తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, February 17, 2010

చుక్క గుర్తు పద్యాలు!

రమణగారు తన "చిన్ననాటి తెలుగు పద్యాలు" పోస్టుతో నన్ను మళ్ళీ నా చిన్నప్పటి స్కూలు బెంచీ మీదకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టేసారు! ఎదురుగా మా సుబ్బలక్ష్మీ టీచరు ఖంగుమనే గొంతుతో పాఠం చెపుతూ కనిపించారు, వినిపించారు. అల్లరి పిల్లలనీ, సరిగా చదవని వాళ్ళనీ "దొమ్మరగొండు రాస్కెల్స్" అని తిట్టినా, పాఠం మాత్రం ఆసక్తికరంగా చెప్పేవారు. మా అదృష్టం కొద్దీ ఎనిమిది, తొమ్మొది, రెండేళ్ళూ ఆవిడే మాకు తెలుగు టీచరు. ఆ పాఠాల మహత్వమో, ఆవిడ చెప్పడంలోని గొప్పతనమో కాని, అప్పుడు చదువుకున్న చాలా పద్యాలు మనసులో అలా ఉండిపోయాయి. చిన్నప్పడు కలిసి తిరిగి ఆడుకున్న మిత్రులు పెద్దయ్యాక ఎదురుపడితే ఆ చిన్ననాటి మధుర స్మృతులు అగరొత్తుల సువాసనలా కమ్ముకున్నట్టు, ఆ పద్యాలు అప్పుడప్పుడూ పలకరిస్తూ ఉంటాయి.

రమణగారి టపాతో ఇదిగో మళ్ళీ ఇప్పుడు పలకరించాయి. నేను కూడా వారు చదువుకున్న పాఠాలే చదువుకున్నాను. వారు చెప్పినట్టుగా తొమ్మిదవ తరగతి పుస్తకం చాలా బావుండేది. అందులోనూ అది నాకు మరీ ప్రత్యేకం. మా ముత్తాతగారి కథ "ఎవరు గొప్ప" గద్యభాగంలో ఉండేది. ఆ సంగతి స్నేహితులతోనూ, మా టీచర్ తోనూ చెప్పుకొని పొంగిపోవడం, అదో గొప్ప అనుభూతి. తాతలు తాగిన నేతులని స్వయంగా వాసన చూడ్డం అనవచ్చేమో దీన్ని! :-)

రమణగారిచ్చిన పద్యాలకి, నాకు గుర్తున్నవికూడా కలిపి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. నాకు గుర్తులేని మిగతా పద్యాలు ఇంకెవరికైనా గుర్తుంటే చెప్పండి. అవికూడా కలుపుతాను. ఇవి ఎనిమిది, తొమ్మిది, బహుశా పది క్లాసుల పద్యభాగాలలోని చుక్క గుర్తు పద్యాలు.

ప్రాయోపవేశం
=========

ఇది మహాభారతం అరణ్యపర్వం, ఎఱ్ఱన రచించిన భాగంలోనిది. దుర్యోధనుడు ఘోషయాత్రలో గంధర్వుల చేత పట్టుబడి భీమార్జునుల చేత విడిపించబడి, ఆ అవమానం తట్టుకోలేక ప్రాయోపవేశం చేసి ప్రాణాలు తీసుకుంటాననే సందర్భం.

అక్కట యమ్మహారణమునందు వియచ్చరకోటితోడ బే
రుక్కున బోరి యేను మృతినొందగ నేరన అట్టులైన నీ
తక్కువబాటు లేక ప్రమదంబున దైవపదంబు నొందెడిన్
మిక్కిలియైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై

అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట గల్గినన్ మహా
ర్ణవమది యింకినన్ దివసనాథుడు జంద్రుడు తేజమేదినన్
కువలయనాథ నీకునొక కుత్సితభావము గల్గ నేర్చునే
భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింప శక్యమే

కౌరవనాథ నీకు నుపకారము చేసిరి పాండవేయు ల
వ్వీరులయందు నెయ్యమును వేడ్కయునొప్పగ నీ వభీష్ట స
త్కారము సేత యుక్తమగుగాక ప్రియంపడ నర్హమైనచో
దారుణ శోకవహ్ని పరితాపము బొందుట యిప్డు ధర్మమే

కృతముదలంచి చిత్తమున గిల్బిషమంతయు నుజ్జగించి స
న్మతుల బృథాతనూజుల నమానుషతేజుల బిల్వపంచి తత్
పితృధనమైన రాజ్యము నభీష్టముగా దగనిమ్ము నీకు నీ
క్షితివలయంబునన్ బరమ కీర్తియు బుణ్యము గల్గు భూవరా!

పార్వతి తపస్సు
==========

ఇది శ్రీనాథుడు రచించిన కాశీఖండంలోది. పార్వతీదేవి శివునికోసం తపస్సు చెయ్యబూనడం సందర్భం.

ఎక్కడలేరె వేల్పులు సమీప్స్తిత దాతలు ముద్దుగూన నీ
వెక్కడ ఘోరవీర తపమెక్కడ యీ పటు సాహసిక్యముల్
తక్కు శిరీష పుష్ప మవధాన పరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునొ నిశ్చయింపుమా

భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి యీశ్వరా
రాధన కేళి కౌతుక పరాయణయై ధరియించి బాండు ర
క్షాధృతి పూర్వకంబుగ బ్రగాఢ పయోధరమండలీ సము
త్సేద విశీర్ణ సంహతుల జెల్లు మహీరుహవల్కలంబులన్

రాజధర్మము
========

ఇది మహాభారతం సభాపర్వంలోనిది. నన్నయ్య కృతం. రాజసూయం సందర్భంగా నారదుడు వచ్చి, ధర్మరాజుకి రాజధర్మాన్ని బోధించే ఘట్టం.

కడు జనువాడునై పురుషకారియు దక్షుడునైన మంత్రి పెం
పడఱగ రాజపుత్రుల మహాధనవంతుల జేసి వారితో
నొడబడి పక్షమేర్పడగ నుండడుగా ధనమెట్టివారికిన్
గడుకొని చేయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహమున్

ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమ మధ్యమాధమ నియోగములన్ నియమించితే నరేం
ద్రోత్తమ భృత్యుకోటికి ననూనముగా దగు జీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండగన్

వార్తయందు జగము వర్తిల్లుచున్నది
అదియులేని నాడు అఖిల జనులు
అంధకారమగ్ను లగుదురు కావున
వార్త నిర్వహింప వలయు బతికి

రాయబారము
=========

ఇది మహాభారతం ఉద్యోగపర్వంలోని ప్రసిద్ధమైన రాయబార సన్నివేశం. తిక్కన రచన.

జలదస్వన గంభీరత
నెలుగొప్పగ దంతదీప్తు లెసగ ముకుందుం
డలరు చెవుల నఖిల జనం
బులు విన ధృతరాష్ట్ర భూవిభున కిట్లనియెన్

భరతకులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తు పెంపునున్
గరుణయు గల్గియుండు ననగా నుతిగన్నది యందు సద్గుణో
త్తరులగు నీవు నీ యనుగు తమ్ముడు నీ తనయుల్ యశోదురం
ధర శుభశీలు రీ సుచరితక్రమ మిప్పుడు దప్పనేటికిన్

వీరునువారు బండితులు విక్రమవంతులు బాహుగర్వ దు
ర్వారులు లోని రిత్తబవరంబున నాఱడి జావబోవ నె
ట్లూరకయుండ్వచ్చు కడునొప్పెడు మేనులు వాడి కైదువుల్
గూరగ నాటినన్ బుడమి కూలుట కక్కట యోర్వవచ్చునే!

సారపు ధర్మమున్ విమలసత్యము బాపముచేత బొంకుచే
పారము బొందలేక చెడబారినదైన యవస్థ దక్షు లె
వ్వారలుపేక్ష సేసి రది వారల చేటగు గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్

ఇందీవరాక్షుని వృత్తాంతం
===============

ఇది అల్లసాని పెద్దన రచించిన స్వారోచిష మనుసంభవం (మనుచరిత్ర) లోనిది. ఇందీవరాక్షుడనే గంధర్వుడు శాపవశాత్తూ రాక్షసుడయిన కథ. శాపవిమోచనం అయ్యాక స్వయంగా తను స్వరోచికి చెప్పేది.

కలడుల్లోక యశఃపురంధ్రి జగతిన్ గంధర్వ వంశంబునన్
నలనాబాహ్వయుడే దదీయ తనయుండన్ బ్రహ్మమిత్రుండు శి
ష్యులకున్ గంటను వత్తిబెట్టుకొని ఆయుర్వేదమోరంత ప్రొ
ద్దుల జెప్పన్ వినుచుండి మానసమునందున్ దజ్జిఘృక్షా రతిన్

నటవిట గాయక గణికా
కుటిల వచశ్శీధు రసము గ్రోలెడు చేవికిన్
గటువీ శాస్త్రము వలది
చ్చట నిను చదివించకున్న జరగదె మాకున్

తండ్రీ నాకు ననుగ్రహింపగదె వైద్యంబంచు బ్రార్ధించినన్
గండ్రల్గా నటులాడి ధీకృతుల పోకాల్మంటి వోహో! మదిన్
దీండ్రల్ గల్గినవాని కేకరణినేనిన్ విద్య రాకుండునే
గుండ్రాడాచిన పెండ్లి యేమిటికి జిక్కున్ గష్టముష్టింపచా!

అనినం గన్నులు జేవురింప నధరంబల్లాడ వ్రేల్లత్పునః
పున రుద్యద్భృకుటీ భుజంగ యుగళీ పూత్కార ఘోరా నిలం
బన నూర్పుల్ నిగుడన్ లలాట ఫలకంబందంద ఘర్మాంబువుల్
జినుకన్ గంతు దిదృక్షు రూక్ష నయన క్ష్వేళా కరాళధ్వనిన్

భాస్కరా!
======

ఇవి భాస్కర శతకంలోని పద్యాలు.

చదువది యెంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా

ఉరు గుణవంతుడొండు తనకొండపకారము సేయునప్పుడుం
పరహితమే యొనర్చు నొక పట్టునైనను కీడు సేయగా
నెరుగడు నిక్కమే కద యదెట్లన కవ్వము బట్టి యెంతయున్
తరువగ జొచ్చినం పెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా

ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన దా
జక్కనొనర్ప కౌరవులసంఖ్యులు బట్టిన ధేనుకోటులం
జిక్కకనీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవొడంగ జేసి తుదముట్టడె యొక్క కిరీటి భాస్కరా

బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు గాని యాతడే
బలము తొలంగెనేని తనపాలిట శత్రువదెట్లు పూర్ణుడై
జ్వలనుడు కాన గాల్చుతరి సఖ్యముజూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పడె గాలి భాస్కరా

దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో
నైన బరోపకారమునకై యొక దిక్కున దెచ్చియైన నీ
బూనును మేఘుడంబుధికి బోయి జలంబులు దెచ్చి యీయడే
వాన సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా!

తనకు ఫలంబు లేదని యెదం దలపోయడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కరా!

పోతన జిజ్ఞాస
=========

ఇది శ్రీ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రములోనిది. ఇది చాలా మంచి ఘట్టం. పోతన వీథి భాగవతం చూస్తూ తనకి కలిగిన సందేహాలని తల్లిని అడుగుతాడు. ఆవిడ ఆ ప్రశ్నలకి గొప్ప తాత్త్వికమైన జవాబులిస్తుంది. పోతన భక్తి తత్త్వాలకి చిన్ననాడే ఎలా బీజాలు పడి ఉంటాయో ఊహించి చెప్పే సన్నివేశం. ఇందులో చివరగా పోతన, దీన్ని వీథి భాగవతం అని ఎందుకంటారని అడుగుతాడు తల్లిని. ఈ కథలు భాగవతంలోనివి కాబట్టి అని జవాబు చెపుతుంది. అయితే నేనా పుస్తకం చదువుతాను ఇమ్మంటాడు. అది సంస్కృతంలో ఉంది నాయనా మనకి అర్థం కాదని అంటుంది. అప్పుడు పోతన, "అయితే నేను పెద్దయ్యాక దాన్ని తెలుగులో వ్రాస్తాను" అంటాడు. దానికి తల్లి ఎంతో మురిసిపోయి "మా తండ్రే, మా నాయనే" అంటుంది!


ఇవ్విధి దివ్విటీల్వెలుగు లేమని బాలుడు పృచ్ఛసేయగా
నవ్వుచు లక్కమాంబ నిజనందను గన్గొని చంద్రసూర్యు లా
దవ్వుల వెల్గనేలయనె దాపున నా తెర యేల యన్నచో
నివ్వటిలుం బయిన్ మసక నీలపునింగి యదేలరా యనెన్

ధీనిదివై సతమ్మఖిల దేవతలొక్కటి యంచు నెంచుచున్
మానసమందుమారమణు మాటికి మాటికి సంస్మరింపనౌ
దా ననలమ్ము వృక్షసముదాయ విభేదము లూడ్చు కైవడిన్
జ్ఞానము రూపభేదము లొకండొనరించు నసంశయాకృతిన్

బుద్ధదేవుని పునరాహ్వానం
================

ఇది కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి రచన. ఎందులోనిదో గుర్తులేదు. ఇందులో పద్యాలు పూర్తిగా గుర్తు లేవు :-(

దయసేయంగదవయ్య శాక్యమునిచంద్రా! నీ పదస్పర్శచే
గయిసేయంగదవయ్య భారతమహీఖండంబు దివ్యత్ కృపా
మయ మందార మరంద బిందు లహరీ మందస్మితాలోకముల్
దయసేయంగదవయ్య మానవ మనస్తాపంబు చల్లారగన్

ఆటంబాంబుల బీటవారినది బ్రహ్మాండంబు సద్భావమే
మోటైపోయెను పంచశీలపథకమ్ముల్ దుమ్మువట్టెన్ దురా
శాటోపంబులు హద్దుమీరినవి పోరాటమ్మె ఆరాటమై
లూటీచేసిరి మానవత్వమును ఆలోకింపు లోకప్రభూ!

హింసాశక్తులు రక్తదాహమున దండెత్తెన్ దరిద్రప్రజా
సంసారమ్ములపై...
కిరాతశాత శరవిద్ధంబైన ఇద్ధారుణీ
హంసన్ గాయముమాన్పి కావవలెనయ్యా రమ్ము వేగమ్ముగన్

యుద్ధజ్వాలలు రేగె భీతిలి జగమ్ముయ్యాలలూగెన్ రుషా
కృద్ధ వ్యాఘ్రము గాండ్రుగాండ్రుమనుచున్ గ్రొన్నెత్తురుల్ ద్రావె ...
...
సిద్ధార్థా ప్రళయాగ్నులార్పవె ప్రజాశ్రేయమ్ము చేకూర్పవే!


శివాజీ సౌశీల్యం
==========

ఇది శ్రీ గడియారం వేంకటశాస్త్రిగారు రచించిన శివభారతములోనిది. శివాజీ సౌశీల్యాన్ని చాటిచెప్పే ఘట్టం. ఇందులోని పద్యాలు కూడా గుర్తులేవు :-( ఒక పద్యం మాత్రం ఇలా మొదలవుతుంది:

అనుచున్ జేవురు మీరు కన్నుగవతో నాస్పందితోష్ఠంబుతో
ఘన హుంకారముతో నటత్ భృకుటితో గర్జిల్లు నా భోంశలే
శుని జూడన్...

ఇది ఎందుకు గుర్తుండిపోయిందంటే, ఇది ఇందీవరాక్షుని వృత్తాంతంలో "అనినన్ గన్నులు జేవురింప..." అనే పద్యానికి చాలా దగ్గరగా ఉండే పద్యం, ఆ వర్ణన పరంగా. బహుశా గడియారంవారికి అల్లసాని పద్యమే స్ఫూర్తి అయ్యుండాలి. తమాషాగా ఆ రెండిటినీ ఒకే ఏడు పాఠంగా పెట్టారు!

ఇవి నాకు గుర్తున్న పద్యాలు. ఇవిగాక ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు. అవి అన్ని పద్యాలూ చుక్క గుర్తు పద్యాలే! అన్నీ గుర్తున్నాయి. అవి పద్యం.నెట్లో ఇంతకుముందు పెట్టినట్టు గుర్తు.

రమణగారు, చిన్ననాటి జ్ఞాపకాలని మరోసారి గుర్తుకుతెచ్చినందుకు ధన్యవాదాలు!

నా మిత్రుడు మరొక పాఠం గుర్తుచేసాడు.

స్వయంవరం
========

మొల్ల రామాయణంలో సీతాస్వయంవర సన్నివేశం.

గురుభుజశక్తి కల్గు పదికోట్ల జనంబును బంప వారునా
హరుని శరాసనంబు గొనియాడుచు బాడుచు గొంచువచ్చి సు
స్థిరముగ వేదిమధ్యమున జేర్చిన దానికి ధూపదీపముల్
విరులును గంధమక్షతలు వేడుకనిచ్చిరి చూడనొప్పగన్

కొంకక సావధానమతి గూర్చి వినుండిదె మత్కుమార్తెకై
యుంకువ సేసినాడ వివిధోజ్వలమైన ధనంబు గాననీ
శంకరు చాప మెక్కిడిని సత్త్వఘనుండగువాని కిత్తునీ
పంకజనేత్ర సీత నరపాలకులార నిజంబు సెప్పితిన్

కదలకుమీ ధరాతలమ కాశ్యపిబట్టు ఫణీంద్ర భూవిషా
స్పదులనుబట్టు కూర్మమ రసాతల భోగిడులీ కులీశులన్
బెదరక బట్టు ఘృష్టి ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుపట్టుడీ కరులు భూవరుడీశుని చాప మెక్కిడున్

ఇనవంశోద్భవుడైన రాఘవుడు భూమీశాత్మజుల్ వేడ్కతో
దను వీక్షింప మునీశ్వరుండలర కోదండంబు చేబట్టి చి
వ్వన మోపెట్టి గుణంబుబట్టి పటుబాహాశక్తితో దీసినన్
దునిగెన్ జాపము భూరి ఘోషమున వార్ధుల్ మ్రోయు చందంబునన్

29 comments:

  1. mahandrodayam

    naaku kaavale nava sirisha prasava manjula bhaava gumphita kaavya raajamu etc.

    ReplyDelete
  2. గుండ్రాడాచిన పెండ్లి యేమిటికి జిక్కున్ గష్టముష్టింపచా!

    I remembered this line.

    ReplyDelete
    Replies
    1. ఈ పద్యం ఉంటే పోస్టు చేయగలరు

      Delete

    2. శార్దూలము

      . తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
      గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
      దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
      గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా! మను.5.17


      మనుచరిత్రలోనిది

      పోచిరాజు కామేశ్వరరావు గారు చేర్చారు శంకరాభరణం బ్లాగులో నిన్న


      జిలేబి

      Delete
  3. కామేశ్వరరావు గారు, నాకు మరిన్ని పద్యాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నాకొక సందేహం ఉంది, "సారపు ధర్మమున్ ....." పద్యం తొమ్మిదో తరగతిలోనిది కాదన్నమాట ! మీరు అది రాసినది తిక్కన అంటున్నారు కదా. రాజధర్మం - నన్నయభట్టు అని గుర్తుంది.
    "ఎవరు గొప్ప" - మీ ముత్తాత గారు రాశారా! అలా పొంగిపోవటం సహజమే కదండీ! :).

    ReplyDelete
  4. ఎవరు గొప్ప కథ ఎవరైనా రాసినది కాదని అనుకుంటున్నాను. అంటె, అడాప్టేషన్స్ ఉండి ఉండవచ్చు. ఎందుకంటె, ఈ కథ నా దగ్గర ఉన్న టాల్స్టాయ్ కథల సంకలనంలో కూడా ఉంది. ఈవన్నీ, టాల్స్టాయ్ రాసినవి కాదు గాని, కలెక్ట్ చేసినవి అనుకుంటా. అదే సంకలనం లో మనం చిన్నప్పుడు విన్న చాలా కథలు ఉన్నయి... ఇద్దరు మిత్రులు-ఎలుగుబంటి కథ, నక్కా-కొంగ భోజనం కథ ఎత్చ్... ఇవన్నీ రష్యన్ జానపద కథలు అని ఉంది పుస్తకంలో. కాని ఇవన్నీ, ప్రపంచంలో ఉన్న చాలా భాషలలో జానపద కథల రూపాల్లో (జెర్మన్ లో హాన్స్ క్రిస్టీన్ ఆండర్సన్ కథలు) ఉన్నాయని అనుకుంటున్నా.

    ReplyDelete
  5. అనానిమస్ గారు,

    అవునండి, మహాంధ్రోదయం పదో క్లాసులో పాఠం అనుకుంటాను, దాశరథిగారిది. అందులో నాకు గుర్తున్నది ఒకే ఒక పద్యం, "వెలుతురు బాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి".

    రమణగారు,

    "సారపుధర్మమున్..." తిక్కనగారిదే, రాయబార ఘట్టం లోనిది. మీరన్న "రాజధర్మం" ననయ్యదే.

    Ruthగారు,

    మీరన్నది నిజమే అయ్యుండవచ్చు. మా ముత్తాతగారు ఇంగ్లీషు, రష్యన్ కథలు ఎక్కువగానే చదివారు కాబట్టి వాటి ప్రభావం ఉండి ఉండవచ్చు. అనువాదాలు, అనుసరణలు కూడా చేసారు. బైబిల్లోని కథలని కూడా తెలుగు చేసారు. అమృతవాణి అన్నపేరుతో అనుకుంటాను రేడియోలో ప్రసారమయ్యేవి.

    ReplyDelete
  6. ఈ పద్యాలేవీ చదువుకోలేదండి :(

    చదువుకున్న సిలబస్‌లు వేరే అయ్యుంటాయి.

    ~సూర్యుడు

    ReplyDelete
  7. శా. కంటే బ్రాహ్మణుఁ డెన్ని కాఱు లఱచెన్‌ గర్వించి? వీరెల్ల నా
    కంటె బాత్రులె విద్య? కెట్లు నిది నే గై కొందునంచున్‌ మది
    న్గెంటెంపుంజల ముప్పతిల్ల గపటాంతేవాసి నై శాంబరిన్‌
    గొంటుంజందము మాఱ శిష్యులగెడం గూర్చుండి చర్చారతిన్‌.

    ఇందీవరాక్షుని వృత్తాంతంలో దీనిమీద కూడా చుక్క ఉన్నట్లు జ్ఞాపకము.

    ReplyDelete
    Replies
    1. చుక్క గుర్తు పద్యమే sir

      Delete
  8. Kamesh garu,

    meeru marchi poyina inkoka goppa padyam undi.

    'RANTIDEVUDU' patham loonidi.

    annamu leedu konni madhraambulunnavi raavumanna traavumanna, sareeradharulaku....

    ReplyDelete
  9. Kamesh garu,

    meeru marchi poyina inkoka goppa padyam undi.

    'RANTIDEVUDU' patham loonidi.

    annamu leedu konni madhraambulunnavi raavumanna traavumanna,
    sareeradharulaku aapada vachhina....

    Mahesh

    ReplyDelete
  10. కామేశ్వరరావు గారూ !
    మీ తెలుగు పద్యం నూతన సంవత్సరంలో మరింతగా వెలగాలని కోరుకుంటూ... ఉగాది శుభాకాంక్షలతో....
    - శిరాకదంబం

    ReplyDelete
  11. jai sri ram
    sir mee padya vivarana chala bhaga untundi
    sir dayachesi vasu charitra loni vasantha ruthu varnana padyam lalana palanga .....tika tho vivarinchagalaru
    maruyu ramayanakalpavruksham loni swayam vara padyam garipati garu t.v lo chepparu dani kuda utankinchalani korukontu
    jai sri ram

    ReplyDelete
  12. @అనానిమస్ గారూ, అవునండీ "కంటే బ్రాహ్మను" పద్యం మరిచిపోయాను.
    @మహేశ్ గారూ, మీరు నాకు తెలిసిన మహేశేనా? అవును రంతిదేవుడు పాఠం ఉండేది, ఏదో క్లాసులోనేమో. ఈ పద్యం కూడా చేరుస్తాను.
    @రావుగారూ, మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు, కాస్త ఆలస్యంగా చెపుతున్నాను క్షమించండి.

    @amineniగారూ,

    "లలనా జనాపాంగ" పద్యానికి తాత్పర్యం ఇక్కడ http://chiruspandana.blogspot.com/2010/02/blog-post_19.html చదవ వచ్చు.
    రామాయణ కల్పవృక్షంలో స్వయంవర ఘట్టంలో చాలా పద్యాలున్నాయండీ. మీరు చెపుతున్న పద్యమేమిటి? రెండేళ్ళ కిందట సీతారామ కల్యాణ ఘట్టంలోని కొన్ని పద్యాలు ఒక టపాగా వ్రాసానిక్కడ http://telugupadyam.blogspot.com/2008/04/blog-post_14.html. అందులో ఏమైనా ఉందేమో చూడండి. లేదంటే ఆ పద్యమేమిటో చెప్పండి. మూడు రోజుల్లో శ్రీరామనవమి వస్తోంది కదా. ఆ రోజుకి స్మరించుకోవచ్చు.

    ReplyDelete
  13. ఒక్కసారి నా తొమ్మిదో కలాసుకు తీసుకెళ్లారుగా! :-)...ఈల

    ReplyDelete
  14. రమణ గారు ఈ పద్యములను మా మాష్టారు శ్రీ శ్రీ గోపాలకృష్ణ గారు (ఏర్పేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు మాష్టారు) చిత్తూరు జిల్లా. వారి గానామృతముతో మమ్ములను ఎంతగానో అలరించారు... నాకిప్పటికీ... ఈ పద్యాలంటే ప్రాణం... ఇంతటి చక్కని పద్యాలను మాకు స్పురింపజేసినందులకు తమకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకొనుచున్నాము 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  15. పతులు మెచ్చని చెలువు నిష్ఫలము గాదె...ఈ పద్యం ఎవరిదగ్గరన్న ఉంటే 9000400491 కి పంపగలరు.

    ReplyDelete
  16. చాలా బాగా గుర్తు చేశారు. ఇవన్నీ ఎంత ఇష్టంగా చదువుకున్నానో చిన్నప్పుడు. ఏ స్కూల్లో చదువుకున్నారండి. మా తెలుగు టీచర్ గారి పేరు కూడా సుబ్బలక్ష్మి గారే. అందుకని అడుగుతున్నాను. ధన్యవాదాలు.

    - అపర్ణ

    ReplyDelete
  17. భారతకులంబు ధర్మమును బాడియు అనే పద్యం కు చెందిన ప్రతిపదార్థం పంపించగలరు

    ReplyDelete
  18. 20 years nunchi indivarakshuni padyala gurinchi vetukutunnanu.. chala santhosham gaa undhi.. dhanyavadamulu.

    ReplyDelete
  19. 🙏🙏
    ఇవన్నీ నేను బట్టి పట్టినవే
    8th,9th class lo

    ReplyDelete
  20. "aninam gannuvulu jevurimpa" was my favorite poem. this remembers my sweet school days and my Telugu sir Madhavacharya , i am Goutham 1990 X batch, Sri Saraswathi vidya mandir , VRN colony. very eager to meet any of school mates. :)

    ReplyDelete
  21. శివరాజం తట మేల్ముసుంగు తెరలో స్నిగ్నాంబుధి ఛాయలో నవసౌదామిని బోలిన యా యవనకాంతా రత్నమున్ జూచి ఆ ఏమి
    రాణివాసమున్ బుణ్యావాసమున్ తెచ్చినావా
    ఏహైందవు డైన ఈగతినమర్యాదగ ప్రవర్తించునా

    ReplyDelete
  22. My favourite is ‘ aninan gannulu javurimpa’ padyam. Thanks for the reminders of sweet great poems.

    ReplyDelete
  23. నమస్తే అండీ.. పాఠాలూ గుర్తు చేసారు. అయితే 'రంతి.దేవుడు' అనే పాఠం కూడా ఉండింది.కావొచ్చు మనకు. అందులో.. అన్నము. లేదు.. కొన్ని.మధురాంబు వులున్నవి త్రావు మన్న' అనే చుక్కాపద్యం ఉంది

    ReplyDelete
  24. ప్రాయోపవేశం పాఠంలో.. దుర్యోధనుడి తో తమ్ముడు దుశ్యసనుడు చెప్పే.సందర్భంలో చుక్క. పద్యం "అవని విధీరణమైనను.. ' చాలా ఇష్టం. అలాగే.. పార్వతి తపస్సులో.. 'ఎక్కడ లేరే వేల్పులు.. '👌

    ReplyDelete