తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, December 15, 2011

చెప్పుకోండి చూద్దాం! - సమాధానం


శ్రీశ్రీ సిప్రాలి గురించిన టపా వ్యాఖ్యలలో, అచ్చులతో ప్రాస ఉన్న పద్యానికి ఉదాహరణగా కందిశంకరయ్యగారు కవిజనాశ్రయంనుండి యీ క్రింది పద్యాన్ని ఉదహరించారు:

అ ఆ ఐ ఔ లకు మఱి
ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
ఉ ఊ ల్దమలో నొడఁబడి
ఒ ఓ లకు వళ్లగు న్నయోన్నతచరితా!

ఇది యతుల గురించి వివరించే పద్యం. ఏయే అచ్చులకి యతిమైత్రి ఉన్నదో చెపుతోంది. ఈ పద్యంలో అచ్చుల ప్రాసతో పాటు, ఛందస్సుకి సంబంధించి మరొక విశేషం కూడా ఉంది! అదేమిటో చెప్పుకోండి చూద్దాం! ఛందస్సు, భాషల పైన ఆసక్తి ఉన్నవాళ్ళకి మంచి మెదడుకి మేత. ఈ విశేషం గురించి కందిశంకరయ్యగారి వంటి వారికి ఈపాటికే తెలిసి ఉంటుంది కాబట్టి, వారు చెప్పవద్దని ప్రార్థన. తెలియనివాళ్ళు ప్రయత్నించండి.

సమాధానం
----------


సనత్ గారు సరిగానే కనుకున్నారు. గోపాలకృష్ణగారు చక్కగా వివరించారు!


"అఆ", "ఇఈ" - ఇలా అచ్చులు కలిపి చదివేటప్పుడు మొదటి అచ్చు హ్రస్వమే అయినా, దాన్ని పలకడంలో కొంత ఎక్కువ సమయం తీసుకుంటాము కాబట్టి అది గురువే అవుతుంది. ఒక రకంగా యిది విసర్గకి దగ్గర చుట్టం. "దుఃఖము" అన్న పదంలో దు అనేది దీర్ఘం కాదు. "ఖ" సంయుక్తాక్షరమూ కాదు. అయినా "దుః" అన్న అక్షరం గురువెందుకు అవుతోంది? దాన్ని ఉచ్చరించేటప్పుడు కాస్తంత ఆగి, తర్వాత "ఖ"ని ఉచ్చరిస్తాము. అందుకు "దుః" అన్నది గురువు. అలాగే "అఆ" అని కలిపి చదివేటప్పుడు "అ"ని పలికిన తర్వాత కొద్దిగా ఆపి "ఆ"ని పలుకుతాము. దీన్నే ఇంగ్లీషులో glottal stop అంటారు. ఎందుకిలా ఆపుతాము? మన భాషా స్వరూపం వల్ల! తెలుగులో పదం మధ్యలో అచ్చు అక్షరం రాదని తెలుసు కదా. ఒక వేళ రెండు పదాలు కలిపేటప్పుడు, రెండవ పదం మొదట అచ్చు ఉందంటే, అది "య"కారంగా మారిపోతుంది!  "మా అమ్మ"ని కలిపి గబగబా అనాలంటే మాయమ్మ అవుతుంది. అలాగే "మా ఇల్లు" మొదలైనవి.
అయితే "అఆ"ని పలికాల్సినప్పుడు "ఆ" అన్నది పలికి తీరాలి, అది "యా"గా మార లేదు. అంచేత ఆ రెంటిని గబగబా కలిపి పలకడం కుదరదు. పలకడంలో వాటి మధ్య అనివార్యంగా కొంత ఖాళీ వస్తుంది. కాబట్టి, ఆ ఖాళీ సమయాన్ని కూడా "అ" ఉచ్చారణలో భాగం చేసి, "అ" గురువైపోతుందన్న మాట!

6 comments:

  1. ఇది కంద పద్య లక్షణాలనన్నింటినీ విభేధిస్తున్నట్టు ఉంటుంది

    (1) కందానికి మొదటి పాదంలో మూడు గణాలుండాలి.
    (2) 1,3 గణాలు జగణం కారాదు.
    --> అల్లాంటప్పుడు అఆ |ఐఔ | లకుమఱి గా విభజన చేసుకోవాలి.

    (3) కందానికి రెండవ పాదంలో ఐదు గణాలుండాలి.
    (4) 2,4 గణాలు జ గణం కారాదు.
    (5) 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి

    --> అల్లాంటప్పుడు ఇఈ | లుఋకా | రసహిత |మెఏ | లకునౌ గా విభజన చేసుకోవాలి.

    కానీ ఒక లఘువు , ఒక గురువు (లగ) కందంలో గణం కాదు. అల్లాంటప్పుడు ఇది కంద పద్యమెట్లాఔతుంది అని ప్రశ్న వస్తుంది??

    సమాధానం బహుశా: అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు ఔతాయేమో ... (తమలో ఒడబడి వళ్ళు చేయటమంటే ఒక మాత్రా అక్షరం (లఘువు) రెండు మాత్రల అక్షరం (గురువు) అవ్వడమేమో)...

    ReplyDelete
  2. ఈ పద్యంలో అఆ,ఇఈ,ఉఊ, ఒఓ, లు వరుసగా నాలుగు పాదాలలోని మొదటి గణాలు. విడివిడిగా చూస్తే ఇవి లగముల క్రిందే లెక్క.కంద పద్య పాదాలకి కుదరవు. కానీ వీటిని పలికేటప్పుడు రండవ అక్షరం మీద వత్తి పలుకుతాము. అందుచేత అవి ద్విత్వాక్షరాలుగా గుర్తించబడి వాటిముందున్నఆక్షరాల్నిఅవి గురువుల్ని చేస్తాయి.అందువల్ల ఈ నాలుగూ గగములౌతాయి.కందపద్యపాదాలకి సరిపోయిగణభంగమేమీ ఉండదు.ఇది ఈ పద్యంలో విశేషం.

    ReplyDelete
  3. మీద కామెంటు వ్రాస్తూ ఒక విషయం చెప్పడం మరచిపోయేను. నాలుగు పాదాల్లోని మొదటి గణాలకి నేను చెప్పిన విషయమే రెండవ పాదంలోని ఏడవ గణానికి కూడా వర్తిస్తుంది. ఆవిధంగా అది కూడా గగము అయి ఛందో భంగం కాకుండా ఉంటుంది.

    ReplyDelete
  4. శ్రీ సనత్ శ్రీపతిగారికి చిన్న వివరణ.అచ్చులతో కూడిన అక్షరాలు గురువులౌతాయనడం సరికాదు.స్పష్టమైన వివరణలు మీదనున్నవి చూడగలరు.ఇంకో విషయం.వడి అన్నతెలుగు పదం యతి అన్న సంస్కృత పదానికి ప్రత్యామ్నాయంగా వాడుతారు.అందుచేత తమలో నొడబడి వళ్ళగు అనే దానికి లఘువులు గురువులౌతాయేమో అనకోవడం తప్పు. దాని అర్థం
    అఆ ఐఔలకు,ఇఈఋఎఏలకు,ఉఊఒఓ లకు తమలో తమకు యతి చెల్లుతుందని చెప్పడం.నాకు తెలిసినది చెప్పాను.క్షమించగలరు.

    ReplyDelete