క్రిందటిసారి నేనిచ్చిన మూడు ప్రహేళికలను పూర్తిచేసిన వాళ్ళకీ, ఆసక్తితో ప్రయత్నించిన వాళ్ళకీ అభినందనలు. మొదటి టపాలో రంగాన్ని మాత్రం సిద్ధపరుచుకున్నాము. అక్కడ వేసుకున్న ప్రశ్నలకి సమాధానాలు వెతకడం ఇంక మొదలుపెడదామా. దీనికి కాస్త థియరీ అవసరం అవుతుంది మరి. మరీ బోరు కొట్టకుండా వివరించే ప్రయత్నం చేస్తాను.
ఆ థియరీలోకి వెళ్ళే ముందు మళ్ళీ మీ మెదడుకి మేత. క్రితం సారి పద్యాలయ్యాయి కదా, ఈ మారు సరదాగా సినిమా పాటలు తీసుకుందాం. ఒక రెండు సినిమా పాటల పల్లవులని క్రింద ఇస్తున్నాను, "తనన" భాషలో. ఆ పాటలేమిటో గుర్తుపట్టండి చూద్దాం!
మొదటిది:
తనన తనన తనన తనన తానానా
తనన తనన తనన తనన తానానా
తననన తననన తానన తానానా
తననన తననన తానన తానానా
తనన తనన తనన తాన
రెండోది:
తానా తననననన తానా
తానాన తానాన తాన తనానా
తానా తానా తానా
తానా తానా తానానా (అమెరికావాళ్ళ "తానా"కీ దీనికీ ఏ సంబంధం లేదని మనవి :-)
సరే, ఇంక అసలు విషయంలోకి వద్దాము. ఒక వాక్యమో లేదా వాక్య సముదాయమో పలికేటప్పుడు, అందులో ప్రతి అక్షరం పలకడానికి కొంత సమయం తీసుకుంటాము కదా. అలా తీసుకునే కాలం ఒక ప్రత్యేక క్రమంలో ఉంటే అది పద్యం అవుతుంది అని ముందటి టపాలో చెప్పాను. ఒకో అక్షరాన్ని పలకడానికి తీసుకునే సమయం, ఆ అక్షరాన్నిబట్టి మారుతుంది కదా. ఉదాహరణకి దీర్ఘాలు ఉన్న అక్షరాలు, మామూలు అక్షరాల (హ్రస్వాలు) కన్నా కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఉదాహరణకి "ఆకాశము" అన్నప్పుడు "శ", "ము" అనే అక్షరాలు పలకడానికి తీసుకునే సమయం కన్నా, "ఆ", "కా" అనే అక్షరాలు పలకడానికి ఎక్కువ సమయం తీసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే "సంగతి" అన్నప్పుడు "సం" అనే అక్షరం ఎక్కువ సమయం తీసుకుంటుంది పలికేటప్పుడు. ఇలా పలకడానికి మామూలు కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకునే అక్షరాలని "గురువులు" అని ఒక పేరుపెట్టారు. ఎక్కువ సమయం తీసుకోని మిగతా అక్షరాలని "లఘువులు" అని అంటారు. ఈ గురులఘువుల గురించి ఇంతకు ముందు "పెద్దోడు చిన్నోడు" అనే టపాలో వివరంగా వ్రాసాను. ఒక లఘువు పలకడానికి కావలసిన సమయాన్ని ఒక మాత్ర అని అంటారు. గురువుకయితే రెండు మాత్రల సమయం పడుతుందని సుమారుగా సంస్కృత ఛందస్సు వ్రాసినవాళ్ళు నిర్ణయించారు. తమిళ ఛందస్సులలో అయితే మరో కేటగిరీ కూడా ఉంది. తెలుగు ప్రధానంగా సంస్కృత ఛందస్సునే అనుసరిస్తుంది కాబట్టి మనకి ఉన్నవి గురువు, లగువు అని రెండే కేటగిరీలు.
అంచేత ఒక వాక్యంలో ఉన్న గురు లఘువుల క్రమం, లేదా మాత్రల క్రమం, ఆ వాక్యపు నడకని పట్టి ఇస్తుందన్న మాట. ఈ గురు లఘు క్రమంలో ఒక నియమాన్ని పెడితే, అది దాని నడకలో ఒక ప్రత్యేకతని తెస్తుంది. అలాంటి వాక్య సముదాయాలు పద్యం అవుతాయి. అయితే పద్యాన్ని నిర్వచించేటప్పుడు వాక్యాల ప్రసక్తి కాకుండా, పాదాలను నిర్వచిస్తాం. ఒక ప్రత్యేకమైన నడక కలిగిన అక్షర సముదాయాన్ని ఒక పాదం అంటాం. అలాంటి రెండు లేక అంత కన్నా ఎక్కువ పాదాల కలయిక ఒక పద్యం అవుతుంది. దీని గురించి నా మొదటి టపాలోను, "ఛందస్సు - కథా కమామీషు" టపాలోనూ మరి కొంచెం వివరించాను.
మనకి స్కూల్లో పరిచయమయ్యే మొదటి వృత్తం ఉత్పలమాల. "భరనభభరవ" అని కంఠస్థం చేస్తాం కదా. అంతకన్నా ముందే "యమాతారాజభానసలగం" అన్నది కూడా కంఠస్థం చేస్తాము. ఏమిటీ ఛందస్సు? ప్రతి పాదంలోనూ ఉండే గురు లఘువుల క్రమాన్ని నిర్దేశించే ఒక ఛందస్సు ఇది.
UIIUIUIIIUIIUIIUIUIU - ఇదీ ఆ గురు లఘువుల వరస. ఉత్పలమాల పద్యంలో నాలుగు పాదాలు. ప్రతి పాదంలోనూ అక్షరాలు సరిగ్గా ఇదే గురులఘువుల క్రమంలో ఉండాలన్నమాట. చిన్నప్పుడు మీ తెలుగు టీచరు ఇలాగే ఇదంతా చెప్పేటప్పుడు మీకు బోరుగా అనిపించలేదూ? అనిపించే ఉంటుంది! ఇప్పుడూ అలాగే ఉందా? సరే మనం మరికాస్త సరదా కోసం, కాస్త గ్రాఫిక్కుల జిమ్మిక్కులు చేద్దాం. ఈ గురులఘువుల క్రమాన్ని ఒక గ్రాఫులా గీస్తే ఎలా ఉంటుందో చూద్దాం:
ఇదిగో ఇలా ఉంటుంది! లఘువుకి విలువ 2, గురువుకి విలువ 4 ఇచ్చానిక్కడ. ఎందుకో మరికొంత సేపట్లో తెలుస్తుంది. మొదలు చివరలని స్పష్టంగా చూపించడం కోసం ముందొకటి వెనకొకటి సున్నాలు తగిలించాను. బావుందా! ఉత్పలమాలలో ఉన్న ఏ పద్యాన్ని తీసుకుని ఈ గ్రాఫు గీసినా కచ్చితంగా ఇలాగే ఉంటుంది.
సరే ఇప్పుడిలాగే చంపకమాలని కూడా చూద్దాం:
ఉత్పల చంపకమాలలోని పోలిక ఇట్టే గుర్తుపట్టారు కదా!
సరే ఇంతకీ ముందు టపాలో మనం Pattern Recoginition వగైరా వగైరా మాట్లాడుకున్నాం కదా. ప్రతి ఛందస్సుకీ ఇలాంటి గ్రాఫొకటి తయారుచేసుకుని, ఇచ్చిన పద్యానికి ఒక గ్రాఫు వేసి పోలిస్తే ఇట్టే తెలిసిపోతుంది, అవునా? మరి ఇందులో ఇంతగా ఆలోచించడానికీ ఏముంది? ఏమీ లేదంటే లేదు, ఉందంటే ఉంది. వృత్త పద్యాలని తీసుకుని చిన్నప్పుడు బడిలో చేసినట్టు గురువు లఘువు గుర్తుపట్టి, దాన్ని వృత్త నిర్వచనలాతో పోల్చి ఏ వృత్తమో సులువుగానే చెప్పవచ్చు. గురు లఘువులని గుర్తుపట్టడమే కొంచెం క్లిష్టమైన పని కాని, అది చేసిన తర్వాత కంప్యూటరు కూడా ఇట్టే గుర్తుపట్టేస్తుంది. ఇందులో చెప్పుకోదగ్గ Pattern Recognition ఏమీ లేదు. గుర్తుపట్టాల్సిన సమాచారమంతా అచ్చు గుద్దినట్టు ఒకే మూసలో ఉంటే చాలా తేలికగా గుర్తుపట్టెయ్య వచ్చు. సమాచారంలో వైవిధ్యం ఉండి, కొంత శాతం గోల గజిబిజి ఉన్నప్పుడు, అందులోంచి నమూనాని వెలికి తియ్యడం అసలైన ఛాలెంజి. మరి ఇలాంటి వృత్త పద్యాలలో ఆ వైవిధ్యం ఎక్కడనుంచి వస్తుంది?
ఎక్కడ నుంచి వస్తుందంటే, పద్యాన్ని చదివేటప్పుడు వస్తుంది. మనం పద్యాన్ని చదవగానే, లేదా వినగానే ఆ ఛందస్సుని గుర్తుపట్టాలంటే ఎలా? పలికినప్పుడు ప్రతి ఉత్పలమాల పద్యం మనకి ఒకేలా వినిపించదు. ఒకో పద్యం ఒకోలా వినిపిస్తుంది. ఈ వైవిధ్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అందులో ఒక ప్రధానమైన కారణాన్ని తెలుసుకుందాము. మనము పద్యం చదివేటప్పుడు, సాధారణంగా ఒకే గుక్కలో చదువుకుంటూ పోము కదా. మధ్య మధ్యలో కొంత విరామం తీసుకుంటాము. ఎక్కడ? ప్రతి పదం తర్వాత ఒక అతి చిన్న విరామం తీసుకుంటాము. అలాగే వాక్యం పూర్తయినప్పుడు కూడా కొంత విరామం తీసుకుంటాము. మధ్య మధ్యలో తీసుకునే ఈ విరామాలు పద్యపు నడకలో చాలా తేడాలని కలిగిస్తాయి. ఉదాహరణకి ఉత్పలమాల పద్యాలలోవే, ఈ రెండు పాదాలు చదివి చూడండి:
సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బోంకుచే
నీ కనుదోయి వెన్నెలలు నిండిన నా హృదయాంగణమ్ములో
చదువుకున్నారా. ఇంక వీటినే గ్రాఫుల రూపంలో చూద్దాము. విరామాలని ఒక అక్షరంగా భావించి, దాని విలువ 1 ఇచ్చి గ్రాఫుని గీస్తే, అవి ఇలా ఉంటాయి:
ఇప్పుడు చెప్పండి, ఈ రెండూ ఒకటే నమూనాకి (ఛందస్సుకి) చెందిన పద్య పాదాలని గుర్తించడం అంత సులువంటారా? కాదు కదా. పద్యాలని విని, వాటి నడకబట్టి ఛందస్సుని కనుక్కోవడంలో ఉన్న కష్టం చాలావరకూ దీని వల్లనే వస్తుంది. ఇలా పదాల మధ్య వచ్చే విరామాలలో తేడాల వల్ల, ఒకే ఛందస్సులోని పద్య పాదాలకి అనేక వేల రకాల నడకలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటిలోనూ ఉన్న విరామాల గోలని తొలగించి, అసలు నమూనాని గుర్తుపట్టడం ఒక పెద్ద సవాలు. ఆ పనిని మన మెదడు చక్కగా చెయ్యగలదు, తగిన సాధన చేస్తే!
కొంతమంది ఏం చేస్తారంటే, చదివినప్పుడు పదాలతో సంబంధం లేకుండా మూడేసి అక్షరాలని కలిపి చదువుకుని, నడకేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఉదాహరణకి, "నీ కనుదోయి..." పాదాన్ని, "నీకను దోయివె న్నెలలు నిండిన నాహృద యాంగణ మ్ములో". అలా చదువుకుంటే, ఉత్పలమాల పాదాలన్నీ సుమారుగా ఒకే నడకతో వినిపిస్తాయి. గుర్తుపట్టడం కాస్త సులువవుతుంది. దీని కన్నా కూడా మేలైన పద్ధతి మన మెదడనే కంప్యూటరుకి సాధ్యమైనంత ఎక్కువ "డాటా"ని అందివ్వడమే. అంటే ఒకే వృత్తంలో ఉన్న బోలెడు పద్యాలని మనం కంఠస్థం చేస్తే, ఆ వృత్త నడకని వినగానే గుర్తుపట్ట గలిగే ప్రజ్ఞని మన మెదడు సంపాదిస్తుంది. చక్కని నడకతో పద్యాలని వ్రాయడానికీ, ఆశువుగా పద్యాలని అల్లడానికీ ఈ ప్రజ్ఞ చాలా అవసరం.
వృత్తాలలో నడకని గ్రాఫులలో చూసే ప్రయత్నం చేసాము. వృత్తాల నిర్వచనంలో ఉన్న నిర్దిష్టత, వాటిని పద్యంగా నిర్మించేటప్పుడు (తద్వారా చదివేటప్పుడు) ఎలా లోపిస్తుందో తెలుసుకున్నాము. ఆ గోల ఎక్కడనుంచి వస్తుందో కూడా చూసాము. చేరాగారు వీటిని మూడు స్థాయిలగా వివరించారు ఒకచోట - నిర్వచనము, నిర్మాణము (రచించడం), నిర్వహణ (చదవడము). మనం నిర్మాణము, నిర్వహణ ఒకేలా ఉంటుందని అనుకున్నామిక్కడ. ఈసారికి ఇక్కడతో ఆపుదాం.
తర్వాత టపాలో మన తెలుగు ఛందస్సులని ఇలాగే పరిశీలిద్దాం. ఆటవెలది, తేటగీతి, కందం లాంటి ఛందస్సులని ఇలా గ్రాఫులలో ఎలా చూపించాలో ఆసక్తి ఉన్నవాళ్ళు ఆలోచించండి. మీకేమైనా మంచి ఆలోచన వస్తే, నాతో పంచుకోండి. ఎందుకంటే ఎలా చూపించాలో ఇంకా నేను నిర్ణయించుకోలేదు.
పూర్తిగా చదవండి...





