తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, August 23, 2008

శ్రీకృష్ణ లీలామృతం


ఈ రోజు కిట్టయ్య పుట్టినరోజు. తెలుగువాళ్ళెవరికైనా కృష్ణుణ్ణి తలచుకోగానే,

శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోల విలసత్ దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకున్

అంటూ, గోర్వెచ్చని పాలమీగడలకన్నా తియ్యనైన భాగవతాన్ని మనకందించిన పోతన తలపులోకి రాకమానడు కదా! ఆ పోతన తన భాగవతంలో, ముచ్చటగా వర్ణించిన శ్రీకృష్ణలీలలని తలచుకొని ఆనందిద్దామా మరి!

అదుగో దేవదేవుడు, దేవకిపంటగా శ్రీకృష్ణనిగా అవతరిస్తున్నాడు. ప్రకృతి ఆనందముతో ఉప్పొంగుతోంది:

స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును
గల ఘోషణములు మేఘంబు లుఱిమె
గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె
దిక్కులు మిక్కిలి తెలివి దాల్చె
గమ్మని చల్లని గాలి మెల్లన వీచె
హోమానలంబు సెన్నొంది వెలిగె
గొలకుల కమలాళికులముపై సరినొప్పె
బ్రవిమల తోయలై పాఱె నదులు

వర పుర గ్రామ ఘోషయై వసుధ యొప్పె
విహగ రవ పుష్ప ఫలముల వెలసె వనము
లలరుసోనలు గురిసి రయ్యమరవరులు
దేవదేవుని దేవకీదేవి గనగ!

అరే, అంతలోనే అదుగో వసుదేవుడా బాలుణ్ణి పొత్తిళ్ళలో ఎత్తుకొని ప్రయాణమవుతున్నాడే!

బిడ్డని గరముల ఱొమ్మున
నడ్డంబుగబట్టి పదము లల్లన యిడుచున్
జడ్డన గావలివారల
యొడ్డు గడచి పురిటిసాల యొయ్యన వెడలెన్

ఆ హరికి స్వయంగా యమునా నది దారిస్తోంది చూసారా! అలనాడు శ్రీరామచంద్రునికి సముద్రుడు త్రోవిచ్చినట్టే లేదూ!

ఆ శౌరికి దెరువొసగె బ్ర
కాశొద్ధత తుంగభంగ కలిత ధరాశా
కాశ యగు యమున మును సీ
తేశునకు బయోధి త్రోవ యిచ్చిన భంగిన్

ఇంకేముంది, నందుని యింట వెలసా డానంద గోపాలుడు. రేపల్లే ఇక అతని యిల్లు! ఈ వార్త రేపల్లె మగువలకి తెలిసిపోయింది. ఇంకేం, చూడ్డానికి ఇరుగమ్మని పొరుగమ్మనీ వెంటపెట్టుకొని బయలుదేరారు.

ఏమి నోము ఫలమొ యింత ప్రొద్దొక వార్త
వింటి మబలలార వీను లలర
మన యశోద చిన్ని మగవాని గనెనట
చూచివత్తుమమ్మ సుదతులార

ఆ పసి బాలునికి అన్ని సపర్యలూ జరుగుతున్నాయి. ఉయ్యాలలూగిస్తూ జోలపాటలెలా పాడుతున్నారో వినండి:

జోజో కమలదళేక్షణ
జోజో మృగరాజమధ్య జోజో కృష్ణా
జోజో పల్లవకరపద
జోజో పూర్ణేందువదన జోజో యనుచున్

లోకాలని జోకొట్టి నిద్రపుచ్చే ఆ దేవదేవునికి నిద్రేమిటి! అయినా వాళ్ళకోసం కళ్ళుమూసుకొని నిద్ర నటిస్తున్నాడు.

లోకములు నిదురవోవగ
జో కొట్టుచు నిదురవోని సుభగుడు రమణుల్
జోకొట్టి పాడ నిదురం
గైకొను క్రియ నూరకుండె గనుదెఱవాయున్

అంతలో రాకాసి పూతన రానే వచ్చింది. చన్నిచ్చే నెపంతో ఆ పసివాని ప్రాణం తియ్యాలని. అక్కడున్నది పసిబాలుడా? పాలని త్రాగుతూ త్రాగుతూ పూతన ప్రాణాల్ని కూడా గుటగుటా తాగేశాడా బాలకృష్ణుడు! చచ్చిపడింది పూతన.

మేల్కొన్న తెఱగున మెల్లన కనువిచ్చి
క్రేగంట జూచుచు గిదికి నీల్గి
యావులించుచు జేతులాదరంబున జూచి
యొదికిలి యాకొన్న యోజనూది
బిగిచన్నుగవ గేల బీడించి కబళించి
గ్రుక్క గ్రుక్కడు గుటు గుబుకు మనుచు
నొకరెండు గ్రుక్కల నువిద ప్రాణంబులు
సైతము మేనిలో సత్త్వమెల్ల

ద్రావె నదియును గుండెలు దల్లడిల్ల
దిమ్మ దిరుగును నిలివక శిరము వ్రాల
నితర బాలుర క్రియవాడ వీవు గావు
చన్ను విడువుము విడువుము చాలు ననుచు

నిబ్బరపు దప్పి మంటలు
ప్రబ్బిన ధృతి లేక నేత్ర పదహస్తంబుల్
గొబ్బున వివృతములుగ నా
గుబ్బాగుబ్బయిన కూత గూలెన్ నేలన్!

విషధరరిపు గమనునికిని
విషగళ సఖునికి విమల విషశయనునికిన్
విషభవభవ జనకునికిని
విషకుచ చనువిషము గొనుట విషమే తలపన్!

విషాన్ని ధరించే పాముల శత్రువైన గరుత్మంతుడిపై తిరిగేవాడూ, విషాన్ని ధరించిన శివుని చెలికాడూ, విషధరమైన శేషునిపై పరుండేవాడూ, విషము(నీరు)నుంచి పుట్టిన పద్మంలోంచి పుట్టిన బ్రహ్మకి తండ్రీ - ఆ జగన్నాథుడు! అతన్ని విషపు చనుబాలు ఏం చేస్తాయి!

చూసారా మన చిన్నికృష్ణుడింతలోనే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు!
రెండడుగులతో నింగీ నేలా ఆక్రమించుకొన్న అతను అడుగులు వెయ్యడం మొదలుపెట్టగానే, అతని శత్రువుల అడుగులు తడబడి కూలబడిపోయారట!

అడుగులు వే గలిగియు రెం
డడుగులనే మన్ను మిన్ను నలమిన బాలుం
డడుగిడ దొరకొనె శాత్రవు
లడుగులు సడుగులును వదలి యడుగవని బడన్

ఆహా ఆ బలరామ కృష్ణుల బాల్యక్రీడలు వర్ణించడం ఎవరి తరం!

తనయీడు గోప బాలురు
దను గొలువగ రాము గూడి తనువు గలుగుచుం
దనుగమనంబున గృష్ణుడు
తను మధ్యలు మెచ్చ నీలతనురుచి దనరెన్

బాల కృష్ణుడప్పుడే నవనీత చోరుడైపోయాడు! గోపాలుర ఇండ్లలో వెన్నంతా దొంగిలించి తిని ఏవీ ఎరగనట్లు వచ్చి తల్లిని బువ్వపెట్టమని అడుగుతున్నాడు చూడండి!

వల్లవ గృహ నవనీతము
లెల్లను భక్షించి వచ్చి యెఱగని భంగిం
దల్లి గదిసి చిట్టాడుచు
నల్లన చను బువ్వ బెట్టు మమ్మా యనుచున్

ఇలా అల్లరి చేస్తే ఆ గోపకాంతలు ఊరుకుంటారా ఏమిటి? వెళ్ళి యశోదకు చెప్పే మిషతో ఆ గోపాలబాలుని కొంటెపనులని ఎంత సొగసుగా వర్ణిస్తున్నారో వినండి మరి!

బాలురకుబాలు లేవని
బాలెంతలు మొఱలువెట్ట బకబక నగి యీ
బాలుండాలము సేయుచు
నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

పడతీ నీ బిడ్డడు మా
కడవలలో నున్న మంచి కాగిన పాలా
పడుచులకు బోసి చిక్కిన
కడవల బో నడచె నాజ్ఞ గలదో లేదో!

చిన్నపిల్లలికి పాలులేవని ఓ మూల బాలెంతలేడుస్తూ ఉంటే, నవ్వుతూ ఆవులవద్దకి పెయ్యలని వదిలిపెట్టాడు! వచ్చి, మేము కడవలలో దాచుకున్న కాగిన పాలన్నీ తీసుకెళ్ళి ఆ బాలెంతలకి పోసాడు. కడవలనేమో పగలుకొట్టేసాడు!
చిన్ని కృష్ణుడి ఆగడాలకి అంతూ పొంతూ ఉందా!

పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చి తా
నుట్టి యందక ఱోళ్ళు బీటలునొల్ల ప్రోవిడి యెక్కి చే
వెట్టజాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ
పట్టి మీగడపాలు జేరల బట్టి ద్రావె తలోదరీ!

ఉట్టిమీద అందకుండా పాలని దాచుకుంటే, ఇంట్లో ఉన్న చిన్న ఱోళ్ళూ పీటాలూ అన్నిటినీ ఎత్తుపెట్టి, ఎక్కి, అయినా కుండలోపలకి చెయ్యిపెట్టడం వీలుకాక ఏం చేసాడో తెలుసా? ఆ కుండకి పెద్దకన్నం పెట్టి ఆ మీగడపాలు చేత్తో జుఱ్ఱుకుంటూ తాగేసాడు!

వారిల్లుసొచ్చి కడవల
దోరంబగు నెయ్యిద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుండిడ
వారికి వీరికిని దొడ్డ వాదయ్యె సతీ!

పాలూ పెరుగూ దొంగతనంగా తిని ఊరుకున్నాడా మీ చిలిపి కన్నయ్య. వాళ్ళింట్లో కడవలు తీసుకొచ్చి వీళ్ళింట్లో పెట్టి వాళ్ళకీ వీళ్ళకీ మధ్య తగువులు పెట్టాడు!

ఓ యమ్మ నీ కుమారుడు
మా యిండ్లను బాలు బెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభు లాన! మంజుల వాణీ!

అమ్మా యశోదమ్మా! నీ కొడుకు మా యిళ్ళల్లో పాలూపెరుగూ యింక ఉండనివ్వడని తేలిపోయింది. మా అన్నల గోవులని నమ్ముకొని ఇంకెక్కడికైనా పోతాం మేము!
ఇలా ఆ రెపల్లె మగువలు గోలపెడితే, అంతా విని యశోద ఏమంది?

చన్ను విడిచి యిట్టటు చన
డెన్నడు బొరుగిండ్ల త్రోవ లెఱుగడు నేడుం
గన్నులు దెఱవని మా యీ
చిన్ని కుమారకుని ఱవ్వ సేయం దగునే!

నా యెదనే వదలిపోని నా చిన్నికృష్ణుడి మీద ఇలా చాడీలు చెప్తారా అంటోంది! అహా ఏమి చోద్యం! ఆ యశోదకు తన నందకిశోరుని మీద ఎంత ప్రేమ!
ఇక కృష్ణుని అల్లరికి అదుపేముంటుంది?
అదిగో మన్ను తినే ఆ కన్నయ్యను చూడండి. అమ్మా తమ్ముడు మన్ను తినేనే అని చెప్తున్న ఆ రామన్నను చూడండి. ఎంత ప్రేమైతే మాత్రం మన్ను తిన్నాడంటే ఊరుకుంటుందా ఆ తల్లి, అన్నా అని చెవినులిమి యశోద, "ఏదన్నా నీ నోరుచూపూ" అంది. ఆ దొంగ కృష్ణుడు ఎంత అమాయకంగా మొహం పెట్టాడో చూడండి. పైగా మన్ను తినడానికి తనేం వెఱ్ఱివాడినా అంటున్నాడు:

అమ్మా మన్నుదినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్రినో
నమ్మంజూడకు వీరిమాటలు మదిన్ నన్నీవు గొట్టంగ దా
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ దప్పైన దండింపవే!

నా నోటివాసన చూడు కావలిస్తే అని నోరు తెరిచాడు. ఇంకేముంది! అందులో సమస్త భువనాలూ కనిపించాయి! ఆ రూపాన్ని చూసిన యశోద ఏమనుకుంది?

కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్ నేరక యున్నదాననొ యశోదాదేవినే గానో పర
స్థలమో బాలకుడెంత యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమిహేతువొ మహాశ్చర్యంబు జింతింపగన్!

కలా వైష్ణవమాయా అనుకుంది! తనసలు యశోదాదేవినేనా అన్న సందేహం కలిగింది! యశోద తాపము నశియించి జన్మ ధన్యత గాంచింది!
కానీ తర్వాత మళ్ళీ మామూలే. ఆ స్పృహని మాయ కమ్మేసింది. లేకపోతే చిన్నారి శ్రీకృష్ణుడి చిలిపి ముచ్చట్లని తల్లిగా ఎలా అనుభవించగలదు?
కృష్ణుని ఆగడాలు మళ్ళీ మామూలే. ఇక లాభంలేదు, ఇతన్ని పట్టుకొని రోటికి కట్టేస్తే కాని ఈ ఊరిమీద పెత్తనాలు ఆగవని నిశ్చయించుకుంది యశోద. కాని అంత సులువుగా పట్టుబడతాడా కృష్ణుడు! ఘల్లు ఘల్లుమనే గజ్జలతో ఇటూ అటూ పెరిగెట్టాడు బాల గోపాలుడు.

గజ్జెలు గల్లని మ్రోయగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షిజ్జనములు నగ దల్లియు
బజ్జం జనుదేర నతడు పరువిడె నధిపా!

మొత్తానికి అతన్ని పట్టుకుంది యశోద! పట్టుకొని ఏమంటోంది? "ఓహో! మీరేనా శ్రీ కృష్ణులంటే! మీకు వెన్నంటే అసలు తెలీదటకదా! దొంగతనమే చెయ్యరట కదా! అహా, ఈ భూలోకమంతటా మీ అంతటి బుద్ధిమంతులసలు ఉన్నారా?" అంటోంది!

వీరెవ్వరు శ్రీకృష్ణులు
గారా యెన్నడును వెన్నగానరట కదా!
చోరత్వంబించుకయును
నేరరట ధరిత్రి నిట్టి నియతులు గలరే!

"నువ్వెవరికీ పట్టుబడవని అందరూ అంటారే. నేను తలచుకొంటే నిన్ను పట్టుకోవడం ఒక పెద్ద పనా! నాకు కాక నువ్వెవరికి పట్టుబడతావు?" అని కూడా అంటోంది. నిజంగానే ఎవరికీ చిక్కని ఆ పరమాత్ముడు యశోదకి చిక్కాడు.

పట్టిన బట్టువడని నిను
బట్టెద నని చలముగొనిన బట్టుట బెట్టే
పట్టువడవండ్రు పట్టీ
పట్టుగొనన్ నాకుగాక పరులకు వశమే!

అలా పట్టుకొన్న కృష్ణుణ్ణి యశోద అదుగో ఆ రోటికి కట్టేసింది.

ఆ లలన గట్టె ఱోలన్
లీలన్ నవనీత చౌర్యలీలున్ బ్రియ వా
గ్జాలున్ బరివిస్మిత గో
పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్!

చిక్కడు సిరికౌగిటిలో
జిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్
జిక్కడు శ్రుతిలతికావలి
జిక్కె నతడు లీల దల్లి చేతన్ ఱోలన్!

అపళంగా ఆ కృష్ణుడేం చేసాడు? ఊపున పోయి పెరట్లో ఉన్న మద్ది చెట్లు రెండిటినీ కూల్చేసాడు!

ముద్దుల తక్కరి బిడ్డడు
మద్దుల గూల్పంగ దలచి మసలక తా నా
మద్దికవ యున్న చోటికి
గ్రద్దన ఱోలీడ్చుకొనుచు గడకం జనియెన్

బాలుడు ఱోలడ్డము దివ
మూలంబులు వెకలి విటపములు విఱిగి మహా
భీల ధ్వని గూలెను శా
పాలస్య వివర్జనములు యమళార్జునముల్

ఆ మద్దిచెట్లు కూకటి వేళ్ళతో సహా పెకలించబడి విరిగి పడిపోయాయి. శాపగ్రస్తులైన నలకూబర మణిగ్రీవులకి శాపవిమోచనమయ్యింది!

ఇంతలో అందరూ రేపల్లెని విడిచి బృందావనం చేరుకున్నారు. ఇది శ్రీకృష్ణుని రక్షణ కోసమట. సర్వ జగద్రక్షణుడైన ఆ హరికి రక్షణా! అతడే అందరినీ కాపాడేవాడు. అక్కడ కాళింది మడుగులో కాళీయుడున్నాడు. అతన్నుంచి ఈ గోపాలురందరినీ రక్షించాలని నిశ్చయించుకున్నాడు మన గోపాలపాలుడు! ఇంకేముంది. అన్నుకున్నదే తడవు, చెట్టెక్కి ఆ నదిలోకి దూకబోతున్నాడు. ఆహా ఆ సుందర దృశ్యాన్ని ఎంత సొగసుగా వర్ణించాడు పోతన! స్వయంగా కళ్ళతో చూసినట్టు, కళ్ళకు కట్టేట్టు ఉంది చూడండి.

కటి చేలంబు బిగించి పింఛమున జక్కం గొప్పు బంధించి దో
స్తట సంస్ఫాలన మాచరించి చరణ ద్వంద్వంబు గీలించి త
త్కుట శాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాల సింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానంబనూనంబుగన్

నడుం చుట్టూ తన చేలాన్ని బిగించాడు. పింఛంలో కొప్పుని సరిచేసుకున్నాడు. రెండు జబ్బలూ చరిచాడు. రెండు కాళ్ళనీ అదిమిపట్టి ఒక్కసారిగా ఆ చెట్టుకొమ్మపైనుంచి గభీలుమని ఆ నదిలోకి దూకాడా గోప కిశోరుడు! గుభగుభ మంటూ పెద్ద శబ్దం నలుదిక్కులా కమ్ముకుంది.
అంతే. ఆ కాళీయునితో యుద్ధం చెయ్యడం అతని పీచమడచడం అయిపోయాయి. అహా! కాళీయఫణి ఫణజాలాన ఝణ ఝణ మంటూ కేళి ఘంటించిన ఆ గోప కిశోరమూర్తి ఎంత మనోహరంగా ఉన్నాడు!

ఘన యమునానదీ కల్లోల ఘోషంబు
సరస మృదంగ ఘోషంబుగాగ
సాధు బృందావనచర చంచరీక గా
నంబు గాయక సుగానంబుగాగ
గలహంస సారస కమనీయ మంజు శ
బ్దంబులు దాళ శబ్దములుగాగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది
జనులు సభాసీన జనులుగాగ

బద్మరాగాది రత్న ప్రభాభాసమాన
మహిత కాళియ ఫణిఫణా మండపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్యనైపుణ్యమున బేర్చి నృత్యమాడె!

యమునానది అభంగ తరంగాలు మృదంగనాదం చేస్తున్నాయి. బృందావనంలో తిరుగాడే తుమ్మెదలు ఝుమ్మని గానం చేస్తున్నాయి. కలహంస, సారసములు సొంపైన నడకతో తాళాన్ని వేస్తున్నాయి. పైనున్న దేవతలందరూ ప్రేక్షకులయ్యారు. మణులు పొదిగున్న ఆ కాళీయుని పడగ రత్నవేదికగా మారింది. ఆ పద్మాక్షుడు తన సహజ ప్రతిభతో అక్కడ నృత్యం చేసాడు!

బృందావనమంతా ఒక ప్రశాంత వాతావరణం నెలకొంది. గోపాలుడు మురళీ లోలుడయ్యాడు. ఆ మోహన రూపాన్ని, ఆ మనోహర గానాన్ని చూసి గోపబాలలంతా పులకిస్తున్నారు.

శ్రవణోదంచిత కర్ణికారకముతో స్వర్ణాభ చేలంబుతో
నవతంసాయిత కేకిపింఛకముతో నంభోజ దామంబుతో
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబు బూరించుచు
న్నువిదా మాధవు డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే!

చెవులకి ఆనందమైన చెవికమ్మ, బంగారు చేలము, శిఖగా చేయబడిన పింఛము, మెడలో తామరపూల దండ. తరగని సౌందర్యంతో, తనలో తాను లీనమై తన పెదాల అమృతంతో ఆ వేణువుకి జీవం పోస్తున్న ఆ మాధవుని చూడండని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు.

గిరులెల్ల జలము లయ్యెం
దరులెల్లను బల్లవించె, ధరణి గగన భూ
చరు లెల్లను జొక్కిరి హరి
మురళిరవామృతము సోక ముద్దియ కంటే!

ఆ గానానికి కొండలు కరిగాయి. చెట్లు పుష్పించాయి. ముల్లోకాలలోని జీవజాలమంతా ఆ మురళీ గానామృతంలో తన్మయమయ్యింది!

అంతలోనే మళ్ళీ ఓ ప్రమాదం ముంచుకొచ్చింది. తనకి పూజలు చెయ్యొద్దన్నాడని కృష్ణుడిమీద ఇంద్రునికి కోపం వచ్చింది. ఆ బృందావనంలో ప్రజలందరినీ శిక్షించాలనుకున్నాడు. రాళ్ళ వర్షం కురిపించాడు. అయినా ఆ పరమాత్ముని పాలనలో ఆ గోపాల బృందానికి ఆపదలు వస్తాయా?

బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతో గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్ వలకేల దాల్చి విపులచ్ఛత్త్రంబుగా బట్టె నా
భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోప గోపంక్తికిన్!

ఆడుతూ ఆడుతూ వెళ్ళి - అదేదో గొడుగనుకున్నాడు కాబోలు, పూలగుత్తి నెత్తినంత సులువుగా గోవర్ధన గిరిని తన కుడిచేత్తో ఎత్తేసాడు. చిరునవ్వుకూడా చెరగలేదు! చిటికిన వేలిపై ఆ కొండని నిలబెట్టి, నింగినుండి కురుస్తున్న రాళ్ళ వర్షానికి చకితులైన ఆబాలగోపాలాన్నీ పిలుస్తున్నాడు. ఏమని?

బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా
జాలండో యని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా
కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం బ్రమోదంబునన్!

నేనేదో చిన్న కుఱ్ఱాణ్ణీ, ఈ పెద్ద కొండని మొయ్యగలనా అని సందేహించకండి అంటున్నాడు! బలే కృష్ణా! అంత పెద్ద కొండని ఎత్తిపట్టుకోడం చూసిన ఆ జనులకి నువ్వొక చిన్న పిల్లాడిలా అసలు కనిపిస్తావా? అయినా కొందరు మందబుద్ధుల సందేహాలని పూర్తిగా పోగొట్టాలనుకుంటున్నావు, అంతే కదా! ఈ కొండలూ, సముద్రాలూ, జంతుజాలము సమస్తమూ నిండిన భూవలయమే పైబడినా నా చేయి అల్లాడదు, హాయిగా నిశ్చింతగా ఇక్కడకి రండని పిలిచాడు.
అహా! ఆ గోకులానిది ఎంత అదృష్టం! లోక సంరక్షకుడైన ఆ కృష్ణుని రక్షణ దొరకింది.

అసలే కృష్ణుడు మోహనాకారుడు. మనోహరుడు. నవనీత చోరుడే కాదు, నవలామానస చోరుడు కూడా అయ్యాడు! బృందావనంలోని గోపికలందరి హృదయాల్లోనూ అతనే నిండిపోయాడు. అద్దమ రేయి బయలుదేరి, ఇల్లూవాకిలీ వదిలేసి, అతని వద్దకు పరుగుపరుగున వచ్చేసారు! ఏవీ ఎరగనట్టు కృష్ణుడు, ఇదేమిటని అడిగితే, తమ గోడుని విన్నవించుకుంటున్నారు.

నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱగాని
తరలి పోవంగ బాదములు రావు
నీ కరాబ్జంబులు నెఱి నంటితివగాని
తక్కిన పనికి హస్తములు సొరవు
నీ వాగమృతధార నిండ గ్రోలగగాని
చెవులన్య భాషలు సేరి వినవు
నీ సుందరాకృతి నియతి జూడగ గాని
చూడ వన్యంబుల జూడ్కి కవలు

నిన్న కాని పలుకనేరవు మా జిహ్వ
లొక్క ననుచు బలుక నోడ వీవు
మా మనంబు లెల్ల మరగించి దొంగిలి
తేమి సేయువార మింక కృష్ణ!

ఎంతటి భక్తి పారవశ్యమది! మా మనసులని మరిగించి దొంగిలించుకు పోయావు, ఇంక మేమేమి చెయ్యగలమని వేడుకొన్నారు. కానీ కృష్ణుడు వాళ్ళనింకా పరీక్షించాలనుకున్నాడు. కనపడకుండా మాయమయ్యాడు. అతని కోసమా బృందావనమంతా వెతుకుతున్నారు పాపం గోపికలు.

నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచె నో
మల్లియలార మీ పొదలమాటున లేడుగదమ్మ చెప్పరే!

మల్లెపొదలమాటున దాక్కున్నాడేమోనని ఆ మల్లెపూలని అడిగారు. ఊహూ జవాబు లేదు! అలా చెట్టూ పుట్టా వెతికినా కృష్ణుడు దొరకలేదు.

గోవుల వెంట ద్రిమ్మరుచు గొల్చినవారల పాపసంఘముల్
ద్రోవగ జాలి శ్రీ దనరి దుష్టభుజంగ ఫణాలతాగ్ర సం
భావితమైన నీ చరణపద్మము చన్నుల మీద మోపి త
ద్భావజపుష్పభల్లభవ బాధ హరింపు వరింపు మాధవా!

అంటూ, గోపికా గీతికలాలపించారు. కృష్ణుని నవనీత హృదయం కరిగింది. వాళ్ళను చేరుకున్నాడు.

పాయని గేహశృంఖలల బాసి నిరంతర మత్పరత్వముం
జేయుచునున్న మీకు బ్రతిసేయ యుగంబులనైన నేర నన్
బాయక గొల్చుమానసము ప్రత్యుపకారముగా దలంచి నా
పాయుట దప్పుగా గొనక భామినులార కృపన్ శమింపరే!

నామీద నిరంతరమూ మీకున్న ఈ భక్తి తత్పరతకి నేను యుగయుగాలైనా బదులు తీర్చుకోలేనన్నాడు. వాళ్ళనలా విడిచి వెళ్ళిపోవడం తప్పుగా భావించక దయతో శాంతించమన్నాడు. కృష్ణుడు తమని చేరుకోవడం కన్నా శాంతి మరేముంది ఆ గోపికలకు.

ఆ సమయంబునన్ విభుడనంతుడు కృష్ణుడు చిత్రమూర్తియై
చేసెను మండలభ్రమణశీల పరస్పర బద్ధ బాహు కాం
తా సువిలాసమున్ బహువిధ స్ఫురితానన హస్త పాద వి
న్యాసము రాసముం గృత వియచ్చర నేత్ర మనోవికాసమున్!

లీలామానుష స్వరూపుడైన ఆ స్వామి, అనంత మూర్తులని ధరించి, ప్రతి గోపిక మధ్యా ఒక కృష్ణుడై, వాళ్ళతో చేయీ చేయీ కలిపాడు. అందరూ చక్రాకారంలో నిలుచుని నాట్యం చేసారు. అదే రాసకేళి. ఆ విరళీకృత నవ రాసకేళిలో అందరూ పరమానందంగా ఓలలాడారు!

అప్పుడా దివ్యమోహన సుందరమూర్తి ఇలా ఉన్నాడు:

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేచ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ!

12 comments:

  1. మా పాపకి చదివి వినిపించడానికి మీ టపా మొత్తం నేను పొందుపరిచుకున్నాను. (ఇప్పుడిప్పుడే మాటలు నేరుస్తున్న మా పాపాయిని "నాన్న నీకు ఏమి చదువుతారమ్మా?" అని అడగితే "ప్ ద్దెం"అంటుంది:-)
    చివరి పద్యం పోతనదేనా?

    ReplyDelete
  2. అహా అనిపిస్తుంది మీ బ్లాగు ఇలా గే మేయింటేయ్ చెయ్యగలరు

    ReplyDelete
  3. కామేశ్వరరావుగారూ: పద్యాలను ఒక అందమైన పూలదండలాగా గుచ్చిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది :-). ధన్యవాదాలు! ("నెనర్లు" ప్రయోగానికి నేను వ్యతిరేకిని!!) అప్పుడెప్పుడో... రికార్డయిన (అంటే గ్రామఫోను రికార్డులెకెక్కిన) భాగవతంలో పద్యాలన్నీ ఒకచోట పేర్చే/కూర్చే ప్రయత్నం చేసాను. కానీ మీరిచ్చిన వరసలో ఎంతవరకు సాధ్యమో చూడాలి.

    గిరిగారు: ఆ చివరి పద్యం లీలాశుక బిల్వమగళుని రచనగా పేర్కొనబడే "శ్రీకృష్ణకర్ణామృతం"లోనిది.

    -- శ్రీనివాస్

    ReplyDelete
  4. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా మీరు వ్రాసిన "శ్రీకృష్ణ లీలామృతం" చూశాక పోతన గారి భాగవతం పుస్తకం తీసి ఆ ఘట్టాలన్నిటినీ అక్కడక్కడా స్థాలీపులాక న్యాయంగా మళ్ళీ ఓసారి తిరిగి చదివాను.అలా చదివే అవకాశం కలిగించినందులకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.

    ReplyDelete
  5. నచ్చిందని చెప్పిన అందరికీ నెనర్లు. పరుచూరివారికి మాత్రం ధన్యవాదాలు :-)
    కృష్ణాష్టమి నాడు తీరిగ్గా కూర్చుని "హే కృష్ణా ముకుందా మురారీ..." పాట వింటూ ఉంటే హఠాత్తుగా ఈ ఆలోచన వచ్చింది. ఆ పాట ప్రభావం ఇందులో స్పష్టంగానే తెలిసుంటుంది. తీసుకొన్న పరిధిలో, భాగవతంలో బాగా ప్రసిద్ధమైన పద్యాలన్నీ వచ్చినట్టే ఉన్నాయి. బాగా తెలియనివికూడా నాకు బావున్నాయనిపించినవి తీసుకున్నాను.
    ప్రసిద్ధ పద్యాలు కొన్ని పాడడమే కాని, ఇలా ఒకో ఘట్టాన్నీ తీసుకొని మధ్యలో వివరణతో ఎవరూ పాడి రికార్డు చేసినట్టు లేదు. అలాంటిదెవరైనా చేస్తే బావుంటుందేమో!

    ReplyDelete
  6. మేష్టారండీ, అమృతమంతా ఒక చోట చేరినట్టుంది!

    ReplyDelete
  7. ఓ యమ్మ నీ కుమారుడు
    మా యిండ్లను బాలు బెరుగు మననీ డమ్మా!
    పోయెద మెక్కడి కైనను
    మా యన్నల సురభు లాన! మంజుల వాణీ!
    యన్నుల / యన్నల ఏది కరెక్టు?

    ReplyDelete
  8. మా యన్నల సురభులాన మంజులవాణీ అన్నదే సరైన పాదపాఠం. గోపవనితలు తమ పుట్టింతివారి సంపదలపైన ఒట్టుపెట్టి మరీ నొక్కి వక్కాణిస్తున్నారు గోపాలచూడామణి నిర్వాకాలను యశోదమ్మకు. అన్నుల అన్న మాటకు ఇక్కడ ఏవిధమైన సార్థకతా లేదు అన్ను అన్నది స్త్రీకి పర్యాయం. ప్రసిధ్ధమైన అన్నులమిన్న (అంటే, అన్నులన్ మిన్న) అన్న సమాసానికి అర్థం స్త్రీలలో శ్రేష్ఠురాలు అని. స్త్రీలు మా అన్నులసురభులు అంటే మా ఇంటి ఆడువారి గోధనం అని చెప్పటం కదా - దానికి ఇక్కడ అన్వయం సరిగా కుదరదు కదా. అందుచేత గడుసుగొల్లవనితలు తమ పుట్టిళ్ళ గోధనాలపైన ఒట్టుపెట్టి మరీ చెప్పారని అనటంలో ఉన్న సొగసునే మనం ఇక్కడ చెప్పుకోవవలసి ఉంది.మీ సందేహం నివృత్తి అయిందని భావిస్తాను.

    ReplyDelete
  9. ఆర్యా, మీరు పంచదార గుళిక లను తేనెలో అద్ది బంగారు తీగలా చుట్టారు. ధన్యవాదాలు.

    ReplyDelete