తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, April 27, 2008

మ్రింగెడివాడు విభుండని...


మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

పుక్కిటి పురాణాన్ని చక్కని కావ్యంగా కొన్ని పద్యాలు మారుస్తాయి. అలాటి పద్యాలలో ఇదొకటి. కాకపోతే, సంస్కృత భాగవతంలో లేని ఈ విషయం పోతన భాగవతంలోకి ఎందుకు వస్తుంది!

హాలాహలం పొంగుకొచ్చి లోకాలని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు అందరూ కలిసి వెళ్ళి మహేశ్వరుడికి మొర పెట్టుకొంటారు. అసలే శివుడు భోళాశంకరుడాయె! వాళ్ళలా వేడుకొనేసరికి అతని మనసు కరగకుండా ఉంటుందా? ప్రపంచాన్ని రక్షించడానికి ఎంతకైనా తెగించే అనుకంప అతనిది! అందుకే ఆ విషాన్ని మొత్తం మింగి ప్రపంచాన్ని కాపాడడానికి పూనుకొంటాడు. తన అర్థాంగి కదా పార్వతి, ఆమె యేమంటుందో అని ఆమె వైపు చూస్తాడు. ఆమె చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలుపుతుంది! ఇదీ సంస్కృత భాగవతంలో ఉన్న సన్నివేశం.
తెలుగులోనూ ఇంతదాకా ఇలాగే ఉంటుంది. ఇక్కడ పోతనకి ఒక సందేహం వచ్చి ఉంటుంది - "ఎంత దేవుళ్ళైనా, చూస్తూ చూస్తూ తన భర్త విషం తాగడానికి ఏ భార్యయినా అంగీకరిస్తుందా?" పోతన లాంటి భాగవతోత్తమునికి దానికి సమాధానం దొరకడం పెద్ద కష్టమై ఉండదు. అయితే ఇక్కడ గొప్పతనం ఏవిటంటే, ఆ సందేహాన్నీ దాని సమాధానాన్నీ, కవితాత్మకంగా తెలుగు భాగవతంలో చిత్రించడం! తనే నేరుగా ఇది చెప్పేస్తే, అది వ్యాఖ్యానంలా ఉంటుంది. కాబట్టి ఆ సందేహాన్ని పరీక్షిత్తుచేత అడిగించాడు. "శివుడైతే భక్తవత్సలుడు, విషాన్ని తాగడానికి సిద్ధపడవచ్చు. దేవతలందరూ తమని కాపాడతాడు కదా అని తాగమని ప్రోత్సహించవచ్చు. కానీ పార్వతి, తన భర్త విషం తాగడానికెలా ఒప్పుకుంది?" అని అడుగుతాడు. దానికి శుకమహర్షిచ్చిన జవాబు ఈ పద్యం.

కేవలం ఒక్క రెండు పదాలతో మొత్తం భారతీయ సంస్కృతిని ఎంత చక్కగా చెప్పాడు, అదీ తెలుగు నుడికారంతో! "మంగళసూత్రాన్ని నమ్మడ"మంటే తమ భార్యాభర్తల అనుబంధాన్ని నమ్మడం! ఒకరినొకరు విడిచిపెట్టమని చేసిన ప్రమాణాలలోని సత్యాన్ని నమ్మడం! ఇక్కడ పార్వతి ఎవరు, "సర్వమంగళ". అంటే పరిపూర్ణమైన శుభానికి ఆకారమే ఆవిడ. తన మాంగల్యమ్మీద అంత నమ్మకం ఉండబట్టే ఆవిడ సర్వమంగళ అయింది. అందుకే, మింగుతున్నది తన భర్తని తెలిసీ, మింగేది విషమని తెలిసీ, ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి మింగమని చిరునవ్వుతో తన అంగీకారాన్ని చెప్పగలిగింది.
ఈ పద్యం చదివినప్పుడల్లా, యుద్దానికి ధైర్యంగా తమ భర్తలని పంపే ఈనాటి సైనుకుల భార్యలు నా మదిలో మెదులుతారు. వాళ్ళందరూ సర్వమంగళలే కదా! ఈ కాలంలో బయట శత్రువులని ఎదుర్కొనే సైనికులు సరిపోరు. సమాజంలో పాకిపోతున్న రకరకాల విషవాయువులనుండి మనలని మనం కాపాడుకోవాలంటే, ప్రతి భర్తా శివుడూ, ప్రతి భార్యా పార్వతీ కావాల్సిన అవసరం ఉంది! కాదంటారా?

మంగళసూత్రం - పురుషాధిక్య సమాజం ఆడవాళ్ళ మెళ్ళో వేసిన పలుపుతాడని, దాన్ని ద్వేషించేవాళ్ళూ, తిరస్కరించేవాళ్ళూ ఉన్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయముంది. కానీ ఆవేశంలో ఆలోచన లేదు. ఈ సంప్రదాయం ఎప్పుడెలా ఎందుకు మొదలయ్యిందీ ఇప్పుడనవసరం. ఇది దాంపత్య జీవనానికీ, భార్యాభర్తల గాఢమైన అనుబంధానికీ ఒక శక్తివంతమైన ప్రతీకగా రూపొందిందన్న మాట నిజం. సంప్రదాయాన్ని తమ స్వార్థానికి వాడూకొనేవాళ్ళు ఏ కాలంలోనైనా ఉంటారు. అంతమాత్రాన సంప్రదాయం చెడ్డదనుకోవచ్చా? అది ప్రతీకగా ఉన్న మంచినెందుకు గ్రహించకూడదూ? మంగళసూత్రాన్ని వేసుకోకపోయినా, ఒకవేళ అది మగాళ్ళ మెళ్ళో వేసినా, పురుషాధిక్యం తొలగిపోతుందా? కన్యాశుల్కం పోయి వరకట్నం వచ్చి ఏం వెలగబెట్టింది? మార్పు రావలసింది ముందు మనుషుల్లో. వారి మనసుల్లో. దానిబట్టి ఆచారాలూ సంప్రదాయాలూ అవసరమైతే మారవచ్చు.
కొందరు మరొక విచిత్రమైన వాదన చేస్తారు. అసలీ కాలంలో ఇలాటి సంప్రదాయాలెందుకూ అని. స్కూల్లో యూనిఫారమూ, ఆఫీసుల్లో Dress code మనలో చాలామందికి తెలిసిన విషయాలే. ఇవి ఆచారాలు కావా? ఇవెందుకని ప్రశ్నిస్తున్నామా? మరాలటప్పుడు మనదైన, మన జన్మకి కారణమైన మన పూర్వులు ఆచరించిన సంప్రదాయాలని మాత్రం మన మెందుకు కాదనాలి? మనుషుల మధ్య ఒక ఏకతనీ, సంఘీభావాన్నీ కలిగించి సమాజంగా ఏర్పడడానికి ప్రథాన చోదకాలుగా పనిచేసేవి సంప్రదాయాలూ, ఆచారాలూ. వాటిని తిరస్కరిస్తే, మనుషులని సమైక్య పరిచే సాధనాలు ఏవి? వ్యక్తి వాదం ప్రబలితే, సమాజ పరిస్థితి ఏమవుతుంది? ఒక జాతిగా మనిషి మనుగడ ఏమవుతుంది? ఆలోచించండి...


పూర్తిగా చదవండి...

Saturday, April 19, 2008

పెద్దోడు, చిన్నోడు (సమాధానాలు, మరికొన్ని ప్రశ్నలు)


నిన్న రాత్రి కలలోకి రావుగోపాల్రావు వచ్చి, "బ్లాగన్నాక కూసింత ఇంటరేక్షనుండాలి. ఉత్తినే రాసూరుకుంటే బ్లాగుకీ వెబ్సైటుకీ తేడా ఏటుంది." అని తనదైన స్టైల్లో నా చెవిలో ఉదేసరికి నాకు తెలివి తెల్లారింది! సరే అలాగే చూద్దామనిపించింది. అందుకే నేను మొదలుపెట్టిన "ఛందస్సు - కథా కమామీషూ" పరంపరని కాస్తంత ఇంటరేక్టివ్వుగా నడపాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ కాస్త తలో చెయ్యావెయ్యాలి.
నేను చెప్పదలచుకొన్న విషయాన్ని కాస్తంత టూకీగా చెప్పి ప్రశ్నలడిగి ఊరుకుంటాను. దానికి తెలిసిన వాళ్ళు
కామెంట్లలో జవాబులు రాయాలి. వేరే సందేహాలుంటే అవికూడా రాయొచ్చు. జవాబులు తెలీనివాటికి నాకు తెలుసున్న మేరకు నేను జవాబులిస్తాను. వీకెండు టైము. ఇదేమీ పరీక్ష, పోటీ కాదుకాబట్టి, జవాబులు తెలుసున్న వాళ్ళు నిస్సంకోచంగా రాయవచ్చు. తెలీని వాళ్ళు చదివి తెలుసుకోవచ్చు. సరేనా మరి!

కిందటిసారి "మాత్ర"ల గురించి మాట్లాడుకున్నాం కదా. కేవలం మాత్రలమీదే ఆధారపడి ఉండే ఛందస్సుని మాత్రా ఛందస్సు అంటారు. అంటే ఒక పాదానికి ఇన్నే మాత్రలుండాలీ, లేదా ఇలాటి మాత్రల వరుస ఉండాలీ అని నిర్దేశించే ఛందస్సన్నమాట. ఊదాహరణకి మనందరికీ తెలిసిన "దేశమును ప్రేమించుమన్నా" అన్న గురజాడ గేయం ముత్యాలసరం అనే ఛందస్సులో ఉన్నది. ముత్యాలసరం మాత్రాఛందస్సు. దీనిలో పాదాలు ఈ కింద మాత్రా సంఖ్యలుగల పదాలతో ఏర్పడతాయి.

3, 4, 3, 4 (మూడు నాలుగు మూడు నాలుగు)
3, 4, 3, 4 (మూడు నాలుగు మూడు నాలుగు)
3, 4, 3, 4 (మూడు నాలుగు మూడు నాలుగు)
3, 4, 3, 2 (మూడు నాలుగు మూడు దో!)

చివరి పాదంలో కొన్ని రకాలున్నాయి, అది వేరే విషయం. ముఖ్యంగా మాత్రాఛందస్సులో ఉండే పద్యాలు, పాడుకోడానికి గేయాల్లా ఉంటాయి. వీటి గురించి తర్వాత వివరంగా చూద్దాం.

ఒక అక్షరానికి ఒకటికానీ రెండు కానీ మాత్రలుంటాయని చెప్పానుకదా. దీనిబట్టి వాటికి మన పూర్వులు "గురువు" "లఘువు" అని నామకరణం చేసారు. రెండు మాత్రలున్న అక్షరం "గురువు". ఒకటే మాత్రున్న అక్షరం "లఘువు". గురువంటే పెద్దదనీ, లఘువంటే చిన్నదనీ అర్థం కాబట్టి అలా పేర్లు పెట్టారు. అన్నిటికన్నా పెద్ద గ్రహానికి "గురు"గ్రహం అని పేరు పెట్టినట్టుగా.
ఒక అక్షరాన్ని గురువా లఘువా అని నిర్ణయించడంలో కొన్ని తిరకాసులున్నాయి. అయితే, ఈ నిర్ణయం ఆ అక్షరాన్ని ఉచ్చరించే సమయాన్ని బట్టి ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకొంటే, తికమక ఉండదు. ఏ అక్షరాన్ని పలకడానికి మామూలుకన్నా ఎక్కువ సమయం తీసుకొంటామో అది గురువు. తక్కినవి లఘువులు.

ఇప్పుడు మీకు ప్రశ్నలు:

1. కొన్ని రకాలైన అక్షరాలు సహజంగా ఎప్పుడూ గురువులే. ఏమిటా అక్షరాలు?
2. కొన్ని సార్లు, "స్థానబలిమి కాని తనబలిమి కాదయా" అన్నట్టు, సహజంగా లఘువులైన అక్షరాలు కూడా గురువులుగా మారే అవకాశం ఉంది. ఎప్పుడు, ఎందువలన చేత?
3. పై రూలుకి కొన్ని చోట్ల మినహాయింపు ఉంది. ఎక్కడ ఎందుకూ?
4. కొన్ని పదాల ఉచ్చారణ కాలానుగుణంగా మారుతుంది. ఈ ఛందస్సు వల్ల ఒక ప్రయోజనం, వాటి పూర్వరూపం ఏమిటో చూచాయగానైనా తెలియడం. అలా గురు లఘు నిర్ణయం వల్ల తెలిసే ఒక ఉదాహరణ ఇవ్వగలరా? (క్లూ: ఇప్పటి చాలామంది పలికే విధానంబట్టి చూస్తే ఒక రకమైన అక్షరం గురువవ్వాలని అనుకొంటాం, కానీ అది ఛందస్సు ప్రకారం లఘువు!)

వీటికి సమాధానలు తెలిసికూడా మీరు చెప్పకపోతే, ఈ భేతాళుడు చెట్టెక్కి మళ్ళీ దిగడు:-)

మొత్తానికి జనాలందరూ కొంచెం కొంచెంగా జవాబులిచ్చేసి చేతులుదులిపేసుకున్నారు! సరే కానీండి, ఏంచేస్తాం, నాకు తప్పుతుందా మరి!

1. స: దీర్ఘాచ్చులతో కూడినవి (కా), "ఐ", "ఔ"ల తో కూడినవి (కై, కౌ), బిందువుతో కూడినవి (కం), విసర్గతో కూడినవి(దుః) అచ్చులుకాని, హల్లులుకాని. ఒక అక్షరం సహజంగా లఘువా గురువా అన్నది అందులోని అచ్చే నిర్ణయిస్తుందని గమనించే ఉంటారు.

2. స: ఒక అక్షరం పక్కన పొల్లున్నప్పుడు ఆ పొల్లుకూడా ముందటి అక్షరంలో భాగమై, ఆ అక్షరం గురువౌతుంది (రన్, చల్).
ఒక అక్షరం వెనకాల సంయుక్తాక్షరం ఉన్నప్పుడు ఆ అక్షరం గురువౌతుంది. ("కర్త" లో "క" గురువు, దీనిని "కర్" "త" అని పలుకుతాం కాబట్టి).
ఈ సందర్భాలలో ముందటి అక్షరమ్మీద ఊనిక ఎక్కువై, అవి పలకడానికి కొంచెం ఎక్కువసేపు పడుతుందికాబట్టి ఈ రూలు వర్తిస్తుంది.

3 స: ఏవుంది, ఏ చోట్లయితే వెనకాల సంయుక్తాక్షరం ఉన్నా, ముందు అక్షరానికి ఊనిక ఉండదో అలాటి చోట్ల ఈ రూలు వర్తించదు. రెండు పదాలున్నాయనుకోండి ఉ: "ఆమె స్త్రీ". ఇవి పలికేటప్పుడు "ఆమె"కి "స్త్రీ"కి మధ్య పలకడంలో కొంత సమయం ఉంటుంది కాబట్టి, మొదటి పదం చివరి అక్షరానికి ("మె"కి) సాధారణంగా ఊనిక ఉండదు. కాబట్టి అలాటప్పుడు పై రూలు వర్తించదు (ఇక్కడ "మె" లఘువే). అయితే కొంతమంది పద్యాలలో మీరు కలిపే చదవండి సుమా అని చెప్పి ముందు అక్షరాన్ని గురువు చేస్తూ ఉంటారు!
అలాగే కొన్ని సార్లు ఒకే పదమైనా (రెండుపదాలు సంధి జరిగి) కూడా సమ్యుక్తాక్షరం ముందలి అక్షరానికి ఊనికపడకుండా పలకే అవకాశం ఉంటుంది. అలాటప్పుడు వాటికి ఈ రూలు వర్తించకుండా ఉండవచ్చు!

4 స: "అద్రుచు", "విద్రుచు", "ఎద్రుచు", "పద్రిచి", "చిద్రుప" పదాలలో మొదటి అక్షరం మీద ఊనిక లేకుండా పలకాలి. కాబట్టి అవి లఘువులు. ఈ పదాలు "అదురుచు", "విదురుచు" మొదలైన పదాలకి రూపాంతరాలు.
వట్రసుడికి ముందున్న అక్షరానికి ఊనిక ఉండదు. కాబట్టి అవి సహజంగా లఘువులైతే, లఘువులే అవుతాయి (ఉ: సహృదయడు లో "స" లఘువే).

సరే, మరిది మీకెంతవరకూ అర్థమయ్యిందో తెలుసుకోడానికి కొన్ని ప్రశ్నలు. ఈ కిందవాటికి గురులఘువులని గుర్తించండి:

1. విష్వక్సేనుడు
2. ప్రకృతి
3. ప్రాణముల్ బయటకివచ్చి ముగ్ధాకార
4. నొక్కి త్రాటం గొప్పు నెక్కు వెట్టె
5. దెరదీసినంతన తెలిసి నిజస్వరూపంబు బ్రహ్మానంద పరిథి యగుచు
6. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి యీశ్వరా


పూర్తిగా చదవండి...

Monday, April 14, 2008

సీతారాముల కల్యాణము చూతము రారండి!

ఉగాది అలా వెళ్ళిందోలేదో, ఇలా శ్రీరామనవమి వచ్చేస్తుంది. ఈ రెండు పండగలూ తెలుగువారు మురిపెంగా చేసుకొనే పండగలు. సీతారాముల కల్యాణం ఇంటింటా వేడుకే. మరి ఆ వేడుకని మనం కూడా జరుపుకోవద్దూ! అందుకే ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణకల్పవృక్షంలో జరిపించిన సీతారామ కల్యాణాన్ని చూద్దాం పదండి.

ఇదమిత్థమని నిర్ణయింపగా రాని దే
కోర్కియో రూపు గైకొన్నయట్లు
జన్మజన్మాంతర సంగతమ్మైన యా
శా బలం బవధికి సాగినట్లు
ప్రాణముల్ బయటకివచ్చి ముగ్ధాకార
మెనయించి దర్శనమిచ్చినట్లు
తన సృష్టిలోని యుత్తమభావ మానంద
ముగ బొంగి బింబమై పొడిచినట్టు

లల యరుంధతియును నహల్యయును గోస
లాత్మజాతయు మువ్వురి యాననముల
కన్నను బవిత్ర మగుచు శృంగారభావ
మొడిసిపట్టిన ముఖచంద్రుడొకడు తోచె

ఇది సీతాదేవి గురించి కల్పవృక్షంలో మొదటి పద్యం. సీతాదేవిని రామచంద్రుడు మొదటిసారిగా చూసినప్పటి పద్యం.
ఇది, అది అని నిర్ణయించలేని ఏదో కోరికకి రూపం వచ్చినట్లు, ఎన్నో జన్మలనుండీ బలపడుతూ వస్తున్న ఆశ తుట్టతుదికి చేరుకున్నట్లు, తన ప్రాణాలు బయటకి వచ్చి సుందరమైన ఆకారంతో దర్శనమిచ్చినట్లు, మొత్తం తన సృష్టిలోని ఉత్తమమైన భావం ఆనందంగా పొంగి ఒక బింబంగా ఉదయించినట్లు ఉంది సీత మోము! అరుంధతి, అహల్య, కౌసల్య ముఖాల కన్న కూడా పవిత్రంగా కనిపించింది ఆమె మోము. అంతలోనే శృంగారభావాన్ని కూడా మూర్తీభవించిన చంద్రబింబంలా సీత ముఖం తోచింది! ఇంతకన్నా ఈ పద్యానికి వివరణ అనవసరం!

శ్రీరఘురామచంద్రునకు జిత్తము జానకిపై గరంబు వి
స్ఫారశరాస లస్తకముపై యుగపత్క్రియ జిత్రమయ్యె సం
ధారతి గోటికెక్కిన గుణంబు బిగించుట లాగు టింతయున్
నేర డెఱుంగ నొక్కసడి నిండిన శబ్దము కల్గు నంతకున్

మనసేమో జానకి మీద, చెయ్యేమో శివధనుస్సు మధ్యనుండే పిడి మీద ఒకే సారి లగ్నమయ్యాయట రామునికి! అల్లెతాడును బిగించడం, లాగడం ఏవి తెలియలేదతనికి, ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చినంతవరకూను!

మంజూషలోనె యమర్చి కోణంబందు
నొక్కి త్రాటం గొప్పు నెక్కు వెట్టె
గాబోలు మంజూషికా వినిర్గమనంబు
వేళకే జ్యావల్లి బిగిసియుండె
దాళప్రమాణమౌ ధనువు జానకిదృష్టి
కడ్డమ్ముగా వచ్చునంచు నెంచె
గాబోలు నడ్డంబుగా ధనుస్సును బూని
పిడిబాకువలె ద్రాడు వ్రీలలాగె

నతని దృష్టికి జానకి యాగలేదు
అతని కృష్టికి శివధనుస్సాగ లేదు
సీత పూజడవెన్నుగా శిరసు వంచె
జెరుకుగడవోలె నడిమికి విరిగె ధనువు

మంజూష అంటె పెట్టె. శివధనుస్సు పెట్టెలో తీసుకువచ్చారుకదా. ఆ పెట్టెలో ఉండగానే, చివరన నొక్కిపెట్టి అల్లెత్రాటిని కొప్పుకి కట్టి వేసాడేమో అన్నట్టుగా, ఆ విల్లుని పెట్టెలోంచి తీసే సమయానికే ఆ అల్లెత్రాడు బిగిసి కనిపించింది. అంటే అంత వేగంగా రాముడా పని చేసాడని ధ్వని. తాడిచెట్టంత పొడుగున్న ఆ విల్లు, సీతని చూడ్డానికి అడ్డం వస్తుందని అనుకున్నాడో ఏమో, రాముడు దాన్ని అడ్డంగా పట్టుకొని, పిడిబాకుని లాగినంత సులువుగా ఆ అల్లెత్రాడుని లాగాడు. అతని చూపులని జానకి తట్టుకోలేకపోయింది. అతని బలాన్ని ఆ శివధనుస్సు తట్టుకోలేకపోయింది. సీత సిగ్గుతో పూలజడ కనిపించేంతగా తలదించుకుంది. ఆ శివధనుస్సు చెఱుగ్గడలాగ
మధ్యకి విరిగిపోయింది! ఎంత పెద్ద శబ్దం చేస్తూ విరిగిందా విల్లు? భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్లు, పిడుగుల శబ్దాన్ని మించినట్టుంది ఆ శబ్దం. ఆ శబ్దం శివలోకంలోనూ, స్వర్గలోకంలోనూ, రాక్షసలోకంలోనూ, రాజలోకంలోనూ అంతటా ప్రతిధ్వనించింది!
ఆ తర్వాత పరశురాముడు రావడం, అతని విష్ణుధనుస్సుని రాముడు గ్రహించడం జరిగిపోయాయి. రామ లక్ష్మణ భరత శతృఘ్నులను, సీత ఊర్మిళ మాండవి శ్రుతకీర్తులకిచ్చి వివాహం జరిపించడానికి నిశ్చయం అయిపోయింది.
ఇక అంతా సీతా రాముల కల్యాణ వేడుకే! అదుగో పెళ్ళికూతుళ్ళను బుట్టల్లో తెస్తున్నారు...

తుమ్మెదలు పైని గ్రమ్మిన తమ్మి పూలు
నాల్గు తట్టలతో దెచ్చినారు మేన
మామ లంతలో జూడగా మధుర లజ్జ
లుదయమైన రాకన్నెల వదనములుగ

పైన తుమ్మెదలు కమ్ముకున్న తమ్మిపూలని నాలుగు బుట్టల్లోనూ తెచ్చారు మేనమామలు. ఇదేమిటా అని చూస్తే తెలిసింది అవి రాకుమార్తెల ముఖాలని! వాళ్ళని తెచ్చి తెరవెనక పెట్టారు. తెరకి అటు సీత, ఇటు రాముడు.

సంకల్పసంభవాస్థానమౌ తెర తోచి
పంచీకృతంబులౌ ప్రాణములును
దెరవెంక బ్రతిబింబ దీధితుల్ ప్రకటించి
తనకు మించిన మోహమున వెలింగి
తనుదాన రాముడయ్యును విస్మరించి త
త్ప్రతిబింబమునయందు రాముడగుచు
దెరదీసినంతన తెలిసి నిజస్వరూ
పంబు బ్రహ్మానంద పరిథి యగుచు

నెంతటి మహీయుడయ్యును నినకుల శిశు
వింతగ నణీయుడై సర్వసృష్టిసహజ
మైన విభ్రాంతి బొందె, మోహజమునైన
వికృతి నలుగురితో బాటు విస్తరించు

ఈ పద్యాన్ని వివరించాలంటే, ముహూర్తం కాస్తా దాటిపోతుంది. కాబట్టి, క్లుప్తంగా... తన పంచప్రాణాలూ ఆ తెరవెనక ప్రతిబింబించి, తనకన్నా కూడా అందంగా వెలుగుతున్నట్లుగా రాముడు విస్మయం పొందాడు! తనే రాముడై కూడా ఆ తెరవెనక తన ప్రతిబింబాన్ని చూసి రమ్యత్వం పొందాడు. అంతలో తెర (మాయ) తొలగింది. తన నిజస్వరూపాన్ని (అద్వైతాన్ని) తెలుసుకొన్నాడు. బ్రహ్మానందాన్ని పొందాడు. ఎంతటివాడికైనా మోహ విభ్రాంతి కలగడం సహజం. అది నలుగురితో పాటు (లోకంలో) విస్తరిస్తుంది. రాముడితో పాటు అలాంటి స్థితే ఆ అన్నదమ్ముల నలుగురికీ కలిగింది!
సుముహూర్తం అయిపోయింది. వధూవరులు ప్రక్కప్రక్కన కూర్చున్నారు.

ఎదురుబళ్ళైన లజ్జచే నెత్తరాని
ఱెప్పలవి యెత్తబడకుండ గ్రేవలందు
బ్రక్క గూర్చున్న యప్పటి ప్రసరణంబు
ప్రసవబాణుండు నేర్పిన ప్రథమ విద్య

రెప్పలని పైకెత్తి చూడ్డానికి సిగ్గు ప్రతిఘటిస్తోంది. అంచేత దించున్న రెప్పలతోనే, ప్రక్కచూపులు చూసుకొంటున్నారు. అలా చూసే నేర్పు, మన్మథుడు వాళ్ళకి నేర్పిన మొదటి విద్య!
అదుగో మంగళసూత్రధారణ జరుగుతోంది! సీత మెడలో రాములవారు మంగళసూత్రాన్ని కడుతున్నారు.
జడవెనకున్న ఆ మెడభాగం భర్త తొలిస్పర్శతో పులకించింది! మరి రామునికో...

కరరుహంబులు చర్మంబు గాకపోయె
నవియు బులకించునేమొ ప్రియా గళాత్త
మైన స్పర్శసుఖాప్తి, బ్రియాగళంబు
నంటి బాధించు వీనికేలా? సుఖంబు

పాపం అతని గోళ్ళు మాత్రమే సీత మెడని తాకుతున్నాయి. అవి చర్మం కాదు కదా, అంచేత వాటికి స్పర్శ లేదు. లేకపోతే అవికూడా పులకించేవే! అయినా ప్రియతమ గళాన్ని నొక్కి బాధించే వీటికి సుఖం ఎందుకు?
మొత్తానికి సూత్రధారణ జరిగిపోయింది. ఇంక తలంబ్రాల వేడుక!

నాలుగవ పాలుగా నింద్రనీల మణులు
మణులు కలియంగ బోసిరో యనగ బొలిచె
ముత్తెములు చతుర్దంపతి తను స
మాత్త నీలరక్తచ్ఛవుల్ హత్తుకొనగ

ఆ నలుగురు దంపతులు ముత్యాల తలంబ్రాలు పోసుకొంటున్నారు. అవి, ముప్పావువంతు మణులూ, పావువంతు నీలాలూ కలిపి పోసినట్టుగా కనబడ్డాయి. ఆ లెక్కలేవో మీరే ఆలోచించి తేల్చుకోండి.

అలుపములు రెండుమూడు ముత్యాలు నిలిచి
సీత పాపటలో జిరుచెమట పోసె
హత్తుకొని గందపూత ముత్యాలు రెండు
రామచంద్రుని మేన దారకలు పొలిచె

రెండు ముత్యాలు సీత పాపిటలో చిక్కుకొని చెమట బిందువుల్లా మెరిసాయి. రాముని ఒంటిపై గందపుపూతకి రెండు ముత్యాలు అంటుకొని తారకల్లాగ కనబడ్డాయి. ఇది శృంగార రసధ్వని. అనుభవైక వేద్యం.

చంద్రరేఖపైని సన్నని తెలిమొయి
ళ్ళాడినట్లు ముత్తియమ్ములాడె
దల్లిమేనిపైని, నల్లని యాకాశ
మట్లు రామచంద్రుడందె యుండె

నల్లని ఆకాశంలా రాముడున్నాడు. నెలవంకపైన తెల్లమబ్బులు తూగాడుతున్నట్టు పక్కనే సీతాదేవి తలపై ముత్యాలు కదలాడుతున్నాయి. అంతలోనే ఇదిగో చిరుజల్లులు కురిసాయి.

ప్రతి చైత్రశుద్ధనవమికి
వితతంబుగ తెలుగునేల విరిసెడు జల్లుల్
సితముక్తా సదృశంబులు
ప్రతనులు తలబ్రాల వేళ వచ్చె జిటపటల్

ఈ చిటపట చిరుజల్లులు ప్రతి చైత్రశుద్ధ నవమినాడు తెలుగునేలపై కురుస్తాయి. ఇవి అచ్చు ఆ తలంబ్రాల ముత్యాల్లాగే ఉన్నాయి!
ఇలా పరమానందంగా, పరమ రమణీయంగా సీతారాముల కల్యాణం జరిగింది!

మంగళం కోశలేంద్రాయ
మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ
స్సార్వభౌమాయ మంగళం!


పూర్తిగా చదవండి...

Saturday, April 12, 2008

ఉద్రేకంబున రారు...

స్పెషల్ ఉగాదిపచ్చడందరూ రుచి చూసే ఉంటారనుకుంటాను. అందులో నేనిచ్చిన న్యస్తాక్షరికి నాకు ప్రేరణనిచ్చిన పద్యాన్ని ఈ రోజు మీతో పంచుకుంటాను.

ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్ద్రోహంబును నీకు జేయరు, బలోత్సేకంబుతో జీకటిన్
భద్రాకారుల బిన్నపాపల రణప్రౌఢక్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులెట్లాడెనో!



పోతన భాగవతంలో ద్రౌపది అశ్వత్థామతో అన్న మాటలివి. చదివిన ప్రతిసారీ కళ్ళు చెమ్మగిల్లే పద్యం!

అసలీ సందర్భంలో ద్రౌపది అశ్వత్థామతో మాట్లాడడం సంస్కృత భాగవతంలో కానీ మహాభారతంలో కానీ లేదు.

అసలు, భారతంలో అశ్వత్థామని ద్రౌపది దగ్గరకి తీసుకురావడమే జరగదు. భీమార్జునులు అశ్వత్థామని వెంటాడి చివరికతని శిరోమణిని పెకిలించేస్తారు. కృష్ణుడు అశ్వత్థామని 3000 సంవత్సరాలు దిక్కుమాలిన బతుకు బతకమి శపిస్తాడు.

సంస్కృత భాగవతంలో అర్జునుడు అశ్వత్థామని బంధించి ద్రౌపది దగ్గరకు తెస్తాడు. అప్పుడు ద్రౌపది, "అశ్వత్థామ తల్లి ఇంకా బతికే ఉంది. ఆమె, నేను పొందే పుత్రశోకాన్ని పొందకూడదు", అని అతణ్ణి చంపకుండా వదిలిపెట్టెయ్యమని అంటుంది. అందరూ ద్రౌపది అన్నదానితో ఏకీభవించినా భీముడు మాత్రం ఒప్పుకోడు. అప్పుడు కృష్ణుడు, అతనికి శిరోముండనం చేసి (తలగొరిగి), అతని శిరోమణిని తీసేస్తే అతను మరణించిన వాడితో సమానమని మథ్యేమార్గాన్ని చెప్తాడు. ఇది సంస్కృత భాగవతంలో ఈ సన్నివేశం.

పోతన సంస్కృత మూలాన్ని ఇంచుమించు అనుసరించినా, ద్రౌపది ఆవేదనని వెళ్ళగక్కించి కానీ ఊరుకోలేకపోయాడు! ఒక కవి తను రచిస్తూన్న సన్నివేశంలో తాదాత్మ్యం చెందితే అందులోంచి పుట్టే రస ప్రవాహానికి ఇది ఉదాహరణ.

"ఉద్రేకంతో నీమీదికేమైనా వచ్చారా? పోనీ యుద్ధభూమిలో ఉన్నారా? నీకేమయినా పోని ద్రోహంచేసారా? కండకావరంతో అలా చీకట్లో, నిద్రిస్తున్న చిన్నపాపలని చంపడానికి నీ చెతులెట్లా ఆడేయయ్యా?" అని అడిగే తల్లికి అశ్వత్థామ ఏం సమాధానం చెప్పగలడు? ఈ కాలంలో ఇలాటి అశ్వత్థామలు ఎందరో!

ఇంతటి ఆర్ద్రత, ఇంతటి ఉద్వేగం ఎంత సులువుగా శార్దూలంలో ఒదిగిపోయిందో చూడండి! చెయితిరిగిన కవికి, నిజమైన భావోద్వేగం గుండెలోతుల్లోంచీ పుడితే, దానికి ఛందస్సు సరైన బాటచూపిస్తుందే కానీ, అడ్డం రాదు.

ఈ పద్యంతో పాటుగా ఇదే సందర్భంలో మరో మంచి పద్యాన్ని, పనిలో పనిగా ఇప్పుడే చూసేద్దాం. ఇవి భీమసేనుడు అశ్వత్థామని వదలవద్దని చెప్పేమాటలు.


కొడుకుల బట్టి చంపెనని కోపమునొందదు, బాలఘాతకున్
విడువుమటంచు జెప్పెడిని, వెఱ్ఱిది ద్రౌపది, వీడు విప్రుడే?
విడువగనేల? చంపుడిటు వీనిని, మీరలు చంపరేని నా
పిడికిటి పోటునన్ శిరము భిన్నము సేసెద జూడుడందఱున్

ద్రౌపది అశ్వత్థామని వదిలిపెట్టెయ్యమని చెప్పడం భీముడు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఒక పక్క ద్రౌపది మాటలకి విస్మయం, మరో పక్క అశ్వత్థామమీద అసహ్యం, కోపం, ఇవన్నీ పద్యంలో ఎంత అద్భుతంగా ధ్వనిస్తున్నాయో చూడండి! "వెఱ్ఱిది ద్రౌపది" అన్న ప్రయోగం, "పిడికిటిపోటునన్" తలబద్దలుకొడతాననడం - మొత్తం పద్యానికి ఆయువుపట్లు. నాటకీయమైన సన్నివేశంలో, సహజ సంభాషణా శైలితో పాత్రల మనస్థితిని ధ్వనింపజెయ్యడంలో, ఇక్కడ పోతన తిక్కనని గుర్తుకు తెస్తున్నాడు. నాకు తెలిసినంతవరకూ, ఇలాటి విశేషం పోతన భాగవతంలో మరెక్కడా లేదు!

కొమె: మొదటి పద్యంలో ప్రాస గమనించారా?


పూర్తిగా చదవండి...

Tuesday, April 8, 2008

స్పెషల్ ఉగాదిపచ్చడి!

సర్వులకూ సర్వధారి ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది అనగానే పద్య కోకిలలు పలుకుతాయి. కలాలు చిగురిస్తాయి. కవిసమ్మేళనాలూ, అవధానాలూ తెలుగువాళ్ళ ఆనవాయితీ.
ఈ ఉగాది సందర్భంగా మా విజయనగరంలో, విజయభావన అనే సాహితీసంస్థ ఆధ్వర్యంలో, ఈ రోజే ప్రముఖ అవధాని శ్రీ కడిమెళ్ళ వరప్రసాదు గారి అష్టావధానం జరిగింది.
ఆ అవధాన విశేషాలు మీకోసం అందిస్తున్న స్పెషల్
ఉగాదిపచ్చడి. ఇదిగో మరి అవధరించండి...(నా సోది ఇలా బ్రాకెట్లలో ఉంటుంది)

----------------------------------
సమన్వయ కర్త తొలిపలుకులు

తిరుపతి వేంకట కవుల పద్యం:

స్థైర్యము లేని చిత్తమవధానమెరుంగని సత్కవిత్వ మౌ
దార్యము లేని హస్తము యదార్థతలేని రసజ్ఞ మంచి మా
ధుర్యము లేని గానము మృదుత్వము లేని వచః ప్రసంగ మై
శ్వర్యము లేని భోగము నసారములియ్యివి దంతిభూవరా!

అవధాని ప్రార్థన:

పెద్దది పొట్ట విద్దియల పెట్టియగా, నిడుపాటి తొండమా
బుద్దులకెల్ల యూపిరియ, పూజ్యుల పల్కుల నాలకింపగా
పెద్దవియైన వీనులును, బిన్నలు కన్నులు బాహ్యదృష్టియే
వద్దనుచున్న యొజ్జలగువాడు గణాధిపుడిచ్చు దీవెనల్!

1. సమస్య:

శోభన దినమున గులసతి సుతులన్ గనియెన్!

ఒక్క సుతుడు కాదు, ఇద్దరు సుతులని, అందులోనూ కులసతి శోభనంనాడు కన్నదని సమస్య.

పూరణ:

కం: వైభవమన్న సుమిత్రదె (మొదటిపాదంలోనే పూరణ

ఎవరిగురించో అర్థమైపోయింది!)
శోభాయుతులైన త్యాగశూరుల నౌరా!
ప్రాభవమున తారాగ్రహ
శోభన దినమున గులసతి సుతులన్ గనియెన్!

శోభనము అంటే శుభము అన్న అర్థంలో, నక్షత్ర గ్రహ స్థితి శుభంగా ఉన్న రోజున సుమిత్ర సుతలను కన్నది అని పూరణ.

2. దత్తపది:

పదాలు - షకీల, ఇలియాన, త్రిష, జనీలియ
అంశం - సీతాకల్యాణం
పదాలు అదే వరుసలో రావాలన్న నియమం లేదు. ఛందస్సు అవధాని ఇష్టం.

పూరణ:

తేగీ: భా"ష కీల"యై చందన భంగి నొప్పి
పూ"జలీని య"వేలత భూమిజాత
పట్టె దో"యిలి యాన"మ్ము బరగజేసె
రా"త్రి ష"ండమ్ము జీల్చెడి రామ విభుని

అవేలత - అధికమైన
షండము - సమూహము
చందనంలా చల్లగా ఉన్నా, అవసరమైతే మాటని జ్వాలలాగా ప్రయోగించగల సీత, అవేలత - అధికమైన పూజలు చేసి, దోసిలిపట్టి, రాత్రి సమూహాన్ని చీల్చే రామునితో కలసి నడిచింది.
అవధానిగారికి జనీలియా తెలీదుకాబట్టి "జలీనియా" అనుకొని పూర్తిచేసారు:-)

3. వర్ణన:
సర్వధారి ఉగాది వర్ణన. స్వేచ్చా వృత్తం.

పూరణ:

ఉ: కోయిల మావిపై నిలిచి గొంతుక విచ్చి కుహూరుతమ్ములన్
దీయగజేయు వేళ నినదించి రహించుచు నుండు గుండె నా
ప్యాయముతోడుతన్ విజయభావన బుట్టిన యీ వసంత ల
క్ష్మీయుత సర్వధారి విలసించును గాత సమస్త సంపదల్

4. నిషిద్ధాక్షరి:

పాదంలో ఒకో అక్షరం పృచ్చకులు నిషేధించడం, అవధాని నిషేధించిన అక్షరం కాక మరో అక్షరం చెపుతూ పద్యాన్ని నడిపించడం నిషేధాక్షరి.
సాధారణంగా నిషిద్ధాక్షరి కందంలోనే చేస్తారు. అందులోనూ మొదటి రెండుపాదాలే. ప్రాస, యతి స్థానాలకి నిషేధం ఉండదు.

అంశం - భువనవిజయ సభని విజయభావన సభతో పోలుస్తూ వర్ణించడం

పృచ్చక అవధానుల మధ్య జరిగిన సంభాషణా విధంబెట్టిదనిన:

పృచ్చక: మొదటి అక్షరం నిషేధించలేదు.

అవధాని: "శ్రీ"

పృచ్చక: "భ" నిషేధం (అంటే రెండవ అక్షరం "భ"కారం కాలేదు. "భువన" లాంటి పదం వెయ్యకుండా)

అవధాని: "యై" (రెండవ అక్షరం ఇది. అంటే "శ్రీయై", శుభాన్ని చేకూర్చేదై అని అర్థం. అక్కడితో పదం అయిపోయింది. మూడవ అక్షరం కొత్త పదంతో మొదలౌతుంది. కాబట్టి అవధానికి బోలెడు స్వాతంత్ర్యం!)

పృచ్చక: "వ" నిషేధం ("విజయ" లాంటి పదం
వెయ్యకుండా)

అవధాని: "భా"

పృచ్చక: మళ్ళీ "వ" నిషేధం ("భావన" పడకుండా)

అవధాని: "ష"

పృచ్చక: "ల" నిషేధం

అవధాని: "య" ("భాషయ" పదం అయిపోయింది)

పృచ్చక: నిషేధం లేదు

అవధాని: "గె"

పృచ్చక: "య" నిషేధం (ఎందుకో?)

అవధాని: "లు"

పృచ్చక: నిషేధం లేదు

అవధాని: "చున్"

మొదటి పాదం అయిపోయింది - "శ్రీయై భాషయ గెలుచున్"

రెండవ ఆవృత్తి

పృచ్చక: "ర" నిషేధం

అవధాని: "న్యా" రెండవ అక్షరం "య" (ప్రాస కాబట్టి)

పృచ్చక: మూడవ అక్షరానికి "మ" నిషిద్ధం ("న్యాయము" అవ్వకుండా)

అవధాని: "గ"

పృచ్చక: "మ" నిషేధం

అవధాని: "తిన్"

పృచ్చక: "వ" నిషేధం

అవధాని: "గ"

పృచ్చక: "డ" నిషేధం

అవధాని: "న్న"

పృచ్చక: "వ" నిషేధం

అవధాని: "డే"

పృచ్చక: "భ" నిషేధం

అవధాని: "లె", తర్వాతి అక్షరం యతి "నా"

పృచ్చక: "డ" నిషేధం ("నాడు" అనకుండా)

అవధాని: "నీ"

పృచ్చక: "స" నిషేధం

అవధాని: "నా"

పృచ్చక: "శ" నిషేధం

అవధాని: "డున్"

రెండవ పాదం కూడా పూర్తైపోయింది
"న్యాయగతిన్ గన్నడేలె నానీనాడున్"

కన్నడు - కృష్ణుడు లేదా కన్నడభూపతి అన్న అర్థంలో కృష్ణరాయలు
కన్నడేలెనాన్ - కృష్ణరాయలే ఏలుతున్నాడా అన్నట్లుగా
ఈ నాడున్ - ఈ నాడు కూడా
మిగతా రెండు చరణాలూ నిషేధం లేదు.
మొత్తం పద్యం:

శ్రీయై భాషయ గెలుచున్
న్యాయ గతిన్ గన్నడేలెనా నీనాడున్
శ్రేయమ్ము విజయభావన
యీ యువతరమునకునిచ్చి యేపున్ గాంచున్

ఈనాడు కూడా కృషదేవరాయలు నడుపుతునాడా అన్నట్లుగా నడిచే విజయభావన యువతరానికి శ్రేయస్సునిచ్చి ప్రగతి చెందుతుంది. భాష విజయాన్ని పొందుతుంది.
నిషిద్ధాక్షరిలో సాధారణంగా ఉపయోగించే రెండు కిటుకులు:
1. ఇచ్చిన విషయానికి సంబంధించిన పదాలు, నిషేధం లేని చివరి రెండు పాదాల్లో వేసుకోవడం.
2. నిషేధం ఉన్న పాదాల్లో రెండక్షరాల పదాలే ఎక్కువగా పెట్టుకోవడం.

5. న్యస్తాక్షరి

దీనినే నిర్దిష్టాక్షరి అని కూడా అంటారు. ప్రతి పాదంలోనూ ఒక అక్షరాన్ని పృచ్చకులు నిర్దేశిస్తారు. ఇచ్చిన అక్షరాన్ని, ఇచ్చిన స్థానంలో ఉండేటట్టు, ఇచ్చిన అంశం మీద పద్యం చెప్పాలి.

వృత్తం: చంపకమాల
ఇతివృత్తం: ద్రౌపది తన కొడుకులని నిష్కారణంగా చంపిన అశ్వత్థామని దూషించడం

ఒకటవ పాదం 13వ అక్షరం "ల"
రెండవ పాదం 19వ అక్షరం "ష" (చంపకమాలలో 19వ అక్షరం గురువవ్వాలి. ఇచ్చిన అక్షరం లఘువు. దాన్ని తర్వాతి అక్షరం సంయుక్తాక్షరం వేసి గురువుని చేసుకోవాలి.)
మూడవ పాదం 2వ అక్షరం "ద్రి"
(ఇది కాస్త దుర్మార్గమైనది! 2వ అక్షరం ఒక పాదంలో నిర్దేశిస్తే అది ప్రాస కాబట్టి మొత్తం అన్ని పాదాల్లోనీ అదే రావాలి. పైగా "ద్రి" సంయుక్తాక్షరం కాబట్టి దానిముందరి అక్షరం సాధారణంగా గురువౌతుంది. అంటే మొదటి అక్షరం గురువు. కానీ ఇచ్చిన వృత్తం చంపకమాల లఘువుతో మొదలవ్వాలి! ఎలా మరి? దీనికి రెండు పరిష్కారాలున్నాయి.
1. "ద్రి" ముందరి అక్షరం వేరే పదంలోదైతే అది గురువు అవ్వదు. ఉదాహరణకి "నన్ను ద్రినయనుండు" అని ఉన్నప్పుడు "న్ను" గురువవ్వదు.
2. అచ్చ తెలుగు పదాలు ప్రత్యేకమైనవి కొన్ని ఉన్నాయి - అద్రుచు, ఎద్రుచు, విద్రుచు, చిద్రుప, పద్రుచు. ఈ పదాలలో మొదటి అక్షరం లఘువే అవుతుంది. మొత్తం సాహిత్యంలో ఈ పదాలతో "ద్ర"కార ప్రాస వేసి ఒక్క నాచన సోమన తన ఉత్తరహరివంశంలో చంపకమాల పద్యం రాసాడు.
ఇలా అడిగినందుకు అవధానివర్యులకి కాస్త కోపం వచ్చినమాట నిజమే. అయితే ఇలాటి సమస్య ఇచ్చినప్పుడు, పృచ్చకులు కూడా అలాటి పద్యం చెప్పగలిగి ఉండాలి. "మీరు పద్యం తయారుచేసుకున్నారా" అనికూడా అడిగారు. అవునని చెపితే సరేనని మొదలుపెట్టారు. కానీ చివరికి పరమాద్భుతంగా దాని పూరణ చేసారు)

నాల్గవ పాదం 9వ అక్షరం "డ"

పూరణ:

అద్రుచునె నుండు వీరు మరియాద"ల" మీరగ దేశికాత్మజా!
విద్రుచుట పాడియా కరుణ వీడుచు తీవ్రముగా వి"ష"మ్ము, ని
న్ను "ద్రి"భువనమ్ములున్ విడుచునో! పసివారిని గోసియుంటివే!
చిద్రుపలు పాడుపోక"డ"లిసీ బ్రదుకున్ గొను నెల్లకాలమున్!

అద్రుచునె - అదురుతూనే
దేశికాత్మజా - దేశిక + ఆత్మజా = గురు కుమారా (అశ్వత్థామ)
విద్రుచుట - విదిలించుట
చిద్రుపలు - చిన్నవైన

ఈ పసిపాపలు(ఉపపాండవులు) మరియాద మీరడానికెప్పుడూ అదురుతునే ఉంటారు. అలాటి వీరిపై కరుణ వీడి, విషాన్ని విదల్చడం న్యాయమేనా? నిన్ను ఈ త్రిలోకాలూ విడిచిపెట్టకపోవా (నీకు పుట్టగతులు లేకుండాపోవా)! పసివాళ్ళని కోసివేసావే. ఇలాటి నీ చిన్నతనపు పాడు నడవడికలు నీ బ్రతుకంతా ఎల్లకాలమూ నిన్ను వెంటాడతాయి.
ఇక్కడ గురుపుత్రా అన్న సంబోధన చాలా సార్థకమైనది. అంతటి గురువునకి కుమారుడవై ఇలాటి లఘు కార్యానికి తలపడ్డావా అని అనడం. "ఎల్లకాలమూ"అన్న పదం కూడా సాభిప్రాయమే. అశ్వత్థామ చిరంజీవి కాబట్టి తను చేసిన పాడుపని ఎల్లకాలం అతణ్ణి వెంటాడుతుందని!

6. ఆశువు

ఆశువుగా వెంటనే పద్యం చెప్పడం
1. జ్ఞాన భిక్షని పెట్టమని అడుగుతూ అమ్మవారిని వేడుకోవడం

జ్ఞానభిక్ష ప్రసాదింప జనని నీవు
పూనుకొనకున్న యెవ్వారు పూనగలరు
ఎందరెందరొ అజ్ఞానమిచ్చువారు
కనక నినుజేరి కైమోడ్పు కడగుచుంటి

2. కృష్ణదేవరాయల మతసహనానికి ధూర్జటి ఉదాహరణ. వాళ్ళిద్దరి గురించీ ఒక పద్యం.

అటుబెట్టిన రేడొకడట
ఇటుబెట్టిన కవి యొకండు నేమాయనులే
అటుబెట్టిన యిటుబెట్టిన
ఎటుబెట్టిన నేమి కాని నిటుబెట్టవలెన్

ఇదొక చమత్కారమైన పద్యం. నటిస్తూ చూపిస్తే కాని అర్థం కాదు. "అటుబెట్టిన" అన్నప్పుడు "తిరునామాలు" నిలువుగా పెట్టుకున్న నామాలని చూపించాలి. కృష్ణరాయలు వైష్ణవుడు కదా! "ఇటుపెట్టిన" అన్నప్పుడు అడ్డ నామాలని చూపించాలి. ధూర్జటి శైవుడు. చివరన "ఇటుబెట్టవలెన్" అన్నప్పుడు, ఒకళ్ళకి దానం చేస్తున్నట్లు చేతులు చూపించాలి. ధూర్జటి పెట్టేది కవిత్వం. రాయలు పెట్టేది ధనమో భూమో.

మిగిలిన రెండు అంశాలూ పురాణం, అప్రస్తుత ప్రసంగం. అవి ప్రస్తుతానికి అప్రస్తుతం:-)

కొసమెరుపు:
న్యస్తాక్షరి ఇచ్చిన పృచ్చకరాక్షసుడు భవదీయుడే:-)
>

పూర్తిగా చదవండి...

Sunday, April 6, 2008

ఉగది స్పెషల్!!!

రేపు సర్వధారి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఇక్కడ స్పెషల్ ఉగాదిపచ్చడి వడ్డించడమౌను! అందరూ ఆహ్వానితులే!
పూర్తిగా చదవండి...