తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, January 24, 2009

కేశంతో క్లేశం!


ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోయిన కాలంలో, మనిషికి జుత్తు తెల్లబడడం అన్నది ఒక సమస్యగా ఉండేది కాదనుకుంటాను. ముసలితనంతో బాటే, ఆ ముసలితనానికి సూచనగా మాత్రమే రావడమూ, పెద్దరికానికి గుర్తుగా గౌరవంగా ఉండడమూ అందుకు కారణం కావచ్చు. అందుకే "తల పండడం" అంటే అనుభవంలోనో జ్ఞానంలోనో పరిపక్వత కలగడం అనే సదర్థంలో వాడేవారు. ఈ కాలంలో పండిన తలబట్టి జ్ఞానాన్ని కాదు కదా కనీసం వయసునైనా అంచనా వెయ్యడవంతటి బుద్ధితక్కువ పని మరొకటి ఉండదు!
పండితే పండింది కాని, తెల్లని కాంతులీనుతూ నిగనిగలాడే జుత్తు మహా అందంగా ఉంటుంది. దాన్ని మన కవులు మరింత అందంగా వర్ణిస్తూ ఉంటారు.

తెల్లగా పండిన శబరి జుత్తుని విశ్వనాథ ముగ్గుబుట్టతో పోల్చారు. రాముడు శబరి ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించి, కుశల ప్రశ్నలు వేస్తూ, "అవ్వ! నీ తలంతా ముగ్గుబుట్టలా అయ్యిందేవిటీ?" అంటాడు.
దానికి శబరి, "ప్రభువ! నీ ఆత్మ వాకిట రంగవల్లి పెట్టడానికే ఇంతగా పండింది" అని జవాబిస్తుంది!
సగం సగం పండిన జుత్తుది మరో సొగసు. వ్యాసుడు కాశీమీద కోపంతో తన భిక్ష పాత్రని విసిరికొట్టినప్పుడు, అతనికి గడ్డిపెట్టడానికి పార్వతీదేవి ఒక ముత్తైదువు రూపంలో వస్తుంది. ఆ వచ్చే దేవిని శ్రీనాథుడు ఇలా వర్ణిస్తాడు:
"వేనలి పాటపాట నరవేండ్రుకతో తిల తండులాన్వయ
శ్రీ నటియింప..."
ఆమె వెండ్రుకలు బియ్యం నువ్వులూ కలబోసినట్లున్నాయిట! దేవతలకైతే ముసలితనం లేదు కాబట్టి వాళ్ళ జుత్తెప్పుడూ నల్లగానే ఉంటుంది (ఇందుకు దేవ మునులు, ఋషులు మినహాయింపు :-). కానీ ఇక్కడ అమ్మవారు ముత్తైదువ రూపంలో వచ్చింది కాబట్టి ఆవిడ జుత్తుకూడా నెరిసిందన్నమాట!
పండు జుత్తు గురించీ, పండే జుత్తు గురించీ మన కావ్యాల్లో ఎలాంటెలాంటి వర్ణనలున్నాయో మరి కొంచెం లోతుగా పరిశీలించాలి.

ఇంతకీ, ఇప్పుడీ కేశోపాఖ్యానం మొదలెట్టడానికి ప్రేరణ ఇదిగో మన కొత్తపాళీగారి మీసము దిద్దరుగా అన్న టపా. పాపం అతని కళ్ళు బైర్లు కమ్మిన ఆ సంఘటన చదివేసరికి అలాటి సంఘటనే మరో కవికి కూడా కలిగిన విషయం గుర్తుకొచ్చింది. తన బాధని నలుగురితో పంచుకోడానికి కొత్తపాళీగారు టపా రాసినట్టే, ఆ కవిగారు ఏకంగా ఒక కావ్యమే రాసారు! దాని పేరు "పలిత కేశం". ఆ కవి దువ్వూరి రామిరెడ్డి. ఆ సందర్భాన్ని అతనిలా వివరించారు:

దారింబోయెడు బాటసారి యితర ధ్యానంబునందుండ, గా
ల్జారన్ మేల్కను రీతి నా మనసు స్వేచ్ఛాపుష్పకంబెక్కి ది
క్పారంబుల్ కడముట్టుచుండగ హఠాద్భంగంబు చేకూరె; గ
న్నారం గాంచితి దెల్లనైన యొక కేశాంకూరమున్ మీసలన్

భరముగ గుండెలో నెగిరిపడ్డటు లయ్యెను; జవ్వనంపు బం
గరుకలలెల్ల రెక్కలెదుగం బరతెంచెడు పక్షిశాబముల్
కరణి గులాయమున్ విడుట కన్నులగట్టె; క్షణంబునన్ మనో
హరమగు జీవితాంబరము నంబుదకశ్మలమై కనంబడెన్

విరియు రేకుల మంచుతుంపరులు బార
బ్రొద్దువొడుపున జలిగ్రాగు పూవునందు
జీడపురు వొండు చేరిన జాడ తోచె
మీసమున దెల్లవెంట్రుక మోసుగాంచ

పాపం అంతేనా, ఇంకా చూడండి దువ్వూరివారి బాధ. కొత్తపాళీగారికి ఇలాటి బాధ ఉన్నదో లేదో మరి :-)

చెలియది గాంచినం బరిహసించునొయేమొ! జపా సుమాంతరో
జ్వల మధురాధరాంచల లసన్మృదుహాసము మందగించునో!
యలకువచూపి వచ్చె ముసలాతడటన్న నిరాకృతిన్ ననుం
జులకన సేయునో యనుచు స్రుక్కి నిమేషము ధైర్యమూనితిన్

ఏమి పొరపొచ్చె మెరుగక యిన్నినాళ్ళు
ఆలుమగలము దాంపత్య మనుభవింప
బానకములోన బుడకట్లు వచ్చినావె
తెల్లవెండ్రుక, నీ తస్సదియ్య! నేడు

దాంతో కవి దాన్ని కత్తెరతో టపీ మనీ కత్తిరించెద్దామనుకుంటాడు. అప్పుడా పలితకేశం అతని కత్తెరకి దొరక్కుండా తప్పించుకొని, అతనితో సంభాషించడం మొదలు పెడుతుంది!

నేడు ఛేదించితివి, రేపు చూడు నన్ను
దొలువిధంబున మోసెత్తి తొంగిచూతు
బృథివి జనులకు గాలంబు వేయుచున్న
ప్రశ్న గుర్తును, బదులేమి పలుకగలవు?

అని నిలదీస్తుంది! నేను నీ శత్రువునికాదు మిత్రమునే అనికూడా అంటుంది. చీకట్లో కళ్ళు కనిపించని వాడికి నేను వెలుగు చూపిస్తాను అనికూడా అంటుంది! అయినా మన కవిగారి కోపం తగ్గదు.

అనియిటు ప్రేలెడు వెంట్రుక
తునుకంగని యంటి "నోసి తోరపు గర్వం
బున దేవదూత వీవే
యనుకొని రక్షించు మాటలాడెద వరెరే!

అని తిరస్కారంగా మాట్లాడతాడు.

"...మిమ్ము ననగూడదు గాని కవీశ్వరులౌట; మీ
రనినటు నేను నల్పతరమైన, ననుం బరిమార్పలేని మీ
ఘనతయు బుద్ధివైభవ వికాసము లంతకు దక్కువే గదా?"

అని ప్రశ్నించేసరికి కవి అవాక్కవుతాడు. దానితో,

కనుమోయీ, యిల రాజ్యభోగములు సౌఖ్యంబుల్ గృహారామముల్
ధన ధాన్యంబులు బంధుమిత్రులును గాంతాపుత్ర సౌభాగ్యముల్
పొనరన్, సర్వము శాశ్వతంబని తృషా లోలాంతరంగంబులన్
దినముల్ పుచ్చెడు మూఢ మానవునకున్ దీపంబు నందిచ్చెదన్

అని ఆ కేశం తత్త్వ బోధ మొదలుపెడుతుంది.

ఆసలుపెంచి తీర్చుకొన నర్థము నెట్టులొ సంగ్రహించు నా
యాసముతోడ జీవితము నంతయు బుత్తువు; నీదు చర్య వ్య
త్యాసము లేని యంత్రగతియౌ; జననంబును బెండ్లి బిడ్డలున్
గ్రాస నివాస; మంత దుదగాంచు జరిత్రము మృత్యుపూర్తిగన్

ఎంతమంది ఎన్ని మార్లు బోధించలేదీ తత్త్వం, అయినా అది నిత్య సత్యమై ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది! తత్త్వం చెప్పి ఊరుకోకుండా, కొంచెం హితబోధ కూడా చేస్తుంది:

దినమున కొక్క పూటయిన దిండికి లేక దరిద్ర మానవుల్
వనరుచునుండ నీ ధనము వాసనకట్టు బిగించికట్టి యే
యనుభవ మొందబోయెదవొ? యందర బీదల వేడియూర్పులం
దనరు దవాగ్ని నీ బ్రతుకు దగ్ధముసేయదె యొక్క పెట్టునన్!

ఇలా బోధ చేసుకుంటూ పోతున్నప్పుడు హఠాత్తుగా కవిగారికి ఒక విచిత్రమైన స్పృహ కలిగిందని నా కనిపిస్తుంది. ఇక్కడ ఈ హితబోధ ఎవరు ఎవరికి చేస్తున్నారు? కవిగారి మీసంలోని తెల్లవెంట్రుక కవికి చేస్తోంది. కాని నిజానికి ఆ వెంట్రుక గొంతులో ఆ మాటలు పలికిస్తున్నది కవే కదా! కవి పాఠకులకి చేస్తున్న హితబోధా ఇది? ఇలాంటి స్పృహ కవికి కలిగేసరికి ఒక్కసారి ఉలికిపడినట్టునాడు. ఇది పాఠకులకే కాదు, తనకి కూడా అనే ఆలోచన వచ్చిందిలా ఉంది! ఎందుకంటే, ఆ పలితకేశం మాటల్లో ఏం అంటున్నాడో చూడండి:

ఈ ప్రబోధమెల్ల నితరులకేయని
యనకు, నీకు సైత మన్వయించు;
బరహితోపదేశ పాండిత్యమని యెంతు
వేని, దాన నాకు హాని లేదు.

కవిగారికి ప్రత్యేకమైన బోధ ఉండాలి కదా. అంచేత ఆ పలితకేశం ఇలా కూడా అంటుంది:

పదిపదునాల్గువర్షముల పాటు కలంబును ముట్టకే సుఖా
స్పదమును నిర్విచారమగు వ్యర్థపు సోమరిజీవితంబు నీ
కొదవెను; నేనుగూడ మొనయొత్తితి; నిద్దుర మేలుకొమ్ము; నీ
యెద జిగిరించు భావములకిమ్ము మనోహర రూప సంపదల్

ఇలా ఉపదేశించిన ఆ పలితకేశనికి, ఎంతైనా కవి కదా, అతను దీటైన జవాబే ఇస్తాడు!

జననమొందిన ప్రాణికి జావు నిజము;
చావు చావని భయపెట్టలేవు నన్ను;
జావకే యుండినన శిలాశాశ్వతముగ
దాతముత్తాత లెచ్చట దాగినారు?

అని ధీమాగా అంటాడు. అంతేకాదు
"పరము సత్యంబె యైనను బరము కొరకు
నిహ సుఖంబుల బలియీయ నేల చెపుమ?"

అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఇది ఉమర్ ఖయాము తత్త్వం. దీనికి దేశభక్తిని కూడా జోడించి ఇలా అంటాడు కవి:

ఇహపరంబుల రెంట గ్రహింప గలుగు
నఖిల సుఖదుఃఖముల నేను అనుభవించి
పుట్టెదను మళ్ళి మా మాతృభూమియైన
భారతాఖండమండల భవ్య సీమ

ఉపనిషత్సార సందేశ ముజ్జ్వలాసి
కఠిన ధారాతళత్తళల్ గలసి పారు
నమృత గీత స్రవంతి రూపందుకొన్న
ఆర్యభువి మృత్యుభీతి నింద్యంబుగాదె?

ఇప్పుడిప్పుడె ముక్తి నే నిచ్చగింప
ఎన్ని కోటుల యేండ్లొ యీ పృథివి ప్రబలు
వేయి మార్లైన జన్మింప వీలుపడిన
బ్రతి తడవ గోరుకొందు నీ పావనోర్వి

అన్నికోట్ల ప్రజలు బద్ధులై శ్రమింప
నేను మాత్రము ముక్తి వాంఛింపనేమి?
అవయవంబులు కొన్ని దేహంబునందు
బ్రమదమొందునె మిగతవి బాధపడగ?

ఈ చివరి పద్యంలోని భావన అత్యద్భుతం!
దానితో ఈ కావ్యం పూర్తయితే దీని కవిత్వ విలువ మరింత పెరిగేది. కాని దురదృష్టవశాత్తూ అది జరగలేదు. స్వర్గ నరకాల గురించీ, ఆధునిక నాగరకత గురించీ చర్చ మొదలై చాలా సుదీర్ఘంగా సాగుతుంది. కవిత్వం పలచబడి (కనుమరుగై అనికూడా అనుకోవచ్చు!) సిద్ధాంత చర్చ విజృంభిస్తుంది. కవి విశ్వరూపం దాల్చి కవిత్వాన్ని మింగేసాడు! అయితే తాత్త్విక సిద్ధాంత చర్చ యిష్టమైన వాళ్ళు దీన్ని చదివి ఆనందిస్తారేమో!
మొత్తానికి కుక్కపిల్లా, సబ్బుబిళ్ళే కాదు తెల్ల వెంట్రుక కూడా కవితకి అనర్హం కాదని ఈ కావ్యం నిరూపించింది.

7 comments:

  1. భలే భలే .. నెరిసిన వెండ్రుక ఇంత పని చేస్తుందనుకోలేదు.
    బహుబాగు!!

    ReplyDelete
  2. విశ్వనాధవారు మీ పోస్టులోంచి తొంగిచూస్తూ, నీవల్లకాదురా అబ్బాయ్ అని వెక్కిరిస్తున్నారు. :-)

    ReplyDelete
  3. ఆ వెక్కిరిస్తున్నది నన్నేనండోయ్, తప్పుగా అనుకొనేరు.

    ReplyDelete
  4. కామేశ్వర రావు గారు,
    మీసం మీద ఇంత గ్రంధం నడిచిందని ఇప్పుడే తెలిసింది, నెనరులు..

    ReplyDelete
  5. భైరవభట్ల గారు,

    కొత్త టెంప్లేటు చాలా బాగుంది. :)

    యోగి

    ReplyDelete
  6. "కవి విశ్వరూపం దాల్చి కవిత్వాన్ని మింగేసాడు!"
    ROFL

    ReplyDelete
  7. విశ్వనాథవారి చమత్కారం చాలా బావుంది. రంగవల్లికలు వేయడానికి ముగ్గుబుట్టగా మారిందా! ఏం భావుకుడు విశ్వనాథవారు!

    శ్రీనాథుడి పద ప్రసిద్ధ ధారా సిద్ధి సంగతి వేరే చెప్పనవసరం లేదు.

    ఇక దువ్వూరి వారు. తెల్లవెండ్రుకతో మొదలయినది ఏదో సరదాగా ఉంటుందేమో అనే చదువుతాము. నాకైతే ఉపన్యాసం ఏమిటేమిటో ఇస్తోందే ఈ పలితకేశమూ అనిపించింది.

    ఘనమైన (ఆధ్యాత్మిక) విషయాలు ప్రతిపాదించడానికి చర్చించడానికీ తెల్లవెండ్రుకలాంటి వాటితో ప్రారంభం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది అనడానికి ఇది చక్కటి ఉదాహరణ!

    ReplyDelete