తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, August 9, 2010

తెలుగు పద్యము తన పెద్దదిక్కు నీగె!

ఒకోసారి కొంతమందితో మనకి ప్రత్యక్ష పరిచయం లేకపోయినా మన మీద గాఢమైన ప్రభావాన్ని చూపుతారు, మనకి ఆత్మీయులవుతారు. సాధారణంగా ఇలాంటి బంధం ఒక రచయితకీ పాఠకునికీ మధ్య ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఏకపక్షం. పాఠకునికి రచయితతోనే ఉండేది. నన్నలా ప్రభావితం చేసిన వారు శ్రీ కోవెల సంపత్కుమారాచార్యగారు.

ఛందస్సులో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానానికి దోహదం చేసిన పుస్తకాలలో కోవెలవారి తెలుగు ఛందోవికాసము ముఖ్యమైనది. ఇది ఛందస్సుకి సంబంధించిన మామూలు లక్షణగ్రంథంలా కాకుండా, తెలుగు ఛందస్సు మూలాలను పరిశీలిస్తూ, తెలుగు ఛందస్సుని తమిళ కన్నడ ఛందస్సులతో పోలుస్తూ, గణవిభజన, యతి, ప్రాసల వెనకనున్న వైశిష్ట్యాన్ని వివరిస్తూ చక్కని వచనంలో సాగే పుస్తకం. ఛందస్సు గురించిన అవగాహనకి ఈ పుస్తకం నాకెంతో ఉపయోగపడింది.

అలాగే వీరికీ, చేరాగారికీ మధ్య వచన పద్యాలలో ఛందస్సు గురించి చాలా కాలం కిందట వ్యాసపరంపరలతో ఒక చర్చ జరిగింది. ఈ చర్చ ఎంతో ఆసక్తికరమైనది, అంతకు మించి ఆరోగ్యకరమైనది. వారిరువురి మధ్యనా ఆ చర్చ ద్వారా ఏర్పడిన అనుబంధం ఆదర్శవంతం. ఈ చర్చలోని వ్యాసాలన్నిటినీ "వచన పద్యం - లక్షణ చర్చ" అనే పుస్తకంగా సంకలించి ప్రచురించారు. ఈ చర్చలో వారిద్దరూ అనేక విషయాల్లో విభేదించుకున్నప్పటికీ వారి మధ్యన స్నేహబంధానికి ఆ విభేదాలు అడ్డురాలేదు. ఈ వాదనవల్ల ఏర్పడిన బంధం ఎంతదాకా వెళ్ళిందంటే, ఆ తర్వాత ఒకరు వ్రాసిన పుస్తకాలు మరొకరికి అంకితం ఇచ్చుకొనేంతదాకా!

అన్నిటికన్నా కూడా విశ్వనాథని అర్థం చేసుకోడానికి శ్రీ సంపత్కుమారాచార్యగారి పుస్తకాలు వ్యాసాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి. దానికి నేనతనికి ఎప్పటికీ ఋణపడిపోయాను. విశ్వనాథ సాహిత్యాన్ని గురించి "విశ్వనాథ సాహిత్య దర్శనం" అన్న పుస్తకాన్ని వారు వ్రాసారు. విశ్వనాథ కవిత్వాన్ని గురించి ఇంకా చాలాచోట్ల చాలా వ్యాసాలు వ్రాసారు. విశ్వనాథ జీవితచరిత్రకి (పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు వ్రాసిందని గుర్తు) సంపాదకత్వం వహించారు.

చాలా ఏళ్ళ కిందట దూరదర్శన్ "పద్యాల తోరణం" కార్యక్రమంలో పాల్గొనడానికి టీవీ స్టూడియోకి వెళ్ళినప్పుడు వారుకూడా వచ్చారు. నేను పెద్దగా కలుపుగోలు మనిషిని కాకపోవడంతో వారికి నమస్కారం మాత్రం పెట్టి ఊరుకున్నాను కాని, అంతకుమించి పరిచయం పెంచుకోలేదు. అయినా వారి రచనల ద్వారా వారు నాకెంతగానో దగ్గరయ్యారు.

ఆ సంపత్కుమారాచార్యగారు మొన్ననే పరమపదించారన్న వార్త విని చాలా బాధపడ్డాను. ఛందస్సు, విశ్వనాథ కవిత్వం నాకు నేర్పిన పరోక్ష గురువు వారు. ఈ కాలంలో తెలుగు పద్యసాహిత్యమ్మీద గొప్ప అధికారం ఉన్నవాళ్ళలో ఆయనే పెద్ద. రామాయణకల్పవృక్షానికి వ్యాఖ్యానం వ్రాయగల సామర్థ్యం ఉన్న చాలా కొద్దిమంది విమర్శకులలో సంపత్కుమారాచార్య ఒకరని నేను నమ్ముతాను. ఇప్పుడు వారు కూడా పరమపదించారని తెలిసి, ఇక కల్పవృక్షానికి వ్యాఖ్యానం వచ్చే అవకాశం మరింత తగ్గిపోయిందని చాలా బాధగా ఉంది. ఇకపై వారి రచనలు చదివే అవకాశం లేదన్న ఊహ కష్టంగా ఉంది!

వారిని సంస్మరిస్తూ, వారు వ్రాసిన "కల్పవృక్షము - యుద్ధ శిల్పావతారిక" అనే వ్యాసం నుండి ఒక చిన్న భాగం ఇక్కడ ఇస్తున్నాను. మీరుకూడా వారి విమర్శ పటిమని రుచిచూడండి.

***

రామాయణగాథ నీ సంసారానికి - నిత్యప్రస్రవణ శీలమయిన లోకానికి - అందించిన వాల్మీకిమహర్షి పరమమౌని. కల్పవృక్షావతారికలో వాల్మీకి స్మరణ సాగిన పద్యత్రయిలోనూ ఆయన "మౌని"గానే విశేషణింపబడినాడు. గాథనందించిన మహర్షి "మౌని" కాగా, గురువుగారి మౌనవ్యాఖ్యానంలో శిష్యులు ఛిన్నసంశయులు కావలసి ఉంటుంది. ఎల్లాంటివారయితే, ఏం చేస్తే వారు ఛిన్నసంశయులు అయ్యే స్థితి కలుగుతుంది? మొదట కావలసింది వారు గాఢప్రతిభులు. తద్ద్వారా ఆ గాథను, దానిలోని రహస్యాలనూ, కథాకథనశిల్పానేక మార్గాలనూ పౌనఃపున్యంగా ఉపాసించి, ఆ కావ్యవాక్కు సర్వశిల్పభూమి అని తెలిసి సర్వశాస్త్ర లక్ష్యమని ఎరిగి, సంప్రదాయావగాహనతో మననం చేసి, అనంతమయిన వ్యుత్పన్నత లోకజ్ఞత కలిమితో అనేకాంశాలను సమన్వయపూర్వకంగా ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే ఛిన్న సంశయత్వం. కృష్ణశాస్త్రి అన్నట్లు "గాఢప్రతిభు"లయిన సత్యనారాయణగారు ఆ విధంగా చేసినారు.

"--- వలయు విద్యకైగాగ్ర్య మభ్యసనవేళ
జనును బహుముఖత్వము ప్రదర్శనము వేళ"

-రామాయణకల్పవృక్షం, యుద్ధ నిస్సంశయ ఖండం

రామాయణ మహావిద్యా విషయకంగా ఆయన చేసిన అభ్యాసమా విధమైనది. రామాయణాన్ని కల్పవృక్షంగా విరియించిన వేళ ప్రదర్శించిన బహుముఖత్వం అనంతముఖమయింది.
...
రామాయణకల్పవృక్షం యుద్ధకాండతోనే సమగ్రమయింది. కావలసిందిగూడా ఆ విధంగానే. వాల్మీకావతారికా సర్గల్లో - "రఘువరచరితం మునిప్రణీతం, దశశిరసశ్చ వధం నిశామయధ్వం" అనీ, "కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్" అనీ చెప్పబడింది. నిజాని కది రఘువర చరితమా? సీతామహచ్చరితమా? నిజానికా చరితలు "రెండు" కావు - ఒకటే రెండుగా భాసించినా ఒకరు లేకుండా మరో టనిపించే చరిత లేదు; కారణం సీతారాములు అభిన్నులు కావటమే. ఇద్దరూ ఒకే వెలుగు.

"ఇరువురము ఒక్క వెలుగున
చెరి సగమును, దీని నెఱుగు శివుడొకరుండే,
పురుషుడ వీ వైతివి, నే
గరితనుగా నైతి..." (కల్పవృక్షం, యుద్ధ.ఉపసంహరణ)

అగ్నిప్రవేశం చెయ్యబోతూ కల్పవృక్ష సీత చెప్పిన చివరి రహస్యమిది. కల్పవృక్షావతారికలో "కృత్స్నము రామ మహత్తు" శివుడెరుంగునని చెప్పిన అంశం ఇక్కడి అంశాన్ని స్పృశిస్తున్నది. ఈ విధంగా "పాలితాన్యోన్య లంఘన స్పర్థము"లయిన అంశాలు అనేకం. కాగా శివుడెరింగిన ఆ కృత్స్నత - సమగ్రత ఇది. అయితే ఒకే వెలుగు స్త్రీ-పుం రూపంగా వివర్తమానం కావటమెందుకు? రావణ వధార్థం. ఉదాహృత వాల్మీకి వాక్యాల్లో రఘువరచరిత మన్నప్పుడు, సీతామహచ్చరిత మన్నప్పుడు కూడా వెనువెంటనే తప్పనిసరి అంశంగా, ఫలభూతంగా చెప్పబడింది దశశిరస్క - పౌలస్త్య వధ. ఆ దశశిరస్కుడు పౌలస్త్యుడు భిన్నులు కారు. రఘువరుడు, సీత కూడా కారు. "రమ్‌" అన్న ధాతువునుంచి సుబంతపదం పుంలింగ రూపంలో నిష్పన్నమయితే "రామ" అని, స్త్రీలింగ రూపంలో నిష్పన్నమయితే "రామా" అని ఒకే వెలుగు ద్విధా పరిణతమయినట్లు, ఒకే మూలధాతువు ఈ రూపద్వయంగా పరిణతమయింది. ఒకటి పురుషరూపం, ఒకటి గరిత రూపం. అందుకనే తత్త్వతః అభేదం. ఈ కారణంగానే వాల్మీకం రఘువరచరితం గానీ, సీతా మహచ్చరితం గానీ కాక, "రామాయణ"మయింది. తాత్త్వికాభేదాన్ని రామాయణం గర్భీకరించుకుంది. "కావ్యం రామాయణం కృత్స్నం" అంటే ఆ కృత్స్నత ఇది. ఈ కృత్స్నమయిన రామాయణానికి ఫలం రాముడు సీతను పునర్లభించుకోవటం కాదు. ఈ అంశం కల్పవృక్ష రావణునికీ అర్థమయింది. అందుకనే,

"సీతం గొంచును బోవ నీతడిట వచ్చెన్నాగ వ్యాజంబు, వి
ఖ్యాతిన్ దానవవంశ నాశనము కార్యంబీ శివాద్వైతికిన్
సీతం గైకొనిపోవ వేవిధములం జేయంగ వచ్చున్, మహా
దైతేయోన్మథనంబు ముఖ్యము సముద్రాంభోవ్యధాకారికిన్" (యుద్ధ.నిస్సంశయ ఖండం)

అనుకుంటాడు. అట్లాగే, సీతను వదిలి పుత్రులను పొందటంగూదా కాదు. ఇవన్నీ అనుషంగికమయినవి. అసలు ఫలం దశశిరస్కుడు పౌలస్త్యుడు అయిన రావణుని వధ. దశశిరస్కత మానవ సృష్టిలోని ప్రకృతి వైపరీత్యానికి ప్రతీక, పౌలస్త్యత్వం మానవుని ఉదాత్త స్థాయికి సూచిక. ఆ స్థాయిలో వైపరీత్యం సృష్టి వ్యవస్థా భంజకం. ఆ భంజికమయిన దాన్ని ఉన్మూలించటం సృష్టియొక్క సుస్థితికి అభీష్టం. ఈ సుస్థితిని రక్షించుట ఆదిమ మహస్సులోని వైష్ణవీయతా లక్షణం కాబట్టి రావణవధ రామాయణఫలం. ఈ విధంగా యుద్ధకాండతోనే రామాయణ సమగ్రత.
...

రావణ వధానంతరం అగ్నిలో ప్రవేశించబోతూ సీత అనేకాంశాలను సువ్యక్తం చేస్తూ -

"--- కైక కోరక మహాప్రభు! నీ వని రాకలేదు, నీ
యాడది సీత కోరక మహాసురసంహరణంబు లేద, యా
యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్" (యుద్ధ,ఉప)

అంటుంది. "సీతాయాశ్చరితం మహత్" అని అనకుండా ఉండలేకపోవటం ఇందువల్లనే. రాముడు శుద్ధ తత్త్వ స్వరూపం. ఆయన క్రియాప్రవృత్తిని స్పందింప చేసింది కైకేయి. ఆ స్పందనను ఫలవంతం చేసింది సీత. అందుకే తిరిగి అయోధ్యకు వచ్చినాక కలుసుకున్నప్పుడు -

కైకెయి సీత గౌగిటికి గైకొని - "ఓసి యనుంగ! నీవుగా
గైకొని యీ వనీచయనికామ నివాసభరంబిదెల్లనున్
లోకము నన్ను తిట్టుట తలోదరి! మార్చితి, కైక పంపెనే
గాక దశాననాదివధ కల్గునె యన్న ప్రశంసలోనికిన్ (యుద్ధ, ఉప)

అంటుంది. కార్య సాఫల్యం విషయికంగా అంతర్మథనం పొందిన లక్షణం కైక మాటల్లోనూ, నిశ్చయాత్మకత సీతమాటల్లోనూ వ్యక్తమై వారి వ్యక్తిత్వాలను సువ్యక్తం చేస్తుంది.

***


పూర్తిగా చదవండి...

Tuesday, July 6, 2010

దీర్ఘ విరామం తర్వాత - "దీర్ఘ వాసరా"ల గురించి

ఈసారి బ్లాగుకి కాస్త సుదీర్ఘమైన విరామమే వచ్చింది! బ్లాగుకైతే దూరమయ్యాను కాని తెలుగు పద్యానికి కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పద్యాన్ని తలుచుకోకుండా రోజే గడవదు. అలా ఈ మధ్య తలచుకున్న పద్యం ఇది:

నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్
దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్

ఇది నన్నయ్యగారి పద్యం. మహాభారతం అరణ్యపర్వంలోది. ప్రసిద్ధమైన పద్యమే. భారతం చదవకపోయినా, కన్యాశుల్కం చదివిన వారిక్కూడా ఈ పద్యం గురించి తెలిసే ఉంటుంది. కరటకశాస్త్రి వెంకటేశాన్ని పద్యం చదవమని అడుగుతాడు. వెంకటేశం, "పొగచుట్టకు" పద్యం ఎత్తుకుంటే గిరీశం అడ్డుకొని ఈ "నలదమయంతులిద్దరు" పద్యం చదవమంటాడు. మొదటి పాదం చదవగానే కరటకశాస్త్రి ఆపి, "మనఃప్రభవానల" అంటే అర్థం చెప్పమంటాడు వెంకటేశాన్ని. గుర్తుకొచ్చిందా?

అరణ్యపర్వంలో వచ్చే అనేక కథలలో నల మహారాజు కథ ఒకటి. ఇది కూడా చాలామందికి తెలిసిన కథే. ఇందులో హంస రాయబారం బాగా ప్రాచుర్యాన్ని పొందింది. నలుడి చేత రక్షింపబడ్డ ఒక హంస, ప్రత్యుపకారంగా దమయంతిదగ్గరకి వెళ్ళి నలుణ్ణి గురించి గొప్పగా చెప్పి, నలునిపై ఆమెకు ఇష్టాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే దమయంతి రూపవైభవాన్ని నలునికి చెప్పి అతనిలోని కోరికని పెంపొందిస్తుంది. ఈ హంస రాయబర ఫలితంగా వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి కోరిక కలిగి, విరహితులౌతారు. ఆ విరహ బాధ తగ్గించుకోడానికి నానా తిప్పలూ పడతారు. వాటిని వర్ణించే పద్యం ఇది!

మనఃప్రభవుడు అంటే మనసులో పుట్టేవాడు, మన్మథుడు. మనఃప్రభవానలం - ఆ మన్మథుడికి సంబంధించిన అగ్ని. మన్మథ తాపం అన్న మాట. ఆ మన్మథ తాపంతో బాధింపబడే మనసు కలవాళ్ళయ్యారు ఆ ఇద్దరూ. ఇక్కడ "మనః ప్రభవానల"లో "నః" యతి స్థానంలో ఉంది. కాబట్టి కొంచెం ఒత్తి పలకాలి. అలా అక్కడ, ఆ విసర్గతో కూడిన నకారాన్ని వత్తి పలికినప్పుడు ఆ మన్మథ తాపం మనసుని ఎంతగా దహిస్తోందో చక్కగా తెలుస్తుంది.
"దీర్ఘవాసర నిశల్" - పొడవైన పగళ్ళు కలిగిన రాత్రులు. వాటిని ఎలాగో అలా కష్టపడి గడుపుతున్నారు. ఈ "దీర్ఘవాసరనిశల్" అనేది భలే అద్భుతమైన ప్రయోగం. చెపుతున్నది రాత్రుల గురించి. ఆ రాత్రులు ఎలాంటివంటే బాగా దీర్ఘమైన పగళ్ళు కలిగినవి. అంటే రాత్రులేమో ఇట్టే గడిచిపోతున్నాయి. పగళ్ళు మాత్రం జీళ్ళపాకంలా సాగుతునే ఉన్నాయని. ఎందుకిలా జరుగుతోంది? దీనికి రెండు కారణాలు. ఒకటి అసలే విరహ తాపంతో ఉన్నారు. దానికి తోడు పగలు ఎండ వేడి తోడైతే మరి కాలం ఎంత మెల్లిగా కదులుతుంది! అంచేత ఆ పగళ్ళు అంత దీర్ఘంగా సాగుతున్నాయి. మరొక కారణం - వేసం కాలంలో (వసంత గ్రీష్మ ఋతువుల్లో) పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. సూర్యోదయం తొందరగా అవుతుంది. సూర్యాస్తమయం ఆలస్యంగా అవుతుంది. అంచేత ఆ కాలంలో పగళ్ళు పొడుగైనవి. కాబట్టి ఈ పదం ద్వారా అది వేసవి కాలమని ధ్వనిస్తోంది. వేసవి కాలం విరహార్తులకి మరింత గడ్డు కాలం కదా! అంచేత నలదమయంతుల బాధ మరింత తీవ్రంగా ఉన్నదన్న మాట. ఇదంతా "దీర్ఘవాసరనిశల్" అన్న ఒక్క పదంతో ధ్వనింప జేసాడు నన్నయ్య. అనుభవించ గలిగేవారికి ఇందులోని కవిత్వం అనుభూతమవుతుంది! సరే ఆ విరహాన్ని తట్టుకోలేక వాళ్ళు పూలదోటల్లోనూ, తామరాకుల మధ్యనా, మృదువైన తామర తూళ్ళ మధ్యనా, కర్పూర ధూళి అలముకొంటూ, పూల శయ్యలమీద విశ్రమిస్తూ, చల్లనీటి ధారలలో తడుస్తూ, చందనాన్ని పూసుకొంటూ గడిపారట - ఆ తాపాన్ని తట్టుకోలేక!

ఇంతకీ ఈ పద్యం ఈ మధ్యన గుర్తుకు రావడానికి కారణం, "దీర్ఘవాసర నిశల్" అన్న పదం. ఈ మధ్యనే ఆఫీసుపని మీద అమెరికాకి వచ్చాను. అందులోనూ అమెరికాలో పైన కెనడాకి దగ్గరగా ఉండే చోటు. తస్సాదియ్య "దీర్ఘవాసర నిశల్" అంటే ఏమిటో ఇక్కడకి వచ్చాక తెలిసివచ్చింది! ఇక్కడ ప్రస్తుతం వేసవి కాలం. ఉదయం అయిదు గంటలకే సూర్యోదయమైపోతుంది (నేనెప్పుడూ చూడలేదనుకోండి). రాత్రి(?) తొమ్మిదయ్యాక సూర్యాస్తమయం! అంటే ఉదయం అయిదునుంచీ రాత్రి(?) తొమ్మిది దాకా, పదహారు గంటలు పగలే నన్నమాట! పొడవైన పగళ్ళంటే ఇవి కదూ! చలికాలం వచ్చిందంటే ఎనిమిదింటి దాకా తెల్లవారదు. సాయంత్రం నాలుగింటికల్లా పొద్దుపోతుంది. ఇంత వైవిధ్యం మన దేశంలో ఉండదు. భారతదేశంలో ఉంటేనే నలదమయంతులకి అవి "దీర్ఘవాసర నిశల్" అనిపించాయే, అదే వాళ్ళు అమెరికాలో వేసంకాలం గడిపితే మరేమనిపించేదో! ఐతే ఇక్కడ ఎండకి మన ఎండంత తీక్ష్ణత ఉండదు కాబట్టి కాస్త నయమే :-) మన సూర్యుడు నిజంగా "ఖరకరుడే".

ఈ సందర్భంలోనే ఆముక్తమాల్యదలోని మరో పద్యం కూడా గుర్తుకు వచ్చింది. అద్భుతమైన ఊహ. రాయలంటేనే ఇలాంటి ఊహలకి పెట్టింది పేరు.

పడమరవెట్ట నయ్యుడుకు బ్రాశనమొల్లక కూటిపేదలై
బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవి యాజ్ఞ మాటికిన్
ముడియిడ బిచ్చుగుంటు రథమున్ నిలుపన్ బయనంబు సాగమిన్
జడను వహించె నాగ దివసంబులు దీర్ఘములయ్యె నత్తఱిన్

వేసం కాలంలో పగళ్ళు ఎంత పొడుగవుతాయో ముచ్చటించుకుంటున్నాం కదా. అలా ఎందుకవి పొడుగవుతాయో అన్నదానికి రాయల వారి ఊహ ఈ పద్యం. పగళ్ళెందుకు పొడుగవుతాయి? సూర్యుడు ఆకాశంలో తూర్పునుండి పడమరకి మెల్లగా ప్రయాణిస్తాడు కాబట్టి (ఇది ఊహ కాదు నిజమే!). సూర్యుడెందుకంత మెల్లగా ప్రయాణిస్తున్నాడు? సూర్యుడు రథమ్మీద కదా ప్రయాణం చేస్తాడు. ఆ రథానికి ఏడు గుఱ్ఱాలు. వాటికి పగ్గాలేమో పాములు. పాములు గాలిని భోంచేస్తాయి. వాటికి వాయుభుక్కులు, గాలిమేపరులు అని పేరు. వేసం కాలంలో పడమటినుండి గాలులు (ఎదురుగాలులన్న మాట) బాగా వేడిగా వీస్తున్నాయి. ఎవరైనా వేడన్నం తినగలరు కాని పొగలు క్రక్కుతూ నోరు కాలిపోయేట్టున్న అన్నాన్ని తినగలరా? లేదుకదా. అంచేత పాపం ఆ పాములకి ఆహారం లేకపోయింది. దానితో నీరసం వచ్చి వడలిపోయాయి. పట్టుతప్పి మాటిమాటికీ ఊడిపోతున్నాయి. వాటిని సరిచెయ్యమని సూర్యుడు చెపుతున్నాడు. సరిచెయ్యడానికి సూర్యుడి సారథి అనూరుడు (పిచ్చుకుంటు) మాటిమాటికీ రథాన్ని ఆపవలసి వస్తోంది. అంచేత ప్రయాణం మెల్లగా సాగుతోంది. కాబట్టి పగళ్ళు అంతసేపుంటున్నాయిట! ఏం ఊహ! ఇక్కడ అమెరికా సూర్యుడి పాములు మరీ నిస్సతువలై ఉన్నట్టున్నాయి :-) ఏకంగా పదహారు గంటలపాటు సాగుతోందతని ప్రయాణం!


పూర్తిగా చదవండి...

Saturday, May 22, 2010

మన్మథుడి విజయరహస్యం

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే

ఈ మధ్యనే శంకరాచార్యులవారి సౌందర్యలహరి చదవడం మొదలుపెట్టాను. ఇప్పటిదాకా దాని గురించి ఎవరైనా చెప్పగా వినడమే కాని ఎప్పుడూ చదవలేదు. చదవడం మొదలుపెట్టగానే, ఇది మామూలు పుస్తకంలా చదువుతూ పోకుండా, ఆ శ్లోకాలని కంఠస్థం చేస్తే బాగుంటుందన్న కోరిక బలంగా ఏర్పడింది. ఇంకా పట్టుపని పది శ్లోకాలయ్యాయి! అందులో పై శ్లోకం ఆరవది.

లోకాన్ని జయించిన మన్మథుడి గురించిన శ్లోకం. అతని విల్లేమో పువ్వులతో చేసింది. చాలా సుకుమారమైనది. మౌర్వీ అంటే వింటి నారి (అల్లె త్రాడు). అదేమో మధుకరమయీ, అంటే తుమ్మెదల మయం. అలాంటి అల్లెతాడుకి బిగువేముంటుంది? ఇంక ఆ మన్మథుడి దగ్గరున్న బాణాలేమో అయిదే అయిదు! అతనికి సహాయం ఎవరయ్యా అంటే వసంతుడు. ఏడాదికి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అతని తోడు. ఈ మన్మథ యోధుడెక్కే రథం ఏమిటంటే మలయమారుతం. అంటే వట్టి గాలి! పైగా ఆ మన్మథుడెవరు? అనంగుడు. అంటే అతనికి భౌతికమైన శరీరమే లేదన్న మాట! అలాంటి మన్మథుడు తానొక్కడే ఈ లోకాన్నంతటినీ జయిస్తున్నాడు. ఎలా? ఓ హిమగిరిసుతా! నీ కడకంటి చూపులలోని ఏదో ఒక కృపావిశేషం లభించడం వల్లనే సుమా! మన్మథుని మహత్తు వెనకనున్న అసలు రహస్యం అమ్మవారి కృపేనన్నమాట.

మన్మథుడంటే మరెవరో కాదు మనిషి అంతరంగంలోని అనుభూతులే. సుకుమారమైన మనిషి మనసే మన్మథుడి విల్లు. అతని అయిదు బాణాలు మనిషి పంచేంద్రియాలు. ఈ బాణాలని మనసనే ధనుస్సుకి అనుసంధానం చేసే వింటి నారి - ఇంద్రియ స్పందనని మనసుకి చేర్చే నాడి. అలా పంచేద్రియాల స్పందన మనసుని వంచుతుంది. దాని ద్వారా ఏర్పడిన అనుభూతి చిత్తాన్ని సంచలింపచేసి మనిషిని లొంగదీసుకుంటుంది. అదే మన్మథ విజయం. అయితే ఈ అనుభూతిని కలిగించే శక్తి ఏదో మన అంతరంగంలో ఉండి ఉండాలి. ఆ మూల శక్తినే రకరకాల రూపాలలో భావించి స్తోత్రం చేసారు మన పూర్వులు. అందులో అమ్మవారి రూపం ఒకటి.

ఈ శ్లోకం చదవగానే కరుణశ్రీగారు వ్రాసిన పద్యం ఒకటి గుర్తుకువచ్చింది. ఉదయశ్రీ పుస్తకంలో "తపోభంగం" అన్న పద్య కవితలో నాకు ఇష్టమైన పద్యమిది.

తియ్యవిల్కాడు వింట సంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము
గౌరి కడకంటి చూపుతో కలిసిపోయి
గుచ్చుకొనె నవి ముక్కంటి గుండెలోన

శివునికి తపోభంగమైన సన్నివేశం. శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే అతనికి ఉపచారాలు చేస్తున్న పార్వతీదేవి పూలబుట్టతో అతని దగ్గరకి వచ్చింది. సరిగ్గా అప్పుడే తియ్యవిలుకాడైన మన్మథుడు సమ్మోహన బాణాలని తన వింట సంధించి విడిచాడు. అవి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయి. అలా చెప్పి ఊరుకుంటే అందులో కవిత్వమేముంటుంది! ఇందులో మూడవపాదం ఈ పద్యానికి ఆయువుపట్టు. శివుని ఎదురుగ్గా నించున్న పార్వతీదేవి అతడిని తన కడకంటితో చూస్తోంది. ఆ కడకంటి చూపులలో ఈ బాణాలు కలిసిపోయి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయట! అందమైన స్త్రీల చూపులని మన్మథ బాణాలతో పోల్చడం మామూలు. కాని ఇక్కడ నిజంగా మన్మథ బాణాలున్నాయి. అవి ఆ చూపులతో కలిసిపోయాయి. ఇప్పుడు శివుని మనసు చలించినది మన్మథుడి బాణాల వల్లనా, గౌరి చూపులవల్లనా? పరమ శివునిలో స్పందన కలిగించే శక్తి అమ్మవారికి తప్ప మన్మథుడి కెక్కడిది! మరి శివుడు పాపం మన్మథుణ్ణి ఎందుకు భస్మం చేసాడు? ఎందుకంటే మన్మథుడు తన ప్రతాపం వల్లనే ఇదంతా జరిగిందని భ్రమించాడు. అంచేత అతనికి కర్మ చుట్టుకుంది. ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పింది కాదు.

శంకరాచార్యులవారు వాడే ప్రతి పదం వెనక ఏదో ఒక ప్రత్యేకమైన కారణం, అర్థం ఉండే ఉంటుందని చాలామంది వ్యాఖ్యాతలు అంటారు. పై శ్లోకంలో అమ్మవారికి "హిమగిరిసుతే" అన్న పదం ఉపయోగించడం శివ తపోభంగ ఘట్టాన్ని గుర్తుచెయ్యడానికే కాబోలు! ఆ శ్లోకమిచ్చిన స్ఫూర్తితోనే కరుణశ్రీగారు ఈ పద్యాన్ని వ్రాసారేమో! శంకరుల శ్లోకం గురించి తెలుసుకున్నాక, కరుణశ్రీగారి పద్యం మరింత అందగించింది. మరింత నచ్చింది!


పూర్తిగా చదవండి...

Wednesday, May 5, 2010

అంతర్జాలంలో మరో కల్పవృక్షం

కల్పవృక్షం అంటే మళ్ళీ రామాయణ కల్పవృక్షం అనుకుంటున్నారా ఏంటి? కాదు, ఇది వేరే కల్పవృక్షం. అదేమిటో తెలియాలంటే ఈ పద్యం చదవండి:

పత్రపత్రంబునకు మంచిఫలముగల్గి
కవుల దనుపుచు నర్థసంగ్రహణబుద్ధి
రోసి డస్సినవారల గాసిదీర్చు
గల్పవృక్షంబుగాదె నిఘంటువరయ!

ఇది శ్రీ పాలూరి శంకరనారాయణగారు వ్రాసిన పద్యం.

పత్రం అంటే రెండర్థాలు. ఒకటి ఆకు. రెండు కాగితం. అలాగే ఫలము అంటే పండు, ప్రయోజనము. పత్ర పత్రానికి మంచి ఫలం ఉండేది కల్పవృక్షం. కోరిన కోరికలన్నిటినీ ఫలింప జేసేది కాబట్టి. అలాగే ప్రతి కాగితమూ ప్రయోజనవంతంగా ఉండే పుస్తకం ఒకటుంది. అది కవులని తృప్తిపరుస్తూ ఉంటుంది. అర్థాలు తెలుసుకొనే ప్రయత్నంలో అలసిపోయేవారికి చెట్టులా సేదదీరుస్తుంది కూడా. అర్థవంతమైన కవిత్వాన్ని వ్రాసేందుకు కవులకూ, ఆ కవిత్వాన్ని అర్థం చేసుకునేందుకు పాఠకులకూ కూడా ఉపయోగపడుతుందన్న మాట! అవును అదే నిఘంటువు. ఇప్పుడు చాలామంది తెలుగువాళ్ళకు దాని అర్థం తెలియాలంటే దాన్నే ఆశ్రయించాలేమో! తేలిక భాషలో చెప్పాలంటే డిక్షనరీ.
సరే మరి ఆకుల్లేకుండా పళ్ళు మాత్రమే ఉన్న చెట్లెక్కడైనా ఉంటాయా? మనిషి టెక్నేంద్రజాలానికి ఆ మాత్రం సాధ్యం కాకుండా పోతుందా! జంతర్ మంతర్ అంతర్జాలంలో ఉన్న డిక్షనరీలన్నీ "అపర్ణలే" (అంటే కాగితాలు లేనివే) కదా. తెలుగులో ఇప్పటికే బ్రౌన్ డిక్షనరీ అంతర్జాలంలో ఉన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కనీసం నా బ్లాగులో పద్యాలు చదివేవాళ్ళు, నేను పొద్దులో ఇచ్చే గడితో కుస్తీ పట్టేవారు ఈ బ్రౌణ్యాన్ని ఉపయోగించే ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ దొరికిన మరో వరం ఆంధ్రభారతి నందనవనంలో కొత్తగా వెలసిన నిఘంటు కల్పవృక్షం. ఇందులో బ్రౌణ్యమే కాకుండా, శబ్దరత్నాకరం, మరి రెండు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు కూడా కలిపి ఉన్నాయి! ఈ నిఘంటువుల నుండి విడివిడిగా కాని అన్నిట్లో కలిపి కానీ కావలసిన పదాలను వెతుక్కోవచ్చు. ఆ వెతుకులాట పదాలలో (ఆరోపాలలో) కాని, మొత్తం వాటి అర్థాలలో ఎక్కడైనా కాని చేసుకోవచ్చు. శొధన (అదే, తెలుగు భాషలో చెప్పాలంటే సెర్చి) సులువు చేసుకోడానికి మరెన్నో వెసలుబాట్లు కూడా ఉన్నాయక్కడ. ఇంకెందు కాలస్యం, వెంటనే ఆ ఫలాలని ఆరగించడం మొదలుపెట్టండి! అన్నట్టు మరో విషయం. ఇది ఇంకా ఎదుగుతున్న చెట్టు. అంటే ఇందులో మరెన్నో నిఘంటువులు చేరబోతున్నాయన్న మాట!

బ్రౌను డిక్షనరీ ఒక యూనివర్సిటీ వాళ్ళ కృషి ఫలితమైతే, ఈ కొత్త నిఘంటువు కేవలం ఇద్దరి కృషి ఫలితం. వారు శ్రీ వాడపల్లి శేషతల్ప శాయిగారు, శ్రీ కాలెపు నాగభూషణ రావుగారు. వారి వెనక అజ్ఞాతంగా మరెవరైనా ఉన్నారేమో తెలియదు. తెలుగు మీద అభిమానమున్న వాళ్ళందరూ వారి కృషికి జోహార్లు చెప్పాల్సిందే. మన వంతు సహాయం కూడా చెయ్యవచ్చు. ఎలాగో అక్కడున్న Aboutలో ఇచ్చిన్న వివరాలని చూడండి.
పూర్తిగా చదవండి...

Friday, April 16, 2010

ధర్మరాజుని చెడతిట్టిన అర్జునుడు!

"ధర్మరాజునేవిఁటి అర్జునుడేవిఁటి చెడతిట్టడమేవిఁటి? విడ్డూరంగా ఉందే!" అని ఆశ్చర్యపోతున్నారా? అవును విడ్డూరమే కదూ మరి! ఎంతో కలిసిమెలిసి ఉండే అన్నదమ్ములు పాండవుల్లో అర్జునుడు ధర్మరాజుని తిట్టడమా? ఇదేదో అవార్డు పొందిన ఏ ఆధునిక భారత నవలలోనో ఉన్న సన్నివేశం అనుకునేరు. కాదు కాదు. ఇది అచ్చంగా ఆ వ్యాసుడు రాసిన మహాభారతంలో ఉన్న విషయమే. మరో విషయం చెపితే మరీ ఆశ్చర్యపోతారు. స్వయంగా శ్రీకృష్ణుడి ప్రోద్బలంతోనే అర్జునుడా పని చేస్తాడు! సరే, ఇక ఊరించింది చాలు, అసలు కథలోకి ప్రవేశిద్దాం.

అవి కురుక్షేత్ర సంగ్రామం మహా జోరుగా సాగుతున్న రోజులు. అప్పటికే పదహార్రోజుల యుద్ధం అయిపోయింది. భీష్మ ద్రోణులు నేల కూలారు. కర్ణుడు కౌరవ పక్షాన సర్వసేనాధిపతి అయ్యాడు. ఈ కర్ణుడు వికెట్టొక్కటి తీసేస్తే ఆట గెలిచినట్టేనని అనుకుంటున్నారు పాండవులు. కర్ణుడు సర్వసేనాధిపతిగా ఒక రోజు యుద్ధం అప్పుడే అయిపోయింది. ఆ రోజు కర్ణార్జునులు భీకరంగా యుద్ధంచేసుకున్నారు. అర్జునుడి ప్రతాపానికి కౌరవ సేనలు చెల్లాచెదరైపోయాయి. ఆ రోజు యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు విచారగ్రస్తుడయ్యాడు. అప్పుడు కర్ణుడతనికి ధైర్యం చెపుతూ, "రేపు చూడు నేనెలా విజృంభిస్తానో! నీకు శత్రువులంటూ లేకుండా చేస్తాను. ఆ అర్జునుణ్ణి సంహరిస్తాను." అని బీరాలు పలికుతాడు. శల్య సారథ్యంలో ఆ మరునాడు రెట్టించిన ఉత్సాహంతో కదనరంగానికి వెళతాడు కర్ణుడు. మళ్ళీ సంగ్రామం భీకరంగా సాగుతూ ఉంటుంది. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తూ కర్ణుడికి దూరంగా వెళతాడు. ధర్మరాజు కర్ణుడూ యుద్ధానికి తలపడతారు. వేసవికాలం మిట్టమధ్యాహ్నం మండే సూర్యుడిలాగా (ప్రస్తుతం ఆ ప్రతాపం ఎలా ఉంటుందో మనందరికీ అనుభవమే కదా! వేడి 43 డిగ్రీలకి పెరిగిపోతోంది!) పరాక్రమిస్తాడు కర్ణుడు. అప్పుడు ధర్మరాజు కర్ణుడి చేతిలో బాగా తన్నులు తిని యుద్ధభూమినుంచి పలాయనం చిత్తగిస్తాడు.

అప్పుడు జరుగుతుందొక విచిత్రమైన నాటకీయ సంఘటన! అలాంటి సందర్భంలో ఇలాంటి సన్నివేశాన్ని ఎవ్వరం ఊహించలేం! అప్పటికే రెండు సార్లు కర్ణుడి చేతిలో తన్నులు తిని పరాభవింప బడ్డాడేమో, శిబిరంలోకి వెళ్ళి, ధర్మరాజు తనలో తానే బాగా కుమిలిపోతూ ఉంటాడు. ఈ లోపున యుద్ధభూమిలో అర్జునుడు ధర్మరాజుని వెతుకుతూ కర్ణుడున్న దిశగా వస్తాడు. అక్కడ భీముడొక్కడే యుద్ధం చేస్తూ ఉంటాడు. కర్ణుడి ఉగ్రమూర్తిని చూసి అర్జునుడు విస్తుపోతాడు. "బ్రతికి యుండిన శుభములు వడయవచ్చు", ముందు రథాన్నిక్కడనుంచి పోనియ్యమంటాడు కృష్ణుడితో. అర్జునుడు అలసినట్టున్నాడు కాస్త బడలిక తీర్చుకోవడం మంచిదే అనుకుంటాడు కృష్ణుడు (ఈ అర్జునుడిలా మాట్లాడతాడేమిటి? వీడికి కాస్త చికిత్స చెయ్యాలి అని బహుశా లోపల అనుకుని ఉంటాడు). "సరే, ధర్మరాజు ఎలా ఉన్నాడో ఒకసారి పరామర్శించి వచ్చి అప్పుడీ కర్ణుడి సంగతి చూద్దాం", అని రథాన్ని ధర్మరాజు శిబిరం వైపు పోనిస్తాడు. కృష్ణార్జునులు రణరంగం నుంచి రావడాన్ని చూసి, కర్ణుణ్ణి చంపి ఆ శుభవార్త తనకి చెప్పడానికి వచ్చేరనుకుంటాడు ధర్మరాజు. పరమానందం పొందుతాడు. "ఆహా! అంతమంది చూస్తూ ఉండగా ఈ రోజు కర్ణుడు నన్ను అవమానించాడు. దానికి తగిన ప్రతీకారం చెల్లించి వచ్చారన్నమాట. సెహభాష్!" అని మెచ్చుకుంటాడు.

అరుదిది! నీవు నొవ్వక మహాబలు గర్ణు వధించితాతడ
క్కురుపతి సంతసింప - నరుగూల్చెద సంగరభూమి నేన యొ
క్కరుడను వీక దాకి - యను గర్వపు మాట సనంగనీక, నే
టి రణములోన నిట్లు ప్రకటింతె భవద్భుజ వీర్యశౌర్యముల్

"నువ్వేమాత్రం కష్టం లేకుండా ఆ మహాబలుడైన కర్ణుడిని సంహరించావా! ఆ దుర్యోధనుడి సంతోషం కోసం, 'నేనొక్కడినే ఆ అర్జునుణ్ణి చంపుతానూ అని విర్రవీగిన వాడి మాటలని వమ్ము చేస్తూ, ఇవ్వాళ యుద్ధంలో నీ భుజబలాన్ని, శౌర్యాన్ని చూపించి వచ్చావా!" అని అర్జునుణ్ణి పొగుడుతాడు.

కృష్ణార్జునులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇలా ధర్మరాజు అమితోత్సాహంతో మాట్లాడెస్తూ ఉంటే, మెల్లిగా అసలు సంగతి చెప్తాడు అర్జునుడు. "అన్నా! మరేమో, అశ్వత్థామ నా మీద యుద్ధానికి వచ్చాడు. చాలా ఘోరంగా యుద్ధం చేసాడు. మొత్తానికి ఎలాగైతేనేం అతని గర్వాన్ని అణచి అతన్ని తిప్పికొట్టాను. ఆ తర్వాత నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. అక్కడ భీముడొక్కడే యుద్ధం చేస్తూ కనిపించాడు. నువ్వేమో దెబ్బలు తగిలి శిబిరానికి వచ్చావని చెప్పారు. నువ్వెలా ఉన్నావో చూడ్డానికి వచ్చాము. నువ్వు క్షేమంగానే ఉన్నావుగా. ఇప్పుడు వెళ్ళి ఆ కర్ణుడి పనిపడతాను చూడు!" అని అంటాడు అర్జునుడు.

ఇంకేముంది! కర్ణుడు బతికే ఉన్నాడన్న మాట వినగానే ధర్మరాజు ఉత్సాహమంతా నీరుగారిపోతుంది. పైగా విపరీతమైన కోపం వస్తుంది. రాదూ మరి! తను ఓడిపోయి వచ్చానని పరామర్శించడానికి వస్తాడా అర్జునుడు! పైగా తనని అవమానించిన కర్ణుడిని చంపకుండా వస్తాడా! ఉక్రోషం పొంగుకొస్తుంది. పట్టరాని కోపంతో అర్జునుణ్ణి చెడామడా తిడతాడు. తిక్కన కలంలో ఆ ఘాటైన అచ్చ తెలుగు తిట్లు మచ్చుకి మీరూ రుచి చూడండి. :-)

విను కర్ణున కేనోడితి
నన నేటికి నీవు నోడి తనిలజ మాద్రీ
తనయులు మున్నే యోడిరి
మనతో గూడంగ గంసమర్దను డోడెన్

నేను కర్ణుడికి ఓడిపోయానని అనుకోనక్కరలేదు. నేనొక్కడినే కాదు, ఇప్పుడు నువ్వూ ఓడిపోయావు. భీముడు, నకులసహదేవులు ఇంతకు ముందే ఓడిపోయారు. ఆఖరికి మనతో కలిసి ఉండడం వల్ల ఈ కృష్ణుడు కూడా ఓడిపోయాడు!

కావున మనమిక ననికిన్
బోవం బనిలేదు, విపినభూమికి జని య
చ్చో వెఱపు దక్కి తపసుల
మై విచ్చలవిడి జరింత మందఱము దగన్

"అంచేతనింక మనం మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళక్కరలేదు. అందరం కట్టకట్టుకొని మళ్ళీ అడవులకు పోదాం. అక్కడ ఎలాంటి భయమూ లేకుండా తపస్సుచేసుకుంటూ మన ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. అదే మనకి తగిన పని", అని అంటాడు. "లేదా గొప్పలకిపోకుండా, వినయంతో వెళ్ళి ఆ దుర్యోధనుడికి సేవకులమై పడి ఉందాం", అని కూడా అంటాడు. అంతేనా! ఇంకా వినండి:

అని వధించెద గర్ణు నేనని ప్రతిజ్ఞ
సేసి, యిటు దెచ్చి నన్నిట్లు సేసి, తింత
కెట్లు నేర్చితి? పొడవుగా నెత్తి నేల
వైవ నోర్చితి నను బగవారి నడుమ

కర్ణుడిని చంపుతానని పెద్ద పోటుగాడిలా ప్రతిజ్ఞ చేసావు. తీరా చూస్తే ఇప్పుడిలా కొంపముంచావు. నన్ను బాగా పైకెత్తేసి చివరికి నేల మీద గభీలున పడెయ్యడమే నీకిష్టంలాగా ఉంది, అదీ శత్రువుల మధ్యలో!

దేవతలిచ్చిన తేరు నశ్వంబులు
గపికేతనంబును గలవు, దైవి
కంబు చేనున్నది గాండీవమను దాటి
యంత విల్లది గాక, హరి రథంబు
గడపెడు నటె! పరికర మిట్టిదై యుండ
నెట్లు కర్ణునికోడి యిట్టు వలియ
బాఱతెంచితి వీవు? భండనంబున గర్ణు
గని పాఱు దని సుయోధనుడు సెప్పె

నది నిజంబుగ గొనక బేలైతి; నాదు
బేలతనమున గాదె పాంచాల మత్స్య
పాడ్యులాదిగ గలిగిన బంధుమిత్త్ర
జనుల దెగటాఱి రప్రయోజనముగాగ

దేవతలిచ్చిన రథమూ, గుఱ్ఱాలూ ఉన్నాయి. సాక్షాత్తూ హనుమంతుడు నీ జెండాపై ఉన్నాడు. దైవసహాయంతో లభించిన గాండీవం, తాటిచెట్టంత విల్లది, చేతిలో ఉంది! నారాయణుడే నీ రథ సారథి! ఇన్నీ ఉండి కర్ణుడిని ఎదుర్కోలేక ఇలా పారిపోయి వచ్చావు నువ్వు. యుద్ధంలో కర్ణుడిని చూస్తే అర్జునుడు పరిగెట్టి పారిపోతాడని దుర్యోధనుడు ముందే చెప్పాడు. వాడి మాట వినక నేను బేలనయ్యాను. ఇలా నా బుద్ధిలేనితనం కారణంగా పాపం అనవసరంగా పాంచాలురు, మత్స్యులు, పాండ్యులు మొదలైన బంధు మిత్త్రులందరూ యుద్ధానికి వచ్చి నాశనమయ్యారు!

ఇంకా ఎంతమాటన్నాడో తెలుసా?

గొంతి కడుపునందు గొడుకుచూలై నీవు
దోపకుండ వైతి, తోచినట్టి
పిండ మెడలియైన బిదప దిగంబడ
దయ్యె; నింత వుట్ట దట్టులైన!

"కుంతి కడుపులో నువ్వు కొడుకులా కనిపించి కూడా కాకుండా పోయావే (అంటే నువ్వు మగాడివి కాకుండా పోయావే అనీ)! పిండంగా ఉన్నప్పుడే జారిపోయుంటే ఇంత జరిగేది కాదు కదా!" అన్నాడు. ఎంతలేసి మాటలన్నాడో చూసారా?!

"ధర్మరాజుని చెడతిట్టిన అర్జునుడు" అని కదా శీర్షిక? మరి ధర్మరాజు అర్జునుడిని చెడతిట్టడం గురించి చెపుతున్నానేమిటని అలోచిస్తున్నారా? అగండాగండి. ముందుంది అసలు కథ!

ధర్మరాజు చివరగా మరోమాట కూడా అంటాడు.

హరి గలుగంగ నేటికి? భయంబున వచ్చితి; నీదు గాండివం
బెరువుగ నిచ్చి, నీవు నొగలెక్కి హరిన్ రథి జేయ గన్న ని
ష్ఠురభుజవిక్రమోగ్రుడగు సూతతనూభవు దత్సహాయులన్
బొరిగొనడే సుయోధనుని పోడిమి దూలగ నొక్క మాత్రలోన్

"అక్కడ కృష్ణుడు ఉన్నా కూడా భయంతో వచ్చేసావే! నీ గాండీవాన్ని కృష్ణుడికి ఎరువుగా ఇచ్చి, అతన్ని రథమెక్కించి, నువ్వు రథాన్ని తోలవలసింది కదా. అప్పుడా దుర్యోధనుడి పొగరు అణిగేటట్టు కర్ణుడిని వాడి సేనని ఒక్క చిటికలో చంపేసేవాడు!" అని అంటాడు.

అది వినగానే చయ్యని తన కత్తి తీస్తాడు అర్జునుడు. "ఇదేమిటి. ఇక్కడ కౌరవులు లేరే. మనం ధర్మరాజు కుశలాన్ని తెలుసుకోడానికి వచ్చాం. అతను బాగానే ఉన్నాడు. అంచేత సంతోషించాలి కాని ఇప్పుడు కోప్పడాల్సిన సమయం కాదు కదా! ఎందుకు కత్తి తీసేవ్?" అని అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, "నా గాండీవాన్ని మరొకడికి ఇమ్మని ఎవడైనా అంటే కనక, వాడి తల తెగనరుకుతానని నేను ప్రతిజ్ఞ చేసాను. ఇప్పుడీ ధర్మరాజు నన్నంత మాటన్నాడు. కాబట్టి ఇతన్ని చంపేస్తాను" అంటాడు. అది విని కృష్ణుడు, "పోపో! నువ్వెవడివయ్యా బాబూ! నీయిల్లు బంగారంగానూ! నువ్వెప్పుడో ఏదో ప్రతిజ్ఞ చేసానని చెప్పి, నీ అన్న, సాక్షాత్తు ధర్మదేవత అయిన ధర్మరాజుని చంపేస్తానంటావా? నీకు మతీసుతీ తప్పిందా ఏమిటి? సరే, నీకు సత్యమంటే ఏమిటో, ధర్మమంటే ఏమిటో పూర్తిగా తెలిసినట్టు లేదు. చెప్తాను విను" అని ఒక కథ చెప్తాడు.

పూర్వం కౌశికుడనే ఒక ముని ఒక గ్రామానికి పక్కనే ఆశ్రమం ఏర్పరుచుకొని తపస్సు చేసుకొనేవాడు. అతను సత్యవ్రతాన్ని ఆచరిస్తూ, ఎప్పుడూ సత్యమే పలుకుతాడనే ప్రసిద్ధి పొందాడు. ఒకనాడు పక్కనున్న గ్రామంలో దొంగలు పడ్డారు. వాళ్ళనుండి కొంతమంది జనం తప్పించుకు పారిపోయి, ఆ కౌశికుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి పక్కనున్న పొదల్లో దాక్కుంటారు. వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన దొంగలు కౌశికుణ్ణి ఊరి జనం ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు. తనకి అసత్య దోషం అంటకూడదని, వాళ్ళు పొదల్లో దాక్కున్నారన్న విషయం దొంగలకి చెప్పేస్తాడా ముని. ఆ దొంగలా జనాలని చంపేసి, వాళ్ళ ధనాన్ని దోచుకుని చక్కాపోతారు. అప్పుడు వాళ్ళందరినీ చంపిన పాపానికి ఆ ముని నరకానికి వెళతాడు.

అదీ కథ. అంచేత హింసని కలిగించే నిజం సత్యం అవ్వదు. ఇప్పుడు చంపకూడని నీ అన్నని చంపి, హింస చేస్తే అది సత్యవాక్పరిపాలన అవ్వదు అని కృష్ణుడు వివరిస్తాడు. అప్పుడు అర్జునుడు సంతోషించి, "పాపం చెయ్యకుండా నన్ను రక్షించావు కృష్ణా. అయినా నా ప్రతిజ్ఞ వృథా పోకుండా, అన్నగారికి ఏమీ జరగకుండా ఏమైనా మార్గముంటే చెప్పు" అంటాడు. అప్పుడొక ఉపాయం చెపుతాడు కృష్ణుడు. "పెద్దవాళ్ళని, గురువులని దూషించడమంటే వాళ్ళని చంపినంత పని. అంచేత నువ్వు ధర్మరాజుని దూషించి, ఆ తర్వాత అతని కాళ్ళపైబడి క్షమించమను సరిపోతుంది. నీ ప్రతిజ్ఞ తీరినట్టైపోతుంది". ఇదీ కృష్ణుడు చెప్పిన ఉపాయం! బాగుంది కదూ :-)

ఇక చూస్కోండి! అర్జునుడు ధర్మరాజుని చెడ తిట్టడం మొదలుపెడతాడు. ఈ తిట్టడం చూస్తే, ఏదో మొహమాటానికి పైపై తిట్టడం అనిపించదు. మహ ధాటిగా, ఎప్పటినుంచో మనసులో రగులుతున్న కోపాన్ని వెళ్ళగక్కినట్టుగా ఉంటుంది. గట్టిగా తిడితే కాని తన ప్రతిజ్ఞ నెరవేరినట్టు కాదనుకున్నాడో ఏమో అర్జునుడు!

కన దస్త్రంబుల నుజ్జ్వలోద్భట గదాఘాతంబులం గాల గే
లను విద్విట్చతురంగ సంఘముల గూలం, గేలి సల్పంగ జా
లిన యా భీముడు వల్కుగాక నను; దోర్లీలాసమగ్రుండవై
యనిలో నిల్వగ లేని నీ విటుల కీడాడంగ నర్హుండవే?

ప్రకాశించే అస్త్రశస్త్రాల తోనూ, భీకరమైన గదాదండంతోనూ శత్రువుల చతురంగ బలాలనీ చీల్చి చెండాడేటట్టు యుద్ధం చెయ్యగలిగిన ఆ భీముడు నన్నేమైనా అన్నాడంటే అర్థముంది, జబ్బసత్తువలేక యుద్ధరంగంనుంచి పారిపోయి వచ్చిన నీకు నన్ను ఇంతలేసి మాటలనడానికి అర్హత ఉందా?

నన్నెఱిగి యెఱిగి యిట్లన
జన్నే? నీ జిహ్వ పెక్కు శకలము లై పో
కున్నది యేలొకొ? రణమున
నెన్నడు నీవేమి సేసి తింత యనుటకున్?

నా గుఱించి తెలిసి తెలిసీ ఇన్నిన్ని మాటలంటావా? ఇంతలేసి మాటలన్న తర్వాత కూడా నీ నాలుక ముక్కలై పోలేదేమిటో! ఎప్పుడైనా యుద్ధంలో నువ్వేమైనా చేసావా, నన్నింత మాటలనడానికి?

నకులుడు సహదేవుండును
బ్రకట భుజాస్ఫురణమున నరాతిబలము నే
లకు గోలకు దెత్తురు; నో
రికి వచ్చినయట్టు లాడిరే యిబ్భంగిన్?

నకులుడూ సహదేవుడూ కూడా తమ భుజబలంతో శత్రువులని మట్టికరిపిస్తారే! వాళ్ళైనా ఎప్పుడూ నోటికి వచ్చినట్టిలా మాట్లాడారా?

నీవు జూదంబాడగా వైరబంధంబు
కౌరవకోటితో గలిగె; మనకు
రాజ్య నాశంబు నరణ్యవాసంబును
దాస్య దైన్యంబు నత్యంత దుఃఖ
ములు దెచ్చికొంటి; సిగ్గొలయదు నీ మనం
బున నించుకేనియు; ననికి జాల
కున్న వానికి దాల్మి యొప్పగు గాక ప్ర
ల్లదనములు పలికిన లాఘవంబు

సెందు? మున్నేమి సేసిన జేసి తింక
నైన దుర్బుద్ధితనములు మాని తగిన
పౌరుషము లేము సేయగ నూరకుండు;
మిడుము వడువారు సైతురే యివ్విధంబు?

నువ్వు జూదమాడ్డం వల్లనే మనకీ దురవస్థ, కౌరవులతో యుద్ధమూ, రాజ్య నాశనము, అరణ్యవాసము, అజ్ఞాత వాసంలో దాస్య వృత్తి ఇవన్నీ వచ్చాయి. అయినా ఇంకా నీకేమాత్రం సిగ్గు లజ్జా లేకుండా పోయింది! యుద్ధం చెయ్య లేకపొతే కనీసం సహనమైనా ఉండొద్దూ? ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం దేనికి? చేసినదేదో చేసావ్. ఇకనైనా నోరుమూసుకొని ఉండు. వచ్చిన కష్టాలతో పాటు నువ్విలా నోరు పారేసుకున్నావంటే సహించి ఊరుకోలేం!

చూసారా ఎంతగా ధర్మరాజుని చెడతిట్టాడో అర్జునుడు! ఎంత గట్టి వార్ణింగిచ్చాడో! నిజంగా అర్జునుడు ధర్మరాజుతో ఇలాంటి మాటలు మాట్లాడాడని ఊహించనుకుడా లేం కదా! ఏం చేస్తాడు తప్పనిసరై తిట్టాడు, కృష్ణుడు తిట్టించాడు. :-) సరే మొత్తం ఇలా తిట్టడమంతా అయిపోయాక, మళ్ళీ తన ఒరలోంచి కత్తి తీస్తాడు. "మళ్ళీ ఇదేంటి" అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, "నేనింతలేసి మాటలు ధర్మరాజుని అన్నందుకు గాను నాకు మరణమే ప్రాయశ్చిత్తం. నా తల నరుక్కుంటాను" అంటాడు! అప్పుడు కృష్ణుడేం చేస్తాడు? "ఓరినీ! ఇంత ఉపాయం చెప్పిందీ నువ్వు చావడానికా! చాల్చాల్లే ఊరుకో. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయి. నిన్ను నువ్వు చంపుకోవడమే కదా నీకు కావలసింది. నిన్ను నువ్వు పొగుడుకో. అదే ఆత్మహత్యతో సమానం." అని మరో ఉపాయం చెప్తాడు కృష్ణుడు. సరే నువ్వు చెప్పినట్లే చేస్తానని, తన గొప్పతనాన్ని తాను పొగుడుకుంటాడు అర్జునుడు! అంతా అయ్యాక ధర్మరాజు కాళ్ళ మీద పడి, "తప్పక నిన్ను అన్నేసి మాటలన్నాను. తూచ్! అవేం పట్టించుకోకు. ఇప్పుడు నిజం చెప్తాను విను. నువ్వు నా ప్రాణం కన్నా కూడా నాకెక్కువ. ఇప్పుడే నాకు అనుజ్ఞ ఇవ్వు. వెళ్ళి ఆ కర్ణుడిని చంపి వస్తాను" అని వేడుకుంటాడు అర్జునుడు.

హమ్మయ్యా అయ్యిందిరా సీను అనుకొని కృష్ణుడు ఊపిరి పీల్చుకునే లోపు, మరో ఉపద్రవం వచ్చిపడుతుంది! తనని అన్నేసి మాటలన్నాక, తర్వాత తూచ్ అంటే మాత్రం, ధర్మరాజు మనసు ముక్కలై పోయి ఉండదూ! "నా వల్ల మీకు చాలా కష్టాలు వచ్చాయి. ఈ వంశానికి కీడు తెచ్చిన నాలాంటి పాపాత్ముడి తల నఱికి వెయ్యడమే సరైన పని. నువ్వేదో దయ దలిచి ఆ పని చెయ్యలేదు. నేనిప్పుడే అడవులకి పోతాను. మీరందరూ సుఖంగా ఉండండి. పిఱికివాణ్ణి, బలహీనుణ్ణి రాజుగా చెయ్యడం తగునా? ఆ భీముడికే పట్టం కట్టెయ్యండి", అని ధర్మరాజు తన పక్క దిగి అడవులకి ప్రయాణం కడతాడు! ఓరినాయనోయ్! ఇదెక్కడి గొడవరా అనుకొని ఉంటాడు కృష్ణుడు. ఏం చేస్తాడు. వెళ్ళి తనే స్వయంగా ధర్మరాజు కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. "ధర్మరాజా, నేను చెపితేనే అర్జునుడు నిన్నలా అన్నాడు తప్పిస్తే నిజంగా కాదు. నీ కాళ్ళు పట్టుకొని శరణంటున్నానయ్యా, మా ఇద్దరి తప్పూ మన్నించు. నీకు అమితానందం కలిగేటట్టు ఇప్పుడే వెళ్ళి ఆ కర్ణుడిని చంపివస్తాము." అని ప్రార్థిస్తాడు. స్వయంగా పరమాత్ముడైన ఆ కృష్ణుడు ధర్మరాజు కాళ్ళ మీద పడి ఇలా వేడుకుంటాడు! అప్పటికి ధర్మరాజు మనసు శాంతిస్తుంది. ఇవాళేదో నాకు వికారం పుట్టి ఇన్ని మాటలన్నాను, క్షమించమని తిరిగి వేడుకుంటాడు ధర్మరాజు. అప్పుడతని అనుజ్ఞతో కర్ణ సంహారానికి బయలుదేరుతారు కృష్ణార్జునులు.

అదండీ కథ. కర్ణుడిని చంపే ముందు ఇంత తతంగం జరిగింది! అలాంటి సందర్భంలో అసలిలాంటి సన్నివేశం పెట్టడంలో వ్యాసుని ఆంతర్యం ఏమిటి? ఇందులోంచి మనం తెలుసుకోవలసింది ఏమిటి? ఈ ప్రశ్నలకి ఎవరికివారు, తమ సంస్కారాన్ని బట్టి సమాధానాలు ఆలోచించుకోవలసిందే! :-)

పూర్తిగా చదవండి...