తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, March 27, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు


అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు!
కొత్త ఏడాది కొత్త ఛందస్సులో పద్యం రాద్దామనిపించింది. పేరుకి ఎంత విరోధి అయినా అతిథిగా వచ్చినవాణ్ణి మనసారా స్వాగతించడం మన సంస్కారం కదా!
అందుకే స్వాగత వృత్తంలో యీ స్వాగత పద్యం:

శ్రీకరమ్మగుచు చింతలు దీర్చే
శోకమున్ దుడిచి శోభల గూర్చే
జోకతోడ మము జూడు విరోధీ!
నీకు స్వాగతము నేరవిరోధీ!

అచ్చ తెలుగు ఆటవెలదిలో వచ్చిన విరోధికి ఒక విన్నపం:

గడప ద్రొక్కువాడు కడు విరోధి అయిన
స్వచ్ఛమైన హృదిని స్వాగతించు
మంచితనము కలుగు మా తెల్గువాళ్ళతో
చెలిమి కలిగి నీవు మెలగుమోయి!

మన తెలుగు సంవత్సరాలకి యీ పేర్లెలావచ్చాయో కాని భలే గమ్మత్తుగా ఉంటుంది! కోరికోరి ఎవరిలాటి పేరు పెట్టారో. ఈ పెరులో ఉన్న విరోధం ఆభాసగా మారాలని ఆకాంక్షిస్తూ, విరోధాభాసకి ఒక చక్కని ఉదాహరణ:

తన జనకుండురు స్థాణువు,
జనని యపర్ణాఖ్య, దా విశాఖుండనగా
దనరియు నభిమతఫలముల
జనులకు దయ నొసగుచుండు షణ్ముఖు గొలుతున్

ఇది నన్నెచోడుడు రచించిన కుమారసంభవంలో పద్యం. తండ్రేమో స్థాణువు (పెద్ద మోడు). తల్లేమో అపర్ణ (ఆకులే లేనిది), ఇంక తన పేరు విశాఖుడు (అంటే కొమ్మలు లేనివాడు). వినడానికి పేర్లిలా ఉన్నా జనులందరికీ అభిమతాలనే ఫలాలని దయతో అందించే షణ్ముఖుని కొలుస్తాను అని అర్థం.
అలాగే విరోధి పేరుకి మాత్రమే విరోధి అయి మనకి మంచి స్నేహామృతాన్ని పంచివ్వాలాని (దాన్ని అందుకొనే సహృదయం మనందరికీ ఉండాలనీ) మనసార కోరుకుంటూ...
అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.

అన్నట్టు, యీ కొత్త సంవత్సరం పద్యప్రియులకి ఒక కొత్త శుభవార్త! అదేమిటో అతి త్వరలో చెప్తాను. అందాకా వేచి ఉండండేం.


పూర్తిగా చదవండి...

Sunday, March 22, 2009

ఉద్యోగవిజయాలు


పని వత్తిడిలో పడి కొన్ని వారాలై బ్లాగు ముఖమే చూడలేదు.
అంత ఊపిరిసలపని పనిలోనూ, హఠాత్తుగా ఒక మధురక్షణంలో తిరుపతివేంకటకవుల ఉద్యోగవిజయాలు గుర్తుకొచ్చాయి. పడకసీను మనసులో మెదిలింది. ఇహనేం, "ఎక్కడనుండి రాక యిటకు...", "బావా యెప్పుడు వచ్చితీవు..." అంటూ మొదలుపెట్టి అందులో పద్యాలన్నీ ఒకటొకటీ అంతరంగ రంగస్థలమ్మీదకి సరాగాలతో వచ్చేసి హోరెత్తించేసాయి!
అంతలోనే ఓ చిలిపి ఊహ తళుక్కున మెరిసింది. మన సాఫ్టువేరు పనిగాళ్ళు యీ పడకసీను వేస్తే ఎలా ఉంటుందీ అని! అనుకున్నదే తడవుగా అంతరాత్మ స్టేజి మీద అన్నీ అమర్చేసింది.


అది ఒక సాఫ్టువేర్ కంపెనీ డివిషనల్ హెడ్డు కేబిన్. అందులో ఎప్పటిలా కృష్ణారావు సుదీర్ఘమైన ఓ కునుకు తీస్తున్నాడు. కలలోకూడా అతన్ని వదిలిపోని predictive management skill అతన్ని ఒక్కసారిగా నిద్రలేపింది. కేబిన్ బయటకి సారించిన అతని చూపుకి అర్జునరావు, రాజారావు వడివడిగా అడుగులు వేస్తూ తన కోసమే వస్తూ కనిపించారు. వాళ్ళిద్దరూ తనకింద పనిచేస్తున్న ప్రాజెక్టు మేనేజర్లు. ఈ మధ్యనే యిద్దరూ కొత్త కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టారు. అవి రెండూ (ఆ మాటకొస్తే ఏ రెండూ కావుకనక!) చాలా బిగిసిపోయిన కాలపరిమితితో (అదే tight schedule) ఉన్న ప్రాజెక్టులు. ఆ విషయం కృష్ణారావుకి బాగా తెలుసు. ఎందుకంటే కష్టపడి కష్టమరు కాళ్ళావేళ్ళా పడి తన బుద్ధి కుశలతనంతా ఉపయోగించి వాటిని సంపాదించి పెట్టింది (తద్వార బోనస్సులో అధికవాటా కొట్టేసింది) తనే కదా! దాన్ని పూర్తి చెయ్యమని "తగిన" టీముని కూడా తనే కదా ఏర్పాటు చేసాడు వాళ్ళకి. దాని గురించే తన దగ్గర మొరపెట్టుకోడానికి వస్తున్నారిద్దరూ అని అతనిట్టే గ్రహించేసాడు. హడావిడిగా బిజీ పనిలో నిమగ్నమైనట్టు, తన మోనిటర్ నుంచి తలతిప్పకుండా, కీబోర్డుపై వేళ్ళు టకటక లాడించడం మొదలుపెట్టాడు. ముందుగా అక్కడికి చేరిన రాజారావు, తన బాసు పనిలో ఉన్నాడనుకొని, అతనికి వ్రతభంగం చెయ్యకూడదని మెల్లిగా వచ్చి అతని మానిటరుముందున్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో అర్జునరావు కూడా అక్కడికి చేరాడు. అతను కాస్త బుద్ధికుశలత ఉన్న మేనేజరు. "May I come in Krish" అని తలుపుదగ్గరే నిలబడ్డాడు. తలతిప్పిన కృష్ణారావు అతన్ని చిరునవ్వుతో చూసాడు. బేగ్రౌండులో హార్మణీ సరిగమలని శ్రుతిచేసింది.

కృష్ణారావు: "ఎక్కడనుండి రాక యిటకు"

అర్జునరావు: (అంతరంగంలో) "నీ మొహం మండ! ఇంకెక్కణ్ణుంచి వస్తాను, అసలు సీట్నుంచి కదలడానికి టైముంటే కదా!" (జనాంతికంగా) "Open Plazaనుంచే" (అదివాళ్ళ టీము నివసించే బిల్డింగ్ పేరు)

కృ: "ఎల్లరునున్ సుఖులే కదా?"

అ: (ఏడవలేని ఒక నవ్వుతో ఊపీ ఊపకుండా తల ఊపుతాడు.)

కృ: "భలే టెక్కులు నీదు లీడులును, లేత మనస్కులు నీదు డెవ్లపర్స్
చక్కగనున్న వారె? మన దేవుడు కష్టమరన్ని వేళలన్
మక్కువ నిల్చి శాంతి గతి తాను చరించునె తెల్పు మర్జునా!

(ఈపాటికే సాఫ్టువేరువాళ్ళకి ఛందస్సు పెద్దగా రాదన్న విషయం ప్రేక్షకులు గమనించే ఉంటారు!)

అర్జునరావు జవాబు చెప్పేలోపలే తల పక్కకి తిప్పి అక్కడ కూర్చున్న రాజారావుని అప్పుడే చూసినట్టు చూసాడు కృష్ణారావు.

కృ: "నీవా! ఎప్పుడు వచ్చితీవు సుఖుడే నీ కష్టమర్ దేవుడున్
నీ వాల్లభ్యము పట్టు లీడులును డెవ్లప్పర్స్ సుఖోపేతులే?
మీ వర్కున్ సరిజూచు టెస్టరులు మీ మేల్గోరు క్యూయే ప్రియం
భావుల్ సేమముమై నెసంగుదురె నీ తేజంబు హెచ్చించుచున్...నీవా...ఆ...ఆ...ఆ..."

అతని రాగాన్ని ఆదిలోనే కట్ చేస్తూ రాజారావందుకొన్నాడు.

రా: "కష్టమరూ మనం మునుగు కాలము సేరువ అయ్యె"

అంతకన్నా అతనికి ఛందస్సులో మాట్లాడే ఓపిక లేక సూటిగా వచనంలో తన గోడంతా వినిపించేడు. పనిలోపని అర్జునరావు కూడా అందుకే వచ్చుంటాడని ఎడ్యుకేటెడ్ గెస్సుకూడా చేసి, అతనికన్నా ముందు తనే వచ్చేనని కూడా నొక్కివక్కాణించాడు.
చివరికి "సహాయమున్ కోరగ నేగుదెంచితిమి డివిషనలైక శిరోవిభూషణా" అని మాత్రం అన్నాడు.
అప్పుడు కృష్ణారావు ఒక కొంటె నవ్వు నవ్వి,

కృ: "ముందుగ వచ్చితీవు, మునుముందుగ అర్జును నేను జూచితిన్
పొందిన రిస్కులన్నియవి పాయగ నిల్చె సహాయ మిర్వురున్
జెందుట పాడి, మీకునయి చేతు రిసోర్సు విభాగ మందు మీ
కుం దగుదాని గైకొనుడు...కాని రాజారావ్,...కోరుట యెఫ్ఫెము కొప్పు ముందుగన్!

(F.M. అనగా Functional Manager. అనగా మేనేజర్ పనే చేసినా మేనేజరని పిలిపించుకోలేని వాడు. Managerకి ముందు దశన్న మాట. అర్జునరావింకా ఆ దశలోనే ఉన్నాడు. రాజారావు అప్పటికే ఆ దశని దాటుకొచ్చేసాడు.)

రా: (తనలో తాను) "ఔరా! క్రిష్ ఎంత మోసము చేయుచున్నాడు! నా తరువాత వచ్చిన అర్జునరావుకి రిసోర్సులో భాగమివ్వడమే కాక, కోరుకొనుటలోనూ అతనికే ముందు ఛాన్సు ఇచ్చాడు!".

రాజారావు అనుమానాన్ని గ్రహించిన కృష్ణారావు అతన్ని బుజ్జగిస్తూ,

కృ: "నువ్వేమో ఎక్స్పీరియన్సుడు మేనేజరువి. ప్రాజెక్టు మేనేజ్మెంటులో ఆరి తేలినవాడివి. ఇతనింకా జూనియరు. కాబట్టి ఇట్లు వేరుగ అడుగవలసి వచ్చింది. అది అట్లుండన్"
అని అసలు రిసోర్సింగు విషయానికి వచ్చాడు. వాళ్ళొచ్చింది Additional Resources కోసమే కదా!

కృ: "అన్ని యెడలను నాకు దీటైనవారు
కలరు పదిమంది డెవ్లపర్స్ ఘనులువారు
వారలొకవైపు, ఆర్కిటెక్టొక్కవైపు
కోడు చేతురు వారలబద్ధ మెందులకు
మరి ఆర్కిటెక్టో?

కోడింగు త్రోవబోవక, బుద్ధికి తోచినది ఏదో ఏదో సహాయమున్ బొనరించున్!"

రా: (తనలో తాను) "కపట నాటక సూత్ర ధారి! డెవెలపర్సందరినీ అర్జునరావుకి కట్టబెట్ట ఇతనీ పన్నాగము పన్నినాడు. ఒక మాడ్యూలైనా చేపట్టడట, కోడింగు చెయ్యడట. ఈ కంచి గరుడ సేవ ఏరికి కావలె! ఊ...!"

అ: "క్రిష్ కోరుకొమ్మందువా?"

కృ: "కోరుకొనవచ్చును కాని, నేను చెప్పిన మాటలు తుట్టదుద వరకూ వింటివో లేదో. మరొక్కసారి చెప్పెదను ఆలకింపుము.
మాడ్యులు నోనుసేయ డత డందరకూ నొక పట్ల టెక్నికల్
సాయము సేయువాడు, పెలుచన్నను పిమ్మట యెగ్గులాడినన్
దోయిలి యొగ్గెడున్, నిజము తొల్త వచించితి కోరికొమ్ము నీ
కేయది యిష్టమో కడమ యీతని పాలగునోయి అర్జునా!"

అ: (ఇతనికీ ఛందస్సులో మాట్లాడే ఓపికలేదు.) "క్రిష్ అటులైన నేను ఆర్కిటెక్టుని తీసుకొందును."

రా: (తనలో తాను) "హ...హ..హ... క్రిష్ తాను తీసిన గోతిలో తానే పడినాడు. నాకంతయూ మేలే జరిగినది". (జనాంతికముగా) "క్రిష్! ఇంక చేయునది ఏమున్నది. మిగిలిన డెవలపర్సందరినీ నేను గైకొందును. సరి, ఇక నాకు కష్టమరుతో టెలీకానుకి వేళ అయినది. ఇక నేను పోయివత్తునా? ఆ...? ఆ...!"

రాజారావు రంగస్థలం నుంచి నిష్క్రమిస్తాడు. కృష్ణారావుకి థాంక్సు చెప్పి అర్జునరావు కూడా వెళ్ళిపోతాడు.
కృష్ణారావు యథావిథిగా మళ్ళీ నిద్రకుపక్రమిస్తాడు.

తెరదించబడుతుంది.

ఆ తర్వాత కథ అందరూ ఊహించేదే! పదిమంది additional developersతో పని చేయించుకోడానికి రోజుకి మరో అయిదు గంటలు ఎక్కువ పని చేసినా రాజారావు ప్రాజెక్టు deadline దాటిపోతుంది. అర్జునరావు technical support బాధ్యతంతా ఆర్కిటెక్టుకి అప్పగించి నిశ్చింతగా తన పని చూసుకుంటాడు. ఆ ఆర్కిటెక్టు application architecture, design తయారు చెయ్యడం దగ్గర నుంచి, కొత్త developersకి training ఇవ్వడం, వాళ్ళెక్కడైనా చెయ్యలేకపోతే తనే స్వయంగా కూర్చుని వాళ్ళకి చేసిపెట్టడం,ఇలా రాత్రి పగలు "technical support" చేస్తూ ప్రాజెక్టుని అయ్యిందనిపిస్తారు. అర్జునరావుకి మరుసటి ఏడాది "Functional" అనే బిరుదుని తొలగిస్తారు. ఉద్యోగంలో విజయ రహస్యం తెలుసుకున్న అతను విజయునిగా (అనగా successful managerగా) పేరుతెచ్చుకుంటాడు.

స్వస్తి!

ముఖ్య గమనిక(లు):

ఈ నాటకం కేవలం కల్పితం. ఎవరూ భుజాలు తడుముకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇది ఏ ఒక్క వర్గాన్నీ కులాన్నీ కించపరిచే ఉద్దేశంతో రాసింది కాదని మనవిచేసుకుంటున్నాను.
అన్ని చోట్లా భారతదేశంలో Software భారత కథ ఇలాగే ఉంటుందని కూడా చెప్పలేమని సవినయంగా విన్నవించుకుంటున్నాను.


పూర్తిగా చదవండి...

Tuesday, February 24, 2009

ఇల్లరికపుటల్లుడు!


నిన్న చంద్రమోహన్ గారి బ్లాగులో శివుడు పార్వతి చేత మొట్టికాయ తిన్న సందర్భాన్ని చదివినప్పుడు, అదే హరవిలాసంలో మరో సందర్భం, మరో పద్యం గుర్తుకువచ్చింది.
శివపార్వతులు ఒకరికోసం ఒకరు తపస్సు చేసుకొని చివరికి పెళ్ళిచేసుకున్నాక, శివుడు సపరివారంగా హిమగిరిపైనే, మావగారింటనే నివాసమున్నాడట. "శివుడికి తన భార్యంటే ఎంత ప్రేమో, అలా ఇల్లరికం ఉండిపోయాడు!" అని ఆశ్చర్యపడతాడు శ్రీనాథుడు. అయితే ఆ సంబడం ఎంతో కాలం సాగదు. కొన్నాళ్ళు గడిచాక అత్తమామమలకి అతనిమీద చిరాకు కలుగుతుంది.
ఏవండీ, అల్లుడు ఒక్కడే తమ ఇంట్లో ఉండి కార్యనిర్వాహకుడై అన్నీ చూసుకుంటూ ఉంటే ఏ అత్తమామలైనా ఎన్నాళైనా అతన్ని తమ ఇంట్లో పెట్టుకుంటారు. విష్ణుమూర్తి మాత్రం ఇల్లరికపుటల్లుడు కాదూ! పాలకడలిపై శేషతల్పమున హాయిగా సంసారం సాగించుకుంటాడు కదా. అతనిమీద ఎప్పుడైనా సముద్రుడికి చిరాకు కలిగిందా? మరి హిమవంతుడికి శివుడిమీద ఎందుకొచ్చింది చిరాకు?
అసలే శివుడు బిక్షపతి! దానికి తోడు, తన పరివారాన్నంతా మావగారింత్లో దింపాడు. ఆ పరివారం ఎవరయ్యా? భూత పిశాచగణం, పశుగణమూను. వాళ్ళు చేసే భీభత్సం ఇక అంతా ఇంతానా! రాత్రీ పగలు కల్పలతాప్రసూన మాధ్వీకాన్ని తాగి తందనాలాడారు. ఇంకా చాలా చాలా గందరగోళం చేసారు. దానితో హిమవంతుడికి చిఱ్ఱెత్తుకొచ్చింది. రాదు మరీ! కానీ ఏం చేస్తాడు పాపం. తన కూతురు కోరి ప్రేమించి పెళ్ళిచేసుకున్న అల్లుడాయె! వెళ్ళి తన కూతురిదగ్గరే మొరపెట్టుకుంటాడు.
ఇలా శివుడి బంధుగణాన్నీ, శివుడినీ ఆక్షేపిస్తూ హిమవంతుడన్న మాటల్లో శివుడి ఆకారాన్ని వెక్కిరించే మాంచి అందమైన చమత్కార పద్యం ఒకటి మనకందించాడు శ్రీనాథుడు. అవధరించండి మరి:


తలమీద చదలేటి దరిమీల దినజేరు
కొంగలు చెలగి కొంగొంగురనగ
మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ
గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱు మనగ
గడియంపు బాములు కకపాలలో నున్న
భూతి మై జిలికిన బుస్సు రనగ

దమ్మిపూజూలి పునుకకంచమ్ము సాచి
దిట్టతనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని
యిట్టి దివ్యాన్నములు మెచ్చునే శివుండు!

సీసమంటే శ్రీనాథుడే అన్నదానికి ఈ పద్యం ఒక మచ్చుతునక. శ్రీనాథుడు సంస్కృతానికి "డు ము వు లు" చేర్చి తెలుగు పద్యాలు రాసేస్తాడనే వారికి ఇదో చురక. ఎంత ఒళ్ళు పులకరించి పోయే తెలుగండీ ఇది! ఆ ఎత్తుగడే ఎంత ఒయ్యారంగా ఉందో మరొక్కసారి చదివి అనుభవించండి!

శివుడు భిక్షకి వెళ్ళే సందర్భంలో ఎంత గోల గోలగా ఉంటుందో వర్ణిస్తున్నాడు.

తలమీద ఉన్న "చదల ఏరు"(అంటే ఆకాశ గంగ)లో దరిమీనులు (ఇవో రకం చేపలు) ఉన్నాయట! జుమ్మని ఎగసిపడే గంగలో చేపలేంటని చొప్పదంటు ప్రశ్నలు వెయ్యొద్దు. శివుడి తలే పెద్ద మడుగైపోయి ఉంటుంది. అందులో చేపలు చేరి ఈదులాడుకోవచ్చు కదా. వాటిని తినడానికి కొంగలతని తల చుట్టూ మూగుతున్నాయట. అవి "కొంగు కొంగు" అని చేసే గోల అంతా ఇంతానా!
మెడలోనేమో పుఱ్ఱెల మాల. శివుడు కదులుతూ ఉంటే, ఆ పుఱ్ఱెలు ఒకదానితో ఒకటి రాసుకుంటూ చేసే "బొణుగూ బొణుగూ"మనే శబ్దం ఒకటి. అంతేనా! కట్టుకున్న పులితోలు కొంగుచివర, శివుడెక్కి కూర్చున్న నందిని తాకుతూ ఉంటే అది చిరాకుతో (భయంతోనో) చిఱ్ఱుబుఱ్ఱు లాడుతోంది. చేతికి కడియాలుగా కట్టుకున్న పాములు, చేతిలో ఉన్న కకపాలలోని విభూది మీద తుళ్ళినప్పుడల్లా బుస్సు బుస్సు మంటున్నాయి. అంతా గోల గోల!
ఇంత గోలా అవుతూండగానే, "తమ్మిపూ చూలి" (అంటే పద్మంలోంచి పుట్టిన బ్రహ్మ) కపాలాన్ని ఓ చేత్తో పట్టుకొని భిక్షాందేహీ అంటూ వీధివీధి తిరిగి బిచ్చమెత్తుకొంటాడు. అలాటి ముష్టెత్తుకున్న కూడు తప్ప శివుడికి మనం పెట్టే దివ్యాన్నాలు రుచిస్తాయా?
పాపం ఎంతగా ఇబ్బందిపడ్డాడో ఆ హిమవంతుడు. లేకపోతే ఇంత ఘాటుగా తన కూతురిముందే అల్లుణ్ణి మరే మావైనా గేలిచేస్తాడా! శ్రీనాథుడికి శివుడంటే ఎంత చనువులేకపోతే ఇలాటి పద్యాలు రాయగలడు!

భక్తి, తత్త్వం, వేదాంతం, మతం ఇవన్నీ పక్కన పెట్టీండి. తమకి తెలియని, ఎన్నడూ చూడని, ఒక నిర్గుణ నిరాకార శక్తికి ఇలాటి అద్భుతమైన ఆకారాన్ని ఊహించిన కల్పనా ప్రతిభకి "ఆహా!" అనకుండా ఉండగలమా? ఒకవైపు నెలవంక, మరోవైపు నీటి బుగ్గ. నుదుటి మధ్య నిప్పు కన్ను. మెడ చుట్టూ పాములు. కట్టుకునేది పులితోలు లేదా ఏనుగుతోలు. ఒక చేత త్రిశూలం, మరో చేత ఢమరుకం. ఇలాటి కల్పన చేసినవాడు ఎంత గొప్ప కవి అయ్యుంటాడు! ఆ కల్పనకి తోడుగా మరెన్ని కథలు, ఎన్ని చమత్కారాలు, ఎన్ని కావ్యాలు!

శ్రీనాథా! నీ ఈ పద్యానికి కనకాభిషేకం చేసే శక్తి నాకు లేదు కాని, నా ఆనందాశ్రువులతో నీకు నా మనసులోనే అభిషేకం చేసాను అందుకోవయ్యా!


చిన్న ప్రశ్న: ఎత్తుగీతి చివరి పాదంలో యతి ఎలా సరిపోయిందో చెప్పుకోండి చూద్దాం?


పూర్తిగా చదవండి...

Monday, February 16, 2009

ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు...


ఏడాదైపోతోంది కదా మూసని మారుద్దామని మొన్నీ మధ్యనే అనుకున్నాను, మార్చాను కూడా. కొత్త మూస గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకో హఠాత్తుగా ఉప్పుకప్పురంబు పద్యం గుర్తుకు వచ్చింది. అరే ఈ పద్యాన్ని గురించి ఎప్పుడూ బ్లాగులో ప్రస్తావించనే లేదే అనిపించింది! తెలుగు పిల్లలందరూ మొట్టమొదట నేర్చుకొనే పద్యమాయె. దానికి సముచిత స్థానం కల్పించాలని బ్లాగు శీర్షికలో చేర్చాను.

తెలుగువాళ్ళకి ఈ పద్యం అర్థాన్ని చెప్పాల్సి వస్తే అంత కన్నా దుస్థితి మరొకటుండదు! ఇది అంత సులువైన పద్యం.

ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ

అయితే ఇందులో ఒక చిన్న విశేషం దాగుంది. నా చిన్నప్పుడెవరో (మా అమ్మగారో, మా ముత్తాతగారో అయ్యుంటారు బహుశా) చెప్పినంత వరకూ నాకీ విషయం తెలీదు. ఒక రోజు నేనీ పద్యం చదువుతూ ఉంటే ఆపి, "ఒరేయ్, ఇక్కడ రుచి అంటే అర్థమేవిటిరా?" అని అడిగారు. చిన్నతనం కదా, వాళ్ళ వంక ఓ తేలిక చూపు విసిరుంటానా ప్రశ్నకి. "రుచి అంటే taste" అని అనుంటాను, అప్పటికే నే చదువుకుంటున్న ఇంగ్లీషు మీడియం పాండిత్యం వంటబట్టి ఉంటుంది (ఈ రోజుల్లో ఇలా తెలుగు పదాలకి ఇంగ్లీషర్థాలు చెప్పి పిల్లలకి బోధపరచడం సర్వసాధారణమైపోయిందనుకోండి!). నా సమాధానానికి ఒక చిరు మందహాసం చేసి, "పప్పులో కాలేసావ్"అన్నారు. నేను తికమక మొహం పెట్టుంటాను. "రుచి అంటే ఇక్కడ కాంతి అని అర్థం. కర్పూరానికి ఉప్పు కన్నా మెరుపెక్కువ" అని వివరణ. మనదసలే లాజిక్ బుఱ్ఱ, "రుచి అంటే కాంతి అని కూడా అర్థం ఉండి ఉండొచ్చు. కాని ఇక్కడ రుచి అంటే మాములు రుచి ఎందుకవ్వదూ?" అని పాయింటు లేవదీసుంటాను. "చూడ చూడ అన్నాడు కదా వేమన. పోని అది రుచి చూడ్డం అనుకుంటే, దాన్ని మరీ అంతగా పరిశీలించి, పరిశీలించి చూడక్కరలేదు. ఒకసారి రుచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. మళ్ళీ మళ్ళీ చూడాలని చెప్పాడు కాబట్టి, అది దీక్షగా చూడ్డమే. అలా చూస్తే ఆ రెంటి మధ్యనున్న మెరుపులో తేడా తెలుస్తుంది. మామూలు కంటికి అది వెంటనే కనిపించకపోవచ్చు." అని ఓర్పుగా నాకు బోధపరిచారు.
ఇంతకీ పురుషులు, పుణ్యపురుషులు కూడా అంతే. చూడ్డానికి ఒకలాగే ఉంటారు. పరికించి చూస్తే వాళ్ళలోని భేదం కనిపిస్తుంది. ఈ తేడాని గమనించి తెలుసుకోడమే విచక్షణ.
ఆటవెలది పద్యాలు రాయాలనుకున్నవారికి వేమన పద్యాలు మంచి మూసని ప్రసాదిస్తాయి. వేమన పద్యాలన్నీ కంఠస్తం చేస్తే దాని నడక పట్టుబడుతుంది. అప్పుడు ఆటవెలది చేత అందంగా నాట్యం చేయించవచ్చు. ఆ నడక పట్టుబడకుండా రాద్దామని ప్రయత్నిస్తే బ్రేక్ డాన్సరు భరతనాట్యం చేసినట్టుంటుంది.
వేమన పద్యాలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. సంస్కృతంలో నాకు తెలిసిన ఒక అనువాదం శ్రీ శ్రీరామ దేశికన్ అనే అతనిది. ఉప్పుకప్పురంబు పద్యానికి వీరి సంస్కృత అనువాదం ఇది:

కర్పూరే లవణే చైవ రూపమేకం రుచిః పృథక్
తథైవ పుణ్యపురుషః పరస్మాత్ భిధ్యతే ధియా

నాకు సంస్కృతం రాదు కాబట్టి ఇది తెలుగు పద్యానికి ఎంత దగ్గరగా ఉందో చెప్పలేను కాని, ఇది అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ కూడా ఆటవెలదిలా చిన్న పద్యం. అందుకే ఆటవెలదిని అనువదించడానికి ఇది అనువైన ఛందస్సు.

వేమన పద్యాలకి ఒక రకమైన శాశ్వతత్వం కలగడానికి కారణం అవి చెప్పే విషయాలు కాలానికి నిలబడ్డం. అవి సార్వకాలికాలుగా అనిపిస్తాయి. ఉదాహరణకి ఈ "ఉప్పుకప్పురంబు" పద్యం ఈ ఇంటర్నెట్ యుగానికి కూడా ఎలా వర్తిస్తుందో చూడండి! మనకి ఇటీవల తెలుగు బ్లాగుల్లో ఐడీ తస్కరలు మొదలయ్యారు. వీళ్ళు రాసే కామెంటు అసలు వాళ్ళు రాసినట్టే కనిపిస్తుంది. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు. కాని చూడ చూడ, జాగ్రత్తగా పరిశీలిస్తే తేడా గ్రహించ వచ్చు. Blogger icon కనపడకపోవడం లాంటివి బాహ్యమైన తేడాలు. అవికాదు ముఖ్యం. వాటిలో ఉండే కాంతి భేదం, రుచి భేదం అదీ ముఖ్యం! అసలువాళ్ళ కామెంట్లలో సంస్కారపు వెలుగుని చూడగలం. డూప్లికేటు వాళ్ళ కామెంట్లలో అది కొరవడుతుంది. విచక్షణ ఉన్న బ్లాగర్లు దీన్ని గుర్తించగలరు.
అంచేత ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, దొంగ ఐడీలతో రాసే వ్యాఖ్యలని ఇట్టే పసిగట్ట వచ్చు. ఈ పద్యం అర్థం చేసుకుంటే ఎవరూ దొంగ ఐడీలతో వ్యాఖ్యలని రాసే ప్రయత్నం చెయ్యరు కూడా! ఎందుకంటే ఎంత ప్రయత్నించినా ఉప్పు కర్పూరం కాలేదు కదా! ఒక వేళ పెరిగిన టెక్నాలజీతో ఉప్పుకికూడా మెరుపుని తెద్దామని ప్రయత్నించినా అదీ వృధాయే. చిన్న నిప్పు కణిక అంటిస్తే తేడా ఇట్టే తెలిసిపోతుంది. ఉప్పు టప్పుటప్పు మంటూ పేలిపోయి తుళ్ళిపోతుంది. కర్పూరం తాను కరిగి మరింత వెలుగుని విరజిమ్ముతుంది. ఇక్కడ కూడా వాటి రుచుల(కాంతుల) జాడ వేరే!
చెడుని వేరుచెయ్యడానికి విచక్షణకి మించిన ఆయుధం లేదని ఈ వేమన పద్యం చెప్పే నీతి.


పూర్తిగా చదవండి...

Sunday, February 8, 2009

Digital Library లో విశ్వనాథ + నా సోది


సి.బి.రావుగారి బ్లాగులో ఈ మధ్య విశ్వనాథ గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించడం, దాని గురించి వాదనలు చెలరేగడం కొంతమందికి తెలిసే ఉంటుంది. సి.బి.రావుగారు విశ్వనాథ భావజాలం గురించి రాద్దామనుకుంటున్నానని, Digital Libraryలో విశ్వనాథ రచనలకి లంకెలిమ్మని అడిగారు. DLIలో విశ్వనాథ రచనలు చాలా కొద్దిగానే ఉన్నాయి. అయినా అవి అక్కడ వ్యాఖ్యగా ఇవ్వడానికి ఎక్కువే! అంచేత ఇదిగో ఇలా నా బ్లాగులో టపాగా పెడుతున్నాను. ఇవి విశ్వనాథ రచనలు, విశ్వనాథ రచనలగురించిన ఇతర రచనలు.
విశ్వనాథ భావజాలాన్ని అర్థం చేసుకోడానికి "నా రాముడు" అన్న అతని రచన బాగా ఉపయోగపడుతుంది. అది DLIలో లేదు.
DLIలో ప్రస్తుతం ఉన్న పెద్ద అసౌకర్యం, పుస్తక వివరాలలో ఒక consistancy లేకపోవడం. విశ్వనాథ రచనల గురించి వెతకాలంటే, Author అన్న దాన్లో "visvanatha", "viswanatha", "vishwanatha", "viswanadha" ఇలా రకరకాల పదాలతో వెతకాలి. అంచేత నాకు కనపడనివి ఇంకా ఏమైనా ఉండవచ్చు. DLIలో మరొక అసౌకర్యం, పేజి పేజీ Download చేసుకోవాలి.

విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు
కావ్యపరీమళము
లలితాపట్టణపు రాణి
శ్రీకుమారాభ్యుదయము
వల్లభమంత్రి
అల్లసానివని అల్లికజిగిబిగి
ఏకవీర
శ్రీమద్రామాయణ కల్పవృక్షము-యుద్ధకాండము
విష్ణుశర్మ ఇంగ్లిషు చదువు
విశ్వనాథ మధ్యాక్కరలు
ఆంధ్ర ప్రశస్తి
శ్రీమద్రామాయణ కల్పవృక్షము : కిష్కింధ కాండము వొల్.4
కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్ళి
మా స్వామి(విశ్వేశ్వర శతకము)
విశ్వనాథ జీవిత సమగ్రము
విశ్వనాథ నవలలు మనస్తత్వచిత్రణ
విశ్వనాథ సాహిత్య దర్శనం
విశ్వనాథవారి_భక్తి-దేశభక్తి
జ్ఞానపీఠ విశ్వనాథ శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కావ్య వైభవము
విశ్వనాథ శబరి

సరే, ఎలాగూ టపా రాస్తున్నాను కాబట్టి నా సోది కూడా కొంత చెప్పుకుందామనుకున్నాను.
విశ్వనాథ కవిత్వం రాసారు, గేయాలు, పద్యాలు. కథలు రాసారు. నవలలు, నాటకాలు, విమర్శ వ్యాసాలు రాసారు. నేనన్నీ చదవలేదు. చదివిన వాటిలో అన్నీ నచ్చలేదు. విశ్వనాథ నవలలు, కొన్ని కథలూ నాకూ నచ్చలేదు, ముఖ్యంగా అతని శైలి. అతను చేసిన విమర్శతో నేను పూర్తిగా ఏకీభవిస్తాననీ చెప్పలేను. నేను విశ్వనాథని అభిమానించేది కవిగా. నా ఉద్దేశంలో విశ్వనాథ సహజంగా కవి. ఇతర ప్రక్రియలలో కూడా అతని కవిత్వ గుణం చొచ్చుకు రావడం వల్ల వాటి స్థాయి తగ్గిందని నా అభిప్రాయం.
కవిగా మాత్రం అతని స్థాయి చాలా గొప్పదని నా నిశ్చితాభిప్రాయం. దీని గురించి వివరంగా మరో సారి.

అయితే, కవిత్వాన్ని ఆస్వాదించడంలో రెండు రకాలు. ఒకటి కవి చెప్పే విషయం మనసుకి దగ్గరైనదైతే దాని మీద సహజంగా ఇష్టం ఏర్పడుతుంది. అలానే ఆ కవి భావజాలం ఇష్టం లేకపోతే ఆ కవిత్వాన్ని ఆస్వాదించ లేరు. ఇలాటి సందర్భంలో విమర్శ చేసేటప్పుడు, కవిత్వం (శైలి, రూపం వగైరాల) జోలికి పోకుండా, విమర్శ భావజాలానికి పరిమితమై ఉండాలి.
ఇక రెండవది, కవి భావజాలంతో ప్రసక్తి లేకుండా అతని కవిత్వాన్ని ఆస్వాదించగలగడం, లేదా అది నచ్చకపోవచ్చు. ఇలాటి సందర్భంలో అతని భావజాలం ప్రసక్తి తేకుండా కేవలం అతని కవిత్వ రూపాన్ని గురించిన విమర్శ సరిపోతుంది. నాకంటూ ఒక ప్రత్యేక భావజాలం లేదు (అని నేననుకుంటున్నాను) కాబట్టి సాధారణంగా నా ఆసక్తి కవిత్వాన్ని భావజాలంతో సంబంధం లేకుండా ఆస్వాదించడం, విమర్శించడం. నాకు విశ్వనాథా ఇష్టమే, గురజాడ ఇష్టమే, శ్రీశ్రీ ఇష్టమే. వాళ్ళ రచనలని చదివి నేను ఆనందించగలను.
వస్తు రూపాల రెంటి గురించీ విమర్శ చేసినప్పుడు అది నిజానికి సమగ్రమైన విమర్శ అవుతుంది. అయితే అలా చెయ్యాలంటే ఆ భావజాలం గురించిన మంచి అవగాహన ఉండాలి. లేకపోతే అది పొగడ్తగానో తెగడ్తగానో మిగిలిపోతుంది తప్ప ఉపయోగకరమైన విమర్శ అవ్వదు. అయితే, ఈ భావజాలం గురించి చేసే విమర్శ గురించి నాకు అంత సదభిప్రాయం లేదు. ఎందుకంటే, ఇది విమర్శ చేసే వ్యక్తి భావజాలమ్మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది కాబట్టి.

ఉదాహరణకి విశ్వనాథపై వచ్చిన విమర్శనే తీసుకుందాం. నార్లవంటి వారు, ఇతర అభ్యుదయవాదులు (ఆవంత్స సోమసుందర్ వంటివారు కూడా) విశ్వనాథని సాంప్రదాయవాది, తిరోగమనవాది అన్నారు. ఇక్కడ సౌలభ్యం కోసం Rationalistsని కూడా అభ్యుదయవాదూల లెక్కలోకి తీసుకున్నాను. జి.వి.సుబ్రహ్మణ్యం వంటి వారు విశ్వనాథది నవ్య సాంప్రదాయం అన్నారు. ఈ రెండు విమర్శలూ రెండు వేర్వేరు దృక్పథాల నుండి చేసినవి.
వేదాలు, పురాణాలు, కావ్యాలు మొదలైన ప్రాచీన భారతీయ సంప్రదాయానికి చెందిన సమస్త సాహిత్యం పూర్తిగా మానవ సమాజానికి హానికరమని, వాటిలో మంచి ఏమాత్రమూ లేదని అభ్యుదయ వాదుల నమ్మకం. అంచేత వాటిని విలువైనవని భావించే ఎవరైనా వాళ్ళ దృష్టిలో తిరోగమన వాదులే.
జి.వి. సుబ్రహ్మణ్యం వంటి వారు సంప్రదాయాన్ని పూర్తిగా తిరస్కరించ లేని వాళ్ళు. సంప్రదాయంలో కూడా మంచి కొంచెమైనా ఉందని దాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నదని భావించే వారు. అంచేత విశ్వనాథ వాళ్ళకి "నవ్య" సాంప్రదాయ వాదిగా కనిపించారు. విశ్వనాథ సంప్రదాయంలోని నవ్యత వాళ్ళకి కనిపించింది. సంప్రదాయంలోని మంచిని గ్రహించి, చెడుని విడిచిపెట్టి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పడమే విశ్వనాథ భావజాలం అని జి.వి. సుబ్రహ్మణ్యం గారు నిరూపించడానికి ప్రయత్నించారు.
ఈ రెండు రకాల విమర్శలలోని ఏది సరైనది అంటే, దానికి జవాబు లేదు. "అభ్యుదయ వాదుల" భావజాలం నచ్చిన వాళ్ళకి వాళ్ళ విమర్శ సరైనదనిపిస్తుంది. సంప్రదాయమ్మీద గౌరవం ఉన్నవాళ్ళకి రెండవ వాళ్ళ విమర్శ నచ్చుతుంది. ఇక్కడవరకూ బాగానే ఉంది. నాకు హాస్యాస్పదంగా కనిపించే విషయం ఏవిటంటే, ఒకరు మరొకరి విమర్శ తప్పనడం, అది తప్పని ఋజువు చెయ్యబూనడం. ఇది పూర్తిగా నిరర్థకమైన పని! మరొక దురదృష్టకరమైన విషయం ఏవిటంటే, భావజాల విమర్శ పేరుతో కవిత్వ రూప విమర్శకి, ఇంకా ముందుకి వెళ్ళి వ్యక్తి దూషణకీ దిగడం.
సద్విమర్శకీ, కువిమర్శకీ తేడా సి.బి.రావుగారు తన బ్లాగులో లేటెస్టుగా పెట్టిన నార్లగారి విమర్శ, అంతకుముందు రెండు విమర్శలు. నార్లవారిది సద్విమర్శ. మరికొంత వివరంగా ఉంటే ఇంకా బావుండేది. దీనితో నాకు విభేదమూ లేదు, అంగీకారమూ లేదు. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు నాకు "భావజాల" విమర్శ మీద (దాని ప్రయోజనమ్మీద) సదభిప్రాయం లేదు.

భావజాలాన్ని గురించి మరొక రకమైన విమర్శ కూడా ఉంది. అది మార్క్సిస్టు విమర్శ. గతి తార్కిక భౌతిక వాదాన్ని సాహిత్య విమర్శలో ఉపయోగించడం. కొన్ని పరిమితులున్నా, ఇది సాహిత్య విమర్శని నిస్సందేహంగా పరిపుష్టం చేసింది. అయితే దీని ద్వారా సాహిత్యాన్ని "విలువ" కట్టడం కుదరదు. ఒక రకమైన సాహిత్యం వెలువడడానికి కారణమైన సాంఘిక, చారిత్రక, ఆర్థిక పరిస్థితుల గురించి విశ్లేషించేది మార్క్సిస్టు విమర్శ. నాకు తెలిసి విశ్వనాథ సాహిత్యం గురించి అటువంటి విమర్శ రాలేదు. అది దురదృష్టకరం. విశ్వనాథ మొదట్లో అభ్యుదయ భావాలు కనపరచినా, పోను పోను కరుడుగట్టిన సంప్రదాయవాదిగా మారిపోయారని చాలామంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. మార్క్సిస్టు విమర్శ గురించి క్షుణ్ణంగా తెలిసిన విమర్శకులు కూడా, విశ్వనాథలోని ఆ మార్పుని అతని వ్యక్తిత్వానికి వదలిపెట్టేసి అతన్ని తిరోగమనవాది అని ఊరుకున్నారు కాని, అటువంటి మార్పు వెనకనున్న కారణాలని సహేతుకంగా విశ్లేషించే ప్రయత్నం చెయ్యలేదు, నాకు తెలిసి. అలాటి విమర్శ, ఆనాటి సామాజిక సాహిత్య వాతావరణం గురించి మరింత లోతుగా తెలుసుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది.
సి.బి. రావుగారు చెయ్యాలనుకొంటున్న విశ్లేషణ ఆ దిశగా సాగితే బావుంటుంది.


పూర్తిగా చదవండి...