తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, December 30, 2011

పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం - తరువాయి భాగం

క్రిందటి టపాలో సత్యాపతి తన ప్రియసతి పదపల్లవ తాడననాన్ని రుచిచూసిన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాం కదా. అతను కాక (అంత కన్నా ముందే) ఆ సత్కారాన్ని పొందిన ఆ మరో దేవుడెవరో తెలుసుకోడానికి ఉవ్విళ్ళూరుతున్నారా?:-) ఆ దేవుడు ఆదిదేవుడు, శంకరుడు. దాని గురించి చెప్పినది స్వయంగా ఆదిశంకరులు. ఆ అయ్యవారు అమ్మవారి పాదతాడనాన్ని పొందడమే కాదు, అది పొందాలని ఉవ్విళ్ళూరారట కూడా!

నమోవాకం బ్రుమో నయన రమణీయాయ పాదయోః
త వాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచి రసాలక్త కవతే
అసూయ త్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనా మీశానః ప్రమదవన కంకేళి తరవే

అమ్మవారి పాదాలు లత్తుకతో అలంకరింపబడి నయనరమణీయంగా ప్రస్ఫుటమైన కాంతితో వెలుగుతున్నాయి. ఉద్యానవనంలోని కంకేళి తరువులు (అశోక వృక్షాలు) ఆ పాదాల తాడనాన్ని (అభిహననము) పొందుతున్నాయి. వాటిని చూసి పశుపతి అయిన ఈశ్వరుడు, తనకా భాగ్యం దక్కలేదే అని వాటిని చూసి ఈర్ష్యపడుతున్నాడట. ఎంత చోద్యమో చూసారా! అలాంటి పాదాలకి నమోవాకాలు చెపుతున్నారు శంకరాచార్యులవారు, సౌందర్యలహరిలో. ఇంతకీ అశోకవృక్షాలను అమ్మవారు తన్నడమేమిటి?

చెట్లు చక్కగా పుష్పించడానికి పూర్వకాలంలో కొన్ని చిత్రమైన పద్ధతులు ఆచరించేవారట. వీటిని దోహదక్రియలంటారు. ఒకో చెట్టుకి ఒకో రకమైన క్రియ. ఆలింగనాత్ కురువకః - అంటే కురువకాన్ని కౌగలించుకుంటే బాగా పుష్పిస్తుంది, కరస్పర్శేణ మాకందః - చేతి స్పర్శ చేత మామిడి పుష్పిస్తుంది. ఇలా చాలా చెట్లకి దోహదక్రియలున్నాయి. ఇవన్నీ స్త్రీలు మాత్రమే చెయ్యాలి. నాకు తెలిసిన మరికొన్ని:

సల్లాపతః కర్ణికారః - కర్ణికారానికి (కొండగోగు) చక్కని మాటలు
నమేరుః హసితేనచ - నమేరువుకు (సురపొన్న) నవ్వు
వకుళో ముఖసీధునా - వకుళానికి (పొగడ) నోట్లో మధువు తీసుకొని పుక్కిలించాలి
అశోకః చరణాహత్యా - అశోకానికి చరణాహతి, అంటే మనం చెప్పుకుంటున్న కాలితాపు
సిందువారో ముఖానిలాత్ - సిందువారానికి (వావిలి చెట్టు) నోటితో ఊదడం
తిలకో వీక్షణేనచ - తిలకానికి (బొట్టుగు చెట్టు) కంటిచూపు

పదహారవశతాబ్దానికి చెందిన కృష్ణనందుడనే అతను తంత్రసారమనే గ్రంథంలో యీ దోహదక్రియలన్నిటినీ వివరించాడట. కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోకూడా వీటి ప్రస్తావన కనిపిస్తుంది.

ఇంతకీ అసలు సంగతికి మళ్ళీ వద్దాం. అలా పార్వతీదేవి తమ ఉద్యానవనంలోని అశోకవృక్షాలు బాగా పుష్పించాలని నిత్యమూ వాటిని తంతోంది. అంత అందమైన పాదాల తాకిడి వాటికి మాత్రమే దక్కుతోందని శివునికి వాటి మీద అసూయ కలిగిందట! తనకీ ఆ అదృష్టం దక్కాలని తహతహ లాడేడు. మరి ఆయన కోర్కె తీరిందా? ఎందుకు తీరదు! అది తీరిన విధానాన్ని ఆ తర్వాతి పద్యంలోనే ఆదిశంకరులు వివరించారు.

మృషాకృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితమ్
లలాటే భర్తారమ్ చరణకమలే తాడయతి తే
చిరాదన్తశ్శల్యం దహనకృతమున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశానరిపుణా

సౌందర్యలహరిలో శ్లోకాలన్నిటిలోకి నాకు బా...గా... యిష్టమైన శ్లోకమిది. శివుడు పార్వతీదేవి చేత తల దన్నించుకోడానికి ఒక ఉపాయం పన్నాడు. మృషా అంటే కపటం, నాటకం. పార్వతి దగ్గరున్నప్పుడు గోత్రస్ఖలనం చేసినట్టు నటించాడు. గోత్రస్ఖలనమంటే భార్యని పొరపాటుగా వేరే స్త్రీ (సవతో, ప్రేయసో) పేరుతో పిలవడం. బహుశా మరి "గంగా" అని పిలిచాడేమో పార్వతిని! అలా చేస్తే ఆమెకి ఎంత బాధ కలుగుతుంది, ఎంత కోపం వస్తుంది! శివుడలా చేసి, నాలిక్కరుచుకొని, ఏమీ పాలుపోవనివాడిలాగా (వైలక్ష్య), పాదాలకి వంగి తన శిరసుతో నమస్కరించాడు, క్షమించమని వేడుకున్నట్టుగా. అలా తన కాళ్ళకు మ్రొక్కిన భర్త లలాటాన్ని తన చరణకమలంతో పార్వతి తన్నింది. ఆ రకంగా శివుని కోరిక తీరింది! చూసారా కపట నటనలో ఆ జగన్నాటకసూత్రధారిని మించిపోయాడీ జగత్పిత! భార్య పాదతాడన భాగ్యం కోసం ఎంతటి సాహసానికి పూనుకున్నాడు!

ఇంతవరకూ చెప్పి ఆపేస్తే అతను ఆదిశంకరులు ఎందుకవుతారు, మహాకవి ఎలా అవుతారు! అసలు కవిత్వమంతా ఆ మిగిలిన రెండు పాదాలలోనూ ఉంది. పార్వతీదేవి అలా కాలితో శివుని ఫాలభాగాన్ని తన్నినప్పుడు, ఆమె కాలియందెలు గలగలమన్నాయి. ఆ సవ్వడి ఎలా ఉన్నదంటే - శివుని ఫాలాగ్నికి కాలి బూడిదైన (దహనకృతం) మన్మథునికి (ఈశానరిపు - ఈశ్వరుని శత్రువు), జరిగిన ఆ పరాభవం ఒక బాణమై హృదయంలో చిరకాలంనుండి గుచ్చుకొని ఉందట (చిరాత్ అంతః శల్యం). పార్వతీదేవి తన కాలితో ఆ శివుని ఫాలభాగాన్ని ఎప్పుడైతో తన్నిందో, ప్రతీకారం జరిగినట్టయింది. పరాభవ బాణం పెకిలించబడింది (ఉన్మూలితా). మన్మథుని మనసుకి ఎంతో హాయి కలిగింది. ఆ ఆనందంలో అతను కిలకిలా నవ్వాడు. ఆ కిలకిలలల్లాగా ఉన్నాయట కాలియందెల గలగలలు!
ఆహా! ఎంత మహాద్భుతమైన ఊహ! ఎంత రమణీయ కల్పన! ఎంతటి ధ్వని! దీనికి మించిన కవిత్వముంటుందా! జాగ్రత్తగా గమనిస్తే, యిక్కడ నిజంగానే మన్మథునికి జయం కలిగింది. అమ్మవారి పాదతాడన సౌఖ్యాన్ని అనుభవించాలన్న శివుని కోర్కె మన్మథ ప్రేరితమే కదా! ఇక్కడ మనమొక మనోహరమైన ఊహ చేయవచ్చు. తనకు జరిగిన పరాభవానికి ఎలాగైనా బదులు తీర్చుకొనేలా చెయ్యమని మన్మథుడు అమ్మవారి పాదాలని ఆశ్రయించాడు. అమ్మ ఎప్పుడైనా కరుణాహృదయ కదా. మారాం చేసే తన బిడ్డ మురిపం తీర్చాలని అనుకున్నది. ఏ పాదాలనయితే మన్మథుడు ఆశ్రయించాడో, ఆ పాదాలపైనే తన భర్తకి కోరిక కలిగేలా ఆమె చేసింది. అతడు తన కాళ్ళకి మ్రొక్కేలా చేసింది. అలా మ్రొక్కిన అతడి ఫాలాన్ని తన కాలితో తన్నింది. ఆ పని ద్వారా అటు తన భర్త కోర్కెను, యిటు మన్మథుని ఆకాంక్షనూ కూడా నెరవేర్చింది. శివుడు శృంగారి కావడమే మన్మథుని జయ సూచకం. అది చాలదన్నట్టు ఆ శృంగారలీలలో మన్మథుని దహించిన ఫాలభాగమే తన్నబడడం, మన్మథునికి సంపూర్ణ విజయం. ఇదంతా ఒక ఎత్తైతే, ఆనంద హృదయడైన మన్మథుని నవ్వుల కిలకిలలతో, పార్వతీదేవి శింజినుల మంజుల స్వనాన్ని పోల్చడం అన్నది పరమ రమణీయమైన ఉపమ!

ఇది వరకు చెప్పానేమో తెలియదు, సర్వసంగపరిత్యాగి అయిన ఒక సన్న్యాసి, మహాకవి కూడా కావడమన్నది వింతలలో వింత. అది ఒక్క ఆదిశంకరుల విషయంలో మాత్రమే నిజమయ్యింది! పై శ్లోకానికి ఆధ్యాత్మికపరమైన వివరణ కూడా ఉన్నది. అదేమిటో తెలుసుకో గోరినవారు చాగంటి కోటేశ్వరరావుగారిని వినాలి. :-) ప్రస్తుతానికి నాకు మాత్రం ఇందులోని కవిత్వమే ముఖ్యం.

తెలుగు పద్యం లేకుండా యీ తెలుగుపద్యం బ్లాగులో వేసిన మొట్టమొదటి టపా (ఒకే ఒక్క టపాకూడా అవుతుందేమో) యిదేనేమో! ఇంతటి గొప్ప శ్లోకాన్ని గురించి చెప్పే టపాకి ఆ మాత్రమైనా ప్రత్యేకత ఉండొద్దూ మరి. పద్యాభిమానులెవరైనా దీనికి అందమైన ఆంధ్రీకరణ జేసి వ్యాఖ్యలలో యిచ్చినట్లయితే ఆ ప్రత్యేకత మరింత ఇనుమడిస్తుంది!

పూర్తిగా చదవండి...

Thursday, December 22, 2011

పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం!

భార్య పాదతాడనం రుచిచూసిన దేవుడనగానే మనకి గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడొక్కడే. అదికూడా, మన నంది తిమ్మనగారి పుణ్యమా అని తెలుగు కృష్ణుడికి మాత్రమే దక్కిన భాగ్యమది. మరి టపా శీర్షికలో "దేవుళ్ళు" అని బహువచనమేమిటి? మరో దేవుడు కూడా భార్య చేత తన్నించుకున్నాడా?! అన్న అనుమానం ఈపాటికి మీకు కలిగుండాలి. అవును, భార్య చేత తలదన్నించుకున్న దేవుడు మరొకడున్నాడు. అసలు నంది తిమ్మనగారి కృష్ణుడికి స్ఫూర్తినిచ్చింది కూడా ఆ దేవుడే అని నా నమ్మకం. అతనెవరో ఆ సందర్భమేమిటో తెలుసుకొనే ముందు, నంది తిమ్మనగారి పారిజాతాపహరణ కావ్యంలో మనందరికీ పరిచయమైన పద్యాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం.

జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు గన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్
దొలగన్ ద్రోచె లతాంగి, యట్లయగు, కాంతుల్ నేరముల్ సేయ పే
రలుకన్ బూనినయట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే!

ఈ సన్నివేశాన్ని ఎరుగని వారుండరు కదా. పారిజాతాపహరణ కావ్యం గురించి తెలియకపోయినా, శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలో "అలిగితివా సఖీప్రియా..." పాట, చాలామందికి తెలిసే ఉంటుంది. నారదుడు తెచ్చి యిచ్చిన పారిజాతపుష్పాన్ని తనకివ్వకుండా రుక్మిణికి యిచ్చాడని సత్య అలకబూనుతుంది. ఆమె అలక తీర్చే ప్రయత్నంలో చివరికి ప్రేమతో ఆమె కాళ్ళకి మ్రొక్కుతాడు శ్రీకృష్ణుడు. సత్యభామ చిగురులవంటి పాదాల ఎఱ్ఱని వెలుగులు తన కిరీటములోని మణికాంతులకి వన్నెపెట్టే విధంగా తలవంచి ఆ పాదాలని మ్రొక్కాడట! నిజంగా తానేదో అపరాధం చేసేశానన్న పశ్చాత్తాపంతోనా? అబ్బే! కృష్ణుడంటే ఎవరు? జగన్నాటకసూత్రధారి. అదంతా ఆయనకొక లీక. శృంగారలీల. అప్పుడేమయ్యింది? అతడు కోరుకున్నదే జరిగింది! బ్రహ్మేంద్రాది దేవతలచేత పూజింపబడే ఆ తలని తన ఎడంకాలితో త్రోసేసిందా భామ.

పద్యాలలో పదాలని ఆచితూచి వెయ్యడంలో దిట్ట నంది తిమ్మన. బ్రహ్మేంద్రాది దేవతలచే పూజింపబడేది అని చెప్పి ఊరుకో లేదు చూసారా. అది "లతాంతాయుధు కన్నతండ్రి" శిరసు అని కూడా మనకి గుర్తుచేసారు. అక్కడుంది కీలకం! లతాంతము అంటే లత చివరల పూచేది, పువ్వు అని అర్థం. లతాంతాయుధుడంటే సుమశరుడయిన మన్మథుడు, శృంగారదేవత. అతని తండ్రి అంటే సర్వ సృష్టిలోని శృంగారానికి కారణభూతమైన వాడన్న మాట. దీనివల్ల మనకి ధ్వనిస్తున్న విషయమేమిటి? సత్యభామ చేష్టని శృంగార రస దృష్టితోనే చూడాలి తప్ప ఏదో పరమపూజనీయమైన ఆ శిరసుకి అవమానం జరిగిందని భావించకూడదు సుమా అని కవి మనలని హెచ్చరిస్తున్నాడు. ఆ శిరసు ఎంతటి పూజనీయమైనదైనా కావచ్చు. కాని ఆ సన్నివేశంలో అది మన్మథ జనకుని శిరసు. శ్రీకృష్ణుడు  శృంగారనాయకుడు. ఆ చేష్ట శృంగారలీల. అందుకే ఆ తాకిడికి శ్రీకృష్ణుడు "ఉద్దీపిత మన్మథ సామ్రాజ్యాన్ని" పొందాడని తర్వాతి పద్యంలో అంటాడు తిమ్మన.  పైగా, తన్నినది ఎవరు? "లతాంగి". అతను లతాంతాయుధు కన్నతండ్రి, ఈమె లతాంగి. పొత్తు సరిగ్గా కుదరింది. లతలాంటి మేను ఎంత సున్నితంగా ఉంటుంది! అందుకే ఆ తాకిడికి ఆయనగారి మేను పులకించింది. ఆ పులకల ములుకులు ఆమె పదపల్లవానికి గుచ్చుకుంటే ఎక్కడ నొప్పి కలుగుతుందోనని తెగ బెంగపడ్డాడట ఆ కపట గోపాలుడు! ఆమె "నెయ్యపు కినుక"తో ("ప్రణయకోపాని"కి ఎంత ముచ్చటైన తెలుగు పదం!), తనని తన్నినా అది మన్ననే అని కూడా అంటాడు. అదంతా ఒక రసరమ్య విలాసం. దాన్ని తన ముద్దుముద్దు పలుకులతో మనోహరంగా చిత్రించాడు నంది తిమ్మన.

చెలునికి నెచ్చెలి కాలితాపు అనుగ్రహించడమన్నది పూర్వకాలంలో ప్రసిద్ధమైన విషయం లాగానే అనిపిస్తుంది.  దీని గురించి చాలా రిసర్చికూడా జరిగినట్టుంది! :) వాత్స్యాయనుడు నాయికా పదప్రహరణనాన్ని శృంగారలీలగా సూత్రీకరించాడు. వాత్స్యాయుని వ్యాఖ్యానించిన జయమంగళుడైతే ఏకంగా "క్రోధ వశాత్తస్య శిరసి పాదతాడనమపి నదోషాయ సౌభాగ్య చిహ్నం తదితి నాగరకవృద్ధాః" అన్నాడు. ఆలంకారికులు కూడా దీన్ని గురించి ప్రస్తావించారు. సాహిత్యదర్పణంలో విశ్వనాథ కవిరాజు రూపకాలంకారానికి యిచ్చిన ఉదాహరణ చూడండి:

"దాసే కృతాగసి భవత్యుచితః ప్రభూణాం పాదప్రహార ఇతి సుందరి నాస్మి దూయే, ఉద్యత్కఠోర పులకాంకుర కంటకాగ్రై ర్యద్భిద్యతే మృదుపదం నను సా వ్యథా మే"
(శ్లోకం  ఛందస్సు గుర్తుపట్టారా?!)

ఈ శ్లోకం రెండవ భాగానికి ఇంచుమించు తెలుగుసేతే మనందరికీ బాగా తెలిసిన ఈ పద్యం:

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్క బూని తా
చిన, యది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్రకంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద నల్క మానవుగదా యికనైన నరాళకుంతలా! 

దేవుళ్ళైనా దేవుళ్ళాడేంత మహత్తు దీనిలో ఉన్నదంటే ఇంక సామాన్యుల మాటేం చెపుతాం! ఇంతకీ ఆ రెండో దేవుడెవరో ఆలోచించారా? కనిపెట్టారా? అబ్బా ఆశ! అప్పుడే చెప్పేస్తే మజా ఏముంటుంది. అది తెలియాలంటే తదుపరి టపాకోసం ఎదురుచూడండి మరి. :-)

(తెలిసిన వాళ్ళు గుట్టు రట్టు చెయ్యకుండా, ఈ టపాకి వ్యాఖ్యలని మోడరేట్ చేస్తున్నానోచ్!)

పూర్తిగా చదవండి...

Thursday, December 15, 2011

చెప్పుకోండి చూద్దాం! - సమాధానం


శ్రీశ్రీ సిప్రాలి గురించిన టపా వ్యాఖ్యలలో, అచ్చులతో ప్రాస ఉన్న పద్యానికి ఉదాహరణగా కందిశంకరయ్యగారు కవిజనాశ్రయంనుండి యీ క్రింది పద్యాన్ని ఉదహరించారు:

అ ఆ ఐ ఔ లకు మఱి
ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
ఉ ఊ ల్దమలో నొడఁబడి
ఒ ఓ లకు వళ్లగు న్నయోన్నతచరితా!

ఇది యతుల గురించి వివరించే పద్యం. ఏయే అచ్చులకి యతిమైత్రి ఉన్నదో చెపుతోంది. ఈ పద్యంలో అచ్చుల ప్రాసతో పాటు, ఛందస్సుకి సంబంధించి మరొక విశేషం కూడా ఉంది! అదేమిటో చెప్పుకోండి చూద్దాం! ఛందస్సు, భాషల పైన ఆసక్తి ఉన్నవాళ్ళకి మంచి మెదడుకి మేత. ఈ విశేషం గురించి కందిశంకరయ్యగారి వంటి వారికి ఈపాటికే తెలిసి ఉంటుంది కాబట్టి, వారు చెప్పవద్దని ప్రార్థన. తెలియనివాళ్ళు ప్రయత్నించండి.

సమాధానం
----------


సనత్ గారు సరిగానే కనుకున్నారు. గోపాలకృష్ణగారు చక్కగా వివరించారు!


"అఆ", "ఇఈ" - ఇలా అచ్చులు కలిపి చదివేటప్పుడు మొదటి అచ్చు హ్రస్వమే అయినా, దాన్ని పలకడంలో కొంత ఎక్కువ సమయం తీసుకుంటాము కాబట్టి అది గురువే అవుతుంది. ఒక రకంగా యిది విసర్గకి దగ్గర చుట్టం. "దుఃఖము" అన్న పదంలో దు అనేది దీర్ఘం కాదు. "ఖ" సంయుక్తాక్షరమూ కాదు. అయినా "దుః" అన్న అక్షరం గురువెందుకు అవుతోంది? దాన్ని ఉచ్చరించేటప్పుడు కాస్తంత ఆగి, తర్వాత "ఖ"ని ఉచ్చరిస్తాము. అందుకు "దుః" అన్నది గురువు. అలాగే "అఆ" అని కలిపి చదివేటప్పుడు "అ"ని పలికిన తర్వాత కొద్దిగా ఆపి "ఆ"ని పలుకుతాము. దీన్నే ఇంగ్లీషులో glottal stop అంటారు. ఎందుకిలా ఆపుతాము? మన భాషా స్వరూపం వల్ల! తెలుగులో పదం మధ్యలో అచ్చు అక్షరం రాదని తెలుసు కదా. ఒక వేళ రెండు పదాలు కలిపేటప్పుడు, రెండవ పదం మొదట అచ్చు ఉందంటే, అది "య"కారంగా మారిపోతుంది!  "మా అమ్మ"ని కలిపి గబగబా అనాలంటే మాయమ్మ అవుతుంది. అలాగే "మా ఇల్లు" మొదలైనవి.
అయితే "అఆ"ని పలికాల్సినప్పుడు "ఆ" అన్నది పలికి తీరాలి, అది "యా"గా మార లేదు. అంచేత ఆ రెంటిని గబగబా కలిపి పలకడం కుదరదు. పలకడంలో వాటి మధ్య అనివార్యంగా కొంత ఖాళీ వస్తుంది. కాబట్టి, ఆ ఖాళీ సమయాన్ని కూడా "అ" ఉచ్చారణలో భాగం చేసి, "అ" గురువైపోతుందన్న మాట!

పూర్తిగా చదవండి...

Sunday, November 27, 2011

కంకంటి కవిత్వం

ఇంతకు బూని వచ్చి వచియింపక పోదునె? విన్ము తల్లి! దు
శ్చింతులు దైత్యు చేబడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవా
డెంత విమోహి రాముడని యెగ్గులు వల్కిన నాలకించి భూ
కాంతుడు నిందజెంది నిను గానలలోపల డించి రమ్మనెన్

ఈ పద్యమూ, యీ సన్నివేశమూ అందరికీ సుపరిచితమే. సీతమ్మను అడవిలో వదిలిపెట్టడానికి తీసుకువచ్చిన లక్ష్మణుడి కంట కన్నీరు చూసి సీతాదేవి ఆందోళన పడి ఏమిటని అడుగుతుంది. పూర్వం వనవాసం చేసినప్పుడు కాని, ఇంద్రజిత్తుతో ముఖాముఖీ యుద్ధం చేస్తున్నప్పుడు కాని, రావణాసురుని శక్తి నీ ఱొమ్ములో గుచ్చుకున్నప్పుడు కాని, రాని కన్నీరు ఇప్పుడు వచ్చిందేమిటని అడుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు పలికిన మాటలివి. ఇంత చెయ్యడానికి సిద్ధపడి వచ్చి, యిప్పుడు చెప్పకుండా పోతానా తల్లీ, విను! అంటూ జరిగినది చెప్పే పద్యం. పద్యం ఎత్తుగడలోనే లక్ష్మణుడి దైన్యమంతా స్ఫురిస్తోంది. పద్యాన్ని రసవంతంగా నిర్మించడమంటే యిదీ. కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని పద్యమిది. సీతాదేవిని అడవిలో వదిలిపెట్టిపోయే సన్నివేశమంతా పరమ కరుణాత్మకంగా చిత్రించాడు పాపరాజు.

ఇంతకీ ఈ రోజు ఉత్తరరామాయణం ప్రసక్తి ఎందుకు తెచ్చానో యీపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును నేనుకూడా నిన్న శ్రీరామరాజ్యం సినిమా చూసేసాను, కుటుంబసపరివారసమేతంగా. నిక్కచ్చిగా నిర్మొహమాటంగా చెప్పాలంటే, సినిమా ఏదో ఫరవాలేదనిపించింది. జనాకర్షణ కోసం తీరి కూర్చొని సినిమాని చెడగొట్టలేదన్న తృప్తి ఒక్కటే మిగిలింది. బహుశా మొగుడులాంటి సినిమాలు రెండు మూడు చూసిన మీదట యీ సినిమా చూసుంటే యిది అద్భుతం అనిపించేదేమో! :) కాస్త బాగున్నవంటూ అనిపించినవి స్క్రీన్ ప్లే, కొన్నిచోట్ల సంభాషణలు. అంతే. మొదటి సీనులోనే ఒక చిన్న ఝలక్ - భరతుడు రాముని రంగులో లేడేమిటి అని. వాల్మీకి రామాయణంలో యిద్దరూ నీలమేఘశ్యాములే కదా! పౌరాణిక సినిమాల సంభాషణలు మామూలు వాడుక భాషకి ఎంత దగ్గరగా ఉన్నా, అవి సాంఘిక సినిమాలో సంభాషణల కన్నా చాలా తేడాగా ఉంటాయి. వాటిని పలకే ప్రత్యేక విధానమొకటి (దీన్నే "డిక్షన్" అంటారనుకుంటా ఇంగ్లీషులో) మన పాత సినిమావాళ్ళు ఏర్పరచారు. అది బాగా పట్టుబడితే కాని సినిమా రక్తికట్టదు. ఈ సినిమాలో అది పూర్తిగా లోపించింది. పాత పౌరాణికాలు చూడని యీ తరం వాళ్ళకి నచ్చి ఉంటుందేమో నాకు తెలియదు. నచ్చితే మంచిదే! లేదంటే తెలుగువాళ్ళకి ప్రత్యేకమైన మరొక సాంస్కృతిక అంశం కాలగర్భంలో కలిసిపోయినట్టే. పౌరాణిక సినిమాలో పద్యాలు లేకపోవడమూ లోటే! అయితే ఈ సినిమాలో పద్యాలు లేవన్న బాధకన్నా, పద్యాలు పెట్టలేని స్థితి ఏర్పడిందే అని ఎక్కువ బాధగా ఉంది. ఒక్క తరంలో యింత తేడానా! ఈ కాలంలో పద్యాలు ఎవరికి అర్థమవుతాయి అని చాలామంది అంటున్నారు. కాని నా ఉద్దేశంలో సమస్య అర్థమవ్వడము కాకపోవడమూ కాదు. ఇంతకు ముందు మాత్రం సినిమాలో పద్యాలందరికీ అర్థమైపోయి ఆదరించారా? పద్యాలపైన యిష్టం అభిరుచి పోయింది. ఒక రకమైన విముఖత కూడా ఏర్పడింది. అదీ సమస్య! ఇది కాలానుగుణంగా వచ్చిన మార్పని కొందరు కొట్టిపారేస్తారు. కాలం మార్పుకి సూచకమే కాని మార్పుని తెచ్చేది కాదన్న విషయం ఎంతమంది ఆలోచిస్తున్నారు? మార్పు రెండు రకాలు. ఒకటి మనిషి ప్రమేయం లేనిది (
ప్రకృతి సహజం). రెండు మనిషి ప్రమేయమున్నది. కాలంతో జరిగే మార్పులన్నీ ప్రకృతి సహజంగా వచ్చేవి కావు. వచ్చే ప్రతి మార్పు మంచికే అన్న దురభిప్రాయమూ ఉంది. అదికూడా తప్పే. మన సంస్కృతిలో వస్తున్న యీ మార్పులు సహజమైనవా, వీటి ఫలితాలేమిటి అన్న ప్రశ్నలు వేసుకొని సమాధానం వెతుక్కోవలసిన అవసరం మనకి లేదా?

ఎక్కణ్ణుంచో ఎక్కడికో వెళ్ళిపోయాను! మనిషి కోతినుండి పుట్టేడనడానికి యీ శాఖాచంక్రమణం ఒక బహుచక్కని తార్కాణం. :-) మళ్ళీ పాపరాజు దగ్గరకి వచ్చేద్దాం.

లక్ష్మణుడు చెప్పిన వార్త విన్న సీత పరిస్థితిని యిలా వర్ణించాడా కవి:

ఊరక వెక్కివెక్కి యేడ్చుచు, నేడుపు విడిచి మౌనంబు పూనుచు, మౌనంబు మాని తనలో దా నగుచు, నగవుడిగి తల యూచుచు, దల యూచుట విడిచి ముక్కుపై వ్రేలు గీలుగొలుపుచు, జాలిగొని హాహాకారంబు సలుపుచు, దలపని తలపులివిగో! చూచితే? లక్ష్మణా! యని యతని దిక్కు చూడ్కులు నిగిడించి యిట్లనియె:

అడలకు మన్న! నీకు వసుధాధిపునానతి దాట వచ్చునే?
యిడుముల జెందుమంచు విధి యీ ధర నన్ను సృజించి యుండగా
గడవగ నెవ్వరోపుదురు? కానల కేగిననాడె యాపదల్
గడచితి నంచు నుంటి; నెఱుగన్ దుది నిట్లగు నంచు నా మదిన్

కళవళమంది తెల్పితివొ? కాక పరాకున దప్ప వింటివో?
కల నయినన్ రఘూద్వహుడు కానలలో నను ద్రోయ బంచునే?
తెలిసి గణింపు లక్ష్మణ! మతిభ్రమ యైనదొ? హా! సహింపు మి
ప్పలుకు; లెఱుంగ కంటి; వెత బాటిలె; నీకొక భ్రాంతి యున్నదే!


కవి చిత్రించిన యీ దృశ్యానికి వ్యాఖ్యానమక్కరలేదు. కనులముందర కదలాడి కనులలో నీరు చేరక మానదు. లక్ష్మణా నీకు మతికాని భ్రమించ లేదు కదా అని, మళ్ళీ అంతలోనే, నన్ను క్షమించు, బాధలో అలా అన్నాను కాని నీకు భ్రాంతి కలగడమేమిటని మరింత శోకమగ్న అయిన జానకీదేవి యిలా అంటుంది:

ఎన్నటికిన్ రఘూద్వహుని నేనును; నన్నిక రామచంద్రుడున్
గన్నుల జూడ గల్గదొకొ! కల్గక యుండిన బ్రాణ మేల పో
దన్న! రఘుప్రవీరు చెవులారగ నింతయు దెల్పు; నాదు మే
నున్నది; చెంత గంగమడు గున్నది; యైనటు లయ్యెడున్ దుదిన్


రామునికి "చెవులారాగ" తన స్థితిని చెప్పమంది సీత. ఆమె మనసులోని ఉద్వేగమంతా ఆ ఒక్కమాటలో వ్యక్తం చేసాడు పాపరాజు! రాముడు తనని వదిలేసాడన్న బాధకన్నా, తనకి ఒక్కమాటకూడా చెప్పకుండా పంపించేసాడన్న బాధే సీత మనసుని ముక్కలుచేసింది.

ఎఱగని మూఢులాడుకొను నెగ్గులకున్ భయమంది, యప్పుడే
కఱకుమనంబుతో విభుడు కాననసీమకు బంచెగాక; య
త్తెఱ గొకసారి నన్ బిలచి, తెల్పి, మనోవ్యథ దీర్చి, నిన్ను నే
మఱనని బంపడయ్యె; నభిమానము గూర్మియు నెందుబోయెనో!



దీనికి రాముని దగ్గర సమాధానం లేదు!

కవిత్వంలో గొప్ప దర్శకత్వ ప్రతిభకి మచ్చుతునక అనిపించే పద్యమొకటి యీ సన్నివేశంలో చిత్రించాడు కంకంటి పాపరాజు. సీతని వదలి లక్ష్మణుడు రథమ్మీద తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ఆ రథాన్ని సీతాదేవి చూస్తున్న దృశ్యమది:

రమణి మఱికొంత వడిదాక రథము జూచు
దరుణి మఱికొంతసేపు కేతనము జూచు
గాంత మఱిమీద రథపరాగంబు జూచు
బడతి మఱియంతటను వట్టిబయలు సూచు



కొంతసేపలా వెళిపోతున్న రథాన్ని చూసింది సీత. ఆ తర్వాత కొంతసేపు రథంపైన ఎగురుతున్న జెండాని మాత్రమే చూడగలిగింది. ఆపైన కొంతసేపు రథం వెళ్ళేదారిలో ఎగిరిన దుమ్ము మాత్రమే చూస్తూ నిలుచుంది. ఆ తర్వాత కొంతసేపటికి వట్టి బయలుని మాత్రం చూస్తూ ఉండిపోయింది! ఉత్తమమైన కవిత్వానికి యీ పద్యమొక గొప్ప ఉదాహరణ! ఉత్తరరామాయణంలో యీ ఒక్క సన్నివేశంతో తెలుగు సాహిత్యంలో స్థిరస్థానాన్ని సంపాదించిన కవి కంకంటి పాపరాజు.

కొసమెరుపు: శ్రీరామరాజ్యం సినిమాలో ఆంగికం ఆహార్యం అన్నీ సరిగ్గా కుదిరాయని నాకనిపించిన ఒకే ఒక పాత్ర ఏమిటో చెప్పుకోండి చూద్దాం! సరే, ఒక చిన్న క్లూ.

పూర్తిగా చదవండి...

Monday, November 7, 2011

శ్రీవికటకవిస్కీ

ఇవాళ తీరిగ్గా కూర్చొని అల్మారాలోంచి గుడ్డివేటుగా ఓ పుస్తకం తీస్తే "సిప్రాలి" చేతికొచ్చింది. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అయినట్టుగా, సిరిసిరిమువ్వ ప్రాసక్రీడలు లిమఋక్కులు కలిసి సిప్రాలి. ఎఱ్ఱటి అట్టమీద చెయ్యెత్తి ఏదో ఆవేశంగా చదువుతున్న శ్రీశ్రీ నలుపుతెలుపుల ఛాయాచిత్రం. చూస్తే నవ్వొచ్చింది. శ్రీశ్రీ ఒఠ్ఠి ఎఱ్ఱకవీ కాదూ, అతనిది నలుపుతెలుపుల వ్యక్తిత్వమూ కాదు. అతనిలో ఉన్న అనేక రంగులకీ అనేక ఛాయలకీ యీ సిప్రాలి పుస్తకమే నిదర్శనం. "What an irony!" అనిపించింది. శ్రీశ్రీలో బ్రహ్మాండమైన వికటత్వం ఉంది. దాని విశ్వరూపం ఇందులో కనిపిస్తుంది - భాషలోనూ భావంలోనూ కూడా. సరే ఎలాగూ తీసాను కదా అని ఓ నాలుగు సిరిసిరిమువ్వ లిక్కడ రువ్వుదామనిపించింది.

అందంగా, మధురస ని
ష్యందంగా, పఠితృహృదయ సంస్పందంగా
కందాలొక వంద రచిం
చిందుకు మనసయ్యె నాకు సిరిసిరిమువ్వా!

అంటూ మొదలుపెడతాడు తన శతకాన్ని. అందులో నిజంగా వంద కందాలున్నాయో లేదో నేను లెక్కపెట్టలేదు. అది అనవసరం. అందం మాట ఎలా ఉన్నా "మధురస" నిష్యందంగానే సాగుతుంది శతకం. :-)

ఎప్పుడో, భావకవిత్వ ప్రభావంనుంచి యింకా బయటపడని రోజుల్లో రాసాడు పద్యాలు!

మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!

దటీజ్ శ్రీశ్రీ!

సరే యిలా పద్యాలు రాయడం మొదలుపెట్టేసరికల్లా, హరిహరనాథుడు తిక్కనగారికి సాక్షాత్కారమైనట్లు చక్రపాణిగారు శ్రీశ్రీ కలలో కనిపించి యిలా అన్నారట:

నీకొక సిగరెట్టిస్తా
నాకొక శతకమ్ము రాసి నయముగ నిమ్మా,
త్రైకాల్య స్థాయిగ నీ
శ్రీ కావ్యము వరలునోయి సిరిసిరిభాయీ!

సిగరెట్టుకో శతకం - భలే మంచి చౌకబేరమూ!

దుష్కర ముష్కర ప్రాసలతో పద్యం రాయడం శ్రీశ్రీకి విస్కీ తాగినంత సులువు. నమ్మకం లేకపోతే యీ పద్యం చూడండి:

వాగ్న్యూనత లేల, మహో
గ్రాగ్న్యుర్వీధరము నీవె, అమృత హిమానీ
రుగ్న్యగ్రోధము నీవె, అ
సృగ్నృత్య గురుండ నీవె సిరిసిరిసుకవీ!

ఇందులో అర్థంపర్థం లేదనుకోకండి, ఉంది. భాషాపండితుల పండ్లదిటవుకిది ఒక ఎక్సర్సైజుగా వదిలేస్తున్నాను.

కావ్యం రచిస్తూ ముందుగా ఇష్టదేవతా ప్రార్థన చెయ్యాలి కదా. దానికోసం తెనాలి రాముని (రామలింగడా, రామకృష్ణుడా అన్న పేచీ రాకుండా "తెనాలి రాముని" అనడం శ్రీశ్రీ కవితాలౌక్యం), గాడిద ఏడుపుని పొగిడిన కవి చౌడప్పనీ, టిట్టిభ సెట్టినీ (ఇతనెవరో చెప్పినవారికి ఒక సెహభాష్ బహుమతి!), కూచిమంచి జగ్గకవినీ, పనిలో పనిగా గిరీశాన్నీ, జంఘాలశాస్త్రినీ, బారిస్టర్ పార్వతీశాన్నీ స్తుతిస్తాడు. వేమన కృష్ణశాస్త్రులని ఒకే పద్యంలోనూ, "చుళుకీకృత కాఫీ టీ జలనిధి"నీ (అబ్బా ఆశ, ఇదెవరో నే చెప్పనుగా! చెప్పాలంటే మరో పద్యం ముచ్చటించాలి. అది మరోసారి :-)) కూడా అదే అదాటున పొగిడేస్తాడు. మచ్చుకి జంఘాలశాస్త్రి పద్యం:

జంఘాలశాస్త్రి, మానవ
సంఘాల వ్రణాల పాలి శస్త్రిన్, స్తుత్యు
ల్లంఘన వాగ్రచనల మే
స్త్రిం ఘన భక్తిన్ స్మరింతు సిరిసిరిమువ్వా!

ఆ తర్వాత అతను చెప్పే శ్రీరంగ నీతులు, భర్తృహరి పద్ధతిలో వైరాగ్య మూర్ఖ పద్ధతులూ, సర్రియలిస్టుల భావ భంగిమలూ, ప్రబంధశైలిలోని కుకవినిందలూ, ఉపాలంభనాలూ, సరదా జరదా చాటువులూ ఎన్నెన్నో. అన్నీ తళుక్కున కవ్వించేవే. చురుక్కున నవ్వించేవే. మచ్చుకి కొన్ని.

మీసాలకి రంగేదో
వేసేస్తే యౌవనం లభించదు నిజమే!
సీసా లేబిల్ మార్చే
స్తే సారా బ్రాంది యగునె? సిరిసిరిమువ్వా!

ఉగ్గేల త్రాగుబోతుకు?
ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో?
విగ్గేల కృష్ణశాస్త్రికి?
సిగ్గేలా భావకవికి? సిరిసిరిమువ్వా!

నాకూ ఈ లోకానికి
తూకం సరికుదరలేదు తొలినుంచీ, అ
బ్బే! కప్పల తక్కెడ వలె
చీకట్లో చిందులాట సిరిసిరిమువ్వా!

తలకాయలు తమతమ జే
బులలోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజులు వస్తే
సెలవింక డెమోక్రెసీకి సిరిసిరిమువ్వా!

పెదబాలశిక్ష చదివీ
చదవడమే తడవుగాగ సాహిత్య విశా
రదులయినట్లుగ భావిం
చెదరు గదా కొంతమంది సిరిసిరిమువ్వా!

విసుమానముగ ఖరక్షీ
రసాగర గరంగరం తరంగాంతర దీ
ర్ఘ సుషుప్తిలోంచి మేల్కాం
చి సలాం కావించెనొకడు సిరిసిరిమువ్వా!
(ఇది అధివాస్తవిక భంగిమలు తెలిపే పద్యాలలో ఒక పద్యం. ఖరక్షీరసాగరాన్ని ఊహించడం శ్రీశ్రీకే చెల్లింది!)

ఓ! అంతా కవులే, అ
ఆ ఇ ఈలైనరాని యంబ్రహ్మలె, మే
మా ఋషులం అని, ఛీ
ఛీ, ఎంతటి నవ్వుబాటు సిరిసిరిమువ్వా!

కోట్లకొలది ప్రజలను చీ
కట్లోపల వదిలి నేటి కాంగ్రెస్ రాజ్యం
కాట్లాటల పోట్లాటల
చీట్లాటగ మారిపోయె సిరిసిరిమువ్వా!

అసలు సమస్యలు గ్రాసం,
వసనం, వాసం! అలాంటి వాటిని చూపే
పస లేక గింజుకొని చ
చ్చి సున్నమవుతోంది ప్రభుత! సిరిసిరిమువ్వా!

(పై రెండు పద్యాలూ శ్రీశ్రీ పేరు చెప్పుకొని నేనిప్పుడు రాసినవి కావు. అచ్చంగా శ్రీశ్రీనే స్వతంత్రం రాబోయే ముందురోజుల్లో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నప్పుడు రాసిన పద్యాలు!)

జగణంతో జగడం కో
రగా దగదు కాని దాని ఠస్సాగొయ్యా!
నగలాగ వెలుగును గదా
చిగిర్చితే నాలుగింట సిరిసిరిమువ్వా!

(శ్రీశ్రీకి ఛందస్సుపైనున్న పట్టుకి యీ పద్యమొక మచ్చుతునక. రెండవ పాదంలోనున్న యతి ఏమిటో తెలుసా? అది శ్రీశ్రీ కనిపెట్టిన "కంటికింపయిన యతి"!)

భాషకొక స్థాయినిచ్చే
ప్రాసలు యతు లకంకృతులు వ్యాకృతు లయ్యో
పైసొగసుపూతకైతే
చేసేదేమున్నదింక! సిరిసిరిమువ్వా!

(ఛందోలంకారాల అసలు కీలకమీ పద్యంలో ఉంది!)

ఈ కావ్యం దట్టమగు పొ
గాకు పొగల నట్టనడుమ కాంచెను జన్మన్
లోకంలో సహృదయులే
చేకొందురు గాక దీని సిరిసిరిమువ్వా!

ఈ శతకం ఎవరైనా
చూసి, చదివి, వ్రాసి, పాడి, సొగసిన, సిగరెట్
వాసనలకు కొదవుండదు
శీశు కరుణ బలిమివలన సిరిసిరిమువ్వా!

అన్న ఫలశ్రుతితో, చాలా సంప్రదాయబద్ధంగా ముగుస్తుందీ శతకం! :-)

దీన్ని చదివిన గమ్మత్తులో, నాకూ ఓ పద్యం తన్నుకొచ్చింది:

విస్కీ ప్రాయము కాదా
ప్రాస్కేళిని సలుపుటన్న! పద్యములన్నన్
రేస్కోర్సులోని గుఱ్ఱాల్
శ్రీస్కీతో పెట్టుకోకు సిరిసిరిమువ్వా!

పూర్తిగా చదవండి...

Tuesday, October 25, 2011

దీపావళి చందమామ

టపా శీర్షిక చూసి, అమావాస్య చంద్రుడిలా దీపావళి చందమామ యేమిటని కంగారు పడకండి :-) దీపావళి నాడు ఆకాశంలో చందమామ కనిపించడు కనుకనే యీ బ్లాగాకాశంలోనైనా అతణ్ణి ఉదయించేట్టు చేద్దామని చిన్న కోరిక. నరకుడిని కృష్ణుడు చంపాడనో, రావణుణ్ణి రాముడు చంపాడనో దీపావళి చేసుకుంటారన్నది పైపై మాటలేననీ, అసలు రహస్యం మరొకటి ఉందనీ నా అనుమానం. ఏమిటంటారా? చెపుతాను, సావధానంగా వినండి.

దీపావళి ఎప్పుడు వస్తుంది? అమావాస్యనాడు. అది శరత్కాలంలో వచ్చే ఒకే ఒక అమావాస్య. శరత్కాలమంటే వెన్నెలరాత్రులకి ప్రసిద్ధి. ఇప్పుడంటే నగరాల్లో ఆకాశం ఆకాశహర్మ్యాల ఆక్రమణ మధ్య బితుకుబితుకుమంటూ చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే మనకి కనిపిస్తుంది. చంద్రుడు అసలే తప్పిపోతాడు. విద్యుద్దీపాల కాంతిలో వెన్నెల వెలవెల బోతుంది. ఋతువులకీ కేలండరు పేజీలకీ మధ్య, ఈ కాలపు నగరవాసులకి పెద్దగా తేడా తెలియదు. పల్లెప్రజలకింకా వాటితో అనుబంధం ఉందనుకుంటాను. శరత్కాలంలో పిండారబోసినట్లు వెన్నెల కాయడమంటే ఏమిటో వాళ్ళకి బహుశా తెలుస్తుంది. నా అదృష్టం కొద్దీ చదువుకొనే రోజుల్లో హాస్టల్లో ఉండేటప్పుడు, ఈ వెన్నెల అందాన్ని జుఱ్ఱుకొనే అవకాశం నాకు దొరికింది. కార్తీకమాసంలో, అప్పుడప్పుడే మొదలవుతున్న చిరుచలిలో, హాస్టల్ టెర్రెస్ మీద పచార్లు చేస్తూ, శరదిందుచంద్రికా వరసుధాధారలని చకోరమై ఆస్వాదించడం అందమైన అనుభవం. ఒక తీపి జ్ఞాపకం.

సరే, ప్రస్తుతానికి వస్తే, అలాంటి శరత్కాలంలో వచ్చే ఒకే ఒక అమావాస్య రాత్రి, చీకటితో నిండిపోతే సహించడమెలా? అదుగో అందుకే, ఆ రాత్రి దివ్వెలతో లోకమంతా వెలుగులు నింపెయ్యాలని, దీపావళి పండగని చేసుకోవడం మొదలుపెట్టి ఉంటామని నా ఊహ. అందుకే నా బ్లాగుని కూడా యివాళ జాబిలి జిలిబిలి వెలుగులతో నింపాలని అనుకుంటున్నాను. దీనికి మరొక ప్రేరణ రెండు రోజుల కిందట నాగమురళిగారి బ్లాగులో పెట్టిన "ఆకాశంలో ఆంబోతు" టపా.

ఇంతకీ మనకిప్పుడు కనిపించే యీ చందమామ ఎక్కడివాడు? ఎలా ఉన్నాడు? పద్యాలు చదవడం మొదలుపెట్టండి, మీకే బోధపడుతుంది.

ఆ యెచటొ యున్న యైరమ్మదీయ సరసి
లోని వెన్నెల జలము లీ లోకమందు
బాఱుదల కేర్పరచు వెలిపైడి తూము
చెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

కలువపూల చెలిమికాడు చందురుడు నడిమింట వెలుగుతున్నాడు. అతడెలా ఉన్నాడంటే - ఆకాశంలో ఎక్కడో మనకి కనిపించని చోట మెఱుపుతీగల కాంతులీనే సరసు ఉందిట. ఆ సరసంతా వెన్నెలనీరు నిండి ఉంటుంది. ఆ నీటిని మన భూమ్మీదకి పారించడానికి ఒక తూముని ఎవరో ఏర్పాటు చేసారట. అది వెలిపైడి తూము. తెల్లని బంగారంతో - అంటే వెండితో చేసిన తూము. ఆ తూమే యీ చందమామట!

శ్రీ వివస్వత్ప్రభా సమాశ్లిష్టమూర్తి
పార్వతీప్రాణనాథు శోభాశరీర
మమృతకళకును సముపోఢమైన వెలుగు
చెలగె నడిమింట గలువల చెలిమికాడు

నిత్యమూ ఐశ్వర్యప్రకాశంతో (విభూతితో) వెలిగే శోభాశరీరము కలవాడు పార్వతీప్రాణనాథుడయిన శివుడు. ఆ శరీరానికి అతి దగ్గరలో ఉన్నందువలన చంద్రునికి కూడా ఆ అమృత కళ లభించింది. అలాంటి కళతో వెలిగిపోతున్నాడీ కలువల చెలిమికాడు. ఇతడు కార్తీకమాసపు చంద్రుడు కాబోలు. అందుకే శివుని విభూతి వెన్నెలగా కురుస్తోంది!

బహుళ రాజనీతిపరముండు రాముండు
తాను హనుమబంపి వాని చర్య
యెట్టులెట్టులుండు నీక్షించు నన్నట్లు
చెలగె మింట గలువచెలిమికాడు

ఈ పద్యం అర్థమయితే సందర్భమేమిటో యిట్టే తెలిసిపోతుంది! గొప్ప రాజనీతిజ్ఞుడట రామచంద్రుడు. హనుమంతుడిని సీతాన్వేషణకి పంపి, అతడెలా తన కార్యాన్ని నిర్వహిస్తున్నాడో స్వయంగా చూద్దామని వచ్చాడా అన్నట్టుగా ఉన్నాడట ఆకాశంలోని యీ చంద్రుడు!

అదీ సందర్భం! హనుమంతుడు లంకలో సీతమ్మవారిని వెతుకుతూ ఉంటే పైనున్న చంద్రుడెలా ఉన్నాడో వర్ణించే పద్యాలివి.

మున్ను జూడనట్టి భూజాత గుర్తింప
బోవడేమొ కపివిభుండటంచు
దల్లిమోముపోల్కి దా జూపుచున్నట్లు
చెలగె మింట గలువచెలిమికాడు

తాను సీతమ్మవారిని ఎప్పుడూ చూసింది లేదే! మరి ఆమెని పోల్చుకోవడం ఎలా? హనుమంతుడలా అవస్థపడుతూ ఉంటే, అతనికి సహాయం చెయ్యడానికి ఆ అమ్మ పోలికని తాను చూపిస్తున్నాడా అన్నట్టుగా వెలుగుతున్నాడట చందమామ. ఎంతటి అద్భుతమైన ఊహ!

చిన్ననాటినుండి చందమామ చందమామ అని మన పెద్దవాళ్ళు చెపితే మనమూ అలాగే పిలిచేస్తూ వచ్చాము కాని, అసలు చంద్రుడు మనకి మామ ఎలా అయినాడో మనమెప్పుడయినా ఆలోచించామా? జగాలని పాలించే తండ్రి నారాయణుడు. చల్లని తల్లి లక్ష్మీదేవి. చంద్రుడు మరి లక్ష్మీదేవి తమ్ముడే కదా. ఇద్దరూ పాలసముద్రం నుండే పుట్టారు కాబట్టి వారు తోబుట్టువులు. మరి అమ్మ తమ్ముడు మనకి మేనమామే కదా అవుతాడు. అదీ ఆ పిలుపు వెనక రహస్యం. ఆ సంబంధాన్ని ఇక్కడ అందంగా ఉపయోగించాడు కవి. సీత సాక్షాత్తు లక్ష్మీదేవి. అక్కా తమ్ముళ్ళ మధ్యన పోలికలుంటాయి కదా. ఆ పోలికలు చూపించడానికని వచ్చినట్టున్నాడట చంద్రుడు. ఏమిటా పోలిక? చివరి దాకా చదవండి తెలుస్తుంది.

ఆంజనేయుడు మందరమై వియన్మ
హాంబునిధి వేఱ త్రచ్చిన నమృతకుంభ
మిదియు నూతన ముదయించెనేమొ యనగ
జెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

ఇది మరొక అద్భుతమైన ఊహ. ఆకాశమనే పాలసముద్రాన్ని ఆంజనేయుడే మందరపర్వతమై చిలకగా, అందులోనుండి మళ్ళీ కొత్తగా ఉద్భవించిన అమృతకుంభమా అన్నట్టుగా ఉన్నాడట చంద్రుడు!

చల్ల చేసి రాత్రి చల్లపై జేసిన
వెన్నముద్దగాగ విడిచె ననగ
చిన్ని వెన్న నల్ల చిద్రుపలు చుక్కలై
చెలగె మింట గలువచెలిమికాడు

రాతిరనే భామ వెన్నెల మజ్జిగని చిలికింది. మజ్జిగ చిలికితే పైన వెన్న ముద్దగా తేలుతుంది కదా. ఆ తేలిన వెన్నముద్దని అలాగే ఉంచేసిందిట. చిలికేటప్పుడా వెన్ననుండి కొన్ని తుంపరలు చెల్లాచెదరై చూట్టూ పడ్డాయి. ఆకాశం మధ్యలో వెలిగే చందమామ ఆ వెన్నముదట. చుట్టూ పరచుకుని ఉన్న చుక్కలే ఆ వెన్న తుంపరలట!
పైన అమృతమధనం పౌరాణికమైన కల్పనయితే, యిది పల్లెదనం నిండిన పోలిక. రెండిటిలోనూ ఉన్నది చిలకడమే! ఈ కవి ఊహ ఎంతగా ఆకాశాన్ని తాకుతుందో, దాని మూలాలు అంతగా నేలలోకి చొచ్చుకొని ఉంటాయి!

లంకలోన గలదు లావణ్యనిధి సీత
ప్రతిఫలించె నామె వదనసీమ
యాకసంపు సరసియం దన్నయట్లుగా
జెలగె మింట గలువచెలిమికాడు

కింద లంకలోనున్న సౌందర్యనిధి సీత మోము, పైన ఆకాశమనే సరస్సులో ప్రతిఫలిస్తోందా అన్నట్టుందట ఆ జాబిల్లి. అమ్మవారికీ చందమామకీ ఉన్న పోలిక యిదీ!

ఇవీ యీ చందమామ విశేషాలు. ఈపాటికే యీ కవి ఎవరో మీరు ఊహించే ఉంటారు. అవును విశ్వనాథ సత్యనారాయణగారే. రామాయణ కల్పవృక్షంలో సుందరకాండలో పూర్వరాత్రమనే ఖండములోని పద్యాలివు. ఈ సందర్భంలో చంద్రవర్ణన యిరవై పద్యాలలో సాగుతుంది. నాకు బాగా నచ్చిన కొన్ని పద్యాలిక్కడ పంచుకున్నాను. ఇదే సందర్భంలో వాల్మీకి కూడా చంద్రవర్ణన చేసారు. నాగమురళిగారి టపాలో వాటిని చదువుకోవచ్చు. రెండిటినీ పోల్చినప్పుడు నాకు తోచినది ఏమిటంటే - వాల్మీకి వర్ణనల్లో ఒక ముగ్ధ సౌందర్యం ఉంది. అమాయకమైన ఒక పల్లెదనముంది. అతను మౌని. అందులో కొన్ని కొన్ని విశేషాలు నిగూఢంగా స్ఫురిస్తాయి. విశ్వనాథ వర్ణన అలా కాదు. ప్రౌఢమైనది. ఒక నాగరీకుడయిన కవి చేసిన ఊహలుగా కనిపిస్తాయి. వాల్మీకి వర్ణన నేరుగా కథకి సంబంధం లేనిది. విశ్వనాథ వర్ణన కథకి అనుసంధానమైనది. వీటిలో వాచ్యత అధికం. అయినా మనోహరమైనవి, ఔచితీశోభితమైనవి. వాల్మీకి వాల్మీకే. విశ్వనాథ విశ్వనాథే. రామ రావణ యుద్ధమంటే రామ రావణ యుద్ధమే!

అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

పూర్తిగా చదవండి...

Monday, October 10, 2011

కాటుకకంటినీరు...

కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ
హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!

ఈ పద్యమే చాలాసేపటినుండి హృదయంలో మాటిమాటికీ కదలాడుతోంది. నేను పోతనంత మహానుభావణ్ణి కాను కనక, ఆ శారదా స్వరూపం నాకు సాక్షాత్కరించలేదు. కాని మనసులో ఆ మూర్తి మరీమరీ మెదులుతూనే ఉంది. నా కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు కర్ణాటకిరాట కీచకులు లేరు. అసలు రాచరికమే లేదు. ఆకలికోసం "బాలరసాలసాల నవపల్లవ కోమలమైన" కావ్యకన్యకని మనుజేశ్వరాధములకిచ్చే అవస్థ తప్పిపోయింది. అయినా ఆ తల్లి కాటుకకంటినుండి కన్నీరింకా ధారగా ప్రవహిస్తూనే ఉంది. ఎందుకమ్మా అలా ఏడుస్తావని మనసార ఓదార్చే, మనసావాచాకర్మణా నీకు కష్టం కలిగించనమ్మా అని భరోసా ఇచ్చే పోతనలాంటి బిడ్డలు ఆమెకిప్పుడు కఱవయ్యారు. ఈర్ష్య, అసూయ, స్వార్థం,ద్వేషాలతో తమలోతాము కాట్లాడుకుంటూ ఆమె బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేసే బిడ్డలు పుట్టుకొచ్చారు. ఛీ, ఇదేం జాతి!

గుండె మండిపోతోంది. తెలుగు వార్తాపత్రికల్లో సాహిత్యపుటలు చదవడం మానేసి ఏడాదిపైగా అవుతోంది, చదవలేక. ఇవాళ ఒక అంతర్జాలపు లంకె ద్వారా వెళ్ళి ఒక పత్రికలోని వ్యాసం చదివాను, దురదృష్టవశాత్తు. దాని ఫలితమే యీ ప్రేలాపన. రేపు శరత్‌పౌర్ణమి. ఏవో నాకు తెలిసిన నాలుగు శరదృతు వర్ణనలు టపా పెడదామనుకున్నాను. మొత్తం మూడంతా పాడైపోయింది!

నాకు పోతనంత ఆర్ద్రతా లేదు, సరస్వతిని ఓదార్చే శక్తీ లేదు, అంత ఆర్ద్రంగా పద్యము రాయనూ లేను. ఏదోలా నా మనోభావాన్ని వ్యక్తం చేయబూనితే వచ్చిన వెఱ్ఱికేక యిది:

కుక్కలరీతి నొండొరులు కొట్టుకుజచ్చుచు నీ సుశీలమున్
పీక్కు తినంగ గెంతులిడు బిడ్డలపై మమకారమేల? నీ
వాక్కును నాల్కలన్ జెఱపివైచి మమున్నొక మూగజాతిగా
గ్రక్కున మార్చివేయగదె గాదిలి చూపక తల్లి భారతీ!
పూర్తిగా చదవండి...

Monday, October 3, 2011

పోతన కవితామాధుర్య రహస్యం

మొన్న పోతన పద్యాల గురించి టపాయిస్తున్నప్పుడు, కరుణశ్రీగారి పద్యమొకటి గుర్తుకొచ్చింది:

అచ్చపు జుంటితేనియల, నైందవబింబ సుధారసాల, గో
ర్వెచ్చని పాలమీగడల, విచ్చిన కన్నెగులాబి మొగ్గలన్
మచ్చరికించు నీ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ
వెచ్చట నేర్చినావు సుకవీ! సుకుమారకళా కళానిధీ!

పోతన కవితామాధుర్యాన్ని కొన్ని వస్తువులతో పోలుస్తున్నారిక్కడ. స్వఛ్చమైన జుంటితేనె, చంద్రబింబంనుండి స్రవించే అమృతరసము, గోర్వెచ్చని పాలమీగడ, అప్పుడే విచ్చుకున్న గులాబి మొగ్గలు - వీటికి అసూయ కలిగించేలా ఉంటుందట పోతన కవిత్వం. ఏదో రకంగా తాను చవిచూసిన మాధుర్యాన్ని మాటల్లో చెప్పాలన్న తాపత్రయమే కాని, నిజానికి ఆ మాధుర్యం అనుభవైకవేద్యమే కాని ఉపమానాలకి అందుతుందా! అంతటి మధుర మంజుల మోహన ముగ్ధ శైలి ఎక్కడినుండి వచ్చిందో, అని ఆశ్చర్యపోతున్నారు కూడా. అలా ఆశ్చర్యపడి ఊరుకో లేదు:

ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ
ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు నీ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!

అని దానికొక అందమైన ఊహనికూడా జోడించారు. ఆ మాధుర్యం వెనక కారణం పంచదార అని కరుణశ్రీగారి ఊహ. అంటే అంత తియ్యగా ఉంటుంది అతని రచన అని! కరుణశ్రీ స్వయంగా ఒక కవి కాబట్టి కవితాత్మకమైన అలాంటి కల్పన చేసారు. ఒక వ్యక్తిలో కనిపించే అసాధారణ విశిష్టత గురించి ఏవో కల్పనలు చెయ్యడం మానవ సహజం కాబోలు. ముఖ్యంగా మన భారతీయులకి అది బాగా అలవాటనుకుంటాను. ఊహ, కల్పనే కావచ్చు. అయినా, ఏదో ఒక కారణం వెతకడం మనకొక సరదా.

ఈ మధ్య సౌందర్యలహరి చదువుతూ ఉంటే నాకూ అలాంటీ ఒక ఊహ కలిగింది. ఆ ఊహకి మూలమైన శ్లోకం:

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటామ్
వరత్రాస త్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరామ్
సకృన్నత్త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణా ఫణితయః

సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులవారు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించడం వల్ల కలిగే వివిధ శక్తుల గురించి వివరిస్తారు. ఈ శ్లోకంలో అమ్మవారి సరస్వతీ రూపాన్ని వర్ణిస్తున్నారు. శరత్కాలపు వెన్నెలంత స్వచ్ఛమైనది తెల్లనిది, చంద్రవంకతో కూడిన జటాజూటం కలిగినది, అభయ ముద్ర, వరద ముద్ర, అక్షమాల, పుస్తకము ధరించిన చేతులు కలిగినది, అయిన నీ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారికి తేనె పాలు ద్రాక్షరసముతో పోల్చదగిన తియ్యని కవిత్వ శైలి లభిస్తుంది అని అర్థం.
శరత్కాలానికీ శారదకీ ఉన్న అవినాభావసంబంధం ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది.

పోతన అలాంటి సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించడమే అతని కవిత్వమాధుర్యానికి కారణమని నా ఊహ. పోతన ఆ రూపాన్ని ఆరాధించాడనడానికి ఏమిటి సాక్ష్యం అంటే, అతని యీ రెండు పద్యాలు:

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

భారతీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడీ పద్యంలో. తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, సుధాసముద్రము, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి అతనికి. వాటన్నిటితో పోలిస్తే కాని తృప్తి కలగలేదతనికి!

ఇక రెండో పద్యం:

క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి, అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్

అక్షమాల, పుస్తకము (చిలక, పద్మము కూడా) కలిగిన వాణీ స్వరూపాన్ని మ్రొక్కే పద్యమిది.

ఈ రెండు పద్యాలబట్టి పోతన సౌందర్యలహరిలో ఆదిశంకరులు చెప్పిన స్వరూపాన్ని ఆరాధంచాడనీ, పోతన కవితామాధుర్యం వెనకనున్న రహస్యం అదేనని ఊహించడం అసమంజసం కాదు కదా!

ఏదేమయినా కవిత్వం, అందునా అలాంటి తియ్యని కవిత్వం సృజించగలగడం ఒక అద్భుత శక్తి. ఆ శక్తికి సంకేతం సరస్వతీ స్వరూపం. అలాంటి అనేక శక్తి రూపాలని ఆరాధించే పండుగ దసరా. పనిలో పనిగా మిగిలిన ఇద్దరు ప్రధానశక్తులు, లక్ష్మీ దుర్గల గూర్చి, పోతనగారే చేసిన స్తుతిని కూడా చదువుకొని ఆనందిద్దాం:

హరికిన్ బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంబు పెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణముల్

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

అందరికీ దసరా శుభాకాంక్షలు!
పూర్తిగా చదవండి...

Sunday, September 25, 2011

కత్తిలాంటి పద్యం!

మొన్న పుస్తకం.నెట్లో బుడుగోయ్ గారు మంచి కత్తిలాంటి పద్యాన్ని ప్రస్తావించారు.

చింతలతోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా
లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్
బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమం బయిపోవునేమొ సా
గింతును రుద్రవీణపయి నించుక వెచ్చని అగ్నిగీతముల్

చింతలతోపు. హోరున కురిసే వాన. వానలో తడిసి ముద్దవుతున్న బాలెంత. ఆమె ఒడిలో పసి మొగ్గలాంటి చిన్ని బిడ్డ. ఆ బిడ్డకి కప్పడానికి ఒక్క బొంతకూడా లేదు. ఇది కవికి కనిపించిన దృశ్యం. మనిషిగా అతని గుండె మండింది. కవిగా పద్యం పొంగింది. భౌతిక ప్రపంచంలో అలాంటి వేలమంది బాలెంతలకి పసిబిడ్డలకి ప్రతిరూపంగా కవి మనసులో కదలాడిన చిత్రమది. ఏం చెయ్యగలడు కవి? ఆ చలిలో ఆ పసిబిడ్డ శరీరం గడ్డకట్టుకు పోతుందేమో! ఎలా కాపాడడం? కవి దగ్గరున్న పరికరం ఒక్కటే, పద్యం! కవి చేతిలో ఏ రూపాన్నయినా ధరించగలదది. అగ్నిధార కురిపించ గలదు. అమృతాభిషేకం చెయ్యగలదు. రుద్రవీణ వినిపించగలదు. ఇక్కడ, రుద్రవీణని మీటి తన గుండెమంటనే అగ్నిగీతాలుగా చేసి పాడుతున్నాడు కవి. ఆ గీతాలు పసిబిడ్డకి కాస్తంత వెచ్చదనాన్ని యిస్తాయేమోనని!

దాశరథి "రుద్రవీణ" అనే కవితా సంపుటిలో "మూర్చన" అనే కవితలోని పద్యమిది. సానబెట్టిన కత్తులాంటి పదునైన పద్యాలని వ్రాసిన దాశరథివంటి తెలుగు కవి మరింకొకడు కనిపించడంటే అతిశయోక్తి గాదు. పదాలలో చుఱుకుదనం, నడకలో పరువులెత్తే ఉద్రేకం, భావంలో విప్లవం, వీటన్నిటినీ ఛందస్సులో సునాయాసంగా బిగించగల నైపుణ్యం, దాశరథి సొంతం. ఆ కాలంలో అందరి కవుల్లాగానే దాశరథికూడా భావకవిత్వం వ్రాసారు. అయితే భావకవుల్లో ఒకరిగా మిగిలిపోలేదు. అదే పద్యాన్ని ఆయుధంగా మార్చి నిజాం దౌర్జన్యాల మీద పోరాటం సాగించిన కవియోధుడు దాశరథి. పద్యం అనే కత్తికి రెండువైపులా పదునే అని నిరూపించిన, నాకు తెలిసినంత వరకూ, ఏకైక కవి దాశరథి. పద్యాన్ని అభ్యుదయ భావాల వాహికగా నిర్వహించిన కవులు లేకపోలేదు. కాని దాశరథి పద్యంలోని వాడి వేడి నాకింకెక్కడా కనిపించలేదు. దానికీ క్రింద పద్యం ఒకానొక సాక్ష్యం. ఇదికూడా రుద్రవీణలోనిదే:

ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగిల్చి కాల్చి, నా
లో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు; న
ఱ్ఱాకట గుందు పేదలకు బ్రహ్మ లిఖించిన కొంటెవ్రాతలో
వ్యాకరణమ్ములేదు, రసభంగిమ కానగరాదదేలనో!

దీని గురించి నేనేమీ మాట్లాడను.

దాశరథి రచించిన అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం అనే ఆరు ఖండకావ్యాలని ఒక సంపుటిగా కిందటేడే విశాలాంధ్రవాళ్ళు ప్రచురించారు. చాలా రోజుల తర్వాత ఆ ఖండకావ్యాలు మరల ప్రచురణభాగ్యం పొందాయి.
ఒకటికాదు రెండుకాదు, బోలెడన్ని కత్తులిమిడిన ఒరని చేతబట్టుకోవాలనుకుంటే, ఈ పుస్తకాన్ని దొరకపుచ్చుకోండి!

పూర్తిగా చదవండి...

Sunday, September 11, 2011

ముచ్చటయిన మూడు కృష్ణ వర్ణనలు

భాగవతంలో కృష్ణుని వర్ణనలకి కొదవేముంది! అందులోనూ పోతన తెలుగుపోత, మధురాతిమధురం. ఆ వర్ణనలు చేస్తున్నప్పుడా భక్తకవి ఆ మాధవునితో తాదాత్మ్యాన్ని పొందే ఉంటాడనిపిస్తుంది! అలాంటి భాగవతంలో నాకు బాగా నచ్చిన మూడు శ్రీకృష్ణ వర్ణనలని ఎంచమంటే, నేనెంచుకొనే మూడు పద్యాల గురించి ఇప్పుడు చెపుతాను.

ఒకటి:

కడుపున దిండుగా గట్టిన వలువలో
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాఱి రానీక డా చంక నిఱికి
మీగడపెరుగుతో మేళవించిన చల్ది
ముద్ద డాపలి చేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు
వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగడీల నడుమ జక్కగ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె

ఈ పద్యాన్ని చదివితే అనిపిస్తుంది, పెద్దయ్యాక సంగతి చెప్పలేము కానీ చిన్ననాటి యీ బాలకృష్ణుడు మాత్రం పదహారణాల తెలుగబ్బాయే అని. ఇలాంటి అచ్చమైన తెలుగు కైతలని అచ్చులు పోసిన పోతనకి తెలుగుజాతి ఎప్పటికీ ఋణపడిపోయింది! చిన్నారి కిట్టయ్య తన చెలికాళ్ళతో కలిసి ఆడుతూపాడుతూ చల్ది తినే దృశ్యాన్ని మనకి కళ్ళకి కట్టిస్తున్నాడు పోతన. ఎంత చూడముచ్చటయిన దృశ్యమది! సర్వయాగాలకూ భోక్త అయిన ఆ పరమాత్ముడేనా ఇలా చిన్నమగవాని రూపంలో చల్ది కుడుస్తున్నదీ అని దేవతలందరూ ఆశ్చర్యపోయారట ఆ దృశ్యాన్ని చూసి.

ఆవుల్ని తోలుకొని ఊరుబయట వనంలోకి గోపాలకులందరూ వచ్చారు. భోజనం వేళ అయ్యేసరికి తెచ్చుకున్న చల్ది తినాలని అందరూ కూర్చున్నారు. కృష్ణుడి చేతిలో ఎప్పుడూ మురళి ఉంటుంది కదా! మరి అన్నం తినేదెలా? ఆ వంశనాళాన్ని (అంటే వెదురు గొట్టం!) తన నడుము చుట్టూ చుట్టగా కట్టుకున్న తుండుగుడ్డలో జొనిపాడు. అంతేనా - ఆవులని అదిలించేందుకు చిన్న బెత్తము (వేత్రదండం), కొమ్ముబూరా కూడా ఉన్నాయి చేతిలో. వాటినేమో జాఱిపోకుండా ఎడం చంకలో ఇఱికించాడు. అదే చేతిలో చలిది ముద్దని అదిమి పట్టుకున్నాడు. మాములు చల్దన్నమా అది! చక్కని చిక్కని మీగడపెరుగుతో కలిపినది. మరి ఆ పెరుగన్నంలో నంచుకోడానికి ఏమిటున్నాయి? చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలున్నాయి. అంటే ఇంకాస్త కావాలి, ఇంకాస్త కావాలని బతిమాలో పేచీపెట్టో తెచ్చుకున్న ఊరగాయ అన్నమాట! అది వ్రేళ్ళ సందుల్లో ఇఱికించాడు. హాయిగా స్నేహితుల మధ్య (సంగిడీలు - స్నేహితులకి చక్కని తెలుగుపదం) కూర్చుని, ఊసులాడుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా చల్ది ఆరగిస్తున్నాడు చిన్ని కన్నయ్య. చేతిలో ఉన్న వేణువునీ బెత్తాన్నీ కొమ్ముబూరనీ పక్కన పెట్టవచ్చు కదా! అలా తన దగ్గరే అట్టేపెట్టుకోడంలో బాలకృష్ణుని పసితనం మన కళ్ళకిగడుతుంది. అదీ పోతన వర్ణనలోని అందం! మీగడపెరుగుతో మేళవించిన చల్ది, ఊరగాయలూ తెలుగుదనపు ఘుమఘుమలు. వాటిని మీగడతరకల్లాంటి తెలుగుపదాలతో మేళవించి తెలుగు చిన్నారి కిట్టమూర్తిని మన కళ్ళముందుంచాడు పోతన.

ఈ పద్యం వెనక తమాషా అయిన కథ ఒకటి ఉంది. కృష్ణుడు గోపాలబాలలతో అడవికి వచ్చినప్పుడు అఘాసురుడనే రాక్షసుడు పెద్ద పాము రూపంలో వచ్చి నోరు తెరచి పడుకుంటాడు. తోవలో అడ్డంగా ఉన్నది పామేమో అని అనుమానించినా, మన వెనక కృష్ణుడుండగా మనకి భయమేమిటని పిల్లలంతా ఆ పామునోట్లోకి వెళ్ళిపోతారు. అయితే ఆ పాము నోట్లోని విషజ్వాలలకి అందరూ చనిపోతారు. తనమీద అంతటి గుడ్డి నమ్మకాన్ని పెట్టుకున్న ఆ గోపాలుర మీద జాలిపడి కృష్ణుడు ఆ పాము గొంతు చీల్చి చంపి, పిల్లలని తిరిగి బతికిస్తాడు. ఇదంతా చూసిన బ్రహ్మ ఆశ్చర్యపోతాడు. అంతటి బ్రహ్మనీ మాయ ఆవరిస్తుంది. అతను కృష్ణుడిని మామూలు బాలుడే అనుకొని, ఈ బాలుడికి ప్రాణాలిచ్చే శక్తి ఎక్కడిదని ఆశ్చర్యపోతాడు. కృష్ణుడిని మరింత పరీక్షించాలని చెప్పి, ఇలా హాయిగా కూర్చుని చల్దులు తింటున్న సమయంలో ఆవులన్నిటినీ మాయం చేసేస్తాడు. ఆవులని వెతుక్కుంటూ కృష్ణుడు వెళ్ళి, కనపడక తిరిగివచ్చి చూస్తే గోపబాలురందరూ కనిపించకుండా పోతారు. బ్రహ్మ అందరినీ ఒక గుహలో దాచేస్తాడు. సంగతి తెలుసుకున్న కృష్ణుడు తనే ఆ సమస్త గోవులూ గోపబాలుర రూపాలని ధరించి అందరి ఇళ్ళకీ వెళ్ళిపోతాడు. ఇలా ఏడాది గడిచిపోతుంది. బ్రహ్మ కాలమానంలో అది ఒక క్షణం. బ్రహ్మకి మతిపోతుంది! ఏమిటీ మాయ? సృష్టి చేసే బ్రహ్మ నేనొక్కడినే కదా! మరి అన్ని గోవలనీ, అంతమంది పిల్లలనీ ఎవరు సృష్టించారు? ఇలా తికమక పడుతూ ఉంటే కృష్ణుని విశ్వరూప సందర్శనం అవుతుంది. మాయ తొలగిపోతుంది. ఈ బ్రహ్మ పదవి వదిలేసి, హాయిగా తనూ ఓ గోపాలబాలుడై కృష్ణుడితో కలిసి అలా చల్ది కుడిస్తే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటాడు.
అదీ కథ!

ఇక రెండో పద్యం:

కటి చేలంబు బిగించి, పింఛమున జక్కం గొప్పు బంధించి, దో
స్తట సంస్ఫాలన మాచరించి, చరణద్వంద్వంబు గీలించి, త
త్కుటశాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్

ఇది చాలా మందికి తెలిసిన పద్యమే. కృష్ణుడు కాళీయమర్దనానికి సంరంభంతో ఉరుకుతున్న సందర్భం. పైన చెప్పిన పద్యం ఒక స్థిరచిత్రం (still photograph) అయితే, ఇది చలనచిత్రం! అందులో కృష్ణుని పసితనం కనిపిస్తే ఇందులో గోపకిశోరుని పొంగు మన కళ్ళముందు కదలాడుతుంది.

ఉత్తరీయాన్ని నడుముకి బిగించాడు. జాఱకుండా పింఛాన్ని చక్కగా కొప్పున బంధించాడు. జబ్బలు రెండూ చఱిచాడు. రెండు కాళ్ళనీ దగ్గరగా తెచ్చాడు. తెచ్చి, ఆ చెట్టుకొమ్మపైనుండి గభాలున చెఱువులోకి దూకాడు. ఎవరు? సింహకిశోరం లాంటి గోపాలుడు. "లాంటి" ఏవిటి, అప్పుడతడు సింహకిశోరమే! అంతెత్తునుండి దూకేసరికి, గుభగుభమన్న శబ్దం నలుదిక్కులా నిండిపోయిందట!

పద్య నిర్మాణంలోని సొగసు బిగువు వల్ల కృష్ణుడిలో ఉఱకలు వేస్తున్న అదే ఉత్సాహం మనలోనూ కలగడం లేదూ! అదీ కవిత్వమంటే!

ముచ్చటగా మూడో పద్యం ఇదిగో:

త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప, ప్రాభాత నీ
రజ బంధు ప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్‌

ఈ పద్యం ఎందుకంత ఇష్టమంటే చెప్పడం కష్టం! మొదటి పద్యంలో లాగా ఒక రూపాన్ని విస్తృతంగా వర్ణించే పద్యం కాదిది. కదిలే చిత్రాన్ని అక్షరాలలో బంధించే పద్యమూ కాదు. ఈ పద్యంలో కనిపించే కృష్ణుడు అపురూప ధీర సౌందర్య విలసితుడు. ఇందులో ఏదో తెలియని అలౌకికత ఉంది. ఆధ్యాత్మికావేశముంది. అది త్రిజగ్నమోహనమైన నీలకాంతి. నీలమంటే నలుపు. నలుపుకి కాంతి ఎక్కడిది? అదే మాయ. ముజ్జగాలనీ మోహింప జేసే మాయ. నల్లని మేఘముపై పడిన ఉదయసూర్యుని అరుణారుణకిరణంలా పైన ఉత్తరీయం ప్రకాశిస్తోంది. ఆ మూర్తిలో ఒక ఉత్సాహముంది. ఆ ఉత్సాహమా ముఖారవిందముపై కదలాడే నీలి ముంగురులలో ద్యోతకమవుతోంది. మా విజయునికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహమది.
ఆహా! అలాంటి వన్నెలాడు మోహనకృష్ణుని ఆ రూపం మదిలో ఆవేశించిన భీష్ముడు ఎంతటి ధన్యుడు! దాన్ని చూసి మనకి చూపించిన పోతన మరెంత ధన్యుడు!

పూర్తిగా చదవండి...

Thursday, March 24, 2011

మరో పండుటాకు రాలిపోయింది!

ఆ మధ్యనే సంపత్కుమార, ఈ మధ్యనే వడలి మందేశ్వరరావుగారు. విశ్వనాథ సాహిత్యాం, ముఖ్యంగా రామాయణకల్పవృక్షం, లోతులను దర్శించి మనకి చూపించగల/చూపించిన దక్షులు - ఒకొక్కరే రాలిపోతున్నారు. కిందటి వారం అఫ్సర్ గారి బ్లాగు చూసేదాక మందేశ్వరరావుగారి అస్తమయం గురించి నాకు తెలియనే లేదు! బహుశా విరిగే వార్తల వెల్లువలో అదెక్కడో కొట్టుకుపోయి ఉంటుంది. ఇలాంటివారి గురించిన వార్తలు ఎంతమందికి ఆసక్తినిస్తాయి గనక!

నాకు మందేశ్వరరావుగారు పరిచయమయ్యింది వారి "ఇది కల్పవృక్షం" పుస్తకంతో. కల్పవృక్షం కన్నా ముందే నాకీ పుస్తకం పరిచయం. కల్పవృక్షాన్ని నాకు పరిచయం చేసిన పుస్తకమది. ఒక కవి గురించి బాగా తెలిసినప్పుడే అతను వ్రాసిన కవిత్వాన్ని సరిగాను లోతుగాను అర్థం చేసుకోడానికి వీలవుతుంది. కవి గురించి తెలియడమంటే అతని పుట్టుపూర్వోత్తరాలో, అతని వ్యక్తిగత అలవాట్లో కాదు. ఆ కవి సమస్త సాహిత్యంతోనూ పరిచయం. అందులో దాగిన మూలసూత్రం అంతుబట్టడం. ఈ విషయం నాకు బాగా తెలిసింది "ఇది కల్పవృక్షం" చదివాకనే.

ఈ పుస్తకంలో "మఱలనిదేల రామాయణంబన్న..." అనే ఉపోద్ఘాత వ్యాసంలో, ఆకాశమంత విశ్వనాథభారతిని అద్దంలో చూపించే ప్రయత్నం చాలా సమర్థవంతంగా చేసారు మందేశ్వరరావుగారు.

"వేషాలెన్ని మారినా మనిషిలోని నాడీ స్పందనలో చరకుని నాటినుండి నేటి దనుక సామ్యాన్ని పసిగట్టగలం. అలాగే నాగరికత మారినా, విలువలు మారుతున్నా, జాతియొక్క జీవనాడి ఎక్కడో అవిచ్ఛిన్నంగా స్పందిస్తూనే ఉంటుంది. అది కృతయుగాదినుండి నేటిదాకా ఒక్కలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ జాతికొక అవిచ్ఛిన్నమైన చరిత్ర ఉంటుంది. అదికాస్తా స్తంభించిపోతే, జారిపోతే ఆ జాతి నశించినట్లే. అది మరో జాతో, జీవరాశో అవుతుంది. ఇట్టి దర్శనం కల విశ్వనాథకు రామాయణం త్రేతాయుగం నాటి కథ అవదు."

అని, విశ్వనాథ దర్శనాన్ని స్పష్టంగా సంగ్రహంగా మన ముందుంచారు. విశ్వనాథ సాహితీమూర్తిమత్వాన్ని వివరించాక, "మరి ఇంతటి కవి ఒక కావ్యాన్ని వ్రాయాలని సంకల్పిస్తే - మిల్టన్ చెప్పినట్ట్లు - తర్వాతి తరాలవారు కోరి మరచిపోకుండా ఉండే మహాకావ్యాన్ని వ్రాయ సంకల్పిస్తే, దాని వస్తువు ఎట్టిదై ఉండాలి?" అని ప్రశిస్తారు. దానికి సమాధానం కోసం ఇలా ఆలోచిస్తారు:

[
అందులోని పాత్రలలో వైవిధ్యముండాలి. ఒక్క రాముడూ, ఒక్క రావణుడే కాదు - మనకు అంతుపట్టని ఒక కుంభకర్ణుడూ, ఒక శబరీ ఉండాలి. దగ్గర దగ్గరగా ఉంటూనే తేడా విస్పష్టంగా కనపడే సుమంత్రుడూ మాతలీ ఉండాలి. వీరికి దీటుగా అటు రావణుని సారథి ఒకడు ఉండాలి. శీలాన్ని తీర్చే తన దక్షతనంతనూ సవాలు చేసేటట్టు, ఏ కైక పాత్రకో గుండె మార్పిడి చేసి, ఆమెను సరికొత్త పాత్రగా దిద్దాలి. నగరంలో ఒక అరుంధతి, అడవిలో ఒక అనసూయా, కిష్కింధలో తార, లంకలో మండోదరీ మనకు కనబడాలి. లోక రక్షణకై వ్రతాన్ని పూనిన అగస్త్యుడూ, సీతారక్షణకై ప్రాణాలు వదలిన జటాయువూ ఉండాలి. మాత్సర్యానికి ప్రతీక అవాలొక పర్వతం. మరొక రాక్షసుడు దున్నపోతే కావాలి. ఇలా ఎందరు? ఎందరో పాత్రలు అవసరమవుతారు. వారందరికీ తలమానికంగా ఉండే మహా జ్ఞాని, మౌని, వాగ్మి, కార్యకరణ దక్షుడు, ఇత్యాది లక్షణాలుండే ఏ ఆంజనేయుడో ఉండాలి.
వీళ్ళందరినీ తనచుట్టూ పరిభ్రమింప చేసుకొనే ఒక నాయకుడు, రాముడు కావాలి. అట్టి రాముడు ఎవరి గవేషణము తన జీవితానికి పరమార్థమనుకున్నాడో, అట్టి లోకమాత, సీతాదేవి, కూడా ఒక పాత్ర అవాలి. అంటే అదొక లోకం అవ్వాలన్న మాట. అందులో మానవలోకం అంతా ప్రతిఫలించాలి.
]

ఇది విశ్వనాథ కల్పవృక్షంలో పాత్రలని ఎలా తీర్చిదిద్దారన్నదానికి పరిచయం. మానం పాత్రలని ఎలా పరిశీలించాలన్న దానికి సూచన. ఇలా పరిచయం చేస్తునే మరింత ముందుకి సాగి ఇలా వివరిస్తారు:

[
ఇక విశ్వనాథ ప్రధానంగా, వస్తుతః కవి. వస్తువు ఎట్టిదైనా, అది ఆయన కవిత్వానికి నికషోపలంగా ఉండాలి. అంతటి కవిత్వమున్న వస్తువేది? అంతటి రససృష్టి కాకరమైన కథ ఏది? అట్టి కవి ఏడి? అంటే ఆయనకు వాల్మీకి తప్ప మరెవ్వరూ సుకవి శబ్ద వాచ్యునిలా కనబడలేదు. సర్వకావ్య వాక్కు ఆ మౌని వదన సీమనుంచే పుట్టింది.

"అచ్చమైన యమృత మమరులు త్రావినా
రోయి! దానికే నసూయ పడను
పరమమౌనియైన వాల్మీకి కృత రామ
సత్కథా సుధారసంబు ద్రావి"

ఇన్ని లక్షణాలున్న మహాకావ్యాన్ని రచించడానికి సమకట్టే కవి, కేవలం కొత్త కథను కట్టడంతోనే కాలం సరిపోయే ఏ కళాపూర్ణోదయం వంటి కథనో శ్రమపడి నిర్మించ దలచుకోలేదు.

కావ్యంలో కావలసింది కవిత, రసభావాలు. వీనికి పుష్కలంగా అవకాశమిస్తూ, పాత్రలలోని వైవిధ్యాన్నీ, వర్ణనలలో రామణీయకతనూ, అలంకారంలో వైదగ్ధ్యాన్ని సాధిస్తూ, దుష్టశక్తుల ప్రాబల్యం వల్ల, పరాయిపాలన తీవ్రతవల్ల, నిర్జీవమైన సంస్కృతిని పునరుజ్జీవింప చేయడానికి, సంశయగ్రస్తుడైన ఆధునిక మానవుణ్ణి, మహోత్తుంగ శృంగంలా పెరిగిన మానవుణ్ణి చూపడానికి, ఒంటరిగా మిగిలిన కుంటి కాలుమీద నిలబడలేక కుప్పగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ధర్మాన్ని సంజీవితం చేయడానికి, వస్తువెట్టిదై ఉండాలన్న ప్రశ్న విశ్వనాథకు ఎదురైనప్పుడు -
ఆయనకు కనబడింది ఈ రామాయణం. అందుకే "మఱల నిదే రామాయణం"! అందుకే ఆయన ప్రతిజ్ఞ:
"ముని ఋణము దీర్ప నీ కావ్యమును రచింతు"నని. ఆ ప్రతిజ్ఞ నుంచి పుట్టిందే "కల్పవృక్షము".
]

రామాయణకల్పవృక్షానికి ఇంతకన్నా గొప్ప పరిచయం సాధ్యమా? కల్పవృక్షం ఒకో కాండనూ తీసుకొని, అందులో ఉన్న ఎత్తులను, లోతులనూ తల స్పర్శిగానే అయినా, ఎంతో సమర్థవంతంగా అద్భుతంగా వివరించారీ పుస్తకంలో. ముగింపు వ్యాసంలో వారి ముగింపు మాటలివి:

[
ఇన్ని మహార్థాలను వివరించడం చేతనే కల్పవృక్షం మహాకావ్యమైంది. ఇందులో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను ఇమిడ్చానని విశ్వనాథ అనేవాడు. వాట్లన్నింటినీ వెదుక్కోడానికి ఇంకో ప్రయత్నం చేయాలి. కావ్యాన్ని మరోసారి ఆ దృష్టితో అనుశీలన చేస్తేనే ఆ అర్థాలు ఆవిష్కృతమవుతాయి.
కల్పవృక్షంలో ఉన్న అర్థం ఒక పొరలో లేదు. అందులోని అర్థాలు పొరలు పొరలుగా ఉంటాయి. భావకుని భావయత్రీ శక్త్యవధికంగా, వ్యుత్పత్తిని అనుసరించి ఒక్కొక్క పొరలోని అర్థమూ ఆవిష్కృతమవుతుంది.
ఇన్ని ఇమిడి ఉండబట్టే ఇది కల్పవృక్షమైంది.
ఇందులో ఉన్నది సద్యోనిర్గతమైన సర్వకవితా సంభారము.
ఇది కల్పవృక్షం!
]

మందేశ్వరరావుగారు ఇంకో ప్రయత్నం చెయ్యలేదు. చేసారేమో, మనదాకా అందలేదు. ఇక వారు చేసే అవకాశం లేదు. మరెవరో చేస్తారన్న ఆశకూడా లేదు.

శిశిరంలో ఆకులు రాలిపోవడం సహజం. వసంతం వస్తే మళ్ళీ కొత్త చిగురులు వేస్తాయి. అలాంటి వసంతం ఎప్పుడో!

పూర్తిగా చదవండి...

Friday, March 11, 2011

దిగిరావా దాశరథీ!

దిగిరావా దాశరథీ!
నువ్వు కురిపించిన అగ్నిధార, నువ్వు వినిపించిన రుద్రవీణ, నువ్వు ఆశించిన మహాంధ్రోదయం పిచ్చెక్కిన మా మనస్సులకి, మొద్దుబారిన మా హృదయాలకి, చచ్చిపోయిన మా ఆత్మలకి మళ్ళీ అవసరం.

నేనురా తెలగాణ నిగళాల తెగద్రొబ్బి
ఆకాశమంత ఎత్తరచినాను
నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు
పాడి మానవుని కాపాడినాను
నేను పోతన కవీశాను గంటములోని
ఒడుపుల కొన్నింటి బడసినాను
నేను వేస్తంభాల నీడలో నొక తెన్గు
తోట నాటి సుమాల దూసినాను

కోటి తమ్ముల కడ రెండు కోట్ల తెలుగు
టన్నలను గూర్చి వృత్తాంత మంద జేసి,
మూడు కోటుల నొక్కటే ముడి బిగించి
పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి !

అని ఆ రోజెప్పుడో నువ్వు గొంతెత్తి పాడావుట!
ఇవాళ మా గుండెలే రాక్షసమయ్యాయి దాశరథీ! మా చేతులతో మేమే మహాంధ్ర సౌభాగ్యాన్ని చెరిపేసాము. చేవ చచ్చిన తెలుగు జాతికి, నీతి చచ్చిన తెలుగు జాతికి, బుద్ధి పుచ్చిన తెలుగు జాతికి, గుండెల్ని కుదిపేసి బూజు దులిపేసే నీ కవిత్వం కావాలి. దయచేసి మరొక్కసారి నీ గొంతు సవరించుకొని ఆకాశమంత యెత్తు అరవ్వూ!

చచ్చిపోయె చేవ, చచ్చె సంస్కారము
చచ్చిపోయె సిగ్గు, చచ్చె తెలివి
పెచ్చరిల్లిపోయె పిచ్చి విద్వేషము
చచ్చిపోయె తెలుగుజాతి పరువు

పగలగొట్టిరి విగ్రహమ్ములు
పగలగొట్టిరి నిగ్రహమ్మును
తగలబెట్టిరి తెలుగు సంస్కృతి
పగలగొట్టిరి గుండెలన్

ఛీ! యిది యేమి జాతి! మన చేతులతో మన కొమ్మలే తెగన్
గోయుచునుంటి మస్థికలు కుళ్ళెనొ నెత్తురు చల్లబడ్డదో!
పోయెను జాతి గౌరవము బుద్ధుని సాక్షిగ పుణ్యభూమిలో
గాయము శాశ్వతమ్మిది వికారపు మచ్చిది మాసిపోవునా?!
పూర్తిగా చదవండి...

Wednesday, March 2, 2011

మహాశివరాత్రి శుభాకాంక్షలు!

మహాశివరాత్రి శుభాకాంక్షలు!

మహేశ్వరునికున్న అనేకానేక విశిష్టతలలో అతని నటన్మూర్తి ప్రత్యేకమైనది. అతను నటనానికే రాజు. శివుని పద నర్తనలో విశ్వమంతా సంచలిస్తుంది. ఆ చైతన్య తాండవ హేలా విలాసంలో అణువణువూ లయాన్వితమవుతుంది. ఆ నటరాజ స్వరూపం ఊహకే పరమాద్భుతం! ఎందరో కవులా స్వరూపాన్ని వర్ణించే ప్రయత్నం చేసారు. వారిలో నన్నెచోడుడు కుమారసంభవంలో చేసిన వర్ణన లయగ్రాహి, లయహారిణి వృత్తాలలో ఎంతో లయబద్ధంగా సాగుతుంది.

విశేషమేమిటంటే ఇది దక్షుడు చేసే శివస్తోత్రం. దక్షాధ్వర ధ్వంసానంతరం శాంతించిన శివుడు కరుణించి దక్షుడిని క్షమించిన తర్వాత భక్త్యావేశంతో దక్షుడు చేసిన స్త్రోత్రమిది.

ఫాలతల విస్ఫురిత లోలతర భాసుర వి
శాల భయ దాసుర కరాళ నయనాగ్ని
జ్వాలలొకొ? పింగళ జటాళి యొకొ? నా బెరసి
తూలి, దివి భూషణ చయాలుళిత దీర్ఘ
వ్యాళ నికరంబొకొ? కరాళి యొకొ? నా దనరి
క్రాల, వర నృత్య పరిలోలుడగు శ్రీకం
కాలధరు, నుజ్జ్వలకపాలధరు, సన్నిశిత
శూలధరు, నీశ్వరు, దయాళు నుతియింతున్

శివుడు తాండవమాడుతూంటే, తలపై ఎఱ్ఱని జటలు ముడివిడి, వ్యాపించి, సంచలించిపోయున్నాయి. అవి ఘోర రాక్షస భయంకరములైన ఫాలనేత్ర జ్వాలలా అన్నట్టుగా ఉన్నాయి! నాట్య భంగిమలతో అతని నాలుగు చేతులూ ఆకాశంలో కదలాడుతూంటే అవి చేతులా నాగుపాములా అన్నట్టుగా ఉన్నాయి. అలాంటి కంకాలధరుడు, శూలధరుడు, దయాస్వరూపుడు అయిన నటరాజుని భకితో స్తుతిస్తున్నాడు దక్షుడు.

ఉర్వర చలింప, గులపర్వతచయం బడర,
బర్వ భువి నంబునిధు లౌర్వశిఖి యాడన్
బూర్వసుర నాగ సుర పూర్వదిగధీశ యమ
వార్విభు ధనేశ్వరుల గర్వము లడంగన్
సర్వగణ ముఖ్యులును, సర్వగణ భూతములు
నార్వ, నహిభూషణము లార్వ, దిశలం గం
ధర్వతతి పాడగ, నపూర్వనటనాదిగురు,
సర్వగతు, సర్వమయు, శర్వు నుతియింతున్

ఆ తాండవార్భటికి భూమి సంచలిస్తోంది. కులపర్వతాలు అదిరిపోతున్నాయి. సప్తసముద్రాలు ఉప్పొంగుతున్నాయి. బడబాగ్ని అతలాకుతలమవుతోంది. రాక్షసుల, నాగుల, దేవతల, అష్టదిక్పాలకుల గర్వమంతా అణిగిపోతోంది. గణాధీశ్వరులు, సమస్త భూత గణము అదిరిపోతోంది. ఆభరణాలైన సర్పాలు అలసిపోయి నిట్టూర్పులు విడుస్తున్నాయి. దిశలన్నిటా గంధర్వగానం వినిపిస్తోంది. నటనకి తొలిగురువు, సర్వజ్ఞుడు, అంతటా నిండినవాడు అయిన శర్వుడిని భక్తితో నుతిస్తున్నాడు దక్షుడు.

తాళరుతి గీతిరుతి మేలి తత వాద్యరుతి
చాల రసవంతమయి యోలి నులియం, ద
త్తాలగతి మెట్టుచును గేల జరు లిచ్చుచును
జాలి యనురాగమున గ్రాలుచు సుఖాబ్ధిం
దేలుచును మే మఱచి వ్రాలుచును గెత్తుచును
లోలగతి నేత్ర భుజ చాలనముతో బ్రే
తాలయమునందు సుఖలీల నెఱసంజ నను
కూలగతి నాడు శివు శూలి నుతియింతున్

తాళా గీత ధ్వనులు రెండూ మేళవించిన సంగీతం చాలా రసవంతమై నినదిస్తోంది. ఆ తాళానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, చేతులతో చఱుపులు చఱుస్తూ, అనురాగంతో ఉప్పొంగుతూ, సౌఖ్యసముద్రంలో తేలిపొతూ, మైమఱచి సోలిపోతూ, గంతులు వేస్తూ, నాట్యానికి అనుగుణంగా కన్నులు, భుజాలు కదిలిస్తూ శ్మశానంలో సంధ్యావేళ ఆనంద తాండవం చేస్తున్నాడు శివుడు. ఆ శూలిని స్తోత్రం చేస్తున్నాడు దక్షుడు.

కఱ గళము ఘనఘనము తెఱగనగ, నుఱికలును
గఱడియలు ద్రిపుదలును గిఱిడియలు బెల్లై
యుఱుము లన వడి జెలగ గొఱ నెలయు దనురుచులు
మెఱుగులన దశదిశల మెఱవ, దలమీదన్
వఱలు సురనది దొలకి నెఱి జినుకులును గిరియ
దఱిమికొని తొలుమొగులు తఱి యనగ నృత్యం
బొఱ వమర లలితగతి మెఱయు శివు డజు డమరు
డుఱుఫలము లొసగునని యెఱిగి నుతియింతున్

శివుడు నాట్యం చేస్తూంటే నల్లని కంఠము దట్టమైన మేఘంలాగా ఉంది. ఉఱికలు, కఱడియలు, త్రిపుదలు, కిఱిడియలు మొదలైన వాద్యవిశేషాలు చేసే ఢమఢమ ధ్వనులు ఉఱుముల్లాగా ఉన్నాయి. తెల్లని శరీరము, పైనున్న నెలవంక మెఱుపులా మెఱుస్తున్నాయి. తలమీదనున్న ఆకాశగంగ తొణికి చినుకులుగా కురుస్తోంది. అలా తొలకరి సమయాన్ని స్ఫురింజేస్తూ నాట్యం చేస్తున్న ఆ పరమేశ్వరుడు భక్తాభీష్ట ప్రదాత.

కరనికర మురు విటపవరము లన, గరతలము
కరుణరుచి దలిరు లన, గరజములు పుష్పో
త్కర మనగ, వనరుహజ హరి దనుజ ముని మనుజ
సుర గగనచర భుజగ గరుడ గణ యక్షే
శ్వరుల కతిదయ నొసగు వరఫలము లనిశమును
భరితమయి మధుసమయ సురవర మహీజ
స్ఫురణ కెన యన, దనరు వరదు, హితనటనరతు
బరమపరు, పరమగురు, బరము నుతియింతున్

ఆ నటరాజమూర్తి చేతులు పెద్దపెద్ద కొమ్మల్లాగా ఉన్నాయి. అఱచేతులు ఎఱ్ఱని కాంతితో మెఱుస్తూ చివురుల్లాగా ఉన్నాయి. చేతి గోరులు పువ్వుల్లా ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, రాక్షసులు, మునులు, మనుష్యులు, దేవతలు, ఖేచరులు, నాగులు, గరుత్మంతుడు, ప్రమథ గణాలు, కుబేరుడు మొదలైన వాళ్ళకి ఇచ్చే వరములు ఫలముల్లా ఉన్నాయి. నిరంతరం ఫలభరితమైన వసంతకాల కల్పవృక్షాన్ని స్ఫురింపజేస్తున్న ఆ నటరాజ మూర్తికి, పరాత్పరునుకి, పరమగురువుకి పరమాత్మునికి భక్తితో అంజలి ఘటిస్తున్నాడు దక్షుడు.

ఆ దక్షుడితోపాటు మనమూ ఆ నటరాజ విరాణ్మూర్తిని ఆత్మలో భావించి భక్తితో సన్నుతిద్దాం!

ఓం నమశ్శివాయ

పూర్తిగా చదవండి...

Wednesday, February 16, 2011

ఉదంకుడి కథ అయిపోయిందోచ్!

నిజానికి కిందటి టపాతోనే ఉదంకుడి కథ అయిపోయింది. మిగిలిందల్లా ఆ ఎద్దునెక్కి వచ్చిన దివ్యపురుషుడు ఎవరు, నాగలోకంలో ఉదంకుడికి కనిపించిన వింత దృశ్యమేమిటి అన్న సంగతులు తెలియడమే. ఆ తర్వాత ఉదంకుడి కథకీ సర్పయాగానికీ ఉన్న సంబంధం.
అసలు సంస్కృత భారతంలో వ్యాసుడు యీ సస్పెన్సుని చివరికంటా కథనంలో నిర్వహించ లేదు. ఆ పని చేసింది మన నన్నయ్యగారు. ఇంతకీ గురువుగారు ఉదంకుడికి చెప్పిన వివరం ఇది:

ఎద్దునెక్కి వచ్చిన దివ్యపురుషుడు సాక్షాత్తు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. ఉదంకుడు సేవించిన గోమయం అమృతం. నాగలోకంలో కనిపించిన ఇద్దరు స్త్రీలు ధాత, విధాత. వారు తెల్లని నల్లని దారాలతో నేస్తున్న మగ్గం అహో రాత్రాలు (పగలు, రాత్రి). పన్నెండు రేకుల చక్రం పన్నెండు నెలలతో కూడిన సంవత్సరం. దాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. ఆ గుఱ్ఱం అగ్ని. గుఱ్ఱం ఎక్కి వచ్చిన దివ్యపురుషుడు ఇంద్ర సఖుడైన పర్జన్యుడు.
ఇంద్రుడు తన స్నేహితుడు కాబట్టి తన పని మీద వెళ్ళిన ఉదంకుడికి సహాయం చేసాడని, అమృత భక్షణం వల్లనే అతనికి నాగలోకంలో ఎలాంటి హాని జరగకుండా అతని పని సఫలమయిందని కూడా గురువుగారు ఉదంకుడికి వివరిస్తారు.

అంతా బాగానే ఉంది కాని మరి ధాత, విధాత, ఋతువులు మొదలైనవి ఎందుకు కనిపించాయి? ఈ ప్రశ్నకి అటు వ్యాసుడు కాని ఇటు నన్నయ్యగారు కాని సమాధానమివ్వడానికి ప్రయత్నించ లేదు. ఇలాంటి వాటివల్లనే మన పురాణేతిహాసాల్లో ఒక మార్మికత ఉందని అనిపిస్తుంది. అయితే కొందరికది ఏ కోశానా రుచించదు. కథని కథగానే చదువుకోవాలి కాని అందులో అంతరార్థాలని వెతకడం ఎందుకని అంటారు. అక్కరలేదనుకొనే వాళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అలాంటి అంతరార్థం కోసం అన్వేషిస్తారు. దాన్నీ దీన్నీ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక రచనని లౌకికము, నైతికము, ఆధ్యాత్మికము అనే మూడు అంతరువుల్లో చూడడం మన భారతీయ సాహిత్యంలో ఒక సంప్రదాయం. అంటే కథ కథగా చదవడం ఒకటి, అది చెప్పే నీతిని అవగాహన చేసుకోవడం రెండు, అందులోని ఆధ్యాత్మికమైన అంతరార్థాన్ని గ్రహించడం మూడు. కవులు కూడా అదే దృష్టితో కావ్యాలని సృష్టించారని నమ్మకం. ముఖ్యంగా పైన చెప్పిన సన్నివేశాలవంటివి (ఉదంకుడు కాల సంబంధమైన ప్రతిరూపాలని చూడడం) కథలో వచ్చినప్పుడు, ఎందుకవి కథలో ఉన్నాయని ఆలోచించడం సహజం కదా. ఎవరికి తోచిన అర్థాలు వారు చెప్పుకుంటారు. ఎవరైనా వివరిస్తే దాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ కథలోని అంతరార్థం గురించి "శ్రీ మహాభారత వైజ్ఞానిక సమీక్ష" అన్న పుస్తకంలో శ్రీ తిరుమల వేంకట శ్రీనివాసాచార్యులుగారు ఇచ్చిన వివరణ క్లుప్తంగా ఇది:

ఉదంకుడు అంటే ఊర్ధ్వలక్షణము కలవాడు అనే అర్థం చెప్పుకోవచ్చు. ఉదంకుడు గురుపత్ని కోసం కుండలాలని సంపాదించే కార్యం నిజానికి దివ్యజ్ఞానం సంపాదించడం. ద్వాదశాదిత్యులలో ఒకరు "పుషా". ఇది భూమిని పోషించే సూర్య తేజం. పౌష్యుడు దానికి ప్రతీక. సత్యాన్ని ధర్మాన్ని దర్శించడానికి పూషా స్వరూపుడైన సూర్యుడిని ఉపాసించాలి. పుషాదిత్యుని జ్ఞానశక్తి పౌష్యాదేవి. సూర్యుని ప్రకాశము అతని శబ్దమే. రవము కలవాడు కాబట్టి రవి. ఆ శబ్దము వల్లనే జ్ఞానబోధ కలుగుతుంది. చెవి గ్రహించే శబ్దాన్ని ప్రకాశింప జేసేవి మనసు, బుద్ధి. అవే పౌష్యాదేవి కుండలాలు. అతీంద్రియ జ్ఞానార్జనకు ఈ రెండిటినీ సంపాదించే ప్రయత్నమే ఉదంకుడు చేసినది. ఆత్మలో అమృతత్వమున్నా అది ముందు గ్రహించ లేకపోయాడు ఉదంకుడు. అంతరింద్రియ జ్ఞానము బాహ్య దృష్టికి గోచరించదు కాబట్టి అంతఃపురంలో పౌష్యాదేవి ఉదంకునికి ముందు కనిపించలేదు. ఎప్పుడయితే ఆత్మశుద్ధి చేసుకున్నాడో అప్పుడతనికి కనబడింది.

తక్షకుడంటే వడ్రంగి. రూపంలేని శుద్ధ బ్రహ్మమనే చెట్టుని చెక్కి దేహాకృతిని నిర్మించే త్వష్టా ప్రాణానికి ప్రతిరూపం తక్షకుడు. శక్తిమయములైన (అతీంద్రియమైన) మనో బుద్ధులు, నామ రూపాత్మకమైన భౌతిక శరీరంలో త్వష్టాప్రాణము చేత బంధింపబడడమే తక్షకుడు కుండలాలని అపహరించడం. మన లోలోపల దాగిన అతీంద్రియ శక్తి రహస్యాలను తెలుసుకొనే విధానమును ఋషులు కనిపెట్టారు. దానికి "బిల్మవిద్య" అని పేరు. ఇదే కుండలినీ విద్య. బిలంలాంటి మూలాధారచక్రంలో పాములా చుట్టలు చుట్టుకొని నిద్రాణమై ఉంటుంది అథఃకుండలినీ శక్తి. దానిని మేల్కొలిపితే, అది స్వాధిష్ఠాన (నిప్పు), మణిపూర(నీరు), హృదయ (వాయు), ఉపరి (ఆకాశ) అనే పాంచభౌతికమైన చక్రాలు దాటుకొని, మనోమయమైన ఆజ్ఞాచక్రాన్ని ప్రవేశించగానే భ్రూ మధ్యమున ఉన్న జ్ఞాన నేత్రం విచ్చుకుంటుంది. ఉదంకుడు భూ బిలం ద్వారా పాతాళము సొచ్చి చేసిన నాగస్తుతి కుండలినీ శక్తి ప్రబోధమే. దానివల్ల అతడికి కాలజ్ఞానం కలిగింది. దానికి సూచనే కాల ప్రతిరూపాలు కనిపించడం. అశ్వరూపంలో దర్శనమిచ్చిన అగ్ని కుండలినీ శక్తి. మూలాధార చక్రం అపాన స్థానంలో ఉంటుంది. సంస్కృత భారతంలో గుఱ్ఱం వెనక భాగంలోని అపానంలోనే ఊదుతాడు ఉదంకుడు. అంటే కుండలినీశక్తిని మేల్కొల్పడమే. దాన్ని నన్నయ్యగారు ఎందుకో చెవిలో ఊదినట్టుగా మార్చారు.

అంటే ఉదంకుడి కథలోని అంతరార్థం కుండలినీయోగ సాధనన్నమాట!

ఇంతకీ ఈ కథకీ, జనమేజయుడు చేసిన సర్పయాగానికి ఏవిటి లంకె అన్న విషయం ఉండిపోయింది కదా. గురుపత్ని కార్యాన్ని నిర్వహించి, గురుదక్షిణ చెల్లించి, గురువు ఆశీసులతో విద్య ముగించుకొని జనమేజయుని దగ్గరకు వెళతాడు ఉదంకుడు. కుండలాలని అపహరించిన తక్షకుడి మీద అతని కోపం ఇంకా చల్లారదు. అందుకు ప్రతీకారంగా జనమేజయునితో సర్పయజ్ఞం చేయించాలని అతని ఆలోచన. జనమేజయుడే ఇతని ప్రతీకారం ఎందుకు చెల్లిస్తాడంటే, జనమేజయుని తండ్రి పరీక్షిత్తుని చంపినది తక్షకుడే కనక! అది వేరే కథ. జనమేజయుని దగ్గరికి వెళ్ళి, గురుకార్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించిన సమయంలో తక్షకుడు నిష్కారణంగా తనని మోసగించి మహాపకారం చేసాడని చెప్తాడు. ఆ తక్షకుడు పరీక్షిత్తుని చంపిన విషయాన్ని కూడా గుర్తుచేస్తాడు. గుర్తుచేసి ఇలా అంటాడు:

కాదన కిట్టిపాటి యపకారము దక్షకు డేక విప్ర సం
బోధన జేసి చేసె నృపపుంగవ, నీవు ననేక భూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా
కోదర సంహతిం హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్

"సంబోధన" అంటే వాడుకలో ఉన్న అర్థం పిలుపు. కాని ఈ పదానికి రెచ్చగొట్టడం, ప్రబోధించడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడా అర్థం తీసుకోవాలి. ఒక బ్రాహ్మణుడి ప్రేరణ చేత కాదనకుండా తక్షకుడు నీ తండ్రికి ఇంతటి మహాపకారాన్ని చేసాడు. కాబట్టి నువ్వు అనేక బ్రాహ్మణులు కూడి చేయించే సర్పయాగంలో చెలరేగే మహోగ్ర అగ్ని శిఖలలో ఆ తక్షకాడితోబాటు సర్పజాతి నంతటినీ భస్మం చెయ్యి. అని ఉదంకుడు జనమేజయుడిని సర్పయాగానికి ప్రోత్సహిస్తాడు.

"ధ"కి "ద"కి ప్రాస వెయ్యవచ్చుననడానికి ఈ పద్యం ఒక ప్రమాణం. మిగిలిన అక్షరాలకి ఈ సడలింపు లేదు! "కాకోదరము" అంటే పాము. దీనికి కాక+ఉదరము (కాకి కడుపు) అనే అర్థం కొందరు చెప్పారు కాని ఇది కర్కోటకము(ఇది కూడా పాముకి పర్యాయపదమే) అన్న పదానికి ప్రాకృత రూపం అవ్వవచ్చని మరి కొందరు భావిస్తున్నారు. బహుశా అదే సరైనదేమో అని నాకనిపిస్తుంది. "హుతవహుడు" అంటే యజ్ఞ హవిస్సుని (హుతము) తీసుకొనే వాడు, అగ్ని.

ఒక్క తక్షకుడు చేసిన తప్పుకి సర్పజాతి అంతా ఎందుకయ్యా బలికావడం అని అడుగుతాడేమో ఆ రాజని, ముందుగానే దానికి సమర్థింపుగా ఇలా అంటాడు ఉదంకుడు:

ప్రల్లదుడైన యొక్క కులపాంసను చేసిన దాన దత్కులం
బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము? కావునన్ మహీ
వల్లభ తక్షకాధము నెపంబున సర్పములెల్ల నగ్నిలో
ద్రెళ్ళగ సర్పయాగ మతిధీయుత చేయుము విప్రసన్నిధిన్

కులనాశకుడైన ఒక్క దుర్మార్గుడివల్ల ఆ కులమంతా దూషింపబడటం కొత్త విషయమేమీ కాదు కదా. ఒక్క తక్షకుడి వల్ల సర్పజాతికంతటికీ ఆ దోషం చుట్టుకుంది. కాబట్టి ఆ పాములన్నీ అగ్నిలో మాడిపోయేట్టుగా నువ్వు సర్పయాగాన్ని తప్పకుండా చెయ్యి. అని సర్పయాగాన్ని సమర్థిస్తాడు ఉదంకుడు. ఇక్కడ మళ్ళీ నన్నయ్య కవిత్వశక్తి మనకి కనిపిస్తుంది. ఈ పద్యం సంస్కృత భారతంలో లేదు. రాబోయే భారత కథలో, దుష్టుడయిన ఒక్క దుర్యోధనుడి వల్ల ఎలా కురువంశమంతా నాశనమవుతుందో మనకీ పద్యంలో ధ్వనించడం లేదూ! నన్నయ్య అలా ధ్వనించాలనే వ్రాసాడా అంటే చెప్పలేం, అనవసరం కూడా. మనకి ఆ స్ఫూర్తి కలుగుతోందా లేదా అన్నది ముఖ్యం. "లేదండీ నేను మాటల అర్థాలు అల్లాగే తీసుకుంటాను. అవి ధ్వనించే విషయాన్ని గురించి నాకు పీకులాట లేదు", అంటే చెప్పగలిగేదేమీ లేదు. యద్భావం తద్భవతి!

మొత్తానికి జనమేజయుని సర్పయాగం వెనక ఇంత కథ ఉంది! ఇంతకీ జనమేజయుడు సర్పయాగం చేసాడా, సర్పాలు యాగాగ్నిలో పడి మసి కాకుండా ఎవరైనా కాపాడారా? ఇదంతా మరొక కథ. మళ్ళీ నాకు కోరిక తీరిక కలిగినప్పుడు చెప్పుకుందాం!

పూర్తిగా చదవండి...

Monday, February 7, 2011

ఉదంకుడి కథ - 3

దేవ మనుష్య లోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం
భావిత శక్తిశౌర్యులు నపార విషోత్కట కోప విస్ఫురత్
పావక తాపి తాఖిల విపక్షులు నైన మహానుభావు లై
రావత కోటి ఘోర ఫణిరాజులు మాకు ప్రసన్నులయ్యెడున్

నాగ వంశంలో అనంతుడు, వాసుకి తర్వాత శక్తివంతుడైన నాగరాజు ఐరావతుడు. అతని వంశం వారిని ఐరావతులంటారు. ఇరావతి అనే నది దగ్గర నివసించేవారు కాబట్టి వీరు ఐరావతులయ్యారని కొంతమంది ఊహ. అర్జునుడి భార్య ఉలూచి నాగ కన్య. ఆమె ఐరావత వంశానికి చెందినదే. ఉలూచికి పుట్టిన కొడుకు పేరు ఇరావంతుడు!

ఈ నాగ స్తోత్రంలో నన్నయ్య ఒక చక్కని ప్రణాళికని అనుసరించాడనిపిస్తుంది. ముందుగా వైకుంఠవాసుడైన అనంతుడిని, ఆ తర్వాత కైలాసవాసుడైన వాసుకిని స్తుతించి అప్పుడు దేవ మనుష్య లోకాలలో తిరుగాడే ఐరావతులని స్తుతించాడు. చివరిగా కేవల భూ సంచారి అయిన తక్షకుడిని స్తుతించాడు. సంస్కృత భారతంలో ఉదంకుడు ఐరావత తక్షకులని మాత్రమే స్తుతించినట్టుగా ఉంది. ఈ ఐరావతులు చాలా ప్రతాపవంతులు, శక్తివంతులు, శూరులు. అపారమైన విషంతో కూడిన కోపాగ్నిలో శత్రువులని కాల్చేస్తారు. అలాంటి భీకర సర్ప రాజులైన ఐరావతులు తనకి ప్రసన్నమగుగాక అని ప్రార్థిస్తున్నాడు ఉదంకుడు.

గోత్రమహామహీధర నికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుడై
ధాత్రి బరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షు డీక్షణ
శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు బ్రసన్నుడయ్యెడున్

పైన చెప్పిన ప్రణాళిక పద్య నిర్మాణంలో కూడా గమనించవచ్చు. "బహువన పాదపాబ్ధి..." అంటూ సమాసబంధురంగా మొదలుపెట్టిన ఆ పద్య రచనని ఈ పద్యంతో ఒకసారి పోల్చిచూడండి. ఈ నాలుగు పద్యాలూ ఒకదానికన్నా ఒకటి బిగువు తగ్గుతూ వస్తాయి. చెప్పే వస్తువులోని గురుత్వాన్ని, సమాసబంధురతతో ధ్వనింపజెయ్యడం నన్నయ్య ప్రవేశపెట్టిన ఒకానొక పద్యశిల్పం.

మహీధరము అంటే కొండ. భూమిని అవి మోస్తున్నాయి కాబట్టిట! గోత్ర మహీధరములు అంటే కులపర్వతాలు. భూమిని మోస్తున్న పర్వతాలలో ముఖ్యమైనవివి. ఇవి ఏడు. మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము. ఈ ఏడు పర్వతాలలోను అనేక అడవులు (విపినములు), పొదరిళ్ళు (నికుంజములు) ఉంటాయి. అక్కడా, కురుక్షేత్రంలోను, ఇలా నానా ప్రదేశాలలోనూ భూమి అంతటా స్వేచ్ఛగా అశ్వసేనుడితో కలిసి విహరిస్తూ ఉంటాడట తక్షకుడు. అశ్వసేనుడు తక్షకుడి కొడుకు. గొప్ప బలము, గర్వము, పరాక్రమము కలిగినవాడీ తక్షకుడు. ఈక్షణశ్రోత్రము అంటే పాము. ఈక్షణమంటే కన్ను. శ్రోత్రమంటే చెవి. అంటే కన్నులే చెవిగా కలిగినది. పాముకి ఇతర జంతువుల్లా చెవులుండవు. బూరా ఊదితే పాము నాట్యమాడేది నిజానికి ఆ బూరా ఊదేవాడి కదలికల బట్టి కాని ఆ శబ్దం విని కాదు. ఈ పేరు పాముకి అందుకు వచ్చింది. సంస్కృత భాషలో ఒకే వస్తువుకి అనేక పర్యాయపదాలు ఉండడానికి కారణం వాళ్ళు ఆయా వస్తువులని అన్ని రకాలుగా దర్శించి అర్థం చేసుకొని దానికి తగిన సంజ్ఞలని ఏర్పరచడం వల్లనే! సంస్కృత భాష వస్తే భాషాజ్ఞానంతో పాటు వస్తుజ్ఞానం కూడా కలుగుతుందన్న మాట.

నాగరాజులందరినీ ఉదంకుడిలా స్తోత్రం చేసినా ఎలాంటి ప్రయోజనమూ కలగలేదు. అయితే అంతలోనే ఉదంకుడికి ఒక విచిత్రమైన అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక ఇద్దరు స్త్రీలు నలుపు తెలుపు దారాలతో ఒక వస్త్రాన్ని నేస్తూ ఉన్నారు. ఆ పక్కనే పన్నెండు అడ్డ కఱ్ఱలతో (spokes) ఉన్న ఒక చక్రాన్ని తిప్పుతూ ఆరుగురు కుఱ్ఱవాళ్ళు కనిపించారు. ఆ పక్కనే ఎత్తైన గుఱ్ఱాన్ని అధిరోహించిన మహా తేజోవంతుడయిన ఒక దివ్యపురుషుడు కనిపించాడు. అతన్ని చూసి ఉదంకుడు విశేష మంత్రాలు చదువుతూ భక్తితో స్త్రోత్రం చేస్తాడు. అప్పుడా దివ్యపురుషుడు ప్రసన్నుడై, నీ కోరికేమిటో చెప్పు నెరవేరుస్తానని అంటాడు. ఉదంకుడెంతో సంతోషించి, నాగులందరూ తనకి వశమై తన కుండలాలు తనకి తిరిగి ఇచ్చెయ్యాలని కోరుకుంటాడు. అప్పుడా దివ్యపురుషుడు అలా అయితే ఈ గుఱ్ఱం చెవిలో ఒక్కసారి ఊదమంటాడు. ఉదంకుడలాగే ఊదుతాడు. అంతే ఒక్కసారిగా:

పాతాళైక నికేతనాంతరమునన్ బర్వెం దదశ్వాఖిల
స్రోతో మార్గ వినిర్గతోగ్ర దహనార్చుల్, పన్నగవ్రాతముల్
భీతిల్లెన్, భుజగాధినాథు మనమున్ భేదిల్లె, గల్పాంత సం
జాత ప్రోద్ధత బాడబానల శిఖా శంకాధి కాతంకమై

విశేషమైన పద్యాలని సందర్భానికి తగ్గట్టు చెక్కడంలో మహాకవులు ఎంతటి శిల్పనిర్మాణ నిపుణులో ఇలాంటి పద్యలు పరిశీలిస్తే తెలుస్తుంది. పద్యం ఎత్తుగడ ఎలా ఉంది, మధ్యలో ఎలా సాగి, చివరికి ఎలా పూర్తయ్యింది, ఆసక్తి ఉన్నవారు జాగ్రత్తగా గమనించండి.

కల్పాంతమంటే మహా ప్రళయకాలం. అలాంటి ప్రళకాలంలో పుట్టి ప్రజ్వరిల్లుతున్న బడబానల జ్వాలలేమో అన్నంత భయంకరంగా పుట్టాయి ఉగ్ర దహనార్చులు. అంటే తీవ్రమైన అగ్నిజ్వాలలు. ఎక్కడ నుండి పుట్టాయి? ఆ ఆశ్వ అఖిల (సర్వమైన) స్రోతో మార్గము (ఇంద్రియ మార్గమైన అవయవాలు, దేహము) నుండి. అలా పుట్టిన ఆ జ్వాలలు పాతాళలోకమనే భవనమంతటా వ్యాపించాయి. దానితో సర్పాలన్నీ భయంతో వణికిపోయాయి. నాగరాజు గుండె బద్దలయింది. దండం దశగుణం భవేత్ అన్నట్టు ఆ దెబ్బకి తక్షకుడు లొంగాడు:

శంకర నిభుడగు విప్రు భ
యంకర కోపాగ్ని యొక్కొ యనుచున్ జాతా
తంకుడయి కుండలంబు లు
దంకునకును దెచ్చియిచ్చె దక్షకు డంతన్

అదంతా శివుడంతటి విప్రుని కోపాగ్ని కాబోలు అనుకుంటూ తక్షకుడు భయపడి (జాత=పుట్టిన, ఆతంకుడయి=భయం కలవాడై) కుండలాలని ఉదంకుడికి తెచ్చి యిచ్చాడు.

మొత్తానికలా కుండలాలని తిరిగి సంపాదించాడు ఉదంకుడు. అయినా అతనికొక సమస్య వచ్చిపడింది. కుండలాలని నాలుగు రోజుల్లో తీసుకురమ్మని గురుపత్ని ఆజ్ఞ. ఈ రోజే నాల్గవ రోజు. ఇంత తొందరగా ఇప్పుడక్కడకి చేరుకోడం ఎలా? ఇలా చింతిస్తున్న ఉదంకుడిని చూసి, విషయం గ్రహించి, ఆ దివ్యపురుషుడు, మనసుకన్నా వేగమైన తన గుఱ్ఱాన్ని ఎక్కి వెళ్ళమని అంటాడు. అతని మాట ప్రకారం ఉదంకుడు ఆ గుఱ్ఱాన్ని ఎక్కి క్షణ కాలంలో గురువుగారి ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే గురుపత్ని స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి, వ్రతానికి సిద్ధమై ఉంటుంది. కుండలాలని ఎప్పుడు తెస్తాడా అని ఉదంకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కుండలాలతో వచ్చిన అతడిని చూసి సంతోషించి, ఆ కుండలాలు ధరించి తాను చేయదలచుకున్న వ్రతం చేసుకుంటుంది. అప్పుడతని గురువు ఉదంకుడిని ఇలా అడుగుతాడు:

ఈ యున్న పౌష్యుప్రోలికి
బోయి కడుం బెద్ద దవ్వు పోయినయట్ల
త్యాయత విమల తపో మహి
మా! యిన్ని దినంబులేల మసలితి చెపుమా!

ఇక్కడున్న పౌష్యుని ఊరికి (పురము వికృతి ప్రోలు) వెళ్ళి రావడనికి ఎదో పెద్ద దూరం వెళ్ళివచ్చినట్లు ఇన్ని రోజులెందుకు పట్టింది? అని అడిగారు గురువుగారు. "ఈ యున్న" అన్నది అచ్చమైన తెలుగు నుడికారం. సంభాషణని దానితో మొదలుపెట్టడంతో పద్యానికి ఒక సహజత్వం సొగసు అబ్బింది. ఇక్కడ ఉదంకునికి వాడిన విశేషణం గమనించండి, "అత్యాయత విమల తపో మహిమా!". అంటే ఎంతో గొప్పదైన స్వచ్ఛమైన తపోమహిమ కలవాడా అని. అంతటి తపోమహిమ కలిగినవాడికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్న. అంతటి తపోమహిమ కలవాడు కాబట్టే ఆ కార్యాన్ని సాధించాడని ధ్వని.

గురువుగారు అలా అడిగేసరికి జరిగిందంతా పూస గుచ్చినట్లు చెపుతాడు ఉదంకుడు. తోవలో వెళుతూ ఉంటే ఎద్దునెక్కిన దివ్యపురుషుడు కనిపించిన విషయం మొదలు, తక్షకుడు కుండలాలని దొంగిలించడం, నాగలోకంలో చూసిన అద్భుతదృశ్యం, అక్కడ జరిగిన వింతలు విశేషాలు అన్నీ వివరిస్తాడు. చెప్పి, ఇదంతా ఏమిటి నాకు వివరించండి స్వామీ అని అడుగుతాడు.

ఆ గురువుగారు వివరించిన రహస్యమేమిటి? అందులోని అంతరార్థం ఏమయ్యుంటుంది? ఇంతకీ ఈ కథకీ జనమేజయుని సర్పయాగానికి ఉన్న సంబంధం ఏమిటి?

ఇవన్నీ తెలియాలంటే మరో టపాకోసం మీరు ఎదురుచూడల్సిందే! :-)

పూర్తిగా చదవండి...

Friday, January 28, 2011

ఉదంకుడి కథ - 2

ఉదంకోపాఖ్యానం మొదటి భాగం ఎంత వరకూ చెప్పుకున్నాం? కుండలాలని అడిగి తీసుకోడానికి వెళ్ళిన ఉదంకుడు, అంతఃపురంలో పౌష్యుని భార్య కనిపించక తిరిగివచ్చాడు కదా. వచ్చి పౌష్యుడితో ఆ విషయం చెపితే, పౌష్యుడిలా అంటాడు:

భూవినుత! నిన్ను ద్రిభువన
పావను నశుచి వని యెట్లు వలుకగ నగు న
ద్దేవి పవిత్ర పతివ్రత
గావున నశుచులకు గానగా దనవద్యా!

ఒక సంభాషణా రచనలో, నన్నయాది కవులు ఎంత జాగ్రత్త వహించారో తెలుసుకోడానికి ఈ పద్యం ఒక ఉదాహరణ. ఏదో గణాలు, యతి ప్రాసలు కిట్టించేసి పద్యాలు వ్రాస్తే అది కవిత్వం అవ్వదు. కథా కావ్యంలో పాత్రల సంభాషణలకి ఎంతో ప్రాధాన్యముంటుంది. సంభాషణ పాత్రకి సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి. ఉదంకుడికి పౌష్య దేవి కనిపించలేదు. మహా పవిత్రురాలు కాబట్టి, శుచులకు (మనోవాక్కాయములు మూడిటా పరిశుద్ధులైన వాళ్ళు) మాత్రమే ఆవిడ కనిపిస్తుంది. ఉదంకుడికి కనిపించ లేదంటే అతడు పరిశుద్ధుడు కాడన్న మాట. అతను చూస్తే ముని. పైగా పవిత్రమైన గురు కార్యమ్మీద వచ్చినవాడు. అతణ్ణి పట్టుకొని నువ్వు అశుచివి అనడం అసమంజసం. కాని విషయం చెప్పాలి. అలాంటి సందర్భంలో ఒక రాజైన వాడు ఎంత సందర్భోచితంగా, చతురతతో మాట్లాడాలి. అది మనకీ పద్యంలో కనిపిస్తుంది. పద్యం ఎత్తుకోడమే "భూవినుత" అన్న సంబోధనతో మొదలయ్యింది. అంటే భూప్రజల చేత చక్కగా నుతింపబడే వాడా అని అర్థం. అంటే నువ్వంత గొప్పవాడివని నాకు తెలుసు అని ముందుగానే ప్రకటిస్తున్నాడు. అలా మూడు లోకాలలోకెల్లా పవిత్రమైనవాడివి నిన్ను అశుచి అని అనడం కుదురుతుందా? అయినా విషయం ఏమిటంటే, నా దేవేరి మహా పవిత్ర, పతివ్రత. అందువల్ల ఆవిడ ఆశుచులకి కనపడదు (కానన్=చూడ్డానికి, కాదు=అవ్వదు). అని చెప్పి, మళ్ళీ "అనవద్యా!" అన్న సంబోధనతో ముగించాడు. అనవద్యుడంటే దోషములేనివాడు. అంటే ఉదంకుని మీద తనకున్న అచంచల గౌరవాన్ని ప్రకటిస్తూనే, అసలు విషయం చెప్పాడన్న మాట. ఇలాంటి పద్యాలు Communication trainingలో ఉదాహరణలుగా చెప్పదగ్గవి!

అలా చెప్పబట్టే ఉదంకుడు చిన్నబుచ్చుకోకుండా, కోపగించుకోకుండా, నింపాదిగా ఆలోచించాడు. ఆలోచిస్తే, తాను ఎద్దు పేడని తిన్నానన్న సంగతి గుర్తుకువచ్చింది. ఒహో బహుశా అందుకే కాబోలు అశుచి దోషం తనకి కలిగిందని అనుకొని, శుభ్రంగా చేతులు కాళ్ళు ముఖము కడుక్కొని, తూర్పుకు తిరిగి ఆచమనం చేసి శుద్ధిచేసుకొని, పౌష్యుడి అనుమతి తీసుకొని మళ్ళీ అంతఃపురానికి వెళ్ళాడు. ఇప్పుడతనికి ఆ పౌష్యా దేవి కనిపించింది. అతనికి నమస్కరించి తన కుండలాలని సంతోషంగా ఇచ్చింది.

ఇదొక విచిత్రమైన సన్నివేశం. ఏ గోమయమాన్ని తింటే కార్యం సఫలమవుతుందని ఆ దివ్యపురుషుడు చెప్పాడో అదే ఆటంకమయ్యింది! ఎందుకిలా జరిగింది? అసలా దివ్యపురుషుడు ఎవరు, ఆ గొమయం ఏమిటి అన్న విషయం ప్రస్తుతానికి పక్కనపెడితే, ఉదంకుడు తాను తిన్నది గోమయమనే భావనతోనే ఉన్నాడు. అంటే మనస్సులో అతనికి శుచిత్వం లేదన్న మాట. అంచేత నిజంగా ఆ గోమయం వల్ల అతనికి అశుచి కలిగినా కలగకపోయినా, మనసులో అతనికా అపవిత్ర భావన కలిగింది కాబట్టి అతను అపవిత్రుడే అయ్యాడు. శుద్ధి చేసుకున్నాక, అతని మనసులోనున్న శంక పోయి అది పరిశుద్ధమయింది. అప్పుడతనికి పౌష్యుని భార్య కనిపడింది.

ఉదంకుడికి కుండలాలని ఇస్తూ పౌష్యుని భార్య తక్షకుడి గురించి చెపుతుంది. తక్షకుడు ఒక నాగరాజు. అతడు చాలా రోజులుగా ఆ కుండలాలపై కన్నేసి ఉంచాడు. అతను చాలా మాయగాడు. ఆ తక్షకుడినుండి కాపాడుకుంటూ తీసుకువెళ్ళమని ఉదంకుడికి చెపుతుంది. సరే అని చెప్పి ఆ కుండలాలు తీసుకొని మళ్ళీ పౌష్యుడి వద్దకు వస్తాడు. అప్పుడా రాజు ఉదంకుడితో, మీరు మా అతిథి కాబట్టి మా యింట భోజనం చెయ్యనిదే వెళ్ళకూడదని అంటాడు. ఇది భారతీయ సంస్కారం, సంప్రదాయం. తొందరలో ఉన్నా, అడిగినప్పుడు కాదనకూడదని సరేనంటాడు ఉదంకుడు. భోజనం చేస్తూంటే అందులో ఒక తలవెండ్రుక కనిపిస్తుంది. దానితో ఉదంకుడా అన్నాన్ని అసహ్యించుకొని, కోపించి, సరిగా పరీక్షించకుండా అశుద్ధాన్నం పెట్టావు కాబట్టి గుడ్డివాడవు కమ్మని పౌష్యుడిని శపిస్తాడు. పౌష్యుడు కూడా శాపానుగ్రహ సమర్థుడే. ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శాపం పెట్టావు కాబట్టి నీకు సంతానం కలగకుండు గాక అని ప్రతిశాపం పెడతాడు. సంతానోత్పత్తికి అన్నం మూలాధారమని వేదం చెపుతుంది. వెండ్రుక వచ్చిన దోషానికి అన్నాన్నే ఈసడించినందువల్ల అతను సంతానహీనుడయ్యాడన్నది ఇందులోని రహస్యం. ఉదంకుడప్పుడు, అయ్యో నేను సంతానహీనుణ్ణి కాలేను, శాపం ఉపహరించు అంటాడు. దానికి పౌష్యుడు ఇలా అంటాడు:

నిండుమనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము జగన్నుత, విప్రులయందు, నిక్కమీ
రెండును రాజునందు విపరీతము, గావున విప్రుడోపు, నో
పం డతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మఱింపగన్

ఇది బాగా ప్రాచుర్యం పొందిన పద్యం. ఇక్కడ పౌష్యుడు చెప్పదలుచుకున్నది తానిచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేనని. కాని దానికి హేతువు కూడా చెపుతున్నాడు. ఆ చెప్పడం కూడా ఎంతో సొగసుగా చెపుతున్నాడు. విప్రుల నిండుమనసు అప్పుడే చేసిన వెన్నతో సమానము. అంటే అంత మృదువైనది. కాని వాళ్ళ మాట మాత్రం దారుణమైన వజ్రాయుధమంత కఠినం (ఆఖండలుడు అంటే ఇంద్రుడు. అతని శస్త్రం వజ్రాయుధం). కాని రాజు విషయంలో ఈ రెండూ విపరీతం, అంటే ఇటునుంచి అటు. రాజు హృదయం వజ్రాయుధమంత కఠినమైనా వాక్కు వెన్నంత మెత్తగా ఉంటుంది! ఈ లక్షణాలు వాళ్ళ వాళ్ళ వృత్తులవల్ల వాళ్ళకి సంక్రమిస్తాయన్న విషయాన్ని అక్కడ వాడిన పదాల ద్వారా స్ఫురింపచేసాడు నన్నయ్య. విప్రుడంటే వేదాలు చదివినవాడు. నిరంతర వేద పఠనం వలన విప్రుల వాక్కు కాఠిన్యాన్ని పొందుతుంది. కాని వాళ్ళకి ఎవరిపైనా ద్వేషమో, కోపమో ఉండాల్సిన అవసరం లేదు. కఠినంగా ఆలోచించాల్సిన, ప్రవర్తించాల్సిన అవసరమూ లేదు. రాజు అలా కాదు. రాజు రాజ్యాన్ని ఏలేవాడు. అతను నరపాలుడు. అంచేత అతని మనసు వివిధ విషయాలలో చీకాకు పొందుతూ ఉంటుంది. రాగద్వేషాలతనికి కలుగుతూ ఉంటాయి. అతనికి చాలామందితో కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మెత్తగా మాట్లాడవలసిన అవసరమూ ఉంది. ఈ లక్షణాల కారణంగా విప్రుడు తన శాపాన్ని వెనక్కు తీసుకోగలడుట, రాజు మాత్రం ఆ పని చెయ్యలేడట! అంతేకదా మరి. మాట కన్నా మనసు శక్తివంతమైనది.

ధారాశుద్ధి, చిక్కదనం రెండిట్లో ఏ ఒక్కటీ చెడకుండా కూర్చిన పద్యమిది. ఇతిహాసాన్ని కావ్యంగా మలచేటప్పుడు ఎలాంటి నేర్పు చూపించాలో, ఈ పద్యాన్ని దీని సంస్కృత మూలంతో పోల్చి చూస్తే తెలుస్తుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు పరిశీలించవచ్చు. ఈ పద్యం గుఱించి విశ్వనాథవారు "సాహిత్యసురభి" పుస్తకంలో ఇచ్చిన వివరణ ఇక్కడ చదువుకోవచ్చు:
http://groups.yahoo.com/group/Chandassu/message/1072

పౌష్యుడలా వివరించి, కాబట్టి నువ్వే నీ శాపాన్ని తిరిగి తీసుకోమని ఉదంకుడిని కోరతాడు. సరే కొద్ది కాలంలోనే నీకు శాపవిమోచనం కలుగుతుందని చెప్పి ఉదంకుడు అక్కడనుండి బయలుదేరతాడు. గురుకార్యం సఫలమయిందని సంతోషిస్తూ తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. తోవలో ఒక సరస్సు కనిపిస్తే, గట్టున ఒక చోటును శుభ్రం చేసి, కుండలాలని అక్కడ పెట్టి, స్నానానికని ఆ సరస్సులోకి దిగుతాడు. అంతదాకా తక్షకుడు ఉదంకుణ్ణి ఒక దిగంబరుడి వేషంలో అనుసరిస్తూనే ఉంటాడు. ఉదంకుడు ఎప్పుడైతే కుండలాలని విడిచి సరస్సులోకి వెళ్ళాడో అప్పుడా కుండలాలని చేత చిక్కించుకొని పరుగు లంకించుకుంటాడు. ఇది చూసిన ఉదంకుడు ఆ తక్షకుడి వెంటపడి అతడిని పట్టుకుంటాడు. వెంటనే ఆ తక్షకుడు మనిషి రూపాన్ని విడిచి, తన అసలు రూపమైన పాముగా మారి, ఒక పుట్టలోకి దూరి కుండలాలతో పాటు పాతాళలోకానికి వెళ్ళిపోతాడు. ఉదంకుడుకూడా వాడి వెంటే ఆ పుట్టలోంచి నాగలోకానికి వెళతాడు. తక్షకుడైతే పాము రూపంలో చకచకా పుట్టలోంచి దూరిపోయి వెళిపోతాడు. మరి మనిషైన ఉదంకుడు ఎలా వెళ్ళగలడు అనే అనుమానం మనకి రావచ్చు. ఇక్కడే నన్నయ్య మితభాషిత్వం మనకి తెలుస్తుంది. ఉదంకుడు ఎలా వెళ్ళగలిగాడో వాచ్యంగా మనకి చెప్పడు. కాని దాన్ని ఇప్పటికే కథలో స్ఫురింపజేసాడు. ఒక్కసారి కిందటి టపాలో మొదట ఉదంకుడి గుఱించిన వర్ణనలో ఏముందో చూడండి. ఉదంకుడు అణిమాది సిద్ధ విద్యలన్నీ నేర్చినవాడు అని అక్కడుంది కదా. కాబట్టి ఆ విద్యలని (అందులో లఘిమ అన్నదొక విద్య. దాన్ని ఉపయోగించి మనిషి ఎంత చిన్నగానైనా మారిపోవచ్చు!) ఉపయోగించి వెళ్ళాడని మనం ఊహించవచ్చు. అరిటిపండు వలిచిపెట్టినట్టుగా ప్రతి చిన్న విషయాన్నీ అనవసరంగా విశదీకరిస్తే అది మంచి కవిత్వం అవ్వదు. పూర్వాపర సంబంధంతో పాఠకుడికి కొన్ని విషయాలని స్ఫురించేట్టు వ్రాసినప్పుడే అది చిక్కని కవిత్వం అవుతుంది.

నాగలోకం చేరిన ఉదంకుడికి నాగజాతి ప్రముఖులందరూ కనిపిస్తారు. వాళ్ళని నాలుగు పద్యాలలో స్తుతిస్తాడు. ఆ నాలుగూ పద్యాలూ నన్నయ్యగారి అద్భుత రచన!

మొదటగా ఆదిశేషుని (అనంతుడని కూడా అంటారు) స్తుతించే పద్యం:

బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు
స్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అ
య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్

ఎన్నో అడవిచెట్లతోనూ (పాదపము అంటే చెట్టు), సముద్రాలతోనూ (అబ్ధి), కులపర్వతాలతోనూ, పూర్ణ సరః అంటే నిండైన సరస్సులతోనూ, సరస్వతీ అంటే నదులతోనూ, సహిత=కూడిన, మహా భూభారాన్ని, అజస్ర=స్థిరమైన, సహస్రఫణాళి=వేయిపడగలతో, దాల్చి, దుస్సహరత=భరింపశక్యము కాని మూర్తి కల విష్ణుమూర్తికి నిరంతరం పాన్పుగా ఉన్న నాగరాజు అనంతుడు, దుష్కృతాంతకుడు=పాపములని అంతమొందించేవాడు, మాకు ప్రసన్నుడు అవుగాక - అని ప్రార్థన.
ఇందులోని పదాల పొహళింపు పాము బుసని ఎలా ధ్వనిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు, అది అనుభవైకవేద్యం. భావంలో కూడా ఆ అనంతుడు ఎంత గొప్ప భారాన్ని మోస్తున్నాడో సార్థకమైన పదాలతో ధ్వనింప చేసాడు నన్నయ్య. విశ్వమంతా వ్యాపించినవాడు విష్ణుమూర్తి. అందుకే అతను దుస్సహతర మూర్తి. ఒక వైపు తన పడగలతో భూభారాన్ని మోస్తూ, మరొక వైపు ఆ దుస్సహతర మూర్తికి పానుపయ్యాడు, అది కూడా నిరంతరమూ! అంతే కాదు అక్కడ విష్ణుమూర్తికి ఉపయోగించిన పదం జాగ్రత్తగా చూడండి. అతను "జలధిశాయి". అంటే సముద్రంలో శయనించేవాడు. కాబట్టి అతని పానుపైన ఆదిశేషువు కూడా సముద్రంలోనే ఉండాలి కదా. ఇంత భారాన్ని మోస్తూ అతనున్నది అస్థితరమైన సముద్రంలో నన్న మాట! అతని పని ఇంకెంత కష్టమో! అహిపతి, దుష్కృతాంతకుడు అనే పదాలు, తనకు వచ్చిన కష్టాన్ని తొలిగించమని సూచించడానికి. అతను నాగరాజు కాబట్టి అతనికా శక్తి ఉంటుంది. పాపాలని పోగొడతాడు కాబట్టి, తన వల్ల దోషమేదైనా ఉంటే పోగొట్టమని. చివరనున్న "మాకు ప్రసన్నుడయ్యెడున్" అనడంలోని బహువచనం దేనికి అని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఇది తెలుగు పలుకుబడి. ఎప్పుడైనా దేవుడిని ప్రార్థించేటప్పుడు "మమ్మల్ని కాపాడు తండ్రీ" అనే అంటాం కాని "నన్ను కాపాడు తండ్రీ" అనడం ఆనవాయితీ కాదు. ఆ "మనం"లో మన కుటుంబం, దేశం, ప్రపంచం కూడా ఇమిడి ఉంది.

మంచి కవిత్వమంటే శబ్దార్థాల మేలికలయిక. దానికి యిలాంటి పద్యాలు మేలి మచ్చుతునకలు.

అనంతుడిని ప్రార్థించిన తర్వాత, ఉదంకుడు వాసుకిని ప్రార్థిస్తునాడు:

అరిది తపోవిభూతి నమరారుల బాధలు వొందకుండగా
నురగల నెల్ల గాచిన మహోరగనాయకు డానమత్సురా
సుర మకుటాగ్రరత్నరుచి శోభిత పాదున కద్రినందనే
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు బ్రసన్నుడయ్యెడున్

అరిది=అపురూపమైన తపశ్శక్తితో రాక్షసుల చేత (అమరుల అరులు అంటే దేవతల శత్రువులు) బాధలు పొందకుండా నాగులందరినీ రక్షించిన గొప్ప నాగనాయకుడు, ఆనమత్=నమస్కరించుచున్న దేవ రాక్షసుల కిరీటాల చివరనున్న రత్నకాంతులచే ప్రకాశించే పాదాలు గల పార్వతీపతికి అలంకారమైనవాడు అయిన వాసుకి మాకు ప్రసన్నుడు కావాలి.

అనంత వాసుకిల స్తోత్రంలో అంతర్భాగంగా హరిహరులని కూడా స్తుతించినట్టయ్యింది!

ఆ తర్వాత ఐరావతుడనే సర్పరాజుని, చివరకి తక్షకుడిని ప్రార్థిస్తాడు ఉదంకుడు. ఎలా ప్రార్థించాడు, ఆ ప్రార్థనకి మెచ్చి ఆ నాగరాజులు ఉదంకుడికి కుండలాలని తిరిగి ఇచ్చేసారా లేదా అనే విషయాలు తర్వాతి టపాలో చూద్దాం.

పూర్తిగా చదవండి...

Friday, January 21, 2011

ఉదంకుడి కథ - 1

"వింటే భారతం వినాలి, తింటే గారలే తినాలి"

మొన్న సంక్రాంతి పండక్కి ఎంచక్కా గారెలు తినడం అయింది! భారతం వినాలంటే ఏ మల్లాదివారో చెపుతూంటేనే వినాలి. వారి భారత ప్రవచనాలు సీడీలుగా వచ్చాయో లేదో తెలీదు, వెతకాలి. అసలు భారతమే "వినిపించబడింది". ఒక్క భారతమనేవి, రామాయణమూ, అష్టాదశ పురాణాలూ కూడా ఎవరో ఎవరికో వినిపించినవే కదా. పూర్వం కావ్యాలు కూడా ఇలా ఒకరు చెపితే పదిమంది వినడమే కాని చదవడం తక్కువే. ఆధునిక కాలంలో చదివే పద్ధతి బాగా వ్యాపించి వినిపించే పద్ధతి వెనకబడింది. టీవీ ఛానళ్ళ ధర్మవా అని అది మళ్ళీ ముందుకొస్తోంది. సరే, అందాకా పుస్తకంలో మల్లిన నరసింహారావుగారు చేస్తున్న మహాభారత పరిచయం చదువుకోవచ్చు. ఆ స్ఫూర్తితోనే భారతంలోని ఉపాఖ్యానాలని మరింత వివరంగా పరిచయం చెయ్యాలనే ఊహ కలిగింది. ఎంతదాకా సాగుతుందో చూడాలి మరి!

భారతంలో అసలు కథతో బాటు కొసరు కథలు మధ్యమధ్యలో చాలానే వస్తాయి. వీటినే ఆఖ్యానకాలని, ఉపాఖ్యానాలని అంటారు. అసలు, భారతం మొదలవ్వడమే ఈ కొసరు కథలతో మొదలవుతుంది. అందులో మొదటగా వచ్చే కథ ఉదంకుడి కథ. అసలు భారతం కథని వైశంపాయనుడు జనమేజయునికి సర్పయాగం సందర్భంలో చెప్తాడు. జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు, అంటే అర్జునుడికి స్వయానా మునిమనవడన్న మాట. జనమేజయుడు సర్పయాగం ఎందుకు చేసేడు అన్నదానికి కారణం ఉదంకుడి కథలో దొరుకుతుంది. ఆ రకంగా భారత కథ చెప్పబడడానికి మూల బీజం ఉదంకుడి కథ! ఈ కథంతా సౌతి (సూతుని కుమారుడు) శౌనకాది మునులకు చెప్తాడు. ఈ ఉదంకుడి కథ చాలా చిత్ర విచిత్రమైనది. పక్కా జానపద సినిమాలాగా ఉంటుంది! సంస్కృత మహాభారతంలో ఇది చాలా పెద్దదిగానే ఉంటుంది కాని నన్నయ్యగారు అనవసరమైన విషయాలని ఎడిట్ చేసి స్థూలంగా సొంపుగా మనకి చెప్పారు. ఒక విశేషం ఏవిటంటే, సంస్కృతంలో ఇది చాలా వరకు గద్యంలోనే సాగుతుంది. కాని తెలుగులో ఎక్కువ పద్యాలలో సాగుతుంది. అంతే కాదు ఎన్నో సొగసైన, ప్రసిద్ధమైన పద్యాలిందులో ఉన్నాయి.

సరే, ఇక అసలు కథలోకి ప్రవేశిస్తే... అననగనగా ఉదంకుడనే (ఉతంకుడని కూడా అంటారు) ముని ఉన్నాడు. అతను పైలముని శిష్యుడు (సంస్కృత భారతంలో వేద ముని శిష్యుడని ఉంది). అతడెలాంటి వాడంటే,

పంకజభవ సన్నిభు డఘ
పంక క్షాళన మహా తపస్సలిలు డనా
తంక మతి పైలశిష్యు డు
తంకుండను మునివరుండు తద్దయు భక్తిన్

పంకజభవుడంటే బ్రహ్మ కదా. అతని సన్నిభుడు అంటే బ్రహ్మవంటి వాడు (బ్రహ్మచారి) అని అర్థం. పాపమనే (అఘము) బుఱదని (పంకము) కడిగి వేయగల (క్షాళన) మహాతప్పస్సనే నీరు కలవాడు. ఎలాంటి శంకలూ లేని మనసు కలవాడు. ఎంతో భక్తితో పైలముని దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. అపరిమిత నిష్ఠాపరుడై గురువుగారికి పరిచర్యలు చేస్తూ, అణిమాది అష్టసిద్ధులతో కూడిన జ్ఞానాన్ని సంపాదించాడు.

విద్య పూర్తయిన తర్వాత గురుదక్షిణ చెల్లించడం అప్పటి ఆనవాయితీ కనక గురువుగారి దగ్గరకి వెళ్ళి ఏ గురుదక్షిణ సమర్పించుకోవాలని అడుగుతాడు. ఆ గురువుగారు, నాకేం అక్కరలేదు కాని నా భార్యకి ఏమైనా అవసరమేమో కనుక్కోమంటాడు. ఆ గురుపత్ని ఉదంకుడిని ఒక వింతైన దక్షిణ కోరుకుంటుంది. పౌష్యుడనే రాజుంటాడు. అతని భార్య కుండలాలు ఒక నాలుగురోజుల్లో తనకి తెచ్చి యిమ్మని అడుగుతుంది. ఆ కుండాలాలకి ఏం మహిమ ఉందో మరి! సరే గురుపత్ని కోఱిక చెల్లించడానికి ఉదంకుడు బయలుదేరుతాడు. అడవి మార్గంలో వెళుతూ ఉంటే మధ్యలో మహోక్షాన్ని (పెద్ద ఎద్దు) ఎక్కి ఉన్న ఒక దివ్యపురుషుడు దర్శనమిస్తాడు. కనిపించి, ఆ వృషభ గోమయాన్ని (పేడని) భుజిస్తే, బయలుదేరిన కార్యం సఫలమవుతుందని చెపుతాడు. ఎవరా దివ్యపురుషుడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. :-) భారతం చదివే పాఠకుడికీ తెలియదు, ఉదంకుడికి కూడా తెలియదు. అయినా అతడు దివ్యపురుషుడిలా కనిపిస్తున్నాడు కాబట్టి, అతను చెప్పినట్టు చేస్తే తన కార్యం సఫలమవుతుందని నమ్మి, ఉదంకుడు ఆ గోమయాన్ని తిని గబగబా పౌష్యుని దగ్గరకి వెళతాడు. వెళ్ళి ఆ రాజుతో వచ్చిన విషయం ఇలా చెప్తాడు:

ఏను గుర్వర్థ మర్థినై మానవేశ!
కడగి వచ్చితి నిపుడు నీ కడకు వేడ్క
దండితారాతి! నీ దేవి కుండలమ్ము
లిమ్ము నా పూన్కి యిది సఫలమ్ము గాగ

గురువుగారి కార్యమై నీ దగ్గరకి అర్థినై వచ్చాను. నీ భార్య కుండలాలు ఇచ్చి నా ప్రయత్నాన్ని సఫలం చెయ్యమని కోరుతాడు. ఇక్కడున్న "గుర్వర్థ మర్థి" అనేది కాళిదాసు ప్రయోగం. వరతంతు ముని శిష్యుడు రఘు మహారాజును గురుదక్షిణ అడిగిన సందర్భంలో అతను కూర్చిన పదం. నన్నయ్య సరిగ్గా అలాంటి సందర్భంలోనే ఆ పదాన్ని తిరిగి ప్రయోగించడం కాళీదాసుమీదున్న గౌరవాన్ని ప్రకటించడానికే అయ్యుంటుంది! ఈ పద్యంలో నాలుగు పాదాల్లోనూ ప్రాస యతినే ప్రయోగించడం గమనించండి. నన్నయ్య సాధారణంగా ఎప్పుడూ, ఒక పాదంలో ప్రాసయతి వాడితే ఆ పద్యం అన్ని పాదాల్లోనూ ప్రాసయతినే వాడతారు.

ఈ పౌష్యుడు కూడా ఆ ముని శిష్యుడే. ఆ మహానుభావునికి వినియోగపడితే అంతకన్నా భాగ్యమేముంది తప్పకుండా తీసుకొమ్మంటాడు. మామూలుగా అయితే సేవకుడిని పంపించో, లేదా స్వయంగా వెళ్ళో భార్య దగ్గరనుండి ఆ కుండలాలని తీసుకువచ్చి ఉదంకుడికి ఇవ్వాలి. కాని ఈ రాజొక తిరకాసు పెడతాడు. ఉదంకుణ్ణే తన భార్య వద్దకు వెళ్ళి స్వయంగా అడిగి తీసుకోమంటాడు! ఉదంకుడు సరేనని అంతఃపురంలోకి వెళతాడు. వెళ్ళి చూస్తే అక్కడ మహారాణి కనిపించదు! అంతటా వెతికినా ఎక్కడా ఉదంకుడికి కనిపించదు. ఇంకేం చేస్తాడు. తిరిగి పౌష్యుడి దగ్గరకి వచ్చి జరిగింది చెప్పి, నువ్వే ఆ కుండలాలని తెప్పించి ఇప్పించని కోరుకుంటాడు.

పౌష్యుడి భార్య ఉదంకుడికి ఎందుకు కనిపించ లేదు? ఆ రాణి అంతఃపురంలోనే ఉందా లేదా? ఆ కుండలాలని రాజు ఇప్పిస్తాడా లేదా ఉదంకుడే తీసుకుంటాడా? ఇదంతా వచ్చే టపాలో చూద్దాం! కాస్త సస్పెన్సు ఉండకపోతే ఎలా.:-)

పూర్తిగా చదవండి...

Friday, January 14, 2011

సంక్రాంతి తలపోతలు

అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటిసారిగా పోస్టుని షెడ్యూల్ చేసాను! అంచేత నిజంగా ఈ భోగీ నాడు ఇది పోస్టవుతుందో లేదో మరి తెలీదు. ఎందుకు షెడ్యూల్ చెయ్యాల్సి వచ్చిందంటే, నేనీ సంక్రాంతికి మా తాతగారి ఊరు వెళుతున్నానోచ్! అంటే పల్లెటూరన్న మాట. అక్కడ కంప్యూటరు ఇంటర్నెట్టు వగైరా ఉండవుగా మరి. సంక్రాంతి పండక్కి ఆ ఊరు వెళ్ళి ఎన్నో ఏళ్ళయిపోయింది. సంక్రాంతి పండుగంటే అది పల్లెటూళ్ళో జరుపుకోవలసిందే.

మా చిన్న్నప్పుడు చక్కగా సంక్రాంతి సెలవలకి కనీసం ఓ వారం రోజులకైనా వెళ్ళేవాళ్ళం మా తాతగారి ఊరికి. మా చిన్నాన్నల కుటుంబాలు, అత్తయ్య కుటుంబం అందరమూ కలిసేవాళ్ళం. ఇంక సందడే సందడి. పెద్ద మండువా ఇల్లు. ఎంతమంది వచ్చినా ఇరుకనిపించేది కాదు. ఇంటిముందు ఖాళీ జాగాలో ఒక పెద్ద చెట్టు, రకరకాల మొక్కలు. పెద్ద పెద్ద ఎత్తైన విశాలమైన అరుగులు. వాటికానుకొని వీథి చావిడి. ఆ చావిడిలో ఒక పక్క రెండు పెద్ద కఱ్ఱ బల్లలు. మరొక పక్క పెద్ద పడక్కుర్చీ. అందులో మా తాతగారు కూర్చునేవారు. తెల్లని పంచె, నుదుటన విభూది, మధ్యలో నామం. మా ఇద్దరు తాతగార్లు ఒకరేమో సంప్రదాయానికీ మరొకరూ ఆధునికతకూ నిలువెత్తు నిదర్శనంలా ఉండేవారు. వారి గురించి మరోమారు వివరంగా. ఈ తాతగారు ఆయుర్వేద వైద్యులు. చావిడిలోనే ఒక పక్కగా రెండు పెద్ద పెద్ద కల్వాలుండేవి, మందులు నూరడానికి. ఆ చావిడే మా తాతగారి ఆసుపత్రి. చావిడి చెరో వైపు రెండు చిన్న చిన్న గదులు, ధాన్యం వగైరా సరుకులుండేవి. చావిడి దాటి లోపలకి వెళితే ఒక పెద్ద గది. రెండువైపులా రెండు పెద్ద అల్మారాలు. అందులో ఆయుర్వేదానికి సంబంధించిన బోలెడన్ని పుస్తకాలు. తాళపత్ర గ్రంథాలు కూడా ఉండేవి! ఆ గది దాటి వెళితే వసారా. ఈ పెద్ద గదికి అటు ఇటూ రెండు పడక గదులు. ఈ మూడు గదులను కలుపుతూ ఆ వసారా. అది దాటగానే ఇంటి మధ్య మండువా. దానికొక వైపుగా డాబా మీదకి మెట్లు. మండువా దాటగానే మరొక వసారా. ఆ వసారాలో ఇనప గొలుసులతో పెద్ద చెక్క ఉయ్యాల. కనీసం ఒక నలుగురు పెద్దవాళ్ళు కూర్చుని ఊగవచ్చు! ఆ వసారా దాటగానే మధ్యలో మరొక హాలు. ఎడంవైపు మరొక పడగ్గది. కుడివైపు దేవుడి గది. ఆ హాలు దాటాక ఒక వరండా. దానికి కుడివైపున వంట గది. ఎడం వైపున చిన్న కొట్టు గది. ఆ వరండా కిందకి దిగడానికి మెట్లు. ఆ మెట్లు దిగితే పెద్ద పెరడు. ఎదురుగ్గా మధ్యలో తులసి కోట. పెరడంతా చెట్లు, మొక్కల మయం! కుడిపక్కగా పెద్ద గట్టు, గట్టు మీద బావి. దానికానుకొని నీళ్ళు నింపడానికి కుండీ. బావి గట్టుకానుకొని కిందన నీళ్ళ పొయ్యి. పెరట్లోనే ఒక పక్కకి వెనకగా ఆడవాళ్ళకి స్నానాల గది. ఇల్లంతా భూమికి ఒక అయిదడుగుల ఎత్తులో ఉండేది! ఇంటి చుట్టూ పెరడే!

పండగకి కనీసం మూడు రోజులముందైనా వెళ్ళేవాళ్ళం! తెల్లవారుఝాము నాలుగ్గంటలకి దేవుని భజనలతో ఊరేగింపు వచ్చేది. అది వస్తే ఇక లేవాల్సిందే! అప్పటికే కళ్ళాపి జల్లేసేవారు. వాళ్ళు వచ్చి వేళ్ళాక ముగ్గులు మొదలుపెట్టేవారు. పెద్ద పెద్ద ముగ్గులు! రకరకాల ముగ్గులు! సరే ఇక భోగీనాడు చెప్పేదేవుంది, నాలుగ్గంటలకే భోగిమంట వెయ్యడం ప్రారంభం. అబ్బో ఆ మంట ఒక రెండు మనుషుల ఎత్తుకి వెళ్ళేది! దాని దగ్గర కూర్చుంటే ఇక చలి గిలి జాంతానై. మెల్లిగా అయిదు అయిదున్నర దాకా అక్కడ గడిపి, ఆ తర్వాత స్నానాలు. పండగ స్నానాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సుబ్బరంగా ఒంటికంతా నూనె పట్టించి, ఆ తర్వాత నలుగు పిండి రాసి, కాస్త ఆరాక దాన్ని బలంగా నలచడం. ఇలా రెండు మార్లు నలిచేవారు. ఇదంతా చెయ్యడానికి ఒకతను వచ్చేవాడు. బలిష్టంగా ఉండి అతను నలుగు పెడుతూంటే అబ్బో! ఒళ్ళంతా రక్తం జఱ్ఱు జఱ్ఱున పాకేది! అలా నలుగు పెట్టించుకున్న తర్వాత వేడి వేడి నీళ్ళతో మా అమ్మో అత్తయ్యో ఒకరు కుంకుడు పులుసు పోస్తూంటే మరొకరు తల రుద్దేవారు. ఆ తలంటు కార్యక్రమం అయ్యేసరికి ఒళ్ళు గాల్లో తేలిపోయేది. అప్పుడెంచక్కా కొత్తబట్టలు వేసుకొని, పెద్దవాళ్ళందరికీ దణ్ణాలు పెట్టి, ఆశీర్వాదాలందుకొని, పండగ కట్నం దండుకొని, వేడివేడి ఇడ్లీలు లాగించి, ఆపైన ఆటలే ఆటలు! నేలాబండో, డీఫాటో, ఇంటి ముందు జాగాలో క్రికెట్టో. పెద్దవాళ్ళందరూ కూర్చొని చతుర్ముఖపారాయణం మొదలుపెట్టేవారు. కొంత సేపు వాళ్ళ దగ్గర కూర్చుని ఎవరెలా ముక్కలు సర్దుతున్నారు, ఎలా కలుపుతున్నారు, ఎలా ఆడుతున్నారు పరిశీలించడం. మా తాతగారు ఆడేవారు కాదు కాని మా నాయనమ్మ ఆడేది. ఆవిడ పేకలు పట్టుకొనే తీరు చాలా విచిత్రంగా ఉండేది. పక్కవాళ్ళు చూసినా ఏమీ అర్థమయ్యేది కాదు! మధ్యాహ్నమయ్యేసరికి ఘుమ ఘుమలాడే విందుభోజనం తయార్. భోజనాలయ్యాక నాలుగవుతోందనగా ఎవరింట్లో అయినా భోగిపళ్ళ వేడుక ఉంటే వెళ్ళడం. లేదా అలా రామాలయానికో, తోటలోకీ షికారు. రాత్రి ఫలహారాలు వేగిరం ముగించుకొని, మళ్ళీ పెద్దవాళ్ళు చతుర్ముఖపారాయణం మొదలుపెట్టేవారు. లేదంటే ఏవో పిచ్చాపాటీ కబుర్లు. రాత్రి ఎనిమిదిన్నర అయ్యేసరికల్లా పడకలే. వేసంకాలంలో అయితే డాబా మీద పడుకొనేవాళ్ళం కాని సంక్రాంతికి చలికదా అంచేత వసారాల్లో వరసగా బొంతలు పరిచేసేవారు. పెద్దలూ పిల్లలూ అందరూ అక్కడే. ఇలా పండగ నాలుగురోజులూ అసలు సమయం తెలియకుండా గడిచిపోయేది! ముక్కనువునాడు అనుకుంటా ఊరి బయట పెద్ద తిరనాళ్ళు జరిగేవి. అదో సంబరం.

ఆ యిల్లింకా అలాగే ఉంది. వెళ్ళడానికి మాకే తీరిక లేకుండా పోయింది! ఎప్పుడో అడపాదడపా ఒక్కరోజుకి వెళ్ళి వచ్చెయ్యడమే.

నా నాస్టాల్జియాలో పడి పద్యాల సంగతి మరిచే పోయాను! ఎప్పుడో నలభైలలో భారతి పత్రికలో వచ్చిన శ్రీ పాలెపు వెంకట రత్నంగారి ఈ సంక్రాంతి పద్యాలు మీ కోసం. ఈ కవిగారు కూడా నాస్టాల్జియాలో పడ్డారేమో అనిపిస్తుంది పద్యాలని చదివితే. కాని అప్పుటి పరిస్థితులు ఇప్పటికన్నా మెరుగ్గానే ఉండేవేమో! అసలు పరిస్థితులెలా ఉన్నా, పండగనాడైనా కొంచెం మంచి మాటలు చెప్పుకోవడం శుభప్రదం కాబట్టి వారు వర్ణించిన ఆనాటి పల్లెటూరి సంకురాతిరి శోభను మీరు కూడా ఊహించుకొని ఆనందించండి.

పౌషశ్రీ

ఒక ప్రాభాతికవేళ శీత ఘన బాధోద్వృత్తి నే సాలువా
సకలాంగంబులకున్ ముసుంగిడి సుఖాశన్ సుప్తినుండంగ "గొ
క్కొకురోకో" యని తామ్రచూడవర మాఘోషింప కన్విచ్చి, లే
చి కనుంగొంటి మనోజ్ఞ పౌష ప్రకృతిశ్రీ చిద్విలాసాకృతిన్

పచ్చనై కనుపట్టు భవ్యశాద్వలతలిన్ జాలుగా మంచుముత్యాలు చేరె
అరవిచ్చు చేమంతి విరిసోయగము మెచ్చి భ్రమరాళి వలగొని పాటపాడె
ముంగిళ్ళ జెలువాఱు రంగవల్లికలలో బంతి గొబ్బెమ్మలు పాదుకొనిరి
ప్రక్కవీథిని పాటపాడు సాతానిజియ్యరు కాలి చిఱుగజ్జియలు నదించె

గొబ్బితట్టెడు బాలికాకోమలాస్య
జనిత మృదుహాసలహరులు సంచరించె
బొలము చాయల వినిపించె బొలియగాని
గూర్చి పాడుచు గుప్పల నూర్చు సద్దు

ధవళాద్రి నిర్మలత్వము ధిక్కరించు నీ వెల్లపూసిన యిండ్ల తెల్లదనము
లక్ష్మీనివాస విలాసంబులం దెల్పు పసుపుగుంకుమల నొప్పెసగు గడప
లలరుదండల కాంతులొలుకబోసినవి సుందరశిల్పముల నొప్పు ద్వారసమితి
కమనీయ హేమ నిష్క సమాన కాంతుల ధాన్యరాసులతోడ దనరె బంచ

లెంత సౌభాగ్యసౌందర్యవంతురాల
వమ్మ! ఆగర్భధనవంతురాల పౌషి!
నీ విమల దివ్యతర కమనీయ సుషమ
కవి హృదయసీమ శతరత్న కాంతి నించె

చిన్నబావ ప్రయాణసన్నాహ మొనరింప మఱదలు చేసంచి మాటుపఱిచె
చీరపై జలతారు చారలు లేవని పుత్రిక నాన్నపై మోము ముడిచె
విందువంటకు సగ్గుబియ్యమేవీ యని వెలది నాథునితోడ విరసమాడె
చాటుగా మగనితో మాటలాడిన యాడబడుచు వధూనిక పరిహసించె

కృషి ఫలింపగ మంచి జోడెడ్లు కాడి
మేడి హలమును రైతు ప్రేమించి కొలిచె
సకల సౌభాగ్యకల్యాణ సదనమైన
స్వర్ణ సంక్రాంతి కాంతులు జగతి వరలు


పూర్తిగా చదవండి...