తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, May 25, 2008

అటజని కాంచె...


అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం.


నిజానికి మనుచరిత్ర మనుచరిత్ర కాదు - మను సంభవ చరిత్ర, "స్వారోచిష మను సంభవము". మనువుల్లో ఒకడైన స్వారోచిషుడి జన్మ వృత్తాంతం. అయితే మనుచరిత్ర అనగానే గుర్తొచ్చేది వరూధినీ ప్రవరాఖ్యులు. వీళ్ళకీ ఆ స్వారోచిష మనువుకి ఉన్న సంబంధం యేమిటి? ఆ మనువు నాన్నమ్మ వరూధిని! అల్లసాని అక్కడనుంచి ప్రారంభించాడు కథని. ఆ భాగాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాడంటే, అదే అసలు కథేమో అన్నంతగా ప్రచారం పొందింది. ఇదొక తమాషా అయిన కథ. ఇంతకీ ప్రవరుడెవరయ్యా, ఆ మనువు తాతగారేనా అంటే, కాదు. ఒక రకంగా అవును! అందికే ఇది విచిత్రమైన కథ అయ్యింది. అసలిదొక allegorical story అని నాదొక సిద్ధాంతం ఉంది. దాని గురించి మరెప్పుడైనా ముచ్చటించుకుందాం.
ప్రస్తుతానికి వస్తే, ప్రవరుడి ఊరు అరుణాస్పదపురం. అతను "ఆ పురి బాయకుండు", అంటే ఆ ఊరిని విడిచి ఎప్పుడూ వేరే ఊరికి వెళ్ళలేదు! అదేంటి, మరీ బొత్తిగా ఏ పెళ్ళికో పేరంటానికో అయినా పొరుగూరు వెళ్ళి ఉండడా అంటే అలా కాదు. వేరే ఊళ్ళో ఉద్యోగానికి కానీ touristగా చూడ్డానికి కానీ ఎప్పుడూ వెళ్ళలేదని. కానీ యాత్రలు చెయ్యాలనే కోరిక మాత్రం ఉంది. యాత్రలంటే ప్రణయ యాత్రలో విహార యాత్రలో అనుకునేరు! తీర్థ యాత్రలు. మరి ఆ రోజుల్లో ఇప్పట్లా విమానాలూ అవీ లేవాయె, ఉన్నాయనుకొన్నా మానవులకి మాత్రం అందుబాటులో లేవాయె. తీర్థయాత్రలు చెయ్యడమంటే మాటలా మరి? కాబట్టి అతని కోరిక కోరికగానే ఉండిపోయింది. ఒక రోజు అనుకోకుండా ఓ సిద్ధుడు అతనింటికి వచ్చి, "నేను భూమంతా చుట్టేసాను, ఇది చూసాను అది చూసాను" అని ఓ చెప్పేసరికి, పాపం ఈ ప్రవరుడికి కోరిక మరింత పెరిగిపోతుంది. ఎదోలాగ అతని దగ్గరనుంచి ఒక పాద లేపనం సంపాదిస్తాడు. సంపాదించిందే తడవుగా హుటాహుటిని హిమాలయాలకి బయలుదేరేస్తాడు, ఇంట్లో చెప్పకుండానే! మొదటిసారిగా, ఊరిని కూడా విడిచి వెళ్ళని ఆ ప్రవరుడు, హిమాలయాలని చూసినప్పుడు అవి ఎలా కనిపించాయో చెప్పే వర్ణన ఈ పద్యం.

"శిరస్-సరజ్-ఝరీ" అన్నప్పుడు పైనుంచి కిందకి దూకే సెలయేళ్ళూ, "ముహుర్-ముహుర్-లుఠత్" అన్నప్పుడు ఆ సెలయేటి నీళ్ళు రాళ్ళకి తాకే సవ్వడీ, "అభంగ తరంగ మృదంగ" అన్నప్పుడు అవి చేసే మృదంగ నాదం, ఇవన్నీ మనకి కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇలాటి రచననీ ఇంగ్లీషులో Onomatopoeia అంటారు. పదాలకుండే శబ్దాలు, వాటి అర్థాన్ని ప్రతిధ్వనించడం అన్నమాట. దీనినే "వికట కవిత్వం" అంటారని యు.ఎ.నరసింహమూర్తిగారు "కవిత్వ దర్శనం" అన్న పుస్తకంలో ప్రతిపాదించారు.

కిందటిసారి అన్నాను, వర్ణనలు సాధారణంగా కథలో విశ్రాంతి కోసం ఉంటాయని. ఇది అలాటి వర్ణన కాదు. ముఖ్య కథాభాగానికి ముఖ ద్వారం లాంటిది ఈ పద్యం. ఇది మనుచరిత్రలోని రెండవ ఆశ్వాసం(chapter) మొదట్లో వస్తుంది. ఆ ఆశ్వాసం మాంచి రసవత్తరంగా సాగే కథా భాగం, కథలో ముఖ్యమైన సంఘటనలు జరిగే భాగం. ఇందులో వరూధిని వాక్చాతుర్యం అమోఘంగా ఉంటుంది. వాటిల్లో ఉన్న సారం మాట ఎలా ఉన్నా, ఆ మాటలు మనలని మంత్రముగ్ధులని చేస్తాయి. ఈ పద్యమూ అంతే! ఇందులో అర్థం ముఖ్యం కాదు. పదాలూ, పదాల పొహళింపూ, శబ్ద సౌందర్యం, ఇవన్నీ మనలని మంత్రముగ్ధులని చేస్తాయి!
శబ్దం ప్రధానమైన ఇలాటి కవిత్వం అన్ని చోటలా అందాన్నివ్వదు. ఎక్కువైతే అజీర్తి చేస్తుంది కూడా! దీన్ని తగిన సందర్భంలో తగిన పాళ్ళలో వాడేడు కాబట్టే పెద్దన ఆంధ్రకవితా పితామహుడయ్యాడు. మనుచరిత్రలో ఇలాటి పద్యాలని మనం ఈనాటికీ ఆనందిస్తున్నాం. ఇది యెక్కువైన ఇతర ప్రబంధాలూ, వాటిని రాసిన కవులూ మరుగునపడిపోయారు.
ఈ పద్యంలో ఛందస్సుకి సంబంధించిన విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ పద్యాన్ని చంపకమాలలో ఎందుకు రాసుంటాడు పెద్దన అని ఆలోచిస్తే, "అటజని కాంచె" అన్న ప్రారంభం కోసం అని అనిపిస్తుంది. మొదటి నాలుగు లఘువులూ ఆ వెళ్ళడంలోని వేగాన్ని సూచించడం లేదూ! ఇక మొదటి పాదంలో "అంబర చుంబి" దాకా చంపకమాల నడకతో సాగిన పద్యం, హఠాత్తుగా "శిరస్సరజ్ఝరీ" (తడక్-తడక్-తడక్) అన్న నడకలోకి మారిపోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చంపకమాలతో ఇలాటి నడక సాధించవచ్చా అనిపిస్తుంది. అలానే రెండవ పాదంలో "అభంగ తరంగ మృదంగ" (తధింత-తధింత-తధింత) అన్న నడకకూడా!
ఇక ఇందులోని అర్థం విషయానికి వస్తే - "అటజని కాంచె భూమిసురుడు". ఏమిటి చూసాడు? "శీతశైలమున్" - హిమాలయాన్ని. ఎలాంటిదా హిమాలయం అన్నది మొత్తం పద్యం, రెండు పొడవైన సమాసాలు!
"అంబర చుంబి శిరః" - ఆకాశాన్ని ముద్దాడుతున్న శిఖరాలనుండి, "సరత్ ఝరీ పటల" - ప్రవహిస్తున్న సెలయేళ్ళ (జలపాతాల) గుంపులో, "ముహుర్ ముహుర్ లుఠత్" - మాటిమాటికీ దొరలుతున్న, "అభంగ తరంగ మృదంగ" - ఎడతెగని తరంగాలనెడి మద్దెలలు చేసే, "నిస్వన స్ఫుట నటన అనుకూల" - ధ్వనికి తగినట్లు నాట్యం చేసే, "పరిఫుల్ల కలాప" - విప్పారిన పింఛం కలిగిన, "కలాపి జాలమున్" - నెమళ్ళ గుంపుతో కూడినది. ఆకాశాన్నంటే పర్వత శిఖరాలనుంచి కిందకి ఉరుకుతున్న జలపాతాల తరంగాలు అనే మృదంగాలు చేసే ధ్వనికి అనుకూలంగా పురి విప్పి నాట్యం చేస్తున్న నెమ్మళ్ళ గుంపుతో ఉన్నది ఆ హిమాలయం. ఈ వర్ణనలో గొప్పతనం ఏమిటంటే, కవి హిమాలయ శిఖరాలనీ, జలపాతాలనీ, నెమళ్ళనీ అన్నిటినీ ఇక్కడ చిత్రించాడు. ఏదో వేరే వేరేగా చూపెట్టడం కాకుండా వాటన్నిటినీ చక్కగా లింక్ చేసాడు. అదీ కవి ఊహ అంటే! ఇంతకన్నా గొప్ప విషయం మరోటి ఉంది. నెమళ్ళు సాధారణంగా పురివిప్పి యెప్పుడాడతాయి? ఉరుముల శబ్దం విన్నప్పుడు, వాన పడేటప్పుడు. ఇక్కడ ఈ జలపాతాలు చేసే శబ్దానికి నాట్యం చేస్తున్నాయంటే, ఆ జలపాతాల హోరు మేఘ గర్జనలా ఉందన్నమాట! శిఖరాలు ఆకాశమంత యెత్తున్నాయి కాబట్టి, ఆకాశంలోని మేఘాలే వర్షిస్తున్నట్లుగా ఆ జలపాతాలున్నాయన్న మాట! ఇవేవీ పద్యంలో సూటిగా చెప్పలేదు, స్ఫురింప చేసాడు! దీనినే మనవాళ్ళు "అలంకార ధ్వని" అంటారు.
ఒక విషయాన్ని చెప్పకుండా చెప్పడమూ, చూపించకుండా చూపించడమే కదా కవిత్వమంటే!
ఇక, అక్కడ నెమళ్ళే కాక ఏనుగులు కూడా ఉన్నాయి. "కటక చరత్" - ఆ పర్వతాల మధ్యలో తిరిగే, "కరేణు కర" - ఏనుగుల తొండాల చేత, "కంపిత సాలము" - కదిలించి వెయ్యబడ్డ చెట్లు కలది, ఆ హిమాలయం. ఇక్కడకూడా కవి మనకి ఒక still photograph కాకుండా videoని చూపిస్తున్నాడు. ఏనుగులని మాత్రం చెప్పి ఊరుకుంటే అది still photograph అయి ఉండేది. అవి కదిపి కుదిపేస్తున్న చేట్లని కూడా చూపించి దీన్ని videoగా మార్చాడు అల్లసాని.
ఇదే "అల్లసానివాని అల్లిక జిగిబిగి"!


పూర్తిగా చదవండి...

Sunday, May 18, 2008

తరుణి ననన్యకాంత...


మొన్నీ మధ్య కొత్త రాయలవారు అల్లసాని ప్రసక్తి తెచ్చేసరకి మనసు మనుచరిత్ర మీదకి మళ్ళింది. కాస్త రసాస్వాదన చెయ్యాలనిపించింది. మనుచరిత్ర అనగానే "అటజని కాంచె..." కన్నా కూడా ముందు నాకు గుర్తొచ్చే పద్యం ఇది.

తరుణి ననన్యకాంత నతిదారుణ పుష్పశిలీముఖ్యవ్యధా
భర వివశాంగి నంగభవు బారికి నగ్గము జేసి క్రూరుడై
యరిగె మహీసురాధము డహంకృతితో నని రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చె గషాయ ధీధితిన్


వరూధిని love at first sightని తిరస్కరిస్తాడు ప్రవరుడు. ఇద్దరికీ మంచి రసవత్తరమైన వాదన జరుగుతుంది. కానీ ప్రవరుడు చలించడు. తన నిష్ఠతో అగ్నిదేవుణ్ణి ప్రార్థించి తనదోవన తను వెళ్ళిపోతాడు. వరూధిని విరహంతో వేగిపోతూ ఉంటుంది. అంతలో పొద్దువాలుతుంది. సూర్యాస్తమయం. దాన్ని వర్ణించే పద్యం ఇది!
మనం ఈ కాలంలో కూడా నవలల్లోనూ కథల్లోనూ వర్ణనలు చూస్తూనే ఉంటాం. ఈ వర్ణనలు చేసే ముఖ్యమైన పని, కథా వేగంలో కొట్టుకుపోతున్న పాఠకులకి కాస్త విశ్రాంతినివ్వడం, ఈ కాలంలో టీవీ సీరియళ్ళ మధ్య విరామంలా :-) వీటిని కథలో కాలాన్నీ, స్థలాన్ని సూచించడానికి కూడా వాడుతూ ఉంటారు. ఉదాహరణకి ఎండాకాలం వచ్చిందని చెప్పేబదులు, "పగటి వేడి చల్లారక సెగలుకక్కే భూమి అనే పెనం మీద చకోరాలకోసం ప్రకృతిమాత వెన్నెల అట్టుని పోసింది" అంటే ఒకవైపు ఎండాకాలాన్ని సూచిస్తూనే, గొప్ప చమత్కారం మనసుకి హత్తుకుంటుంది కదా! ఇదీ వర్ణనల ఉపయోగం.
అయితే చాలాసార్లు ఇవి తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుంటాయి. వర్ణనలకీ, కథకీ సంబంధం ఉండదు. కొన్ని సార్లు కవి ప్రతిభ చేత వర్ణనలని కథోచితంగా చేస్తాడు. అప్పుడు కథ మరింత బాగా మనసుకి హత్తుకుంటుంది. ఇది అలాటి పద్యం!
సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎఱ్ఱగా ఉన్నాడు. ఎందుకలా ఉన్నాడంటే కోపంతో అతని మొహం ఎఱ్ఱబడిందిట. ఎవరిమీద ఎందుకా కోపం అంటే, వరూధినిని అలా వదలి వెళ్ళిపోయిన ప్రవరుడి మీదట!
ఇక్కడ సూర్యుణ్ణి అడ్డంపెట్టుకొని పెద్దన ప్రవరుడి మీద తన కోపాన్ని ఘాటుగా వ్యక్తం చేసాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాటి సందర్భాలలోనే కవిహృదయం తెలిసేది! కథలో పాత్రగా ప్రవరుడిని ఉదాత్తంగానే చిత్రించాలి, లేకపోతే కథ చెడుతుంది. అలా చెయ్యాలంటే ప్రవరుడు వరూధినిని తిరస్కరించాలి. కానీ అది రసికుడైన అల్లసానికి ఇష్టం లేదు. ఏం చేస్తాడు పాపం! అంచేత సూర్యుడి మీద తోసాడు. సూర్యుడలా అనుకున్నాడనడంలో ఎంత చమత్కారం, పైగా అందుకే అతని మొహం ఎఱ్ఱగా ఉందనడం! ఔచిత్యం చెడకుండా, తన హృదయాన్ని వ్యక్తపరుస్తూ, పాఠకునికి చమత్కారాన్ని పండించడం గొప్ప కవిత్వమే కదా.

అయితే ఈ పద్యం తాలూకు గొప్పదనం ఇక్కడితో ఆగిపోదు. ఇందులో ప్రతిపదం ఎంతో సార్థకంగా ప్రయోగించాడు కవి. వరూధినికి వాడిన పదాలు చూడండి - తరుణి - లేత యవ్వనంలో ఉన్న స్త్రీ, అననన్య కాంత - వేరొకరిని వరించలేదు, తననే వరించిందాయెను, అతి దారుణ పుష్ప శిలీముఖ వ్యథాభర వివశాంగి - శిలీముఖం అంటే బాణం. పుష్ప శిలీముఖుడు మన్మథుడు. అతి దారుణమైన మన్మథ బాధతో వశంతప్పిన శరీరం కలది! అలాంటి వరూధినిని ఆ మన్మథుడికి అధీనం చేసేసి క్రూరుడై తనదారిని తాను పోతాడా ఆ బ్రాహ్మణాధముడు! అని తీవ్రమైన కోపాన్ని పూనాడా అన్నట్టుగా ఉన్నాట్ట సూర్యుడు. పెద్దనకి ఎంత ధైర్యం ఉంటే ప్రవరుడంతటి వాణ్ణి పట్టుకొని బ్రాహ్మణులలో అధముడు అని అనగలడు? ఇది ఒక రకంగా పెద్దన కాలంనాటి సాంఘిక పరిస్థితులని కూడా సూచిస్తుంది. నిష్ఠాచారాలకన్నా భోగాలపై ప్రజలకి ఎక్కువ మక్కువ ఆ కాలానికే మొదలయ్యి ఉంటుంది. ఈ కాలంలో ఇదే కథ సినిమాగా తీస్తే ప్రవరుడు వరూధిని కోరికని మన్నిస్తే కాని సినిమా హిట్టవ్వదు:-)
"రోష భీషణ స్ఫురణ" - ఇక్కడ "ష"కార "ణ"కార ఆవృత్తి క్రోధాన్ని స్ఫురింపజేస్తాయి. అలాగే ఎఱ్ఱ రంగుకి వాడిన "కషాయ" అన్న పదం కూడా. ఈ పద్యంలో మొదటిపాదంలో యతి స్థానంలో "దారుణ" అన్న పదం చక్కగా ప్రయోగించాడు పెద్దన. యతి స్థానాన్ని సాధారణంగా కొంచెం వత్తి పలకడమో, దీర్ఘం తీసి పలకడమో చెయ్యాలి, పద్యాన్ని చదివేటప్పుడు. ఇక్కడ "దారుణ"ని సాగదీసి పలికినప్పుడు అది ఎంత దారుణమో స్ఫురిస్తుంది. అలానే మూడవ పాదంలో "అహంకృతి" అన్న పదంలో యతిస్థానంలోని "హం"ని వత్తి పలకడం వల్ల ఆ సూర్యుడి కోపం స్ఫురిస్తుంది!
శబ్దశక్తి తెలిసిన కవులు దాన్ని భావానుకూలంగా ఉపయోగించుకుంటారనేందుకు ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ.

మాకు ఇంటరు తెలుగులో - మనుచరిత్రలో అప్పటి సామాజిక పరిస్థితుల చిత్రణ గురించి ఒక పాఠం ఉండేది. అందులో ఉండేదీ పద్యం. ఇంటరులో ఎక్కువ మార్కులువచ్చే సంస్కృతాన్ని కాదని తెలుగు తీసుకున్నందుకు, మా అదృష్టం కొద్దీ చాలా మంచి లెక్చెరరు వచ్చారు, సూర్యారావు గారని. అతనికి తెలుగు భాషా సాహిత్యాలమీద మంచి అభిమానం. విద్యార్థుల నాడి తెలుసుకొని పాఠం చెప్పగలిగే నేర్పు ఉండేది. నాకు తెలుగు మీద అభిమానం ఎక్కువ అవ్వడానికి అతనుకూడా ఓ ముఖ్యకారణమే!
గురుభ్యోన్నమః /\


పూర్తిగా చదవండి...

Saturday, May 10, 2008

కరుణమూర్తి


ఈ ప్రగాఢ నిగూఢ మధ్యేనిశీథి
గడియ కదలించుచున్న సవ్వడి యిదేమి?
ఇప్పు డంతఃపురమ్మునం దెవరు వీరు
మూసియున్నట్టి తలుపులు దీసినారు?


తెర తొలగ ద్రోసికొని యేగుదెంచుచున్న
ముగ్ధ మోహన కారుణ్యమూర్తి యెవరు?
అందములు చిందు పున్నమ చందమామ
కళ దరుగదేమి కాలమేఘాలలోన?

నిండు గుండెలపై వ్రాలి నిదురపోవు
ఏ హృదయదేవి పావన స్నేహమునకు
ద్రోహ మొనరించి ప్రక్కకు త్రోసిపుచ్చి
వచ్చెనో కాక - వదన వైవర్ణ్యమేమి?

నమ్మి జీవన సర్వస్వ మమ్ముకొన్న
ప్రణయమయి శాశ్వత ప్రేమ బంధములను
త్రెంపుకొని బయటపడు ప్రయత్నింపులేమొ
తడబడుచు కాళ్ళు గడపలు దాటవేమి?

ఒడలు తెలియక ప్రక్కపై బడి, యనంత
మోహన స్వప్న లోకాలలో హసించు
ముద్దుపాపాయి చిఱునవ్వు ముత్తియములు
దొరలుచున్నవి వాలు కందోయి తుదల!

గేహమే వీడలేకనో; గృహిణితోడి
స్నేహమే వీడలేకనో; శిశువుమీది
మోహమే వీడలేకనో; సాహసించి
దేహళిని దాట నింత సందేహపడును?

ప్రణయ భాగ్యేశ్వరీ బాహుపాశ మట్లు
జారిపోలేక ముందుకు సాగనీక
వెంట జీరాడుచు భుజమ్ము నంటి వచ్చు
నుత్తరీయాంచలము చక్కనొత్తడేమి?

కేలుగవ సాచి ఆర్ద్ర నేత్రాలతోడ
మెట్టుమెట్టుకు పాదాల జుట్టుకొనెడి
ప్రేయసీ కల్పనా ప్రతిబింబ శత స
హస్రముల గాంచి నిస్తబ్దుడగుచు నిలుచు!

పడియు ముందుకు, వెనుకకే ప్రాకులాడు
ప్రభువు చరణాలు స్ఫటిక సోపాన పంక్తి
గాలికెదురుగ సెలయేటి జాలులోన
పయనమగు రాజహంస దంపతుల భంగి

ఆ మహోన్నత భర్మ హర్మ్యాల దిగుట
ఏ మహోన్నత సౌధాల కెక్క జనుటొ!
ఈ వన విహారములు త్యజియించి చనుట
ఏ నవ విహారములు సృజియించుకొనుటొ!

లలిత లజ్జావతీ లాస్య లాలనములు
కనెడి కన్నులు సత్య నర్తనము కనెనొ!
శ్రీ చరణ మంజు మంజీర శింజితములు
వినెడి వీను లంతర్వాణి పిలుపు వినెనొ!

మినుకు మినుకున గుడిసెలో కునుకుచున్న
దీపమంపిన దీన సందేశమేమొ
స్వర్ణశాలలపై భ్రాంతి సడలి, జీర్ణ
పర్ణశాలల మార్గమ్ము పట్టినాడు!

ఆపుకొనలేని హృదయమ్ము నదిమిపట్టి
దూరమగుచుండె ప్రభువు సంసారమునకు
శ్రీయు, శ్రీమతియు, చిరంజీవి లేని
ఈ మహానిష్క్రమణ కర్థ మేమి కలదొ!

కాంతిలోనుండి కటిక చీకటులలోన
కలసిపోవుచునున్నాడు కరుణమూర్తి!
కటిక చీకట్లలోనుండి కాంతిలోన
పతితపావనుడై బయల్పడగ నేమొ!!

ఇవి "ఉదయశ్రీ" పుస్తకంలోని "కరుణమూర్తి" ఖండికలోనివి. ఒక్క పద్యం రాద్దామని మొదలుపెట్టి, ఒకరెండు పద్యాలు రాద్దామనుకొని, ఇలా అన్ని పద్యాలూ రాయకుండా ఉండలేకపోయాను! నా అభిమాన కవి కరుణశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు. నాకు పద్యమంటే అమితమైన ప్రీతి కలగడానికి కారణం అతని పద్యాలే.

అప్పటికి నేను ఘంటసాల పుష్పవిలాపం వినలేదు. మా అమ్మమ్మ పాడే "ఎలుక గుఱ్ఱము మీద నీరేడు భువనాలు పరువెత్తి వచ్చిన పందెకాడు, నల్లమామా యంచు నారాయణుని పరియాచకాలాడు మేనల్లు కుఱ్ఱ..." మొదలైన వినాయకుని మీద పద్యాలు చిన్నప్పుడు విన్నాను. తొమ్మిదో తరగతిలో "బుద్ధదేవుని పునరాహ్వానం" అన్న పాఠం ఉండేది, కరుణశ్రీ గారిది. అందులో పద్యాలు చదువుతూ ఉంటే, ఒక గొప్ప అనుభూతి! అప్పుడింట్లో ఉన్న ఉదయశ్రీ పుస్తకం చూసాను. ఇప్పటికా పుస్తకం ఎన్ని మార్లు చదివుంటానో! అతని పద్యాలు చదువుతూ ఉంటే, తియ్యని మావిడిపండు రసం జుఱ్ఱుకుంటున్నట్టే ఉంటుంది. చదవడమంటే మనసులో చదువుకోడం కాదు. నోరారా గొంతెత్తి, పక్కవాళ్ళ గురించి పట్టించుకోకుండా, మనకి వచ్చిన రాగంలో పాడుకోడం.
లోతైన కవిత్వాన్ని గురించి వెతికే వాళ్ళకి కరుణశ్రీ పద్యాలు నిరాశని కలిగించవచ్చు. కానీ, సున్నితమైన భావాలతో, భావానికి అనువైన సున్నిత పదాల ధారతో అతని పద్యాలు గుండెని తట్టక మానవని నా అనుభవం.
ఉదాహరణకి ఈ ఖండికే తీసుకోండి. భార్యనీ, కుమారునీ వదిలి పెట్టి అర్థరాత్రి ఎక్కడికో బయలుదేరిన బుద్ధుని అవస్థని ఎంత మనోహరంగా చిత్రించారు! వీటికి వివరణ అనవసరం. ఎవరికి వారు మనసారా చదువుకొని అనుభవించాల్సిందే!
స్వప్నలోకాలలో నవ్వుకుంటున్న తన ముద్దుపాపాయి చిరునవ్వు ముత్యాలు అతని కనుతుదలలో దొరలుచున్నాయిట! అతని భుజాన ఉన్న ఉత్తరీయం, తన ప్రేయసి కౌగిలిలాగా, వదలిపోకుండా, ముందుకి వెళ్ళనీయకుండా తననంటిపెట్టుకుందిట! వీటన్నిటినీ వదలి అతను ఎలా వెళ్ళగలుగుతున్నాడు! ఎక్కడో గుడిసెలో మినుకు మినుకు మంటున్న చిరుదివ్వె అతనికేదో సందేశం ఇస్తోంది. "ప్రేయసి ప్రేమలోన కనిపించెడి తీయని స్వర్గమొక్కటే ధ్యేయము కా"దని చెపుతోంది. అందుకే ఆ కరుణమూర్తి బాధని గుండెలోనే అదిమిపట్టి ఆ మహాభినిష్క్రమణం చేస్తున్నాడు.

అసలు కరుణశ్రీ అంటేనే కరుణమూర్తి. అతని పద్యంలానే అతని మాట, అతని మాటలానే అతని హృదయం అతి మెత్తన. తెలుగు పద్యం అంటే చెవికోసుకొనే ఉత్సాహవంతులు మొట్టమొదట కంఠస్థం చెయ్యాల్సిన కవి కరుణశ్రీ!


పూర్తిగా చదవండి...

Thursday, May 1, 2008

నేడే మేడే!


ఈ రోజు మేడే, సెలవు రోజు. ఊరికే కూచుంటే ఏవో ఊహలూ, ఆలోచనలూ ఇలా పద్యాలై బయటకి వచ్చాయి. అసలిలాటి పద్యాలెప్పుడు రాసినా, "వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్" అని గురజాడవారు నెత్తిన రెండు మొట్టికాయలు వేస్తూనే ఉంటారు. చెయ్యగలిగిందేదో నిశ్శబ్దంగా చేసుకుపోతున్నా, ఏదో చెప్పాలన్న తపనకూడా మనసుని వెంటాడుతుంది. దాని పర్యవసానమే ఇదిగో ఈ పద్యాలనిలా నలుగురిముందూ పెట్టడం...
వీటివల్ల సమాజమేదో మారిపోతుందన్న వెఱ్ఱి దురభిప్రాయం నాకేవీ లేదు. కనీసం ఒకళ్ళిద్దరిలోనైనా కాస్తంత ఆలోచన రేపగలిస్తే అదే పదివేలు...


శ్రామికులందరొక్కటిగ సంఘటితంబయి, చీమలేకమై
పామును బట్టినట్టు ధనవంతుల దోపిడి మట్టుబెట్ట దీ
క్షా మతులైన వేళ శ్రమశక్తిని లోకము దానెరింగెగా
మేమను భావనే వెలసె మేదిని పండగ మే దినమ్ముగా!

సోషలిజమ్ము స్వప్నమది సుందర సత్యమునౌట నెన్నడో?
వేషము మార్చి మార్చి ప్రభవించెనె దోపిడి మాటిమాటికిన్
దోషమదెక్కడున్నది? అథోగతి బీడిత తాడితాళి సం
తోషము నందు రోజులు సుదూరమునుండిన యెండమావులే?

మేడలు మిద్దెలు బెరిగెను
గూడైనను లేక పేదకూలీ లుండెన్
మేడే లవెన్ని వచ్చిన
మాడే కడుపులకు భుక్తిమార్గము సున్నా!

విత్తును మాత్రమే యొసగు వృక్షము, వేరొక వృక్ష జన్మకై;
సత్తువవచ్చు దాకె నిజసంతతి గాచును పక్షి జంతువుల్;
విత్తము కోట్లు కోట్లు దమ పిల్లలకై గణియింత్రు మానవుల్
మత్తులు! వారివల్లె అసమానతలింతగ హెచ్చిపోయెగా!

తాతయుదండ్రి యాస్తి దము తాకగరాదను సద్విచార ధా
రాతిసమంజసాన్విత మహాత్ములు గావలె నేటి యౌవనుల్!
దూతలు గావలెన్ బ్రగతి రోచిరహస్సుకి, నూత్న సంఘ ని
ర్మాతలు గావలెన్, సమసమాజపు ధాతలు గావలెన్ వడిన్!


పూర్తిగా చదవండి...