తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Showing posts with label పోతన. Show all posts
Showing posts with label పోతన. Show all posts

Monday, October 3, 2011

పోతన కవితామాధుర్య రహస్యం

మొన్న పోతన పద్యాల గురించి టపాయిస్తున్నప్పుడు, కరుణశ్రీగారి పద్యమొకటి గుర్తుకొచ్చింది:

అచ్చపు జుంటితేనియల, నైందవబింబ సుధారసాల, గో
ర్వెచ్చని పాలమీగడల, విచ్చిన కన్నెగులాబి మొగ్గలన్
మచ్చరికించు నీ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ
వెచ్చట నేర్చినావు సుకవీ! సుకుమారకళా కళానిధీ!

పోతన కవితామాధుర్యాన్ని కొన్ని వస్తువులతో పోలుస్తున్నారిక్కడ. స్వఛ్చమైన జుంటితేనె, చంద్రబింబంనుండి స్రవించే అమృతరసము, గోర్వెచ్చని పాలమీగడ, అప్పుడే విచ్చుకున్న గులాబి మొగ్గలు - వీటికి అసూయ కలిగించేలా ఉంటుందట పోతన కవిత్వం. ఏదో రకంగా తాను చవిచూసిన మాధుర్యాన్ని మాటల్లో చెప్పాలన్న తాపత్రయమే కాని, నిజానికి ఆ మాధుర్యం అనుభవైకవేద్యమే కాని ఉపమానాలకి అందుతుందా! అంతటి మధుర మంజుల మోహన ముగ్ధ శైలి ఎక్కడినుండి వచ్చిందో, అని ఆశ్చర్యపోతున్నారు కూడా. అలా ఆశ్చర్యపడి ఊరుకో లేదు:

ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ
ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు నీ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!

అని దానికొక అందమైన ఊహనికూడా జోడించారు. ఆ మాధుర్యం వెనక కారణం పంచదార అని కరుణశ్రీగారి ఊహ. అంటే అంత తియ్యగా ఉంటుంది అతని రచన అని! కరుణశ్రీ స్వయంగా ఒక కవి కాబట్టి కవితాత్మకమైన అలాంటి కల్పన చేసారు. ఒక వ్యక్తిలో కనిపించే అసాధారణ విశిష్టత గురించి ఏవో కల్పనలు చెయ్యడం మానవ సహజం కాబోలు. ముఖ్యంగా మన భారతీయులకి అది బాగా అలవాటనుకుంటాను. ఊహ, కల్పనే కావచ్చు. అయినా, ఏదో ఒక కారణం వెతకడం మనకొక సరదా.

ఈ మధ్య సౌందర్యలహరి చదువుతూ ఉంటే నాకూ అలాంటీ ఒక ఊహ కలిగింది. ఆ ఊహకి మూలమైన శ్లోకం:

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటామ్
వరత్రాస త్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరామ్
సకృన్నత్త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణా ఫణితయః

సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులవారు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించడం వల్ల కలిగే వివిధ శక్తుల గురించి వివరిస్తారు. ఈ శ్లోకంలో అమ్మవారి సరస్వతీ రూపాన్ని వర్ణిస్తున్నారు. శరత్కాలపు వెన్నెలంత స్వచ్ఛమైనది తెల్లనిది, చంద్రవంకతో కూడిన జటాజూటం కలిగినది, అభయ ముద్ర, వరద ముద్ర, అక్షమాల, పుస్తకము ధరించిన చేతులు కలిగినది, అయిన నీ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారికి తేనె పాలు ద్రాక్షరసముతో పోల్చదగిన తియ్యని కవిత్వ శైలి లభిస్తుంది అని అర్థం.
శరత్కాలానికీ శారదకీ ఉన్న అవినాభావసంబంధం ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది.

పోతన అలాంటి సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించడమే అతని కవిత్వమాధుర్యానికి కారణమని నా ఊహ. పోతన ఆ రూపాన్ని ఆరాధించాడనడానికి ఏమిటి సాక్ష్యం అంటే, అతని యీ రెండు పద్యాలు:

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

భారతీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడీ పద్యంలో. తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, సుధాసముద్రము, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి అతనికి. వాటన్నిటితో పోలిస్తే కాని తృప్తి కలగలేదతనికి!

ఇక రెండో పద్యం:

క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి, అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్

అక్షమాల, పుస్తకము (చిలక, పద్మము కూడా) కలిగిన వాణీ స్వరూపాన్ని మ్రొక్కే పద్యమిది.

ఈ రెండు పద్యాలబట్టి పోతన సౌందర్యలహరిలో ఆదిశంకరులు చెప్పిన స్వరూపాన్ని ఆరాధంచాడనీ, పోతన కవితామాధుర్యం వెనకనున్న రహస్యం అదేనని ఊహించడం అసమంజసం కాదు కదా!

ఏదేమయినా కవిత్వం, అందునా అలాంటి తియ్యని కవిత్వం సృజించగలగడం ఒక అద్భుత శక్తి. ఆ శక్తికి సంకేతం సరస్వతీ స్వరూపం. అలాంటి అనేక శక్తి రూపాలని ఆరాధించే పండుగ దసరా. పనిలో పనిగా మిగిలిన ఇద్దరు ప్రధానశక్తులు, లక్ష్మీ దుర్గల గూర్చి, పోతనగారే చేసిన స్తుతిని కూడా చదువుకొని ఆనందిద్దాం:

హరికిన్ బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంబు పెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణముల్

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

అందరికీ దసరా శుభాకాంక్షలు!
పూర్తిగా చదవండి...

Sunday, September 11, 2011

ముచ్చటయిన మూడు కృష్ణ వర్ణనలు

భాగవతంలో కృష్ణుని వర్ణనలకి కొదవేముంది! అందులోనూ పోతన తెలుగుపోత, మధురాతిమధురం. ఆ వర్ణనలు చేస్తున్నప్పుడా భక్తకవి ఆ మాధవునితో తాదాత్మ్యాన్ని పొందే ఉంటాడనిపిస్తుంది! అలాంటి భాగవతంలో నాకు బాగా నచ్చిన మూడు శ్రీకృష్ణ వర్ణనలని ఎంచమంటే, నేనెంచుకొనే మూడు పద్యాల గురించి ఇప్పుడు చెపుతాను.

ఒకటి:

కడుపున దిండుగా గట్టిన వలువలో
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాఱి రానీక డా చంక నిఱికి
మీగడపెరుగుతో మేళవించిన చల్ది
ముద్ద డాపలి చేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు
వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగడీల నడుమ జక్కగ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె

ఈ పద్యాన్ని చదివితే అనిపిస్తుంది, పెద్దయ్యాక సంగతి చెప్పలేము కానీ చిన్ననాటి యీ బాలకృష్ణుడు మాత్రం పదహారణాల తెలుగబ్బాయే అని. ఇలాంటి అచ్చమైన తెలుగు కైతలని అచ్చులు పోసిన పోతనకి తెలుగుజాతి ఎప్పటికీ ఋణపడిపోయింది! చిన్నారి కిట్టయ్య తన చెలికాళ్ళతో కలిసి ఆడుతూపాడుతూ చల్ది తినే దృశ్యాన్ని మనకి కళ్ళకి కట్టిస్తున్నాడు పోతన. ఎంత చూడముచ్చటయిన దృశ్యమది! సర్వయాగాలకూ భోక్త అయిన ఆ పరమాత్ముడేనా ఇలా చిన్నమగవాని రూపంలో చల్ది కుడుస్తున్నదీ అని దేవతలందరూ ఆశ్చర్యపోయారట ఆ దృశ్యాన్ని చూసి.

ఆవుల్ని తోలుకొని ఊరుబయట వనంలోకి గోపాలకులందరూ వచ్చారు. భోజనం వేళ అయ్యేసరికి తెచ్చుకున్న చల్ది తినాలని అందరూ కూర్చున్నారు. కృష్ణుడి చేతిలో ఎప్పుడూ మురళి ఉంటుంది కదా! మరి అన్నం తినేదెలా? ఆ వంశనాళాన్ని (అంటే వెదురు గొట్టం!) తన నడుము చుట్టూ చుట్టగా కట్టుకున్న తుండుగుడ్డలో జొనిపాడు. అంతేనా - ఆవులని అదిలించేందుకు చిన్న బెత్తము (వేత్రదండం), కొమ్ముబూరా కూడా ఉన్నాయి చేతిలో. వాటినేమో జాఱిపోకుండా ఎడం చంకలో ఇఱికించాడు. అదే చేతిలో చలిది ముద్దని అదిమి పట్టుకున్నాడు. మాములు చల్దన్నమా అది! చక్కని చిక్కని మీగడపెరుగుతో కలిపినది. మరి ఆ పెరుగన్నంలో నంచుకోడానికి ఏమిటున్నాయి? చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలున్నాయి. అంటే ఇంకాస్త కావాలి, ఇంకాస్త కావాలని బతిమాలో పేచీపెట్టో తెచ్చుకున్న ఊరగాయ అన్నమాట! అది వ్రేళ్ళ సందుల్లో ఇఱికించాడు. హాయిగా స్నేహితుల మధ్య (సంగిడీలు - స్నేహితులకి చక్కని తెలుగుపదం) కూర్చుని, ఊసులాడుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా చల్ది ఆరగిస్తున్నాడు చిన్ని కన్నయ్య. చేతిలో ఉన్న వేణువునీ బెత్తాన్నీ కొమ్ముబూరనీ పక్కన పెట్టవచ్చు కదా! అలా తన దగ్గరే అట్టేపెట్టుకోడంలో బాలకృష్ణుని పసితనం మన కళ్ళకిగడుతుంది. అదీ పోతన వర్ణనలోని అందం! మీగడపెరుగుతో మేళవించిన చల్ది, ఊరగాయలూ తెలుగుదనపు ఘుమఘుమలు. వాటిని మీగడతరకల్లాంటి తెలుగుపదాలతో మేళవించి తెలుగు చిన్నారి కిట్టమూర్తిని మన కళ్ళముందుంచాడు పోతన.

ఈ పద్యం వెనక తమాషా అయిన కథ ఒకటి ఉంది. కృష్ణుడు గోపాలబాలలతో అడవికి వచ్చినప్పుడు అఘాసురుడనే రాక్షసుడు పెద్ద పాము రూపంలో వచ్చి నోరు తెరచి పడుకుంటాడు. తోవలో అడ్డంగా ఉన్నది పామేమో అని అనుమానించినా, మన వెనక కృష్ణుడుండగా మనకి భయమేమిటని పిల్లలంతా ఆ పామునోట్లోకి వెళ్ళిపోతారు. అయితే ఆ పాము నోట్లోని విషజ్వాలలకి అందరూ చనిపోతారు. తనమీద అంతటి గుడ్డి నమ్మకాన్ని పెట్టుకున్న ఆ గోపాలుర మీద జాలిపడి కృష్ణుడు ఆ పాము గొంతు చీల్చి చంపి, పిల్లలని తిరిగి బతికిస్తాడు. ఇదంతా చూసిన బ్రహ్మ ఆశ్చర్యపోతాడు. అంతటి బ్రహ్మనీ మాయ ఆవరిస్తుంది. అతను కృష్ణుడిని మామూలు బాలుడే అనుకొని, ఈ బాలుడికి ప్రాణాలిచ్చే శక్తి ఎక్కడిదని ఆశ్చర్యపోతాడు. కృష్ణుడిని మరింత పరీక్షించాలని చెప్పి, ఇలా హాయిగా కూర్చుని చల్దులు తింటున్న సమయంలో ఆవులన్నిటినీ మాయం చేసేస్తాడు. ఆవులని వెతుక్కుంటూ కృష్ణుడు వెళ్ళి, కనపడక తిరిగివచ్చి చూస్తే గోపబాలురందరూ కనిపించకుండా పోతారు. బ్రహ్మ అందరినీ ఒక గుహలో దాచేస్తాడు. సంగతి తెలుసుకున్న కృష్ణుడు తనే ఆ సమస్త గోవులూ గోపబాలుర రూపాలని ధరించి అందరి ఇళ్ళకీ వెళ్ళిపోతాడు. ఇలా ఏడాది గడిచిపోతుంది. బ్రహ్మ కాలమానంలో అది ఒక క్షణం. బ్రహ్మకి మతిపోతుంది! ఏమిటీ మాయ? సృష్టి చేసే బ్రహ్మ నేనొక్కడినే కదా! మరి అన్ని గోవలనీ, అంతమంది పిల్లలనీ ఎవరు సృష్టించారు? ఇలా తికమక పడుతూ ఉంటే కృష్ణుని విశ్వరూప సందర్శనం అవుతుంది. మాయ తొలగిపోతుంది. ఈ బ్రహ్మ పదవి వదిలేసి, హాయిగా తనూ ఓ గోపాలబాలుడై కృష్ణుడితో కలిసి అలా చల్ది కుడిస్తే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటాడు.
అదీ కథ!

ఇక రెండో పద్యం:

కటి చేలంబు బిగించి, పింఛమున జక్కం గొప్పు బంధించి, దో
స్తట సంస్ఫాలన మాచరించి, చరణద్వంద్వంబు గీలించి, త
త్కుటశాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్

ఇది చాలా మందికి తెలిసిన పద్యమే. కృష్ణుడు కాళీయమర్దనానికి సంరంభంతో ఉరుకుతున్న సందర్భం. పైన చెప్పిన పద్యం ఒక స్థిరచిత్రం (still photograph) అయితే, ఇది చలనచిత్రం! అందులో కృష్ణుని పసితనం కనిపిస్తే ఇందులో గోపకిశోరుని పొంగు మన కళ్ళముందు కదలాడుతుంది.

ఉత్తరీయాన్ని నడుముకి బిగించాడు. జాఱకుండా పింఛాన్ని చక్కగా కొప్పున బంధించాడు. జబ్బలు రెండూ చఱిచాడు. రెండు కాళ్ళనీ దగ్గరగా తెచ్చాడు. తెచ్చి, ఆ చెట్టుకొమ్మపైనుండి గభాలున చెఱువులోకి దూకాడు. ఎవరు? సింహకిశోరం లాంటి గోపాలుడు. "లాంటి" ఏవిటి, అప్పుడతడు సింహకిశోరమే! అంతెత్తునుండి దూకేసరికి, గుభగుభమన్న శబ్దం నలుదిక్కులా నిండిపోయిందట!

పద్య నిర్మాణంలోని సొగసు బిగువు వల్ల కృష్ణుడిలో ఉఱకలు వేస్తున్న అదే ఉత్సాహం మనలోనూ కలగడం లేదూ! అదీ కవిత్వమంటే!

ముచ్చటగా మూడో పద్యం ఇదిగో:

త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప, ప్రాభాత నీ
రజ బంధు ప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్‌

ఈ పద్యం ఎందుకంత ఇష్టమంటే చెప్పడం కష్టం! మొదటి పద్యంలో లాగా ఒక రూపాన్ని విస్తృతంగా వర్ణించే పద్యం కాదిది. కదిలే చిత్రాన్ని అక్షరాలలో బంధించే పద్యమూ కాదు. ఈ పద్యంలో కనిపించే కృష్ణుడు అపురూప ధీర సౌందర్య విలసితుడు. ఇందులో ఏదో తెలియని అలౌకికత ఉంది. ఆధ్యాత్మికావేశముంది. అది త్రిజగ్నమోహనమైన నీలకాంతి. నీలమంటే నలుపు. నలుపుకి కాంతి ఎక్కడిది? అదే మాయ. ముజ్జగాలనీ మోహింప జేసే మాయ. నల్లని మేఘముపై పడిన ఉదయసూర్యుని అరుణారుణకిరణంలా పైన ఉత్తరీయం ప్రకాశిస్తోంది. ఆ మూర్తిలో ఒక ఉత్సాహముంది. ఆ ఉత్సాహమా ముఖారవిందముపై కదలాడే నీలి ముంగురులలో ద్యోతకమవుతోంది. మా విజయునికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహమది.
ఆహా! అలాంటి వన్నెలాడు మోహనకృష్ణుని ఆ రూపం మదిలో ఆవేశించిన భీష్ముడు ఎంతటి ధన్యుడు! దాన్ని చూసి మనకి చూపించిన పోతన మరెంత ధన్యుడు!

పూర్తిగా చదవండి...

Thursday, September 23, 2010

ఆదిన్ శ్రీసతి కొప్పుపై...

ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!

పోతన భాగవతంలో వామనావతార ఘట్టం తెలియని వాళ్ళు అరుదు. ఇందులో చాలా ప్రసిద్ధమైన పద్యాలే ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి. దానమియ్యవద్దని బోధించిన శుక్రాచార్యునితో బలిచక్రవర్తి అంటున్న మాటలు. వచ్చినవాడు వామన రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువని శుక్రాచార్యుడు కనిపెట్టాడు. అదే బలిచక్రవర్తికి చెప్పాడు. నిజానికీ విషయం చూచాయగా బలిచక్రవర్తికి కూడా తెలిసింది. లేకుంటే, ఒక బాల వటువు తన యజ్ఞశాలకు వస్తే, "ఇయ్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్, గడు ధన్యాత్ముడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె, నా కోరికల్ గడతేఱెన్" అని అనడంలో ఔచిత్యమేముంది? అయితే ఆ జ్ఞానం పరిపూర్ణమవ్వలేదు. అందుకే వెంటనే, "వర చేలంబులొ, మాడలో, ఫలములో..." ఏవి కావాలంటే అవి కోరుకోమన్నాడు. సరే శుక్రాచార్యుడు చెప్పిన తర్వాత అతడు శ్రీమహావిష్ణువే అన్న ఎఱుక పూర్తిగా స్థిరపడింది. రాక్షసుడైనా, బలిచక్రవర్తి విష్ణు భక్తుడే! అతనికి తన తాత ప్రహ్లాదుని పోలికలే వచ్చాయి మరి. అటువంటి విష్ణుమూర్తి స్వయంగా తన దగ్గరకి వచ్చి దానం అడుగుతూంటే, అంత కన్నా అదృష్టం మరేముంది అనుకున్నాడు. ఎందుకు? ఎవరా విష్ణుమూర్తి? సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి పెనిమిటి. అంటే ప్రపంచంలోనున్న సర్వ సంపదలతో నిత్యభోగాన్ని అనుభవించే వాడు. మరొకళ్ళకి ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం తెలియనివాడు. ఆ వైభోగాన్ని ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. భార్య అయిన లక్ష్మీదేవి కొప్పుపైన శరీరంపైన పైటకొంగుపైన పాదాలపైన బుగ్గలపైన పాలిండ్లపైన ఉండే చెయ్యి ఆయనది. అలా ఉండడం వల్ల ఆ చేయికి ఎప్పుడూ నూత్న మర్యాద కలుగుతుందట! ఇదొక వింత మాట! ఇక్కడ విష్ణువుని ఒక మామూలు పురుషుడిగా లక్ష్మీదేవిని మామూలు స్త్రీగా ఊహించుకొని, ఇక్కడ వర్ణించినది ఆ భార్యాభర్తల శృంగారాన్ని అనుకుంటే, ఈ "నూత్న మర్యాదన్ జెందు" అనే మాట పొసగదే! ఇది వట్టి సాంసారిక శృంగారమైతే, ఆ చేతికి కొత్త మర్యాద ఎక్కడనుండి వస్తుంది? రాదు. ఇక్కడ వర్ణించిన లక్ష్మీదేవి అంగాలన్నీ వివిధ రకాలైన సంపదలని మనం భావించాలి. అలాంటి సంపదలని లోకానికి ఎప్పుడూ దానం చేస్తూ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఆ చేతికొక కొత్త గౌరవం వస్తుందన్నమాట. అలా ఎప్పుడూ పైనే ఉండే చెయ్యి ఇప్పుడు కిందయ్యింది! తన చేయి ఆ చేతిపైన ఉంది. అంటే లోకానికి సమస్త సంపదలనీ అందించే విష్ణువుకి కూడా తాను ఇవ్వగలిగింది ఏదో ఉందన్న మాట. అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఏముంటుంది! ఇక రాజ్యం గీజ్యం ఉంటేనేం పోతేనేం. కాయము (శరీరం) ఎప్పటికైనా నశించేదే కదా. ఈ జ్ఞానం బలిచక్రవర్తిలో పరిపూర్ణంగా ఏర్పడింది.

మీరొక నాటకం వేస్తున్నారనుకుందాం. అందులో మీదొక చక్రవర్తి పాత్ర. అద్భుతంగా నటిస్తున్నారు. అందులో ఎంతగా నిమగ్నమైపోయారంటే, నిజంగానే మీరొక చక్రవర్తి అన్న భావం కలిగింది. దానిలో పూర్తిగా లీనమైపోయారు. కాని నాటకానికి ఒక కథ ఉంటుంది కదా. దానికి అనుగుణంగానే కదా పాత్రలు ప్రవర్తించాలి. మీరీ పాత్రలో లీనమైపోయి చేస్తూ ఉండడంతో నాటకం దారితప్పే సూచనలు కనిపించాయి. దాంతో డైరెక్టర్ లాభం లేదు, ఈ పాత్రని బయటకి రప్పించడం కన్నా మార్గం లేదనుకున్నాడు. కాని ఎలా? అందుకోసం తన స్క్రిప్టులో లేని ఒక పాత్రని హఠాత్తుగా సృష్టించాల్సి వచ్చింది. తనే మేకప్ వేసుకొని రంగస్థలమ్మీదకి అడుగుపెట్టాడు. ఆ వచ్చింది డైరెక్టరే అని మీరు గుర్తుపట్టారు. "అర్రే! నేను నాటకం వేస్తున్నాను కదూ" అని జ్ఞాపకం వచ్చింది. మీరు వేస్తున్న పాత్రని నాటకం నుంచి తప్పించాలి కదా. ఇప్పుడు నువ్వు నాటకంలో నే చెప్పినట్టు చేస్తే, ఈ ఏడాది నీకే ఉత్తమనటుడిగా బంగారునంది గ్యారెంటీ అని మీతో దర్శకుడు చెప్పేడు. చెయ్యాల్సింది ఏమిటంటే, ఆ రాజుగారి పాత్ర తన రాజ్యాన్ని వదిలేసి అరణ్యాలు పట్టుకొని పోవాలి. అప్పుడు మీరేం చేస్తారు? వచ్చింది స్వయానా డైరెక్టరాయె! మీకు ఉత్తమనటుడిగా నంది వచ్చే అవకాశం ఉందాయె. "ఓ, తప్పకుండా!" అనే కదా అంటారు. పక్కనున్న మంత్రి, "అదేంటి రాజా! నీ రాజ్యాన్నీ, సంపదనీ వదిలేసి అడవులకి పోతావా" అని నచ్చజెప్పబోయాడనుకోండి. మీరేంటంటారు? "ఓరి పిచ్చివాడా! ఇది నాటకంలో పాత్రరా. ఈ రాజ్యం గీజ్యం ఏమైనా శాశ్వతాలా. స్వయాన వచ్చి అడిగినవాడు డైరెక్టరు. కావలిస్తే నేనీ పాత్రలో చచ్చిపోడానికైనా రెడీనే!" అని అనరూ? సరిగ్గా బలిచక్రవర్తి కూడా అదే అన్నాడు.

"రాజ్యము గీజ్యము" అని ఒక అచ్చమైన తెలుగు కవే అనిపించగలడు. అంతకుముందే శుక్రాచార్యుడు బలికి హితబోధ చేస్తూ "కులుమున్ రాజ్యము దేజమున్ నిలుపు..." అన్న పద్యంలో "వలదీ దానము గీనమూ" అంటాడు. సరిగ్గా దానికి సమాధానంగా ఈ పద్యంలో "రాజ్యము గీజ్యమున్ సతతమే" అని బలి చేత అనిపించాడు పోతన. ఇదొక చక్కని వాక్శిల్పం.

నాకు చిన్నపటినుంచీ ఈ వామనావతారం కథ విన్నప్పుడల్లా ఒక్కటే అనుమానం. ఒక అడుగుతో భూమినీ మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేసాడు వామనుడు. మరి మూడో అడుగు ఎక్కడ అంటే తన శిరస్సుపైన పెట్టమని బలి అంటాడు కదా. ఇక్కడే నాకు సందేహం. భూమీ ఆకాశాన్నీ మొత్తం ఆక్రమించేసాడు కదా. మరి బలిచక్రవర్తి శిరస్సు కూడా అందులో భాగమే కదా! మరి ఆ రెండడుగుల భాగంలో అతని శిరసు మాత్రం ఎందుకు లెక్కలోకి రాదు? దీని గురించి ఆలోచించగా ఆలోచించగా, ఈ మధ్యనే ఒక సమాధానం తట్టింది. శిరసు అంటే ఇక్కడ మనసుకి సంకేతం అయ్యుండాలి. ఈ "మనసు" అన్నది భూమ్యాకాశాల్లాగా భౌతిక పదార్థం కాదు. కాబట్టి అది వాటి లెక్కలోకి రాదు. మూడో అడుగుకి తన మనసునే అర్పించాడు బలి. అంతకన్నా కావలిసిందేముంది! బలిని పాతాళానికి అణగదొక్కడం అంటే, అతడిని అంతర్ముఖుణ్ణి చెయ్యడం. మనసంతా ఎప్పుడైతే శ్రీహరి ఆక్రమించుకున్నాడో, అతనికి సమస్తమైన ఆలోచనలూ బాహ్యమైన ప్రాపంచిక విషయాల వైపు కాక, తనలోని ఆత్మ వైపుకి ప్రయాణిస్తాయి. అలా మనసు తన ఆత్మలో కలిసిందంటే అది నిర్మలమైన జ్ఞానానికి చిహ్నం. పైగా ఆ శ్రీహరికి తన భక్తుడంటే ఎంత ఇష్టమో చూసారా! స్వయయంగా అతని దుర్గానికి తానే కాపలాదారుడిగా మారాడు. అంటే మరే ఇతర చింతనలు అతనిలోకి జొరబడకుండా తను కాపలా ఉన్నాడన్నమాట!
కాబట్టి, ఏదో దేవతల కోసం విష్ణువు బలిని అణిచేసి పాతాళానికి పంపేసాడు అనుకోవడం వట్టి తెలియనితనమే. బలి శ్రీహరి భక్తుడే అని, తన భక్తుడికి జ్ఞానాన్ని ప్రసాదించడానికే విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తాడనీ మనకి భాగవతం చదివితే స్పష్టంగా బోధపడుతుంది. బలిచక్రవర్తి గురించి ఆ విష్ణువే అన్న మాటలివి:

బద్ధుండై గురుశాపతప్తుడయి తా బంధువ్రజ త్యక్తుడై
సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యమున్ గరుణయున్ సొంపేమియున్ దప్ప డు
ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుండితం డల్పుడే
పూర్తిగా చదవండి...

Wednesday, September 1, 2010

గ్లోబల్ దేవుడు గోవిందుడే!


శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనా డింభకున్

అంతర్జాతీయ "గుర్తింపు" పొందిన మన ఒకే ఒక్క దేవుడు శ్రీకృష్ణుడు! :-) తిరుపతి వెంకన్నకి కూడా ప్రపంచమంతా పెద్ద భక్తబృందమే ఉంది కాని, అతని పేరిట అంతర్జాతీయ సంస్థ లేదు కదా! పైగా ఆ వెంకన్న భక్తులు కూడా నిత్యం "గోవింద" నామస్మరణే కదా చేస్తారు! కాబట్టి మన "గ్లోబల్" దేవునిగా కృష్ణయ్యనే నేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాను. ఈ రోజతని పుట్టినరోజు సందర్భంగా బ్లాఙ్ముఖంగా ఆ "దేవదేవునికి" (చూసారా దేవుళ్ళకే దేవుడాయన!) జన్మదిన శుభాకాంక్షలతో పాటు "గ్లోబల్" దేవునిగా ఎన్నికైనందుకు నా అభినందనలని కూడా అందిస్తున్నాను.

అలనాడు ధర్మరాజు రాజులలో మాత్రమే అగ్రస్థానాన్నిచ్చి శ్రీకృష్ణుణ్ణి గౌరవించాడు. ఇప్పుడు నేనతనికి దేవుళ్ళందరిలోనూ కూడా అగ్రేసరస్థానాన్ని ఇచ్చి గౌరవించానంటే, నేనింకెంత ధర్మాత్ముణ్ణో అందరూ గ్రహించగలరు, నేను మళ్ళీ దాన్ని నొక్కి వక్కాణించనక్కరలేదు. పైగా ధర్మరాజు విషయంలో ప్రతిపక్షాల వాళ్ళు "బంధుప్రీతి" స్కాండల్ లేవదీసే అవకాశం లేకపోలేదు. నాకదీ లేదు. నేను కృష్ణుడి రెలెటివ్నీ కాను, నాకు ప్రతిపక్షమూ లేదు. అయినా నా తృప్తి కోసం, శ్రీకృష్ణుడు ఈ పదవికి ఎంచేత అర్హుడో ఇప్పుడు వివరిస్తాను. ఇదంతా చదివిన తర్వాత కూడా మీరు నాతో ఒప్పుకొని తల ఊపకపోతే, అలనాడు శిశుపాలుని తలకి ఏం గతి పట్టిందో తెలుసు కదా! ఆ తర్వాత నా పూచీలేదు.

శ్రీకృష్ణుడంటే చిన్నపిల్లల నుంచీ ముసలివాళ్ళ దాకా అందరికీ ఎంతో మురిపెం!

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు, పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి గొలుతు

అంటూ ఆ చిన్ని కన్నయ్యని తమ ముద్దు ముద్దు పలుకులతో కొలుస్తారు మన సిసలైన తెలుగింటి పిల్ల భక్తులు. చిన్నపిల్లల సంగతి ఇలా ఉంటే, ఆ పండు ముదుసలి భీష్ముడు శ్రీకృష్ణదేవుని రూపాన్ని, అదీను తనని చంపడానికి వస్తున్న వాడిని ఎంత భక్తి తన్మయతతో దర్శించాడో చూడండి!

కుప్పించి యెగసిన కుండలమ్ముల కాంతి
గగనభాగంబెల్ల గప్పికొనగ
ఉరికిన నోర్వక నుదరంబులోనున్న
జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ

కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు

ఇలా జాతి, లింగ, వయో భేదాలు లేకుండా ఎందరెందరో భక్తులు శ్రీకృష్ణుని ఆరాధించారు. మరొక విశేషం ఒకటి చెప్పనా. అసలీ ప్రపంచంలో ఎన్ని రకాల భక్తి మార్గాలుండవచ్చో అన్ని మార్గాల్లోనూ కృష్ణుడికి భక్తులున్నారు. ఇల్లాంటి ప్రత్ర్యేకత, నాకు తెలిసి, మన దేవుళ్ళకే కాదు అసలీ భూప్రపంచంలో ఉన్న ఏ దేవుడికీ లేదు!

కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి మెట్లైన ను
ద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరి జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!

శత్రుత్వంతో కూడా భక్తులవ్వడం ఎంత చోద్యమో చూడండి! భావంలో ఏకాగ్రత ఉంటే అది ఏ భావమైనా సరే యోగంలాంటిదే అని నారదులవారు ధర్మరాజుకి చెపుతున్న మాటలివి. కడపున పుట్టకపోయినా కన్న ప్రేమకి పరాకాష్ఠ అనిపించే యశోద వాత్సల్య భక్తి మొదలుకొని ఎందరెందరో భక్తులు చిత్ర విచిత్రమైన రీతుల్లో ఆ స్వామిని కొలిచి తరించలేదూ! ఇక్కడ మీకొక అనుమానం రావచ్చు. రాముడిపై కౌసల్యకి ఉన్నది మాత్రం వాత్సల్య భక్తి కాదా అని. నా ఉద్దేశంలో కాదు. అది వాత్సల్యమే కాని అందులో భక్తి ఉందని చెప్పలేం. కృష్ణుడైతే "చంటి పాప"గా ఉన్న నాటినుండీ ఎన్నెన్నో సాహసాలని చేసి చూపించి తన దైవత్వాన్ని చాటుకున్నాడు. అంచేత యశోదకి కృష్ణుడు దైవమే అన్న స్పృహ తన అంతరాంతరాల్లోనైనా ఉండి ఉండాలి. పైగా తన నోరు తెఱచి విశ్వాన్నంతటినీ చూపించాడు కూడా కదా! "కలయో వైష్ణవ మయయో యితర సంకల్పార్థమో" అంటూ ఆశ్చర్యపడిన యశోద చివరకి,

నా మగడు నేను గోవులు
నీ మందయు గోపజనులు నిబ్బాలుని నె
మ్మోమున నున్న విధము గని
యేమఱితిమి గాని యీశు డీతడు మాకున్

అని నిశ్చయానికి కూడా వచ్చింది కదా. అంచేత యశోదకి ఒక పక్క తల్లిగా వాత్సల్యంతో పాటు మరో వంక పరమాత్ముడన్న భక్తిభావం అంతరాత్మలో నిండి ఉండే ఉంటుంది.

మరొక వింతైన భక్తురాలు కుంతీదేవి. ఆమె స్వయాన శ్రీకృష్ణుడికి మేనత్త. ఆమె జీవితంలో ఎన్నెన్ని కష్టాలు అనుభవించిందని! అన్ని కష్టాలామె ఓర్చుకున్నదంటే, అది ఆమెకి కృష్ణుడిపైనున్న అచంచల భక్తి విశ్వాసాల కారణంగానే. ఇది చాలామంది గ్రహించని విషయం. పోతన్నలాంటి భక్త కవులే దీన్ని తెలుసుకున్నారు. కుంతి శ్రీకృష్ణుడిని కోరినది ఇది:

యాదవులందు పాండుసుతులందు నధీశ్వర! నాకు మోహ వి
చ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరెడి గంగ భంగి నీ
పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి న
త్యాదరవృత్తితో గదియునట్లుగ జేయగదయ్య యీశ్వరా!

తన బంధువులైన యాదవులపైనా, తన కుమారులైన పాండవులపైనా కూడా తనకున్న మోహాన్ని త్రుంచెయ్యమని కోరిందా మహా భక్తురాలు.

సరే అర్జునుడి సఖ్య భక్తి అందరికీ తెలిసినదే. తన సఖుడు, ఆత్మబంధువు, తండ్రంతటివాడు, దిక్కు, దైవం అన్నీ ఆ శ్రీకృష్ణ భగవానుడే. ఇలాంటి సఖుడే కృష్ణుడికి మరొకడున్నాడు. అతని గురించి చాలామందికి తెలీదు. అతని పేరు ఉద్ధవుడు. మన భాషలో చెప్పాలంటే అతను శ్రీకృష్ణుడికి "Thickest Friend" అన్నమాట! ఎంతటి గాఢస్నేహం కాకపోతే గోపికల దగ్గరకి తన ప్రణయసందేశాన్ని అందించడానికి ఇతణ్ణి దూతగా పంపిస్తాడా గోపీమనోహరుడు! అప్పుడా గోపికలు ఉద్ధవుణ్ణి ఏమడుగుతారో తెలుసా!

ఏకాంతంబున నీదు పైనొరగి తానేమేని భాషించుచో
మా కాంతుండు వచించునే రవిసుతామధ్యప్రదేశంబునన్
రాకాచంద్రమయూఖముల్ మెరయగా రాసంబు మాతోడ నం
గీకారంబొనరించి బంధనిహతిన్ గ్రీడించు విన్నాణముల్

ఏకాంతంలో మీరిద్దరూ దగ్గరగా కూర్చొని కబుర్లాడుకొనేటప్పుడు, యమునానదిలో వెన్నెల రాత్రుళ్ళు మాతో జరిపిన రాసలీలా వినోదాల విశేషాలని నీకు చెప్పాడా? అని అడుగుతున్నారు. అంటే ఆ ఉద్ధవునికి శ్రీకృష్ణుడి దగ్గర ఎంత చనవో మనం ఊహించుకోవచ్చు! అంతటి దగ్గరవాడు కాబట్టే, అతనికి కూడా అర్జునుడిలాగానే ప్రత్యేకంగా గీతా బోధ చేసాడు!

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కృష్ణభక్తుల పట్టికకి అంతమే ఉండదు! కురూపి అయిన కుబ్జ, పరమ దారిద్ర్య పీడితుడు కుచేలుడు, భాగవతోత్తముడైన విదురుడు ఇలా ఎందరెందరో ఆ కృష్ణయ్య కరుణాకటాక్షానికి నోచుకున్న భక్తులు మనకి అడుగడుగునా భాగవతంలో కనిపిస్తారు! అందరికన్నా విశిష్టమైన భక్తి గోపికలది. అల్లాంటి భక్తులు మరే దేవునికి ఉన్నారు చెప్పండి! శృంగారాన్ని ఒక భక్తిసాధనంగా చూపించిన ఘనత ఒక్క గోపీరమారమణుడికే దక్కుతుంది. అంతశ్శత్రువులలో మొదటిదైన కామాన్ని భక్తియోగంగా మార్చి, శత్రువుని చంపనవసరం లేదు మార్చగలిస్తే చాలనే గొప్ప సత్యాన్ని నిరూపించినవాడు ఆ లీలామానుషస్వరూపుడే. ఆ గోపికల భక్తి తీవ్రత, అందులోని ఏకాగ్రత ఎలాంటిదంటే,

ఒక్క లతాంగి మాధవుని యుజ్జ్వలరూపము చూడ్కితీగెలం
జిక్కగబట్టి, హృద్గతముజేసి, వెలిం జనకుండ నేత్రముల్
గ్రక్కున మూసి మేన వులకంబులు గ్రమ్మగ కౌగిలించుచున్
చొక్కములైన లోచవుల జొక్కుచునుండెను యోగికైవడిన్

ఒక గోపిక ఆ మాధవుని ఉజ్జ్వల రూపాన్ని తన చూపులనే తీగలతో కట్టేసి, హృదయంలో పొదువుకుని, మళ్ళీ బయటకి పోకుండా కన్నులు మూసేసుకొని, తన శరీరంపై పులకలు వచ్చేట్టు కౌగిలిలో అతన్ని బంధించి, స్వచ్ఛమైన లోపలి కాంతులతో పరవశించిపోతోందిట - ఒక యోగిలాగా! ఇది మధురభక్తి వర్ణనల్లోకెల్లా మకుటాయమైన పద్యం! ఇందులో శృంగారం ఉంది, భక్తి ఉంది, యోగం ఉంది! ఆ మూడూ గోపిలలో ఎలా కలగలిసిపోయేయో ఆ చిత్రం ఉంది.

భక్తి మార్గాల్లో ఇంత వెరైటీ, వేరియేషను చూపించిన కృష్ణపరమాత్ముడు కాక, "గ్లోబల్" దేవుని పదవికి ఇంకెవరు అర్హులు చెప్పండి? సరే మరొక పాయింటు చెప్తాను. కృష్ణుడిలా అన్నిమార్లు, అందరిమందికి "గ్లోబల్"రూపాన్ని, అదే "విశ్వ"రూపాన్ని చూపించిన దేవుడు ఇంకెవరైనా ఉన్నాడా?

సరే, ఇలా ఏకరువు పెడుతూ పోతే ఆ నల్లనయ్యకున్న ప్రత్యేకతలకీ, విశేషాలకీ కరువే లేదు. భాగవతం, మహాభారతం, హరివంశం ఎన్నెన్ని పురాణాలు కావలసి వచ్చాయి అతని లీలా విశేషాలని వర్ణించడానికి! ఇంకొక్క విశేషం మాత్రం చెప్పి నా వివరణని ముగిస్తాను.

పూర్వమెప్పుడో మొత్తం భూప్రపంచానికంతటికీ ఒక పెద్ద సమస్య వచ్చిందట, అంటే "global problem" అన్న మాట! భూమినుంచి విడిపోయిన ఒక పెద్ద గోళం (meteorite అనుకోండి), gravitational forcesలో వచ్చిన ఏవో తేడాల వల్ల, మళ్ళీ భూమ్మీదకి దూసుకువచ్చిందట. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ గోళాన్ని తన చక్రంతో తునాతునకలు చేసి భూమిని రక్షించాడట. ఆ కథాకమామీషు మరోసారి తీరిగ్గా ముచ్చటించుకుందాం. అలాంటి గ్లోబల్ సమస్యని తీర్చిన దేవుడే కదా గ్లోబల్ దేవుని పదవికి అర్హుడు.

అందుకే అంటున్నాను, గ్లోబల్ దేవుడు గోవిందుడే!

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింప దలచి విష్ణుడవనగా
విశ్వము జెఱుపను హరుడవు
విశ్వాత్మక! నీవెయగుచు వెలయుదు కృష్ణా!


పూర్తిగా చదవండి...

Wednesday, June 3, 2009

బాల రసాల...

బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

ఏవిటి, ఇది పోతన పద్యంలా అనిపిస్తోంది కాని కాదు అని ఆలోచిస్తున్నారా? అవును ఇది పోతన పద్యం కాదు. ఇది మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం. ఈ మంచన కవి క్రీ.శ. 1300 ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. పోతనకన్నా ముందరివాడు. ఇక్కడ "కూళలు" అంటే క్రూరుడు, మూఢుడు అనే అర్థం. అటువంటి వారికి సుకుమారమైన కావ్య కన్యకని ఇచ్చి ఆ పడుపుకూడు తినడం కన్నా పొట్టపోసుకోడానికి కవులు హాలికులగా మారి పొలం దున్నుకోడం మంచిది. అదికూడా లేదూ అంటే "కౌద్దాలికులు" అయినా పరవాలేదు అని దీని భావం. "కుద్దాలము" అంటే ఒక రకమైన గడ్డపార. కౌద్దాలికులంటే గడ్డపార పట్టుకొని కందమూలాలు తవ్వి తీసుకొని తినేవాళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి మంచన తన కేయూరబాహు చరిత్రని నండూరి గుండనమంత్రికి అంకితం ఇచ్చాడు. అంచేత ఇక్కడ అతని ఉద్దేశం కావ్యాన్ని కూళలకి అంకితమివ్వకూడనే కాని నరులెవ్వరికీ అంకితమివ్వకూడదని కాదు.

మనకి చాటుపద్యాల సంప్రదాయం ఉండేది. సామాన్య ప్రజల నాలుకల మీదగా చాటువులు ప్రచారం పొందేవి. చాలాసార్లు అసలు వీటిని రాసినదెవరో కూడా తెలియదు. కొన్ని చాటువులు కొందరు కవుల పేర్ల మీద చెలామణీ అవుతూ ఉండేవి. కొన్ని కావ్యాలలోని పద్యాలు కూడా ఇలా చాటువులుగా మారిన సందర్భాలున్నాయి. అదిగో అలా మారిన ఒక చాటువు యీ పద్యం. ఈ చాటువులు మార్పులు చెందుతూ ఉండడం కూడా సాధారణంగా జరిగేదే. అలా కొన్ని మార్పులు చెంది తర్వాత కాలంలో ప్రసిద్ధి పొందిన పద్యం ఇది:

బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

ఈ మార్పులు పద్యానికి మరింత అందాన్నిచ్చాయి. "బాలరసాలపుష్ప" అనడం కన్నా "బాలరసాలసాల" అనడం సొగసుగా లేదూ! "సాలము" అంటే చెట్టు. లేతమావిడి చెట్టుకి పూసిన కొత్తచిగురంత కోమలమైన కావ్య కన్యక అని అర్థం. అలాగే "గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులు" అనడంలో పద్యానికి బిగువు వచ్చింది. "గహనము" అంటే అడవి అని అర్థం. అడవిలోపల కందమూలాలు తవ్వుకుంటూ బతుకు సాగించినా మంచిదే అని అర్థం.

చాటు సంప్రదాయంలో ఇక్కడ జరిగిన మరో గమ్మత్తు, ఈ పద్యం పోతనగారిదని ప్రచారంలోకి రావడం. పోతనగారు నరునికి తన కావ్యాన్ని అంకితమివ్వనన్న విషయం ప్రసిద్ధమే. పోతన రైతు జీవితం గడిపాడన్న విషయం కూడా ప్రచారంలో ఉన్నదే. అంచేత ఊహశాలులెవరో, ఇందులో కూళలు అంటే మూఢులైన మనుషులు అని అర్థం చెప్పి దీన్ని పోతనగారికి అంటగట్టారు. పైగా "హాలికులైననేమి" అని ప్రతిజ్ఞ చేసి రైతుగా జీవితాన్ని కొనసాగించాడని అన్నారు. భలేగా ముడిపెట్టారు కదా! అన్నీ చక్కగా అమరిపోయాయి! అంచేత అది బహుళ ప్రచారంలోకి వచ్చింది.

ఇదీ ఈ పద్యం కథ. ఏది ఏమైనా ఈ పద్యం పోతన నోటినుండి వచ్చిందని ఊహించుకోడమే తెలుగువాళ్ళకి ఇష్టం. ఈ పద్యం చదివినప్పుడల్లా మనకి పోతనే గుర్తుకువస్తాడు. అంచేత ఇది పోతన పద్యమే!


పూర్తిగా చదవండి...

Saturday, August 23, 2008

శ్రీకృష్ణ లీలామృతం


ఈ రోజు కిట్టయ్య పుట్టినరోజు. తెలుగువాళ్ళెవరికైనా కృష్ణుణ్ణి తలచుకోగానే,

శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోల విలసత్ దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకున్

అంటూ, గోర్వెచ్చని పాలమీగడలకన్నా తియ్యనైన భాగవతాన్ని మనకందించిన పోతన తలపులోకి రాకమానడు కదా! ఆ పోతన తన భాగవతంలో, ముచ్చటగా వర్ణించిన శ్రీకృష్ణలీలలని తలచుకొని ఆనందిద్దామా మరి!

అదుగో దేవదేవుడు, దేవకిపంటగా శ్రీకృష్ణనిగా అవతరిస్తున్నాడు. ప్రకృతి ఆనందముతో ఉప్పొంగుతోంది:

స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును
గల ఘోషణములు మేఘంబు లుఱిమె
గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె
దిక్కులు మిక్కిలి తెలివి దాల్చె
గమ్మని చల్లని గాలి మెల్లన వీచె
హోమానలంబు సెన్నొంది వెలిగె
గొలకుల కమలాళికులముపై సరినొప్పె
బ్రవిమల తోయలై పాఱె నదులు

వర పుర గ్రామ ఘోషయై వసుధ యొప్పె
విహగ రవ పుష్ప ఫలముల వెలసె వనము
లలరుసోనలు గురిసి రయ్యమరవరులు
దేవదేవుని దేవకీదేవి గనగ!

అరే, అంతలోనే అదుగో వసుదేవుడా బాలుణ్ణి పొత్తిళ్ళలో ఎత్తుకొని ప్రయాణమవుతున్నాడే!

బిడ్డని గరముల ఱొమ్మున
నడ్డంబుగబట్టి పదము లల్లన యిడుచున్
జడ్డన గావలివారల
యొడ్డు గడచి పురిటిసాల యొయ్యన వెడలెన్

ఆ హరికి స్వయంగా యమునా నది దారిస్తోంది చూసారా! అలనాడు శ్రీరామచంద్రునికి సముద్రుడు త్రోవిచ్చినట్టే లేదూ!

ఆ శౌరికి దెరువొసగె బ్ర
కాశొద్ధత తుంగభంగ కలిత ధరాశా
కాశ యగు యమున మును సీ
తేశునకు బయోధి త్రోవ యిచ్చిన భంగిన్

ఇంకేముంది, నందుని యింట వెలసా డానంద గోపాలుడు. రేపల్లే ఇక అతని యిల్లు! ఈ వార్త రేపల్లె మగువలకి తెలిసిపోయింది. ఇంకేం, చూడ్డానికి ఇరుగమ్మని పొరుగమ్మనీ వెంటపెట్టుకొని బయలుదేరారు.

ఏమి నోము ఫలమొ యింత ప్రొద్దొక వార్త
వింటి మబలలార వీను లలర
మన యశోద చిన్ని మగవాని గనెనట
చూచివత్తుమమ్మ సుదతులార

ఆ పసి బాలునికి అన్ని సపర్యలూ జరుగుతున్నాయి. ఉయ్యాలలూగిస్తూ జోలపాటలెలా పాడుతున్నారో వినండి:

జోజో కమలదళేక్షణ
జోజో మృగరాజమధ్య జోజో కృష్ణా
జోజో పల్లవకరపద
జోజో పూర్ణేందువదన జోజో యనుచున్

లోకాలని జోకొట్టి నిద్రపుచ్చే ఆ దేవదేవునికి నిద్రేమిటి! అయినా వాళ్ళకోసం కళ్ళుమూసుకొని నిద్ర నటిస్తున్నాడు.

లోకములు నిదురవోవగ
జో కొట్టుచు నిదురవోని సుభగుడు రమణుల్
జోకొట్టి పాడ నిదురం
గైకొను క్రియ నూరకుండె గనుదెఱవాయున్

అంతలో రాకాసి పూతన రానే వచ్చింది. చన్నిచ్చే నెపంతో ఆ పసివాని ప్రాణం తియ్యాలని. అక్కడున్నది పసిబాలుడా? పాలని త్రాగుతూ త్రాగుతూ పూతన ప్రాణాల్ని కూడా గుటగుటా తాగేశాడా బాలకృష్ణుడు! చచ్చిపడింది పూతన.

మేల్కొన్న తెఱగున మెల్లన కనువిచ్చి
క్రేగంట జూచుచు గిదికి నీల్గి
యావులించుచు జేతులాదరంబున జూచి
యొదికిలి యాకొన్న యోజనూది
బిగిచన్నుగవ గేల బీడించి కబళించి
గ్రుక్క గ్రుక్కడు గుటు గుబుకు మనుచు
నొకరెండు గ్రుక్కల నువిద ప్రాణంబులు
సైతము మేనిలో సత్త్వమెల్ల

ద్రావె నదియును గుండెలు దల్లడిల్ల
దిమ్మ దిరుగును నిలివక శిరము వ్రాల
నితర బాలుర క్రియవాడ వీవు గావు
చన్ను విడువుము విడువుము చాలు ననుచు

నిబ్బరపు దప్పి మంటలు
ప్రబ్బిన ధృతి లేక నేత్ర పదహస్తంబుల్
గొబ్బున వివృతములుగ నా
గుబ్బాగుబ్బయిన కూత గూలెన్ నేలన్!

విషధరరిపు గమనునికిని
విషగళ సఖునికి విమల విషశయనునికిన్
విషభవభవ జనకునికిని
విషకుచ చనువిషము గొనుట విషమే తలపన్!

విషాన్ని ధరించే పాముల శత్రువైన గరుత్మంతుడిపై తిరిగేవాడూ, విషాన్ని ధరించిన శివుని చెలికాడూ, విషధరమైన శేషునిపై పరుండేవాడూ, విషము(నీరు)నుంచి పుట్టిన పద్మంలోంచి పుట్టిన బ్రహ్మకి తండ్రీ - ఆ జగన్నాథుడు! అతన్ని విషపు చనుబాలు ఏం చేస్తాయి!

చూసారా మన చిన్నికృష్ణుడింతలోనే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు!
రెండడుగులతో నింగీ నేలా ఆక్రమించుకొన్న అతను అడుగులు వెయ్యడం మొదలుపెట్టగానే, అతని శత్రువుల అడుగులు తడబడి కూలబడిపోయారట!

అడుగులు వే గలిగియు రెం
డడుగులనే మన్ను మిన్ను నలమిన బాలుం
డడుగిడ దొరకొనె శాత్రవు
లడుగులు సడుగులును వదలి యడుగవని బడన్

ఆహా ఆ బలరామ కృష్ణుల బాల్యక్రీడలు వర్ణించడం ఎవరి తరం!

తనయీడు గోప బాలురు
దను గొలువగ రాము గూడి తనువు గలుగుచుం
దనుగమనంబున గృష్ణుడు
తను మధ్యలు మెచ్చ నీలతనురుచి దనరెన్

బాల కృష్ణుడప్పుడే నవనీత చోరుడైపోయాడు! గోపాలుర ఇండ్లలో వెన్నంతా దొంగిలించి తిని ఏవీ ఎరగనట్లు వచ్చి తల్లిని బువ్వపెట్టమని అడుగుతున్నాడు చూడండి!

వల్లవ గృహ నవనీతము
లెల్లను భక్షించి వచ్చి యెఱగని భంగిం
దల్లి గదిసి చిట్టాడుచు
నల్లన చను బువ్వ బెట్టు మమ్మా యనుచున్

ఇలా అల్లరి చేస్తే ఆ గోపకాంతలు ఊరుకుంటారా ఏమిటి? వెళ్ళి యశోదకు చెప్పే మిషతో ఆ గోపాలబాలుని కొంటెపనులని ఎంత సొగసుగా వర్ణిస్తున్నారో వినండి మరి!

బాలురకుబాలు లేవని
బాలెంతలు మొఱలువెట్ట బకబక నగి యీ
బాలుండాలము సేయుచు
నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

పడతీ నీ బిడ్డడు మా
కడవలలో నున్న మంచి కాగిన పాలా
పడుచులకు బోసి చిక్కిన
కడవల బో నడచె నాజ్ఞ గలదో లేదో!

చిన్నపిల్లలికి పాలులేవని ఓ మూల బాలెంతలేడుస్తూ ఉంటే, నవ్వుతూ ఆవులవద్దకి పెయ్యలని వదిలిపెట్టాడు! వచ్చి, మేము కడవలలో దాచుకున్న కాగిన పాలన్నీ తీసుకెళ్ళి ఆ బాలెంతలకి పోసాడు. కడవలనేమో పగలుకొట్టేసాడు!
చిన్ని కృష్ణుడి ఆగడాలకి అంతూ పొంతూ ఉందా!

పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చి తా
నుట్టి యందక ఱోళ్ళు బీటలునొల్ల ప్రోవిడి యెక్కి చే
వెట్టజాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ
పట్టి మీగడపాలు జేరల బట్టి ద్రావె తలోదరీ!

ఉట్టిమీద అందకుండా పాలని దాచుకుంటే, ఇంట్లో ఉన్న చిన్న ఱోళ్ళూ పీటాలూ అన్నిటినీ ఎత్తుపెట్టి, ఎక్కి, అయినా కుండలోపలకి చెయ్యిపెట్టడం వీలుకాక ఏం చేసాడో తెలుసా? ఆ కుండకి పెద్దకన్నం పెట్టి ఆ మీగడపాలు చేత్తో జుఱ్ఱుకుంటూ తాగేసాడు!

వారిల్లుసొచ్చి కడవల
దోరంబగు నెయ్యిద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుండిడ
వారికి వీరికిని దొడ్డ వాదయ్యె సతీ!

పాలూ పెరుగూ దొంగతనంగా తిని ఊరుకున్నాడా మీ చిలిపి కన్నయ్య. వాళ్ళింట్లో కడవలు తీసుకొచ్చి వీళ్ళింట్లో పెట్టి వాళ్ళకీ వీళ్ళకీ మధ్య తగువులు పెట్టాడు!

ఓ యమ్మ నీ కుమారుడు
మా యిండ్లను బాలు బెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభు లాన! మంజుల వాణీ!

అమ్మా యశోదమ్మా! నీ కొడుకు మా యిళ్ళల్లో పాలూపెరుగూ యింక ఉండనివ్వడని తేలిపోయింది. మా అన్నల గోవులని నమ్ముకొని ఇంకెక్కడికైనా పోతాం మేము!
ఇలా ఆ రెపల్లె మగువలు గోలపెడితే, అంతా విని యశోద ఏమంది?

చన్ను విడిచి యిట్టటు చన
డెన్నడు బొరుగిండ్ల త్రోవ లెఱుగడు నేడుం
గన్నులు దెఱవని మా యీ
చిన్ని కుమారకుని ఱవ్వ సేయం దగునే!

నా యెదనే వదలిపోని నా చిన్నికృష్ణుడి మీద ఇలా చాడీలు చెప్తారా అంటోంది! అహా ఏమి చోద్యం! ఆ యశోదకు తన నందకిశోరుని మీద ఎంత ప్రేమ!
ఇక కృష్ణుని అల్లరికి అదుపేముంటుంది?
అదిగో మన్ను తినే ఆ కన్నయ్యను చూడండి. అమ్మా తమ్ముడు మన్ను తినేనే అని చెప్తున్న ఆ రామన్నను చూడండి. ఎంత ప్రేమైతే మాత్రం మన్ను తిన్నాడంటే ఊరుకుంటుందా ఆ తల్లి, అన్నా అని చెవినులిమి యశోద, "ఏదన్నా నీ నోరుచూపూ" అంది. ఆ దొంగ కృష్ణుడు ఎంత అమాయకంగా మొహం పెట్టాడో చూడండి. పైగా మన్ను తినడానికి తనేం వెఱ్ఱివాడినా అంటున్నాడు:

అమ్మా మన్నుదినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్రినో
నమ్మంజూడకు వీరిమాటలు మదిన్ నన్నీవు గొట్టంగ దా
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ దప్పైన దండింపవే!

నా నోటివాసన చూడు కావలిస్తే అని నోరు తెరిచాడు. ఇంకేముంది! అందులో సమస్త భువనాలూ కనిపించాయి! ఆ రూపాన్ని చూసిన యశోద ఏమనుకుంది?

కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్ నేరక యున్నదాననొ యశోదాదేవినే గానో పర
స్థలమో బాలకుడెంత యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమిహేతువొ మహాశ్చర్యంబు జింతింపగన్!

కలా వైష్ణవమాయా అనుకుంది! తనసలు యశోదాదేవినేనా అన్న సందేహం కలిగింది! యశోద తాపము నశియించి జన్మ ధన్యత గాంచింది!
కానీ తర్వాత మళ్ళీ మామూలే. ఆ స్పృహని మాయ కమ్మేసింది. లేకపోతే చిన్నారి శ్రీకృష్ణుడి చిలిపి ముచ్చట్లని తల్లిగా ఎలా అనుభవించగలదు?
కృష్ణుని ఆగడాలు మళ్ళీ మామూలే. ఇక లాభంలేదు, ఇతన్ని పట్టుకొని రోటికి కట్టేస్తే కాని ఈ ఊరిమీద పెత్తనాలు ఆగవని నిశ్చయించుకుంది యశోద. కాని అంత సులువుగా పట్టుబడతాడా కృష్ణుడు! ఘల్లు ఘల్లుమనే గజ్జలతో ఇటూ అటూ పెరిగెట్టాడు బాల గోపాలుడు.

గజ్జెలు గల్లని మ్రోయగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షిజ్జనములు నగ దల్లియు
బజ్జం జనుదేర నతడు పరువిడె నధిపా!

మొత్తానికి అతన్ని పట్టుకుంది యశోద! పట్టుకొని ఏమంటోంది? "ఓహో! మీరేనా శ్రీ కృష్ణులంటే! మీకు వెన్నంటే అసలు తెలీదటకదా! దొంగతనమే చెయ్యరట కదా! అహా, ఈ భూలోకమంతటా మీ అంతటి బుద్ధిమంతులసలు ఉన్నారా?" అంటోంది!

వీరెవ్వరు శ్రీకృష్ణులు
గారా యెన్నడును వెన్నగానరట కదా!
చోరత్వంబించుకయును
నేరరట ధరిత్రి నిట్టి నియతులు గలరే!

"నువ్వెవరికీ పట్టుబడవని అందరూ అంటారే. నేను తలచుకొంటే నిన్ను పట్టుకోవడం ఒక పెద్ద పనా! నాకు కాక నువ్వెవరికి పట్టుబడతావు?" అని కూడా అంటోంది. నిజంగానే ఎవరికీ చిక్కని ఆ పరమాత్ముడు యశోదకి చిక్కాడు.

పట్టిన బట్టువడని నిను
బట్టెద నని చలముగొనిన బట్టుట బెట్టే
పట్టువడవండ్రు పట్టీ
పట్టుగొనన్ నాకుగాక పరులకు వశమే!

అలా పట్టుకొన్న కృష్ణుణ్ణి యశోద అదుగో ఆ రోటికి కట్టేసింది.

ఆ లలన గట్టె ఱోలన్
లీలన్ నవనీత చౌర్యలీలున్ బ్రియ వా
గ్జాలున్ బరివిస్మిత గో
పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్!

చిక్కడు సిరికౌగిటిలో
జిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్
జిక్కడు శ్రుతిలతికావలి
జిక్కె నతడు లీల దల్లి చేతన్ ఱోలన్!

అపళంగా ఆ కృష్ణుడేం చేసాడు? ఊపున పోయి పెరట్లో ఉన్న మద్ది చెట్లు రెండిటినీ కూల్చేసాడు!

ముద్దుల తక్కరి బిడ్డడు
మద్దుల గూల్పంగ దలచి మసలక తా నా
మద్దికవ యున్న చోటికి
గ్రద్దన ఱోలీడ్చుకొనుచు గడకం జనియెన్

బాలుడు ఱోలడ్డము దివ
మూలంబులు వెకలి విటపములు విఱిగి మహా
భీల ధ్వని గూలెను శా
పాలస్య వివర్జనములు యమళార్జునముల్

ఆ మద్దిచెట్లు కూకటి వేళ్ళతో సహా పెకలించబడి విరిగి పడిపోయాయి. శాపగ్రస్తులైన నలకూబర మణిగ్రీవులకి శాపవిమోచనమయ్యింది!

ఇంతలో అందరూ రేపల్లెని విడిచి బృందావనం చేరుకున్నారు. ఇది శ్రీకృష్ణుని రక్షణ కోసమట. సర్వ జగద్రక్షణుడైన ఆ హరికి రక్షణా! అతడే అందరినీ కాపాడేవాడు. అక్కడ కాళింది మడుగులో కాళీయుడున్నాడు. అతన్నుంచి ఈ గోపాలురందరినీ రక్షించాలని నిశ్చయించుకున్నాడు మన గోపాలపాలుడు! ఇంకేముంది. అన్నుకున్నదే తడవు, చెట్టెక్కి ఆ నదిలోకి దూకబోతున్నాడు. ఆహా ఆ సుందర దృశ్యాన్ని ఎంత సొగసుగా వర్ణించాడు పోతన! స్వయంగా కళ్ళతో చూసినట్టు, కళ్ళకు కట్టేట్టు ఉంది చూడండి.

కటి చేలంబు బిగించి పింఛమున జక్కం గొప్పు బంధించి దో
స్తట సంస్ఫాలన మాచరించి చరణ ద్వంద్వంబు గీలించి త
త్కుట శాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాల సింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానంబనూనంబుగన్

నడుం చుట్టూ తన చేలాన్ని బిగించాడు. పింఛంలో కొప్పుని సరిచేసుకున్నాడు. రెండు జబ్బలూ చరిచాడు. రెండు కాళ్ళనీ అదిమిపట్టి ఒక్కసారిగా ఆ చెట్టుకొమ్మపైనుంచి గభీలుమని ఆ నదిలోకి దూకాడా గోప కిశోరుడు! గుభగుభ మంటూ పెద్ద శబ్దం నలుదిక్కులా కమ్ముకుంది.
అంతే. ఆ కాళీయునితో యుద్ధం చెయ్యడం అతని పీచమడచడం అయిపోయాయి. అహా! కాళీయఫణి ఫణజాలాన ఝణ ఝణ మంటూ కేళి ఘంటించిన ఆ గోప కిశోరమూర్తి ఎంత మనోహరంగా ఉన్నాడు!

ఘన యమునానదీ కల్లోల ఘోషంబు
సరస మృదంగ ఘోషంబుగాగ
సాధు బృందావనచర చంచరీక గా
నంబు గాయక సుగానంబుగాగ
గలహంస సారస కమనీయ మంజు శ
బ్దంబులు దాళ శబ్దములుగాగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది
జనులు సభాసీన జనులుగాగ

బద్మరాగాది రత్న ప్రభాభాసమాన
మహిత కాళియ ఫణిఫణా మండపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్యనైపుణ్యమున బేర్చి నృత్యమాడె!

యమునానది అభంగ తరంగాలు మృదంగనాదం చేస్తున్నాయి. బృందావనంలో తిరుగాడే తుమ్మెదలు ఝుమ్మని గానం చేస్తున్నాయి. కలహంస, సారసములు సొంపైన నడకతో తాళాన్ని వేస్తున్నాయి. పైనున్న దేవతలందరూ ప్రేక్షకులయ్యారు. మణులు పొదిగున్న ఆ కాళీయుని పడగ రత్నవేదికగా మారింది. ఆ పద్మాక్షుడు తన సహజ ప్రతిభతో అక్కడ నృత్యం చేసాడు!

బృందావనమంతా ఒక ప్రశాంత వాతావరణం నెలకొంది. గోపాలుడు మురళీ లోలుడయ్యాడు. ఆ మోహన రూపాన్ని, ఆ మనోహర గానాన్ని చూసి గోపబాలలంతా పులకిస్తున్నారు.

శ్రవణోదంచిత కర్ణికారకముతో స్వర్ణాభ చేలంబుతో
నవతంసాయిత కేకిపింఛకముతో నంభోజ దామంబుతో
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబు బూరించుచు
న్నువిదా మాధవు డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే!

చెవులకి ఆనందమైన చెవికమ్మ, బంగారు చేలము, శిఖగా చేయబడిన పింఛము, మెడలో తామరపూల దండ. తరగని సౌందర్యంతో, తనలో తాను లీనమై తన పెదాల అమృతంతో ఆ వేణువుకి జీవం పోస్తున్న ఆ మాధవుని చూడండని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు.

గిరులెల్ల జలము లయ్యెం
దరులెల్లను బల్లవించె, ధరణి గగన భూ
చరు లెల్లను జొక్కిరి హరి
మురళిరవామృతము సోక ముద్దియ కంటే!

ఆ గానానికి కొండలు కరిగాయి. చెట్లు పుష్పించాయి. ముల్లోకాలలోని జీవజాలమంతా ఆ మురళీ గానామృతంలో తన్మయమయ్యింది!

అంతలోనే మళ్ళీ ఓ ప్రమాదం ముంచుకొచ్చింది. తనకి పూజలు చెయ్యొద్దన్నాడని కృష్ణుడిమీద ఇంద్రునికి కోపం వచ్చింది. ఆ బృందావనంలో ప్రజలందరినీ శిక్షించాలనుకున్నాడు. రాళ్ళ వర్షం కురిపించాడు. అయినా ఆ పరమాత్ముని పాలనలో ఆ గోపాల బృందానికి ఆపదలు వస్తాయా?

బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతో గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్ వలకేల దాల్చి విపులచ్ఛత్త్రంబుగా బట్టె నా
భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోప గోపంక్తికిన్!

ఆడుతూ ఆడుతూ వెళ్ళి - అదేదో గొడుగనుకున్నాడు కాబోలు, పూలగుత్తి నెత్తినంత సులువుగా గోవర్ధన గిరిని తన కుడిచేత్తో ఎత్తేసాడు. చిరునవ్వుకూడా చెరగలేదు! చిటికిన వేలిపై ఆ కొండని నిలబెట్టి, నింగినుండి కురుస్తున్న రాళ్ళ వర్షానికి చకితులైన ఆబాలగోపాలాన్నీ పిలుస్తున్నాడు. ఏమని?

బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా
జాలండో యని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా
కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం బ్రమోదంబునన్!

నేనేదో చిన్న కుఱ్ఱాణ్ణీ, ఈ పెద్ద కొండని మొయ్యగలనా అని సందేహించకండి అంటున్నాడు! బలే కృష్ణా! అంత పెద్ద కొండని ఎత్తిపట్టుకోడం చూసిన ఆ జనులకి నువ్వొక చిన్న పిల్లాడిలా అసలు కనిపిస్తావా? అయినా కొందరు మందబుద్ధుల సందేహాలని పూర్తిగా పోగొట్టాలనుకుంటున్నావు, అంతే కదా! ఈ కొండలూ, సముద్రాలూ, జంతుజాలము సమస్తమూ నిండిన భూవలయమే పైబడినా నా చేయి అల్లాడదు, హాయిగా నిశ్చింతగా ఇక్కడకి రండని పిలిచాడు.
అహా! ఆ గోకులానిది ఎంత అదృష్టం! లోక సంరక్షకుడైన ఆ కృష్ణుని రక్షణ దొరకింది.

అసలే కృష్ణుడు మోహనాకారుడు. మనోహరుడు. నవనీత చోరుడే కాదు, నవలామానస చోరుడు కూడా అయ్యాడు! బృందావనంలోని గోపికలందరి హృదయాల్లోనూ అతనే నిండిపోయాడు. అద్దమ రేయి బయలుదేరి, ఇల్లూవాకిలీ వదిలేసి, అతని వద్దకు పరుగుపరుగున వచ్చేసారు! ఏవీ ఎరగనట్టు కృష్ణుడు, ఇదేమిటని అడిగితే, తమ గోడుని విన్నవించుకుంటున్నారు.

నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱగాని
తరలి పోవంగ బాదములు రావు
నీ కరాబ్జంబులు నెఱి నంటితివగాని
తక్కిన పనికి హస్తములు సొరవు
నీ వాగమృతధార నిండ గ్రోలగగాని
చెవులన్య భాషలు సేరి వినవు
నీ సుందరాకృతి నియతి జూడగ గాని
చూడ వన్యంబుల జూడ్కి కవలు

నిన్న కాని పలుకనేరవు మా జిహ్వ
లొక్క ననుచు బలుక నోడ వీవు
మా మనంబు లెల్ల మరగించి దొంగిలి
తేమి సేయువార మింక కృష్ణ!

ఎంతటి భక్తి పారవశ్యమది! మా మనసులని మరిగించి దొంగిలించుకు పోయావు, ఇంక మేమేమి చెయ్యగలమని వేడుకొన్నారు. కానీ కృష్ణుడు వాళ్ళనింకా పరీక్షించాలనుకున్నాడు. కనపడకుండా మాయమయ్యాడు. అతని కోసమా బృందావనమంతా వెతుకుతున్నారు పాపం గోపికలు.

నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచె నో
మల్లియలార మీ పొదలమాటున లేడుగదమ్మ చెప్పరే!

మల్లెపొదలమాటున దాక్కున్నాడేమోనని ఆ మల్లెపూలని అడిగారు. ఊహూ జవాబు లేదు! అలా చెట్టూ పుట్టా వెతికినా కృష్ణుడు దొరకలేదు.

గోవుల వెంట ద్రిమ్మరుచు గొల్చినవారల పాపసంఘముల్
ద్రోవగ జాలి శ్రీ దనరి దుష్టభుజంగ ఫణాలతాగ్ర సం
భావితమైన నీ చరణపద్మము చన్నుల మీద మోపి త
ద్భావజపుష్పభల్లభవ బాధ హరింపు వరింపు మాధవా!

అంటూ, గోపికా గీతికలాలపించారు. కృష్ణుని నవనీత హృదయం కరిగింది. వాళ్ళను చేరుకున్నాడు.

పాయని గేహశృంఖలల బాసి నిరంతర మత్పరత్వముం
జేయుచునున్న మీకు బ్రతిసేయ యుగంబులనైన నేర నన్
బాయక గొల్చుమానసము ప్రత్యుపకారముగా దలంచి నా
పాయుట దప్పుగా గొనక భామినులార కృపన్ శమింపరే!

నామీద నిరంతరమూ మీకున్న ఈ భక్తి తత్పరతకి నేను యుగయుగాలైనా బదులు తీర్చుకోలేనన్నాడు. వాళ్ళనలా విడిచి వెళ్ళిపోవడం తప్పుగా భావించక దయతో శాంతించమన్నాడు. కృష్ణుడు తమని చేరుకోవడం కన్నా శాంతి మరేముంది ఆ గోపికలకు.

ఆ సమయంబునన్ విభుడనంతుడు కృష్ణుడు చిత్రమూర్తియై
చేసెను మండలభ్రమణశీల పరస్పర బద్ధ బాహు కాం
తా సువిలాసమున్ బహువిధ స్ఫురితానన హస్త పాద వి
న్యాసము రాసముం గృత వియచ్చర నేత్ర మనోవికాసమున్!

లీలామానుష స్వరూపుడైన ఆ స్వామి, అనంత మూర్తులని ధరించి, ప్రతి గోపిక మధ్యా ఒక కృష్ణుడై, వాళ్ళతో చేయీ చేయీ కలిపాడు. అందరూ చక్రాకారంలో నిలుచుని నాట్యం చేసారు. అదే రాసకేళి. ఆ విరళీకృత నవ రాసకేళిలో అందరూ పరమానందంగా ఓలలాడారు!

అప్పుడా దివ్యమోహన సుందరమూర్తి ఇలా ఉన్నాడు:

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేచ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ!


పూర్తిగా చదవండి...