తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, March 30, 2008

చేతులారంగ...


"అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి నితరంబు చేరనేర్తు" అన్నది ఇప్పుడు నా విషయంలోనే నిజమయినట్లుంది! ఎంత తియ్యని పానీయమైనా, తెగ తాగితే చివరికి మొహం మొత్తుతుంది. ఒక్క అమృతం విషయంలో మాత్రం ఇలా జరగదుట! భాగవతామృతం రుచి చూడ్డం మొదలుపెట్టేసరికి మరి వదలబుద్ధి కావటం లేదు!



చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగనేటికి దల్లుల కడుపుచేటు



ఇంత చిన్న పద్యంలో ఏముందని? మనసుకి ఎందుకంతలా పట్టేసింది! పోనీ నేనేదో వీర భక్తాగ్రేసరుణ్ణైతే, ఆహా ఓహో అని ఇందులోని భక్తిరసంలో మునిగిపోయే అవకాశం ఉంది. కాని అలా కాదే. నేను చూస్తే ప్రసాదం భక్తుణ్ణి! మరి గుండెను అంతలా తట్టేదేమిటుంది ఇందులో? అచ్చమైన తెలుగుదనం! భావాన్ని గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయేట్టు చేసే సముచిత భాష. "చేతులారగ", "నోరు నొవ్వగ" - చక్కని తెలుగు నుడికారం. శీవపూజ కాని హరికీర్తి కాని ఏదో తూతూ మంత్రంగా కాకుండా, మనస్ఫూర్తిగా చెయ్యడం గురించి ఈ పదాలు చెప్పక చెప్పటం లేదూ! అలా చెయ్యని వాళ్ళగురించి చివరన, పదునైన తెలుగు జాతీయంతో, ఎంత సూటిగా చెప్పాడు పోతన! పోతన మనసూ, మాటా మృదువైనవే కావొచ్చు. కానీ అవసరమైనప్పుడు ఎంత వాడిగా మారగలదో ఆ చివరిపాదం నిరూపిస్తోంది!

ఇంతకీ ఈ పద్యం ఎవరిగురించి? శివుడిని చేతులారా పూజించని వాడి గురించి. హరిని నోరార కీర్తించని వాడి గురించి. దయ సత్యము లేని వాడి గురించి. మరి అలాటి "వాడి"ని పేర్కొనే పదం - నామవాచకం కానీ, సర్వనామం కానీ ఈ పద్యంలో ఒక్కటైనా ఉన్నాదా? లేదే! అంటే అలాటి వాడిని, "వాడు" అని కూడా తలచుకోడం పోతనకి ఇష్టం లేదన్న మాట! అంతటి తిరస్కార భావాన్ని ధ్వనిస్తున్నాది కాబట్టే, ఈ పద్యం గుండెలోకి చొచ్చుకుపోతుంది.

సరే, ఇంక ఇందులో విషయానికి వస్తే...భగవద్భక్తినీ, హరిహరుల అద్వైతాన్ని చాటే మొదటి రెండు పాదాలతో బాటు, మూడవ పాదం ఎందుకు చేర్చాడు పోతన? ఇప్పుడంటే భక్తికీ, సత్ప్రవర్తనకీ లింకు తెగిపోయింది కానీ, నిజానికి మొదటినుంచీ మన దేశంలో దయ, సత్యం, ధర్మం లాంటి సద్గుణాలు భగవదారాధనలో భాగమే. మనిషి సంఘ జీవిగా సజావుగా బతకాలంటే, ఇలాటి లక్షణాలు కాస్తో కూస్తో అవసరం. అవి సహజంగా మనిషికి కలిగితే మంచిదే. కానీ అలా జరగడం సాధారణం కాదు. అందుకే భగవంతుని పేరుతో వాటిని ప్రచారంచేసారు కాబోలు. పోతన కాలానికే బహుశా వీటి మధ్య సంబంధం సన్నగిల్లడం మొదలయ్యిందేమో. అందుకే భక్తిని మాత్రం చెప్పి ఊరుకోకుండా, దయకి సత్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని పోతన నొక్కి చెప్పాడు.ఈ కాలంలో, దుర్మార్గాలు చేసేస్తూ పాపాలు పోవాలని గుడికి వెళ్ళి మొక్కుతీర్చుకొనే భక్త శిఖామణులు ఈ పద్యం నుంచి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది.

హేతువాద ఆలోచనా ధోరణి మంచిదే. విజ్ఞానవంతుడిగా ఎదుగుతున్న మానవునికి దైవమనే నమ్మకం తాలూకు అవసరం తగ్గిపోవడమూ సహజమే. అయితే, విజ్ఞానంతో పాటు వ్యక్తి స్వార్థం పెరిగిపోతున్న సందర్భంలో, మానవ అస్థిత్వానికీ, సమాజ సమతౌల్యానికి అవసరమైన దయ, సత్యం, ధర్మం వంటి గుణాలని మనుషుల్లో పెంపొందించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలని ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.

ప్రస్తుతానికి ఈ పద్యాన్ని మననం చేసుకొంటూ అది బోధించే మంచితనాన్ని అలవర్చు కోడానికి ప్రయత్నిద్దాం!


పూర్తిగా చదవండి...

Sunday, March 16, 2008

అమ్మా మన్నుతినంగ...

కృష్ణుడు మన్నుతిన్నాడని బలరాముడు యశోదకి ఫిర్యాదు చేస్తాడు. అప్పుడావిడ కృష్ణుణ్ణి పట్టుకొని ఎందుకలా చేసావని నిలదీస్తుంది. ఈ సందర్భంలో బాలకృష్ణుడేమంటాడు?


నాహం భక్షితవాన్ అంబ

సర్వే మిథ్యాభిశంసినః
యది సత్య-గిరస్ తర్హి
సమక్షం పశ్య మె ముఖం



"నేను తినలేదమ్మా. అంతా నా మీద తప్పుడు నేరం మోపుతున్నారు. అది నిజమని నువ్వనుకుంటే, నువ్వే, నీ కళ్ళతో నా నోరు చూడు."
ఇదీ సంస్కృతంలో వ్యాసులవారు చెప్పించిన మాటలు. ఈ మాటలని తెలుగు పద్యంలో పెట్టాలి. మామూలు కవులైతే ఏ తేటగీతి పద్యమో తీసుకొని సులువుగా నడిపించేస్తారు. పోతన మామూలు కవి కాదు కదా! పోతన కృష్ణుడు తెలుగు కృష్ణుడు, కాస్త చిలిపి గడుసు కృష్ణుడు. "అమ్మా, మన్ను తినడానికి నేనేమైనా చిన్నపిల్లాడినా!" అని మొదలుపెట్టాడు! ఒక చిన్న పిల్లవాడు "నేనేమైనా చిన్నపిల్లాడిననుకుంటున్నారా?" అని అంటే ఎంత మురిసిపోతాం!
సంస్కృతంలోని భారత భాగవతాలు పురాణాలు. భారతాన్ని ఇతిహాసమన్నా, అదీ ఒకరకమైన పురాణమే. "ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీ యుర్విన్ పురాణావళుల్ తెనుగుల్ జేయుచు" అని పోతనే అన్నాడు కదా. ఈ పురాణాలకి శ్రోతలూ, వారికి చెప్పాల్సిన తీరూ వేరు. తెలుగులో వీటిని తిరిగి రాసేటప్పుడు, వాటికి శ్రోతలు వేరు, వారికి చెప్పాల్సిన తీరు వేరు. భారతాన్ని కవిత్రయం ఒక కావ్యంగానే తీర్చిదిద్దారు. అంటే, కేవల ధర్మబోధే కాకుండా, రస పోషణకి ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగువాళ్ళ గుండెలకి హత్తుకోనేలా చెప్పడమన్నమాట. దీనికోసం వాళ్ళు కథని చక్కగా అల్లడం, మంచి నాటకీయమైన సంభాషణలు, అద్భుత వర్ణనలు - ఇలా రక రకాలైన మార్గాలని ఎంచుకున్నారు. అయితే భారతం వేరు, భాగవతం వేరు. భారతంలో ఒకటే మూల కథ. అందులోనే సహజమైన నాటకీయత ఉంది. వర్ణనలకి అవకాశం ఉంది. భాగవతం అలా కాదు. అందులో కేవలం భక్తి, భగవంతుడు మాత్రమే ప్రధానం. శుద్ధ వేదాంతం, గాఢమైన తాత్వికత ఉన్నదది. అందుకే "భాగవతము తెలిసి చెప్పుట చిత్రము, చూలికైన తమ్మిచూలికైన" అన్నది. మరి దాన్ని తెలుగువాళ్ళకి దగ్గర చెయ్యాలంటే ఎలా? దానికోసం తనదైన ఒక విశిష్ట మార్గాన్ని ఎన్నుకున్నాడు పోతన. గాఢమైన భక్తి, శబ్ద మాధుర్యం, తెలుగు జీవితాన్ని ప్రతిబింబించడం - ఈ మూడూ కలిపి చేసిన రసామృతంతో భాగవతాన్ని నింపేసాడు! ఈ పద్యం, ఈ పద్యమనేం మొత్తం భాగవతం, తెలుగువాళ్ళ హృదయాల్లో నిల్చిపోడానికి ఇదే కారణం.

అమ్మా మన్నుతినంగ నే శిశువునో! ఆకొంటినో! వెఱ్ఱినో!
నమ్మంజూడకు వీరిమాటలు మదిన్ నన్నీవుగొట్టంగ దా
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు గాదేనిన్ మదీయాస్యగం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే

ఆకొంటినో - ఆకలితో ఉన్నానా, అచ్చ తెలుగు మాట. "కొట్టంగ" ఇదీ అంతే. "దండింపుమీ" అనలేదు, "దండింపవే" అన్నాడు. అది పిల్లాడికి తల్లి దగ్గరున్న చనువుని ధ్వనిస్తుంది. చివరిన "మదీయాస్య గంధమ్మాఘ్రాణము సేసి" అన్నాడు.
మదీయ - నా, ఆస్యము - నోరు, గంధము - వాసన, ఆఘ్రాణము సేసి - వాసన చూసి
ఇంత పెద్ద సమాసం మరి చిన్నికృష్ణుని నోటి నుండి రావడం సమంజసమేనా? ఎలాటి నోరది? మొత్తం విశ్వాన్నంతటినీ అందులో చూపించబోతున్నాడు! దానికిది సూచన. యశోదని సిద్ధం చేయడానికి. అసలు యశోదకీ విశ్వరూప సందర్శనం ఎందుకు? అదే కృష్ణుని అవతార లక్షణం. రామావతారానికీ కృష్ణావతారానికీ ఉన్న తేడా. రాముడికి తను అవతారపురుషుడినన్న జ్ఞానం పూర్తిగా లేదు, ఉన్నా మనకి కనిపించదు, ఇతరులకీ తెలియదు. కృష్ణుడికా జ్ఞానం ఉంది. ఇతరులకది కలిగించడానికి అతను వెనుకాడడు. తన మీద కంసుడు రాక్షసులని పంపించడం మొదలుపెట్టాడు, తాను ఎదుర్కొంటున్నాడు. ఇదంతా యశోద తట్టుకోలేదు, తల్లిగా. నందుడికి కృష్ణావతారం గురించి వినికిడివల్ల కొంత తెలుసు. యశోదకి తెలీదు, తెలిసినా నమ్మక పోవొచ్చు. అందుకే స్వయంగా చూపించాడు. అయితే మళ్ళీ ఆమెకి మఱపు కలిగించాడు! లేదంటే ఆవిడ తల్లిగా తనని సాకలేదు కదా! అంతరాంతరాల్లో ఆ జ్ఞానం ఉంటుంది, అది చాలు.
ఇంతకీ ఆ పెద్ద సమాసం ప్రాస కోసం వేసాడు అని అనుకోడానికి ఆస్కారం లేకపోలేదు. అయినా అది ఎంతవరకూ అక్కడ అతికిందనేది ముఖ్యం. ఒకోసారి యతి ప్రాసలు పద్యానికిలాటి ప్రత్యేకతను, అధిక శోభను కలగించే ప్రయోగాలని స్ఫురింపచేస్తాయి!
ప్రాస స్థానంలో కొత్త పదం ప్రారంభమైనప్పుడుండే విరుపులో ఒక సొగసుంటుంది. ముందరి పదంతో సంధి కలిసినప్పుడు మరింత సొగసు! చదివితేనే తెలుస్తుంది. ఇలాటి సొగసులు తెలుగు పద్యలకే సొంతం!

పూర్తిగా చదవండి...

Saturday, March 8, 2008

ఛందస్సు - కథా కమామీషు

ఈ రోజెందుకో పద్యం చెప్పేబదులు పాఠం చెప్పే మూడొచ్చింది. అహహ...పాఠవనగానే ఖంగారు పడేరు! క్లాసు పీకడం కాదండీ, ఛందస్సు కథా కమామీషు గురించి, నాకు తెలిసిన నాలుగు ముక్కలు మీతో పంచుకోడమే.

ఛందస్సనగానే గుర్తుకొచ్చేవి గురువు, లఘువు, యమాతారాజభానస లగం, భరన భబరవ, యతీ, ప్రాసా...ఇచ్చిన పద్య పాదాన్ని రాసుకొని, మూడేసి అక్షరాల తర్వాత ఒక పెద్ద గీత పెట్టుకొని ప్రతి అక్షరమ్మీదా U, I గుర్తులు పెట్టడం...

అలా కుస్తీపట్టి ఏ పద్యమో గుర్తుపట్టేసరికి ఏదో గొప్ప విజయం సాధించేసినట్టు, అదో తుత్తి! శార్దూలానికీ, మత్తేభానికీ నాకెప్పుడూ తికమకే. ఆ తర్వాత దానికో చిట్కా కనిపెట్టాను! "స"(గణం)తో మొదలయ్యేది "మ"త్తేభమూనూ, "మ"(గణం)తో మొదలయ్యేది "శా"ర్దూలమూ! సరే కందానికొచ్చేసరికల్లా ఉండే గందరగోళం అబ్బో, ఇంతా అంతా కాదు! అన్నిటికన్నా ఆటవెలది హాయిగా ఉండేది, కాని అదెప్పుడూ పరిక్షల్లో అడిగేవారు కాదు:-(
ఇంతకీ చెప్పొచ్చేదేవిటంటే, మొదట్లో నేనూ ఛందస్సుని బట్టీపట్టే నేర్చుకొన్నాను. చిన్నప్పుడు సైన్సు కూడా అలానే కదా నేర్చుకుంటాం. "భూమి గుండ్రముగా ఉండును. అది తన చుట్టూ తను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగును.", ఇలా... భూమి గుండ్రంగా ఎందుకుంటుంది? మనకి మాత్రం బల్లపరుపుగా ఎందుక్కనిపిస్తుంది? సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఇలాటి ప్రశ్నలు వచ్చినా వాటిగురించి పెద్దగా పట్టించుకోం. పట్టించుకుని మాస్టార్ని అడిగినా, అవన్నీ తర్వాత తెలుస్తాయని దాటేస్తారు. దాని గురించి విపులంగా వివరించాలని ప్రయత్నిస్తే, అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్టవుతుంది. అలానే ఛందస్సు కూడా. కాస్త పెద్దయ్యాక, బుద్ధిపెట్టి ఆలోచిస్తే, వాటి వెనకున్న రహస్యాలు కొంచెం కొంచెం బోధపడతాయి. పెద్దయ్యాక ఛందస్సు గురించి తెలుసుకోవాలంటే, చిన్నప్పట్లా బట్టీ పడదామంటే మన బుఱ్ఱ ఒప్పుకోదు, అది తెలివిమీరిపోయింది కదా! ఛందస్సంటే ఏమిటి? దాని ప్రయోజనమేమిటి? ఒక అక్షరం గురువెందుకౌతుంది, లఘువెందుకౌతుంది? ఇలా చాలా చాలా ప్రశ్నలు అడుగడుక్కీ అడ్డుగోడల్లా నిలుస్తాయి. వాటికి సమాధానలు తెలిస్తే కానీ ముందుకి కదల్లేం! వాటికి జవాబులు వెతుక్కొని, ఒకొక్కడుగే ముందుకు వెళుతూ ఉంటే, ఒక్కొక్క మెట్టూ ఎక్కుతున్నట్టనిపిస్తుంది. అలా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వెళుతూ పోతే - నలుచదరంగా, అంతుపొంతూ తెలియకుండా ఉండే ఛందఃప్రపంచం, అందమైన రంగురంగుల బంతిలా కనిపిస్తుంది. దాని అసలు స్వరూపం సాక్షాత్కరిస్తుంది! మరి ఈ ప్రయాణానికి మీరు సిద్ధమేనా? పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి...

అనగనగనగా... ఒక అడవిలో ఇద్దరన్నదమ్ములు. ఒకడేమో ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండే వాడు. ప్రకృతి గురించి, ప్రాణం గురించి, జీవితం గురించి ఇలా. మరొకడేమో ఎప్పుడూ ఏదో పనిచేస్తూనే ఉండేవాడు. జంతువుల్ని వేటాడ్డమో, పంటలు పండించడమో, పనిముట్లు తయారు చెయ్యడమో ఇలా. మొదటి వాడు తనకొచ్చిన ఆలోచనలనీ, ఊహలనీ, అప్రయత్నంగా, ఒక వినూత్న రూపంలో వ్యక్తం చేసాడు. అవి మాటలైనా, వాటి కూర్పులో ఒక ప్రత్యేకత, విలక్షణత ఉన్నాయి. గుర్తు పెట్టుకొని అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వీలుగా ఉన్నాయి. అవే వేదాలయ్యాయి!
ఇక రెండో వాడు, పని చేసుకుంటూ ఆ పనిలోని శ్రమని మరచిపోడానికి, అప్రయత్నంగానే, ఒక సన్నని రాగం తీసాడు. ఆ రాగానికొక విలక్షణమైన నడకతో మాటల్ని కట్టాడు. అవే పాటలయ్యాయి!
అప్పుడే రెండు సమాంతర మార్గాల్లో సాహిత్య సృష్టి జరిగింది. ఆ రెండు మార్గాలూ రెండు రకాలైన ఛందస్సులని అనుసరించినవే! ఇందులో ఏది మొదటిదన్నది చెప్పలేం కానీ, తమ నిర్దిష్ట రూపాన్ని నిలబెట్టుకుంటూ, వేదాలు, తరతరాలకూ ప్రసారమవ్వడం మూలాన, వాటి రూపాన్ని వివరించే శాస్త్రాలు పుట్టాయి. వాటిలో ఒకటే ఛందస్సు. మొదట్లో ఛందశ్శాస్త్రం వేదాల్లో ఛందస్సు గురించే చెప్పినా, తరవాత్తరవాత విస్తృతమై, అన్ని సాహిత్య ప్రక్రియలనీ పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు ఛందస్సు గురించి మాట్లాడాలంటే, వేదాలూ, ఇతిహాసాలూ, పురాణాలూ, కావ్యాలూ, గేయాలూ అన్నిటి గురించీ చెప్పుకోవాలి. వేదాల్లో ఉన్న శ్లోకాలకీ, కావ్యాల్లోని పద్యాలకీ చాలా తేడానే ఉంది, రూపంలో. అలాగే కావ్యాల్లో పద్యాలకీ, జానపదులు పాడుకునే గేయాలకీ చాలా తేడా. అంచేతనే వాటిని వివరించే ఛందస్సులో కూడా అన్ని రకాలున్నాయి.

అయితే ఇంత వైవిధ్యం ఉన్న ఛందస్సుకీ ప్రాధమికమైన రెండు అంశాలు పునాదులు. ఒకటి అక్షరం (ఇంగ్లీషులో syllable), రెండు మాత్ర (లాటిన్, గ్రీకు భాషల్లో Mora). అక్షరం అంటే అందరికీ తెలిసిందే. మాత్ర అంటే, అక్షరాలని ఉచ్చరించడానికి తీసుకొనే కాలానికి ఒక ప్రమాణం.
మనందరం తెలుగు నేర్చుకునేటప్పుడు (ఒకవేళ నేర్చుకుంటే:-), మొట్టమొదట చదివేది అ, ఆలు. "అ", "ఆ"లని పలికేటప్పుడు, రెండిటికీ మనం ఒకే లాగ నోటిని, గొంతుని కదుపుతాం. వాటి మధ్య ఉన్న తేడా అల్లా వాటిని ఉచ్చరించే కాలం. "ఆ"ని, "అ" కన్నా కొంచెం ఎక్కువసేపు పలుకుతాం. ఈ రెంటి మధ్య ఉన్న కాల భేదమే ఒక "మాత్ర". అయితే కొందరు "ఆ"ని సాగదీసి మరీ ఎక్కువసేపు పలకొచ్చు. కానీ దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. ఆ మాటకొస్తే ఏ ఇద్దరూ "ఆ"ని పలకడానికీ సరిగ్గా ఒకే సమయం తీసుకోరు. ఇక్కడ చేస్తున్నది ఒక సాధారణీకరణ, generalization. "అ"కి ఒక మాత్ర కాలం పడితే, "ఆ" రెండు మాత్రల కాలం పడుతుంది. అలాగే మిగతా హ్రస్వాచ్చులు (short vowels), దీర్ఘాచ్చులూ (long vowels) కూడా.

ఇప్పుడు ఈ దీర్ఘాచ్చులు కాకుండా మరే అక్షరాలు పలకడానికి మనం కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటామో ఆలోచించండి. అదే ప్రస్తుతానికి మీకు ఇంటిపని, అదేనండీ homework:-)

పూర్తిగా చదవండి...

Sunday, March 2, 2008

మందార మకరంద...


మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు
రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు
కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
మరుగునే సాంద్ర నీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!
వినుత గుణశీల, మాటలు వేయునేల?

ఈ పద్యం మనసులో మెదిలినప్పుడల్లా నాకు నా ఇంటరు రోజులు జ్ఞాపకమొస్తాయి. మా బి.వి.కె కళాశాలలో ఆ సంవత్సరం పద్యాల అంత్యాక్షరిని నిర్వహించారు. పద్యాలతో అంత్యాక్షరి పోటీ మరెప్పుడూ ఏ కాలేజీలోనీ పెట్టినట్టు నాకు తెలీదు. అది నా అదృష్టమనే చెప్పాలి. అందులో నా మిత్రుడొకడు ఈ పద్యాన్ని చదివాడు. ఈ పద్యాన్ని నేను వినడం అదే మొదటిసారి. ఆ పద్యానికీ, ఆ చదివిన విధానానికీ మంత్రముగ్ధుణ్ణయి పోయాను! వెంటనే ఆ పద్యాన్ని రాసుకొని కంఠస్థం చేసాను.

పోతన భాగవతంతో కాస్తంత పరిచయం ఉన్న ఎవరికైనా ఈ పద్యం తప్పకుండా తెలుస్తుంది. భక్తప్రహ్లాద సినిమా చూసినవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుందండోయ్! ప్రహ్లాదుడు మన తెలుగువాళ్ళ హృదయాల్లో నిలిచిపోడానికి ముఖ్య కారణం పోతనంటే అది అతిశయోక్తి కాదు. ఇందులో ఎన్నెన్ని ఆణిముత్యాల్లాంటి పద్యాలు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయాయో!

కవిత్వంలో, చెప్పే విషయం ఎంత గొప్పదైనా, అది చెప్పే విధానంకూడా అంతగొప్పదీ అయితేనే పాఠకుల మనసులకి హత్తుకుంటుందనడానికి ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ.

విష్ణు భక్తిని వదలడం తన సాధ్యం కాదని చెప్పడం ఈ పద్యం సారాంశం. దాన్ని చక్కని నాలుగు ఉదాహరణల్తో సమర్ధిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ తీసుకున్న ఉదాహరణల్లో ఎంతో ఔచిత్యం ఉంది. తేనెటీగ, హంస, కోయిల, చకోరం - ఇవన్నీ పురుగులూ, పక్షులూను. వాటికి ఇష్టమైన ఆ వస్తువులు భౌతికమైనవి, అశాశ్వతమైనవి. అలాటి ప్రాణులకే అలాటి వస్తువులమీద అంత వదల్లేని అనుబంధం ఉంటే, ఇంక మనుషులకి, అందులోనూ అమృత ప్రాయమైన హరి చింతన వదిలిపెట్టడం సాధ్యమౌతుందా? సాధ్యమవదు అన్న జవాబు మళ్ళీ ఆ ఉదాహరణల్లోనే దొరుకుతుంది. మందారాల తేనె, గంగా ప్రవాహము, మావిడి చిగురు, వెన్నెల - వీటితో తుమ్మెద, హంస, కోయిల, చకోరాలకి ఉన్న సంబంధం అతి సహజమైనది. ప్రకృతి సిద్ధమైనది. వాటికి తెలియకుండానే పుట్టుకతో వచ్చింది. ప్రహ్లాదుని భక్తి కూడా అలాంటిదే! అందుకే దాన్ని వదులుకోడం అసాధ్యం!

పద్యం ఎత్తుకోడంతోనే అందమైన పదాలకూర్పుతో చదివేవాళ్ళ, వినేవాళ్ళ మనసులని వశం చేసుకోడం ఒక నేర్పు. ఈ పద్యంలో మరింత లోతైన కూర్పు నేర్పు కూడా చూపించాడు పోతన. ఇష్టమైన వస్తువులను ఎక్కువ పదాలతో వర్ణించి, ఇష్టపడని వస్తువులను ఒకటి రెండు పదాలతో చెప్పి ఊరుకున్నాడు. మదనములు - ఉమ్మెత్త చెట్లు. తరంగిణులు - సెలయేళ్ళు. కుటజములు - (వానాకాలంలో పూసే)కొండ మల్లె చెట్లు. సాంద్ర నీహారము - దట్టని మంచు. అయితే వీటిగురించి చెడు విశేషణాలేవీ వాడకపోవడం ఒక విశేషం. ప్రహ్లాదుడు దేనిగురించీ చెడ్డగా మాట్లాడే వాడు కాదు కదా!వాడిన క్రియలుకూడా చెప్పిన ప్రాణులకీ వస్తువులకీ ఉన్న గాఢమైన అనుబంధాన్ని చెప్పేవే - తేలు, తూగు, సొక్కు, స్ఫురితము (చుంబించబడిన).

అంతా చెప్పి చివరికన్న మాట చూడండీ! "అయినా నువ్వు గొప్ప గుణాలున్న శీలవంతుడివి. నీకు నేనింతగా చెప్పాలా!" ఇదేదో ప్రహ్లాదుడు గడుసుగా అన్న మాటలు కావు. అతనికి తండ్రి మీదున్న అచంచలమైన గౌరవమే!

ప్రహ్లాదుని భక్తి మాట అటుంచి, కనీసం అతని సౌశీల్యాన్నయినా ఆదర్శంగా తీసుకుంటే, పిల్లలు మంచి మనుషులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది మనందరి చేతుల్లోనే ఉంది!


పూర్తిగా చదవండి...