తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, September 11, 2011

ముచ్చటయిన మూడు కృష్ణ వర్ణనలు

భాగవతంలో కృష్ణుని వర్ణనలకి కొదవేముంది! అందులోనూ పోతన తెలుగుపోత, మధురాతిమధురం. ఆ వర్ణనలు చేస్తున్నప్పుడా భక్తకవి ఆ మాధవునితో తాదాత్మ్యాన్ని పొందే ఉంటాడనిపిస్తుంది! అలాంటి భాగవతంలో నాకు బాగా నచ్చిన మూడు శ్రీకృష్ణ వర్ణనలని ఎంచమంటే, నేనెంచుకొనే మూడు పద్యాల గురించి ఇప్పుడు చెపుతాను.

ఒకటి:

కడుపున దిండుగా గట్టిన వలువలో
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాఱి రానీక డా చంక నిఱికి
మీగడపెరుగుతో మేళవించిన చల్ది
ముద్ద డాపలి చేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు
వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగడీల నడుమ జక్కగ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె

ఈ పద్యాన్ని చదివితే అనిపిస్తుంది, పెద్దయ్యాక సంగతి చెప్పలేము కానీ చిన్ననాటి యీ బాలకృష్ణుడు మాత్రం పదహారణాల తెలుగబ్బాయే అని. ఇలాంటి అచ్చమైన తెలుగు కైతలని అచ్చులు పోసిన పోతనకి తెలుగుజాతి ఎప్పటికీ ఋణపడిపోయింది! చిన్నారి కిట్టయ్య తన చెలికాళ్ళతో కలిసి ఆడుతూపాడుతూ చల్ది తినే దృశ్యాన్ని మనకి కళ్ళకి కట్టిస్తున్నాడు పోతన. ఎంత చూడముచ్చటయిన దృశ్యమది! సర్వయాగాలకూ భోక్త అయిన ఆ పరమాత్ముడేనా ఇలా చిన్నమగవాని రూపంలో చల్ది కుడుస్తున్నదీ అని దేవతలందరూ ఆశ్చర్యపోయారట ఆ దృశ్యాన్ని చూసి.

ఆవుల్ని తోలుకొని ఊరుబయట వనంలోకి గోపాలకులందరూ వచ్చారు. భోజనం వేళ అయ్యేసరికి తెచ్చుకున్న చల్ది తినాలని అందరూ కూర్చున్నారు. కృష్ణుడి చేతిలో ఎప్పుడూ మురళి ఉంటుంది కదా! మరి అన్నం తినేదెలా? ఆ వంశనాళాన్ని (అంటే వెదురు గొట్టం!) తన నడుము చుట్టూ చుట్టగా కట్టుకున్న తుండుగుడ్డలో జొనిపాడు. అంతేనా - ఆవులని అదిలించేందుకు చిన్న బెత్తము (వేత్రదండం), కొమ్ముబూరా కూడా ఉన్నాయి చేతిలో. వాటినేమో జాఱిపోకుండా ఎడం చంకలో ఇఱికించాడు. అదే చేతిలో చలిది ముద్దని అదిమి పట్టుకున్నాడు. మాములు చల్దన్నమా అది! చక్కని చిక్కని మీగడపెరుగుతో కలిపినది. మరి ఆ పెరుగన్నంలో నంచుకోడానికి ఏమిటున్నాయి? చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలున్నాయి. అంటే ఇంకాస్త కావాలి, ఇంకాస్త కావాలని బతిమాలో పేచీపెట్టో తెచ్చుకున్న ఊరగాయ అన్నమాట! అది వ్రేళ్ళ సందుల్లో ఇఱికించాడు. హాయిగా స్నేహితుల మధ్య (సంగిడీలు - స్నేహితులకి చక్కని తెలుగుపదం) కూర్చుని, ఊసులాడుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా చల్ది ఆరగిస్తున్నాడు చిన్ని కన్నయ్య. చేతిలో ఉన్న వేణువునీ బెత్తాన్నీ కొమ్ముబూరనీ పక్కన పెట్టవచ్చు కదా! అలా తన దగ్గరే అట్టేపెట్టుకోడంలో బాలకృష్ణుని పసితనం మన కళ్ళకిగడుతుంది. అదీ పోతన వర్ణనలోని అందం! మీగడపెరుగుతో మేళవించిన చల్ది, ఊరగాయలూ తెలుగుదనపు ఘుమఘుమలు. వాటిని మీగడతరకల్లాంటి తెలుగుపదాలతో మేళవించి తెలుగు చిన్నారి కిట్టమూర్తిని మన కళ్ళముందుంచాడు పోతన.

ఈ పద్యం వెనక తమాషా అయిన కథ ఒకటి ఉంది. కృష్ణుడు గోపాలబాలలతో అడవికి వచ్చినప్పుడు అఘాసురుడనే రాక్షసుడు పెద్ద పాము రూపంలో వచ్చి నోరు తెరచి పడుకుంటాడు. తోవలో అడ్డంగా ఉన్నది పామేమో అని అనుమానించినా, మన వెనక కృష్ణుడుండగా మనకి భయమేమిటని పిల్లలంతా ఆ పామునోట్లోకి వెళ్ళిపోతారు. అయితే ఆ పాము నోట్లోని విషజ్వాలలకి అందరూ చనిపోతారు. తనమీద అంతటి గుడ్డి నమ్మకాన్ని పెట్టుకున్న ఆ గోపాలుర మీద జాలిపడి కృష్ణుడు ఆ పాము గొంతు చీల్చి చంపి, పిల్లలని తిరిగి బతికిస్తాడు. ఇదంతా చూసిన బ్రహ్మ ఆశ్చర్యపోతాడు. అంతటి బ్రహ్మనీ మాయ ఆవరిస్తుంది. అతను కృష్ణుడిని మామూలు బాలుడే అనుకొని, ఈ బాలుడికి ప్రాణాలిచ్చే శక్తి ఎక్కడిదని ఆశ్చర్యపోతాడు. కృష్ణుడిని మరింత పరీక్షించాలని చెప్పి, ఇలా హాయిగా కూర్చుని చల్దులు తింటున్న సమయంలో ఆవులన్నిటినీ మాయం చేసేస్తాడు. ఆవులని వెతుక్కుంటూ కృష్ణుడు వెళ్ళి, కనపడక తిరిగివచ్చి చూస్తే గోపబాలురందరూ కనిపించకుండా పోతారు. బ్రహ్మ అందరినీ ఒక గుహలో దాచేస్తాడు. సంగతి తెలుసుకున్న కృష్ణుడు తనే ఆ సమస్త గోవులూ గోపబాలుర రూపాలని ధరించి అందరి ఇళ్ళకీ వెళ్ళిపోతాడు. ఇలా ఏడాది గడిచిపోతుంది. బ్రహ్మ కాలమానంలో అది ఒక క్షణం. బ్రహ్మకి మతిపోతుంది! ఏమిటీ మాయ? సృష్టి చేసే బ్రహ్మ నేనొక్కడినే కదా! మరి అన్ని గోవలనీ, అంతమంది పిల్లలనీ ఎవరు సృష్టించారు? ఇలా తికమక పడుతూ ఉంటే కృష్ణుని విశ్వరూప సందర్శనం అవుతుంది. మాయ తొలగిపోతుంది. ఈ బ్రహ్మ పదవి వదిలేసి, హాయిగా తనూ ఓ గోపాలబాలుడై కృష్ణుడితో కలిసి అలా చల్ది కుడిస్తే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటాడు.
అదీ కథ!

ఇక రెండో పద్యం:

కటి చేలంబు బిగించి, పింఛమున జక్కం గొప్పు బంధించి, దో
స్తట సంస్ఫాలన మాచరించి, చరణద్వంద్వంబు గీలించి, త
త్కుటశాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్

ఇది చాలా మందికి తెలిసిన పద్యమే. కృష్ణుడు కాళీయమర్దనానికి సంరంభంతో ఉరుకుతున్న సందర్భం. పైన చెప్పిన పద్యం ఒక స్థిరచిత్రం (still photograph) అయితే, ఇది చలనచిత్రం! అందులో కృష్ణుని పసితనం కనిపిస్తే ఇందులో గోపకిశోరుని పొంగు మన కళ్ళముందు కదలాడుతుంది.

ఉత్తరీయాన్ని నడుముకి బిగించాడు. జాఱకుండా పింఛాన్ని చక్కగా కొప్పున బంధించాడు. జబ్బలు రెండూ చఱిచాడు. రెండు కాళ్ళనీ దగ్గరగా తెచ్చాడు. తెచ్చి, ఆ చెట్టుకొమ్మపైనుండి గభాలున చెఱువులోకి దూకాడు. ఎవరు? సింహకిశోరం లాంటి గోపాలుడు. "లాంటి" ఏవిటి, అప్పుడతడు సింహకిశోరమే! అంతెత్తునుండి దూకేసరికి, గుభగుభమన్న శబ్దం నలుదిక్కులా నిండిపోయిందట!

పద్య నిర్మాణంలోని సొగసు బిగువు వల్ల కృష్ణుడిలో ఉఱకలు వేస్తున్న అదే ఉత్సాహం మనలోనూ కలగడం లేదూ! అదీ కవిత్వమంటే!

ముచ్చటగా మూడో పద్యం ఇదిగో:

త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప, ప్రాభాత నీ
రజ బంధు ప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్‌

ఈ పద్యం ఎందుకంత ఇష్టమంటే చెప్పడం కష్టం! మొదటి పద్యంలో లాగా ఒక రూపాన్ని విస్తృతంగా వర్ణించే పద్యం కాదిది. కదిలే చిత్రాన్ని అక్షరాలలో బంధించే పద్యమూ కాదు. ఈ పద్యంలో కనిపించే కృష్ణుడు అపురూప ధీర సౌందర్య విలసితుడు. ఇందులో ఏదో తెలియని అలౌకికత ఉంది. ఆధ్యాత్మికావేశముంది. అది త్రిజగ్నమోహనమైన నీలకాంతి. నీలమంటే నలుపు. నలుపుకి కాంతి ఎక్కడిది? అదే మాయ. ముజ్జగాలనీ మోహింప జేసే మాయ. నల్లని మేఘముపై పడిన ఉదయసూర్యుని అరుణారుణకిరణంలా పైన ఉత్తరీయం ప్రకాశిస్తోంది. ఆ మూర్తిలో ఒక ఉత్సాహముంది. ఆ ఉత్సాహమా ముఖారవిందముపై కదలాడే నీలి ముంగురులలో ద్యోతకమవుతోంది. మా విజయునికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహమది.
ఆహా! అలాంటి వన్నెలాడు మోహనకృష్ణుని ఆ రూపం మదిలో ఆవేశించిన భీష్ముడు ఎంతటి ధన్యుడు! దాన్ని చూసి మనకి చూపించిన పోతన మరెంత ధన్యుడు!

14 comments:

  1. ఆహా.. "భువనమోహన! నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల?" అని పోతన పలుకుల్లోనే మనం వాపోతామేమోనని, ఎంత చక్కటి వర్ణనలో కృష్ణ సౌందర్యాన్ని కళ్ళ కట్టించారు పోతన గారు!! పంచుకున్న మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ధన్యవాదాలండీ.. మీరు చెప్పిన పెరుగన్నం +మాగాయ అంత రుచికరంగానూ ఉన్నాయి .. మీరు ఎన్నుకున్న పద్యాలు + మీ పాఠం.

    ReplyDelete
  3. పంచుకున్నందుకు ధన్యవాదములు ...మొదటి పద్యం చిన్నప్పుడు చల్డులారగించుట అని తెలుగు పాఠం లో చదివినట్లు గుర్తు ..

    ReplyDelete
  4. chala bavundi..........

    http/nashodhana.blogspot.com

    ReplyDelete
  5. మూడు పద్యాలూ ముచ్చటగా ముద్దొచ్చేలా ఉన్నాయి. మీ వ్యాఖ్యానం కూడా..

    ReplyDelete
  6. గోదావరి కాలవ మీద వంగి ఉండే కొబ్బరి చెట్లనెఱుగుదును గనుక తత్కుటశాఖాగ్రము మీదనుండి గోపాలసింహంబు యుఱికెన్ అంటే ఆశ్చర్యమనిపించలేదు గానీ కటి చేలంబు పద్యం చదువుకున్నప్పుడు నాకెప్పుడూ సందేహం వచ్చేది. కాళిందీ మడుగు దగ్గర వీచే విషపు గాలులకే ఏప్రాణీ బ్రతకలేని పరిస్థితి ఏర్పడితే వృక్షాలు మాత్రం ఎలా మిగిలి ఉన్నాయా అని. కదంబ వృక్షం మాత్రం ఎలా బ్రతికి ఉందా, కృష్ణుడికి కూడా ఆ విషపు గాలి/ నీరు ఎందుకు ఏమీ చెయ్యలేదా అని.

    మొన్నామధ్య చాగంటివారి ఉపన్యాసం వింటూంటే తెలిసింది అమృతాన్ని తీసుకెళ్తూ గరుడుడు కదంబ వృక్షం పై ఒక సారి ఆగి సేదదీర్చుకుని వెళ్ళాడని. అందుకనే ఆ చెట్టుకు అంతటి శక్తి ఉన్నదనీ, కాళింది లోకి దుమికే ముందు కృష్ణుడు దానినెక్కాడని పోతనగారనటం యాదృచ్చికం కాదు అని. తెలుసుకున్నక మరింత ముచ్చటేసింది

    ReplyDelete
  7. సనత్ గారు,

    మంచి విషయాన్ని చెప్పారు. అయితే ఈ చెట్టు ప్రస్తావన సంస్కృత మూలంలోనే ఉందనుకుంటాను. అసలు కదంబవృక్షానికీ కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల విహారాలు, రాసలీల అంతా కడిమిచెట్ల మధ్యనే అట!

    అమ్మవారుకూడా "కదంబ వనవాసిని"!

    ReplyDelete
  8. >>రాధాకృష్ణుల విహారాలు, రాసలీల అంతా కడిమిచెట్ల మధ్యనే...

    మేఘైర్మేదురమమ్బరం ఘనభువశ్యామస్తమాల ద్రుమైః...

    పైన శ్లోకంలో కానుగచెట్లంటాడు కదండి? :)

    ReplyDelete
  9. నా ఉద్దేశం పోతన/ వ్యాసుడు అనే.. (సంస్కృత శ్లోకం చదవలేదనుకోండి)

    ReplyDelete
  10. రవీ,

    మంచి ప్రశ్నే వేసారు! :-) కదంబవృక్షాన్ని రాధకి, తమాలవృక్షాన్ని కృష్ణుడికి ప్రతీకగా చెప్తారు. బృందావనంలో ఆ రెండూ ఉంటాయిట! ఇక్కడ చూడండి: http://nitaaiveda.com/All_Scriptures_By_Acharyas/Mahanidhi_Swami/Appreciating_Vrindavana_Dhaam/THE_TREES_OF_VRNDAVANA.htm

    మీరిచ్చిన గీతగోవింద శ్లోక భాగానికి అచ్చమైన తెలుగుసేత కృష్ణశాస్త్రిగారిలా చేసారు - "కారుమొయిళ్ళ కాటుక పొగల్ వెలిగ్రక్కు తమాలవాటి". ఆ పద్యం గురించి మరోమారు చెప్పుకుందాం.

    ReplyDelete
  11. కదంబ వృక్షం బృందావనంలోనే ఉందంటున్నాడాయన. అది నిజం కాకపోవచ్చు. తమిళనాడు లో పళని క్షేత్రాని మెట్ల ద్వారా వెళుతుంటే బాట పక్కన ఈ చెట్లు కనిపిస్తాయి. ఇవి వర్షాకాలంలో మాత్రమే పూస్తాయట. చెట్టు మొత్తం పూలు నిండి దూరం నుంచి చూస్తే - ఎర్రటి వెలుగు దీపంలా వెలుగుతుంటుందని ఒక కవి ఎవరో కల్పన చేశారు. సంస్కృత కావ్యాల్లో ఈ చెట్టు వర్ణన బహు ప్రసిద్ధం. శివతాండవస్తోత్రంలోనూ ఒకచోట -

    "జటాభుజంగ పింగళస్ఫురత్ఫణా మణిప్రభా
    కదమ్బ కుమ్కుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే
    మదాంధ సింధుర...."

    ఇలా వస్తుంది.

    చీకటిచెట్టును విష్ణువుకు ప్రతీకగా గరికిపాటి వారి ఉపన్యాసంలో విన్నాను. కృష్ణశాస్త్రి గారి అనువాదం చెప్పి మంచిపని చేశారు. మొన్నామధ్య ఎందుకో ఉండబట్టలేక తాహతు లేదని తెలిసినా ఈ పద్యాన్ని అనువదించే దుస్సాహసం చేద్దామనిపించింది.

    ReplyDelete
  12. కామేశ్వర రావు గారు,

    మీ బ్లాగులో నేను చదివిన ప్రతి టపాలోనూ ఎంతోకొంత , ఏదో ఒకటి నేర్చుకుంటాను. ఈ టపా ద్వారా " కొన్ని కొత్త తెలుగు పదాలు " నేర్చుకున్నాను. మీ వర్ణన అద్బుతంగా ఉంది. ఇలాంటి కొన్ని పద్యాలు తెలుసుకోగలుగుతున్నాను.

    సనత్ గారు, ఒక కొత్త , నాకు తెలియని విషయాన్నీ మీ ద్వారా తెలుసుకోగలిగాను..! ఇక్కడ పంచుకొన్నందుకు సంతోషం.

    ReplyDelete
  13. చక్కని విషయాలను తెలియజేశారు. పద్యాలను అందంగా వివరించారు. కృతజ్ఞతలు. భక్తియోగానికి ముద్ర భాగవతం.

    ReplyDelete
  14. మీరు ఎంచుకున్నా వర్ణనలు బహు బాగున్నాయి కామేశ్వర రావు గారు, పోతన గారి ఈ క్రింది కృష్ణుడి వర్ణన కూడా అద్భుతమే.. హరిహరభేదం లేదని తెలిపే ఈ పద్యం నాకు ఏంటో ఇష్టం..

    తనువున నంటిన ధరణీపరాగంబు;
    పూసిన నెఱిభూతి పూఁత గాఁగ;
    ముందల వెలుగొందు ముక్తాలలామంబు;
    తొగలసంగడికాని తునుక గాఁగ;
    ఫాలభాగంబుపైఁ బరగు కావిరిబొట్టు;
    కాముని గెల్చిన కన్ను గాఁగఁ;
    గంఠమాలికలోని ఘననీల రత్నంబు;
    కమనీయ మగు మెడకప్పు గాఁగ;

    హారవల్లు లురగహారవల్లులు గాఁగ;
    బాలలీలఁ బ్రౌఢబాలకుండు
    శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
    వేఱులేమిఁ దెల్ప వెలయునట్లు.

    ReplyDelete