తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, December 10, 2012

భక్తి స్మరియింతును శివశ్శివా యటంచు!


ఈ ఏటికివాళ ఆఖరి కార్తీకసోమవారం. ఏ పద్యాలతో యీ పరంపర ముగిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే చాలా పద్యాలే కనిపించాయి. తెలుగు కావ్యాలలో, శతకాలలో, శివస్తుతికి కరువు లేదు! ఆనాటి నన్నెచోడుని కుమారసంభవం నుండి, ఈ నాటి శ్రీరామలింగేశ్వర శతకం దాకా ఎన్నో ఉన్నాయి. కాని అయ్యవారి స్మరణ అమ్మవారు లేకుండా సంపుర్ణం కాదనిపించింది. అసలు వారిద్దరికీ ఎడమే లేదు కదా. అంచేత అర్ధనారీశ్వర రూపాన్ని తలచుకొని మంగళాంతం చేయడం సబబనిపించింది. కానీ ఆ రూపాన్ని వర్ణించే, స్తుతించే పద్యాలేవన్నా మన సారస్వతంలో కనిపిస్తాయేమోనని ఆలోచిస్తే, ఏవీ తట్టలేదు. పెద్దనగారి "అంకము జేరి" పద్యంలో ఉన్నది అర్ధనారీశ్వరుడే అయినా, అందులో ప్రధాన వస్తువు అది కాదు. కొంత వెతికితే కుమారసంభవంలో ఒక పద్యం కనిపించింది, కాని అది పెద్దగా తృప్తినివ్వ లేదు (మంచి పద్యం ఎవరికైనా తెలిస్తే యిక్కడ తప్పక పంచుకోండి). ఆదిశంకరుల అర్ధనారీశ్వర స్త్రోత్రం మాత్రం మేరునగంలాగ కళ్ళెదుట కనిపించింది. కాని అది సంస్కృతమాయె! అంచేత ఆ స్తోత్రాన్ని మాతృకగా తీసుకొని తెలుగులో ఒక సీసమాలిక రచించాను. అది యిది:

ఒకవంక సంపెంగ యొకవంక కప్పురం
బైన మైచాయతో నలరు మూర్తి
నొకవంక ధమ్మిల్ల మొకవంక జూటమ్ము
నై యొప్పు కొప్పుతో నలరు మూర్తి
నొకవంక కఱిమబ్బు లొకవంక కెంపుమిం
చుల బోలు కురులతో నలరు మూర్తి
నొకవంక నిడుకల్వ యొకవంక విరిదమ్మి
యగు కన్నుగవతోడ నలరు మూర్తి
నొకవంక పూవులు నొకవంక పునుకలు
నలక గళమ్ముల నలరు మూర్తి
నొకవంక ఝణఝణ లొకవంక బుసబుస
లందెలరవళుల నలరు మూర్తి
నొకవంక కస్తూరి యొకవంక చితిబూది
యలదిన మేనితో నలరు మూర్తి
నొకవంక ప్రకృతియు నొకవంక వికృతియు
నమరు నాకృతితోడ నలరు మూర్తి

లాస్యతాండవకేళీ విలాసములను
సృష్టి లయములు లీలగ జేయు మూర్తి
నేకతమ నిరీశ్వర నిఖిలేశ్వరమ్ము
నైన తత్త్వముతో నలరారు మూర్తి
నఖిల జగతికి తలిదండ్రియైన మూర్తి
నాదిశంకర విదిత మహద్విభూతి
నాత్మ భావింతు నిరతమ్ము నర్చసేతు
భక్తి స్మరియింతును శివశ్శివా యటంచు!

ఆ ఆదిదంపతులది భలే అన్యోన్యమైన కలయిక. వాళ్ళ పేర్లు కూడా ఒకటే! "శివః" అంటే అయ్య, "శివా" అంటే అమ్మ! అందుకు "శివశ్శివా" అని స్మరించడం. అంత సామ్యం ఉన్న వాళ్ళిద్దరూ మళ్ళీ అంత అసామాన్యులు కూడాను! పైపై వేషాల మాట అటుంచి, తత్త్వతః కూడా ఎదురెదురు స్వభావాల వారు. ఒకరి కన్ను నిడువైన కలువ, మరొకరిది విప్పారిన తామర. అంటే ఒకరు రాత్రికీ మరొకరు పగటికీ ప్రతినిధులు. ఒకరు ప్రకృతి, మరొకరు వికృతి. ఒకరిది లాస్యసృష్టి, మరొకరిది విలయ తాండవము. ఇంతటి వైవిధ్యమున్న రెండు శక్తులు ఒకటి కావడమే సృష్టిలోని వింత. నిజానికి ఒకటే శక్తి యిలా రెండుగా కనిపిస్తోందన్నది అద్వైత సిద్ధాంతం. నిరాకార నిర్గుణ శక్తికి ఒక రూపాన్ని భావించడంలో, అద్వైతం ఈ అర్ధనారీశ్వర రూపాన్ని దాటి యింకా ముందుకుపోతుంది. అర్ధనారీశ్వర మూర్తి ఒకటే అయినా, అందులో శివ శక్తి రూపాలు భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి తేడాకూడా లేని, తెలియని రూపం మరొకటి ఉంది. అది లలితాదేవి! సౌందర్యలహరిలో ఆ రూపాన్ని ఆదిశంకరులు యిలా వర్ణిస్తారు:

త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శంకే హృతమభూత్
యదేతత్ త్వద్రూపం సకల మరుణాభం త్రినయనమ్ 
కుచాభ్యా మానమ్రం కుటిలశశిచూడాల మకుటమ్ 

అమ్మా! నీ రూపం మొత్తం అరుణకాంతులతో వెలుగుతోంది (ఇది గౌరీదేవి రంగు). కాని నీకు మూడు కన్నులున్నాయి (ఇది శివుని రూపు). కుచభారంతో వంగిన శరీరమూ (పార్వతి రూపు), పైన జడలో నెలవంకా (శివుని రూపం) ఉన్నాయి నీకు. ఇది చూస్తే ఏమనిపిస్తోందంటే, నువ్వు శివుని వామభాగాన్ని ఆక్రమించడంతో సంతృప్తి పడక ఆ రెండో సగాన్ని కూడా ఆక్రమించినట్టుగా ఉన్నావు.
అదీ అసలు తత్త్వం!

పైకి భార్యాభర్తలు అన్యోన్యంగా చెరిసగమై జీవితాన్ని సాగిస్తున్నట్టు కనిపిస్తే,  దాని అసలు తత్త్వం, భార్యామణి పెత్తనమే - అన్న ధ్వని పై వర్ణనలో స్ఫురిస్తే, అది నా తప్పు కాదు :) అద్వైతాన్నయినా అర్థం చేసుకోవచ్చు కాని అర్ధాంగిని అర్థం చేసుకోలేమని ఊరికే అన్నారా! అందుకే కాబోలు ఆదిశంకరులు రెండవదాని ఊసెత్తకుండా మొదటిదాన్ని నెత్తికెత్తుకున్నారు. :)

ఏది యేమైనప్పటికీ, పరమశివుడు భర్తలకు పరమాదర్శం అనే ఒక మంచి మాటతో ఈ పరంపరకు మంగళాశాసనం పలకుతున్నాను. శుభం!

పూర్తిగా చదవండి...

Monday, December 3, 2012

ముక్కంటి! నా కింక దిక్కెవ్వరయ్య?


భక్తి అనేది చాలా విచిత్రమైనది. అది మనిషిని పూర్తిగా పరవశుణ్ణి చేస్తుంది. నిజమైన భక్తిలో ఆర్తి, వేదన, తపన, అమితమైన అనురాగమూ - యిలా ఎన్నెన్నో భావాలు పెనవేసుకుపోయి ఉంటాయి. ఈ కాలంలో అన్నిటితో పాటు భక్తికూడా కలుషితమైపోయింది కాని, పూర్వకాలంలోని భక్తుల కథలు చదివినా విన్నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది! గాఢభక్తికీ, మూఢభక్తికీ తేడా చెప్పడం కష్టమే! అయినా భక్తికుండే శక్తి చాలా గొప్పదని అనిపిస్తుంది, వారి కథలు చదివితే. అలాంటి ఒక వీర భక్తాగ్రేసరుడు రుద్రపశుపతి. ఇతనిది చాలా ఆసక్తికరమైన కథ!

తన పేరుకు తగ్గట్టే, రుద్రపశుపతి శివునికి పరమభక్తుడు. ఇతనొక రోజు పురాణం వింటూ ఉంటే అందులో క్షీరసాగర మథనం కథ వచ్చింది. అది చెపుతున్న పౌరాణికుడు ఆ పాలసంద్రంనుండి పుట్టిన కాలకూటవిషాన్ని శివుడు మింగాడని చెప్పాడట. అంతే!

ఆ రుద్రపశుపతి యాలించి, "భర్గు
డారగించుట నిక్కమా విషం" బనుడు

"ఏమిటి? శివుడు నిజంగా విషం తిన్నాడా!" అని అడిగాడట రుద్రపశుపతి. దానికా కథకుడు, "అవును నిజంగానే మింగాడు. అందులో అనుమానమేముంది?" అన్నాడట. అప్పుడు,

విని యుల్కిపడి వీపు విఱిగి "హా! చెడితి!"
నని, నేలబడి పొర్లి "యక్కటా! నిన్ను
వెఱ్ఱి జేసిరిగాక విశ్వేశ! యెట్టి
వెఱ్ఱివారైనను విషము ద్రావుదురె?
బ్రదుకుదురె? విషమ్ము పాలైన వార?
లిది యెట్టు వినవచ్చు ; నేమి సేయుదును?
నిక్క మెవ్విధమునె నిన్నెకా కెఱుగ;
ముక్కంటి! నా కింక దిక్కెవ్వరయ్య?
నా కొఱకైన బినాకి ! యివ్విషము
చేకొన కుమియవే నీకు మ్రొక్కెదను;
గటకటా ! మేన సగంబున నుండి
యెట వోయితవ్వ ! నీ వెఱు గవే గౌరి !

శివుడు విషం తాగాడన్న వార్త విని తట్టుకోలేకపోయాడు వెఱ్ఱి భక్తుడైన రుద్రపశుపతి. నేలపై పడిపోయి పొర్లుతూ శోకాలందుకున్నాడు. పైగా "అందరూ కలిపి నిన్ను వెఱ్ఱివాణ్ణి చేసేశారయ్యా శివయ్యా!" అని కూడా అన్నాడు! "ఇంక నేనేమి చేసేదిరా దేవుడా! నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదే! అలాంటి నువ్వు విషం పుచ్చుకుంటే, నేనేమైపోవాలి. నీకు దండంపెడతాను, నాకోసమైనా ఆ తాగిన విషాన్ని కక్కెయ్యి!" అని విలపించాడు. "అవ్వా! నువ్వతని మేనిలో సగమున్నావే. అతను విషం తాగుతూంటే నువ్వేం చేస్తున్నావు తల్లీ" అని రోదించాడు. ప్రమథ గణాలనూ, ఇతర శివగణాలైన శతరుద్రులనూ, అసంఖ్యాతులనూ, వీరభద్రుణ్ణీ, అందరినీ నిలదీసి అడిగాడు. ఆఖరుకి ఇలా అంటాడు:

తల్లిలేని ప్రజల దలతురే యొరులు?
తల్లి యున్న విషము ద్రావ నేలిచ్చు !

తల్లిలేని వాడు కాబట్టి అతని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. శివునికే ఒక తల్లంటూ ఉంటే అతడిని విషం తాగనిచ్చేదా అని వాపోతాడు! చివరకు, ఆ ఘోరాన్ని భరించలేక ఆత్మహత్యకు సిద్ధపడి సముద్రంలోకి దూకేస్తాడు. అప్పుడా రుద్రపతిని కాపాడి, శంకరుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమవుతాడు. అతని భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమంటాడు. ముగ్ధభక్తి మూర్తీభవించిన ఆ రుద్రపశుపతి, "నాకేమీ వద్దు. నీకేం ప్రమాదం ముంచుకొస్తుందో! నువ్వు మింగిన ఆ కాలకూటాన్ని గబుక్కున బయటకు ఉమ్మేయ్. అదే చాలు" అని కోరుకుంటాడు. అతని మాటలకు శివుడు నవ్వి, "ఆ కాలకూటం నా కంఠంలో అణుమాత్రంగా చిక్కుకొని ఉంది. దానికోసం నువ్వింత దుఃఖపడనక్కరలేదు. అది నన్నేమీ చెయ్యదు" అని భరోసా పలుకుతాడు. అయినా రుద్రపశుపతి నమ్మడు. "అయితే నన్ను చావనీయి. లేకపోతే నువ్వు మింగిన విషం బయటకి కక్కు" అని పంతం పడతాడు! అప్పుడు:

"నుమియ కుండిన జచ్చునో ముగ్ఢ" యనుచు
నుమబోటి యాత్మలో నుత్తలపడగ
"నుమిసిన గొని కాల్చునో తమ్ము" ననుచు
గమలాక్ష ముఖ్యులు గడగడ వడక
బ్రమధు లాతని ముగ్ధభక్తికి మెచ్చి
యమిత మహోత్సవులై చూచుచుండ
నొక్కింత నవ్వుచు నుడురాజధరుడు
గ్రక్కున లేనెత్తి కౌగిట జేర్చి,
"ప్రమధుల యాన నీ పాదంబులాన
సమయ నివ్విషమున సత్య మిట్లనిన
నమ్మవే వలపలి నాతొడ యెక్కి
నెమ్మి జూచుచునుండు నీలకంఠంబు"
నని యూరుపీఠంబునందు ధరించె
మును గుఱియున్నదే ముగ్ధత్వమునకు
నదిగాక కుత్తుక హాలాహలంబు
కదలినంతటనే చచ్చెద గాక ! యనుచు
దనకరవాలు ఱొమ్మున దూసి మోపి
కొని కుత్తుకయ చూచుచును ఱెప్ప లిడక
పశుపతి తొడమీద బాయక రుద్ర
పశుపతి నేడును బాయకున్నాడు.

విషం ఉమ్మకపోతే పాపం ఆ వెఱ్ఱివాడు చస్తాడు కాబోలని పార్వతీదేవి లోపల కలత చెందుతోంది. ఎక్కడ బయటకి ఉమ్మేస్తే తమనందరినీ కాల్చేస్తుందోనని విష్ణుమూర్తి మొదలైన దేవతలందరూ గడగడా వణుకుతున్నారు. రుద్రపశుపతి ముగ్ధభక్తికి మెచ్చి ప్రమథులు మహోత్సాహులై చూస్తున్నారు! అప్పుడు శివుడు నవ్వి, రుద్రపతిని తన తొడమీదకి ఎక్కించుకొని, "చూడు, గరళం నా కంఠంలోనే ఉంది. నీ పాదాలమీద ఒట్టు, ప్రమథగణాలమీద ఒట్టు. అది నన్నేమీ చెయ్యదు. కావలిస్తే అలాగే చూస్తూ ఉండు" అన్నాడట. "సరే చూస్తాను, అది కాని నీ గొంతు దిగిందా! నేను కత్తితో పొడుచుకు చస్తాను" అని రుద్రపశుపతి కత్తి తన ఱొమ్మున మోపి రెప్ప వెయ్యకుండా ఆ గరళకంఠుని కంఠాన్నే చూస్తూ కూర్చున్నాడట... ఇప్పటికీ కూడా!

ముగ్ధభక్తికి ఇంతకన్నా తార్కాణం మరొకటి ఉంటుందా! ఈ కథ పాల్కురికి సోమనాథుడు రచించిన బసవపురాణం లోనిది. దేశి ఛందస్సయిన ద్విపదలో, తేలిక భాషలో చేసిన రచన యిది. పదకొండు పన్నెండు శతాబ్దాల కాలంలో, ప్రధానంగా కన్నడ దేశంలో, వీరశైవం విజృంభించింది. దీనికి మూలకారకుడు బసవేశ్వరుడు. ఇతడు మహాభక్తుడు, ప్రవక్త, సంస్కర్త. బిజ్జల మహారాజుకి ప్రధానిగా కూడా ఉన్నాడు. ఇతడు సాక్షాత్తూ నంది అవతారమేనని వీరశైవులు భావిస్తారు. ఇతని కథనే పాల్కురికి సోమనాథుడు బసవపురాణంగా రచించాడు. ఈ పురాణంలో ఒక్క బసవునిదే కాక అనేకమంది శివభక్తుల కథలున్నాయి. ఆ కథలన్నీ ఇంచుమించు అద్భుత రసపోషకాలే!

ఈ కథ మొదట్లో బసవుని భక్తి గురించి, నాలుగు వాక్యాలాలో, గొప్ప కవితాత్మకంగా చెపుతాడు పాల్కురికి సోమన:

వడిబాఱు జలమున కొడలెల్ల గాళ్ళు
వడిగాలు చిచ్చున కొడలెల్ల నోళ్ళు
వడివీచు గాడ్పున కొడలెల్ల దలలు
వడిజేయు బసవన కొడలెల్ల భక్తి!


పూర్తిగా చదవండి...

Monday, November 26, 2012

మృత్యుంజయా!


శివుడి మీద నాకు చాలా యిష్టమైన పద్యాలలో శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారి "మృత్యుంజయా" పద్యాలు ముందువరసలో ఉంటాయి. వాటిలో హాస్యముంది, భక్తి ఉంది, ఆర్తి ఉంది, అధిక్షేపణ ఉంది. ఎన్నెన్నో భావాలొలికిస్తాయవి. వాటన్నిటిలోనూ అంతస్సూత్రంగా ఒకానొక ఆత్మీయత మెరిసిపోతూ ఉంటుంది.

పాపమీ కవి ఈశ్వరునికి తన గోడేదో చెప్పుకుందామనుకుంటాడు. అంతలోనే ఒక పెద్ద అనుమానం వచ్చిపడుతుంది! అసలు తన మొఱ ఆ యీశ్వరునికి వినిపిస్తుందా అని. ఎందుకా అనుమానమంటే చెపుతున్నాడు కవి:

మెడ నాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా
బిడతో నీ కెపు డొక్కటే గుసగుసల్, వీక్షించి మీ చంద మె
క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీ చెవిం
బడుటేలాగునొ మా మొఱల్ తెలియదప్పా మాకు మృత్యుంజయా!

ఓ వైపు పాముల బుసబుసలు, మరోవైపు అర్థాంగితో గుసగుసలు. అది చూసి నెత్తినున్న గంగమ్మకు రుసరుసలు! ఈ గోలలో తనలాంటి భక్తుల మొఱలు ఆయనకెలా వినిపిస్తాయని కవిగారి సంశయం. "అప్పా" అన్న సంబోధనలో ఎంత ఆత్మీయత ఉంది! శివయ్య తనను కన్నతండ్రి అని పరిపూర్ణంగా నమ్మిన భక్తుడీ కవి. ఆ చనువుతోనే ఇంకా ఏమంటాడంటే:

ఒక లంబోదరుడైన పుత్రకుడు మున్నున్నట్టిదే నీకు జా
లక కాబోలును సృష్టి జేసితివి యీ లంబోదరుం గూడ, దీ
గకు గాయల్ బరువౌన, కాని, కుడుముల్ గల్పించి యవ్వాని కే
లొకొ యివ్వానికి నొక్కమైని యిడుముల్ మొల్పింతు మృత్యుంజయా!

"ఏమయ్యా మృత్యుంజయా! నీకు లంబోదరుడైన పుత్రుడు ముందే ఒకడున్నాడు కదా (గణపతి అన్న మాట!). అతడు చాలక కాబోలు మరో లంబోదరుడైన నన్ను పుట్టించావు! (కవిగారిది బానపొట్ట కాబోలు :-)) సరే, తీగకు కాయలు బరువా? పుట్టించావు. బాగానే ఉంది. కానీ, ఆ కుమారునికేమో చక్కగా కుడుములు పెడతావు. ఈ కోడుకుని మాత్రం యిడుములపాలు చేస్తున్నావే, ఇదేమి న్యాయం?" అంటూ నిలదీస్తాడు కవి.

ఒక గాఢమైన తాత్త్విక విషయాన్ని కూడా లేలేత నవ్వులలో ఎలా పలికించ వచ్చో యీ పద్యం చూస్తే తెలుస్తుంది:

సరిలే! మానవకోటి యీ వెలుపలన్ సంసారచక్రాననే
దొరలన్ లేకిటులుండ, లో నొకటి రెండున్ గావె షడ్చక్రముల్
వరుసన్ జేర్చి బిగించినావుగద అబ్బా! నాగపాశాలతో
దరియింపన్ దరమౌనె నీ కరుణచేతన్ గాక మృత్యుంజయా!

"సరిసరి! మేము బయటనున్న సంసారమనే ఒకే ఒక చక్రంలో పడి అందులోనుంచే బయటపడలేక సతమతమవుతూంటే, అది చాలదన్నట్టు, మా లోపల ఒకటికాదు రెండుకాదు ఆరు చక్రాలను నాగపాశాలతో బిగించేసావు కదా! అబ్బా! నీ కరుణ లేకుండా వీటిని భేదించడం మాకు సాధ్యమవుతుందా చెప్పు!" అంటున్నాడు. మాట్లాడే భాషలోని కాకువు, నుడికారంలోని సొగసు, అవలీలగా పద్యంలో నిబంధించడం ఈ కవిగారికి బాగా తెలిసిన విద్య అనిపిస్తుంది యీ పద్యాలు చూస్తే.

వీరి పద్యాలలో హాస్యమొక్కటే కాదు, గాఢమైన అనుభూతీ ఆర్తీ కూడా ఉన్నాయి.

ఏ బైకిన్ దెగపండితుండనను పేరే గాని నాలోని కే
బో బోవంగను జెప్ప లజ్జయయిపోవున్ నేను నా బుద్ధికే
యే బొడ్డూడని బిడ్డనో యగుదు తండ్రీ! నిక్క మీపాటిదే
నా బండారము, త్రోవ నీవిడక యున్నంగాదు మృత్యుంజయా!

నిజమైన ఆత్మవిమర్శా ఆత్మావలోకనమూ చేసుకున్నప్పుడు అహంకారం పూర్తిగా తొలగిపోతుందనడాన్ని యీ పద్యం చెపుతోంది. "పైకి నేను తెగ పండితుడనన్న పేరుంది కానీ, నిజంగా లోలోపల తొంగిచూసుకుంటే నా మీద నాకే సిగ్గువేస్తుంది. నేను నాకే ఒక బొడ్డూడని బిడ్డలాగా కనిపిస్తాను. నా బండారం నిజంగా అంతే! అంచేత నువ్వే నాకు తోవ చూపించాలి" అంటున్నాడు కవి. లోలోపలకి తొంగి చూసుకుంటే మన పరిమితులు మనకి స్పష్టంగా బోధపడతాయి. అనంతమైన ఈ విశ్వంలో విస్తరించిన శక్తి ముందు మన శక్తి ఎంత అల్పమైనదో మనకి తెలిసివస్తుంది.

శివునికీ వెన్నెలకీ ఉన్న విడదీయలేని సంబంధం మనకీ కవి పద్యాలలో కూడా కనిపిస్తుంది:

ఎల్లన్ నీవయిపోయి నీవు తలపై ఏ చిన్నిపువ్వట్లొ జా
బిల్లిం దాలిచియుండ, వెన్నెలలుగా విశ్వాన నీకాంతులే
వెల్లింగొల్పెడునట్టులున్నయవి యీ వేళా విశేషమ్ముచే
వెళ్ళంబుచ్చకు మింక దీని మనసే వేఱయ్యె మృత్యుంజయా!

లోకమ్మందునగాక వెన్నెలలు లోలో గాయునట్లుండె, న
య్యాకాశమ్మున నున్న జాబిలియు నాయందున్న డెందమ్ము ని
ట్లేకాకారత నొంద నేమి కతమో! యీ యాత్మ సంబంధమున్
నీ కారుణ్యముచేత నేర్పడుటగానే తోచు మృత్యుంజయా!

జగత్తంతా శివమయమయ్యింది. ఆతని తనుకాంతి విశ్వమంతా వెన్నెలలై విరాజిల్లింది. మామూలు మనిషికి వెన్నెల బయట లోకంలో మాత్రమే కనిపిస్తుంది. అంతా శివుడే అయిన భక్తునికి తనలోపల కూడా వెన్నలలు విరబూస్తాయి. ఆకాశంలోని జాబిలి తనలోని మనస్సూ ఒకటే అయిపోతాయి(చంద్రుడు మనసుకి అధిపతని అనేది ఇందుకేనేమో!). అప్పుడా కరుణామయుడైన పరమేశ్వరుడు ఆ భక్తుని మనస్సునే తలపూవుగా ధరిస్తాడు కాబోలు!

పూర్తిగా చదవండి...

Monday, November 19, 2012

దివ్వెలనెల


దివ్వెలనెల మొదలయ్యింది. నేలమీద నువ్వుల దివ్వె, నింగిపైన వెన్నెల దివ్వె. ఆకాశంలో వెలిగే ఆ రత్నదీపం శంకరునికి ఆభరణం. ప్రమిదలో దీపం అచ్చంగా జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే యిది పరమశివునికి యిష్టమైన నెల. అందులోనూ కార్తీక సోమవారం మరింత ప్రీతికరం. అంచేత యీ రోజు శివుని గురించిన పద్యం చదువుకుంటే పుణ్యంపురుషార్థమూను!

తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు. శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ!

శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా
రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!

ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్. సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది. అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి యిలా కోరుకుంటున్నాడు కవి. "ఓ దేవా! నీ కరుణ అనే శరత్కాలాన్ని ప్రసాదించవయ్యా, అంతే చాలు. అప్పుడు వికసించిన నా మనస్సులో నిరంతరం నిన్నే భావన చేస్తూ, ఆ సేవలో తామరతంపరగా నా బతుకు వెళ్ళదీస్తాను".

ఈ పద్యంలో ఎంతటి భక్తి ఉందో అంతటి కవిత్వముంది. ఈ శతకమంతా అంతే! సంపదని మెరుపుతో పోల్చడంలో ఎంతో ఔచిత్యం ఉంది. సంపద కూడా మెరుపులాగే మనసుని ఆకట్టుకుంటుంది. కళ్ళను జిగేల్మనిపిస్తుంది. మెరుపు లాగానే అది కూడా అతి చంచలం. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పలేం. అతి తక్కువ కాలం నిలుస్తుంది. సంపద అనే మెరుపు లేకపోతే సంసారమనే మేఘానికి అందమే లేదు. ఒక చిన్న పోలికలో లోతైన భావస్ఫూర్తి నిబంధించడం గొప్ప కవిత్వ లక్షణం! ఇక్కడ మరొక చమత్కారం ఉంది. కావ్యాలని శ్రీకారంతో మొదలుపెట్టడమనేది ఒక ఆనవాయితీ, "శ్రీ" శుభాన్ని సూచిస్తుందని. ఇక్కడ కూడా కవి శ్రీకారంతోనే శతకాన్ని మొదలుపెట్టాడు. అయితే అది శుభసూచకంగా కాక చంచలమైన సంపదని సూచించేందుకు వాడుకొని, దానినుండి తనని రక్షించమని ఈశ్వరుణ్ణి కోరుకొంటున్నాడు! అంటే సంపదమీద కవికి ఎంతటి తిరస్కృతి ఏర్పడిందో దీనివల్ల స్ఫురిస్తుంది. ఈశ్వరుని కరుణను శరత్కాలంగా వర్ణించడం కూడా మనోజ్ఞమైన పోలిక. చల్లని చూపుల వెన్నెలలు కురిపిస్తే అది శరత్తుకాక ఇంకేమవుతుంది. ఈ కార్తీకమాసమంతా ఆ ఈశ్వరుని కరుణాశరత్సమయమే కదా! ఈ మాసంలోనే భక్తుల హృదయసరసీరుహాలు నిండుగా విచ్చుకుంటాయి. వికసించిన ఆ పద్మాలలో శశిశేఖరుడు కొలువుంటాడు. అప్పుడిక బతుకంతా వెన్నెలే! చివరి పాదంలో "తామరతంపర" మళ్ళీ చక్కని అర్థస్ఫూర్తి కలిగిన పదం. "తామరతంపర" అంటే మంచి అభివృద్ధి, సౌభాగ్యం అనే అర్థాలు వస్తాయి. ఈ పదబంధానికి అసలు అర్థం "తామరల సమూహం". తామరల సమూహంతో ఎలా అయితే కొలను కళకళలాడుతుందో, అలాగే బతుకు శోభిస్తుందని వాడుకలో ఆ అర్థం స్థిరపడింది. ఇక్కడ సందర్భానికది చక్కగా అతికింది! శరత్కాలం కాబట్టి తామరతంపర. గణాలూ యతిప్రాసలూ సరిపోయినంత మాత్రాన అది పద్యమవుతుంది కాని కవిత్వం కాదు. ప్రతిపదమూ ఔచిత్యంతో కూడుకొని, లోతైన అర్థస్ఫూర్తితో, గాఢమైన అనుభూతిని మిగిల్చినప్పుడే అది చిక్కని చక్కని కవిత్వం అవుతుంది. అలాంటి కవిత్వమే నిలుస్తుంది. ధూర్జటి కవిత్వం అలాంటి కవిత్వం. అందుకే అతడు "స్తుతమతియైన ఆంధ్రకవి".

పూర్తిగా చదవండి...

Wednesday, October 24, 2012

అమ్మల పండగ


విజయదశమి శుభాకాంక్షలు!

దసరా అంటే అమ్మల పండగే. అది నవ దుర్గలు కావచ్చు, ముగురమ్మలు కావచ్చు, ముగురమ్మల మూలపుటమ్మ కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, శ్రీశైల భ్రమరాంబ కావచ్చు, తెలంగాణ బతుకమ్మ కావచ్చు, మా ఊరి పైడితల్లమ్మ కావచ్చు, ఇంటింట వెలసిన ఇలవేల్పులు కావచ్చు. ఎవరైనా అమ్మలే. వీరందరితో పాటు, మనకు ప్రత్యక్షంగా కనిపించే మనకు జన్మనిచ్చిన అమ్మ కూడా వారి అంశే. ఆ అమ్మను, తల్లిదనాన్ని పూజించే పండగ దసరా. ఆ మాతృమూర్తే శక్తి. సర్వ సృష్టికీ కారణభూతమైన శక్తి. చదువుల తల్లి, కలుముల తల్లి, శుభముల తల్లి. ఆ శక్తిని ఎందరు మహర్షులు ఎన్ని రూపాలుగా దర్శించారో! ఎందరు కవులు ఎన్ని రకాలుగా స్తుతించారో! ఆ శక్తే వేదమాత కూడా. వేద కాలానికి ముందునుండే భారతదేశంలో శక్తి ఉపాసన ఉందని చరిత్రకారులు చెపుతున్నారు. ఋగ్వేదంలో మొట్టమొదటిసారిగా యీ శక్తి స్తుతి దేవీసూక్తంలో కనిపిస్తుంది. వాక్ అనే ఋషిపుత్రి (అంభృణి అనే ఋషి కుమార్తె) దర్శించిన సూక్తమిది. ఆ సూక్తాన్ని సస్వరంగా యిక్కడ వినండి:


ఆ తర్వాత కేనోపనిషత్తులో ప్రసిద్ధమైన ఇంద్రాగ్నివాయు గర్వభంగ సన్నివేశంలో ఆ పరాశక్తి యక్షిణి రూపంలో దర్శనమిస్తుంది. అటుపైన పురాణ వాఙ్మయంలో అనంతముఖాలతో విస్తరించి శంకరుల సౌందర్యలహరిలో పరమోత్కృష్టంగా విరాజిల్లింది.

మరొక విశేషమేమిటంటే, ఆంధ్ర కావ్యవాఙ్మయంలో లభ్యమవుతున్న తొట్టితొలి కావ్యమైన నన్నయ భారతంలో ప్రథమంగా ప్రస్తావించబడింది ముగురమ్మలే! శ్రీ వాణీ గిరిజ. ఈ ముగ్గురిని వక్ష, ముఖ, అంగములతో నిత్యమూ ధరిస్తారు వేదత్రయమూర్తులైన త్రిమూర్తులు. అంటే మనోవాక్కాయము లన్నమాట! త్రికరణశుద్ధిగా స్త్రీశక్తిని ఆరాధించమని మన ఆదిపురుషులు ముగ్గురూ చేసి చూపించారు :-)  అప్పుడే యీ లోకం నడుస్తుంది. అలాంటి సందేశంతో ఆంధ్రకావ్య సరస్వతి అవతరించింది. కవులందరూ సారస్వతేయులు. అంటే సరస్వతీపుత్రులు. అందుకే చాలామంది కవులు తమ కావ్య అవతారికలలో ఆ చదువుల తల్లిని ప్రార్థించారు.

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లంజేయుము నాదు వాక్కులను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!

అని పోతన భక్తితో ఆ తల్లిని తలచాడు. విచ్చుకున్న తామరలవంటి కన్నులు, పున్నమ చందమామవంటి మోము కలిగిన ఆ సరస్వతి జగన్మోహిని.

సింహాసనము చారు సితపుండరీకంబు
చెలికత్తె జిలుబారు పలుకుచిలక
శృంగారకుసుమంబు చిన్ని చుక్కలరాజు
పసిడికిన్నెరవీణె పలుకుదోడు
నలువ నెమ్మోముదమ్ములు కేళిగృహములు
తలుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు
చక్కని రాయంచ యెక్కిరింత

యెపుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్రచందనమందార సారవర్ణ
శారదాదేవి మామకస్వాంత వీథి
నిండు వేడుక విహరించుచుండు గాత!  

అని తెలుగుపలుకుల సొబగుమీర వర్ణించాడు శ్రీనాథుడు. ఆమె సింహాసనం తెల్లని తామరపూవు. పలుకుచిలక ఆమె చెలికత్తె, అందంగా అలంకరించుకున్న సిగపూవు నెలరాజు. పసిడి కిన్నరె వీణ తన పలుకులకు సైదోడు. బ్రహ్మదేవుని నెమ్మోము దమ్ములు (అందమైన మోము తామరలు) ఆమె ఆట నెలవులు. సత్కవుల మనసులే ఆమెను పరిపూర్ణంగా ప్రతిఫలించే తళుకుటద్దాలు. వేద విద్యలలో ఆమె విహరిస్తూ ఉంటుంది. చక్కని రాయంచ ఎక్కిరింత. వాహనానికి చక్కని అచ్చ తెలుగు పదం ఎక్కిరింత. ఆ తల్లిని చూస్తే జాబిల్లి, మల్లెపూలు, పచ్చకర్పూరం, మంచిగంధం, కల్పవృక్షం గుర్తుకువస్తాయి. అంతటి తెల్లని కాంతి ఆమెది. అంతటి చల్లని స్వాంతం ఆ తల్లిది.

ఆ పలుకుల తల్లిని మంజువాణిగా మా తల్లిగారు ఇలా స్తుతించారు (మంజువాణీ శతకంలో):

కప్పురంబువోలె కమ్మదావిని జిల్కి
మల్లెపోలవోలె మనసుదోచి
కఠినమైన మనసు కరగించు కవితతో
మమ్ము బ్రోవుమమ్మ మంజువాణి!

ఈ విజయదశమినాడు మా అమ్మనూ, ఆమె అర్చించిన పలుకులమ్మనూ, అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాతనూ మనసా స్మరించడం కన్నా భాగ్యమేముంది!
మా ఇలవేలుపు కామేశ్వరీదేవి రూపంలో ఉన్న ఆ తల్లిని, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి మాటల్లో యిలా అభ్యర్థిస్తున్నాను:

జననాభావమనుగ్రహింపు మది నీ శక్యంబు కాదేని పై
జననంబందును నా కొసంగు మెటులో సంగీతసాహిత్యముల్
పనిలే దీ యుదరంపు బోషణకునై భాషాంతరమ్ముల్; జగ
జ్జననీ దీనికి నింత వ్యర్థపు బ్రయాసంబేల కామేశ్వరీ!

పూర్తిగా చదవండి...

Monday, September 10, 2012

మృత్యుశోధన - శ్మశానం నుండి వైకుంఠం దాకా


ఈ మధ్య వరసగా మరణవార్తలు వినవలసి వచ్చింది. జువ్వాడి గౌతమరావుగారు, భద్రిరాజు కృష్ణమూర్తిగారు, నిన్నటికి నిన్న కొడవటిగంటి రోహిణీప్రసాద్‌గారు. యాదృచ్ఛికంగా నిన్ననే కలంకలలు బ్లాగులో యీ టపా చదివాను - వేదన నుంచి శోధన లోకి (జాషువా, శ్రీశ్రీ ఊతగా). అందులో పద్యాలు చదువుతూంటే నా మనసుకూడా ఏవేవో ఆలోచనల్లోకి జారిపోయింది.

ఎవరైనా ప్రముఖులు కాలధర్మం చేస్తే సంతాపం ప్రకటిస్తాం. ఎవరికోసమా సంతాపం? వారి బంధువర్గానికా? వారెవరూ మనకి తెలిసుండకపోవచ్చు. వారి గురించి మనం సంతాపం ప్రకటించడం దేనికి? ఆ చనిపోయిన వాళ్ళు మన సమాజానికి ఏదో మేలు చేసినవాళ్ళయితే వాళ్ళనుండి యీ సమాజం మరింత మంచిని పొందే అవకాశం పోగొట్టుకుందని సమాజమ్మీద సంతాపమా అది? ఏమో! ఉదాహరణకు, భద్రిరాజుగారు భాషాశాస్త్రంలో, ప్రత్యేకించి ద్రవిడ, తెలుగు భాషల గురించి విశేషమైన, మౌలికమైన పరిశోధన చేసారు. తుదిశ్వాస విడిచేవరకూ దానికి సంబంధించి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. అవన్నీ పూర్తయ్యేది ఎలాగ? రోహిణీప్రసాద్‌గారు, సంగీతమ్మీద, విజ్ఞానశాస్త్ర విషయాల మీదా ఎన్నెన్నో చక్కని వ్యాసాలు వ్రాసారు. కొద్ది కాలం కిందటి వరకూ వ్రాస్తూనే ఉన్నారు. అతనికి తెలుగుభాషంటే వల్లమాలిన అభిమానం. ఎన్నో అనువాదాలు కూడా చేసారు. వారు గతించడం వల్ల మరెన్నో మంచి వ్యాసాలను తెలుగుపాఠకులు కోల్పోయారు. అందుకు బాధగా ఉంది. అంటే ఇందులో ఎంతోకొంత స్వార్థం ఉందన్న మాట!

మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.

ఇందులో ఉన్నది పూర్తిగా వ్యక్తిగత దృష్టి. వ్యక్తిగా మనం మన శరీరంతోనూ, మనసుతోనూ అనేక బంధాలను పెంచుకుంటాం. ఆ బంధాల చుట్టునే మన బతుకు గుడుసుళ్ళు తిరుగుతుంది. "నేను" అనే ఒక భావం ఉన్నంత వరకూ ఆ బంధాలు ఉండనే  ఉంటాయి కదా. అంటే "నా" దృష్టిలో అవి నిత్యమే! అందులో మాయంటూ ఏముంది? ప్రాణం పోయిన తర్వాత ఇక "నేను" అన్నదే లేదు. మనసూ లేదు, అందులో భావాలూ లేవు, బంధాలూ లేవు. శరీరం కట్టెల్లో కాలిపోయేటప్పుడు "నా" అనుకొనేది ఏదీ అక్కడ లేదు. అంచేత అలాంటి సందర్భంలో "నా యిల్లాలు, నా పుత్రుడు" అనుకొనే ప్రసక్తే లేదు, ఇంక వాళ్ళు తోడై రావడమేమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, బతికుండి, ఆలోచించే బుద్ధి ఉండి, ఊహించే మనసుండి, భావాలు బంధాలూ అన్నీ ఉన్న స్థితిలో మనిషి తన "చావు"ని గురించి ఊహిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. చావులో కూడా తన అస్తిత్వం నశించే స్థితిని మనిషి ఊహించలేడు! అందుకే "తన" శరీరం కాలుతూంటే, "తన" బంధువులెవరూ "తన" వెంట రారని అనుకోడం. ఇదొక రకంగా "అసంబద్ధమైన" (contradictory) ఊహ. ఒక వ్యక్తి ఉన్నంత వరకూ, ఆ వ్యక్తికి అతని దృష్టిలో ఉన్న సర్వ ప్రపంచమూ నిత్యమైనదే, సత్యమైనదే. అందులో ఉండే వస్తువులు, మనుషులూ భౌతికంగా నిత్యం కాకపోవచ్చు. కాని జగమే అనిత్యం, అసత్యం కాకుండా పోవు!

ఇచ్చోట నే సత్కవీంద్రుని కమ్మని
కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
యిచ్చోట నే భూము లేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట నే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
యిచ్చోట నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
చిత్రలేఖకుని కుంచియ,నశించె!

ఈ పద్యంలో వ్యక్తిదృష్టికన్నా కూడా ఒక సామాజికదృష్టి కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తావించబడినది - ఒక కవి, ఒక రాజు, ఒక యిల్లాలు, ఒక చిత్రలేఖకుడు. వీరందరూ సమాజంలో ఒక గుర్తింపబడిన స్థానం కలిగిన వ్యక్తులు. ఈ పద్యంలో విశేషమేమిటంటే, వారి మరణాన్ని కవి ఆయా వ్యక్తుల గొప్పదనానికి ప్రతీకలైన వస్తువులు నశించిపోవడాన్ని వర్ణించడం ద్వారా చెప్పాడు. కమ్మని కలము నిప్పులలో కరిగిపోయింది. అధికారముద్రలు అంతరించాయి. నల్లపూసల చక్కదనం గంగలో కలిసిపోయింది. కుంచె నశించింది! అంటే ఆయా వ్యక్తులు సమాజానికి అందించిన సేవలు అంతరించిపోయాయని కవి వాపోతున్నట్టు ఉంది, పైన చెప్పుకున్నట్టుగా. ఒక సత్కవి మంచి కావ్యాలను సృష్టిస్తాడు. ఒక రాజన్యుడు చక్కని పాలన చేస్తాడు. ఒక యిల్లాలు ఇంటిని నేర్పుగా చక్కదిద్దుతుంది. ఒక చిత్రలేఖకుడు మంచి బొమ్మలెన్నిటినో గీస్తాడు. వారి మరణం వల్ల ఆయా మంచి పనులు వారి ద్వారా మరింక జరిగే అవకాశం ఉండదు. అంచేత ఇలాటి వ్యక్తుల మరణానికి సమాజం బాధపడుతుంది. ఒక మామూలు వ్యక్తి మరణిస్తే, అతని బంధువర్గంలో వాళ్ళు మాత్రమే బాధపడతారు. చావనేది ఎవరికైనా తప్పనిదే! ఇంతవరకూ ఆలోచనలన్నీ ఒక దారిలో సాగాయి.

కవుల కలాలు గాయకుల కమ్మని కంఠములీ శ్మశానపుం
గవనుల తొక్కిజూచెడి, యొకానొకనా డల కాళిదాస భా
రవుల శరీరముల్ ప్రకృతి రంగమునం దిపుడెంతలేసి రే
ణువులయి మృత్తికన్ గలిసెనోగద కుమ్మరివావి సారెపై.

ఈ పద్యం చదివేసరికి బుద్ధి మరో దోవ దొక్కింది! కాళిదాసు భారవి శరీరాలు ఇంతలేసి రేణువులైతేనేమి అంతలేసి రేణువులైతేనేమి? అసలు వాళ్ళ శరీరాలగురించి ఆలోచించాల్సిన పనేమిటి? దివంగతులైన కవుల కలాలు గాయకుల కమ్మని కంఠాలు భౌతికంగా లేకపోవచ్చు గాక. వారు రచించిన గొప్ప కవిత్వమూ, పాడిన కమ్మని పాటలూ మనకు మిగిలి ఉన్నాయి కదా. కాళిదాస భారవుల కావ్యాలు ఇప్పటికీ నిలిచి ఉండడం వల్లనే కదా మనం వాళ్ళను తలచుకుంటున్నది. "సుకవి జీవించు ప్రజల నాలుకలపైని" అని యీ కవే (జాషువా) అన్నాడు. అంచేత కవులకు గాయకులకూ, ఏ కళాకారునికైనా, వారి కళ యీ లోకంలో ఉన్నంత కాలం వారి అస్తిత్వం ఆయా కళారూపాలలో బతికున్నట్టే కదా! అలాగే మంచి పరిపాలన చేసిన ఒక రాజు మరణించినా, గౌరవార్థంగా రాతి విగ్రహాలలోనే కాక, ప్రజల గుండెల్లోనూ జీవించే ఉంటాడు. అతని పరిపాలను గూర్చిన కథలు తరతరాలుగా ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు. అలాగే ఒక నాయకుడు కాని, ఒక శాస్త్రవేత్త కాని, ఒక వైద్యుడు, ఒక ఇంజినీరు - ఎవరైనా, సమాజానికి మేలు చేసిన, సమాజంపై తమదైన ప్రభావం చూపిన ప్రతి వ్యక్తీను. చావు వారి అస్తిత్వాన్ని చెరిపి వెయ్యలేదు! పైగా, వారి స్ఫూర్తితో మరింతమంది అదే దోవలో ప్రయాణించి, వారికి వారసులుగా ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తారు కూడా. అంటే, ఎవరి జీవితమైతే కేవలం వ్యక్తిగతమైన బంధాలకు పరిమితం కాకుండా సమాజంతో ముడిపడిపోతుందో, అతని అస్తిత్వం కూడా సమాజంతో ముడిపడిపోతుంది. అపుడింక ప్రకృతిసిద్ధమైన, భౌతికమైన, వ్యక్తి మరణాన్ని గూర్చి చింతించాల్సిన అవసరమే లేదు!
ఈ ఆలోచనాసరళి, పూర్వకాలంలో మన దేశంలో ఉండేదేమోనని అనిపిస్తోంది. వ్యక్తినిష్ఠమైన దృష్టితో చూస్తే, వ్యక్తిగతమైన బతుకు, బంధాలు, జగత్తూ వట్టి మాయ అనీ, అనిత్యమనీ అనడం పెద్ద ట్రేష్ అనిపిస్తుంది. అదే, మనిషి అస్తిత్వాన్ని సమాజంతో ముడిపెట్టినప్పుడు అవి అర్థవంతంగానే అనిపిస్తాయి. పూర్వం కొన్ని కుటుంబాలు తరతరాలుగా ఒక పెద్ద ఆలయం వంటి నిర్మాణాన్ని చేపట్టి కొనసాగించేవి. ఆ కుటుంబాల వారు వారి జీవితాన్ని దానికే అంకితం చేసేవారు. వాళ్ళు తమ అస్తిత్వాన్ని ఆ కట్టడంతో ముడిపెట్టేసి ఉంటారేమో! తాము భౌతికంగా లేకపోయినా, ఆ నిర్మాణం కొనసాగుతుందనే నిబ్బరం, వారికి మృత్యుభయం లేకుండా చేసేదేమో! ఏమో! ఇదంతా నా ఊహ!

కనుగొనగదోయి భావలోచనము దెఱచి మామకీన ప్రచండ తేజోమహత్త్వ
మీ విషానలకీలా ప్రభావ దగ్దమై సమస్తము నడగు సృష్ట్యాది నుండి!
ఈ మదీయ కరాళ జిహ్వికలయందు జీవసముదయమెపుడైన జిక్కవలయు
ఈ విషానల ధూమరేఖావృతమయి కుందు జీవాళికదియె వైకుంఠపథము

ఈ శ్రీశ్రీ పద్యాలు చదివేసరికి ఎందుకో ఒక్కసారిగా నాకు పోతనగారి ప్రహ్లాదచరిత్రంలోని యీ పద్యం గుర్తుకువచ్చింది!

హరి సర్వాకృతులం గలండనుచు బ్రహ్లాదుండు భాషింప స
త్వరుడై యెందును లేడు లేడని సుతున్ దైత్యుండు దర్జింప, శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానా జంగమస్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్

ఇదొక విచిత్రమైన పద్యం! ఎక్కడున్నాడురా నీ శ్రీహరి అని హుంకరించిన తండ్రితో, నీటిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, భూమ్యాకాశాలలో ఉన్నాడు. దిక్కులన్నిటా ఉన్నాడు. ఇక్కడా అక్కడా అని వెతకడమెందుకు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, అని చెపుతాడు ప్రహ్లాదుడు. ఆలా ఉన్నాడున్నాడని ప్రహ్లాదుడంటూ ఉంటే, లేడు లేడని హిరణ్యకశిపుడు అదిలిస్తూ ఉంటే, విష్ణువు నరసింహాకృతి ధరించి, చరాచర జగత్తంతటా ఉద్దండ ప్రభావంతో కాచుకుని కూచున్నాడట. అంటే హిరణ్యకశిపుడు ఎక్కడ చూపించమంటాడో, ఆ అడిగిన ఉత్తరక్షణంలో నరసింహాకృతిలో బయటపడాలి కదా అని అలా ఉన్నాడు కాబోలు! - ఇది మామూలుగా అనుకొనే విషయం. కాని యీ సందర్భంలో నాకు మరొక చిత్రమైన విషయం స్ఫురించింది. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే, విష్ణువు హిరణ్యకశిపుని దృష్టిలో మృత్యు స్వరూపం! అసలు విష్ణువు గూర్చి హిరణ్యకశిపునికి తెలిసిందే తన తమ్ముని మరణంతో. తన తమ్ముని మరణానికి కారణమైన వాడు విష్ణువు. ఆ విష్ణువుకోసమే లోకమంతా గాలిస్తూ ఉంటాడు కాని ఎక్కడా కనిపించడు! ఎంతవెతికితే నేమిటి, మృత్యువు కనిపిస్తుందా! ఆ మృత్యువుని జయించాలనే, ఘోరమైన తపస్సు చేస్తాడు. తన బుద్ధిబలంతో మృత్యువుని జయించగలననుకొని చాలా తెలివిగా వరాలను కోరతాడు, వాటిని పొందుతాడు. త్రిలోకాధిపత్యం సంపాదిస్తాడు. అయితేనేం! అతని అంతరాత్మలో విష్ణువుపై, అంటే మృత్యువుపై దృష్టి మరలదు. అతని అన్వేషణ ఆగదు సరికదా, తన ఆత్మజుని రూపంలో మరింత ప్రజ్వరిల్లుతుంది. విష్ణువు సర్వవ్యాపకత గూర్చి, నిత్యత్వాన్ని గూర్చి కొడుకు ఎంత చెప్పినా, దాన్ని చెవినబెట్టడు. అతని దృష్టిలో విష్ణువు (అంటే మృత్యువు) తన దరికి రాలేడు! ఈ ఆలోచనలతో మళ్ళీ యీ పద్యం చదివితే అందులో కనిపించేదేమిటి? హిరణ్యకశిపుని మృత్యువు నరసింహాకృతిలో ఉంది. అది ఇక్కడా అక్కడా అని కాదు అంతటా ఉంది. అది ఎక్కడనుండి బయల్పడుతుంది అనేది హిర్ణయకశిపుని చేతిలోనే ఉంది! ఒకరకంగా ఆ నరసింహాకృతికూడా, తన వరాల ద్వారా స్వయంగా హిరణ్యకశిపుడే నిర్ణయించాడు.

ఆలోచిస్తే, ఇది మనుషులందరికీ వర్తించే విషయమే. మనిషి మృత్యువునుండి ఎంత దూరం పారిపోవాలనుకున్నా అది అతడిని వెన్నంటే వస్తుంది. తన బుద్ధి చాతుర్యంతో ఎలా తప్పించుకోవాలని చూసినా, రకరకాల రూపాలలో, విచిత్రమైన ఆకృతులలో దర్శనమిస్తూనే ఉంటుంది. ఇక్కడా అక్కడా అని కాదు, ఎక్కడైనా ఉంటుంది. ఒకో వ్యక్తికి ఒకో రూపంలో వస్తుంది. అది ఎలా అన్నది కూడా ఆ వ్యక్తి ద్వారానే, తనకు తెలియకుండానే నిర్దేశింపబడుతుంది కూడా! మృత్యువుని వ్యక్తిగతమైన దృష్టితో చూసినంత కాలం అది తన అస్తిత్వాన్ని చెరిపేసే ఒక మహమ్మారిలా ఆ వ్యక్తిని భయపెడుతునే ఉంటుంది. తన అస్తిత్వాన్ని వేరే దానితో ముడిపెట్టినప్పుడు ఆ భయం వీడిపోతుంది. ప్రకృతితో అస్తిత్వాన్ని ముడిపెడితే, కృశించిన శరీరాన్ని నశింపజేసి నూతన తనువుతో, చైతన్యంతో ప్రకృతి తనని తాను నిరంతరం పునరుజ్జీవింప చేసుకొనే ప్రక్రియగా అది కనిపిస్తుంది.  అప్పుడు, ఒక్క హిరణ్యకశిపునికే కాదు, శ్రీశ్రీ చెప్పినట్టు, మృత్యువు సర్వ జీవనాళికి వైకుంఠపథమే!

పూర్తిగా చదవండి...

Friday, August 3, 2012

విరటుని వాత్సల్యం


నేను తిక్కనగారి విరాటపర్వం కనీసం రెండు సార్లయినా చదివుంటాను. అయినా యింత చక్కని పద్యం ఇంతవరకూ నా దృష్టిలో పడకపోడం ఆశ్చర్యం. దృష్టిలో పడడమంటే ఆకట్టుకోడం. మనసుకు హత్తుకోడం. అందుకే కవిత్వాన్ని ఆస్వాదించడానికి సమయం సందర్భం నేపథ్యం చాలా అవసరమనేది. విరాటపర్వం అనగానే, ద్రౌపది "దుర్వారోద్యమ" లేదా "ఎవ్వాని వాకిట" పద్యమో, గోగ్రహణమప్పటి "సింగంబాకటితో", "వచ్చినవాడు ఫల్గునుడు" వంటి పద్యాలో గుర్తుకు వస్తాయి. ఇంకా అనేక ప్రసిద్ధ పద్యాలున్నాయి కాని, యీ పద్యం అంత ప్రసిద్ధమైనట్లు లేదు. అయినా, ఇదొక (నా మటుకు నాకు) అపురూపమైన పద్యం.

తిగిచి కవుంగిలించి జగతీవిభు డక్కమలాయతాక్షి నె
మ్మొగము మొగంబునం గదియ మోపు; గరాంగుళులన్ గపోల మిం
పుగ బుడుకుం; బొరింబొరి నపూర్వ విలోకన మాచరించు గ
ప్పగు మృదుమౌళి నుజ్జ్వలనఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్

అర్జునుడు బృహన్నలగా విరటుని కొలువుకు వచ్చి, తాను నాట్యాచార్యుడినని, అంతఃపుర స్త్రీలకు నాట్యం నేర్పుతానని, పని యిప్పించమని అడుగుతాడు. విరటుడు అతడి తీరును జాగ్రత్తగా గమనించి, సరైన వాడిలాగనే ఉన్నాడని నిశ్చయించి తన కూతురైన ఉత్తరను పిలిపిస్తాడు. ఆ ఉత్తర నర్తనశాల సినిమాలో లాగా పూర్తి యౌవనవతి కాదు. ఒక పన్నెండేళ్ళ బాలిక. ఆ తండ్రికి ముద్దులమూట. అలాంటి తన కూతురుని ఎంత మురిపెంగా విరటుడు దగ్గరకు తీసుకొన్నాడో వర్ణించే పద్యమిది! ఈ పద్యం మళ్ళా యిప్పుడు చదివేసరికి మా అమ్మాయే నా కళ్ళముందు నిలిచింది. "ఓరి వీడి అసాధ్యం గూలా! నేను మా అమ్మాయిని ఎలా దగ్గరకు తీసుకు ముద్దు చేస్తానో, సరిగ్గా చూసినట్టే వర్ణించాడే యీ తిక్కన!" అని పరమాశ్చర్యానికీ, ఆనందానికీ లోనయ్యాను!

తిగిచి - దగ్గరకు తీసుకొని, ఆప్యాయంగా కౌగిలించుకొని, అందమైన ఆ మొహానికి తన మొహం దగ్గర జేసి, చేతివేళ్ళతో బుగ్గలు పుణికి, మాటిమాటికీ తన కూతురిని అపురూపంగా చూస్తూ, ఆ అమ్మాయి నల్లని లేలేత ముంగురులను ప్రేమతో  సవరించాడట.

తన కూతురేమో చక్కని చుక్క, బంగారు తల్లి. ఆమెకి యిప్పుడొక మంచి నాట్యాచార్యుడు దొరికాడు. తండ్రి మనసుకి ఎంత ఆనందం. ఆ పిల్ల మీద ఎంత ప్రేమున్నా తన రాచరిక వ్యవహారాల వల్ల ఆమెతో ఎక్కువ సమయం గడపలేడు కదా. అంచేత చూసినప్పుడల్లా ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే అపూర్వ విలోకనంబులు! తండ్రి మురిపెమంతా, అలా తల నిమురుతూ ముంగురులను సర్దడంలోనే ఉంది! ఎంత జగతీవిభుడయితే మాత్రం ఏమిటి. అతడొక ఆడపిల్లకు తండ్రి. ఆడపిల్ల తండ్రులకు మాత్రమే యిలాంటి ఆనందం దక్కేది. లోకాలకు ఏలికైనా కలగని ఆనందమది! అదీ పద్యంలో అచ్చుపోసి చూపించాడు కవిబ్రహ్మ తిక్కన. ఇలాంటి సందర్భంలో ఇంతటి సున్నితమైన సన్నివేశాన్ని ఊహించడం (యిది సంస్కృత భారతంలో లేదు), దాన్ని అంతే సుకుమారంగా, అత్యంత సహజంగా చిత్రించడం, తిక్కనకే చెల్లింది. ఇలాంటి పద్యాలు చదివినవాడెవడైనా, బుద్ధంటూ ఉంటే, ఆంధ్ర మహాభారతం వట్టి అనువాదం అని పెదవి విరుస్తాడా? ఇది నూటికి నూరుపాళ్ళూ అచ్చమైన కావ్య సృజన. ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాలలో ఒక చిన్న పాత్రకొక కొత్త వెలుగు తీసుకురావడమన్నది సామాన్య విషయం కాదు. కావ్యంలో పాత్రలను సజీవం చెయ్యడమంటే యిదీ. ఆ కల్పనలో కూడా ఔచిత్యం ఉండాలి. విరటునికి తన కొడుకుపైన ఎంత ప్రేమో, ఎంత గురో మనందరికీ తెలుసిన విషయమే. కౌరవులను గెలిచింది తన కొడుకు కాదంటే, ఆడుతున్న పాచికలు కంకుభట్టు మొహాన కొట్టేంత పిచ్చి ప్రేమ అది. మరి అంతటి ప్రేమ కూతురు మీద మాత్రం ఉండదా. ఉంటుందని ఊహించడమే ఔచిత్యం. కథకు అవసరమని కొడుకు ప్రేమను మాత్రమే వ్యాసుడు చిత్రించి ఊరుకుంటే, తాను వ్రాస్తున్నది కావ్యం కాబట్టి, ఆ పాత్ర స్వభావానికొక సంపూర్ణతనీ ఔన్నత్యాన్నీ, యీ ఒక్క పద్యంతో చేకూర్చాడు తిక్కన. అదీ తిక్కన కవితా శిల్పం.

ఈ టపా చదివి ఆడపిల్లలు లేని వాళ్ళు నా మీద అసూయపడితే అది నాకు ఆనందమే! :-)
పూర్తిగా చదవండి...

Friday, April 20, 2012

ముసలివాని ప్రేమలేఖ

మొన్నీ మధ్య మిథునం కథ గురించి చర్చ చదివినప్పుడు, నేనెప్పుడో పదమూడేళ్ళ కిందట వ్రాసిన యీ పద్యకవిత గుర్తుకు వచ్చింది. సరే, కవిత పాతదైనా కొత్త మిత్రులతో పంచుకుందామని యిక్కడ పెడుతున్నాను. ఇది వ్రాసిన తర్వాత కూడా ఎవో పద్యాలు వ్రాస్తూనే ఉన్నాను కాని, యింతగా మనసుకి హత్తుకొన్న కవిత మరేదీ యీ పదమూడేళ్ళగా రానే లేదు! అప్పట్లో మనసుకున్న సున్నితత్వం క్రమేపీ మాయమైపోతూ ఉండడం దానికి కారణమేమో!

ప్రియమగు భార్య సన్నిధికి ప్రేమగ నీ పతి వ్రాయు లేఖ, ఆ
దయగల దైవమే మనల దారుణరీతిని వేరు జేసె, యీ
వయసున నొంటిగా బ్రతుకు భారము నీడ్చుట కష్టమే సుమీ!
అయినను నీ స్మృతుల్ కవితలల్లుచు కాలము నెట్టుచుంటి నే

చూచి యేళ్ళు దాటె నీ చిన్నకొడుకుని,
పక్షమయ్య పెద్దవాని గలసి
ఎవరి బ్రతుకు వారి దీ తండ్రి కోసమై
సమయమీయ నెవరి సాధ్యమగును!

కన్నకొడుకులు నన్నింత కనికరించి
వృద్ధ శరణాలయమ్మున వేసినారు
నెలకి చెరి యైదువందల నిచ్చుచుండి
రింత యైనను చేయు వారెంతమంది?

ఐన నదేమొగాని హృదయమ్మున నొక్క విషాదరేఖ, దుః
ఖానల తప్తమైనటుల ఆత్మ తపించుచునుండె, గుండెలో
యే నరమో కలుక్కుమను యే గతజీవిత జ్ఞాపకమ్ములో
మానసవీధిలో నిలచి మాటికి మాటికి గేలిసేయగా!

ప్రక్కచూపులు చూడ పసిగట్టి ఒక మొట్టి
కాయను నెత్తిపై వేయు చేయి,
గోరుచుట్టైనపుడు కొసరి గోర్ముద్దలు
ప్రేమ మీరగ తినిపించు చేయి,
పొలమారినంతనె తలచెనెవరో యంచు
తలపైని పలుమార్లు తట్టు చేయి,
నడిరేయి దడబుట్టి తడబాటుతో లేచి
నప్పుడు గుండెల నద్దు చేయి,

పట్టి వీడననుచు నొట్టు బెట్టిన చేయి
పట్టు వీడె, బ్రతుకు వట్టి పోయె!
ఒక్క చేయి రాదె ఓదార్పు నీయగా
మ్రోడులేమొ! యెదలు బీడులేమొ!

నీడవైన నీవే నను వీడినావు
ఆదరింతురె నన్నింక అయినవారు?
కట్టె ముట్టించుటకె వేచె కన్నకొడుకు
లక్కటా! యేల జీవిత మారిపోదు?

ప్రతి ఉదయము సూర్యుడు నను,
"బ్రతికే ఉన్నావ?" అనుచు ప్రశ్నించినటుల్
మతి దోచును! సతి వీడిన
పతి జీవన్మృతుడు శుష్కవాక్యము రీతిన్!

ఇచట నావంటి వార లనేకమంది
యంత్ర జీవితమనెడి బకాసురునకు
కన్నబిడ్డల బలిజేసి ఖిన్నులగుచు
మూగమనసుల రోదించు ముసలివారు!

ఆదివారము అనుమతింతురు అతిథి జనులను లోనికిన్
ఎదురు జూతురు, ఎదురు జూతురు, ఎదురు జూతురు ఆశతో!
చెదరిపోవును ఆశ కాటుక చీకటుల్ చెలరేగగా
ముదుమి మనసుల మరల మరలిటు మోసపుచ్చుట న్యాయమే?

కాటికి కాలుసాచియు నకారణ మీ మమకార బంధముల్
ఏటికి సెప్పు? కాని మనసే వినదాయెను, నాది నాదనున్!
పూటకి పూట కష్టమయి పోయెను లోకపు చీకటింట యీ
నాటక, మింక చాలు, తుది నా గది తల్పులు తట్టుటెన్నడో?

నిన్ను చేరు వేళ యెన్నాళ్ళ కెన్నాళ్ళ
కనుచు, కనుచు నుంటి కాలుని దెస
క్షణము యుగములైన కాలమ్ము సాగదు
మరణమునకునైన కరుణ రాదు!

వెతలు వెళ్ళగ్రక్కి వేదన రగిలించ
వేడ్క కాదు, కాని వెఱ్ఱి మనసు
ఊరుకోదు! బాధ నోరార జెప్పగా
ఎవరు గలరు నాకు, నీవు తప్ప?

ఇప్పటికే నా బాధలు
చెప్పీ చెప్పీ మనస్సు చెడగొట్టితినా?
చప్పున నిక ముగియించక
తప్పదు...

మరి సెలవు,
                                       నీ సదా,
                                       హృదయశ్రీ.

పూర్తిగా చదవండి...

Friday, April 13, 2012

నను మెడబట్టి గెంటితివి...


నను మెడబట్టి గెంటితివి నాటకరంగముపైకి, చేత కా
దని బతిమాలుకొన్న వినవైతివి, కన్నులు విప్పి సభ్యులన్
గనుగొనినంత కాళ్ళు వడకన్ దొడగెన్ - సరికొత్త నర్తనం
బనుకొని చప్పటుల్ జరిచిరందరు, చాల్ తెరదింపుమో ప్రభూ!

మొన్ననీ పద్యమెందుకో హఠాత్తుగా గుర్తుకువచ్చింది. ఇదో తమాషా సన్నివేశం! కవి దేవునితో మొరబెట్టుకుంటున్నాడు. పద్యం సులభంగానే అర్థమవుతోంది కదా, వివరించాల్సిన పనిలేదు. జీవితాన్నో లోకాన్నో నాటకరంగంతో పోల్చడం పాత విషయమే. ఈ పద్యంలో ఉన్న ప్రత్యేకతంతా, వద్దు మొఱ్ఱో అంటున్నా దేవుడు తనని నాటకరంగంపైకి మెడబట్టి గెంటాడనడం. ఆ తర్వాత, ఎదురుగా ఉన్న సభ్యులని చూసి యితని కాళ్ళు వణుకుతూ ఉంటే ఆ ప్రేక్షకులేమో అదేదో కొత్త నాట్యమనుకొని చప్పట్లు కొట్టడం. భలే తమాషా అయిన ఊహ కదూ. తమాషాగా కనిపించినా, చాలా లోతున్న ఊహ. మామూలుగా - లోకం నాటకరంగం, మనుషలందరూ నటులు అనే పోలికలో ఆంతర్యం ఈ జగత్తంతా మిథ్య అని, జీవితమంతా కనిపించని శక్తి మన చేత ఆడిస్తున్న నాటకమని చెప్పడం. ఇక్కడ విషయం అది కాదు! ఇక్కడ కవికి తాను నటుడిని కానని తెలుసు. నటించాలన్న కోరికా లేదు. కాని, యితరులు తనని నటుడనుకుంటున్నారు. తన ప్రతి చేష్టను ఒక అద్భుతమైన నటన అనుకుంటున్నారు. అంటే యితరులు తనకు లేని శక్తి తనపైని ఆరోపిస్తున్నారు. వారే తనకొక లేని పాత్రని సృష్టిస్తున్నారు! తనకా శక్తి లేదని, తానా పాత్రకి అర్హుణ్ణి కాదని పరిపూర్ణ జ్ఞానం కవిగారి కున్నది. అయినా ఏమీ చెయ్యలేని విపత్కర పరిస్థితి!

మనందరి జీవితాల్లోనూ అడుగడుగునా యిలాంటి సన్నివేశం ఎదురుపడుతూనే ఉంటుంది. ఒక కుఱ్ఱాడికి ఒకటి రెండు పోటీల్లో బహుమతులు వచ్చాయనుకోండి. ఇక వాడి తల్లిదండ్రులకి అతనొక ప్రతిభామూర్తిగా కనిపించడం మొదలవుతుంది. అంతకుముందుకూడా అతడు పోటీల్లో పాల్గొని బహుమతులు రాకపోయి ఉండవచ్చు. ఇప్పుడవేవీ గుర్తుకు రావు. అప్పటినుండీ ప్రతి పోటీలోనూ అతడే బహుమతి గెల్చుకోవాలని తహతహ! అలా అతనికా పాత్ర ఆపాదింపబడుతుంది. ఇదింకా కాస్త నయమే! కొందరు పిల్లలయితే, వాళ్ళు పుడుతూనే ఇంజనీరో డాక్టరో అయిపోతారు. ఇక పెరిగి పెద్దవుతూ వాళ్ళా పాత్రని నిర్వహించడానికి నానా కష్టాలూ పడాల్సిందే!

పెళ్ళవ్వగానే అబ్బాయి "బాధ్యతగల భర్త" పాత్ర, అమ్మాయి "ఆదర్శవంతమైన గృహిణి" పాత్ర, ఆఫీసులో "ప్రతిభగల ఉద్యోగి" పాత్ర, స్నేహితులకి "మంచి మిత్రుని" పాత్ర - ఇలా, ప్రేక్షకులని బట్టి ఒకే మనిషి అనేక పాత్రలను ఏకకాలంలో నిర్వహిస్తూ ఉండాల్సిందే! ఏదో ఒకటి రెండు చక్కని కవితలో, కథలో కలంనుండి జాలువారితే చాలు, ఇక అతను/ఆమె గొప్ప కవి లేదా రచయిత పాత్రని నిర్వహించాల్సిన అగత్యం ఏర్పడుతుంది! తెలిసిన వాళ్ళందరూ కనిపించినప్పుడల్లా, "అదేమిటండీ ఈ మధ్యన బొత్తిగా రాయడం మానేసారు" అంటూ ప్రశ్నలు సంధించడం మొదలుపెడతారు! లోకం కొంతమంది మీద ఆపాదించే మరొక అతి క్లిష్టమైన కష్టమైన పాత్ర "మేధావి" పాత్ర. ఒకరి మాటలో రాతలో కొన్నిటిని చూసి వాళ్ళ మీద మనకి కాస్త గురి ఏర్పడిందనుకోండి, వాళ్ళు నిజానికి ఆముదం చెట్టే అయ్యుండొచ్చు గాక - కానీ మన కళ్ళకి వాళ్ళు మహావృక్షంలా కనిపిస్తారు. వాళ్ళని సాక్షాత్తూ పుంభావసరస్వతనో సరస్వతీపుత్రులనో (మగవాళ్ళయితే! :) కీర్తిస్తాం. ఇక వాళ్ళా భారాన్ని మొయ్యడానికి అష్టకష్టాలూ పడాల్సిందే! పై పద్యంలో కవిగారిలా వాళ్ళకి తమ గురించీ, తమ శక్తి గురించీ స్పష్టమైన అవగాహన ఉంటే కాస్త ఫరవా లేదు. లేదంటే అథఃపాతాళానికి కూరుకుపోవలసిందే! సదరు "మేధావి" ఎప్పుడయినా ఏదైనా తనకు తెలియని విషయమ్మీద ఒక తెలివితక్కువ ప్రశ్న అడగడమో వ్యాఖ్య చెయ్యడమో చేసాడనుకోండి. "మీవంటి వారి దగ్గరనుండి ఇలాంటి ప్రశ్న/వ్యాఖ్య వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదండీ!" అని ఆశ్చర్యపోతూ పెదవి విరిచేస్తాం! మరికొందరు ప్రేక్షకులయితే మరీ విచిత్రంగా ఉంటారు. తమకి సంబంధం లేనివాళ్ళకి సంబంధం లేని పాత్రని తామే అంటగట్టేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒకతను మరొక తెలుసున్న మనిషి దగ్గరకి వెళ్ళి, "మీకేమండీ! రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ళు మీ మాటను జవదాటరు." అన్నాడనుకోండి, అంత కన్నా విడ్డూరం ఉంటుందా! తన బిడ్డలు (బిడ్డలుగా) రత్నాల్లాంటి వారో కాదో, తన మాట వింటారో వినరో, అయితే గియితే ఆ తండ్రి చెప్పాలి. ఆ మూడో వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఆ రకంగా పాపం ఆ బిడ్డలు "రత్నాల్లాంటి" బిడ్డలుగానూ, సదరు తండ్రి అలాంటి బిడ్డల తండ్రిగానూ పాత్రధారణ చెయ్యాల్సి వస్తుంది.

ఏతావాతా తేలిందేమిటయ్యా అంటే, మనం జీవితంలో ప్రతినిత్యం ఎవిరికో ఒకరికి ఏదో ఒక పాత్రని అంటగట్టి చప్పట్లు చరుస్తూనే ఉంటాం. ఏప్పుడూ ఎవరో ఒకరి చేత ఏదో ఒక పాత్రలోకి నెట్టివేయబడుతూనే ఉంటాం. ఆ విషయాన్ని మనం గ్రహించగలుగుతామా లేదా అన్నది ముఖ్యం. గ్రహించగలిస్తే, అందంగా నటించ గలిగినన్నాళ్ళు నటించి (నటించడం కన్నా నిర్వహించడం గౌరవమైన మాట కావచ్చు, కాని నిజానికి యీ సందర్భంలో రెండూ ఒకటే!)  మరియాదగా తప్పుకో గలుస్తాం. లేదంటే అయ్యేది రసాభాసే!

ఇంతకీ యీ పద్యం ఎవరిదో చెప్పనే లేదు కదూ! ఈ పద్యం కరుణశ్రీగారి "అమర్ ఖయాం"లోది. ఒమర్ ఖయ్యాం రుబాయితుల స్ఫూర్తితో వ్రాసిన పుస్తకమిది. ఖయ్యాము రుబాయితుల అనువాదంగా కన్నా ఒక స్వతంత్ర కావ్యంగా నాకిది నచ్చుతుంది. చక్కని ధారతో, హాయిగా అర్థమయ్యే అందమైన కల్పనలతో రమ్యంగా సాగే పద్యాలు దీనిలోని ప్రత్యేకత.

తా.కా.: అంతర్జాలలోకం కూడా ఒక పెద్ద నాటకరంగమే. దీనికీ పై పద్యం అమోఘంగా వర్తిస్తుందన్న సంగతి గమనించారా?! :-)

పూర్తిగా చదవండి...

Sunday, April 1, 2012

జానక్యాః కమలామలాఞ్జలిపుటే...


జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః

పూర్వం తెలుగువారి పెళ్ళి శుభలేఖలపైన యీ పద్యం తరచూ కనిపించేది. ఇది సీతారాముల పెళ్ళివేడుకలో ముత్యాల తలంబ్రాలను వర్ణించే పద్యం. పెళ్ళి శుభలేఖ మీద యీ శ్లోకం ఎందుకంటే, సీతారాముల పెళ్ళంత వైభవంగానూ తమ పెళ్ళివేడుక జరగాలని ఆకాంక్ష. సీతారాముల పెళ్ళంటే తెలుగువాళ్ళకి ఒక పండగ, ఒక సంబరం. ఈ శ్రీరామనవమి రోజు, సీతారాములు కొలువున్న ప్రతి హృదయమూ ఒక భద్రాచలమే. ప్రతి గుండెలోనూ మంగళవాద్యాలు మ్రోగవలసిందే.

పెళ్ళికన్నా ముందు శివధనుర్భంగ ఘట్టం మదిలో మెదులుతుంది. ఆ దివ్యమోహనమూర్తి, వినీలనీరదశ్యాముడు, విశ్వామిత్రుని వెనుకగా నిలబడి కనిపిస్తాడు. అదుగో చూడండి:

ఆ కనుదోయిలో తొణుకులాడు సముజ్జ్వల దివ్యదీప్తి ము
ల్లోకము లేలు రాజసము లోగొనగా, రఘురామమూర్తి తా
నాకృతిగొన్న వీరరసమట్టుల నమ్మునిరాజు వెన్క నా
జూకుగ నిల్చియుండె ప్రియసోదరుతో అభిరామమూర్తియై.   

కరుణశ్రీగారి కవిత్వంలో మూర్తికట్టిన మనోజ్ఞ రూపం అది. కరుణశ్రీగారి గడుసుదనం గమనించండి. వీరరసం ఆకృతిగొన్నట్టుగా ఉన్నాడని వీరరసాన్ని గురించి వాచ్యంగా చెప్పి, నిలుచున్న తీరులోని నాజూకుదనంలో శృంగారరసాన్ని వ్యగ్యంగా చెప్పారు! ఆ అభిరామమూర్తి వీరశృంగార రసాకృతి.

అదుగో వినండి. జనకమహారాజు తన సింహాసనమ్మీద నుండి లేచి నిలుచుని యేదో ప్రకటన చేస్తున్నారు:

స్వాగతమో స్వయంవర సమాగత రాజకుమారులార! మీ
యాగమనమ్ముచే మది ప్రహర్ష పరిప్లుతమయ్యె, యీ ధను
ర్యాగమునందు శంకరుశరాసన మెక్కిడు నెవ్వ డా మహా
భాగు వరించు నా యనుగుపట్టి సమస్త సభాముఖమ్మునన్

జనకమహారాజా! ఓ రాజర్షీ! ఆనందంతో ఉరకలువేస్తున్నది నీ మనసొక్కటే కాదయ్యా. మా అందరి మనసులూను. ఎప్పుడెప్పుడు రామయ్య ఆ శంకరుని విల్లు ఎక్కుపెట్టి మా సీతమ్మను పెళ్ళాడతాడా అని మేమందరమూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాం. అవునయ్యా అవును! నీ అనుగుపట్టి, మా సీతమ్మ, వరించినది కాబట్టే మా రామయ్య మహాభాగుడు, మహా భాగ్యవంతుడు అయ్యాడు. కాదన్నదెవరు! మా త్యాగయ్య స్పష్టంగా తేల్చిచెప్పాడు కదా, "మా జానకి చెట్టబట్టగా మహారాజువైతివి" అని. సాక్షాత్ లక్ష్మీస్వరూపమైన సీతమ్మని పెళ్ళాడిన తర్వాతే కదా రామునికి నారాయణాంశ పూర్ణంగా లభించినది. సీతలేని రాముడు లేడు. సీతమ్మవారిని తెలుసుకోకుండా రాముడు అర్థం కాడని అశోకవనంలో సీతని చూసిన తర్వాతనే హనుమంతునికి తెలిసివచ్చిందట (మాకు మా విశ్వనాథవారు చెప్పారులే):

చేతమునందు పూర్వమున శ్రీరఘురాము నెరింగినట్లుగా
నే తలపోసినాడ, నిపుడీయమ గాంచినయంత సర్వ మ
జ్ఞాతము గాగనుండెనను సంగతి నా కెరుగంగ నయ్యెడున్
సీత నెరుంగకుండ రఘుశేఖరు డర్థము కాడు పూర్తిగా 

అరే, అదేమిటీ! రామయ్య కాకుండా ధనుస్సు వద్దకు వేరెవరెవరో వెళుతున్నారేమిటి!

బిగువు నిండారు కొమ్ముటేనుగులవంటి
రాచవస్తాదు లెందరో లేచినారు

అయితేనేం,

శివధనుర్భంగ మట్లుండ శృంగభంగ
మయ్యెను సమస్త సభ్య సమక్షమందు!

అంతేకదా మరి. శివధనుస్సుని సాధించడం ఆషామాషీ వ్యవహరమా! వశిష్ఠ విశ్వామిత్రులవంటి గురువుల దగ్గర యోగవిద్యని అభ్యసించిన గొప్ప సాధకుడైన రామయ్యకే అది సాధ్యం.
ఆఁ! ఎక్కడనుండి వస్తోందా సింహధ్వని?! ఓహో లక్ష్మన్న ఏదో ఎలుగెత్తి చాటుతున్నాడు. అదేమిటో మొల్ల మనకు చెపుతోంది:

కదలకుమీ ధరాతలమ! కాశ్యపి బట్టు ఫణీంద్ర! భూవిషా
స్పదులను బట్టు కూర్మమ! రసాతల భోగిడులీ కులీశులన్
బెదరక బట్టు ఘృష్టి! ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుపట్టుడీ కరులు! భూవరుడీశుని చాప మెక్కిడున్

రామయ్య చాపాన్ని ఎక్కుపెట్టబోతున్నాడట. భూమిని, భూమిని భరించే ఆదిశేషు, ఆదికూర్మ, ఆదివరాహ, దిగ్గజాలకి బహుపరాకు చెపుతున్నాడు లక్ష్మన్న. ఒకదాన్ని ఒకటి జాగ్రత్తగా పట్టుకోమని. అదరవద్దని, బెదరవద్దని. రాముడు విల్లెక్కు పెట్టబోతూ ఉంటే యింతటి ఆర్భాటం దేనికంటారా? రామయ్య ఆ ధనువుని ఎక్కుపెట్టగానే అది దిక్కులదిరే పెనుసవ్వడితో విఱిగిపడుతుందని లక్ష్మన్నకి తెలుసుగా. అందుకే ఆ హెచ్చరిక! అదిగదిగో, రామయ్య సదమల మదగజ గమనముతో స్వయంవర వేదిక చెంతకి వేంచేసాడు. వచ్చి:

ఇనవంశోద్భవుడైన రాఘవుడు భూమీశాత్మజుల్ వేడ్కతో
దను వీక్షింప, మునీశ్వరుండలర, కోదండంబు చేబట్టి చి
వ్వన మోపెట్టి గుణంబుబట్టి పటుబాహాశక్తితో దీసినన్
దునిగెన్ జాపము భూరిఘోషమున వార్ధుల్ మ్రోయు చందంబునన్

అంతే! సముద్రఘోషతో ఫెళ్ళుమని ఆ విల్లు విరిగింది. అప్పుడేమయింది?

ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లు మనె, గు
భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లు మనియె
జానకీదేహ మొక నిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయము గదుర!

నయము, జయము, భయము, విస్మయము - రెప్పపాటు కాలంలోనే అన్ని రకాల భావాలు ఒకేసారి విజృంభించాయట!

శివధనుర్భంగమైన ఆ క్షణంలోనే రామయ్య శ్రీరాముడయ్యాడు. జానకీరమణుడయ్యాడు. సీతారాముల విషయంలో విశ్వనాథవారి నిశ్చయం యిది:

ఆయమ పుట్టె పాల్కడలి నంగనగా దనవంతు తీసికోన్,
ఈయమ ధాత్రిలోన జనియించెను విల్లునువంప బెండ్లమై,
ఈయమ మున్ను వేదముల యింపగు తత్త్వము, తానె యామయై
ఆయమ కంటి యాన బడి యాచరణం బఖిలంబు చేయుచున్

ఈ పద్యంలో "ఆయమ" అంటే లక్ష్మీదేవి. "ఈయమ" అంటే సీతాదేవి. ఆమె యేమో క్షీరసాగర మధన సందర్భంగా, విష్ణువు తన వంతుగా స్వీకరించడంకోసం పాలకడలిలో పుట్టుంది. ఆమె శ్రీవారి మాటలని అనుసరించేది. కాని యీమె? ఈమె భూమిజాత. అయాచితంగా లభించినది కాదు. శివధనుస్సుని విఱిచిన ఫలంగా రాముని యీమె వరించినది. ఈమె వేదతత్త్వము. ఈమె కంటి ఆన చేతనే రాముడు అఖిల కార్యాచరణమూ చేస్తాడు. అందుకే, ఆ క్షణమే శ్రీరాముడు సర్వశక్తిమంతుడయ్యాడు, సంపూర్ణుడయ్యాడు. అప్పుడే అసలు రామాయణం, సీతాయాశ్చరితం మొదలయ్యింది. ఇక ఆ తర్వాత జరిగిన పెండ్లి వేడుకంతా మనకోసం మనం చేసుకొనేదే!
ముఖ్యంగా మన మన తెలుగువారికి తలంబ్రాల ముచ్చట ఎంతో సరదా! అందులోనూ సీతారాముల కల్యాణమంటే అవి మామూలు తలబ్రాలు కావుకదా! ముత్యాల తలంబ్రాలు. మామూలు ముత్యాలా! ఆణిముత్యాలు! అలాంటి ఆణిముత్యాల కాంతులు ఎన్నెని వింత వింత పోకడలు పోయాయో వర్ణించే శ్లోకమే పైన చెప్పుకున్నది. అది శంకరాచార్యుల విరచితమని కొందరంటారు కాని, నాకయితే ఎవరో అచ్చమైన తెలుగు కవి వ్రాసినదే అని గట్టి నమ్మకం! ఆ కవిత్వానికి నా పైత్యం కొంత కలిపి చేసిన అనువాదం ఇదిగో:

కెందామరౌ జానకీదేవి దోసిట
పద్మరాగమ్ములై పరిఢవిల్లి
రఘురాము తలపైని రహి నుంచినంతనె
మొల్లలై వెలుగులు వెల్లివిరిసి
అటనుండి జాఱి యా శ్యామలతనురుచి
నింద్రనీలమ్ములై యింపుమీరి
కరిమబ్బు చిరుజల్లు కురిసిపోయినయట్లు
నేలపై చినుకులై జాలువారి

వేడ్క సీతమ్మ రామయ్య పెండ్లినాడు
అలరు తలబ్రాల చినుకుముత్యాలజల్లు
తెలుగువారిండ్ల సిరిసంపదలును శుభము
బ్రగతి గూర్చుత శ్రీరామరక్ష యగుచు!

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!

పూర్తిగా చదవండి...

Thursday, March 1, 2012

అదిగో ద్వారక...


అదిగో ద్వారక! ఆలమందలవిగో అందందు గోరాడు! అ
య్యదియే కోట, అదే అగడ్త, అవె రథ్యల్, వారలే యాదవుల్!
యదుసింహుండు వసించు మేడ యదిగో! ఆలాన దంతావళా
భ్యుదయంబై వర మందురాంతర తురంగోచ్చండమై పర్వెడిన్!



ఆఁ.. ఆఁ... వినిపిస్తున్నాయ్... మీ ఈలలూ వన్సుమోర్లూ! :-) ఇదిగో మళ్ళీ వినండి.



తన కాలానికి ప్రచారంలో ఉన్న పద్యనాటక సంపదాయ ధోరణిని కాదని, పద్యాలు పాడడంలో ఒక కొత్త సంప్రదాయాన్ని సృష్టించినవారు ఘంటసాల మేష్టారు. ఒకొక్కరికి ఒకో పద్ధతి నచ్చుతుంది! (నాకు రెండూ నచ్చుతాయ్ :-)) పద్యాలు పాడడంలో మార్పుని తెచ్చింది ఘంటసాల అయితే, అసలు పద్య రచనలోనే ఒక విప్లవాన్ని తెచ్చినవారు తిరుపతివేంకట కవులు. అటు అవధానాలతో పండితులనూ, ఇటు భారత నాటకాలతో సామాన్య ప్రజలనూ ఏకకాలంలో తమ పద్యాలతో ఉఱ్ఱూతలూగించిన కవులు వారు. ఆ కాలంలో వారిదొక ప్రభంజనం.

పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయ్యాయి. దుర్యోధనుడు తమ రాజ్యం తిరిగి యివ్వడన్నది దాదాపుగా స్పష్టమైపోయింది. ఇరు పక్షాలవారూ యుద్ధోద్యోగులయ్యారు. నానా రాజుల సైన్యబలాలనీ సమీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శ్రీకృషుడు పాండవులకి ఎంత సన్నిహితుడయినా, తమ పక్షమే వహిస్తాడని వారికి తెలిసినా, ఒక రాజుగా అతడిని వెళ్ళి తమ పక్షంలో ఉండమని కోరడం రాచమర్యాద. మరి ఆ కార్యాన్ని నిర్వహించ గలిగేవారెవరు? కృష్ణుని ప్రియసఖుడైన అర్జునుడు కాక ఇంకెవరు? శ్రీకృష్ణుడంటే అర్జునుడికున్న స్నేహం, భక్తి, అనురక్తి అనన్యసామాన్యం. అలాంటి ప్రియబాంధవుడైన కృష్ణుని చూడబోతున్నాడంటే అర్జునుడి మనసు ఉత్సాహంతో ఉరకలు వెయ్యదూ! "అదిగో ద్వారక!" అంటూ ఎత్తుగడలోనే ఆ ఉరకలేసే ఉత్సాహాన్ని అలవోకగా ధ్వనింపజేయ్యడం తిరుపతివేంకట కవుల నాటకీయ పద్యనిర్మాణ ప్రతిభ. తిరుమల కొండ చూసి అన్నమయ్య ఎంతటి ఆనందంతో "అదిగో అల్లదిగో శ్రీహరివాసము" అన్నాడో అదే ఆనందం మనకిక్కడ అర్జునుడిలో ధ్వనిస్తుంది. ద్వారకానగరం, నగరం ముందు పచ్చిక మేస్తున్న ఆలమందలు, కోట, అగడ్త - యిలా ఒకొటొకటీ చూస్తున్న కొద్దీ, శ్రీకృష్ణుని చూడ బోతున్నాననే ఆనందం అతనిలో పెరుగుతూ పోయింది. చివరికి కృష్ణుని మేడ కనిపించగానే ఆనందం పట్టలేక మళ్ళీ "యదుసింహుండు వసించు మేడ యదిగో!" అని పెద్దపెట్టున అన్నాడు. ఉప్పొంగిన ఆ ఆనందోత్సాహాన్ని, ధారగా సాగిన చివరి పాదం చక్కగా స్ఫురింపజేస్తోంది. నేను చూసిన పుస్తకంలో "నాలాన" అని ఉంది కాని, అది "ఆలాన" అయ్యుండాలి. "ఆలాన" అంటే ఏనుగులను కట్టే స్తంభం. "అదిగో" అన్న తర్వాత నాకు తెలిసి ద్రుతం రాదు. దంతావళం అంటే ఏనుగు. ఆలానములకు కట్టబడిన ఏనుగులతో అలరారుతున్నదా మేడ. మందురము అంటే గుఱ్ఱపుసాల. వర+మందుర+అంతర+తురంగ+ఉచ్చండమై. శ్రేష్ఠమైన గుఱ్ఱపుసాలలో మాంచి ఉత్సాహంతో నురుగులుకక్కే గుఱ్ఱాలతో శోభిస్తోంది.

ఈ పద్యంలో మరొక విశేషం కూడా ఉంది. అర్జునుడు ముందు చూసింది ద్వారకా నగరాన్ని, అల్లంత దూరంలో. అంత దూరం నుండి కోట కాని, కోటలోని రాజ మార్గాలు కాని (రథ్యలు), అందులోని ప్రజలు కాని కనిపిస్తారా? కనిపించరు. అంటే అర్జునుడు తన రథమ్మీద ద్వారకకి వస్తూ చెప్పిన పద్యమన్న మాట. ముందు దూరంగా ద్వారకని చూసాడు. కాస్త దగ్గరకి వచ్చాక నగర శివార్లలోని ఆలమందలు కనిపించాయి. మరికొంత దగ్గరకి వచ్చాక కోట, కోట ముందరి అగడ్త కనిపించాయి. కోటలోకి ప్రవేశించాడు. అప్పుడు రాజమార్గాలు (రథాలు వెళ్ళే మార్గాలు కాబట్టి అవి రథ్యలు), వాటిలో తిరుగుతున్న యాదవులు కనిపించారు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి శ్రీకృష్ణుని మేడ, మేడలోని ఏనుగులు, గుఱ్ఱాలు అగుపడ్డాయి. యీ ఒక్క పద్యం చదివేలోపు అంత దూరం ప్రయాణం చేసాడన్న మాట అర్జునుడు! అంటే శ్రీకృష్ణుడి కోసం అతను ఎంత వేగంగా పరుగులు తీసి వచ్చాడో మనం ఊహించవచ్చు. అదీ పద్యనిర్మాణంలో నేర్పు!

ఇంతకీ యీ పద్యం ప్రస్తావనిప్పుడు రావడానికి కారణం ఏవిఁటంటే, ఒక పది రోజుల కిందట మా చిన్నాన్నగారి అబ్బాయి పెళ్ళికి విశాఖపట్నం వెళ్ళాం. మర్నాడు పెళ్ళనగా ముందు రోజు సాయంత్రం మా చిన్నాన్నగారింట్లో అందరం కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. మా కుటుంబం, చిన్నాన్నలిద్దరూ వాళ్ళ కుటుంబాలు, మా చిన్నాన్నల పిల్లలూ, వాళ్ళ పిల్లలూ, మా అత్తయ్యా వాళ్ళ కుటుంబం, మా పిన్ని వాళ్ళ చెల్లెళ్ళు - ఇలా, అబ్బో! చాలామందే చేరాం. పెళ్ళంటే మాటలా మరి, బంధువులందరూ కలిసి హడావిడి చెయ్యొద్దూ! సరే మా అమ్మాయి, మా మేనకోడలూ సంగీతం నేర్చుకుంటున్నారు కాబట్టి, ఇద్దరినీ కలిసి వాళ్ళకొచ్చిన గీతాలు రెండు పాడమన్నాం. ఇద్దరూ ఎంచక్కా కూర్చొని సంగీత కచేరీ మొదలుపెట్టారు. లోపల గదిలో పడుకొని ఉన్న మా చిన్నాన్నగారి మామగారు పాటలు విని బయటకి వచ్చారు. ఆయనకి సుమారు ఎనభయ్యేళ్ళుంటాయనుకుంటా. కళ్ళు కనిపించవు. కాని గొంతు ఖంగుమంటుంది. పద్యాలు పాడితే అదురొహో! ఇకనేం. పిల్లల పాటలయ్యాక అతనినో పద్యం పాడమని అడిగాం.
"కన్నె ప్రాయమునందు భాస్కరుని కరుణ" అంటూ కృష్ణకర్ణ సంవాదంలో (ఇవికూడా పాండవోద్యోగవిజయాలలో పద్యాలే) కృష్ణుడి పద్యాన్ని అందుకున్నారు. ఆహా! ఏవిఁ గొంతూ! ఏవిఁ రాగం! ఏవిఁ స్థాయి! చెవుల తుప్పొదిలిపోయింది. ఒక పద్యంతో ఏం సంతృప్తి కలుగుతుంది, మాకైనా అతనికైనా. అదే వరసలో తక్కిన పద్యాలు కూడా అందుకున్నారు. "అంచితులైన బందుగుల", "వ్యజనంబున్ ధరియించు ధర్మజుడు" పద్యాలుకూడా పాడారు. అంత పెద్దాయనకి ఆ పద్యాలు ఎంత గుర్తో! చివరిసారి అతను స్టేజెక్కి నాటకం వేసింది 1968లోనట! మనసుకి ఉత్సాహమున్నా వయసు సహకరించాలి కదా. వరసగా మూడు పద్యాలు పాడేసరికి కాస్త అలసట అనిపించిందేమో, ఆగారు. నా వెనక కూర్చున్న మా బావ, నువ్వందుకో అని నన్ను పొడిచాడు. నాకు పద్యాలయితే వచ్చు కాని అతనిలా ఎక్కడ పాడగలను. సంగీతమూ రాదు. గొంతుకి అంత స్థాయీ లేదు! అయినా మనవాళ్ళేగా, ఆయనకీ కొంచెం విరామం ఇచ్చినట్టవుతుందని నేను తర్వాతి పద్యం, "ఏ సతి వహ్నిలోన జనియించెను" అందుకున్నాను. అదయ్యాక, ఇంకా... అన్నారు. కృష్ణకర్ణ సంవాద ఘట్టంలో అక్కడికి కృష్ణుడి పద్యాలైపోయాయి. తర్వాత కర్ణుడి పద్యాలు. మనదెప్పుడూ కృష్ణ పాత్రే. అంచేత అక్కణ్ణుంచి నేరుగా రాయబారంలోకి దూకి "చెల్లియొ చెల్లకో" ఎత్తుకున్నాను. అది వినేసరికి మా చిన్నాన్నగారికి ఊపొచ్చింది. "జెండాపై కపిరాజు" అని ఆయన అందుకున్నారు. ఇక పద్యాలు ఊపందుకున్నాయి. మా నాన్నగారు పడకసీన్లో తన అర్జునపాత్ర పద్యం "అదిగో ద్వారక" ఎత్తుకున్నారు. ఆ తర్వాత అర్జునుడిదే, "అరవిందాక్షుడు శేషశాయి". అప్పుడిక కృష్ణుడి పద్యం, అంటే నావంతు. "ఎక్కడనుండి రాక యిటకు", ఆ తర్వాత "బావా ఎప్పుడు వచ్చితీవు!" పాడాను. అప్పుడు మళ్ళీ పెద్దాయన (అదే మా చిన్నాన్నగారి మావగారు) తన గొంతు సవరించి దుర్యోధనుడి పద్యం "కౌరవపాండవుల్ పెనగు కాలము" అందుకున్నారు. పడకసీను పద్యాలన్నీ వరసబెట్టి పాడేసాం. ఆ తర్వాత రాయబారంలో యింకా రెండు పద్యాలుండిపోయాయని గుర్తుచేసారు మా చిన్నాన్నగారు. "అలుగుటయే ఎరుంగని" పెద్దాయన, "సంతోషంబున సంధిసేయుదురె" నేనూ పూర్తి చేసాం. అందరి మనసుల్లో ఒక గొప్ప ఆహ్లాదం పరచుకుంది. ఆ తర్వాత మా పిన్ని చెల్లెలికి శాస్త్రీయసంగీతం బాగా వచ్చని చెపితే, ఆవిడని కూర్చోబెట్టి కచేరీ చేయించేసాం. అలా ఆ సాయంత్రం సంగీతపద్య విభావరిగా మారింది! అందరికీ ఆనందాన్ని పంచింది. ఒక తీయని జ్ఞాపకంగా మిగిలింది. మా బంధువులందరినీ మరింత ఆత్మీయులని చేసింది!

పూర్తిగా చదవండి...

Friday, January 27, 2012

నిరుపహతి స్థలం...


నిరుపహతిస్థలం మృదుతరాసన మొళ్ళుణి సింపుదంబులం
నరపిద పుస్తకప్రతతి లేఖకవాచకసంగ్రహం నిరం
తర గృహనిశ్చితస్థితి విచారకసంగతి సత్కళత్ర సా
దరతయి నుళ్ళ సత్కవియు మీసువదాగదె కావ్యవార్ధియం

ఇదే భాషో గుర్తుపట్టారుగా, కన్నడం. మరి పద్యాన్ని కూడా గుర్తుపట్టారా? ఆఁ... అవునదే... పెద్దనగారి చాటువు. ఒకేసారి రెండు భాషల్లో సినిమా విడుదల చేసినట్టు పెద్దనగారు కూడా ఒకేసారి తెలుగు కన్నడ భాషల్లో యీ చాటువు చెప్పేరనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ పద్యం సూక్తిసుధార్ణవము అనే కన్నడ గ్రంథంలోది . ఈ గ్రంథం క్రీ.శ. 1240 ప్రాంతంలో కూర్చబడింది, అంటే సుమారు పెద్దనగారి కాలానికి మూడువందల సంవత్సరాల ముందరన్న మాట. ఇది ఒక సంకలన గ్రంథం. అంటే రకరకాల కావ్యాలనుండి ఏర్చికూర్చిన పద్యాల సంకలనం. అయితే యీ పద్యం ఏ కావ్యంలోనిదో స్పష్టంగా తెలియలేదు.

సరే మరి తెలుగుపద్యం బ్లాగులో తెలుగుపద్యం లేకపోతే ఎలా! చాలామందికి నోటికొచ్చే ఉంటుంది కాని తెలియనివాళ్ళ కోసం:

నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు  లూహ తెలియంగల లేఖకపాఠకోత్తముల్
దొరికినగాని యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!

ఈ తెలుగు పద్యాన్ని చెప్పినది పెద్దనగారో మరెవరో కచ్చితంగా తెలియదు. ఒకవేళ పెద్దనగారే అయితే మాత్రం, కన్నడపద్య స్ఫూర్తితోనే యీ పద్యాన్ని చెప్పుంటారనడంలో సందేహం లేదు. అయితే మాత్రమేం! కిట్టనివాళ్ళు వట్టి అనువాదం అని కొట్టిపారేస్తూ ఉంటారు గాని, మూలాన్ని సానబెట్టి మెరుగులు దిద్ది రాతినుండి రత్నాన్ని తయారుచెయ్యడం మన తెలుగు కవులకి వెన్నతో బెట్టిన విద్య. తెలుగుభాషపై నాకున్న పక్షపాతం అని మీరన్నా ఫరవాలేదు, నాకు మాత్రం కన్నడపద్యం కన్నా మన తెలుగుపద్యమే ఎంతో అందంగా ఉందనిపించింది. ఎందుకంటారా? చూడండి.

కన్నడంలో "మృదుతరాసనం" అని చెప్పి ఊరుకున్నారు కాని తెలుగులో "ఊయల మంచ"మని ఎంత చక్కగా బొమ్మకట్టి చూపించారు! ఒక రసిక కవికి అంతకన్నా మృదుతరాసనం ఏముంటుంది! ఆ రసికతే పద్యమంతా కనిపిస్తుంది. కన్నడ పద్యం, ఒక బుద్ధిమంతుడైన పండితకవి తనకి కావలసిన సామగ్రి చిట్టా ఏకరువు పెట్టినట్టుంది. మరి తెలుగు పద్యమో! సరస రమణీయంగా, అచ్చంగా ఓ కవి చెప్పినట్టుగానే ఉంది. కన్నడ కవి కోరుకున్నది సత్కళత్ర సాదరత, అంటే మంచి భార్య తనని సాదరంగా చూసుకోవడం. దానికి దీటుగా తెలుగు కవి కోరుకున్నదేమిటి? "రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురవిడెము". కన్నడ పద్యంలో "ఇంపు దంబులం" ఇక్కడ "కప్పురవిడెము" అయ్యింది. అవతల భార్య తన రాకకై వేచి చూస్తోంది. ఇతను రాకపోయేటప్పటికి తన చెలికత్తె ఒకర్తికి  తాంబూలాన్ని యిచ్చి దూతగా పంపింది. కప్పురవిడెము పంపడంలోని ఆంతర్యం రసజ్ఞులు గ్రహించగలరు. కన్నడ పద్యంలో ఉటంకించిన "నిరంతర గృహనిశ్చిత స్థితి", "సత్కళత్ర సాదరత" అనే అంశాలిందులో ఎంత చక్కగా ధ్వనిస్తున్నాయో గమనించండి.  ధ్వని కలిగినదే మంచి కవిత్వం. ఇక, కన్నడ పద్యంలోని "ఒళ్ళు ఉణిసి" అంటే మంచి భోజనం, తెలుగులో "ఆత్మకింపయిన భోజన" మయింది. కన్నడంలోని "విచారక సంగతి", తెలుగులో "ఒప్పు తప్పరయు రసజ్ఞు" లయ్యారు. కేవలం విచారణ, విశ్లేషణ ఉంటే సరిపోదు. ఒప్పు తప్పులు తెలిస్తే చాలదు. వారు రసజ్ఞలై ఉండాలి. లేదంటే ప్రతి దానికీ ఏదో ఒక నెరసు చూపిస్తూ కవిత్వాన్ని బొత్తిగా ఆస్వాదించలేని వారవుతారు. భాస్కరశతకంలో "చదువది ఎంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు" అని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. కవిత్వాన్ని ఆస్వాదించడానికి రసజ్ఞత చాలా ముఖ్యం. అలాగే, కన్నడంలో "లేఖకవాచక సంగ్రహం", తెలుగులో "ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తము" లయ్యారు. వట్టి లేఖక వాచక సంగ్రహ ముంటే చాలదు. వాళ్ళు ఎలాంటి వారై ఉండాలో మన తెలుగు కవి చెపుతున్నాడు. వాళ్ళు ఊహ తెలియగల వారై ఉండాలి. ఇది చాలా విశేషమైన అంశం. ఆ రోజులలో కవికి లేఖకులుండేవారు. కవి చెపుతూ ఉంటే పక్కనే కూర్చొని ఒక వ్రాయసకాడు దానిని తాళపత్రాలమీద లిఖించేవాడు.  ఆధునిక కాలంలో కూడా విశ్వనాథ వారికి యిలానే లేఖకులుండేవారు. కవితాధార అవిశ్రాంతంగా సాగుతూ ఉంటే దాన్ని అంత వేగంగానూ లేఖకుడు  పట్టుకొని వ్రాయాలంటే మరి ఆ లేఖకునికి కవి చెపుతున్న విషయమ్మీద చక్కటి అవగాహన ఉండాలి. పైగా మధ్యలో ఏదైనా ఒకచోట ఆ వేగాన్ని అందుకోలేకపోతే, అక్కడ కవి చెప్పినది ఏమిటో ఊహించగలిగే ప్రజ్ఞ ఉండాలి. లేదంటే కుంటినడకే అవుతుంది. కవిత్వం ధ్వని ప్రధానం కాబట్టి, దాన్ని చదివే పాఠకులకి కూడా అందులోని ధ్వని గ్రహించ గలిగే ఊహశక్తి ఉండాలి. లేకపోతే ఎంత గొప్ప కవిత్వం రాసీ ఏమిటి ప్రయోజనం? అందుకే ఇవన్నీ దొరికితే తప్ప లేకపోతే కవిత్వం వస్తుందయ్యా అంటున్నాడీ కవి. దాన్ని సొగసైన తెలుగు నుడికారంలో చెపుతున్నాడు "ఊరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే!" అని.

పాతకాలపు కవిత్వాన్ని నిరసించేందుకు కొంతమంది యీ పద్యాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు.
"ఏకాంతము, చెలికత్తె తెచ్చి యిచ్చిన కర్పూర తాంబూలమూ, ఉయ్యాల మంచమూ, మంచి భోజనమూ - కవిత్వం రాయాలంటే యివన్నీ కావలట! ఇదేమి కవిత్వం, వట్టి భోగపు కవిత్వం." అని పెదవి విరుస్తూ ఉంటారు. నిజమే, ఆ కాలంలో వచ్చినది  చాలా వరకూ కడుపునిండిన కవిత్వమే. మరి ఆ పద్యంలో తర్వాత చెప్పినవాటి సంగతేమిటి? తప్పొప్పులు తెలిసిన రసజ్ఞులు, ఊహ తెలిసిన లేఖక పాఠకులు. ఏ కాలాంలోనైనా మంచి కవిత్వం రావడానికి అవసరమైనవే కదా యివి. దీని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? మనకి నచ్చిన కవి, మనకి నచ్చిన అంశాన్ని గూర్చి ఏది రాసినా దాన్ని ఆకాశానికి ఎత్తెయ్యడమూ, కానప్పుడు అథః పాతాళానికి తొక్కెయ్యడమూ రసజ్ఞత అనిపించుకుంటుందా? అలా చేసినప్పుడు మంచి కవిత్వం వస్తుందా? ఇప్పటి విమర్శకులు వేసుకోవాల్సిన ప్రశ్నలివి. ఈ కాలంలో "లేఖకులు" లేరు. కాని వారి స్థానంలో యిప్పుడు ప్రచురణకర్తలున్నారు. సంపాదకులున్నారు. వాళ్ళకుండాల్సిన లక్షణం "ఊహ తెలియడం". ఇక పాఠకుల సంగతి సరేసరి! ఇక్కడొక అనుమానం రావచ్చు. కవిత్వం అనేది కవి వ్యక్తిగత విషయం. పాఠకులూ, విమర్శకులూ, సంపాదకులూ బయటవారు. కవి తనకోసం రాసుకుంటాడు కాని వీళ్ళకోసం కాదు కదా. అందువల్ల, ఒక కవి మంచి కవిత్వాన్ని రాయగలగడానికి వీరంతా ఎందుకూ? - అని. నిజమే, ఇక్కడ చెప్పినదాన్ని ఒక కవికి వ్యక్తిగతంగా అన్వయించడం అంత సమంజసం కాదు. సామాజికంగా అన్వయించుకోవాలి. అంటే, ఒక భాషలో, సమాజం నుండి మంచి కవిత్వం రావాలీ అంటే, ఆ భాషాసమాజంలో రసజ్ఞులైన విమర్శకులు, ఊహ తెలిసిన పాఠకులు సంపాదకులు తప్పకుండా ఉండాలి. మంచి కవిత్వానికి గుర్తింపు, ప్రచారం లభించినప్పుడే అది సమాజంలో నిలుస్తుంది. ఆ బాధ్యత, పైన చెప్పిన ముగ్గురిదీ. ఈ పద్యం మనకా విషయాన్ని గుర్తు చేస్తుంది.

ఇదీ మన తెలుగుపద్యం గొప్పదనం. మరో సంగతి మీరు గమనించారో లేదో. కన్నడ పద్యానికి యతి నియమం లేదు! ప్రాస ఒక్కటే ఉంది. తెలుగుపద్యానికి రెండూ ఉన్నాయి. అయినా తెలుగుపద్యం ఇంత కవితాత్మకంగా ఉందంటే దాని అర్థమేమిటి? వ్రాసే సత్తా  ఉండాలే కాని, మంచి కవిత్వం పుట్టించేందుకు యతిప్రాసల నియమాలు బంధకం కావనే కదా. నిజానికీ యతిప్రాసలు, అభివ్యక్తిలో పద్య నిర్మాణంలో కొత్తదనం కోసం కవిని ఆలోచింపజేసే ఉపకరణాలని నా అభిప్రాయం. ఆ సాధన చేసే ఓర్పు నేర్పు కవికి అవసరం. మంచి కవిత్వం అప్పుడే పండుతుంది.

పూర్తిగా చదవండి...

Saturday, January 14, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు!


సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈసారి పండక్కి ఊరు వెళ్ళలేదు. అంచేత తలపోతలు కలబోతలూ ఏమీ లేవు. చుట్టాలుపక్కాలతో కలవకపోతే పండక్కి, అందులోనూ సంక్రాంతికి  కళేముంటుంది? అయినా యథారీతి పొద్దున్నే లేచి యథాశక్తి భోగి మంట వేశాం. తమిళవాళ్ళు కూడా భోగి మంట వేస్తారు. డప్పులాంటి వాద్యాన్ని వాయించి మరీ! అయితే రెండు మూడిళ్ళవాళ్ళు తప్పించి పెద్దగా ఎవ్వరూ వెయ్యలేదు. నాలుగురోజులుగా తగ్గిందనుకున్న చలి మాత్రం మళ్ళీ బాగా తెలిసింది. తెలవారక ముందే లేచావేఁమో, యింకా కరగని పొగమంచు  మరింత వణికించింది! ఇక్కడది అరుదుగా మాత్రమే దొరికే అనుభవం.

మనసిభవుండు భోగి చలిమంటల చుట్టును పుష్పచాప శిం
జిని రవళించుచుం దిరిగె సిద్ధమనోరథుడై, వియోగినీ
జనములు దీర్ఘ యామినుల జార్చిన లోచన బాష్పవారి వీ
చెను బవనమ్మనంగ మెఱసెం దృణలగ్న తుషారబిందువుల్

ఈ కవిగారు మంచి సరసులే! భోగిమంటల చిటపటలు ఇతనికి మన్మథుని  వింటి చిరుమువ్వల సవ్వడిలా ఉందట. తన మనోరథం సిద్ధించిందన్న ఆనందంతో ఆ చెఱుకువిలుకాడు భోగిమంట చుట్టూ తిరుగుతున్నాడట. అతనలా సంబరం చేసుకుంటూ ఉంటే పాపం వియోగినులు మాత్రం తమ ప్రియుల నెడబాసి ఎంతో బాధపడుతున్నారు. కలిసి ఉన్న ప్రేయసీప్రియులను వేసవి పగళ్ళు ఎంతగా బాధిస్తాయో ("నలదమయంతులిద్దరు మనః ప్రభవానల బాధ్యమానలై" పద్యం గుర్తుందా, ఇంతకుముందు ముచ్చటించుకున్నాం!), వియోగంలో  ఉన్న (అంటే దూరదూరంగా ఉన్న) ప్రేయసి ప్రియులను శీతకాలపు రాత్రులు అంతగా బాధిస్తాయి.  వాళ్ళకు పగళ్ళు దీర్ఘాలయితే, వీళ్ళకు రాత్రులు దీర్ఘాలు. ఇది చలికాలం కదా. అంచేత వియోగినులకు దీర్ఘ యామినులు (రాత్రులు) ఎంతో కష్టాన్ని కలిగిస్తున్నాయి. వారి కన్నీటిని రేయి గాలి మోసుకొచ్చిందేమో అన్నట్టుగా ఉదయాన గడ్డిపోచలపై మంచు బిందువులు మెరుస్తున్నాయట!

భోగీ మంటతో పాటు మరో తప్పనిసరి అంశం ముగ్గులు. రంగు రంగుల ముగ్గులు. రంగవల్లికలు. కొందరు ధనుర్మాసం నెల్లాళ్ళూ పెడతారు కాని మేం మాత్రం పండగ మూడు రోజులే.

ఈ కవిగారి దగ్గర ఎంతందమైన రంగులున్నాయో చూడండి!

అరుణసరోరుహాక్షి సమదారుణ దృష్టులు, పుండరీక సుం
దరధవళాయతాక్షి తెలినవ్వుల చూపులు, మేచకోత్పల
స్ఫుర దురునేత్ర నీలి జిగి చూడ్కులు గూడి త్రివర్ణ శోభలం
గురియుచునున్న మ్రుగ్గులవిగో! భవనాంగణ శుభ్రసీమలన్

మూడు రంగులతో ముచ్చట గొలిపే ముగ్గులని మనకి చూపిస్తున్నారిక్కడ. కెందామరల్లాంటి కళ్ళున్న అమ్మాయిల చూపుల్లో ఎఱ్ఱదనం, తెలిదమ్మి పూవుల్లాంటి కళ్ళున్న అమ్మాయిల నవ్వుల చూపుల్లోని తెల్లదనం, నల్లకలువల కళ్ళ కలికి నెలతల చల్లని వెలుగు చూపుల్లోని శ్యామలత్వం - ఈ మూడు రంగులూ కలిసి మెరిసే రంగవల్లులు ఇళ్ళ ముంగిళ్ళలో వెలుగుతున్నాయట.

సంక్రాంతి పండగంటే అత్తవారింట్లో కొత్తల్లుళ్ళ సంబరాలు మామూలే. అయితే ఆ కొత్తదంపతుల వేడుక చూసి సర్వసాక్షి ఏమనుకున్నాడు? అది యీ కవిగారు చెపుతున్నారు. రవి గాననిచో కవి గాంచునే కదా!

భూతలనాకముల్ శ్వశురపూజ్యగృహమ్ములు, నవ్యనవ్య జా
మాతృవధూ వచోవలయ మంజులముల్ గనులార గాంచి, ఆ
శాతురుడైన సూర్యుడు సహస్రకరమ్ములతోడ నుత్తరా
శాతరుణోపగూహనము సల్పగ సాగెను  తేజితేరుపై

మామగారిళ్ళల్లో కొత్త దంపతుల ముచ్చట్లను చూసిన సూర్యునికి తన ప్రేయసిని కలుసుకోవాలనే కోరిక తొందరపెట్టిందట. అందుకే తన వేయిచేతులు సాచి ఉత్తరదిక్కనే సతిని కౌగిలించుకోవాలని  ఆ వైపు తన సప్తాశ్వరథాన్ని దౌడు తీయించాడట. అసలే మన్మథ ధ్వజమైన మకర రాశిలోకి అడుగుపెడుతున్నాడాయె. సూర్యునికి ఆమాత్రం కోరిక కలగడంలో ఆశ్చర్యమేముంది!

ఇవీ ఈ యేటి సంక్రాంతి పద్యాలు. ఇంతకీ యీ పద్యాలు వ్రాసిన కవి శ్రీ శనగన నరసింహస్వామి. అతని "హేమంత సంక్రాంతి" అనే ఖండికలోనివి. బాగున్నాయి కదూ!

పూర్తిగా చదవండి...