తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, February 7, 2011

ఉదంకుడి కథ - 3

దేవ మనుష్య లోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం
భావిత శక్తిశౌర్యులు నపార విషోత్కట కోప విస్ఫురత్
పావక తాపి తాఖిల విపక్షులు నైన మహానుభావు లై
రావత కోటి ఘోర ఫణిరాజులు మాకు ప్రసన్నులయ్యెడున్

నాగ వంశంలో అనంతుడు, వాసుకి తర్వాత శక్తివంతుడైన నాగరాజు ఐరావతుడు. అతని వంశం వారిని ఐరావతులంటారు. ఇరావతి అనే నది దగ్గర నివసించేవారు కాబట్టి వీరు ఐరావతులయ్యారని కొంతమంది ఊహ. అర్జునుడి భార్య ఉలూచి నాగ కన్య. ఆమె ఐరావత వంశానికి చెందినదే. ఉలూచికి పుట్టిన కొడుకు పేరు ఇరావంతుడు!

ఈ నాగ స్తోత్రంలో నన్నయ్య ఒక చక్కని ప్రణాళికని అనుసరించాడనిపిస్తుంది. ముందుగా వైకుంఠవాసుడైన అనంతుడిని, ఆ తర్వాత కైలాసవాసుడైన వాసుకిని స్తుతించి అప్పుడు దేవ మనుష్య లోకాలలో తిరుగాడే ఐరావతులని స్తుతించాడు. చివరిగా కేవల భూ సంచారి అయిన తక్షకుడిని స్తుతించాడు. సంస్కృత భారతంలో ఉదంకుడు ఐరావత తక్షకులని మాత్రమే స్తుతించినట్టుగా ఉంది. ఈ ఐరావతులు చాలా ప్రతాపవంతులు, శక్తివంతులు, శూరులు. అపారమైన విషంతో కూడిన కోపాగ్నిలో శత్రువులని కాల్చేస్తారు. అలాంటి భీకర సర్ప రాజులైన ఐరావతులు తనకి ప్రసన్నమగుగాక అని ప్రార్థిస్తున్నాడు ఉదంకుడు.

గోత్రమహామహీధర నికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుడై
ధాత్రి బరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షు డీక్షణ
శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు బ్రసన్నుడయ్యెడున్

పైన చెప్పిన ప్రణాళిక పద్య నిర్మాణంలో కూడా గమనించవచ్చు. "బహువన పాదపాబ్ధి..." అంటూ సమాసబంధురంగా మొదలుపెట్టిన ఆ పద్య రచనని ఈ పద్యంతో ఒకసారి పోల్చిచూడండి. ఈ నాలుగు పద్యాలూ ఒకదానికన్నా ఒకటి బిగువు తగ్గుతూ వస్తాయి. చెప్పే వస్తువులోని గురుత్వాన్ని, సమాసబంధురతతో ధ్వనింపజెయ్యడం నన్నయ్య ప్రవేశపెట్టిన ఒకానొక పద్యశిల్పం.

మహీధరము అంటే కొండ. భూమిని అవి మోస్తున్నాయి కాబట్టిట! గోత్ర మహీధరములు అంటే కులపర్వతాలు. భూమిని మోస్తున్న పర్వతాలలో ముఖ్యమైనవివి. ఇవి ఏడు. మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము. ఈ ఏడు పర్వతాలలోను అనేక అడవులు (విపినములు), పొదరిళ్ళు (నికుంజములు) ఉంటాయి. అక్కడా, కురుక్షేత్రంలోను, ఇలా నానా ప్రదేశాలలోనూ భూమి అంతటా స్వేచ్ఛగా అశ్వసేనుడితో కలిసి విహరిస్తూ ఉంటాడట తక్షకుడు. అశ్వసేనుడు తక్షకుడి కొడుకు. గొప్ప బలము, గర్వము, పరాక్రమము కలిగినవాడీ తక్షకుడు. ఈక్షణశ్రోత్రము అంటే పాము. ఈక్షణమంటే కన్ను. శ్రోత్రమంటే చెవి. అంటే కన్నులే చెవిగా కలిగినది. పాముకి ఇతర జంతువుల్లా చెవులుండవు. బూరా ఊదితే పాము నాట్యమాడేది నిజానికి ఆ బూరా ఊదేవాడి కదలికల బట్టి కాని ఆ శబ్దం విని కాదు. ఈ పేరు పాముకి అందుకు వచ్చింది. సంస్కృత భాషలో ఒకే వస్తువుకి అనేక పర్యాయపదాలు ఉండడానికి కారణం వాళ్ళు ఆయా వస్తువులని అన్ని రకాలుగా దర్శించి అర్థం చేసుకొని దానికి తగిన సంజ్ఞలని ఏర్పరచడం వల్లనే! సంస్కృత భాష వస్తే భాషాజ్ఞానంతో పాటు వస్తుజ్ఞానం కూడా కలుగుతుందన్న మాట.

నాగరాజులందరినీ ఉదంకుడిలా స్తోత్రం చేసినా ఎలాంటి ప్రయోజనమూ కలగలేదు. అయితే అంతలోనే ఉదంకుడికి ఒక విచిత్రమైన అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక ఇద్దరు స్త్రీలు నలుపు తెలుపు దారాలతో ఒక వస్త్రాన్ని నేస్తూ ఉన్నారు. ఆ పక్కనే పన్నెండు అడ్డ కఱ్ఱలతో (spokes) ఉన్న ఒక చక్రాన్ని తిప్పుతూ ఆరుగురు కుఱ్ఱవాళ్ళు కనిపించారు. ఆ పక్కనే ఎత్తైన గుఱ్ఱాన్ని అధిరోహించిన మహా తేజోవంతుడయిన ఒక దివ్యపురుషుడు కనిపించాడు. అతన్ని చూసి ఉదంకుడు విశేష మంత్రాలు చదువుతూ భక్తితో స్త్రోత్రం చేస్తాడు. అప్పుడా దివ్యపురుషుడు ప్రసన్నుడై, నీ కోరికేమిటో చెప్పు నెరవేరుస్తానని అంటాడు. ఉదంకుడెంతో సంతోషించి, నాగులందరూ తనకి వశమై తన కుండలాలు తనకి తిరిగి ఇచ్చెయ్యాలని కోరుకుంటాడు. అప్పుడా దివ్యపురుషుడు అలా అయితే ఈ గుఱ్ఱం చెవిలో ఒక్కసారి ఊదమంటాడు. ఉదంకుడలాగే ఊదుతాడు. అంతే ఒక్కసారిగా:

పాతాళైక నికేతనాంతరమునన్ బర్వెం దదశ్వాఖిల
స్రోతో మార్గ వినిర్గతోగ్ర దహనార్చుల్, పన్నగవ్రాతముల్
భీతిల్లెన్, భుజగాధినాథు మనమున్ భేదిల్లె, గల్పాంత సం
జాత ప్రోద్ధత బాడబానల శిఖా శంకాధి కాతంకమై

విశేషమైన పద్యాలని సందర్భానికి తగ్గట్టు చెక్కడంలో మహాకవులు ఎంతటి శిల్పనిర్మాణ నిపుణులో ఇలాంటి పద్యలు పరిశీలిస్తే తెలుస్తుంది. పద్యం ఎత్తుగడ ఎలా ఉంది, మధ్యలో ఎలా సాగి, చివరికి ఎలా పూర్తయ్యింది, ఆసక్తి ఉన్నవారు జాగ్రత్తగా గమనించండి.

కల్పాంతమంటే మహా ప్రళయకాలం. అలాంటి ప్రళకాలంలో పుట్టి ప్రజ్వరిల్లుతున్న బడబానల జ్వాలలేమో అన్నంత భయంకరంగా పుట్టాయి ఉగ్ర దహనార్చులు. అంటే తీవ్రమైన అగ్నిజ్వాలలు. ఎక్కడ నుండి పుట్టాయి? ఆ ఆశ్వ అఖిల (సర్వమైన) స్రోతో మార్గము (ఇంద్రియ మార్గమైన అవయవాలు, దేహము) నుండి. అలా పుట్టిన ఆ జ్వాలలు పాతాళలోకమనే భవనమంతటా వ్యాపించాయి. దానితో సర్పాలన్నీ భయంతో వణికిపోయాయి. నాగరాజు గుండె బద్దలయింది. దండం దశగుణం భవేత్ అన్నట్టు ఆ దెబ్బకి తక్షకుడు లొంగాడు:

శంకర నిభుడగు విప్రు భ
యంకర కోపాగ్ని యొక్కొ యనుచున్ జాతా
తంకుడయి కుండలంబు లు
దంకునకును దెచ్చియిచ్చె దక్షకు డంతన్

అదంతా శివుడంతటి విప్రుని కోపాగ్ని కాబోలు అనుకుంటూ తక్షకుడు భయపడి (జాత=పుట్టిన, ఆతంకుడయి=భయం కలవాడై) కుండలాలని ఉదంకుడికి తెచ్చి యిచ్చాడు.

మొత్తానికలా కుండలాలని తిరిగి సంపాదించాడు ఉదంకుడు. అయినా అతనికొక సమస్య వచ్చిపడింది. కుండలాలని నాలుగు రోజుల్లో తీసుకురమ్మని గురుపత్ని ఆజ్ఞ. ఈ రోజే నాల్గవ రోజు. ఇంత తొందరగా ఇప్పుడక్కడకి చేరుకోడం ఎలా? ఇలా చింతిస్తున్న ఉదంకుడిని చూసి, విషయం గ్రహించి, ఆ దివ్యపురుషుడు, మనసుకన్నా వేగమైన తన గుఱ్ఱాన్ని ఎక్కి వెళ్ళమని అంటాడు. అతని మాట ప్రకారం ఉదంకుడు ఆ గుఱ్ఱాన్ని ఎక్కి క్షణ కాలంలో గురువుగారి ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే గురుపత్ని స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి, వ్రతానికి సిద్ధమై ఉంటుంది. కుండలాలని ఎప్పుడు తెస్తాడా అని ఉదంకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కుండలాలతో వచ్చిన అతడిని చూసి సంతోషించి, ఆ కుండలాలు ధరించి తాను చేయదలచుకున్న వ్రతం చేసుకుంటుంది. అప్పుడతని గురువు ఉదంకుడిని ఇలా అడుగుతాడు:

ఈ యున్న పౌష్యుప్రోలికి
బోయి కడుం బెద్ద దవ్వు పోయినయట్ల
త్యాయత విమల తపో మహి
మా! యిన్ని దినంబులేల మసలితి చెపుమా!

ఇక్కడున్న పౌష్యుని ఊరికి (పురము వికృతి ప్రోలు) వెళ్ళి రావడనికి ఎదో పెద్ద దూరం వెళ్ళివచ్చినట్లు ఇన్ని రోజులెందుకు పట్టింది? అని అడిగారు గురువుగారు. "ఈ యున్న" అన్నది అచ్చమైన తెలుగు నుడికారం. సంభాషణని దానితో మొదలుపెట్టడంతో పద్యానికి ఒక సహజత్వం సొగసు అబ్బింది. ఇక్కడ ఉదంకునికి వాడిన విశేషణం గమనించండి, "అత్యాయత విమల తపో మహిమా!". అంటే ఎంతో గొప్పదైన స్వచ్ఛమైన తపోమహిమ కలవాడా అని. అంతటి తపోమహిమ కలిగినవాడికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్న. అంతటి తపోమహిమ కలవాడు కాబట్టే ఆ కార్యాన్ని సాధించాడని ధ్వని.

గురువుగారు అలా అడిగేసరికి జరిగిందంతా పూస గుచ్చినట్లు చెపుతాడు ఉదంకుడు. తోవలో వెళుతూ ఉంటే ఎద్దునెక్కిన దివ్యపురుషుడు కనిపించిన విషయం మొదలు, తక్షకుడు కుండలాలని దొంగిలించడం, నాగలోకంలో చూసిన అద్భుతదృశ్యం, అక్కడ జరిగిన వింతలు విశేషాలు అన్నీ వివరిస్తాడు. చెప్పి, ఇదంతా ఏమిటి నాకు వివరించండి స్వామీ అని అడుగుతాడు.

ఆ గురువుగారు వివరించిన రహస్యమేమిటి? అందులోని అంతరార్థం ఏమయ్యుంటుంది? ఇంతకీ ఈ కథకీ జనమేజయుని సర్పయాగానికి ఉన్న సంబంధం ఏమిటి?

ఇవన్నీ తెలియాలంటే మరో టపాకోసం మీరు ఎదురుచూడల్సిందే! :-)

11 comments:

  1. హమ్మ్ ఏదో సన్నటి జ్ఞాపకాల వీచిక కదుల్తున్నది. పాతాళంలో కనిపించిన తెలుపు నలుపు పోగుల వస్త్రం పగలు రాత్రులతో అల్లుకున్న కాల ప్రవాహం. పన్నెడు ఆకులతో తిర్గుతున్న చక్రం పన్నెండు మాసాలతో నిండిన సంవత్సరం. పక్కన గుర్రం మీద కూచున్నాయన కాలపురుషుడా?

    ReplyDelete
  2. సంస్కృత భాషలో ఒకే వస్తువుకి అనేక పర్యాయపదాలు ఉండడానికి కారణం వాళ్ళు ఆయా వస్తువులని అన్ని రకాలుగా దర్శించి అర్థం చేసుకొని దానికి తగిన సంజ్ఞలని ఏర్పరచడం వల్లనే!
    ----------------
    అందుకనే చదువుతుంటే/వింటుంటే ఆ చిత్రాల ప్రదర్శన మన ఎదుట రమ్యంగా నాట్యం చేస్తూ కదులుతూ ఉంటుంది. నాకు సంస్కృతం రాదు కానీ మీ మాటలద్వారా ఆ దృశ్యాలని చూస్తున్నాను.

    భట్టిప్రోలు తేలప్రోలు మొదలయిన ఊరి పేర్లల్లో ప్రోలు అనేది పురము(ఊరికి) వికృతి అని ఇంతవరకూ తెలియదు. మాస్టారు దగ్గర నుండి నేర్చుకుంటున్నాను.

    చక్కటి narration. అంతకన్నా చెప్పలేను. థాంక్స్ .

    ReplyDelete
  3. ఈక్షణశ్రోత్రము - బావుందండి. చక్షుశ్రవము అన్న ప్రయోగం విన్నాను. ఈక్షణావధార్యము అనవచ్చా? లోచనశ్రోత్రము కూడా చెప్పుకోవచ్చనుకుంటాను.
    ఈషద్ శ్రోత్రుడు అని నాకోమాట అనిపిస్తూంది. అంటే (భార్యమాటలను) కొంచెమే చెవిన వేసుకునే వాడు. :)

    ReplyDelete
  4. కొత్తపాళీగారూ,

    మీ జ్ఞాపకాల వీచికని వచ్చే టపా వరకూ అలాగే వీచనివ్వండి :-)

    లక్కరాజుగారు,

    మీ ప్రోత్సాహకర వాక్యాలకు ధన్యవాదాలు.

    రవి,

    "ఈషద్ శ్రోత్రుడు" భలే ఉందే! భర్తకి ఇదొక కొత్త పర్యాయపదమన్న మాట! :-)

    ReplyDelete
  5. ఈ శైలికి బేతవోలు వారు - పద్యకవితాపరిచయం అని పేరు పెట్టారు. మీరు తలచుకోవటం వల్ల మాకు జాలంలో పద్యకవితాపరిచయం, ధన్యోస్మి.

    ReplyDelete
  6. ఈషచ్ఛోత్రుడు... భలే బాగుందండీ. :)

    ReplyDelete
  7. వ్యాఖ్యానం బాగున్నది. ఎంతమేర అవసరమో అంత మేర వివరణ, ఆపై మనసుకు మేత...

    ReplyDelete
  8. ఈషణ్మాత్రము జాలి లేకుండా మళ్ళీ పొడిగించారా మీరు ఎపిసోడు నాల్గుకి.
    కొత్తపాళీ గారు సరిగ్గానే చెప్పారు. ఆరు ఋతువులు మర్చిపోయారు ఆయన. ఎప్పుడో విన్న కధ అయినా మీరు చెపుతుంటే కొత్తగా ఉంది.

    ReplyDelete
  9. జనమేజయునకు వైశంపాయనుడు చెప్పినట్లు చెప్తున్నారు, మాకు. బాగుంది. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కవిత్రయము వారి పద్యాలు చదువుకొని వారిని ఓ సారి స్పృశిస్తున్నట్లు అనుభూతి కల్గుతున్నాది.

    ReplyDelete
  10. బహువన పాదపాబ్ధి పద్యం, వాసుకి మీద పద్యం share చేయగలరా??🙏

    ReplyDelete