నాకు కొంచెం ఆలస్యంగా పరిచయమయ్యారు. అవి డిగ్రీ అయిపోయి పీజీ చదువుతున్న రోజులు. పీజీలో కొత్తగా చేరిన రాజేష్ శుక్లా నాకితన్ని పరిచయం చేసాడు. తన రూములో ఉన్న కేసెట్ చూస్తూ ఉంటే, నీకు నచ్చుతాయి తీసుకెళ్ళి విను అని ఇచ్చాడు. ఆ కేసెట్ తెచ్చుకొని వాక్ మేన్ లో పెట్టి మొట్టమొదటిసారి జగ్జీత్ సింగ్ గొంతు విన్న ఆ క్షణం ఇంకా గుర్తే!

तुम्हें दानिस्ता महफ़िल में जो देखा हो तो मुजरिम
नज़र आखिर नज़र है बे-इरादा उठ गयी होगी


ఏను మరణించుచున్నాను ఇటు నశించు
నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు...

నా మరణశయ్య పరచుకొన్నాను నేనె
నేనె నాకు వీడ్కొలుపు విన్పించినాను
నేనె నాపయి వాలినా నేనె జాలి
నెదనెద గదించినాను, రోదించినాను


కృష్ణశాస్త్రి, జగ్జీత్ సింగ్. ఎన్నో ఏళ్ళనుంచీ ఇద్దరూ తెలుసు. అయినా, ఇద్దరినీ ఒకేసారి పలకరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇన్నాళ్ళూ రాలేదు. ఆశ్చర్యం!
ఇది కవిత్వాన్ని మించిన ఆల్కెమి!

अपनि होठों पर सजाना चाहताहूँ
आ तुझे मैं गुनगुनाना चाहताहूँ


నాకు మాత్రము గానమున్నంత వరకు
చాలు చాలు నీ ప్రణయనిశ్వాస మొకటి
మోసికొందునొ నా గీతములను నిన్ను
మూగవోదునొ రాయియైపోయి చిరము


మత్తు మనసంతా ఆవరిస్తోంది. నన్ను నేనే మరచిపోయే స్థితికి చేరువవుతున్నాను. బరువెక్కిన కన్నులు అక్షరాల వెంట చాలా మెల్లగా కదులుతున్నాయి. తెరలు తెరలుగా చెవులని సోకుతున్న గజల్.

कोई आंसू तेरे दामन पर गिराकर
बूंदको मोती बनाना चाहताहूँ


ప్రియతమా ఇక నిదురింతు పిలువబోకె
బాసిపోకు నిర్భాగ్యపు బ్రతుకు దాటి!
ప్రియతమా పొరలి పొరలి మొయిళులేవొ
మేలుకొననీవు రెప్పల వాలి అదిమి!


थक गया मैं करते करते याद तुझको
अब तुझे मैं याद आना चाहता हूँ


రెప్పలు మూసుకుపోయాయి. ఎక్కడో దూరం నుంచి వినిపిస్తోంది.

आखरी हिच्चकी तेरे ज़ानों पे आये... आखरी हिच्चकी... हिच्चकी... हिच्चकी

हिच्चकी మంద్రస్థాయికి... ఇంకా మంద్రస్థాయికి వెళ్ళిపోతోంది...

आखरी हिच्चकी तेरे ज़ानों पे आये...
मौत भी मै शायराना चाहताहूँ...


పూర్తిగా చదవండి...

Friday, May 22, 2009

కవిత్వము - కాంతిసంవత్సరాలు


ఇంక నా వల్ల కాదు బాబోయ్! ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. మొన్నీ మధ్యన ఒక బ్లాగులో ఏదో కథల సంపుటి గురించిన టపాలో బ్లాగరొక విషయం చెప్పారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒకరికి కాలం ఒక కాంతిసంవత్సరంలా గడిచిందని ఆ కథలో ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. (సరిగ్గా ఇదే కాకపోవచ్చు కాని తాత్పర్యం ఇదే). దానికి కొత్తపాళిగారు కామెంటులో ఈ కాంతిసంవత్సరం ఇంకా శాస్త్ర పరిభాషేనని సాహిత్యంలో రచయితలకి అంతగా తెలిసనట్టు లేదని అన్నారు. అప్పుడే ఈ టపా రాద్దామనుకున్నాను. కాని ఆవు వ్యాసం కథ మాదిరి అవుతుందేమోనని ఆ ఉత్సాహాన్ని అణుచుకున్నాను. మొన్నటికి మొన్న మళ్ళీ "నా ప్రపంచం" బ్లాగులో ఇన్నయ్యగారు రాసిన ఈ వాక్యం నా కంటబడింది: " భూమికి అతి సమీపం లో వుండే తార నుండి కిరణాలు రావడానికి 4 కాంతి సంవత్చరాలు పడుతుంది". ఇక రాయకుండా ఉండలేక పోయాను :-)

ఇది చాలామందికి తెలిసిన విషయమే (అయినా చాలామంది పప్పులో కాలేస్తూ ఉంటారు!). "కాంతి సంవత్సరాలు" కాలాన్ని కొలిచే పరిమాణం కాదు. అది దూరాన్ని కొలుస్తుంది. కాంతి, శూన్యంలో ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని "కాంతి సంవత్సరం" అంటారు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల మధ్య ఎంత దూరం ఉంటుందంటే, ఒక గోళం కాంతి మరొక గోళాన్ని చేరడానికి ఏళ్ళకి ఏళ్ళే పడుతూ ఉంటుంది. అంచేత వాటి మధ్యనున్న దూరాన్ని కొలవడానికి దీన్ని వాడతారు. ఇక్కడ మరో విశేషం ఏవిటంటే, ప్రస్తుత భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం కాంతి కన్నా వేగంగా ఏదీ ప్రయాణం చెయ్యలేదు. అంచేత పెద్ద పెద్ద దూరాలని కొలవడానికి కాంతి సంవత్సరానికి మించిన ప్రమాణం లేదు.
"ఇంతకీ యీ సోదంతా ఎందుకు. గూగులిస్తే దీనికన్నా ఎన్నో రెట్ల సమాచారం మాకు దొరుకుతుంది. ఇందులో కవిత్వం ఏవిటుంది?" అనుకుంటున్నారా. ఇదిగో వస్తున్నా, వస్తున్నా.


గోళ కాంతిచ్ఛటల్ పెరగోళములకు
బయనముం జేయ నబ్దముల్ బట్టునట్లు
రాచదేవిడీలందు వార్తలును జేర
బ్రభువు ప్రభువును మధ్య నబ్దములు బట్టు

ఒక గోళపు కాంతి కిరణాలు మరొక గోళానికి ప్రయాణించడానికి కొన్ని సంవత్సరాలే పట్టవచ్చు. అలాగే రాచదేవిడీల మధ్య రాజుకీ రాజుకీ వార్తలు ప్రయాణం చెయ్యడానికి సంవత్సరాలే పట్టేస్తుందిట. ఇదేం పోలిక! ఎక్కడి పోలిక?
ఇది అరణ్య కాండలోని మొట్టమొదటి పద్యం. ఈ పోలిక ద్వారా, రాచదేవిడీల మధ్యనుండే భౌతికమైన దూరమే కాదు, వాటి మధ్యనుండే శూన్యాన్ని కూడా స్ఫురింప జేస్తున్నాడు కవి. ఇంతకీ వార్తలు తెలియడానికి అంత కాలంపట్టేదని ఎందుకంటున్నాడు? దానికి ఈ పోలిక ఎందుకు చెప్పాడు? నేను వివరించడం ఎందుకు. శ్రీ వడలి మందేశ్వర రావుగారి యీ వివరణ చదవండి ("<>" మధ్యనున్న మాటలు నా పుడకలు):

***
ఈ పద్యాన్ని ఈ శతాబ్దపు కవే వ్రాయాలి. ఏమంటే వెనుకటివాళ్ళకు కాంతిసంవత్సరాలతో అంత పరిచయం లేదు కనుక. అయితే ఈ ఆధునిక భావాన్ని ఉపమానంగా గ్రహించి కవి సాధించింది ఏమిటి? అంటే - చాలా ఉంది. అయోధ్యకాండ అంతా ఉంది.
కవి చెప్పదలచుకున్నది: బహుశా నీవు 20వ శతాబ్దిలో ఉండి, నీ రేడియో, ట్రాన్సిస్టర్ సాధనాలతో ప్రపంచంలో ఎక్కడ, ఏమూల జరిగిన వార్తనైనా క్షణాలమీద అందుకో గలవు కదా అని, ఈ కథలోని వార్తలు కూడా అలా ప్రయాణం చేస్తాయని అనుకుంటావేమో, అలా కాదు సుమా! అంటున్నాడు కవి.

నాటికీ, నేటికీ విశ్వాంతరాళంలోని ఒక గోళపు కాంతి మరో గోళానికి ప్రయాణం చేయడానికి పట్టే వ్యవధి కొన్ని క్షణాలనుంచి కొన్ని సంవత్సరాల వరకూ ఉండవచ్చు. అలాగే ఆనాడు కొన్ని వార్తలు గుప్పున వ్యాపించేవి. కాని, ప్రభువుకూ ప్రభువుకూ మధ్య రాచదేవిడీలలో వార్తలందడానికి ఆ రోజుల్లో ఏండ్లు పూండ్లు పట్టేది.

దీనికింత ప్రాధాన్యం ఇస్తూ తొలిపద్యంలోనే ఎందుకు చెప్పాలి అంటే, ఇందులోని కథ అంతా దీనిమీదనే ఆధారపడి ఉన్నది కనుకనే.
రామునికి ఆత్మలో ఒక విరాగం కలిగింది. ఆ మీద అది శాంతించింది(<ఇదంతా జరగడానికి ఏడాదిపైగా పట్టింది!>). ఇంత కథ జరిగాక కాని, దశరథున కా విషయం తెలియనే తెలియదు. తెలిస్తే తొందరపడి భరత శత్రుఘ్నులుండగానే రాముని యౌవ రాజ్యాభిషేకం జరిగి ఉండేది. రామకథ బాలకాండతో ముగిసి ఉండేది.

కైకకు అధికార పూర్వకంగా రామపట్టాభిషేక వార్తనంద జేసింది మంథర!(<అదీ ఎప్పుడు? పట్టాభిషేకం ఈ రోజో రేపో అనగాను!>) అవును -
"గోళ కాంతిచ్ఛటల్ పెరగోళములకు బయనముం జేయ నబ్దములు పట్టు!"

అయోధ్యలోనే ఒకరి మాట ఒకరి కందడానికి ఇలా ఉంటే, అయోధ్యనుంచి కేకయ రాజధానికి వార్తలందటానికి దశాబ్దాలే పడుతుంది. రాచదేవిడీలోనికి అడుగుపెట్టి కైకమ్మను చూసేవరకూ భరతునికి ఏ వార్తా తెలియనే తెలియదు. తెలిస్తే కథే లేదు కదా!
అయోధ్యకాండ అంతా ఈ వార్త నత్తనడకలా నడవడంలోనే ఉంది. వార్తలోని వ్యవధానం వల్లనే మంథర కైక మనసును మార్చ యత్నించింది. వార్తలందడంలోని వ్యవథానం వల్లనే కౌసల్యనుంచీ, భరద్వాజునినుంచీ, లక్ష్మణుడూ, గుహుని వరకూ అందరూ భరతుణ్ణి అవమానంగా చూశారు.

(<ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, పట్టాభిషేకం రోజువరకూ కైకేయికి ఆ వార్త ఎందుకు తెలియలేదు, భరతుడికి కూడా తల్లిని చూసే దాకా ఎందుకు తెలియలేదు అన్న విషయం వాల్మీకంలో స్పష్టంగా లేదు. అందికే, దశరథుడు కోరుండే ఈ వార్త కైకేయికీ కేకయ రాజుకీ తెలియకుండా దాచాడన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇక్కడకూడా మన తెలుగు కవి దీనికి వివరణ ఇవ్వలేదు. కవితాత్మకంగా ఒక పోలిక చెప్పి వదిలేసాడు!>)

చిత్రమేమంటే "గోళ కాంతిచ్ఛటల్ పెరగోళములకు" చేరడానికి అబ్దములు పట్టగా కొన్ని వార్తలు మాత్రం ఎన్నాళ్ళయినా అందనే అందవు.
రాముడొక స్వయం ప్రకాశ జ్యోతి అనుకుంటే, అతనిలో కల్గిన వైరాగ్య భావమన్న కాంతి దశరథ గోళానికి అందడానికి తగినంత కాలం పట్టింది. కాని దేవతలు వచ్చి రాముని రాజ్యమేల వద్దన్న వార్త దశరథునికి అందనే లేదు. రాముని కోర్కె మీదనే - దేవతల ఋణాన్ని తీర్చడానికే - కైకమ్మ వరాలను కోరిందన్న వార్త లోకానికి తెలియనే తెలియదు! అవును:
"గోళ కాంతి చ్ఛటల్ పెరగోళములకు
బయనముం జేయ నబ్దముల్ బట్టు!"

(<"ఏవిటీ కొత్త కథ? ఏమిటి లోకానికి తెలియని యీ వింత వార్త!" అనుకుంటున్నారా? దీని గురించి తీరుబడిగా మరోసారి మరోచోట ముచ్చటించుకుందాం.>)

***

అన్నట్టు, ఈ కవి ఎవరో ఇది ఏ కావ్యంలోదో నేను వేరేగా చెప్పక్కరలేదు కదా! :-)


పూర్తిగా చదవండి...