ఈ ఏటికివాళ ఆఖరి కార్తీకసోమవారం. ఏ పద్యాలతో యీ పరంపర ముగిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే చాలా పద్యాలే కనిపించాయి. తెలుగు కావ్యాలలో, శతకాలలో, శివస్తుతికి కరువు లేదు! ఆనాటి నన్నెచోడుని కుమారసంభవం నుండి, ఈ నాటి శ్రీరామలింగేశ్వర శతకం దాకా ఎన్నో ఉన్నాయి. కాని అయ్యవారి స్మరణ అమ్మవారు లేకుండా సంపుర్ణం కాదనిపించింది. అసలు వారిద్దరికీ ఎడమే లేదు కదా. అంచేత అర్ధనారీశ్వర రూపాన్ని తలచుకొని మంగళాంతం చేయడం సబబనిపించింది. కానీ ఆ రూపాన్ని వర్ణించే, స్తుతించే పద్యాలేవన్నా మన సారస్వతంలో కనిపిస్తాయేమోనని ఆలోచిస్తే, ఏవీ తట్టలేదు. పెద్దనగారి "అంకము జేరి" పద్యంలో ఉన్నది అర్ధనారీశ్వరుడే అయినా, అందులో ప్రధాన వస్తువు అది కాదు. కొంత వెతికితే కుమారసంభవంలో ఒక పద్యం కనిపించింది, కాని అది పెద్దగా తృప్తినివ్వ లేదు (మంచి పద్యం ఎవరికైనా తెలిస్తే యిక్కడ తప్పక పంచుకోండి). ఆదిశంకరుల అర్ధనారీశ్వర స్త్రోత్రం మాత్రం మేరునగంలాగ కళ్ళెదుట కనిపించింది. కాని అది సంస్కృతమాయె! అంచేత ఆ స్తోత్రాన్ని మాతృకగా తీసుకొని తెలుగులో ఒక సీసమాలిక రచించాను. అది యిది:
ఒకవంక సంపెంగ యొకవంక కప్పురం
బైన మైచాయతో నలరు మూర్తి
నొకవంక ధమ్మిల్ల మొకవంక జూటమ్ము
నై యొప్పు కొప్పుతో నలరు మూర్తి
నొకవంక కఱిమబ్బు లొకవంక కెంపుమిం
చుల బోలు కురులతో నలరు మూర్తి
నొకవంక నిడుకల్వ యొకవంక విరిదమ్మి
యగు కన్నుగవతోడ నలరు మూర్తి
నొకవంక పూవులు నొకవంక పునుకలు
నలక గళమ్ముల నలరు మూర్తి
నొకవంక ఝణఝణ లొకవంక బుసబుస
లందెలరవళుల నలరు మూర్తి
నొకవంక కస్తూరి యొకవంక చితిబూది
యలదిన మేనితో నలరు మూర్తి
నొకవంక ప్రకృతియు నొకవంక వికృతియు
నమరు నాకృతితోడ నలరు మూర్తి
లాస్యతాండవకేళీ విలాసములను
సృష్టి లయములు లీలగ జేయు మూర్తి
నేకతమ నిరీశ్వర నిఖిలేశ్వరమ్ము
నైన తత్త్వముతో నలరారు మూర్తి
నఖిల జగతికి తలిదండ్రియైన మూర్తి
నాదిశంకర విదిత మహద్విభూతి
నాత్మ భావింతు నిరతమ్ము నర్చసేతు
భక్తి స్మరియింతును శివశ్శివా యటంచు!
ఆ ఆదిదంపతులది భలే అన్యోన్యమైన కలయిక. వాళ్ళ పేర్లు కూడా ఒకటే! "శివః" అంటే అయ్య, "శివా" అంటే అమ్మ! అందుకు "శివశ్శివా" అని స్మరించడం. అంత సామ్యం ఉన్న వాళ్ళిద్దరూ మళ్ళీ అంత అసామాన్యులు కూడాను! పైపై వేషాల మాట అటుంచి, తత్త్వతః కూడా ఎదురెదురు స్వభావాల వారు. ఒకరి కన్ను నిడువైన కలువ, మరొకరిది విప్పారిన తామర. అంటే ఒకరు రాత్రికీ మరొకరు పగటికీ ప్రతినిధులు. ఒకరు ప్రకృతి, మరొకరు వికృతి. ఒకరిది లాస్యసృష్టి, మరొకరిది విలయ తాండవము. ఇంతటి వైవిధ్యమున్న రెండు శక్తులు ఒకటి కావడమే సృష్టిలోని వింత. నిజానికి ఒకటే శక్తి యిలా రెండుగా కనిపిస్తోందన్నది అద్వైత సిద్ధాంతం. నిరాకార నిర్గుణ శక్తికి ఒక రూపాన్ని భావించడంలో, అద్వైతం ఈ అర్ధనారీశ్వర రూపాన్ని దాటి యింకా ముందుకుపోతుంది. అర్ధనారీశ్వర మూర్తి ఒకటే అయినా, అందులో శివ శక్తి రూపాలు భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి తేడాకూడా లేని, తెలియని రూపం మరొకటి ఉంది. అది లలితాదేవి! సౌందర్యలహరిలో ఆ రూపాన్ని ఆదిశంకరులు యిలా వర్ణిస్తారు:
త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శంకే హృతమభూత్
యదేతత్ త్వద్రూపం సకల మరుణాభం త్రినయనమ్
కుచాభ్యా మానమ్రం కుటిలశశిచూడాల మకుటమ్
అమ్మా! నీ రూపం మొత్తం అరుణకాంతులతో వెలుగుతోంది (ఇది గౌరీదేవి రంగు). కాని నీకు మూడు కన్నులున్నాయి (ఇది శివుని రూపు). కుచభారంతో వంగిన శరీరమూ (పార్వతి రూపు), పైన జడలో నెలవంకా (శివుని రూపం) ఉన్నాయి నీకు. ఇది చూస్తే ఏమనిపిస్తోందంటే, నువ్వు శివుని వామభాగాన్ని ఆక్రమించడంతో సంతృప్తి పడక ఆ రెండో సగాన్ని కూడా ఆక్రమించినట్టుగా ఉన్నావు.
అదీ అసలు తత్త్వం!
పైకి భార్యాభర్తలు అన్యోన్యంగా చెరిసగమై జీవితాన్ని సాగిస్తున్నట్టు కనిపిస్తే, దాని అసలు తత్త్వం, భార్యామణి పెత్తనమే - అన్న ధ్వని పై వర్ణనలో స్ఫురిస్తే, అది నా తప్పు కాదు :) అద్వైతాన్నయినా అర్థం చేసుకోవచ్చు కాని అర్ధాంగిని అర్థం చేసుకోలేమని ఊరికే అన్నారా! అందుకే కాబోలు ఆదిశంకరులు రెండవదాని ఊసెత్తకుండా మొదటిదాన్ని నెత్తికెత్తుకున్నారు. :)
ఏది యేమైనప్పటికీ, పరమశివుడు భర్తలకు పరమాదర్శం అనే ఒక మంచి మాటతో ఈ పరంపరకు మంగళాశాసనం పలకుతున్నాను. శుభం!
పూర్తిగా చదవండి...
Monday, December 10, 2012
భక్తి స్మరియింతును శివశ్శివా యటంచు!
Saturday, May 22, 2010
మన్మథుడి విజయరహస్యం
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే
ఈ మధ్యనే శంకరాచార్యులవారి సౌందర్యలహరి చదవడం మొదలుపెట్టాను. ఇప్పటిదాకా దాని గురించి ఎవరైనా చెప్పగా వినడమే కాని ఎప్పుడూ చదవలేదు. చదవడం మొదలుపెట్టగానే, ఇది మామూలు పుస్తకంలా చదువుతూ పోకుండా, ఆ శ్లోకాలని కంఠస్థం చేస్తే బాగుంటుందన్న కోరిక బలంగా ఏర్పడింది. ఇంకా పట్టుపని పది శ్లోకాలయ్యాయి! అందులో పై శ్లోకం ఆరవది.
లోకాన్ని జయించిన మన్మథుడి గురించిన శ్లోకం. అతని విల్లేమో పువ్వులతో చేసింది. చాలా సుకుమారమైనది. మౌర్వీ అంటే వింటి నారి (అల్లె త్రాడు). అదేమో మధుకరమయీ, అంటే తుమ్మెదల మయం. అలాంటి అల్లెతాడుకి బిగువేముంటుంది? ఇంక ఆ మన్మథుడి దగ్గరున్న బాణాలేమో అయిదే అయిదు! అతనికి సహాయం ఎవరయ్యా అంటే వసంతుడు. ఏడాదికి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అతని తోడు. ఈ మన్మథ యోధుడెక్కే రథం ఏమిటంటే మలయమారుతం. అంటే వట్టి గాలి! పైగా ఆ మన్మథుడెవరు? అనంగుడు. అంటే అతనికి భౌతికమైన శరీరమే లేదన్న మాట! అలాంటి మన్మథుడు తానొక్కడే ఈ లోకాన్నంతటినీ జయిస్తున్నాడు. ఎలా? ఓ హిమగిరిసుతా! నీ కడకంటి చూపులలోని ఏదో ఒక కృపావిశేషం లభించడం వల్లనే సుమా! మన్మథుని మహత్తు వెనకనున్న అసలు రహస్యం అమ్మవారి కృపేనన్నమాట.
మన్మథుడంటే మరెవరో కాదు మనిషి అంతరంగంలోని అనుభూతులే. సుకుమారమైన మనిషి మనసే మన్మథుడి విల్లు. అతని అయిదు బాణాలు మనిషి పంచేంద్రియాలు. ఈ బాణాలని మనసనే ధనుస్సుకి అనుసంధానం చేసే వింటి నారి - ఇంద్రియ స్పందనని మనసుకి చేర్చే నాడి. అలా పంచేద్రియాల స్పందన మనసుని వంచుతుంది. దాని ద్వారా ఏర్పడిన అనుభూతి చిత్తాన్ని సంచలింపచేసి మనిషిని లొంగదీసుకుంటుంది. అదే మన్మథ విజయం. అయితే ఈ అనుభూతిని కలిగించే శక్తి ఏదో మన అంతరంగంలో ఉండి ఉండాలి. ఆ మూల శక్తినే రకరకాల రూపాలలో భావించి స్తోత్రం చేసారు మన పూర్వులు. అందులో అమ్మవారి రూపం ఒకటి.
ఈ శ్లోకం చదవగానే కరుణశ్రీగారు వ్రాసిన పద్యం ఒకటి గుర్తుకువచ్చింది. ఉదయశ్రీ పుస్తకంలో "తపోభంగం" అన్న పద్య కవితలో నాకు ఇష్టమైన పద్యమిది.
తియ్యవిల్కాడు వింట సంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము
గౌరి కడకంటి చూపుతో కలిసిపోయి
గుచ్చుకొనె నవి ముక్కంటి గుండెలోన
శివునికి తపోభంగమైన సన్నివేశం. శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే అతనికి ఉపచారాలు చేస్తున్న పార్వతీదేవి పూలబుట్టతో అతని దగ్గరకి వచ్చింది. సరిగ్గా అప్పుడే తియ్యవిలుకాడైన మన్మథుడు సమ్మోహన బాణాలని తన వింట సంధించి విడిచాడు. అవి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయి. అలా చెప్పి ఊరుకుంటే అందులో కవిత్వమేముంటుంది! ఇందులో మూడవపాదం ఈ పద్యానికి ఆయువుపట్టు. శివుని ఎదురుగ్గా నించున్న పార్వతీదేవి అతడిని తన కడకంటితో చూస్తోంది. ఆ కడకంటి చూపులలో ఈ బాణాలు కలిసిపోయి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయట! అందమైన స్త్రీల చూపులని మన్మథ బాణాలతో పోల్చడం మామూలు. కాని ఇక్కడ నిజంగా మన్మథ బాణాలున్నాయి. అవి ఆ చూపులతో కలిసిపోయాయి. ఇప్పుడు శివుని మనసు చలించినది మన్మథుడి బాణాల వల్లనా, గౌరి చూపులవల్లనా? పరమ శివునిలో స్పందన కలిగించే శక్తి అమ్మవారికి తప్ప మన్మథుడి కెక్కడిది! మరి శివుడు పాపం మన్మథుణ్ణి ఎందుకు భస్మం చేసాడు? ఎందుకంటే మన్మథుడు తన ప్రతాపం వల్లనే ఇదంతా జరిగిందని భ్రమించాడు. అంచేత అతనికి కర్మ చుట్టుకుంది. ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పింది కాదు.
శంకరాచార్యులవారు వాడే ప్రతి పదం వెనక ఏదో ఒక ప్రత్యేకమైన కారణం, అర్థం ఉండే ఉంటుందని చాలామంది వ్యాఖ్యాతలు అంటారు. పై శ్లోకంలో అమ్మవారికి "హిమగిరిసుతే" అన్న పదం ఉపయోగించడం శివ తపోభంగ ఘట్టాన్ని గుర్తుచెయ్యడానికే కాబోలు! ఆ శ్లోకమిచ్చిన స్ఫూర్తితోనే కరుణశ్రీగారు ఈ పద్యాన్ని వ్రాసారేమో! శంకరుల శ్లోకం గురించి తెలుసుకున్నాక, కరుణశ్రీగారి పద్యం మరింత అందగించింది. మరింత నచ్చింది!
పూర్తిగా చదవండి...