తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, December 31, 2008

కూర్మి గూర్చుగాత కొత్త ఏడు!


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఎప్పుడు తలచుకున్నా తలుచుకోకపోయినా కాలం గురించి కాల గమనం గురించి, ఇలా సంవత్సరాలు మారే సమయంలో తప్పక తలుచుకుంటాం. కొత్తపాళీగారి టపా చూడగానే నాకు దువ్వూరివారి పానశాలలోని ఈ పద్యాలు గుర్తుకొచ్చాయి:

కాల మహర్నిశం బనెడి కత్తెరతో భవ దాయురంబర
శ్రీల హరించు; మోముపయి జిల్కును దుమ్ముదుమార మేలొకో
జాలిపడంగ? నీ క్షణము సంతసమందుము; నీవు వోదు, నీ
రేలు బవళ్ళు మున్నటు చరించు నిరంతర మండలాకృతిన్

కాలం - రాత్రి పగలు రెండు భాగాలుగా కలిగిన కత్తెరలాంటిదిట. మన ఆయువనే బట్టనది కత్తిరిస్తూ పోతుంది! ఉమ్రఖయాముదో, దువ్వూరివారిదో కాని ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉంది!

గతము గతంబె యెన్నటికి కన్నుల గట్టదు; సంశయాంధ సం
వృతము భవిష్యదర్థము; వివేకవతీ! యొక వర్తమానమే
సతత మవశ్యభోగ్యమగు సంపద; రమ్య విషాదపాత్ర కీ
మతమున దావులేదు; క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్

ఇదీ ఉమ్రఖయాము మతం!

కానలేము కాలపు మర్మ మేను నీవు;
ఆ జిలుగు వ్రాత చదువ సాధ్యంబె మనకు!
తెరవెనుక నేను నీవను పొరపు గలదు
ఆ విభేదము తెరయెత్త నంతరించు!

సతము దత్త్వవిచారంబు సలిపిసలిపి
మూలసూత్రంబు నెవరైన ముట్టినారె?
నేడు నిన్నట్లు, రేపును నేటియట్లు
అందని ఫలంబు చేచాప నందుటెట్లు?


కాలాన్ని గురించి ఎంతమందో కవులు కవిత్వం రాసారు. ఎందరో తాత్వికులు చింతన చేసారు. అయినా అవన్నీ అసంపూర్ణాలే! ఎప్పటికప్పుడు కాలం తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. కాలమెప్పుడూ నిత్య నూతనమైనదే!

యాదృఛ్చికంగా, ఈ మధ్యనే ఓ టపాకి రాసిన వ్యాఖ్యలో యోగిగారు Eliot కవిత తాలూకు ప్రస్తావన తీసుకువచ్చారు. యాదృఛ్చికమని ఎందుకన్నానంటే, అది Eliot రాసిన నాలుగు సుదీర్ఘ కవితల్లో ఒకటి. ఆ నాలుగు కవితలూ కూడా కాల తత్త్వాన్ని గురించినవే!
కొత్తపాళీగారు అన్నట్టు మన ఋషులు కాలాన్ని వర్తులంగా ఊహించారు. ఒక పరిధిలో ఆలోచిస్తే అది వర్తులమే. పగలు తర్వాత రాత్రి తర్వాత పగలు! కాని నిన్న పగలూ, నేటి పగలూ, రేపటి పగలూ వేరువేరు! Eliot కూడా కాలాన్ని వర్తులంగానే ఊహించాడు. కాలాన్ని గురించి ఇతను రాసిన ఆ నాలుగు కవితలూ చాలా అద్భుతంగా అనిపిస్తాయి నాకు. చాలా చోట్ల అర్థమవ్వకపోయినా, ఆంతరంగికంగా ఉన్న ఒకానొక ప్రవాహ వేగంలో, కాలంలో లాగానే కొట్టుకుపోతాం. ఆసక్తి (దానితో పాటు కాసింత ఓపిక, కూసింత ధైర్యం :-) ఉంటే చదివే ప్రయత్నం చెయ్యొచ్చు!
ఇప్పుడు అసలు విషయానికి వస్తే, Eliot కవితలో తనకిష్టమైన పంక్తులని యోగిగారు నన్ననువదించమని కోరారు. వారికి నామీద అంత నమ్మకం ఎందుకేర్పడిందో మరి! సరే నా ప్రయత్నం నేను చేసాను (ఛందోబద్ధమైన పద్యమే), దాన్నొక టపాలో పెడదామనుకున్నాను. ఇంతలో మరో అవిడియా వచ్చింది! అంతర్జాలంలో ఇంకా చాలామంది పద్య ప్రియులున్నారు కదా వాళ్ళకీ పద్య రచనలో ఒక అభ్యాసంగా ఇదిస్తే ఎలా ఉంటుంది అని. కొత్త సంవత్సరం పూటా ఒక పద్యాన్ని రాయడంలో మరింత తృప్తి ఉంటుంది కదా! మరింక ఆలస్యం దేనికి? పద్య రచనాసక్తులైన వాళ్ళందరూ ప్రయత్నించి, అనువదించి మీ మీ బ్లాగుల్లో టపా వెయ్యండిక. బ్లాగులేని వాళ్ళు ఈ మిషతోనైనా బ్లాగులు తెరిస్తే మరీ మంచిది:-)


We shall not cease from exploration
And the end of all our exploring
Will be to arrive where we started
And know the place for the first time


పూర్తిగా చదవండి...

Monday, December 29, 2008

కొండ-గోదారి, నేను

నదికి కొండకి స్నేహ మేనాటిదో కదా!
ఉరకలెత్తు నది నిరంతరము చెప్పు ఊసులెన్నొ.
వాటికి తలయూచలేదు కొండ,
కాని ఆగదు నది.
గొప్ప చెలిమి!

కొండపైనున్న ఓ చెట్టుకొమ్మ మీంచి
ఎగురుకొని వచ్చి,
నదికి ఊసేదొ చెప్పి
ఎగిరిపోయింది ఒక పిట్ట.
ఏమి కబురు
చెప్పి పంపించెనో?
ఎంత చిత్ర మైత్రి!

ఆ నిరంతర స్నేహాని కడ్డు తగిలి
వాటి ఏకాంత స్వేఛ్చని భంగపరిచి
ఇంగితము లేక అట విహరించుచున్న
వెఱ్ఱి స్వార్థము రూపైన వింత పశువు
నేను!
పూర్తిగా చదవండి...

Monday, December 8, 2008

రెండు పద్యాలూ, బోలెడన్ని జ్ఞాపకాలూ


అష్టావక్రగారి బ్లాగులో ఈ పద్యాన్ని గురించిన ప్రస్తావన చూసేసరికి నేనెక్కడికో వెళ్ళిపోయాను. జ్ఞాపకాల గుడుసుళ్ళు గుండ్రాలు గుండ్రాలుగా తిరిగి నన్నో పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాయి! అప్పట్లో ఇంటర్నెట్టంటే ఒక అద్భుతం! ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో తెలియని వ్యక్తులతో సంభాషణలు. వయసు, చదువు, పరపతీ - ఇలాటి భేదాలేవీ లేని, తెలీని ఒక కొత్త లోకం! ఉద్యోగంలో చేరిన కొత్త. ఇంటర్నెట్టు మరీ కొత్త. అప్పటికింకా యాహూ, గూగులు గుంపులేవీ లేవు. Mailing Lists అని ఉండేవి. వాటి గురించి తెలిసి ఇంక మనసూరుకుంటుందా! మనకిష్టమైన వాటికోసం అన్వేషణ. ఎలా తగిలిందో ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు కాని, వెదకబోయిన తీగ "తెలుసా" ("తెలుగు సాహిత్యా"నికి సంక్షిప్త రూపం) రూపంలో నా కాలికి తగిలింది. అప్పటికే ఆ గుంపుకి మూడేళ్ళ వయసు. ఎందరో హేమాహేమీలు (అప్పటికి వాళ్ళు హేమాహేమీలని నాకు తెలీదు!) జరిపే ఆసక్తికరమైన చర్చలూ, అంతుతెగని వాదనలూ, కొత్త సాహిత్యాన్ని గురించిన పరిచయాలూ - ఒకటా రెండా, అబ్బో అదొక మహత్తర సాహిత్య శాల. అదే నాకు పెద్ద పాఠశాలయ్యింది. దింగంబర కవిత్వం రుచిచూసినా, స్త్రీవాద కవిత్వాన్ని గురించి తెలుసుకున్నా, భాషాశాస్త్రంలో ఓనమాలు దిద్దుకున్నా అవన్నీ ఆ పాఠశాలలోనే! అన్నిటికీ మించి, పద్యసుమాల పరిమళం ఆ ఆవరణ అంతటా పరచుకునేది. మన పద్యసాహిత్యంలోని అందాలగూర్చి వివరించడమూ చర్చించడమూ అయితేనేమి, చమత్కార సమస్యాలూ పూరణలూ అయితేనేమి, స్వీయ కవిత్వాలయితేనేమి, ఛందో బందోబస్తులగురించిన వాడి వేడి చర్చలయితేనేమి ఆ గుంపులో ఎప్పుడూ పద్యాస్వాదన జరుగుతూనే ఉండేది. అదిగో అలాటి సందర్భంలోనే ఒకరు పంపిన యీ పద్యం నా కంటబడింది:


కాలము మారె; మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తే; జం
బాలమునందు రక్తదళ పద్మిని మోసిడి పూలు పూచె; నం
ధాలయమందు స్వర్ణ కిరణాంకురముల్ జనియించి భావ భూ
తాలను బారదోలి చిర దాస్యతమస్సు నడంచె నాంధ్రుడా!


ఇది దువ్వూరి రామిరెడ్డి పద్యం. ఈ పద్యాన్ని చదవగానే, ఎందుకో ఠక్కున మరో పద్యం గుర్తుకువచ్చింది. అది దాశరథి మహాంధ్రోదయంలోని పద్యం:

వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం
డెలు జిలుజిల్లనన్ రుధిర నిర్ఝరిపారె, దిగంగనా ముఖ
మ్ముల నవకుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు, త
ల్పులు తెరువుండు రండు పిలువుండు శయించినవారినెల్లరన్!

వెంటనే టకటకా టైపుచేసి పంపించేసాను. అదే అంతర్జాలంలో నా మొట్టమొదటి టపా! దీనితోనే నా అంతర్జాల ప్రయాణానికి శ్రీకారం చుట్టాను. అప్పటి టపాలు ఇప్పటికీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి. తెలుగు సాహిత్యమంటే ఆసక్తి ఉన్నవాళ్ళు యీ archives మధ్యలో పడితే, రత్నాకరంలో పడ్డట్టే :-)
ఎందుకీ పద్యం గుర్తుకువచ్చింది అనే ప్రశ్నకి అప్పుడు నేనిచ్చిన వివరణ:

దువ్వూరి, దాశరథి వారి యీ రెండు పద్యాలలో నాకు చాలా సామ్యము కనిపిస్తోంది.
రెండు పద్యాలూ ఆంధ్రుల దాస్యవిముక్తి గూర్చినవి. రెంటిలోనూ దానిని ఒక నవోదయంతో పోల్చడమే కాక, ఆ ఉదయ వర్ణన కూడా చాలా దగ్గరగా ఉంది. ఇద్దరూ సూర్య కిరణాలనీ, తామర మొగ్గలనీ కొత్త ఆశలకు, ఆలోచనలకు ప్రతీకగా చేసుకున్నారు. "రుధిర నిర్ఝరిపారె" అని దాశరథి అంటే, "రక్త దళ పద్మిని మోసిడి పూలు పూచె" అని కవికోకిల అంటారు. ఇద్దరి లోనూ విప్లవ ఛాయ గోచరిస్తుంది.

ఇది యథాతథంగా అప్పటి వివరణే అయినా, అప్పుడది ఉన్నది ఇంగ్లీషు(లిపి)లో. అప్పటికింకా తెలుగు ఫాంట్ల వినియోగం ఎక్కువగా లేదు. Rice Universityలోని కొంతమంది తెలుగువాళ్ళు తయారుచేసిన transliteration scheme, RTS అన్న పేరుతో చాలామంది వాడేవారు. ఇప్పటికీ చాలామంది వాడుతున్నారు. నా మొట్టమొదటి ఆ టపా రాసినప్పటికి నాకు దీనిగురించి కూడా తెలీదు! అప్పటికి చూసిన టపాల ఆధారంగా నాకు తోచిన transliteration schemeలో రాసేవాడిని. ఆ తర్వాత RTSగురించి తెలిసింది. RTS రాయడం చదవడం అలవాటై, కొన్నాళ్ళకి అనర్గళంగా ఇంగ్లీషులిపిలో(RTSలో) తెలుగు టైపు చెయ్యడం చదవడం వచ్చేసింది :-) తెలుగు మిత్రుల దగ్గర ఈ విద్యని ప్రదర్శించి వాళ్ళని ఆశ్చర్యపరచడం సరదాగా ఉండేది. ఆ తర్వాత సిరిగిన దంపతల ధర్మమా అని Telugu Lipi Editor వచ్చింది. నేను ఇంగ్లీషులిపిలో ఏ తెలుగు కవితో రాస్తే, అది వేరే వాళ్ళకి చదవడానికి వీలుగా తెలుగు ఫాంటులోకి తర్జుమా చేసి HTMLగానో imageగానో భద్రపరచే వీలు కల్పించింది తెలుగు లిపి. ఆ తర్వాత చాలా పరికరాలు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రభారతివారి rts2pdf వాడేవాణ్ణి. ఇప్పటికీ pdfలో ఏదైనా భద్రపరచడానికి అది వాడుతూ ఉంటాను.

ఈ పదేళ్ళ ప్రయాణంలో, ఎన్నో పరిచయాలు. వాటిల్లో ప్రత్యక్ష పరిచయాలుగా మరినవి చాలా తక్కువే. ముఖాముఖీ కలుసుకోకుండా సంభాషించుకోవడం అదో ప్రత్యేకత! తెలుసా తర్వాత రచ్చబండ, ఛందస్సు గుంపులూ, ఈమాట పత్రికా, తెలుగు పీపుల్ డాట్ కాం, ఈ మధ్యనే పొద్దు, ఇతర అంతర్జాల పత్రికలూ - ఇలా సాగిన ప్రయాణం ప్రస్తుతానికి ఇదిగో యీ బ్లాగులవరకూ వచ్చింది. ఇంకా ముందుముందు ఎలాటి మలుపులు తిరగనుందో!
ఏదేమైనా, ఈ ప్రయాణంలో నేనెన్నో నేర్చుకోగలిగాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. సాహిత్యంతో ఇప్పుడు నాకున్న అతి కొద్ది పరిచయం ఏర్పడడంలో అంతర్జాలం ముఖ్య పాత్ర నిర్వహించిందనడంలో ఏ మాత్రం సందేహమూ లేదు. దానికిగానూ అంతర్జాలానికీ, అందులో పాల్గొన్న (పాల్గొంటున్న) వ్యక్తులందరికీ యీ టపా ద్వారా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

చూసేరా, నా జ్ఞాపకాలలో కొట్టుకుపోయి పద్యం గురించి మరిచే పోయాను! ఇది నాకు చాలా ఇష్టమైన పద్యం. ఉదయాన్ని మన కవులెంతమంది వర్ణించ లేదు! ఒక అభ్యుదయ కవి, విప్లవ స్ఫూర్తితో దర్శించిన ఉదయమిది. వెలుతురనే బాకుతో చిక్కని చీకటి రాత్రి గుండెలని చీల్చితే, అందులోంచి పారిన రక్తపుటేరు లాగా ఉందిట ఉదయాకాశం. ఆకాశంలో దిక్కులనే కాంతల ముఖాలమీద కుంకుమ కాంతులు విరిసాయట. కింద నేలపై అదే సమయానికి తామర మొగ్గలుకూడా విచ్చుకుంటాయి కదా. పైన ఆ కుంకుమ ప్రభలు కూడా, కిందనున్న తామర మొగ్గల్లానే ఉన్నాయిట! ఇంకేముంది తెల్లవారింది, తలుపులు తెరవండి, రండి, ఇంకా పడుకొని ఉన్నవాళ్ళందరినీ నిద్రలేపండి అని కవి పిలుపు. ఇక్కడ ఉదయమంటే అభ్యుదయం, స్వేఛ్చ. చిక్కని కాళరాత్రి - అజ్ఞానంతో నిండిన దాస్యం. దిగంగనల ముఖాలపై కుంకుమ కాంతులు, లోకానికి శుభం జరుగుతోందని సూచన. కవి ఇచ్చిన పిలుపు స్వేఛ్చా వాయువులని పీల్చి, అభ్యుదయం వైపుకి అడుగులు వెయ్యమని. ప్రకృతి వర్ణనలో, చెప్పదలచుకున్న విషయాన్ని ధ్వనింపచెయ్యడం మంచి కవిత్వం.
కవి తన కవితలో చిత్రించిన ఆ ఉదయం ఊహగానే మిగిలిపోయిందా? నిజంగానే నిజమయ్యిందా? నిజమౌతుందా? ఇవి మనందరం ఆలోచించుకోవాలసిన ప్రశ్నలు...


పూర్తిగా చదవండి...

Monday, November 17, 2008

చదువది యెంతగల్గిన...


నా మిత్రుడొకడు ఈనాడులోని ఈ సంపాదకీయాన్ని నా దృష్టికి తెచ్చాడు. కొత్తవి కాకపోయినా, మరోసారి గుర్తుచేసుకోవాల్సిన విషయాలున్నాయందులో. ముఖ్యంగా ఎప్పుడో చదువుకున్న పద్యాన్ని మళ్ళీ గుర్తుచేసి నా మనసుని ఆ పద్యమ్మీదకి పరుగులు తీయించింది. నన్ను నేను మరోసారి సమీక్షించుకొనేలా చేసింది. ఎప్పుడో పదహారవ శతాబ్దంలో రాయబడ్డ పద్యం, నేనెప్పుడో చిన్ననాడు చదువుకున్న పద్యం ఇన్నాళ్ళకి మళ్ళీ నన్ను ఆలోచింపజేసిందంటే అది సామాన్యమా!

చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!


ఇది చాలామందికి తెలిసిన పద్యమే. అందరికీ అర్థమయ్యే పద్యమే. ఇందులో విశేషమంతా, "ఇంచుక" అన్న పదంలోనూ, ఈ రసజ్ఞతని ఉప్పుతో పోల్చడంలోనూ ఉంది. అంటే రసజ్ఞత కూడా తగిన పాళ్ళల్లోనే ఉండాలి. ఇది ఉండడం ఎంత అవసరమో, ఎక్కువ కాకపోవడమూ అంతే అవసరమన్న మాట. అదేవిటి, రసజ్ఞత మంచి గుణమే కదా, అది ఎక్కువైతే ఏవిటి సమస్య అన్న అనుమానం రావచ్చు. ఉప్పెక్కువైతే ఏవిటవుతుందో, రసజ్ఞత ఎక్కువైనా అదే అవుతుంది. ఉప్పెక్కువైతే అది మిగతా రుచులని ఆక్రమించేసి అదొకటే రుచి తెలుస్తుంది కదా. అలానే రసజ్ఞత ఎక్కువైతే, మనం చదివే దాంట్లో లేదా చెప్పాల్సిన దాంట్లో ఉన్న అసలు విషయాన్ని మన సొంత పైత్యం ఆక్రమించేస్తుంది. ఎలా అయితే తగినంత ఉప్పు, మిగతా రుచులకి ప్రోద్బలం కలిగిస్తుందో, అలానే రసజ్ఞత కూడా రచనలోని విశేషాలని గ్రహించేందుకు ప్రేరకం మాత్రమే కావాలి.

శతకాల్లో భాస్కర శతకానికి తనదైన ఒక ప్రత్యేకత ఉంది. ఇది భక్తి శతకం కాదు, నీతి శతకం. మనకి బాగా తెలిసిన నీతి శతకాలు వేమన, సుమతి శతకాలు. సంస్కృతం నుంచి అనువదించబడిన భర్తృహరి నీతి శతకాన్ని పక్కనపెడితే, తెలుగులో వృత్తాలలో నడిచే నీతి శతకం భాస్కర శతకం. ఇలాటి వృత్తాలకి చిక్కని చక్కని ధార అవసరం. అది పుష్కలంగా ఉన్న పద్యాలున్న శతకం భాస్కర శతకం. అలాటి నడకకి తోడు చక్కని దృష్టాంతాలు ఈ శతకంలోని పద్యాలని పాఠకుల మనసులో ముద్రపడేట్టు చేస్తాయి. ఈ శతకం రాసిన కవి పేరు మారవి వెంకయ్య.

ఇంతకీ ఈ పద్యం నన్నెందుకింతలా ఆలోచింపజేసిందిప్పుడూ అంటే, అందులో చెప్పిన రసజ్ఞత నాలో లోపించడం లేదు కదా అన్న అనుమానమే! చాలా కాలం క్రితం నా పద్యాలనీ, వ్యాసాలనీ చదివిన మా ముత్తాతగారు నాకో హెచ్చరిక చేసారు. నీలోని విమర్శకుడు నీలో ఉన్న కవిని మింగెయ్యకుండా జాగ్రత్త పడరా నాయనా అని! అతనన్నట్టుగానే విమర్శకుడు కవిని ఇంచుమించుగా మింగేసాడనే చెప్పాలి. అంతవరకూ సరే, ఏదో నా స్వభావమే అంత అని సరిపెట్టుకోవచ్చు. విమర్శకుడికైనా రసజ్ఞత అవసరమే. కవితలోనో కథలోనో ఉండే రసాన్ని (మన ప్రస్తుత భాషలో అనుభూతి అనుకుందాం) గ్రహించ గలిగే శక్తే రసజ్ఞత. విమర్శకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అదే కదా! కవి రాసిన దాంట్లో తప్పులు పట్టుకోవడమే ప్రథానమై పోతే రసజ్ఞత గంగలో కలిసినట్టే. వాదోపవాదాల మీదున్న ఆసక్తి మంచి రచనని ఆస్వాదించడంలో చూపించకపోతే వాడు రసికుడు కాదు రక్కసుడిగా తయారవుతాడు. ఈ రసజ్ఞత చాలకపోబట్టే కదా ఇంతకుముందు చెప్పుకున్న నత్కీరుడు అవస్థల పాలయ్యింది.

ఈ పద్యం మన సాహిత్యకారులూ, విద్యావంతులూ ఈ రసజ్ఞతకి ఎంత విలువనిచ్చారో స్పష్టం చేస్తోంది. తర్క మీమాంస వ్యాకరణాది శాస్త్రాలెన్ని చదువుకున్నా, కాస్తంత రసజ్ఞత లేనివాడు ఎక్కడా రాణించలేడని చెపుతోంది. ఎలాటి శాస్త్ర గ్రంథం రాసినా, సంభాషణ చేసినా అందులో కాస్తంత హృదయానికి హత్తుకొనే చతురత, చమత్కారం లోపిస్తే అవి ఎదుటివాళ్ళని ఆకట్టుకోవన్న మాట. అన్న మాట కాదది ఉన్న మాటే! తాంబూలాన్ని అడిగిన భవభూతీ కాళిదాసుల కథలో, ఆ వారకాంత భవభూతిలో చూసింది శుష్క పాండిత్యమైతే, కాళిదాసులో చూసింది రసజ్ఞత కదా!
కాస్త ఘాటైన వివాదాలు జరిగినా, పూర్వకాలంలో కవి పండితుల మధ్య చర్చలుగానీ వాదనలుగానీ చమత్కారంగా, సరసంగా సాగేవని మనకున్న చాటు పద్యాలూ కథలూ సాక్ష్యం చెబుతాయి. తెనాలి రామకృష్ణుడిలాంటి కుఱ్ఱకవి "ఎమి తిని సెపితివి కపితము" అని తనని ఎద్దేవా చేస్తే సహృదయంతో తన తప్పుని అంగీకరించిన పెద్దనని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అదే రామకృష్ణుడు తన పద్యాన్ని దిద్దిన రాయలవారికి సంతోషంతో ఇచ్చిన చిరుకానుక మహదానందంగా స్వీకరించిన రాయలని ఒకసారి తలుచుకోండి.
ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్ళలో జరిగిన సాహిత్య వివాదాలలో మిరియాల ఘాటు ఎంత కనిపించినా, అంతర్లీనంగా దాగిన రసజ్ఞత బెల్లప్పాకంలా అక్కడక్కడ దర్శనమిస్తుంది. తిట్లుకూడా చాలవరకూ సరసంగా, చమత్కారంగా కనిపిస్తాయి.
భావకవిత్వంపై తిరుగుబాటుగా వచ్చిన అభ్యుదయకవిత్వాన్ని కృష్ణశాస్త్రి మనస్పూర్తిగా ఆహ్వానించినా, కృష్ణశాస్త్రి కవిత్వంలోని గాఢతని అభ్యుదయకవులు ఒప్పుకున్నా, ఉత్తర దక్షిణ ధృవాలవంటి విశ్వనాథ, శ్రీశ్రీలు పరస్పర కవిత్వ పటుత్వాన్ని గుర్తించినా, మొదట్లో ఎందరో తక్కువగా చూసిన జాషువాకి స్వయంగా వేంకటశాస్త్రిగారు కంకణం తొడిగినా - ఇదంతా ఆ కాలంలో యింకా యింకిపోని రసజ్ఞత వల్లనే.

కారణాలేవిటో తెలీదు కానీ, ఈ మధ్య వస్తున్న విమర్శలూ, చర్చలూ, వాదోపవాదాలలో ఇలాటి సరస సంభాషణలుగాని, రసజ్ఞత కానీ చాలా అరుదైపోయాయి. ఏవంటే ఏవర్థం తీసుకుంటారో అనే బెంగతో ఇలాటివి తక్కువయ్యాయో. తార్కిక సిద్ధాంతాల ఎండవేడికి సరస సరోవరాలు ఆవిరైపోయాయో మరి తెలీదు. సర్వత్రా పెచ్చుపెరిగిపోతున్న అసహన భావం కూడా దీనికి కారణం కావచ్చు.
సృజనాత్మక సాహిత్యం గణితమూ కాదూ, సాంఘిక శాస్త్రమూ కాదనే స్పృహ కలగాలి. సిద్ధాంతాల చట్రాలనుంచి బయటపడాలి. ఆలోచనతో పాటు అనుభూతికీ, మెదడుతో పాటు హృదయానికి సముచిత స్థానాన్ని ఇచ్చినప్పుడే జీవితంలో రుచిపుడుతుంది. లేదంటే చప్పిడి బతుకే మిగులుతుంది!


పూర్తిగా చదవండి...

Sunday, November 9, 2008

జననీ గర్భములోన...


కర్తవ్య నిర్వహణలో ఆ రాముడికే కాదు, నాక్కూడా అప్పుడప్పుడూ అరణ్యవాసం చెయ్యాల్సివస్తుందని ఈ మధ్యనే తెలిసొచ్చింది! కంగారుపడకండి, నేను చేసింది బ్లాగ్రాజ్యానికి (ఆమాటకొస్తే అంతర్జాల సామ్రాజ్యానికి) దూరంగా జనారణ్యవాసం.
ఇన్నాళ్ళ తర్వాత వచ్చి చూస్తే నాకు నా బ్లాగూ, నా బ్లాగుకి నేనూ కాస్త కొత్తగా కనిపించాం! ఇంతలోనే అంత మరుపా అనిపించింది. దీనికంతగా సంబంధం లేకపోయినా, ఎందుకో చట్టుక్కున ఓ పద్యం గుర్తుకొచ్చింది.

ఒక తండ్రి, తన బిడ్డకి ఊహ తెలియని రోజుల్లో, పనిమీద పరదేశానికి వెళ్ళి, కొన్నాళ్ళ తర్వాత ఆ బిడ్డకి ఊహ తెలిసే వయసుకి తిరిగి వచ్చాడనుకోండి. "అతనే నాన్న" అని తల్లి చెప్పి, ఆ తండ్రి ఆప్యాయంగా ఆ బిడ్డని చేరబోతే, ఆ బిడ్డ మనస్థితి ఎలా ఉంటుంది? ఇలాటి అనుభవం ఈ కాలంలో మరీ అరుదేమీ కాదు. ఉద్యోగ రీత్యా భార్యా పిల్లలని వదలి పరదేశాలకి వెళ్ళే వాళ్ళు చాలామందే కనిపిస్తారు కదా.
అలాటి పరిస్థితిని పద్యంలో వర్ణించడమే కాదు, మరో మహత్తరమైన విషయాన్ని చెప్పడానికి, దీన్నొక పోలికగా ఉపయోగించిన ఒక మంచి పద్యం ఇది.

జననీ గర్భములోన నుండగ విదేశంబేగి, బెక్కేండ్లకున్
జనుదే దండ్రిని గాంచు బిడ్డవలె నీ సంబంధమున్ ముందు నే
గన కీ వేళ నెఱింగి స్నేహభయశంకాముత్త్రపాశ్చర్య భా
జనమై నిల్చితి జేరదీసికొనవే సద్భక్తచింతామణీ!

ఈ పద్యాన్ని రాసిన కవి శ్రీ వడ్డాది సుబ్బారాయుడు. ఇతను 1854-1938 మధ్య కాలంలో జీవించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయిన ఇతను తన ఇంట్లోనే, బంధువుల సాయంతో సొంతంగా చదువుకొని సంస్కృతాంధ్రాలలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. వేణీసంహారం, విక్రమోర్వశీయం వంటి సంస్కృత నాటకాలని తెలిగించారు. నందనందన, భక్తచింతామణీ వంటి శతకాలని రాసారు. తన భార్యా పిల్లలనందరినీ కోల్పోయి ఒంటరైపోయిన ఇతను వాళ్ళగురించిన స్మృతికావ్యాలలో తన బాధని పొందుపరచారు. ఇతని ఇతర రచనలు నేను చదవలేదు కాని, భక్తచింతామణీ శతకంలో (నిజానికి ఇందులో రెండువందలకి పైగానే పద్యాలున్నాయి, ఈ మకుటంతో) చాలా ఆర్ద్రమైన పద్యాలెన్నో ఉన్నాయి. అలాటివాటిలో ఇదొకటి!

తానిన్నాళ్ళూ భగవంతుణ్ణి తెలుసుకోలేదు. ఇప్పుడొక్కసారిగా అతని గురించి తెలుసుకొనే సరికి అతను పొందిన అనుభూతిని ఎంత గొప్ప పోలికతో రూపుకట్టించారో చూడండి! అందులో స్నేహం(ఆప్యాయత)ఉంది, భయముంది, అనుమానముంది, సిగ్గుంది, ఆశ్చర్యముంది! అలాటి అనేక భావ పరంపరలతో ఒక వింత అనుభూతికి లోనై, అలా చూస్తూనే నిలుచుండి పోయాడట. అలాంటి సందర్భంలో బిడ్డ తండ్రి వద్దకు చొరవగా రాలేడు. తండ్రే అతన్ని చేరదీసుకొని బుజ్జగించాలి. అదే వేడుకుంటున్నాడు కవి.

భగవంతుణ్ణి నిత్యం ఆరాధించే భక్తులెవరైనా, ఆ భగంతుడు తమకి నిజంగా ప్రత్యక్షమైతే ఇలాటి అనుభూతికే లోనవుతారనడంలో సందేహమేమీ లేదు!


పూర్తిగా చదవండి...