తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, November 26, 2012

మృత్యుంజయా!


శివుడి మీద నాకు చాలా యిష్టమైన పద్యాలలో శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారి "మృత్యుంజయా" పద్యాలు ముందువరసలో ఉంటాయి. వాటిలో హాస్యముంది, భక్తి ఉంది, ఆర్తి ఉంది, అధిక్షేపణ ఉంది. ఎన్నెన్నో భావాలొలికిస్తాయవి. వాటన్నిటిలోనూ అంతస్సూత్రంగా ఒకానొక ఆత్మీయత మెరిసిపోతూ ఉంటుంది.

పాపమీ కవి ఈశ్వరునికి తన గోడేదో చెప్పుకుందామనుకుంటాడు. అంతలోనే ఒక పెద్ద అనుమానం వచ్చిపడుతుంది! అసలు తన మొఱ ఆ యీశ్వరునికి వినిపిస్తుందా అని. ఎందుకా అనుమానమంటే చెపుతున్నాడు కవి:

మెడ నాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా
బిడతో నీ కెపు డొక్కటే గుసగుసల్, వీక్షించి మీ చంద మె
క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీ చెవిం
బడుటేలాగునొ మా మొఱల్ తెలియదప్పా మాకు మృత్యుంజయా!

ఓ వైపు పాముల బుసబుసలు, మరోవైపు అర్థాంగితో గుసగుసలు. అది చూసి నెత్తినున్న గంగమ్మకు రుసరుసలు! ఈ గోలలో తనలాంటి భక్తుల మొఱలు ఆయనకెలా వినిపిస్తాయని కవిగారి సంశయం. "అప్పా" అన్న సంబోధనలో ఎంత ఆత్మీయత ఉంది! శివయ్య తనను కన్నతండ్రి అని పరిపూర్ణంగా నమ్మిన భక్తుడీ కవి. ఆ చనువుతోనే ఇంకా ఏమంటాడంటే:

ఒక లంబోదరుడైన పుత్రకుడు మున్నున్నట్టిదే నీకు జా
లక కాబోలును సృష్టి జేసితివి యీ లంబోదరుం గూడ, దీ
గకు గాయల్ బరువౌన, కాని, కుడుముల్ గల్పించి యవ్వాని కే
లొకొ యివ్వానికి నొక్కమైని యిడుముల్ మొల్పింతు మృత్యుంజయా!

"ఏమయ్యా మృత్యుంజయా! నీకు లంబోదరుడైన పుత్రుడు ముందే ఒకడున్నాడు కదా (గణపతి అన్న మాట!). అతడు చాలక కాబోలు మరో లంబోదరుడైన నన్ను పుట్టించావు! (కవిగారిది బానపొట్ట కాబోలు :-)) సరే, తీగకు కాయలు బరువా? పుట్టించావు. బాగానే ఉంది. కానీ, ఆ కుమారునికేమో చక్కగా కుడుములు పెడతావు. ఈ కోడుకుని మాత్రం యిడుములపాలు చేస్తున్నావే, ఇదేమి న్యాయం?" అంటూ నిలదీస్తాడు కవి.

ఒక గాఢమైన తాత్త్విక విషయాన్ని కూడా లేలేత నవ్వులలో ఎలా పలికించ వచ్చో యీ పద్యం చూస్తే తెలుస్తుంది:

సరిలే! మానవకోటి యీ వెలుపలన్ సంసారచక్రాననే
దొరలన్ లేకిటులుండ, లో నొకటి రెండున్ గావె షడ్చక్రముల్
వరుసన్ జేర్చి బిగించినావుగద అబ్బా! నాగపాశాలతో
దరియింపన్ దరమౌనె నీ కరుణచేతన్ గాక మృత్యుంజయా!

"సరిసరి! మేము బయటనున్న సంసారమనే ఒకే ఒక చక్రంలో పడి అందులోనుంచే బయటపడలేక సతమతమవుతూంటే, అది చాలదన్నట్టు, మా లోపల ఒకటికాదు రెండుకాదు ఆరు చక్రాలను నాగపాశాలతో బిగించేసావు కదా! అబ్బా! నీ కరుణ లేకుండా వీటిని భేదించడం మాకు సాధ్యమవుతుందా చెప్పు!" అంటున్నాడు. మాట్లాడే భాషలోని కాకువు, నుడికారంలోని సొగసు, అవలీలగా పద్యంలో నిబంధించడం ఈ కవిగారికి బాగా తెలిసిన విద్య అనిపిస్తుంది యీ పద్యాలు చూస్తే.

వీరి పద్యాలలో హాస్యమొక్కటే కాదు, గాఢమైన అనుభూతీ ఆర్తీ కూడా ఉన్నాయి.

ఏ బైకిన్ దెగపండితుండనను పేరే గాని నాలోని కే
బో బోవంగను జెప్ప లజ్జయయిపోవున్ నేను నా బుద్ధికే
యే బొడ్డూడని బిడ్డనో యగుదు తండ్రీ! నిక్క మీపాటిదే
నా బండారము, త్రోవ నీవిడక యున్నంగాదు మృత్యుంజయా!

నిజమైన ఆత్మవిమర్శా ఆత్మావలోకనమూ చేసుకున్నప్పుడు అహంకారం పూర్తిగా తొలగిపోతుందనడాన్ని యీ పద్యం చెపుతోంది. "పైకి నేను తెగ పండితుడనన్న పేరుంది కానీ, నిజంగా లోలోపల తొంగిచూసుకుంటే నా మీద నాకే సిగ్గువేస్తుంది. నేను నాకే ఒక బొడ్డూడని బిడ్డలాగా కనిపిస్తాను. నా బండారం నిజంగా అంతే! అంచేత నువ్వే నాకు తోవ చూపించాలి" అంటున్నాడు కవి. లోలోపలకి తొంగి చూసుకుంటే మన పరిమితులు మనకి స్పష్టంగా బోధపడతాయి. అనంతమైన ఈ విశ్వంలో విస్తరించిన శక్తి ముందు మన శక్తి ఎంత అల్పమైనదో మనకి తెలిసివస్తుంది.

శివునికీ వెన్నెలకీ ఉన్న విడదీయలేని సంబంధం మనకీ కవి పద్యాలలో కూడా కనిపిస్తుంది:

ఎల్లన్ నీవయిపోయి నీవు తలపై ఏ చిన్నిపువ్వట్లొ జా
బిల్లిం దాలిచియుండ, వెన్నెలలుగా విశ్వాన నీకాంతులే
వెల్లింగొల్పెడునట్టులున్నయవి యీ వేళా విశేషమ్ముచే
వెళ్ళంబుచ్చకు మింక దీని మనసే వేఱయ్యె మృత్యుంజయా!

లోకమ్మందునగాక వెన్నెలలు లోలో గాయునట్లుండె, న
య్యాకాశమ్మున నున్న జాబిలియు నాయందున్న డెందమ్ము ని
ట్లేకాకారత నొంద నేమి కతమో! యీ యాత్మ సంబంధమున్
నీ కారుణ్యముచేత నేర్పడుటగానే తోచు మృత్యుంజయా!

జగత్తంతా శివమయమయ్యింది. ఆతని తనుకాంతి విశ్వమంతా వెన్నెలలై విరాజిల్లింది. మామూలు మనిషికి వెన్నెల బయట లోకంలో మాత్రమే కనిపిస్తుంది. అంతా శివుడే అయిన భక్తునికి తనలోపల కూడా వెన్నలలు విరబూస్తాయి. ఆకాశంలోని జాబిలి తనలోని మనస్సూ ఒకటే అయిపోతాయి(చంద్రుడు మనసుకి అధిపతని అనేది ఇందుకేనేమో!). అప్పుడా కరుణామయుడైన పరమేశ్వరుడు ఆ భక్తుని మనస్సునే తలపూవుగా ధరిస్తాడు కాబోలు!

పూర్తిగా చదవండి...

Monday, November 19, 2012

దివ్వెలనెల


దివ్వెలనెల మొదలయ్యింది. నేలమీద నువ్వుల దివ్వె, నింగిపైన వెన్నెల దివ్వె. ఆకాశంలో వెలిగే ఆ రత్నదీపం శంకరునికి ఆభరణం. ప్రమిదలో దీపం అచ్చంగా జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే యిది పరమశివునికి యిష్టమైన నెల. అందులోనూ కార్తీక సోమవారం మరింత ప్రీతికరం. అంచేత యీ రోజు శివుని గురించిన పద్యం చదువుకుంటే పుణ్యంపురుషార్థమూను!

తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు. శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ!

శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా
రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!

ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్. సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది. అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి యిలా కోరుకుంటున్నాడు కవి. "ఓ దేవా! నీ కరుణ అనే శరత్కాలాన్ని ప్రసాదించవయ్యా, అంతే చాలు. అప్పుడు వికసించిన నా మనస్సులో నిరంతరం నిన్నే భావన చేస్తూ, ఆ సేవలో తామరతంపరగా నా బతుకు వెళ్ళదీస్తాను".

ఈ పద్యంలో ఎంతటి భక్తి ఉందో అంతటి కవిత్వముంది. ఈ శతకమంతా అంతే! సంపదని మెరుపుతో పోల్చడంలో ఎంతో ఔచిత్యం ఉంది. సంపద కూడా మెరుపులాగే మనసుని ఆకట్టుకుంటుంది. కళ్ళను జిగేల్మనిపిస్తుంది. మెరుపు లాగానే అది కూడా అతి చంచలం. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పలేం. అతి తక్కువ కాలం నిలుస్తుంది. సంపద అనే మెరుపు లేకపోతే సంసారమనే మేఘానికి అందమే లేదు. ఒక చిన్న పోలికలో లోతైన భావస్ఫూర్తి నిబంధించడం గొప్ప కవిత్వ లక్షణం! ఇక్కడ మరొక చమత్కారం ఉంది. కావ్యాలని శ్రీకారంతో మొదలుపెట్టడమనేది ఒక ఆనవాయితీ, "శ్రీ" శుభాన్ని సూచిస్తుందని. ఇక్కడ కూడా కవి శ్రీకారంతోనే శతకాన్ని మొదలుపెట్టాడు. అయితే అది శుభసూచకంగా కాక చంచలమైన సంపదని సూచించేందుకు వాడుకొని, దానినుండి తనని రక్షించమని ఈశ్వరుణ్ణి కోరుకొంటున్నాడు! అంటే సంపదమీద కవికి ఎంతటి తిరస్కృతి ఏర్పడిందో దీనివల్ల స్ఫురిస్తుంది. ఈశ్వరుని కరుణను శరత్కాలంగా వర్ణించడం కూడా మనోజ్ఞమైన పోలిక. చల్లని చూపుల వెన్నెలలు కురిపిస్తే అది శరత్తుకాక ఇంకేమవుతుంది. ఈ కార్తీకమాసమంతా ఆ ఈశ్వరుని కరుణాశరత్సమయమే కదా! ఈ మాసంలోనే భక్తుల హృదయసరసీరుహాలు నిండుగా విచ్చుకుంటాయి. వికసించిన ఆ పద్మాలలో శశిశేఖరుడు కొలువుంటాడు. అప్పుడిక బతుకంతా వెన్నెలే! చివరి పాదంలో "తామరతంపర" మళ్ళీ చక్కని అర్థస్ఫూర్తి కలిగిన పదం. "తామరతంపర" అంటే మంచి అభివృద్ధి, సౌభాగ్యం అనే అర్థాలు వస్తాయి. ఈ పదబంధానికి అసలు అర్థం "తామరల సమూహం". తామరల సమూహంతో ఎలా అయితే కొలను కళకళలాడుతుందో, అలాగే బతుకు శోభిస్తుందని వాడుకలో ఆ అర్థం స్థిరపడింది. ఇక్కడ సందర్భానికది చక్కగా అతికింది! శరత్కాలం కాబట్టి తామరతంపర. గణాలూ యతిప్రాసలూ సరిపోయినంత మాత్రాన అది పద్యమవుతుంది కాని కవిత్వం కాదు. ప్రతిపదమూ ఔచిత్యంతో కూడుకొని, లోతైన అర్థస్ఫూర్తితో, గాఢమైన అనుభూతిని మిగిల్చినప్పుడే అది చిక్కని చక్కని కవిత్వం అవుతుంది. అలాంటి కవిత్వమే నిలుస్తుంది. ధూర్జటి కవిత్వం అలాంటి కవిత్వం. అందుకే అతడు "స్తుతమతియైన ఆంధ్రకవి".

పూర్తిగా చదవండి...